వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్కు కీలక ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నిజం చెప్పాలంటే, ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు 'మీరెందుకు అలా చేస్తున్నారు?' అని అంటారు. కానీ వాళ్లే మూర్ఖులు’ అంటూ మండిపడ్డారు. అలాగే, ఇరాన్పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని.. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని.. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ రక్షణ ఏర్పాట్ల గురించి అడగ్గా, ట్రంప్ స్పందిస్తూ.. వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే, ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు.
అమెరికాకే ముప్పు..?
మరోవైపు.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులు తరలివస్తున్నారు. ఈ సంఘర్షణలో ఖర్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక అమెరికా సైనిక ఎంపికగా ఉందని ఇటీవలి వారాల్లోని నివేదికలు కూడా సూచించాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అధిక భాగం జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఖార్గ్ ద్వీపంపై ఎలాంటి దాడి అయినా అత్యంత ప్రమాదకరమని, అది అమెరికా సైనికుల ప్రాణనష్ణాన్నిపెంచుతుందని, సంఘర్షణను పొడిగించే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకదానికి ముప్పు వాటిల్లుతుందని సైనిక విశ్లేషకులు హెచ్చరించారు.
JUST IN: 🇺🇸🇮🇷 President Trump confirms he is considering seizing Iran's Kharg Island, FT reports.
"My preference would be to take the oil…I don't think they have any defense. We could take it very easily." pic.twitter.com/W7Ze4jj4Zi— BRICS News (@BRICSinfo) March 30, 2026
ఇక, పలు నివేదిక ప్రకారం, ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు నిలుపుకోవడం వంటి కార్యకలాపాల కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను మోహరించాలని పెంటగాన్ ఇప్పటికే ఆదేశించింది. దాదాపు 2,200 మంది మెరైన్లతో సహా సుమారు 3,500 మంది సిబ్బంది శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మరో 2,200 మంది మెరైన్లు మార్గంలో ఉన్నారు. వాషింగ్టన్ సాధ్యమయ్యే విస్తరించిన కార్యకలాపాలకు సిద్ధమవుతున్నందున, 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన వేలాది మందిని కూడా మోహరించాలని ఆదేశించారు.
పెరుగుతున్న మరణాల సంఖ్య
యుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అటు ఇజ్రాయెల్లో 19 మంది మరణించారు. లెబనాన్లో 1,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.


