East Godavari District News
-
హాయివేపై రయ్.. రయ్..
● పూర్తయిన దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే ● ట్రయల్ రన్కు అధికారుల అనుమతి ● వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభందేవరపల్లి: ఉభయ తెలుగు రాష్టాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండు వారాలుగా కొత్త హైవేపై ట్రయల్ రన్కు అధికారులు అనుమతి ఇవ్వడంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వాహనాలు రయ్..రయ్మంటూ దూసుకు వెళ్తున్నాయి. కరోనా, అధిక వర్షాలు, భూ సేకరణలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకుల కారణంగా దీని నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని పనులూ దాదాపు పూర్తి కావడంతో ఈ హైవేను మే నెలలో అధికారికంగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ● దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేకు భారత్మాల పరియోజన–1 కింద కేంద్ర ప్రభుత్వం 2018 మే 23న అనుమతి ఇచ్చింది. 2022లో పనులు చేపట్టారు. దేవరపల్లి నుంచి తెలంగాణలోని ఖమ్మం వరకూ మొత్తం 162 కిలోమీటర్ల పొడవున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో ఈ హైవే నిర్మించారు. ● ఈ హైవే మొత్తం పచ్చని పొలాల మధ్య నుంచి సాగుతుంది ● ఏపీ – తెలంగాణ మధ్య 4 వరుసల మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇదే కావడం విశేషం. ● అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) కింద ఈ హైవేపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 95 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి సోలార్ విద్యుత్తో పని చేస్తాయి. వీటి ద్వారా రోడ్డుకు ఇరువైపులా సుమారు కిలోమీటరు దూరం వరకూ నిఘా ఉంచుతారు. మార్గం మధ్యలో ఎక్కడైనా ప్రమాదం, మరేదైనా సంఘటన జరిగితే వెంటనే కంట్రోల్ రూముకు సమాచారం అందుతుంది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణకు తెలంగాణలోని కల్లూరు సమీపాన కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ● హైవేపై రాత్రి వేళ వెలుతురు కోసం సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ● అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేశారు. ● ఈ రోడ్డుపై ప్రయాణించిన దూరానికే టోల్ చార్జీలు చెల్లించే ఏర్పాటు చేశారు. ● చైన్నె – కోల్కతా 16వ నంబర్ జాతీయ రహదారి, దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి వద్ద అనుసంధానమవుతాయి. ఇక్కడ డ్రమ్ఫుట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పచ్చని గ్రీన్పార్క్ ఏర్పాటు చేశారు. ఈ హైవేకి ఇరువైపులా ఎక్కడా సర్వీస్ రోడ్లు ఉండవు. ● ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి విజయవాడ, సూర్యాపేట మీదుగా 12 గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. దేవరపల్లి – ఖమ్మం గ్రీన్పీల్డ్ హైవే వల్ల 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 4 గంటల సమయం ఆదా అవుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే స్వరూపమిదీ.. నేషనల్ హైవే నంబర్ 365 బీజీ పొడవు 162 కిలోమీటర్లు వరుసలు 4 వ్యయం రూ.4,451కోట్లు కేంద్రం అనుమతి ఇచ్చిన తేదీ 2018 మే 23 పనులు ప్రారంభం 2022 టోల్ ప్లాజాలు 8 మైనర్ బ్రిడ్జిలు 51 మేజర్ బ్రిడ్జిలు 9 మేజర్ పనులు పూర్తి అక్కడక్కడ చిన్నచిన్న పనులు మినహా గ్రీన్ఫీల్డ్ హైవేలో మేజర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం వాహనాల ట్రయల్ రన్కు అనుమతించాం. వచ్చే నెలలో ఈ హైవే ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అధునాతన సాంకేతికతతో దీని నిర్మాణం జరిగింది. – బి.కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎహెచ్ఏఐ), రాజమహేంద్రవరం -
ఐదు అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సుల సీజ్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు రాజమహేంద్రవరం నుంచి నడుస్తున్న ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఆర్.సురేష్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కలసి బుధ, గురువారాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి ఈ బస్సులలో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. బస్సుల దిగువ భాగాన అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లను (ఎస్కేప్ హ్యాచ్, డోర్) లగేజీతో మూసివేయడం, నిబంధనల ప్రకారం వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. జిల్లా రవాణా అధికారి సురేష్ గురువారం స్వయంగా ఒక బస్సును తనిఖీ చేయగా, అందులో కూడా అదనపు డీజిల్ ట్యాంకు ఉన్నట్లు గుర్తించారు. పర్మిట్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా చర్యలు అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. సీజ్ చేసిన 5 బస్సులను రాజమహేంద్రవరం రవాణా శాఖ కార్యాలయంలో భద్రపరిచారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వీటి యజమానులు సుమారు రూ.2.15 లక్షల పన్ను, అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రవాణా అధికారులు సంపత్ కుమార్, ప్రణీత్, ఉమామహేశ్వరరావు, రాధిక, సుమ పాల్గొన్నారు. -
పదవులన్నీ భజనసేనకేనా!
● రాజానగరం జనసేనలో అసమ్మతి రాగం ● అగ్గి రాజేస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ● తమకు ప్రాధాన్యం దక్కలేదంటూ అసంతృప్తిసాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం నియోజకవర్గం జనసేనలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యవహార శైలే దీనికి కారణంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో కష్టపడిన వారి ని కాకుండా తనకు భజన చేసే వారినే ఆయన చేర దీస్తున్నారని అసంతృప్తి నేతలు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తన భజన బృందానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని విమర్శిస్తున్నారు. అండగా నిలిచినా అన్యాయమే! గత సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం స్థానాన్ని టీడీపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, అప్పటి నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. అయితే, కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు ను జనసేనకు కేటాయించారు. దీనిపై భగ్గుమన్న బొడ్డు వర్గీయులు అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడినే ఏకంగా నిలదీశారు. ఆ పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి బత్తుల బలరామృష్ణకు అండగా నిలిచామని, ఎన్నికల్లో ఆయన విజయానికి శ్రమించామని. కానీ, అధికారంలోకి రాగానే తమను కాదని, తనకు చిడతలు కొట్టే వారిని ఎమ్మెల్యే చేరదీస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చివరకు కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా చేపట్టిన సొసైటీ ప్రెసిడెంట్, ఆలయ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ భజనపరులకు, తన అనుచరులకే అందలం వేస్తున్నారంటూ జనసేనలోని ఓ వర్గం మండిపడుతోంది. పట్టం కట్టారిలా.. నాతిపాము దొరబాబుకు రాజానగరం సొసైటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గళ్ల రంగా భార్యకు సైతం పదవి ఇచ్చారు. ముక్క రాంబాబు భార్యకు కోరుకొండ ఏఎంసీ డైరెక్టర్, బత్తుల గోపాలకృష్ణకు కోరుకొండ సొసైటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. యర్రంశెట్టి శ్రీనుకు పార్టీలో కీలక పదవి ఇచ్చినట్లు సమాచారం. దేవన దుర్గాప్రసాద్(డీడీ)కు కోరుకొండ పీఏసీఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. వాకపల్లి రాజు, సైతిని చల్లారావుకు సైతం నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యే అల్లుడు తోట అనిల్ వాసుకు సైతం పదవి కట్టబెట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని, పార్టీ కోసం ఏనాడూ కృషి చేయని ఇటువంటి వారికి పదవులు ఎలా ఇస్తారని అసమ్మతి వర్గ్గీయులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో సైతం వారి కే ప్రాధాన్యం కల్పించడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీకి సంబంధం లేని, రాజకీయం తెలియని నేతలకు పదవులు కట్టబెట్టడంపై అసమ్మతి వర్గం లోలోపల మండిపడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ వారు సవాల్ విసురుతున్నారు.బీజేపీకి జెల్ల మూడో దశ నామినేటెడ్ పదవుల భర్తీలో బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపారు. టీడీపీలోనే నామినేటెడ్పై ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితుల్లో బీజేపీకి ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, తమ తోడ్పాటు తో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. మద్యం, ఇసుక వ్యాపారాలన్నీ టీడీ పీ నేతలకే కట్టబెట్టారని, కనీసం నామినేటెడ్ పద వుల్లోనైనా తమకు న్యాయం చేయకపోతే ఎలాగ ని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నీటి సంఘాలు, సొసైటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయగా, వాటిలో బీజేపీకి ఒక్క సొసైటీ చైర్మన్ పదవి మాత్రమే దక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
పట్టాల పండగకు రెడీ
