కోయంబత్తూరు: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా తన ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. తాజాగా కోయంబత్తూరుకు చేరుకున్న అన్నామలైకి అభిమానులు, మద్దతుదారులు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలకడంతో నగరం రాజకీయ సందడితో మార్మోగిపోయింది. కాగా, విమానాశ్రయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల వరకు వందలాది వాహనాలతో ర్యాలీలు నిర్వహించగా, మద్దతుదారులు పూలమాలలు, నినాదాలతో అన్నామలైకి ఘన స్వాగతం పలికారు. ఆయన కొత్త రాజకీయ ప్రయాణానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీకి రాజీనామా..
గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలపై తన ఆలోచనలు, బీజేపీ కేంద్ర నాయకత్వ వైఖరికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అన్నామలై బహిరంగంగానే చెప్పారు. చివరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదని గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతలతో చర్చించిన తర్వాతే తీసుకున్నానని వెల్లడించారు.
Annamalai 🔥 pic.twitter.com/ufI7oyRHGx
— 𝙎𝙄𝙑𝘼Ⓖ (@mrharichandrar1) June 13, 2026
కొత్త ఉద్యమానికి శ్రీకారం
బీజేపీని వీడిన వెంటనే అన్నామలై "We The Leaders" పేరుతో కొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. వారసత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయం అందించడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజలే నాయకులుగా ఎదిగే వేదికను నిర్మించడమే ఈ ఉద్యమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. అన్నామలై ప్రారంభించిన కొత్త ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఉద్యమం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 13 లక్షల మందికి పైగా సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇది తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, అన్నామలై రాజకీయ ప్రయాణంలో కోయంబత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన రాజకీయంగా ఎదిగిన ప్రాంతాల్లో కోయంబత్తూరు ఒకటి. భవిష్యత్తులో తన రాజకీయ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా కూడా కోయంబత్తూరును అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
கோவையில் அண்ணாமலை அண்ணா அவர்களுக்கு உற்சாகமான வரவேற்பு! pic.twitter.com/GJJUEfnpL7
— Army of Dheeran Annamalai (@annamalai_chap2) June 13, 2026
బీజేపీలో కలకలం
అన్నామలై రాజీనామా తర్వాత తమిళనాడు బీజేపీలో అసంతృప్తి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ కార్యకర్తలను పార్టీని వీడవద్దని కోరుతూ ప్రత్యేక పిలుపునిచ్చారు. మరోవైపు.. అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న ప్రజా స్పందన చూస్తే, తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులకు ఇది నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


