ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్ అవ్వాలనేది ఎందరో యువత డ్రీమ్. అత్యంత కఠినతరమైన ఎగ్జామ్లో గెలుపుని అందుకోవడమే తమ ధ్యేయంగా ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అంత కష్టమైన ఎగ్జామ్లో తొలిప్రయత్నంలోనే అవలీలగా విజయఢంకా మోగించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు ఈ యువకుడు. ఇతడి గెలుపు 'ధురందర్ 2'మూవీ నటుడిని సైతం ఆకట్టుకుంది. అతడు మాములు స్ఫూర్తి కాదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఖుషీ చేసే హీరో మాధవన్ ఈసారి కూడా అలానే మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో సత్తా చాటి సుబ్రమణ్య భారతి వీడియోని రీషేర్ చేస్తూ..ఆ యువకుడి అజేయమైన సక్సెస్ జర్నీని మెచ్చుకున్నారు. అందుకు సహకరించిన అతని తల్లిదండ్రులు, అతడికి లభించిన మద్దతు తదితరాలన్ని తనను ఎంతగానో కదిలించాయని, పైగా స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు.
పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఎలా మార్పు తీసుకురాగలవో అనేందుకు ఆ యువకుడు సుబ్రమణ్య భారతినే ఉదాహరణ అంటూ పోస్ట్ని ముగించారు మాధవన్. హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోలో దినసరి కూలీ కుమారుడైన సుబ్రమణ్య భారతి ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వ 'నాన్ ముదల్వన్' పథకం సహాయంతో ఈ అధ్భుతమైన ఘనతను సాధించాడు. భారతి తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం విశేషం.
తన సక్సెస్ జర్నీ అసాధారణమైనది అభివర్ణించాడు సుబ్రమణ్య భారతి. తాను క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సివిల్ సర్వీసెస్ను ఎంచుకున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడానికి, ఈ పథకం, కోచింగ్ వంటి మద్దతే కారణమని పేర్కొన్నారు. తాను కేవలం 18 ఏళ్ల వయసులో, ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా ఈ సివిల్స్ ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అందుకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని, ఎందుకంటే వాళ్లు దేశానికి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో సేవ చేసేలా వాళ్లు సదా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు.
కాగా, భారతి తండ్రి మరియప్పన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం పేద కుటుంబమని, ఇటుకల తయారీ యూనిట్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటానని చెప్పారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కుమారుడు ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్కు సన్నద్ధమయ్యాడని అన్నారు. అందులో విజయం సాధించడానికి తమిళనాడు ప్రభుత్వ నాన్ ముదల్వన్ పథకం ఎంతగానో సహాయపడిందని అన్నారు.
నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం:
తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి (Skill Development), ఉపాధి అవకాశాలను పెంచే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది 18-35 ఏళ్ల యువతకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ, భాషా నైపుణ్యాలు, ఇండస్ట్రీ-రెడీ కోర్సులలో శిక్షణ ఇస్తూ, ఉచిత కోచింగ్, స్కాలర్షిప్లను అందిస్తుంది.
(చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!)


