కల్తీ పాల ఘటన.. బాధితుల హెల్త్‌ బులిటెన్‌ విడుదల | Rajamahendravaram milk adulteration patient health bulletin released | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటన.. బాధితుల హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Feb 26 2026 7:49 AM | Updated on Feb 26 2026 7:49 AM

Rajamahendravaram milk adulteration patient health bulletin released

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వివిధ ఆసుపత్రిలో 15 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాధితుల పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. బాధితులకు చికిత్స కోసం యాంటీడోట్ తెప్పించామని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో వెంటిలేటర్‌పై ఇద్దరు, ముగ్గురికి డయాలసిస్, మరో ముగ్గురిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్, ఏడుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాలలో ఏ పదార్థాలు కలిశాయో ఇప్పటివరకు ల్యాబ్‌ రిపోర్టులో స్పష్టం కాలేదు. ల్యాబ్ రిపోర్ట్ రాకుండా యాంటీ డోట్ ఎలా ఇస్తారో అర్థం కాని పరిస్థితిలో బాధిత కుటుంబాలు ఉన్నాయి. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఇద్దరికి అనూరియా లక్షణాలు బయటపడ్డాయి.

ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరగా.. ఇప్పటికే ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

రక్త నమూనా నివేదికలు వచ్చేదెప్పుడో! 
నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్, వెంకటేశ్వర నగర్‌ తదితర ప్రాంతాల్లో 110 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్‌ పాలు పోశారు. ఈ కుటుంబాల పరిధిలో 315 రక్త నమూనాలు తీసుకున్నారు. పాల శీతలీకరణ యంత్రంలో లీకేజీ ఏర్పడి ఇథలీన్‌ గ్లైకాల్‌ పాలలో కలిసి ప్రమాదం జరిగిందంటూ ఆ పాలను, అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం ముంబైలోని ఫోరెనిక్స్‌ ల్యాబ్‌కు పంపారు. బాధితులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రూ.లక్షలు వెచ్చించి ముంబై నుంచి హుటాహుటిన రప్పించారు.

అయితే.. ఆ ఇంజెక్షన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కల్తీపాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితుల శరీరంపై ఇథలీన్‌ గ్లైకాల్‌ ప్రభావం ఉంటే మాత్రమే ఆ ఇంజెక్షన్లు చేయాలి. అలా కాకుండా కల్తీ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. రక్త నమూనాలకు సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ ఇంజెక్షన్లు ఉపయోగించలేని పరిస్థితి. ఈ సందిగ్ధ స్థితి బాధితులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పాల కల్తీపై నేటికీ స్పష్టత రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  

తిరుపతి ల్యాబ్‌కు రక్త నమూనాలు 
ముంబై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుండటంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి రక్త నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదిక గురువారం సాయంత్రానికి అందే అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యం ఏవిధంగా చేయాలో నిర్ణయిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement