గడ్చిరోలి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మహిళా మావోయిస్టు ఉన్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసు అధికారి.. చికిత్స పొందుతూ మరణించారు. జవాన్ దీపక్ మాడవి మృతి చెందగా.. మరో కమాండో జగో మాడవి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఎస్ఎల్ఆర్ తుపాకీ లభించాయి.
అహేరికి చెందిన దీపక్ చిన్నా మడవి (38) అనే జవాన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని అబూజ్మడ్ అడవుల నుండి ఎయిర్లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. మరో జవాన్ జోగా మడవి కూడా గాయపడ్డారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 3న రాత్రి, మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో గడ్చిరోలి పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ గాలింపు చర్యల్లో మొత్తం 14 C-60 యూనిట్లు, సీఆర్ఫీఎస్కి చెందిన క్విక్ యాక్షన్ టీమ్ (QAT) పాల్గొన్నాయి.
మంగళవారం జరిగిన కాల్పుల తర్వాత, భద్రతా దళాలు రెండు మావోయిస్టు క్యాంపులను ధ్వంసం చేసి భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. దట్టమైన అడవి, కఠినమైన భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపిన వివరాల ప్రకారం, సరిహద్దు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.


