పట్నా: బీహార్ రాజధాని పట్నాలోని పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థుల ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ప్రయాణ వసతులు సరిపోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు రైళ్లను అడ్డుకుని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు, బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.
రణరంగంగా మారిన స్టేషన్
బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్ష కోసం వేలాది మంది విద్యార్థులు పాటలీపుత్ర స్టేషన్కు చేరుకున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ఉన్న రైళ్లు, విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది అభ్యర్థులు రైళ్లు ఎక్కలేకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు నిరసనకారులు రైళ్ల ఎమర్జెన్సీ చైన్లు లాగి, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆపై రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ స్టేషన్ను రణరంగంగా మార్చారు. ప్రత్యక్ష సాక్షి సంజయ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, అభ్యర్థులు వేలాదిగా ఉండటం, రైళ్లు తక్కువగా ఉండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
Patna, Bihar: A clash broke out at Patliputra Railway Station in Patna during the Bihar Police Prohibition Department exam, as candidates protested against inadequate train arrangements. The unrest escalated into vandalism of an exam special train, prompting police to intervene… pic.twitter.com/e85cGOibrp
— IANS (@ians_india) June 13, 2026
పోలీసుల లాఠీఛార్జ్, కాల్పులు
పరిస్థితి తీవ్రతరం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపైకి భారీగా రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో ఐజీ జితేంద్ర రాణాతో పాటు పలువురు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప బలప్రయోగానికి దిగాల్సి వచ్చింది. బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపి గుంపును విచ్ఛిన్నం చేశారు.
పరిపాలనాధికారుల వివరణ
ఈ ఘటనపై పట్నా జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) డాక్టర్ త్యాగరాజన్ స్పందిస్తూ, అభ్యర్థుల సౌకర్యార్థం ఇప్పటికే రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళ కొందరు అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించి, పరీక్షకు వెళ్లే ఇతర విద్యార్థులను కూడా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకే స్వల్ప బలప్రయోగం చేశామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, పరీక్షల రైళ్లు సురక్షితంగా బయలుదేరాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇది కూడా చదవండి: 6 నెలలకే రూ. 4 లక్షలైతే.. రేపు చదువుల సంగతి ఏంటి?


