టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్.. అమెరికా, ఇజ్రాయెల్పై నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. అయితే, వనరులు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలవలేరు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అంతర్జాతీయ ఇంధన రవాణాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం. ఈ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్ను ప్రపంచ దేశాల నుంచి వేరు చేయాలని వారు చూశారు. కానీ, ఇరాన్ నౌకాదళం, క్షిపణి దళాల పహారా ముందు వారి ప్రయత్నాలు సాగలేదు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. శత్రువుల దగ్గర వనరులు ఉన్నా, వాటిని ఉపయోగించే ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. యుద్ధంలో ఇరాన్ సాధించిన పైచేయిని చూసి అగ్రరాజ్యం భయపడి ఒప్పందానికి వచ్చింది. మొదట హెచ్చరికలు జారీ చేసిన శత్రువులు, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు’ అని సెటైర్లు వేశారు.
Mohammad Bagher Ghalibaf:
“We are fully prepared, if they make even the slightest mistake, we will respond with force.”
The message is clear: escalation won’t go unanswered. The stakes just got higher. pic.twitter.com/SuOEkhH2wj— Irfan Ahmad (@Irfuu_) April 18, 2026
ట్రంప్ ఆటలు సాగవు..
ఇరాన్ను బలహీనపరచాలని శత్రు దేశాలు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఇరాన్ తన పరిమిత వనరులతోనే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ కలలు కన్నారు. కానీ, ఇరాన్ గడ్డపై ట్రంప్ ఆటలు సాగవు. ఇరాన్ అంటే వెనిజులా కాదని, ఇక్కడ శత్రువుల బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం లేదు అనేది ముందుగా తెలుసుకోవాలి’ అని హెచ్చరించారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో ఇరాన్ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు హార్మూజ్ జలసంధిని మూసే ఉంటుందని స్పష్టం చేశారు.
‘అమెరికా ఫస్ట్’ కాదు.. ఇజ్రాయెల్ ఫస్ట్..
ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ట్రంప్ చెప్పిన అమెరికా ఫస్ట్ నినాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన..
ట్రంప్ పదేపదే చెబుతున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదం గాలికి వదిలేశారు. ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం ఆచరణలో లేదన్నారు. ఆయన ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అనే నినాదం ఎత్తుకున్నట్టు ఉన్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇచ్చే తప్పుడు సమాచారంతో అమెరికా తన విదేశీ విధానాలను నాశనం చేసుకుంటోంది అంటూ విమర్శించారు.