● నేడు నన్నయ స్నాతకోత్సవం ● చాన్సలర్ హోదాలో పాల్గొంటున్న గవర్నర్ ● వర్సిటీలో పూర్తయిన ఏర్పాట్లు నన్నయ వర్సిటీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (ఫైల్)వర్సిటీ ముఖద్వారంరాజానగరం: తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం పట్టాల పండగ జరగనుంది. గతంలో 2024 జనవరిలో వర్సిటీ 13, 14, 15వ స్నాతకోత్సవాలు నిర్వహించారు. ఆ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో పాల్గొన్నారు. మళ్లీ రెండేళ్ల తరువాత నేడు జరుగుతున్న 16, 17వ స్నాతకోత్సవాల్లో కూడా ఆయనే చాన్సలర్ హోదాలో పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 722 మందికి పట్టాల ప్రదానం 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో నన్నయ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ 6,113 మంది, అండర్ గ్రాడ్యుయేషన్ 45,337 మంది పూర్తి చేశారు. అయితే, మొత్తం ఈ 51,450 మందికి గాను ఇప్పటి వరకూ 722 మంది మాత్రమే ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. భద్రత కట్టుదిట్టం గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో వర్సిటీ, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గవర్నర్ విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ప్రాంగణంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నన్నయ యూనివర్సిటీకి చేరుకుని, స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు జీజీయూకు చేరుకుని హెలికాప్టర్లో తిరిగి విజయవాడ పయనమవుతారు. హెలీపాడ్, వర్సిటీలో స్నాతకోత్సవం జరిగే ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లను ఎస్పీ నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్.శివరాముడు, గవర్నర్ భద్రతా సిబ్బంది గురువారం పరిశీలించారు. భద్రపరమైన అంశాలపై జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, గవర్నర్ సెక్యూరిటీ అధికారులతో చర్చించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ఎస్పీ నరసింహ కిషోర్, ఆర్డీఓ శివరాముడు, గవర్నర్ భద్రతా సిబ్బంది తదితర ఉన్నతాధికారులు వర్సిటీ ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు. ట్రయల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పండగలా నిర్వహించుకుందాం నన్నయ యూనివర్సిటీ 16, 17 స్నాతకోత్సవాన్ని పండగలా నిర్వహించుకుందాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ వేడుకల్లో వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, జాతీయ భద్రతా మండలి మాజీ సలహాదారు ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి తదితరులు పాల్గొంటున్నారు. – ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైఎస్సార్ చేతుల మీదుగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల స్వప్నం ఆదికవి నన్నయ యూనివర్సిటీ. సంస్కృతీ సాహిత్యాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం సమీపాన రాజానగరం మండలం వెలుగుబంద వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఈ వర్సిటీకి భూమి పూజ చేశారు. తద్వారా ఈ ప్రాంత ప్రజల కలను ఆయన సాకారం చేశారు. మొత్తం 98 ఎకరాల విస్తీర్ణంలో పదహారో నంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ యూనివర్సిటీ అచిరకాలంలోనే స్వశక్తితో అభివృద్ధి సాధిస్తూ, అందరి ప్రశంసలూ అందుకుంటూ, 19 వసంతాలు పూర్తి చేసుకుంది. విద్యాసుమాలు విరబూస్తోంది. ఈ వర్సిటీకి అనుబంధంగా 440 కళాశాలలున్నాయి. ఇప్పటికే 12బితో పాటు ఐఎస్ఓ, ఏఐసీటీఈ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) బి+ వంటి గుర్తింపులను ఈ విశ్వవిద్యాలయం దక్కించుకుంది. అలాగే గ్రీన్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్, జెండర్ సెన్సిటైజేషన్ వంటి గుర్తింపులతో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది. -
రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
తాళ్లపూడి/సాక్షి నెట్వర్క్: మహిళలను కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన పలువురు నాయకులు కొవ్వూరులో ఎస్సై వంశీ అలెగ్జాండర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసభ్యకర వ్యాఖ్యలను రాధాకృష్ణ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. గతంలో సైకిల్పై తిరగిన రాధాకృష్ణ మీడియా ముసుగులో నేడు వేల కోట్ల రూపాయలు ఏవిధంగా సంపాదించారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, వారి భార్యలపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర కార్యదర్శులు పిట్టా శ్రీనివాస్, వల్లభశెట్టి శ్రీనివాస్, తాళ్లపూడి మండల కన్వీనర్ కొలిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టా ఏడుకొండలు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండపేట, అనపర్తి, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, గోపాలపురం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పేపర్, చానల్ ఉన్నాయి కదా అని పాత్రికేయ విలువలను తుంగలో తొక్కి, ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా, రాసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
12న రోల్బాల్ జిల్లా స్థాయి పోటీలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఈ నెల 12న దానవాయిపేట గాంధీపురం పార్కులోని స్కేటింగ్ రింక్లో జిల్లా స్థాయి రోల్బాల్ పోటీ లు, ఎంపికలు నిర్వహిస్తున్నారు. జిల్లా రోల్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై.రుద్రశ్రీ మహశ్వి, జి.అప్పారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 25, 26 తేదీల్లో పిడుగురాళ్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి ఉన్న వారు 90145 18799 నంబరులో సంప్రదించాలని సూచించారు. హుండీ ఆదాయం రూ.4.31 లక్షలు పెరవలి: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం వచ్చింది. అధికారులు, బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో హుండీలను గురువారం తెరిచి, 43 రోజులకు గాను ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4,25,969, అన్నదాన హుండీ ద్వారా రూ.5,089 కలిపి మొత్తం రూ.4,31,058 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని, దీనికి దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గొర్ర గేదె సంచారంగోకవరం: మండలంలోని తిరుమలాయపాలెం అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం గొర్ర గేదె సంచరించింది. రంపయర్రంపాలెం, తిరుమలాయపాలెం ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతూండగా కొందరు ప్రయాణికులు గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గొర్ర గేదె సంచారం వార్త గుప్పుమనడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో గొర్ర గేదెలు సంచరించిన దాఖలాలు లేవని, అది దారి తప్పి ఇక్కడకు ఎలా వచ్చిందనే దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.12న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తుని రూరల్: హంసవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న జరుగుతుందని ఎంఈఓ పరవాడ గీతాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మోడల్ స్కూల్లోనే ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 157 మంది విద్యార్థులు వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, గంట ముందుగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
చాగల్లు: విద్యుదాఘాతంతో చిక్కాలపాలెం గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని చిక్కాలపాలెం గ్రామానికి చెందిన బొంతు వంశీ (25) కొబ్బరికాయల దింపు కార్మికుడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ రైతు కొబ్బరి తోటకు వెళ్లి కొబ్బరి కాయలు దింపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న కొబ్బరి ఆకు నరికి కింద పడవేసే సమయంలో, కొబ్బరి ఆకుకు విద్యుత్ తీగ తగిలి, ఆకు గుండా వంశీకి విద్యుత్ ప్రవహించడంతో, షాక్ తగిలి చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. తోటి కూలీలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే వంశీ చనిపోయాడు. తల్లి బొంతు ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా మృతి చెందిన వంశీ అవివాహితుడు. ఫోర్జరీ కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు తుని రూరల్: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన ముగ్గురికి ఫోర్జరీ కేసులో తుని జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.పదివేల చొప్పున జరిమానా విధించినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి గురువారం తెలిపారు. 2019లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంలో భాగంగా కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించిందన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో నష్టపరిహారం తీసుకున్న వీరిపై అప్పటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్యూటీ కలెక్టర్ కె.సుధారాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎస్సై సుధాకర్ విచారణ చేశారన్నారు. ముద్దాయిలు అప్పన్న వీరలక్ష్మి, చిలకమర్తి సూర్యవతి, అప్పన్న రంగారావులపై నేరం రుజువైంది. విచారణ కాలంలో రంగారావు మృతి చెందగా వీరలక్ష్మి, సూర్యవతిలకు శిక్ష, జరిమానా విధించినట్టు వివరించారు. -
అత్యుత్తమ వైద్యం
లక్షణాలను బట్టి సమస్య మూల కారణానికి చికిత్స చేస్తూ, తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందే అత్యుత్తమ వైద్యం హోమియోపతి. – డాక్టర్ కొప్పిరెడ్డి రామకృష్ణ, బీహెచ్ఎంఎస్, ఎండి, ప్రఖ్యాత హోమియో వైద్యులు అపోహలు తొలగిస్తున్నాం వైద్య శిబిరాల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలు ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. హోమియో వైద్యం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిస్తున్నాం. –డాక్టర్ పీవీఎస్ చౌదరి, సూపరింటెండెంట్, డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల, రాజమహేంద్రవరం పరిశోధన అవకాశాలు లేవు వ్యాధి మూలాలను తొలగించి నయం చేసేలా మందులు ఇవ్వడం హోమియో వైద్యం ప్రత్యేకత. హోమియో వైద్య రంగానికి దేశంలో సరైన పరిశోధన అవకాశాలు లేవు. – చల్లా రవికుమార్, హోమియో వైద్యులు, మండపేట -
త్రిరత్న బుద్ధ విహార్ అపురూపం
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బౌద్ధ పరిమళాలు విరజిమ్ముతున్న త్రిరత్న బుద్ధ విహార్ ఒక అపురూప ఆధ్యాత్మిక కేంద్రమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు భీమారావు యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. కోనసీమ పర్యటనకు వచ్చిన ఆయన అమలాపురంలో శ్రీరత్న బుద్ధవిహార్ను గురువారం సందర్శించారు. తొలుత తాత అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహానికి వ్యవస్థాపకులు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. యశ్వంత్ అంబేడ్కర్కు పంచశీల కండువా మెడలో వేసి గొల్లపల్లి స్వాగతం పలికారు. బుద్ధ విహార్ లైబ్రరీని యశ్వంత్ అంబేడ్కర్ పరిశీలించారు. బుద్ధ విహార్ నిర్మాణం గురించి వ్యవస్థాపకులు గొల్లపల్లిని అడిగి తెలుసుకున్నారు. కోనసీమలో బౌద్ధమత ప్రచారం చేస్తున్న గొల్లపల్లిని అభినందించారు. తాను ఇప్పటివరకు ఇంత అద్భుతమైన బుద్ధ విహార్ను, బుద్ధుని విగ్రహాన్ని చూడలేదన్నారు. అనంతరం బుద్ధుని విగ్రహం వద్ద బౌద్ధ వందనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. సెక్రటరీ జనరల్ డీబీ లోక్, చైర్మన్ నాగ బత్తుల ప్రసాదరావు, ప్రతినిధులు జంగా బాబురావు, ఎంఏకే భీమారావు, పినిపే సత్యనారాయణ, గెడ్డం సురేష్బాబు కోడూరు రామ్మూర్తి, కాశి వెంకట్రావు, సాపే సత్యనారాయణ, దోనిపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు భీమారావు యశ్వంత్ అంబేద్కర్ -
జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు దినేష్ ప్రసాద్
ఏకగ్రీవంగా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికఅంబాజీపేట: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ముక్కామల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జి.దినేష్ప్రసాద్ ఎంపికై నట్టు హెచ్ఎం ఎం.శ్రీహరిప్రసాద్ తెలిపారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సబ్ జూనియర్స్ 74 కేజీల విభాగంలో దినేష్ ప్రసాద్ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. త్వరలో అమలాపురంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటాడన్నారు. దినేష్ప్రసాద్తో పాటు తర్ఫీదు నిచ్చిన పీడీ ముత్యాల పవన్కిషోర్ను డీఈవో పి.నాగేశ్వరరావు, డీవైఈఓలు కాండ్రేగుల వెంకటేశ్వరరావు, పి.రామలక్ష్మణమూర్తి, డ్రిస్టిక్ట్ ఎగ్జామినేషన్ సెక్రటరీ బి.హనుమంతరావు అభినందించారు.పాత నేరస్తుడికి రిమాండ్ దేవరపల్లి: కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడు రామరాజుకు న్యాయమూర్తి గురువారం రిమాండ్ విధించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం డివిజన్లోని లక్కవరానికి చెందిన ఎండ్రగుత్తి రామరాజు(గంగరాజు) 2019లో దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం జైలు నుంచి బైయిల్పై వచ్చిన అతడు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో కొవ్వూరు రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇటీవల అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దేవరపల్లి ఎస్సై పి.మనోహర్, సిబ్బందితో కలిసి గురువారం లక్కవరంలో రామరాజును పట్టుకుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అమలాపురం టౌన్: కోనసీమ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్కు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో గురువారం జరిగిన జిల్లా సాధారణ సమావేశం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఎన్నికల అధికారిగా కుడుపూడి త్రినాథ్ వ్యవహరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి. ఏపీ ఎఫ్ఏ ఎన్నికల అబ్జర్వర్ జీఎస్ఎస్ పవన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎం.రంగారావు, ఉపాధ్యక్షుడిగా నరేంద్రకుమార్, కార్యదర్శిగా రాయుడు సత్యరాజు, సహాయ కార్యదర్శిగా టి.మమత, కోశాధికారిగా వైఎన్వీ కుమార్, గౌరవాధ్యక్షురాలిగా పెచ్చెట్టి విజయలక్ష్మి, గౌరవ చైర్మన్గా వై.సాయి వెంకట రమణారావు, సభ్యులుగా సీహెచ్. ప్రశాంత్, సూసై స్టీవెన్కుమార్, ఎస్.అక్షయ్రెడ్డి ఎన్నికయ్యారు. -
నత్త నయం
● సత్యదేవుని యంత్రాలయం సెంట్రల్ ఏసీ పనుల తీరు ● ఆరు నెలలుగా ఇబ్బందులు అన్నవరం: సత్యదేవుని యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ అమర్చే పనులు జరుగుతున్న తీరు నత్తను తలపిస్తున్నాయి. ప్రారంభించి ఆరు నెలలైనా ఈ పనులు పూర్తి కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. సత్యదేవుని ఆలయం రెండంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు కొలువై ఉంటారు. దిగువ అంతస్తును యంత్రాలయంగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి శ్రీమత్రిపాద్విభూతి వైకుంఠ నారాయణ యంత్రం ప్రతిష్ఠించి ఉంటుంది. దీనికి నలువైపులా విష్ణు పంచాయతనంలోని నాలుగు దేవతలు గణపతి, సూర్య భగవానుడు, అంబిక, శంకరుడు కొలువై ఉంటారు. ఈ యంత్రానికి మూడు పూటలా పూజలు చేస్తారు. ప్రతి రోజూ వేలాదిగా భక్తులు యంత్రాలయాన్ని కూడా దర్శించుకుంటారు. పలువురు రూ.50 టికెట్టుతో యంత్రాలయం లోపలకు వెళ్లి యంత్రానికి ప్రదక్షిణ చేస్తూ పంచాయతన దేవతలను దర్శించుకుంటారు. ఇదీ సమస్య యంత్రాలయంలో మూడుచోట్ల స్ల్పిట్ ఏసీలున్నాయి. అయితే, అవి తరచూ పాడవుతూండటంతో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. రామాలయం పక్కనే పాత అకౌంట్స్ కార్యాలయంలో జ్యోతిర్మయి వ్రతం కోసం గతంలో బిగించిన సెంట్రల్ ఏసీని తీసుకువచ్చి యంత్రాలయంలో ఏర్పాటు చేశారు. గత కార్తిక మాసంలోనే అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు యంత్రాలయం గోడకు రంధ్రం చేసి లేదా కిటికీ రంధ్రం ద్వారా కానీ బ్లోయర్ పైపులు ఆలయం వెలుపలకు తీసుకు రావాల్సి ఉంది. ఇక్కడే వచ్చింది. ఆలయం గోడలకు రంధ్రం చేయడం లేదా దక్షిణం వైపు కిటికీని తొలగించి బ్లోయర్లు ఏర్పాటు చేయడం శాస్త్ర సమ్మతం కాదంటూ వేద పండితులు అభ్యంతరం చెప్పారు. అయితే, సత్యదేవుని గర్భాలయంలో ఇదే విధంగా సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసినప్పుడు వెనుక కిటికీని తొలగించి బ్లోయర్ల గొట్టాలు వెలుపలకు తీసుకువెళ్లారు. యంత్రాలయంలో కూడా ఆవిధంగా చేస్తే సమస్య ఉండదు. కానీ, పండితుల అభ్యంతరాలు లేదా ఇతర కారణాలతో అధికారులు ఆవిధంగా చేయడం లేదు. దీంతో, ఆరు నెలలుగా సెంట్రల్ ఏసీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. అసలే వేసవి ఎండలు నానాటికీ తీవ్రమవుతూండటంతో యంత్రాలయం లోపలకు వెళ్లిన భక్తులు అక్కడి వేడికి ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేస్తున్నామనే పేరుతో గతంలో ఏర్పాటు చేసిన స్ల్పిట్ ఏసీలకు కూడా మరమ్మతులు చేయించడం లేదు. మున్ముందు ఎండలు మరింత ముదిరితే యంత్రాలయం లోపల నిమిషం కూడా ఉండే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధ్యమైనంత త్వరగా సెంట్రల్ ఏసీ పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. త్వరలోనే పూర్తి చేయిస్తాం యంత్రాలయంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సెంట్రల్ ఏసీ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తాం. బ్లోయర్ పైపులు వెలుపలకు తేవడానికి కిటికీ తొలగించేందుకు ఉన్న అభ్యంతరాలపై వేద పండితులతో చర్చిస్తాం. అవసరమైతే దేవదాయ శాఖ స్థపతితో కూడా చర్చించి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
నీచ రాతలపై ధర్నాగ్రహం
సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలను దేవతలుగా పూజించే దేశంలో మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలకు తక్షణం క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక కంబాల చెరువు సెంటర్ వద్ద ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి డౌన్డౌన్, రాధాకృష్ణ డౌన్డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వారూ భాగస్వాములైనట్టే.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, మహిళలపై అసభ్యంగా మాట్లాడితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఖండించకపోగా మద్దతు పలకడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. దీనినిబట్టి ఆ చెత్త పలుకు రాసింది రాధాకృష్ణే అయినా అందులో వారూ భాగస్వాములైనట్టేనని అన్నారు. బురద రాతలు రాసిన రాధాకృష్ణ.. నిరసన తెలిపేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు రాగానే బాత్రూములో దాక్కోవడం ప్రజలందరూ చూశారన్నారు. మహిళల జోలికొస్తే ఊరుకోం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, పత్రికా రంగంలో రాధాకృష్ణ అంత దుర్మార్గుడెవరూ ఉండరని విమర్శించారు. ఆయన తీరు పత్రికా రంగానికే కళంకమన్నారు. మీడియా ముసుగులో రాధాకృష్ణ కొత్త పలుకు కాదు చెత్త పలుకు రాస్తున్నారని, ఆయన మహిళలను కించపరిచిన పచ్చ మీడియా విలన్ అని అన్నారు. హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వేలాది మంది వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాధాకృష్ణ సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు, లోకేష్కు డప్పు కొట్టుకున్నా అభ్యంతరం లేదని, వైఎస్సార్ సీపీ నేతలు, మహిళల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛ ముసుగులో అనుచితమైన, దుర్మార్గమైన చెత్త రాతలు రాయడం మహిళల మనోభావాలను కించపరచడమేనని మండిపడ్డారు. ఖబడ్దార్ వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడితే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు, లోకేష్ ఎవరైనా సరే ఖబడ్దార్.. నాలుకలు తెగ్గోస్తామని హెచ్చరించారు. దళిత మహిళ హోం మంత్రిగా ఉన్నా రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. భార్యను చెల్లిగా భావించి మళ్లీ పెళ్లి చేయాలంటూ రాధాకృష్ణ చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఆవేదన చెందారు. అంతకు ముందు ఆమె స్థానిక ప్రకాష్ నగర్లోని నివాసం నుంచి వందలాది మంది, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా కంబాలచెరువు సెంటర్కు చేరుకున్నారు. పిచ్చి రాతలు మానుకోవాలి మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహిళలను, వైఎస్సార్ సీపీ శ్రేణులను కించపరుస్తూ ఎల్లో మీడియాలో పిచ్చి రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జర్నలిజానికి కళంకం తేవడమేనని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, పవన్, లోకేష్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాధాకృష్ణది జర్నలిజం కాదు.. ముమ్మాటికీ బ్రోకరిజమేనని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వైఎస్సార్ సీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అడుగుడుగునా అడ్డంకులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వందలాదిగా పోలీసు బలగాలు మోహరించాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసనలో పాల్గొనకుండా హౌస్ అరెస్టులు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా.. ఇంకో పని లేదన్నట్టు డీఎస్పీ స్థాయి నుంచి ఎస్సైల వరకూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడమేమిటని వైఎస్సార్ సీపీ శ్రేణులు నిలదీశాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, గొందేసి శ్రీనివాస్రెడ్డి, నక్కా రాజబాబు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, వక్ఫ్బోర్డ్ మాజీ చైర్మన్ ఆరిఫ్, పోలు విజయలక్ష్మి, అడపా అనిల్, గుర్రం గౌతమ్, వాసంశెట్టి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం ఫ ఆ పత్రిక కార్యాలయం వద్ద నిరసన ఫ మహిళలకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఫ పత్రికా రంగానికి రాధాకృష్ణ కళంకమని ధ్వజం -
రేపు గవర్నర్ రాక
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలనను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని హెలిప్యాడ్కు ఉదయం 10.45 గంటలకు చేరుకుంటారు. స్వల్ప విరామం అనంతరం, 11 గంటలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చేరుకుని, మధ్యాహ్నం 12.05 గంటల వరకూ నిర్వహించే 16, 17వ సంయుక్త స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అతిథి గృహంలో స్వల్ప విరామం అనంతరం, ఒంటిగంటకు హెలికాప్టర్లో తిరిగి విజయవాడ బయలుదేరుతారు. కనకదుర్గమ్మ చైత్ర మాసోత్సవాలు ప్రారంభం అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి చైత్రమాస ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో పండితులు కలశ స్థాపన, మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించి, ఘనంగా పూజలు చేశారు. రుత్విక్కులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం, రుత్విక్కులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ గరగల సంబరం నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 17న అమావాస్య నాడు జరిగే చండీహోమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా, కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా అమ్మవారికి బుధవారం చండీహోమం నిర్వహించారు. జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక అమలాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో మండలం ఇందుపల్లి, సాకుర్రు హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో అమలాపురంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. 53 కేజీల విభాగంలో ఇందుపల్లి విద్యార్థులు సీహెచ్ సత్య గోపాల్, 56 కేజీల విభాగంలో బి.బాలాజీ, సాకుర్రు పాఠశాల నుంచి ఎ.అవినాష్ ప్రతిభ సాధించారు. డీఈఓ పి.నాగేశ్వరరావు తదితరులు విజేతలను అభినందించారు. -
ఫలితాల కోసం నిరీక్షణ
రాయవరం: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 6న ముగిసింది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. 2023 వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం రాజమహేంద్రవరంలో నిర్వహించేవారు. జిల్లాల పునర్విభజన అనంతరం 2024 నుంచి కొత్త జిల్లాల వారీగా మూల్యాంకనం ప్రారంభమైంది. గత ఏడాది నుంచి స్పాట్ కేంద్రంలోనే స్కానర్లు ఏర్పాటు చేసి, మార్కులను అప్లోడ్ చేయడం ప్రారంభించగా, ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురాల్లో నిర్వహించిన స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్కు చెందిన 6,64,900 జవాబు పత్రాలు వచ్చాయి. వీటిని 16 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఆఫీసర్లుగా ఆయా జిల్లాల ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారులు ఐ.శారద (తూర్పు గోదావరి), వి.కేశవరావు (కాకినాడ), చంద్రశేఖరబాబు (కోనసీమ) వ్యవహరించారు. స్పాట్లోనే మార్కుల నమోదు గతంలో మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్) విడదీసి బండిల్స్గా ఇంటర్ బోర్డుకు పంపించేవారు. అక్కడ బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఓఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, మార్కుల నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించేవారు. ఈ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తగ్గించేందుకు 2024 నుంచి ప్రతి స్పాట్ కేంద్రానికీ స్కానర్ అందజేశారు. విద్యార్థికి నష్టం జరగకుండా స్కానింగ్ అనంతరం మార్కుల నమోదును మరోసారి నిర్ధారించుకున్నారు. మూల్యాంకనం అనంతరం స్కానర్తో మార్కుల నమోదు ప్రక్రియను ఇక్కడే చేపట్టడం ద్వారా ఫలితాలను అత్యంత వేగంగా విడుదల చేసే ఏర్పడింది. ఈ నెల 12న ఇంటర్ పలితాలు వచ్చే అవకాశముందని అధ్యాపకులు, విద్యార్థులు భావిస్తున్నారు. అయితే, ఫలితాలు ప్రకటించే తేదీని ఇంటర్ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మూల్యాంకనం జరిగిందిలా.. రాజమహేంద్రవరం స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఇంటర్ జనరల్ ఫస్టియర్ 96,529, సెకండియర్ 1,00,726, ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 62,450, సెకండియర్ 53,103 కలిపి మొత్తం 3,12,808 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. కాకినాడ కేంద్రంలో 2,18,977 జవాబు పత్రాల మూల్యాంకనం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఫస్టియర్ 65,829, సెకండియర్ 67,286 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా మొత్తం 2,763 మంది సిబ్బంది పాలు పంచుకున్నారు. పూర్తి పారదర్శకంగా.. ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి పారదర్శకంగా, అత్యంత వేగంగా నిర్వహించాం. జిల్లాల పునర్విభజన అనంతరం అదే జిల్లాలో స్పాట్ నిర్వహించడం వలన అన్ని క్యాడర్లపై ఒత్తిడి తగ్గింది. ఉన్నతాధికారులు నిర్దేశించిన సమయానికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయగలిగాం. – ఐ.శారద, ప్రాంతీయ పర్యవేక్షకులు, ఇంటర్మీడియెట్ బోర్డు, రాజమహేంద్రవరం ఫ ముగిసిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ఫ జిల్లాలో 6.65 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఫ ఇక అందరి దృష్టీ ఫలితాల పైనే -
వివాహిత ఆత్మహత్య
గండేపల్లి: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పపడినట్టు ఎసై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని యల్లమిల్లికికి చెందిన జుత్తుక స్వర్ణకుమారికి (19) రెండేళ్ల క్రితం రంగంపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన మందనక్క ప్రసాద్ కుమార్తో ప్రేమ వివాహమైంది. నాటి నుంచి ఆమె భర్త, అత్త, చిన మామగారు కలిసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి పుట్టింటికి యల్లమిల్లి వచ్చిన ఆమెతో భర్త గొడవపడి వెళ్లినప్పటి నుంచి ఆమెను ముకుందవరం తీసుకు వెళ్లలేదన్నారు. నిత్యం వారు ఫోన్లో గొడవ పడేవారని మంగళవారం కూడా అదే జరగడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని స్వర్ణకుమారి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలియజేశారు. తహాసీల్దార్ శవ పంచనామ చేశారు. ఆమె తండ్రి జుత్తుక నూకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
సానబట్టి సెట్ చేస్తారు..
రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా మటుకు పేద కుటుంబాల వారే ఉంటారు. పదో తరగతి ఉత్తీర్ణత తరువాత ఏంచేయాలన్న విషయమై సరైన మార్గ నిర్దేశనం లేక కొందరు ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయ, ఇతర పనులకు వెళ్తుంటే.. మరికొందరు ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సులపై దృష్టి సారించలేక, శిక్షణ తీసుకునే స్తోమత లేక చదువుకు స్వస్తి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించలేని తల్లిదండ్రుల కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉచిత పాలిసెట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,461 మంది పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రారంభమైన తరగతులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. పరీక్ష ఎలా ఉంటుంది, ఎలా సన్నద్ధం కావాలి తదితర సందేహాలు నివృత్తి చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది ఇచ్చిన శిక్షణను ఉపయోగించుకున్న విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ చెబుతున్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగానే అందజేస్తున్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా మండలిలో నిపుణులైన అధ్యాపకులతో తయారు చేయించిన మెటీరియల్ పాలిసెట్కు ఉపయోగపడనుంది. ఆబ్జెక్టివ్ తరహాలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలోని అంశాలతో కూడిన స్టడీ మెటీరియల్ ఆయా కళాశాలలకు ఇప్పటికే చేరుకుంది. ఈ నెల 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా, 23వ తేదీ వరకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.పరీక్షా కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా.. పరీక్షా కేంద్రం దరఖాస్తులు కాకినాడ 4,903 సామర్లకోట 633 పెద్దాపురం 1,229 తుని 1,205 రాజమహేంద్రవరం 4,194 ముక్తేశ్వరం 289 మండపేట 751 రామచంద్రపురం 930 అమలాపురం 2,327 ఎటపాక 179 చింతూరు 159 రంపచోడవరం 308 ప్రభుత్వ కళాశాలల్లో పాలిసెట్కు ఉచిత శిక్షణ పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో నిర్వహణ సబ్జెక్టుల వారీగా మెటీరియల్ అందజేత ఉమ్మడి జిల్లాలో 14,461 మంది దరఖాస్తు నేడు తుది గడువు -
కోర్టుల్లో న్యాయమూర్తులను భర్తీ చేయండి
అమలాపురం టౌన్: స్థానిక కోర్టుల్లో ఖాళీగా ఉన్న రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారు. జస్టిస్ మానవేంద్రరాయ్, జస్టిస్ బట్టు దేవానంద్లను స్థానిక బార్ న్యాయవాదులు బుధవారం కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని బార్ సభ్యులు తెలిపారు. ఈ నియామాకాలు జరిగితే సత్వర న్యాయ సేవలు అందుతాయని పేరొంటూ న్యాయమూర్తులను వారు సత్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కె.చిదంబరంతోపాటు స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్కుమార్, ఉపాధ్యక్షుడు యాలంగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దొమ్మేటి వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రం అంజేసినవారిలో ఉన్నారు. మరో 2 కోర్టులు మంజూరు అమలాపురం టౌన్: అమలాపురానికి మరో రెండు కోర్టులు మంజూరయ్యాయి. ఇటీవల ప్రభుత్వంలో కోర్టుల సంఖ్య పెంచుతూ విడుదల చేసిన జీవోలో అమలాపురానికి రెండు కోర్టులను మంజూరు చేసినట్లు పేర్కొంది. 14వ జిల్లా అదనపు కోర్టు, 2వ సివిల్ జూనియర్ జడ్జి కోర్టు మంజూరయ్యాయి. ఈ మేరకు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. -
యానాంలో నేడు పోలింగ్
యానాం: స్థానిక శాసనసభ నియోజకవర్గానికి గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి స్ధానిక ఎస్ఆర్కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్ నుంచి ఈవీఎంలను, పోలింగ్ సామగ్రిని ప్రత్యేక బస్సుల్లో రిటర్నింగ్ అధికారి శివరాజ్మీనా పర్యవేక్షణలో ఆయా పోలింగ్ బూత్లకు తరలించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 37,972 కాగా, అందులో మహిళలు 19,529 మంది, పురుషులు 18,4443 మంది ఉన్నారు. 2024లో ఓటర్లు 39,355 మంది ఉండగా ఇటీవలి ఎస్ఐఆర్ నిర్వహణలో సుమారు 1,383 మందిని వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. 42 ఇవీఎంలు.. 42 వీవీ ప్యాట్లు.. 230 మంది సిబ్బంది.. పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో 42 పోలింగ్ స్టేషన్లకు 230 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వీరు కాక సమస్యాత్మక ప్రాంతాల్లో 14 మంది పరిశీలకులను నియమించారు. సావిత్రినగర్, గిరియాంపేటల్లో 6 బూత్లకు ఆరు బృందాలను నియమించారు. 42 ఈవీఎంలు, 42 వీవీ ప్యాట్లను ఉంచనున్నారు. 14 రూట్లుగా వాటిని విజించారు. భద్రతకు 4 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉన్నారు. 13 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను పెంచినట్లు రిటర్నింగ్ అధికారి మీనా తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్, తమిళవెట్రి కజగం (టీవీకే) తదిర పార్టీలతో పాటు స్వతంత్రులు రంగంలో ఉన్నారు. 42 కేంద్రాలు, 230 మంది సిబ్బంది నియామకం ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి తరలింపు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు 13 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు -
రూ.9.8 లక్షల విలువైన మందుల దగ్ధం
● పీహెచ్సీలో అగ్నిప్రమాదం ● ఘటనా స్థలంలో డీఎంహెచ్ఓ పరిశీలన నల్లజర్ల: స్థానిక పీహెచ్సీలో బుధవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.9.8 లక్షల విలువైన మందులు దగ్ధమయ్యాయి. మందుల గొడౌన్ నుంచి మంటలు, పొగలు రావడం చూసిన స్థానికులు డ్యూటీ నర్స్ ప్రసన్నకు సమాచారం అందించారు. ఆమె వెంటనే డాక్టరు సిరాజుద్దీన్కు ఫోన్చేశారు. ఆయన సమాచారం మేరకు వచ్చిన అగ్నిమాపక దళం మంటలను అదుపు చేశారు. మందులతో పాటు ఫర్నిచర్ కాలి బూడిదైందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ కె.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి డాక్టర్ సిరాజుద్దీన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాలిపోయిన మందుల విలువ రూ.9.8 లక్షల వరకు ఉండవచ్చని అగ్నిమాపకదళాధికారి కొండబాబు తెలిపారు. కాగా చిన్నపిల్లల వ్యాక్సిన్లు, కుక్క, పాముకాటు ఇంజక్షన్లు వేరేగదిలో ఫ్రిజ్లో ఉండటంతో సురక్షితంగా ఉన్నాయని సీహెచ్ఓ నేమాని వెంకటశాస్త్రి తెలిపారు. -
నాణెం.. చరిత్రకు మరో కోణం!
ఒకొక్కరికి ఒక్కో సరదా. కొందరికి స్టాంప్స్ సేకరణ.. కొందరికి నాణేలు, కరెన్సీ, మరికొందరికి సిగరెట్టు పెట్టెలు, అగ్గిపెట్టెలు, రంగురంగుల గోళీలు, డ్రింకు సీసాల మూతలు వగైరా వగైరా. ఎవరిదగ్గర ఎక్కువ ఉన్నాయో చూసుకుని పది మందికి చెప్పుకొని.. చూపించుకుని మురిసిపోవడం ఇవన్నీ చిన్ననాటి ముచ్చట్లు. ఆ సేకరణలే పెద్దయ్యాక విలువైన ప్రవృత్తిగా మారుతుంటుంది. ఇలా స్థానిక నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ 1678వ సంవత్సరానికి చెందిన నెదర్లాండ్స్ ‘6 స్టూవియర్స్’ నాణెం మొదలుకుని భారత దేశం ఇటీవల విడుదల చేసిన రూ.వెయ్యి నాణెం వరకు తన ఖజానాలో నిక్షిప్తం చేశారు. ఆస్ట్రేలియా, పోలెండ్ తదితర దేశాలు విడుదల చేసిన త్రికోణ, చతురస్ర, వృత్తాకార, చిల్లు కాణీ ఆకృతుల్లోని నాణేలు ఆయన సేకరించారు. వీటిలో వెండి, రాగి, ద్విలోహ, నికెల్తో తయారు చేసిన నాణేలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హర్మూజ్ జల సంధి ఇటీవల వార్తలలోకి ఎక్కడంతో వివిధ ఓడల ముఖ చిత్రాలతో జల రవాణాపై ఆయా దేశాలు విడుదల చేసిన నాణేలను ఆయన ఆవిష్కరించనున్నారు. – అమలాపురం టౌన్ చరిత్ర గమనానికి ప్రతిరూపాలు నాణేలు పాతికేళ్లుగా సేకరిస్తున్న కృష్ణ కామేశ్వర్ 1678లో విడుదలైన నాణెం మొదలు 2025లో భారత్ విడుదల చేసిన రూ.వెయ్యి నాణెం వరకు సేకరణ 80 దేశాలకు చెందిన 240 జల రవాణా నాణేలు నిక్షిప్తం -
ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కాజులూరు: కాకినాడ–కోటిపల్లి రహదారిలో కాజులూరు మండలం గొల్లపాలెం శలపాక జంక్షన్ వద్ద బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని కరప మండలం గొర్రిపూడికి చెందిన గండి ఏసురత్నం (50) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏసురత్నం కూరగాయల వ్యాపారి. బుధవారం ఉదయం తన మోటారు సైకిల్పై కురగాయలు విక్రయానికి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి వస్తున్న అంజనా ట్రావెల్స్ బస్సు అతనిని ఢీకొంది. ఈ ఘటనలో ఏసురత్నంకు తీవ్ర గాయాలయ్యయి. స్థానికులు 108లో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న గొల్లపాలెం పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, బస్సును స్టేషన్కు తరలించారు. కాగా ఏసురత్నం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
265 తాబేళ్ల స్వాధీనం
ఆలమూరు: మండలంలోని చొప్పెల్లలో అక్రమంగా తరలిస్తున్న 265 తాబేళ్లను ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుని పంట కాలువలో సురక్షితంగా వదలిపెట్టారు. రావులపాలెం అటవీశాఖ సెక్షన్ అధికారి కె.రాంబాబు కథనం ప్రకారం కొందరు ద్వారపూడి, మండపేట, ఆలమూరు మీదుగా తాబేళ్లను ఒడిశాకు తరలిస్తున్నారనే సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి డిప్యూటీ రేంజ్ అఽధికారి రాజా ఆధ్వర్యంలో డీఎస్ఎన్ మూర్తి బృందం ఆ వాహనాన్ని వెంబడించింది. చొప్పెల్ల లాకుల వద్ద ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాన్ని పక్క పార్క్ చేసి నిందితులు తూర్పు డెల్టా ప్రధాన కాలువలో దూకి తప్పించుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనంలో తాబేళ్లను స్వాధీనం చేసుకుని జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీవీ ప్రసాదరావుకు, ఆలమూరు వెటర్నరీ కార్యాలయానికి సమాచారం అందించారు. వెటర్నరీ ఏడీ ఎల్.అనిత వాటిని పరీక్షించి ఇండియా ప్లాప్ సెల్ రకం జాతి తాబేళ్లుగా వాటిని గుర్తించి రావులపాలెం అటవీశాఖ కార్యాయానికి తరలించారు. వారి సూచనల మేరకు మధ్య డెల్టా ప్రధాన కాలువలో వాటిని సురక్షితంగా వదిలేశారు. -
కనకదుర్గమ్మకు సత్యదేవుని తరఫున సారె
అన్నవరం: సత్యదేవుని తోబుట్టువుగా రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారికి చైత్ర మాసోత్సవాల సందర్భంగా స్వామివారి తరఫున సిబ్బంది బుధవారం చీర, సారె సమర్పించారు. ఉదయం 8 గంటలకు సత్యదేవుని ఆలయం నుంచి దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాలతో ఊరేగింపుగా సారె తీసుకుని మెట్ల దారిన కనకదుర్గమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. ఊరేగింపునకు సిబ్బంది దూరం సారె సమర్పించే కార్యక్రమానికి సిబ్బంది అందరూ హాజరు కావాలని దేవస్థానం అధికారిక గ్రూపులో మంగళవారం మెసేజ్ పెట్టినా సిబ్బంది పట్టించుకోలేదు. సారెతో బయలుదేరేటప్పుడు సిబ్బంది, పండితులు 50 మంది వరకూ ఉండగా.. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరేసరికి 25 మంది కూడా లేరు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి, గంగబాబు, రమేష్, ముష్టి పురుషోత్తం, మరో నలుగురు పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు, ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి, సూపరిండెంట్ పీవీ రమణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, మరో పది మంది వ్రత పురోహితులు, పరిచారకులు మాత్రమే పాల్గొన్నారు. దేవస్థానంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలు పది మంది, హోంగార్డులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబీకుల పెళ్లి ఊరేగింపులో సైతం పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు పాల్గొంటారు. అటువంటిది కనీసం ఆ స్థాయిలో కూడా ఈ ఊరేగింపు నిర్వహించలేదు. దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది సుమారు 200 మంది, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది మరో 1,200 మంది ఉన్నారు. వీరు కాకుండా 250 మంది వ్రత పురోహితులు, వంద మంది నాయీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వీరిలో కనీసం 10 శాతం మంది పాల్గొన్నా కార్యక్రమం కళ కట్టేదని పలువురు అన్నారు. ఈ నెల 26 నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆ సందర్భంగా జరిగే ఊరేగింపుల్లోనైనా ఎక్కువ మంది సిబ్బంది పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీల విజేతగా కోనసీమ జిల్లా జట్టు
అమలాపురం టౌన్: విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల 4,5 తేదీల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ మెన్ చాంపియన్ షిప్ పోటీల్లో కోనసీమ జిల్లా టీమ్ (జట్టు) విన్నర్గా నిలిచి చాంపియన్ షిప్ను గెలుచుకుంది. ఈ పోటీల్లో అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్కు చెందిన పవర్ లిఫ్టర్ జె.జితేంద్ర దొర రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ రన్నర్ అప్ను సాధించాడని ఆ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. జితేంద్రతోపాటు జి.దినేష్ ప్రసాద్, కె.వరుణ్, కె.నాని, వి.సోమశేఖర్, వి.గోపి, బి.అప్పన్న, వై.ఇందిర, పి.వందన ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయి పతకాలను గెలుచుకున్నారన్నారు. స్థానిక జిమ్లో మంగళవారం ఉదయం జరిగిన అభినందన సభలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీల విజేతలను క్రీడా ప్రతినిధులు, జిమ్ ప్రతినిధులు ప్రశంసించారు. -
లారీ వెనుక డోర్ తగిలి క్లీనర్ మృతి
