ఏలూరు జిల్లా: ప్రేమకు భాషా భేదం, ఖండాంతరాలు అడ్డుకాదని నిరూపించింది ఈ ప్రేమజంట. ప్రగడవరం అమ్మాయి, జర్మనీ అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన జల్లిపల్లి సత్యనారాయణ, కృష్ణకుమారి దంపతుల కుమార్తె ప్రవల్లిక జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.
అక్కడ బుక్స్బాక్ నగరానికి చెందిన థామస్ ఛాకర్ట్, యుట్టా చాకర్ట్ కుమారుడు యల్మర్తో ప్రేమలో పడ్డారు. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో తెలుగు సంప్రదాయం ప్రకారం మంగళగిరిలో బుధవారం వీరి వివాహం జరిగింది. జర్మనీ నుంచి వచ్చిన యల్మర్ బంధువులు మన దేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను చూసి ముగ్ధులయ్యారు. వివాహానికి వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.


