ఆ రోజు సూర్యుడి చూపంతా ఇండియా పైనే! ఏరోజు? ఎందుకు? ఎలా? ప్రశ్నలన్నీ మనసులోకి వచ్చాయి కదా! ఆగండాగండి. అది ఏప్రిల్ నెలాఖరు 27వ తేదీ. ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఆ రోజు ప్రపంచమంతా సాధారణం కంటే వేడెక్కింది. అయితే, అత్యంత వేడి నగరాల్లో మొదటి 50 నగరాలు ఒక్క మన దేశంలోనే నమోదయ్యాయి. గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ సంస్థ ఈ విషయం వెల్లడించింది.
యూపీలో ఎక్కువ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా నగరం ఏక్యూఐ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగానే ఇక్కడ వేసవిలో తీవ్రమైన వేడి ఉంటుంది. ఇక, ఏప్రిల్ 27న బాందాలో ఉష్ణోగ్రతలు 115.16 ఫారహీట్స్కు, అంటే 46.2చేరుకున్నాయి. ఆ రోజు భూగోళంపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఆ రోజు తెల్లవారుజామునే బాందాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 34.72222 డిగ్రీలు. అయితే ఒక్క రోజు డేటాను ఒక ధోరణిగా పరిగణించకపోయినా... దేశం మాత్రం వాతావరణ సంక్షోభం ఎదుర్కొంటోందని వాతావరణ శాస్త్రవేత్త మాక్సిమిలియానో హెర్రెరా తెలిపారు.
ముందే వచ్చిన వేసవి..
అయితే వేసవిలో ఎండలు సాధారణమే. కానీ ఈసారి మాత్రం అసాధారణ ఎండలున్నాయి. గతంలో కంటే మన దేశంలో వేసవి ఈసారి ముందుగానే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన వేడి నమోదైంది. ఇది కాలానుగుణ సగటు కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువ. రానురాను దేశంలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంత తీవ్రంగా అంటే... 2050 నాటికి ఆరోగ్యవంతులైన మనుషులు కూడా తట్టుకుని జీవించలేని స్థాయికి చేరుకుంటుందని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రాణాంతకమైన ఈ వేడి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమ వుతారని చెబుతున్నారు. ఈ నెల చివరలో మధ్య, తూర్పు భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హీట్ ఇండెక్స్ 122 నుంచి 140 డిగ్రీల ఫారన్హీట్ వరకు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని స్థాయని హెర్రెరా హెచ్చరిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