సామర్లకోట: గుడివాడకు చెందిన త్రిపూర్ణనపల్లి సురేష్ (35)ను అతను పని చేస్తున్న లారీయే మృత్యువుగా కబళించింది. పెద్దాపురం సీఐ వైఆర్కె శ్రీనివాసు కథనం ప్రకారం గుడివాడకు చెందిన వంశీ ట్రాన్సుపోర్టు లారీ క్లీనర్గా నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుడివాడ నుంచి చేపల లోడుతో పెద్దాపురం భాస్కర్ కాలనీ సమీపంలోని శ్రీ వీర వెంకటరమణ ప్లాంట్ వద్దకు మంగళవారం తెల్లవారు జామున ఒంటి గంట సమీపంలో వచ్చాడు. ఐసు లోడు వేసుకొని లారీ వెనుక డోర్లు వేస్తున్న సమయంలో సురేష్కు ఐరన్ డోర్ తగలడంతో కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు 108లో పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ చనిపొయినట్టు డాక్టర్లు తెలిపారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్సై మౌనిక దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి వివాహం కాలేదని తెలిపారు. పాము కాటుకు మహిళ మృతి కూనవరం: రెక్కాడితేనే డొక్కాడని ఆ కుటుంబాన్ని మృత్యువు ఆవహించింది. రోజు మాదిరి పొలం పనికి వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురైంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెదార్కూరు పంచాయతీ రేపాక గ్రామానికి చెందిన మడకం పొదమ్మ(49) మంగళవారం మిరప చేలో కాయలు కోసేందుకు వెళ్లింది. పనిలో నిమగ్నమైన ఉన్న సమయంలో ఆమె పాము కాటుకు గురైంది. విషయం తెలుసుకున్న తోటి వారు ఆస్పత్రికి తరలించిగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. పొదమ్మ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోదావరిలో స్నానానికి దిగి మహిళ మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గోదావరి నదిలో స్నానానికి దిగి మహిళ మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అన్నపూర్ణమ్మపేటకు చెందిన వాకలపూడి సరోజిని (55) స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగింది. ఆమె ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయింది. స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రెండో పట్టణ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. లారీ– బైక్ ఢీ నలుగురికి తీవ్ర గాయాలు అనపర్తి: మోటార్ బైక్ పై బంధువుల ఇంటికి వెళుతున్న వారిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్నవారంతా కింద పడి తీవ్ర గాయాలపాలయ్యారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి సాయితేజ రైస్ మిల్లు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన యాడిడ రేవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవతి తన భర్త రమేష్బాబు, కుమారుడు రూపేష్, కుమార్తె శ్రీనిత్యతో కలసి రంపచోడవరంలోని తమ బంధువుల ఇంటికి మోటార్ సైకిల్ పై బయలుదేరగా తొస్సిపూడిలోని సాయితేజ రైస్మిల్లు సమీపంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎదురుగా వచ్చి మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో అందరూ రోడ్డుపై పడిపోయారు. రమేష్బాబు కుడి కాలిపై తీవ్ర గాయమైంది. ఫిర్యాదుదారు రేవతికి తల కుడి వైపు గాయాలయ్యాయి. ఆమె కుమారుడు రూపేష్, కుమార్తె శ్రీనిత్య గాయపడ్డారు. వారిని అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవిచంద్ర తెలిపారు. -
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
అమలాపురం టౌన్: వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభల కర పత్రాలను అమలాపురం సర్ సీవీ రామన్ స్కూలులో ఆ సంఘం ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. మహాసభలు అమలాపురంలోని గంగరాజు ఫంక్షన్ హాలులో మే 6,7,8 తేదీల్లో జరుగుతాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు వెల్లడించారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన నాయకత్వ ప్రతినిధులు హాజరవుతారని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రాష్ట్ర మహా సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా రవణం వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా సూదా గణపతి, ప్రధాన కార్యదర్శిగా కారెం వేంకటేశ్వరరావులు వ్యవహరిస్తున్నారు. -
మరీ ధర్భరం
● పడిపోయిన కొబ్బరి ధరలు ● గతంలో వెయ్యి కాయలు రూ.32 వేలు ● నేడు రూ.14 వేలు ● రైతులు, వ్యాపారుల గగ్గోలు ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి సాగు – 70 వేల హెక్టార్లు ● గత నెల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు – 400 నుంచి 500 లారీలు ● ప్రస్తుతం సాగుతున్న ఎగుమతులు – 150 లారీలు మాత్రమే ● గోదావరి జిల్లాల్లో కొబ్బరి ధరను నిర్ణయించే మార్కెట్లు – అంబాజీపేట, పాలకొల్లు ● గతంలో ఎకరానికి దిగుబడి 1,000 కాయలు ● ప్రస్తుతం 1,500 నుంచి 1,700 ● ధర బాగున్నప్పుడు అమ్మకానికి సరకు కొరత ● నేడు సరకు ఉన్నా పలకని ధర ● మార్కెట్ను ముంచెత్తుతున్న కేరళ, కర్నాటక, తమిళనాడు కాయలు ● ఇతర రాష్ట్రాల సరకు రావడంతో భారీగా తగ్గిన ధరలు ● వేసవి కావడంతో బొండాలకు పెరిగిన డిమాండ్ ● ముదురు కాయ ఒక్కటి రూ.8 పలికితే బొండాం రూ.15 పెరవలి: కొబ్బరి మార్కెట్లో సగానికి సగం ధరలు తగ్గటంతో రైతులు కుదేలయ్యారు. నెల రోజుల క్రితం వరకు కొబ్బరికి మంచి ధర పలికింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల కాయలు మార్కెట్ను ముంచెత్తటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పండగల సీజన్ కూడా ముగియటం, వినాయక చవితి వచ్చేవరకు ఎటువంటి శుభ కార్యక్రమాలు లేకపోవటం వలన ధరలు తగ్గాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. మార్కెట్లో వేయి కాయలకు రూ.14 వేలు ధర పలుకుతున్నా, దింపు ఖర్చు, మోత, ఒలుపు, రవాణా చార్జీలంటూ రైతుల నుంచి వేయి కాయలను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు కాయ నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తున్నారు. రైతులే స్వచ్ఛందంగా కాయలు తీసి గుట్టగా వేస్తే తోట దూరాన్ని బట్టి వేయి కాయలను రూ.12వేల నుంచి రూ.13 వేలకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళా దగ్గర నుంచి ప్రారంభమైన ధరల పెరుగుదల ఆ ఏడాది సెప్టెంబర్ నెలఖారుకు రూ.32 వేలకు చేరింది. అక్టోబర్ నుంచి తగ్గుతూ నెలాఖరు నాటికి రూ.21 వేల వద్ద స్థిరంగా ఉండి, నవంబర్ నెల ప్రారంభం నుంచి ధర పతనం అవుతూ నేడు రూ.14 వేల వద్ద ఉంది. దిక్కుతోచని రైతులు, వ్యాపారస్తులు కొబ్బరి ధరలు తగ్గటంతో రైతులు, వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొబ్బరి కాయలు తీయకపోవటంతో చెట్ల నుంచి రాలిపోతున్నాయని రైతులు, తీస్తే ఎక్కడ ధర మరింత తగ్గిపోతుందోనని వ్యాపారస్తులు భయపడి కొనుగోలు జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికే కొనుగోలు చేసిన కాయలను ఎలా వదలించుకోవాలా అని ఆలోచనలో వ్యాపారస్తులు ఉండగా, ఎంతో కొంత వస్తుందిలే అనుకుని తీత తీద్దామన్నా ఎవరూ రావటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
చేనేత సమస్యలపై 13 నుంచి రిలే దీక్షలు
పెద్దాపురం (సామర్లకోట): చేనేత సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఈ నెల 13వ తేదీ నుంచి కాకినాడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు తెలిపారు. పెద్దాపురం చేనేత సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో చేనేత సహకార సంఘాలకు రూ.203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, నిలుపు చేసిన త్రిఫ్టు ఫండ్, స్కీం 30 శాతం రిబేటు, నూలు సబ్సిడీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్, 2018 రుణమాఫీ పథకాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, సంఘాలకు ముడి సరకులు ఇచ్చి, పని కల్పించాలని, సహకార సంఘాల వద్ద ఉన్న నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసమే ఈ నెల 13 నుంచి కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్నామని, వీటిని విజయవంతం చేయాలని వీర్రాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అల్లక రాజు, తూతిక సత్యనారాయణ, కట్టా రాజబాబు, వానపల్లి పురుషోత్తం, చింతా వీరభద్రరావు, బీరక వీరభద్రస్వామి పాల్గొన్నారు. -
అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు ఖరారు?
