విద్యుత్ డిమాండ్ ౖపైపెకి..
● ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగంలోకి..
● ఒత్తిడి తట్టుకోలేక తరచూ ట్రిప్పవుతున్న ఫీడర్లు
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు చలితో వణికిపోయిన నగరవాసులు.. ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరికి లోనవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగి.. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడితో ట్రిప్పవుతున్నాయి. అనధికారిక ‘కోత’లకు కారణమవుతున్నాయి. ఉదయం ఇంట్లోని కరెంట్ మోటార్లు, వాటర్ గీజర్లు, మిక్సీలు, ఎలక్ట్రిక్ స్టవ్లన్నీ ఒకే సమయంలో పని చేస్తుండటమే ఇందుకు కారణం.
ఈసారి 5 వేల మెగావాట్లు దాటుతుందా..?
గత ఏడాది ఫిబ్రవరిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,512 మెగావాట్ల వినియోగం (72 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 6న 3509 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. 2025 ఏప్రిల్ 24న రికార్డు స్థాయిలో 4,190 మెగావాట్లు (89.54 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 5000 మెగావాట్లకు చేరుకోనున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి మించి లోడును ఎదుర్కొంటున్న 11కేవీ, 33 కేవీ ఫీడర్లపై ప్రత్యేక దృష్టిసారించారు. రంగారెడ్డి జోన్లో 965 అదనపు డీటీఆర్లు, మేడ్చల్ జోన్లో 626 డీటీఆర్లు, మెట్రో జోన్లో 297 డీటీఆర్లను ఏర్పాటు చేస్తున్నారు.


