భారత ఆర్మీకి చెందిన గూఢచారులు అనగానే స్టైల్గా సూటు బూటు వేసుకుని ప్రైవేట్ జెట్స్లో తిరుగుతూ విలన్లని చితగ్గొట్టేస్తుంటారు లాంటి వాటినే ఇన్నాళ్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. అయితే ఓ గూఢచారి.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడనేది 'ధురంధర్'లో కొంతమేర రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే మన మూవీస్లో ఆర్మీని చూపించే తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)
'ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు. 'ధురంధర్' పక్కనబెట్టేస్తే నిజానికి దూరంగా ఉంటాయి. అందుకే నేను వాటిని చూసేందుకు వెళ్లను కూడా. మహేశ్ బాబు మూవీ(సరిలేరు నీకెవ్వరు) ఏదో ఉంది. బాంబు ఉంటే పక్కనే కూర్చుని కాఫీ తాగుతుంటాడు. అదంతా చూసి నాకు కామెడీగా అనిపిస్తుంది. ఇదే సినిమాకు నా ఫ్రెండ్తో కలిసి వెళ్లాను. నేను నవ్వుతుంటే.. అరేయ్ నవ్వకురా జనాలు కొడతార్రా అని అన్నాడు. మరి ఆ సీన్ అలా ఉంది ఏం చేయమంటావ్ అని అడిగా. నువ్వు ఆర్మీ వాడివి అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతారు అని ఫ్రెండ్ నాతో అన్నాడు. దీంతో నేను థియేటర్ నుంచి బయటకొచ్చేశా. ఆర్మీని వాళ్లు అపహస్యం చేసినట్లు అనిపించింది. నేను అది తీసుకోలేకపోయాను' అని మేజర్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.
సినిమాలంటేనే రియాలిటీకి ఆమడ దూరంలో ఉంటాయి. వాటిలో లాజిక్స్ వెతకలేం. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే తరహాలో ఉంటాయి. విలన్ ప్రకాశ్ రాజ్ని చివరలో ఆర్మీ చేర్పించే సీన్స్పై రిలీజ్ టైంలోనే విమర్శలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆర్మీ మేజర్.. ఈ ప్రస్తావన తీసుకురావడంతో మహేశ్ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)


