గంటలోపే పట్టేశారు
● స్నాచర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్: గొలుసు దొంగతనం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు వల పన్ని స్నాచర్ను పట్టుకున్నారు. ఈ ఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఉమా(37) తన భర్తతో కలిసి గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోమాజిగూడ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్నారు. మెట్రో పిల్లర్ నెంబర్ ఏ–1156 వద్ద వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు ఉమా హ్యాండ్బ్యాగ్ను లాక్కొని పరారయ్యాడు. అందులో మొబైల్ ఫోన్తో పాటు రూ. 7,000 నగదు ఉంది. బాధితురాలు వెంటనే ఖైరతాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డీఐ సైదులు స్పందించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి, పంజగుట్ట ఏసీపీ పి.మురళీకృష్ణ కూడా అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీసి పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. ఖైరతాబాద్ డీఎస్ఐ ప్రణీత్తో పాటు క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగి సీసీ ఫుటేజీలు పరిశీలించి బైక్ నెంబర్ గుర్తించి నిందితుడిని కనిపెట్టారు. దీంతో గంట వ్యవధిలోనే నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు కొంతం సాయికిరణ్(22)గా తేలింది. కుషాయిగూడకు చెందిన నిందితుడు మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే బైక్పై తిరుగుతూ ఈ స్నాచింగ్ చేశాడని విచారణలో తేలింది. ఖైరతాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


