సహకార ఉద్యోగుల సమ్మె విరమణ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సహకార ఉద్యోగుల జీతాలు 20 శాతం పెంపు, గ్రాట్యూటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచడంతో పాటు, ప్రతి ఉద్యోగికి రూ.5 లక్షల కవరేజీతో సమగ్ర గ్రూప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సమ్మె విరమించినట్లు ఏపీ రాష్ట్ర సహకార ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని డీసీసీబీ బ్రాంచ్ వద్ద జరిగిన సహకార ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. పీఏసీఎస్ ఉద్యోగులకు ప్రకటించిన ప్రయోజనాల అమలు విధానాలను ఉన్నత స్థాయి కమిటీ అతి త్వరలో ప్రకటిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారన్నారు. పీఏసీఎస్ యూనియన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుందన్నారు. ఉద్యోగులు ఎటువంటి అపోహలకు, అధైర్యానికి గురి కాకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కె.వీరభద్రరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రామచంద్రరావు, డైరెక్టర్లు బి.సత్యనారాయణ, ఎస్.అప్పారావు, బి.రాంబాబు పాల్గొన్నారు.


