ఆస్తిపన్నులోనే చెత్త చార్జీలు
సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడు కార్పొరేషన్ల విభజనతో పాటే పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛ ఆటోల పనితీరు సవ్యంగా ఉండేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించింది. చెత్త నిర్వహణ పేరిట పేదలపై భారం ఉండకుండానూ శ్రద్ధ తీసుకుంది. మురికివాడల్లో 500 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంతో ఉన్న నివాస గృహాల నుంచి ఎలాంటి చార్జీ తీసుకోరాదని నిర్ణయించింది. చెత్త సేకరణ చార్జీలను ఆస్తిపన్నులో కలపాలని భావిస్తోంది.
మార్గదర్శకాలిలా..
● వార్డులోని అన్ని ప్రాంతాల్లో వందశాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరగాలి. నిర్ణీత సమయాలు పాటించాలి. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద వ్యర్థాలు తూకం వేయాలి.
● అన్ని చెత్తసేకరణ ఆటోలకూ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయాలి.
● కొత్తగా వినియోగించే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండాలి. పాత వాటిని రీట్రోఫిట్ చేయాలి.
● గార్బేజ్ వల్నరబుల్ ప్రాంతాలు (జీవీపీ), హాట్స్పాట్లలో ఏడాది వరకు డంపర్బిన్లు ఉంచాలి. ఈ ప్రాంతాల్లో చెత్త తరలింపు పనులు నగరంలో చెత్త నిర్వహణ పనులు చేస్తున్న రాంకీ సంస్థ చేయాలి. సదరు ప్రాంతాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు సెల్ఫ్హెల్ప్ గ్రూపుల మహిళ ద్వారా అవగాహన కల్పించాలి. అందుకు వారికి తగిన ప్రోత్సాహకాలివ్వాలి. ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో హోమ్ కంపోస్టింగ్ ప్రోత్సహించాలి. ఇళ్లలోనే తడి–పొడి వేరు చేసేందుకూ ప్రోత్సాహకాలివ్వాలి.
● కొత్త విలీన ప్రాంతాల్లో , చెత్త సేకరణ సవ్యంగా జరగని ప్రాంతాల్లో రాంకీ ద్వారా వాహనాలు సమకూర్చాలి.
● బల్క్ వేస్ట్ తరలింపు రాంకీ ద్వారా జరగాలి.
● పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు బాగా పనిచేసే స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రోత్సాహకాలు. పనిచేయని వారికి పెనాల్టీల విధింపు.
● వీటితోపాటు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల తరలింపునకు మార్గదర్శకాలు సూచించింది.
వీటి అమలు కోసం రెండు వారాల్లో తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పెషలాఫీసర్ జయేశ్రంజన్ సూచించారు.
పేదలకు మినహాయింపు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కొత్త మార్గదర్శకాలు జారీ


