- సెలెక్ట్ కమిటీకి ‘హేట్ స్పీచ్ బిల్’
హైదరాబాద్: గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘శాసనసభలో మంత్రి వివేక్ వెంకస్వామి గిగ్ వర్కర్స్ బిల్లును తేవడం సంతోషంగా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో గిగ్ వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులో వృత్తిపరంగా ఆరోగ్యపరమైన అంశాలు ఉన్నాయి.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ప్రభుత్వం తరుఫున సాయం అందించడం లాంటివి ఉన్నాయి. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో లో గిగ్ వర్కర్స్ చట్టం తేవడం శుభపరిణామం. వారికి వృత్తిపరంగా ఇబ్బంది లేకుండా చట్టం చూసుకుంటుంది. గిగ్ వర్కర్ల బిల్లుపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్లకి అండగా ఉంటుంది’ అని అన్నారు.
మతపరమైన విద్వేషాలను రెచ్చగొడితే చర్యలు
మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026ను ప్రవేశపెట్టింది. ఆ బిల్లును స్పీకర్.. సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. ‘తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు’కు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మత సామరస్యానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో చేసే పోస్టులతో పాటు అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేయడానికి ఈ బిల్లును రూపొందించారు.


