నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు.. | Tirupati Mother and 2-Year-Old Daughter Case | Sakshi
Sakshi News home page

నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు..

Feb 26 2026 1:25 PM | Updated on Feb 26 2026 1:36 PM

Tirupati Mother and 2-Year-Old Daughter Case

నన్నెందుకు చంపావమ్మా? 
నాన్నను కాదనుకున్నావు.. 
అందర్నీ దూరంగా ఉంచావు.. 
ఒంటరిగానే నన్ను పెంచావు.. 
నీ సుఖం చూసుకుని ఊహాలోకంలో విహరించావు.. 
సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించావు.. 
మాయాలోకంలో పడి నన్ను వదిలించుకోవాలనుకున్నావు.. 
నీ కడుపుచించుకుపుట్టిన నన్ను కర్కశంగా గొంతు నులిమి చంపేశావు.. 
నీకు తోడుగా నిలిచిన వాడితో కలిసి స్వర్ణమ్మలో కలిపేశావు.. 
నేనేం తప్పు చేశానమ్మా.. నాకెందుకీ శిక్ష వేశావమ్మా..?
.. అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం.

ఓ కసాయి తల్లి ప్రియుడి మోజులో పడి రెండున్నరేళ్ల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన కలకలం సృష్టించింది.  

తిరుపతి: ‘11 నెలల చిన్నారి ‘పునర్విక’ ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన రూ.16 కోట్లు సమకూర్చేందుకు ఏ సంబంధం లేని లక్షల మంది ఒక్కటయ్యారు. తమవంతు సాయమందించి సమాజంలో మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు. ఈ కసాయి తల్లి కామాంధకారంతో కళ్లు మూసుకుపోయి కడుపుచించుకుని పుట్టిన అపురూప పాపాయిని అత్యంత పాశవికంగా చిదిమేసింది. ఆపై స్వర్ణమ్మ ఒడిలో పాతిపెట్టేసి చేతులు దులుపుకుంది. పోలీసులు తమదైన విచారణలో అసలు విషయం బయటపడింది.  

ఏ‘పాప’ం చేసిందని? 
తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్‌తో విడిపోయి తిరుపతి పోస్టల్‌ కాలనీలో రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఉంటోంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్‌ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గను అంతమొందించాలని భావించింది. ఈ నెల 19వ తేదీన దుర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడు రెడ్డికుమార్‌ సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకుని ప్రియుడి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో అవ్వ ప్రశ్నించింది. తల్లి సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన ప్రతి హృదయం ద్రవించింది. ఏ పాపం చేసిందని పాప ప్రాణం తీశావంటూ ప్రతి గొంతు ఘోషించింది.

గుండెలవిసేలా రోదించిన అవ్వ 
ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశాలత, రెడ్డికుమార్‌తోపాటు వారికి సహకరించిన మరికొందరిని పోలీ సులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కళ్లు బైర్లు కమ్మేలాంటి చిన్నారి హత్యోదంతాన్ని వారు బయటపెట్టారు. బుధవారం తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు, ఏర్పేడు తహసీల్దార్‌ భార్గవి పాపానాయుడుపేట సమీపంలో పాపను పూడ్చిపెట్టిన స్వర్ణముఖి నదిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి వారి వెంట వచ్చిన చిన్నారి దుర్గ అమ్మమ్మ నాగరత్నమ్మ బోరున విలపించింది. నువ్వేం పాపం చేశావమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కదిలించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement