మెట్రోకు రుణాలిస్తాం
● సంసిద్ధత వ్యక్తంచేసిన ఐఆర్ఎఫ్ఆర్సీ
● వడ్డీ రేటు తగ్గింపునకు సంప్రదింపులు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ఆర్సీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలిచ్చే భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐఆర్ఎఫ్సీ నుంచి 3 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు 3 నుంచి 4 శాతం మధ్య వడ్డీరేటుపై బేరసారాలు కొనసాగుతున్నాయన్నారు. మెట్రో టేకోవర్లో భాగంగా మొత్తం రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 వేల కోట్లు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు కావడం గమనార్హం. కాగా.. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ.. మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో మెట్రో సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత దీని నిర్వహణలో ఎల్అండ్టీ చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం టేకోవర్ చేసిన విషయం విదితమే.


