కొడుకు నిందితుడైతే తండ్రిని ఎలా కొడతారు?
నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసులను నిలదీసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే పోలీసులు అతని తండ్రిని స్టేషన్కు తీసుకెళ్లి హింసించి తీవ్రంగా కొట్టిన ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీ వేజెండ్ల అజితతో పాటు గూడూరు గ్రామీణ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టు ముందు హాజరైన నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసులను నిలదీసింది.
నిందితుడైన కొడుకును పోలీస్స్టేషన్కు తీసుకురాలేదన్న కారణంతో తండ్రిని ఎలా కొడతారని ప్రశి్నంచింది. కొట్టలేదని కోర్టు హాలులో ఉన్న పోలీసులు చెప్పగా, మీరు కొట్టకుంటే ఆయనకు తీవ్ర గాయాలు ఎలా అవుతాయని కోర్టు నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి మెడమల్లి బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
హింసించి, వేధించి కొట్టారనేందుకు ఆధారాలున్నాయన్న హైకోర్టు
నెల్లూరు జిల్లా మంగళపూరు గ్రామానికి చెందిన రోజూ వారీ కూలీ, దళితుడు అయిన గడుతోటి పోలయ్య కుమారుడు ఓ కేసులో నిందితుడు. అయితే గూడూరు గ్రామీణ పోలీసులు పోలయ్యను తీసుకెళ్లి హింసించి, వేధించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల దెబ్బల వల్ల పోలయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని, వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై దాడిని దృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది.
ఈ దాష్టీకంపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ అజితతో సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నాల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచి్చంది. కోర్టు ఆదేశాల మేరకు వీరు వ్యక్తిగతంగా గురువారం కోర్టు ముందు హాజరయ్యారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వీ.సురేంద్రరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.


