వివాదాస్పద పాఠ్య పుస్తకంపై నిషేధం | Supreme Court bans textbook for referring to judicial corruption | Sakshi
Sakshi News home page

వివాదాస్పద పాఠ్య పుస్తకంపై నిషేధం

Feb 27 2026 5:15 AM | Updated on Feb 27 2026 5:15 AM

Supreme Court bans textbook for referring to judicial corruption

‘న్యాయవ్యవస్థలో అవినీతి’చాప్టర్‌తో ముద్రితమైన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంపై సుప్రీం నిర్ణయం 

న్యాయవ్యవస్థ ప్రతిష్టను మంటగలిపేలా వ్యాఖ్యానాలు ఉన్నాయని కోర్టు మండిపాటు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యానాలతో రూపొందించిన ఒక చాప్టర్‌తో ముద్రితమైన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం నిషేధం విధించింది. భవిష్యత్తులో దేశవిదేశాల్లో ఈ పుస్తకాన్ని పునర్‌ముద్రించడంగానీ ఆన్‌లైన్‌లో డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తేవడం లాంటివి చేయకూడదని జాతీయ విద్యా పరిశోధన శిక్షణమండలి(ఎన్‌సీఈఆర్‌టీ), కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 

‘కరప్షన్‌ ఇన్‌ ది జ్యుడీషియరీ’, ‘ది రోల్‌ ఆఫ్‌ ది జ్యుడీషియరీ ఇన్‌ అవర్‌ సొసైటీ’అంశాలతో ముద్రితమైన ‘ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ: ఇండియా అండ్‌ బియాండ్‌(వాల్యూమ్‌2)’8వ తరగతి సాంఘికశాస్త్ర పాఠ్య పుస్తకాన్ని ఏ పాఠశాలకు పంపిణీచేయొద్దని, ఇప్పటికే పంపిణీ అయిన పుస్తక ప్రతులన్నింటినీ వెంటనే సీజ్‌ చేసి, వెనక్కి తెప్పించాలని ధర్మాసనం ఆదేశించింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంఛోలీల ధర్మాసనం ఎన్‌సీఈఆర్‌టీని ఆదేశించింది. పుస్తకం తుది ఆమోదం, ముద్రణకు బాధ్యులుగా పేర్కొంటూ ఎన్‌సీఈఆర్‌టీకి కోర్టు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. అత్యంత వివాదాస్పద, అభ్యంతరకర చాప్టర్‌ను పుస్తకంలోకి జొప్పించి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, అందులోని పాఠశాల విద్యావిభాగ కార్యదర్శికి కోర్టు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. 

బుల్లెట్‌ దించి రక్తం చిందించారు 
ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించాక విచారిస్తూ సీజేఐ సూర్యకాంత్‌ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘న్యాయవ్యవస్థకు అవినీతి మరకలు అంటిస్తూ న్యాయవ్యవస్థ మీదకు వాళ్లు బుల్లెట్‌ ప్రయోగించారు. బుల్లెట్‌ గాయంతో ఈరోజు న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థకు అత్యున్నత సారథిగా ఇందుకు కారకులెవరో కనిపెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. కారకులను న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టాల్సిందే. కఠిన శిక్ష పడాల్సిందే. ఈ అంశంలో లోతైన దర్యాప్తు జరగాలి. అసలు ఇలాంటి పాఠ్యపుస్తకం ఒకటి ప్రచురితమైందని వార్తపత్రికల్లో ఆరి్టకల్‌ చదవగానే షాక్‌కు గురయ్యా. 

ఇలాంటి ప్రచురణ నిజంగానే వచ్చిందా అని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ద్వారా వాకబు చేయించా. ఇది నిజమని తెలిసి హుతాశులమయ్యాం. తప్పుపై పశ్చాత్తాపం చెందాల్సిందిపోయి ఎన్‌సీఈఆర్‌టీ తన చర్యను సమరి్థంచుకునే ప్రయత్నంచేశారు. ఇది నిజంగా అత్యంత నిర్లక్ష్యపూరిత, బాధ్యతారహిత, ఉల్లంఘనీయ చర్య. పుస్తకంలోని అంశాలను మేం పరిశీలించాక పక్కా ప్రణాళికతో న్యాయవ్యవస్థ పరువును మంటగలపాలని కంకణం కట్టుకున్నట్లు కని్పస్తోంది. ఈ చాప్టర్‌ను పొరపాటున ప్రచురించినట్లుగా ఏ కోశాన కని్పంచట్లేదు. న్యాయవ్యవస్థను కుంభకోణాలమయంగా చిత్రించే దుస్సాహసం చేశారు’’అని సీజేఐ అన్నారు. 

అందరి పేర్లూ ఇవ్వండి.. 
‘‘ఈ చాప్టర్‌ను ఎవరు లిఖించారు? ఆమోదించింది ఎవరు? చాప్టర్‌పై విస్తృత చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? ఆ సమావేశం తాలూకు మినిట్స్‌ను, సంబంధిత ఒరిజినల్‌ రికార్డులను మాకు సమరి్పంచండి. ఈ పాఠ్యపుస్తకాన్ని రచించిన రచయితల పేర్లు, ముసాయిదా అధ్యాయం రూపకల్పనకు బాధ్యులైన అధికారుల వివరాలు ఇవ్వండి’’అని ధర్మాసనం ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్‌ అయిన ప్రొఫెసర్‌ దినేశ్‌ ప్రకాశ్‌ సక్లానీని ఆదేశించింది. దీంతో పాఠశాల విద్యా శాఖ తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కలి్పంచుకుని విద్యాశాఖ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

ప్రధాని మోదీ అసంతృప్తి.. 
పాఠ్యపుస్తంలోని అంశాలు వివాదాస్పదమవడంతో ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఢిల్లీలో కేంద్రప్రభుత్వ నిర్ణయాలపై తుది ఆమోదం కోసం జరిగిన కేబినెట్‌ భేటీలో పాఠ్యపుస్తకం అంశం ప్రస్తావనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పిల్లలకు పాఠాలు బోధించాల్సిన అవసరం ఏమొచి్చంది?. మాధ్యమిక స్థాయి విద్యార్థులకు ఇలాంటి విషయాలు ఏ రకంగా ఉపయోగపడతాయి? అసలు ఇలాంటి చాప్టర్‌ను పెట్టాలని ఎవరు నిర్ణయించారు? ఇలాంటి అంశాలు పాఠశాల స్థాయి దాకా చేరాలని నిర్ణయించిందెవరు? పాఠ్యాంశాలను రూపొందించి ఆమోదించిందెవరు?’’అని మోదీ ఆరాతీసినట్లు సమాచారం.  

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎన్‌సీఈఆర్‌టీ  
‘‘పాఠ్యాంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో తప్పు ఎక్కడ దొర్లింది? విషయంపై అంతర్గత సమీక్ష జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి అనుచితాలు పునరావృతంకాకుండా అడ్డుకుంటాం’’అని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.

కించపరిచే ఉద్దేశం మాకు లేదు: ధర్మేంద్ర ప్రధాన్‌ 
‘‘జరిగినదానికి నేనెంతో బాధపడుతున్నా. న్యాయవ్యవస్థను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఈ అంశంలో దర్యాప్తు జరిపించి చాప్టర్‌ రూపకల్పన, ఆమోదానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విషయం తెలియగానే పాఠ్యపుస్తకాన్ని ఎవరికీ అందుబాటులోలేకుండా నిలువరించాం’’అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జంషెడ్‌పూర్‌లో మీడియాతో అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement