హైదరాబాద్లో ఫిన్నిష్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి,సిటీ బ్యూరో: హోరిజన్ ఎక్స్పీరియన్సియల్ వరల్డ్ స్కూల్ సౌత్ ఇండియాలో మొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ను గురువారం హైదరాబాద్లోని కొల్లూరులో ప్రారంభించింది. టీసీసీ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇన్నోవేషన్ను ఒకే కాలేజీ కోర్సులో నేర్పలేమని, ప్రైమరీ స్కూల్ దశ నుంచే విద్యార్థులకు దానిపై కనీస అవగాహన ఉండాలని అన్నారు. ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సీఈఓ డా. జోహన్ స్టోర్గార్డ్ మాట్లాడుతూ ‘ఫిన్లాండ్లో పిల్లలకు సబ్జెక్టులు మాత్రమే నేర్పమని, ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తామని అన్నారు. హై–ట్రస్ట్, లో–స్ట్రెస్ వాతావరణంలో విద్యాబోధన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడియో చింతల ఫౌండర్ దివాకర్ చింతల, పాంగేయా ట్రేడ్ (వైస్ ప్రెసిడెంట్ రైతా మోచెర్ల, పీడియాట్రీషియన్, డా. లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి పేరిట నమ్మించి.. డబ్బులు కాజేసి..
ఫిలింనగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లైంగిక వేధించడంతోపాటు రూ.75 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ సదరన్ మోగా టౌన్షిప్లో నివాసం ఉండే రాణా ప్రతాప్రెడ్డి వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరంగా లోబర్చుకున్నాడు. వ్యాపారం కోసం ఆమె వద్ద రూ.75 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తితే మొహం చాటేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వారణాసి విమానం రద్దు.. మరొకటి వెనక్కి..
● ప్రతికూల వాతావరణమే కారణం
శంషాబాద్: వారణాసిలో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయ నుంచి వెళ్లాల్సిన విమానాల్లో ఒకటి పూర్తిగా రద్దు కాగా, మరొకటి మార్గమధ్యంలోంచి తిరిగి వెనక్కి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో 6719 విమానం గురువారం సాయంత్రం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకునే ముందు వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందనే సమాచారం వచ్చింది. దీంతో సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థ విమానాన్ని రద్దు చేసింది. ప్రయాణికులకు షెడ్యూల్ మార్పులున్నట్లు వెల్లడించింది.
అర్ధాంతరంగా తిరిగి వచ్చిన విమానం..
వారణాసి బయలుదేరిన మరో విమానం మార్గమధ్యలోంచి తిరిగొచ్చింది. ఇండిగో 6ఈ–307 విమానం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 231 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం బయలుదేరింది. వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉన్న కారణంగా అర్ధాంతరంగా విమానం తిరిగి రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరింది. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి.


