పల్లెలు సాహితీ మల్లెలు
– ఎమ్మెల్సీ డాక్టర్ గోరటి వెంకన్న
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోని ప్రతీపల్లె పద సాహిత్యాలు, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని శాసనమండలి సభ్యుడు, ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ గోరటి వెంకన్న అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా తెలుగు శాఖ ‘తెలంగాణ పద సాహిత్యం – సమాలోచన‘ అనే అంశంపై సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల సాంస్కృతిక విశేషాలు, తాత్విక విషయాలపై, పద కవుల సాహిత్యంపై లోతైన విశ్లేషణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ పి.భాస్కరయోగి కీలకోపన్యాసం చేస్తూ విస్మరణకు గురైన ఎందరో పదకవులపై విస్తృత పరిశోధనలు జరగడం, ఆ దిశలో జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయని పేర్కొన్నారు. తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య సైయద తలత్ సుల్తానా ప్రసంగించారు. తెలంగాణ పద సాహిత్యంపై పలువురు ప్రామాణికమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. సదస్సులో తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏలే విజయలక్ష్మి, తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు, ఆచార్య విస్తాలి శంకర్రావు, డాక్టర్ పి.సి.వెంకటేశ్వర్లు, డాక్టర్ బాణాల భుజంగరెడ్డి, డాక్టర్ యువ శ్రీ,, డా. ఇమ్మిడి మహేందర్, అవుసుల భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


