న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 16వ జనగణన (Census) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న జంటలకు సంబంధించి ప్రభుత్వం కీలక క్లారిటీ ఇచ్చింది. స్థిరమైన బంధంలో ఉంటూ, కలిసి జీవిస్తున్న జంటలను జనగణన ప్రయోజనాల కోసం ‘వివాహితులు’గానే పరిగణించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
33 ప్రశ్నలతో తొలి దశ జనాభా లెక్కలు
జనగణన తొలి దశలో భాగంగా ప్రజలను అడగబోయే 33 ప్రశ్నలకు సంబంధించిన ‘తరచుగా అడిగే ప్రశ్నల’ (FAQs) జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వయంగా వివరాలు నమోదు చేసుకునే) పోర్టల్లో ఈ వివరాలను అందుబాటులో ఉంచారు. హౌస్లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ (HLO), జనాభా గణన అనే రెండు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఏమేం అడుగుతారు?
కేంద్రం సిద్ధం చేసిన ఈ 33 ప్రశ్నల జాబితాలో ఇంటి నిర్మాణ శైలి నుంచి వ్యక్తిగత వివరాల వరకు అన్నీ ఉన్నాయి.
ఇంటి నిర్మాణం: గోడలు, పైకప్పు, నేల తయారీకి వాడిన ముడి పదార్థాలు.
వసతులు: ఇంట్లో ఉన్న మౌలిక సదుపాయాలు, తాగునీరు, వాహనాల లభ్యత.
ఆహారపు అలవాట్లు: కుటుంబ సభ్యులు ప్రధానంగా తీసుకునే తృణధాన్యాల వివరాలు.
కుటుంబ వివరాలు: ఇంట్లోని వివాహిత జంటల సంఖ్య, యజమాని పేరు, లింగం, ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారా? కాదా? వంటి అంశాలు.
ఆస్తి హక్కు: నివసిస్తున్న ఇల్లు సొంతదా లేక అద్దెదా అనే వివరాలను కూడా సేకరించనున్నారు.
డిజిటల్ జనగణన దిశగా..
ప్రజలు తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునేందుకు వీలుగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ పోర్టల్ను రూపొందించారు. లివ్ ఇన్ జంటల గుర్తింపు వంటి సున్నితమైన అంశాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, గణనలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ను విడుదల చేసింది. మున్సిపల్ లేదా స్థానిక సంస్థలు కేటాయించిన వార్డు నంబర్లు, ఇంటి నంబర్ల ఆధారంగా అధికారులు ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరిస్తారు. దేశ భవిష్యత్ ప్రణాళికలకు దిక్సూచిగా నిలిచే ఈ జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘పన్ను చెల్లిస్తేనే..’.. వందేళ్ల ఓటరు అనుభవాలు


