గోటన్: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. తలన్పూర్కు చెందిన రాజేంద్ర బాపేడియా కుమార్తె దివ్య స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఉదయం 7:48 గంటల సమయంలో పాఠశాల ప్రార్థన సమయానికి ఇంకా వ్యవధి ఉండటంతో, దివ్య మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది.
ఈ క్రమంలోనే ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దివ్య మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దివ్య కుటుంబంలో ఇటువంటి విషాదం చోటుచేసుకోవడం ఇది మొదటిసారి కాదు.
గత సెప్టెంబర్ 9వ తేదీన దివ్య అన్నయ్య అభిషేక్ కూడా సరిగ్గా ఇదే రీతిలో మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అభిషేక్ ఇంట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. తమ ఇద్దరు బిడ్డలను ఒకే తరహాలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం.


