ట్రాక్టర్‌ డ్రైవర్‌ కుమారుడు స్పేస్‌ టెక్‌ కంపెనీ సీఈవోగా..! | A Tractor Drivers Son To Building A Nasa Linked Space Tech Company | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ డ్రైవర్‌ కుమారుడు స్పేస్‌ టెక్‌ కంపెనీ సీఈవోగా..!

May 14 2026 1:16 PM | Updated on May 14 2026 1:42 PM

A Tractor Drivers Son To Building A Nasa Linked Space Tech Company

చాలా చిన్న స్థాయి నుంచి అచంచలంగా ఎదిగిన ఎందరో ఉన్నతమైన వ్యక్తుల విజయగాథనలను చూశాం. కానీ ఈ స్టోరీ విద్యాపరమైన గాథలా ఉండదు. ఎన్నో ఎదురుదెబ్బలు, ఆకస్మిక మలుపులు, సుదీర్ఘకాలం పాటు అనిశ్చితి తర్వాత ఉవ్వెత్తున​ ఎదిగిన శిఖరాగ్రంలా ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి పాఠశాలకు వెళ్లి చదువుకున్న ఓ సామాన్య ట్రాక్టర్‌ డ్రైవర్‌ కొడుకు సాధించిన విజయం ఇది. 

ఆ వ్యక్తే డాక్టర్‌ ఆనంద్‌ మేఘలింగం. అతడి బాల్యం రాకెట్లు లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కి గానీ సంబంధ లేకుండా సాగింది. ఆయన తమిళనాడులోని ఒక  గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. అక్కడ ఆయన తండ్రి  ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఆశయాల కన్నా అవసరాల చుట్టూనే దైనందిన జీవితం సాగేది. ప్రతి రోజు ఆరుకిలోమీటర్లు దూరం నడిస్తే గానీ చదువుకోలేని పరిస్థితి. అదే అతడిలో నిశబ్దంగా క్రమశిక్షణను అలవరచుకునేలా చేసింది. అందరిలానే ఇంటర్‌ వచ్చాక ఎంసెట్‌ రాసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకున్నాడు. 

కానీ అందులో సబ్జెక్టులేవి మైండ్‌కి ఎక్కేవి కాదు. దాంతో మధ్యలో కాలేజ్‌ చదువుకి స్వస్తి పలికాడు. కానీ మళ్లీ కొద్ది రోజులకి స్ట్రాంగ్‌గా వచ్చి ఈ సారి భిన్నమైన ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ ఎంచుకున్నాడు. అందులో అనూహ్యంగా మేఘలింగం మంచి అకడమిక్‌ మార్కులతో పాసవ్వడమే కాదు గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

స్పేస్ జోన్ ఇండియా తొలి ప్రయాణం
కాలేజ్‌ చదువు పూర్తి చేసిన అనంతరం డాక్టర్‌ ఆనంద్‌ మేఘలింగం స్పేస్‌ జోన్‌ ఇండియాను స్థాపించారు. అలా ఆయన ప్రైవేట్ స్పేస్-టెక్ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా నిలిచారు. ఈ స్పేస్‌ జోన్‌ ఇండియా ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్పేస్ జోన్ ఇండియా పరిమిత వనరులతో, గొప్ప ఆశయాలతో ప్రారంభమైంది. ప్రారంభ అభివృద్ధిలో ప్రయోగాత్మక ఆవిష్కరణలు, బలమైన వ్యక్తిగత నిబద్ధత కీలక పాత్ర పోషించడమే కాకుండా కుటుంబ మద్దతు కూడా తోడవ్వడంతో కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకునేలా నిలదొక్కుకుంది. 

మొబైల్ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌గా వర్ణించే RHUMI-H మిషన్ ఆ సంస్థ సాధించిన విజయాల్లో ఒకటి. ఈ ఘనత భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం అందరి దృష్టిని ఆకర్షించింది, ఇది ఒక సాంకేతిక ముందడుగు కూడా. కొద్దికాలంలో RHUMI మిషన్‌ ప్రాముఖ్యత అమాంత పెరిగింది. అలాగే భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష సామర్థ్యాలపై జరిగే చర్చలలో ఈ కంపెనీ స్థానం దక్కించుకునేలా పేరుతెచ్చుకోవడం విశేషం.

ఆవిష్కరణలకు హద్దులు లేవు..
డాక్టర్‌ మేఘలింగం ఏరోస్పేస్‌ అవకాశాలకు సంబంధించి యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు అత్యంత కీలకం. కానీ వీసా తిరస్కరణతో అతి పెద్ద ఎదురదెబ్బ తగిలింది మేఘలింగంకి. కానీ ఆయన తగ్గేదే లే అంటూ భారత్‌లోనే తన పనిని కొనసాగించారు. సరిహద్దులు మనుషులకే గానీ ఆవిష్కరణలకు కాదు అని చెప్పపేలా తన ఆవిష్కరణలు కొనసాగించాడు.

ఊహించని మలుపు నాసాతో అనుసంధానం..
ఆ తర్వాత అతని కెరీర్‌ ఊహించని మలుపు తీసుకుంది. ప్రపంచ నిపుణుల  బృందంతో కూడిన ఒక అంతర్జాతీయ నాయకత్వ కార్యక్రమం కోసం అమెరికా విదేశాంగ శాఖ ఆయన్ను ఎంపిక చేసుకోవడం ఆయన కెరీర్‌లో పెద్ద మైలురాయి, అనూహ్యమైన మలుపు కూడా. 

ఈ కార్యక్రమం మేఘలింగంకి ఆధునాతన ఏరోస్పేస్‌ పర్యావరణ వ్యవస్థలపై మంచి అవగాహన కల్పించింది. అంతేగాదు నాసా సౌకర్యాలతో అనుసంధానించబడిన శిక్షణా వాతావరణంలో కూడా పాల్గొని,  ఉన్నత స్థాయి ఏరోస్పేస్ వ్యవస్థలు, రక్షణ సాంకేతికతలు, మిషన్ ప్రణాళికా చట్రాలపై పూర్తి  స్థాయిలో అవగాహన పొందారాయన. ప్రస్తుతం మేఘలింగం చెన్నై నుంచి ఏకకాలంలో రాకెట్ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్న RHUMI ట్విన్ ప్రాజెక్ట్ ప్రణాళికలతో సహా కొత్త మిషన్లకు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆయన కంపెనీ విలువ 800 కోట్లు టర్నోవర్‌ పైనే పలుతుందట.

(చదవండి: శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం పఠించి ప్రపంచ రికార్డు!)

 

Advertisement
 
Advertisement
Advertisement