కల్లు తాగించి వృద్ధురాలి దారుణహత్య
దుండిగల్: రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి దారుణ హత్య కేసు మిస్టరీని దుండిగల్ పోలీసులు ఛేదించారు. ఓ మహిళ బంగారం కోసం వృద్ధురాలికి కల్లు తాపించి దారుణంగా హత్యచేసింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఏసీపీ శంకర్రెడ్డి వివరాలను వెల్లడించారు. చర్చి గాగిల్లాపూర్ ప్రాంతానికి చెందిన సుశీలమ్మ(85)కు ఐదుగురు సంతానం. అందరూ వివిధ ప్రాంతాల్లో ఉంటుండగా సుశీలమ్మ తన మనవడు జీవన్తో కలిసి నివాసముంటోంది. వీరికి ఐదు దుకాణాలు ఉన్నాయి. జీవన్ ఎప్పటిలాగే ఈ నెల 2న ఉద్యోగానికి వెళ్లాడు. ఆరోజ మధ్యాహ్నం ఓ యువకుడు దుకాణం అద్దెకు అడగడానికి సుశీలమ్మ ఇంటికి రాగా రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికంగా ఉండే శ్రీకర్రెడ్డి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ ఫుటేజీలో సుశీలమ్మ ఇంటికి ఓ మహిళ వచ్చి వెళ్లడాన్ని గుర్తించారు.
తలను గోడకేసి బాది.. ఆపై రాయితో మోది..
అదే ప్రాంతానికి చెందిన పి.కవిత(36) గతంలో వృద్ధురాలి ఇంట్లో 15 రోజుల పాటు కూలీగా పని చేసింది. సుశీలమ్మకు కల్లు తాగే అలవాటు ఉండడంతో తరుచూ కల్లు తీసుకువచ్చి ఇస్తుండేది.ఈ క్రమంలో సుశీలమ్మ ఒంటిపై ఉన్న బంగారంపై కవిత కన్ను పడింది. ఈనెల 2న మధ్యాహ్నం కల్లు తీసుకువచ్చిన కవిత సుశీలమ్మతో కలిసి తాగింది.ఆ తరువాత సుశీలమ్మ మైకంలోకి వెళ్లగానే ఆమె తలను గోడకేసి బాదింది. అయినా ఆమె స్పృహలోనే ఉండడంతో రాయితో తలపై మోది హత్య చేసింది. అనంతరం బంగారు చెవి కమ్మలు, ఉంగరం, ముక్కుపుడక (5 గ్రాములు) తీసుకుని పరారైంది. సీసీ కెమెరా ఆధారంగా కవితను గుర్తించి రెండు రోజుల వ్యవధిలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న శ్రీకర్రెడ్డిని ఏసీపీ అభినందించారు.
వీడిన హత్య మిస్టరీ
బంగారం కోసం ఘాతుకం
5 గ్రాముల నగలు మాయం
నిందితురాలి అరెస్ట్


