డాక్టర్లు అనునిత్యం ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తుంటారు. కానీ వాళ్ల అనుభవంలో ఏదో ఒక విచిత్రమైన కేసు సవాలు విసురుతూనే ఉంటుంది. కొన్ని వాళ్ల వైద్య వృత్తికే అందని విధంగా ఉంటే..మరికొన్ని అత్యంత మిరాకిల్గా ఉంటాయి. అలాంటి వింత కేసే ఈ టీనేజర్ పేషెంట్ది. ఆమె చెబుతున్న మాటలకు వైద్యులు సైతం ఒక్క క్షణంపాటు అయోమయానికి గురయ్యారు.
అసలేం జరిగిందంటే.. ఫ్రాన్స్లోని లియాన్కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి క్లేలియా వెర్డియర్ మూడువారాల కోమా తర్వాత కళ్లు తెరిచింది. ఆమె పలికిన మొదటి మాటలకు ఒక్కసారిగా వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు ఆ అమ్మాయి అడుగుతున్న మాటలకు సమాధానం చెప్పలేక గందరగోళానికి గురైంది ఆస్పత్రి సిబ్బంది. కోమా నుంచి మేల్కోని తొలిసారిగా ఆమె ఏం మాట్లాడిందంటే.." ప్లీజ్ నా కుమార్తెలను తీసుకురండి నేను వాళ్లని చూడలంటూ తల్లడిల్లిపోయింది". ఇదేంటి ఈ యువతికి పెళ్లికాలేదు, పైగా పిల్లలు అంటూ వాళ్లని పేర్లతో పిలవడంతో ఒక్కసారిగా వైద్యులు విస్తుపోయారు.
ఒక్క క్షణం అసలు ఏం జరుగుతోందో తెలియక సతమతమయ్యారు. ఆ యువతి వాళ్లను ఒక్కసారి తన వద్దకు తీసుకురమ్మని అర్ధించడం అందర్నీ కలవరపాటుకు గురిచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇప్పటి వరకు ఎప్పుడు గర్భవతి కాలేదని వైద్యులు ధృవీకరించారు. పైగా ఆమె ఏడేళ్లుగా తన పిల్లలను చూసుకుంటున్నట్లు చెబుతోందంతా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె మెదడు సృష్టించుకున్నదేనని తేల్చేశారు వైద్యులు.
ఆమె గతేడాది జూన్ 2025లో అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మాహత్యయత్నంకు ప్రయత్నించిందని, ఆ మందుల ప్రభావం కారణంగా మూడు వారాలపాటు కోమాలో ఉందని చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే ఆ యువతి మాత్రం వైద్యులు తనని ప్రేరేపిత కోమాలో ఉంచారని, తనకు పిల్లలు ఉన్నారని, ప్రసవ వేదన కూడా అనుభవించానని చెబుతుంది. పైగా ఆమెకు ముగ్గురు కవల కుమార్తెలు పుట్టారని చెబుతోంది. కేవలం పుట్టుక మాత్రమే కాదు ఆ తర్వాత జీవితం గురించి అలవోకగా చెప్పేస్తుంది.
వాళ్లను ఎలా పెచ్చింది, వాళ్లకు పెట్టిన పేర్లతో సహా చెప్పయడంతో విస్తుపోవడం వైద్యులు వంతైంది. పైగా తన కూతుళ్ల పేర్లు మిలా, మైల్స్, మైలీ అని పెట్టినట్లు తెలిపింది. అయితే మైలీ పుట్టిన కొద్దిసేపటికే చనిపోవడంతో చాలా ఏడ్చానని, మిగతా ఇద్దరికి తానే పాలివ్వడం నుంచి పెంచి పెద్ద చేయడం వరకు గుర్తుందని వాళ్లకు ఏడేళ్లు ఉంటాయని చెబుతూ ప్లీజ్ వాళ్లని పిలవండి చూడాలి అంటూ అడగడం అందర్నీ కంటతడి పెట్టించింది.
అచ్చం అమ్మలా తల్లడిల్లిన తీరు అందరి హృదయాలను మెలిపెట్టింది. కానీ వైద్యలు మాత్రం మెదడుకు తీవ్రమైన గాయం అయితే.. తర్వాత కోమాలో కలలు రావడం సర్వసాదరణమేనని చెబుతున్నారు. కోమాలో ఉన్న రోగులకు చీకటి గానీ, నిద్ర గానీ అనుభవంలోకి రావు. చాలామందికి స్పష్టమైన, వివరమైన కలలు వస్తాయని, అవి పూర్తిగా రియల్గా అనిపిస్తాయని చెబుతుండగా, మరికొందరు మాత్రం అసలు ఏ జ్ఞాపకం లేకుండా మేల్కొంటారు.
అయితే సదరు యువతి క్లేలియా మాత్రం నా కూతుళ్లు ఇప్పటికీ గుర్తొస్తున్నాంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. అంతేగాదు ఆమెకు కోమాలోంచి మేల్కోగానే పిల్లల పేర్లే కలవరించింది గానీ తన పేరుగానీ, తన తల్లిదండ్రుల పేర్లుగానీ ఆమెకేం గుర్తులేకపోవడం బాధకరం. పైగా తను తల్లిగాదని, పిల్లలు లేరని వైద్యులు చెప్పిన వెంటనే షాక్కి గురయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా తన తల్లిదండ్రులను, తన పేరుని గుర్తు తెచ్చుకుంది. కానీ ఇది జరిగి ఏడాది కావొస్తున్నా..ఇప్పటికీ క్లేలియా మాత్రం తాను పిల్లల తల్లిననే అని భావిస్తోంది, వాదిస్తోంది. పైగా ఇంకా ఆ బాధ తన నుంచి పోలేదని అంటోంది.
(చదవండి: స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..)


