తాడేపల్లి : పరీక్షలు రాయకపోయినా టీడీపీ సభ్యత్వం ఉంటే చాలన్నట్టు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలతో చంద్రబాబు ప్రభుత్వం కూసాలు కదిలాయాన్నారు. డీఎస్సీ అక్రమాలపై గట్టిగా ఉద్యమించామని, పోలీసుల అడ్డంకులను అధిగమించి మరీ పోరాడామన్నారు.
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరిగింది. అందుకే ఈ నిరసన ర్యాలీలు చేపట్టాం. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు తెచ్చుకున్న వారికీ ఉద్యోగాలు ఇచ్చారు. పరీక్షలు రాయకపోయినా టీడీపీ సభ్యత్వం ఉంటే చాలన్నట్టు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలాంటి దిక్కు మాలిన ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదా?, సక్రమంగా ఉద్యోగాలు ఇస్తే సీబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
నారా లోకేష్ ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదు. జగన్తో చర్చించే స్థాయి నారా లోకేష్కు లేదు. లోకేష్తో చర్చకు మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు చాలు. డేట్, ప్లేస్, టైం చెబితే చర్చకు మేము రెడీ. నీట్ పేపర్ లీకైన కేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అలాగే నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.


