టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయంకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు జరిపిన అమెరికా సైన్యం.. ఇకపై భూతల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు.. ఇరాన్ సైతం ప్రతిదాడులు జరుపుతోంది. ఇక, తాజాగా కువైట్పై ఇరాన్ జరిపిన దాడుల్లో భారత కార్మికుడు మృతి చెందాడు.
వివరాల మేరకు.. కువైట్లో ఇరాన్ చేసిన దాడుల్లో ఓ భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఇరాన్ దాడులలో భాగంగా కువైట్లోని ఒక ప్రధాన విద్యుత్, నీటి డీసాలినేషన్ ప్లాంట్లోని సర్వీస్ భవనం లక్ష్యంగా మారింది. ఈ దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందగా, భవనానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి వల్ల ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి నష్టం నియంత్రణ చర్యలు చేపట్టాయి.
దీంతో పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య కనీసం ఎనిమిదికి చేరింది. ఇక, గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఒక భారతీయుడు క్షిపణి అవశేషాలు పడటంతో మరణించాడు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఏడు భారతీయులు మరణించారని, ఒకరు కనిపించలేదని తెలిపింది. తాజా ఘటనతో సంఖ్య పెరిగింది. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.


