నాగాలాండ్, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్లతో త్రైపాక్షిక ఒప్పందం వేళ అమిత్ షా ప్రకటన
న్యూఢిల్లీ: శాంతిస్థాపనకు పాటుపడుతూ నాగాలాండ్ రాష్ట్రంలోని ఆరు వెనకబడిన జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. టుయెన్సంగ్, మోన్, కిఫిరే, లోంగ్లెంగ్, నోక్లాక, షమాటార్ జిల్లాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్లతో గురువారం ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమిత్ షా ప్రసంగించారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ‘ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ(ఎఫ్ఎన్టీఏ)ను ఏర్పాటుచేస్తాం.
త్రైపాక్షిక ఒప్పందం మేరకు 6 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా 46 అంశాలకు సంబంధించిన నిర్ణయాధికారం కేంద్రం నుంచి ఎఫ్ఎన్టీఏకు దఖలుపడుతుంది. ఎఫ్ఎన్టీఏ కోసం చిన్న సచివాలయం నిర్మిస్తారు. రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఈ మినీ సెక్రటేరియట్ పనిచేస్తుంది. జనాభా ప్రాతిపదికన నాగాలాండ్ ప్రధాన భూభాగానికి తగ్గట్లే తూర్పునాగాలాండ్కూ అభివృద్ధి నిధుల్లో కేటాయింపులు జరుగుతాయి. ఆర్థిక స్వావలంభన, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, వనరుల సది్వనియోగ సాధనకు తీసుకున్న నిర్ణయాత్మక ముందడుగు ఇది’’అని అమిత్ షా వ్యాఖ్యానించారు.


