కళాశాల భవనంపైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
రాజేంద్రనగర్: కళాశాల మూడో అంతస్తు నుంచి దూకిన ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు..శివరాంపల్లి పోలీసు అకాడమీ కాలనీకి చెందిన శైలేష్ కుమార్ తివారీ కుమార్తె (17) భవానీకాలనీలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం పరీక్ష రాసిన అనంతరం ఆమె మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేందుకు యత్నించగా రోడ్డుపై వెళుతున్న వారు దీనిని గమనించి కేకలు వేస్తూ వద్దని వారించినా వినకుండా దూకేసింది. విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


