బొబ్బిలి: స్థానిక కుమ్మరివీధికి చెందిన మాధవీదేవిని తన భర్త నిత్యం వేధించడంతో పాటు చనిపొమ్మని కూడా పలుమార్లు అనడం, తగాదా పడ్డ రోజు కూడా అదే విధంగా వేధించడంతో ఆమె ఉరి వేసుకుని మృతి చెందిందని సీఐ కె.నారాయణరావు అన్నారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుడు మర్రి నరేష్ను అరెస్టు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య స్కూల్లో గణితోపాధ్యాయినిగా పని చేస్తున్న మాధవీదేవిని తరచూ అనుమానంతో వేధించడమే కాకుండా సిబ్బంది ఎప్పుడయినా ఫోన్ చేసినా వివాహేతర సంబంధం అంటగట్టేవాడన్నారు.
తరచూ కొట్టేవాడన్నారు. నీ బాధలు భరించలేకపోతున్నాను చనిపోతానంటే నువ్వు చనిపో అనేవాడన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న రాత్రి గొడవ జరిగిందని, మాధవీదేవి తను చనిపోతానంటే నువ్వు చనిపో అని పలుమార్లు నరేష్ అనడంతో ఆమె అక్కడున్న ఊయల వైర్కు ఉరి వేసుకుని మృతి చెందిందన్నారు. వెంటనే మాధవీదేవి చిన్నాన్న కుమారుడుకి ఫోన్ చేసి మీ చెల్లి ఉరి పోసుకుంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మాధవీదేవి మృతి చెందినట్టు వైద్య సిబ్బంది ధృవీకరించారన్నారు. నరేష్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ చెప్పారు. ఎస్సై ఆర్.రమేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మనస్తాపంతో యువతి ఆత్మహత్యా యత్నం
పార్వతీపురం రూరల్: పట్టణంలోని ఒక హోటల్లో వెయిటర్గా పని చేస్తున్న యువతి, గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే, సదరు యువకుడి సెల్ఫోన్లో వేరొకరితో సన్నిహితంగా ఉన్న సందేశాలను (మెసేజ్లు) చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో చీమల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గమనించిన సన్నిహితులు హుటాహుటిన ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.


