ఓటెత్తిన పట్టణం
రంగారెడ్డిలో 78.99 శాతం,
మేడ్చల్లో 83.99 శాతం పోలింగ్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని 9 మున్సిపాలిటీల్లో 194 వార్డులకు జరిగిన ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహాయించి ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో ఒక పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వెండి నాణేలు పంపిణీ చేయగా, అవి నకిలీ అని తేలటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రావల్కోల్లో ఓ పార్టీ అభ్యర్థికి సంబంధించిన బంధువు అల్లరితో తలెత్తిన వివాదం పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో స్వల్ప ఉద్రిక్త సంఘటనలు మినహా ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మేడ్చల్–మల్కాజిగిరిలో 83.99, రంగారెడ్డి జిల్లాలో 78.99 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు మనుచౌదరి, నారాయణరెడ్డి పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 106 టేబుళ్ల అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.
స్ట్రాంగ్రూమ్లకు బ్యాలెట్ బాక్స్లు
రేపు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
మధ్యాహ్నం 2 కల్లా ఫలితాలు
16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక


