విద్యుద్దీపాల వెలుగులో మక్కా మసీదు.. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
నగరంలో ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ముస్లింలు ఈద్ నమాజ్ చేసేందుకు పాతబస్తీ మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదు, మాదన్నపేట ఈద్గా, ఈద్గా ఉజాలే షా, కుత్బుల్లాపూర్, నార్సింగి, ఫస్ట్ లాన్సర్, పహాడీషరీఫ్ ఈద్గాలతో పాటు వివిధ మైదానాలు సిద్ధమయ్యాయి. పాతబస్తీతో పాటు ప్రధాన ఈద్గాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మీర్ ఆలం ఈద్గాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమ్మతుల్ విదా) సందర్బంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ సామూహిక ప్రార్థనలు జరిగాయి.
– సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్


