సాక్షి, హైదరాబాద్: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్ తనువు చాలించింది.
పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్మెంట్లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్కు మకాం మార్చారు.
ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్


