ఆ ప్రయత్నాలన్నీ విఫలమే!
ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి సాజిద్ యత్నం
సాజిద్, నవీద్ల పాస్పోర్టులు
ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి లభించని సిటిజన్షిప్
2002 నుంచి రెసిడెంట్ రిటర్న్ వీసాపై ఉంటున్న వైనం
2022లో వచ్చినప్పుడే అతడి పాస్పోర్టు పదేళ్లకు రెన్యువల్
సాక్షి, సిటీబ్యూరో: సిడ్నీలోని బాండీ బీచ్లో మారణహోమానికి తెగబడి, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. టోలిచౌకి అల్ హనస్ కాలనీలో ఉండే అతడి కుటుంబీకులను ప్రశ్నించిన నిఘా వర్గాలు ఈ విషయం గుర్తించాయి. మరోపక్క గడిచిన 27 ఏళ్లలో అతడు నగరానికి రాకపోకలు సాగించిన అంశాల పైనా అధికారులు వివరాలు సేకరించారు.
నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నుంచి బీకాం పూర్తి చేసిన సాజిద్ 1998 నవంబర్లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. 2000లో ఇటాలియన్ వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె ఆ దేశంలోని పర్మినెంట్ రెసిడెంట్గా (పీఆర్) ఉన్నారు. దీంతో 2001లో సాజిద్ తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నారు.
ఆ దేశ పర్మినెంట్ రెసిడెంట్ను వివాహం చేసుకున్నా... వారితో చట్టబద్ధంగా సహజీవనం చేస్తున్నా ఆస్ట్రేలియా ఈ వీసాను జారీ చేస్తుంది. ఇది కలిగి ఉన్న వాళ్లకు అక్కడ ఉండే, పని చేసే, చదువుకునే, మెడికేర్ సదుపాయం పొందే హక్కులు వస్తాయి. ఆపై పీఆర్గా మారిన సాజిద్ 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా తీసుకున్నారు.
పీఆర్ హోదా ఉన్న వారికి ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చిపోయే పరిమితి ఐదేళ్ల కాలానికే ఉంటుంది. ఆ తరువాతఅవసరమైన వారు దరఖాస్తు చేసుకుని ఈ రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాల్సి ఉంటుంది. ఇలా తన పీఆర్ హోదాను సాజిద్ అక్రమ్ కొనసాగించారు.
ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉండాలన్నా, ఆ దేశ పాస్పోర్టు పొందాలన్నా, విదేశాల్లో ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ద్వారా రక్షణ పొందాలన్నా సిటిజన్షిప్ అవశ్యం. ఈ నేపథ్యంలోనే సాజిద్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి ప్రయత్నించాడని, అయితే అతడి దరఖాస్తు ప్రతి సందర్భంలోనే తిరస్కరణకు గురైందని కుటుంబీకులు చెప్తున్నారు. అందుకు కారణాలను మాత్రం అతడు ఎప్పుడూ తమతో పంచుకోలేదని పోలీసులకు వివరించారు.
ఇతడి కుమారుడైన మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో అక్కడి పౌరసత్వం, ఆ దేశ పాస్పోర్టు లభించాయి. గడిచిన 27 ఏళ్లల్లో సాజిద్ ఆరుసార్లు, అక్రమ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లారని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రాకపోకలకు గల కారణాల పైనా స్పష్టత ఇచ్చాయి.
2001లో తొలిసారిగా తన భార్యతో కలిసి వచ్చిన సాజిద్ ఇక్కడ కుటుంబీకుల సమక్షంలో తమ సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు. 2004లో కుమారుడు నవీద్ను టోలిచౌకీలో ఉన్న కుటుంబీకులకు చూపించడానికి తీసుకువచ్చాడు.
2009లో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సాజిద్... ఆ తర్వాత వచ్చి తల్లితో పాటు కుటుంబీకుల్నీ కలిసి వెళ్లాడు. వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తి అయిన శాలిబండలోని ఇంటిని విక్రయించడానికి 2016లో వచ్చి వెళ్లాడు.
ఈ డబ్బు వెచ్చించే ఆస్ట్రేలియాలోని బోనిరిగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో భార్య సైతం కొంత షేర్ కలిగి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సాజిద్ తన వాటాను కూడా భార్య వెనెరా పేరుతో బదిలీ చేశాడు.
2022 ఫిబ్రవరిలో ఆఖరుసారిగా హైదరాబాద్ వచ్చిన సాజిద్ తన కుటుంబీకుల్ని కలిసి వెళ్లాడు. ఆ సందర్భంలోనే పదేళ్ల కాలపరిమితికి తన పార్ట్ను రెన్యువల్ చేయించుకున్నాడు.


