ప్రేమ పెళ్లి చేసుకుని తండ్రికి తెలియకుండా ఇంట్లోనే కాపురం పెట్టిన యువతి
విషయం తెలిసి మందలించిన తండ్రిని చంపిన కుటుంబ సభ్యులు
భార్య, కుమార్తెతో పాటు ఐదుగురు అరెస్ట్
వేలూరులో వెలుగు చూసిన ఘటన
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు.. అరసమరపేటకు చెందిన యోగనాథన్(63) సత్వచ్చారిలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి పదవీ విరమణ చేశాడు. బుధవారం ఉదయం యోగనాథన్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. బంధువులకు విషయం తెలిసి వేలూరు సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై విచారణ చేపట్టారు.
యోగనాథన్ కుమార్తె వినోదిని ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకుంది. విషయం తండ్రికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇంట్లో తండ్రికి తన భర్త కనిపించకుండా చూసుకునేది. ఈ విషయం యోగనాథన్కు తప్పా మిగతా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఇటీవల ప్రేమ వివాహం గురించి యోగనాథన్కి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది.
తీవ్ర గాయాలతో యోగనాథన్ ఇంట్లో మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించారు. విచారణలో యోగనాథన్ది హత్య అని తేలడంతో పోలీసులు మృతుడి భార్య విమలాదేవి, కుమారుడు గోవిందరాజ్, స్నేహితులు అశ్వథామన్, శివదాస్, కుమార్తె వినోదినిని గురువారం అరెస్ట్ చేశారు.


