ముంబై: ‘పాకిస్తాన్ను సముద్ర గర్భంలో కలిపివేసేందుకు భారత్ కేవలం ‘కొద్ది నిమిషాల’ దూరంలోనే ఉంది’.. అంటూ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత నౌకాదళం ఎంతటి దూకుడుగా వ్యవహరించిందో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
ముంబైలో జరిగిన నావల్ ఇన్వెస్టిచర్ సెర్మనీలో ప్రసంగించిన అడ్మిరల్ త్రిపాఠి ‘ఆపరేషన్ సింధూర్’ వెనుక ఉన్న ఉత్కంఠభరిత వాస్తవాలను బయటపెట్టారు. ‘మేము సముద్రం నుండి పాకిస్తాన్పై విరుచుకుపడటానికి కేవలం నిమిషాల దూరంలో ఉన్నాం.. సరిగ్గా అదే సమయంలో భారత్ తమపై దాడులను నిలిపివేయాలని పాక్ అభ్యర్థించింది’ అని ఆయన వెల్లడించారు.
‘ఆపరేషన్ సింధూర్’లో..
మే 2025లో జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దారుణమైన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టడమే లక్ష్యంగా మే 7, 2025న భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించింది. మూడు రోజుల పాటు (మే 10 వరకు) జరిగిన ఈ భీకర పోరాటంలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. నాడు భారత నౌకాదళం చూపిన తెగువకు పాక్ నేవీ వణికిపోయిందని, వారి యుద్ధ నౌకలు కరాచీ రేవులకే పరిమితమయ్యాయని, మక్రాన్ తీరం దాటి బయటకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాయని నేవీ చీఫ్ గుర్తుచేశారు.
ప్రధాని మోదీ ప్రశంసలు
భారత నౌకాదళ సామర్థ్యంపై దేశానికి ఉన్న నమ్మకాన్ని ఈ ఆపరేషన్ మరింత బలపరిచిందని అడ్మిరల్ అన్నారు. వెస్ట్రన్ సీబోర్డ్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 17 గంటల పాటు నౌకాదళంతో గడిపి, మన నౌకాదళం ఆపరేషనల్ సన్నద్ధతను స్వయంగా వీక్షించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, దేశ రక్షణ కోసం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని నేవీ చీఫ్ అన్నారు.
ఇది కూడా చదవండి: రాజా రవివర్మ ‘యశోద కృష్ణ’కు రికార్డు ధర


