విశ్వాసం చూపిన శునకం
రామంతాపూర్ : యజమాని మరణించడంతో ఓ పెంపుడు శునకం అతని భౌతికకాయం వద్దే ఉండిపోయింది. అక్కడక్కడే తిరుగుతూ అతనిపై తనకున్న విశ్వాసాన్ని చాటుకుంది. రామంతాపూర్ నెహ్రూనగర్కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి ముత్తినేని లక్ష్మయ్య (93) బుధవారం సాయంత్రం రైల్వే ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఇంటి ముందు ఫ్రీజర్లో ఉంచినప్పటినుంచీ గురువారం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించే వరకు ఫ్రీజర్ చుట్టూ పెంపుడు శునకం తిరుగుతూ విశ్వాసం చాటుకుంది. తినడానికి ఆహారం పెట్టినా కనీసం అటువైపు కూడా చూడకుండా భౌతికకాయం వద్దే పడుకుంది. అంత్యక్రియలకు హాజరైన వారు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు.


