ఇంటిలిజెంట్ అడుగు..
నగరంలో అమలవుతున్న ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’
● కొత్త విధానంతో భవిష్యత్తులో సమస్యలకు అవకాశం
● దీంతో కేసుల విచారణపై ఏ ప్రభావమూ పడకుండాపోలీసుల కార్యాచరణ
● ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏర్పాటు
● త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం (ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్) అమలవుతోంది. మొత్తం తొమ్మిది రకాలైన నేరాల్లో బాధితులుగా మారిన వారికి ఈ విధానం వర్తింపజేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. న్యాయస్థానంలో ట్రయల్పై ప్రభావం లేకుండా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాధితుల ఇళ్ల వద్ద నమోదు చేసే ఎఫ్ఐఆర్ల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కేసుకు ‘పునాది’ ఫిర్యాదే...
ఏ కేసు అయినా బాధితుడి ఫిర్యాదు ఆధారంగానే నమోదవుతుంది. కేసు డైరీలు, అభియోపత్రాలకు సైతం ఫిర్యాదే పునాది. ఫిర్యాదు ఎంత పటిష్టంగా ఉంటే బాధితులకు అంత మేలు. చాలా మంది అన్యాయాన్ని పోలీసులకు వివరంగా చెప్పినా.. ఆ స్థాయిలో రాసివ్వలేరు. ఈ సందర్భాల్లో వారు ఠాణాకు వస్తే పూర్తిస్థాయిలో వినే సీనియర్ రైటర్లు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు తగిన సలహాలు, సూచనలిస్తారు. పకడ్బందీ ఫిర్యాదుకు సహకరిస్తారు.
గస్తీ సిబ్బందికే ఆ బాధ్యతలు..
ప్రస్తుతానికి నగర పోలీసులు ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ అమలు చేస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు.
అనుభవం, నైపుణ్యమూ తక్కువే..
ఇప్పటి కానిస్టేబుళ్లు విద్యాధికులే అధికం. ఫిర్యాదు రూపొందించడం, కేసు నమోదుతో అనుభవం, నైపుణ్యం సైతం అవసరం. గస్తీ సిబ్బందిలో అత్యధికులు కొత్త కానిస్టేబుళ్లే ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అంశాలపై పట్టు లేకపోవడం, బాధితులు అంత పక్కాగా ఫిర్యాదు రాసి ఇవ్వలేకపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇప్పుడు కేసు నమోదుపై లేకపోయినా.. భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంలో కచ్చితంగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోని లోపాల కారణంగా కేసులు వీగిపోయి, తప్పు చేసిన నిందితులూ బయటకు వచ్చేసే ప్రమాదం లేకపోలేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఏఐపై దృష్టి పెట్టారు.