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకానికి రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్ ఛైర్మన్గా, మరో 16 మంది సభ్యులతో ట్రస్ట్బోర్డును నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై రెండు రోజుల్లో జీఓ విడుదల కానుందని సమాచారం. నూతన ట్రస్ట్బోర్డులో టీడీపీకి చెందిన రావిపాటి సత్యనారాయణ (గుంటూరు వెస్ట్), పర్వత సూర్యారావు (సురేష్), ధనేకుల సూర్య భాస్కరం, (ప్రత్తిపాడు), పాలచర్ల నాగేంద్రబాబు (జగ్గంపేట), తూము అప్పారావు (పిఠాపురం), ఎస్సీ వర్గానికి చెందిన హెచ్.రామాంజనేయులు (మడకశిర), తేలుగుట్ల అనాథమ్మ (ఒంగోలు), ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గోదేటి భగవత్ (రంపచోడవరం), రెడ్డి ఎరుకమ్మ (మాడుగుల), ఇముడుగపల్లి లోవకుమారి (తుని), యరగడపు బాబ్జీ (మండపేట), బండి లక్ష్మి (కై కలూరు), తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మి (గన్నవరం – కృష్ణా జిల్లా) ఉన్నారు. జనసేనకు చెందిన గెడ్డం అప్పారావు (బుజ్జి) (ఎస్సీ) (పాయకరావుపేట), తోలేటి శిరీష (పిఠాపురం), బీజేపీకి చెందిన కామర్స్ చిరంజీవి (అన్నవరం) నియమితులయ్యారు. గత ప్రభుత్వ ఫార్ములా కాపీ రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దేవస్థానం ట్రస్ట్బోర్డులో ఒకరిద్దరు మహిళలను తప్ప నియమించేవారు కాదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 16 మంది సభ్యులతో ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఏడుగురు మహిళలను సభ్యులుగా నియమించారు. ఆ ఫార్ములాను టీడీపీ కాపీ కొట్టి, ఇప్పుడు ఆరుగురు మహిళలను సభ్యులుగా నియమించింది. దాతలకేదీ అవకాశం? దేవస్థానానికి రూ.కోట్ల విరాళాలు సమర్పించిన దాతలను గతంలో ట్రస్ట్బోర్డు సభ్యులుగా నియమించేవారు. తాజా ట్రస్ట్బోర్డు నియామకంలో ఒక్క దాత కూడా లేకపోవడం గమనార్హం. ఫ వ్యవస్థాపక ధర్మకర్త అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు ఫ త్వరలో జీఓ! -
మాకు న్యాయం చేయండి
అగరబత్తీల ప్యాకింగ్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటి వద్దే ఉంటూ వేలకు వేలు సంపాదించండంటూ ప్రచారం చేసి అగరబత్తీల ప్యాకింగ్ పేరుతో వందల మందిని మోసం చేసి రూ.కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా నిరసన వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బాఽధితులంతా మంగళవారం మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఆయా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదని, బాఽధితులంతా రాజమహేంద్రవరం చేరుకుని నిరసన చేపట్టామన్నారు. దీంతో రాజమహేంద్రవరంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. అయితే సత్యసాయి ఎంటర్ ప్రైజస్ నిర్వాహకుడు మోహన్కృష్ణ ఫోన్, వాట్సాప్లలో అందరికీ టచ్లో ఉంటున్నాడని, పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్రాంచ్లు ఏర్పాటు చేసి మేనేజర్లను నియమించి కోట్ల రూపాయలు స్వాహా చేసి ఆ సొమ్ముతో భూములు కొనుగోలు చేశారన్నారు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని మోహన్ కృష్ణ అబద్దం చెబుతున్నాడని, సొమ్ము ఆలస్యంగా కొద్ది కొద్దిగా అందరికీ చెల్లిస్తానని చెప్పి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని తమను మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. దీనిపై తామంతా పోరాడతామని, పోలీసులు తమ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్రీటౌన్ సీఐ వి.అప్పారావు బాధితులతో మాట్లాడారు. కేసు నమోదు చేశామని, మోహన్కృష్ణ ఆచూకీ తెలుసుకుంటున్నామన్నారు. త్వరలోనే అతనిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. -
కాళ్లు కాలుతున్నా కార్పెట్లు బయటకు తీయరా?
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. చలువ పందిర్లు లేని చోట నేల మీద నడవాలంటే భక్తుల కాళ్లు కాలిపోతున్నాయి. భక్తులు కాళ్లు కాలకుండా నేల మీద పరిచేందుకు దేవస్థానం పది ఫుట్ కార్పెట్ బండిల్స్ కొనుగోలు చేసింది. అయితే వాటిని నేల మీద పరచడానికి బదులు పశ్చిమ రాజగోపురం లోపల ఉంచేశారు. ఉదయం పది గంటలకే 30 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతతో రత్నగిరి ఆలయ ప్రాంగణం వేడెక్కిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నెల రోజులుగా వందల సంఖ్యలో నవదంపతులు వారి బంధుమిత్రులు సత్యదేవుని ఆలయానికి విచ్చేస్తున్నారు. సంప్రదాయం అనుసరించి చెప్పులు లేకుండానే ఆలయానికి వెడుతున్నారు. వీరంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారి దర్శనం చేసుకుని పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చేటప్పటికి నేల కాలిపోయి ఉండడంతో నడవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పశ్చిమ రాజగోపురం ముందు కొంత వరకే కార్పెట్ ఉంది. రాజగోపురం నుంచి అన్నదాన పథకానికి వెళ్లాలంటే తారు రోడ్డుపై నడవాల్సి ఉంది. దీనిపై భక్తులు నడిచేందుకు వీలుగా తెల్లపెయింట్ వేసినా నాలుగు రోజులకే ఆ పెయింట్ వెలిసిపోయి అక్కడ కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంటోందని భక్తులు వాపోతున్నారు. పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు, దేవస్థానం బస్సులు ఆగే విశ్రాంతి షెడ్డు వరకు కార్పెట్ వేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. కార్పెట్లు ఉపయోగించండి స్వామీ...! నేల మీద పరిచే కార్పెట్ బండిల్స్ పది పశ్చిమ రాజగోపురం వద్ద అలంకార ప్రాయంగా పడి ఉన్నాయి. వీటిని భక్తుల కాళ్లు కాలకుండా నేల మీద పరిస్తే ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్ప వాటిని సీలు కూడా విప్పకుండా అలా ఉంచితే ఏమి ఉపయోగం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అడ్డే లేని రెడ్బుక్
● అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉద్రిక్తత ● అనుమతులు లేవని వైఎస్సార్ సీపీ నాయకుడి షెడ్డు కూల్చివేత ● అనుమతులు ఉన్నాయని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ● కార్యకర్తల అరెస్టు – అంబాజీపేట స్టేషన్కు తరలింపు ● పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి అయినవిల్లి/ అంబాజీపేట: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆక్రమణ తొలగింపు పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వైఎస్సార్ సీపీ నాయకుడు నిర్మించుకున్న ఒక పెద్ద షెడ్డును తొలగించేందుకు సిద్ధం కాగా.. అనుమతులు ఉన్నా ఎలా తొలగిస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్కు చెందిన రేకుల షెడ్డును పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కలిసి మంగళవారం తొలగించారు. ఏకంగా నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలు, భారీగా పోలీసు కానిస్టేబుళ్లను మోహరించి హంగామా సృష్టించారు. జేసీబీతో షెడ్డును తొలగించారు. ఇది అన్యాయమని ప్రశ్నించి, అధికారుల చర్యలను తప్పుపట్టి అడ్డుకున్న పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును, పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకుని పోయారు. ఈ సమయంలో పోలీస్, రెవెన్యూ అధికారులకు, వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షెడ్డు నిర్మించుకున్న స్థలానికి చెందిన రికార్డులు, పంచాయతీ తీర్మానం శ్రీనివాస్ పేరునే ఉన్నాయని అధికారులకు చెప్పారు. వీటిని తొలగించడం అన్యాయమని అడ్డుకున్నారు. షెడ్డు వద్ద ఆందోళనకు దిగారు. అయినప్పటికీ అధికారులు షెడ్డును కూల్చి వేయడంతోపాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు దౌర్జన్యంగా కార్యకర్తలను నెట్టి వేశారు. వారిని అక్కడ నుంచి అంబాజీపేట పోలీసు స్టేషన్కు తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది: జగ్గిరెడ్డి నిబంధనలు పాటించకుండా ఎంత మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో డీ నోటిఫై చేయకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నిర్మాణాలను ధ్వంసం చేయడం దారుణమని, దీనిపై న్యాయం కోసం పోరాడుతామనిౖ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ అనుమతులు లేకుండా షెడ్లను నిర్మించారని నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపించడం సమంజసం కాదన్నారు. మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటున్నారని, ఆ సంతకం ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపారా అని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా, నోటీసులు ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపుతోనే షెడ్డు కూల గొట్టారని జగ్గిరెడ్డి ఆరోపించారు. ప్రజలను సంరక్షించాల్సిన పోలీసులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ కూలీలు నివాసం ఉండే షెడ్లను ధ్వంసం చేయించడం దారుణమన్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో తగిన ప్రతిఫలం చవిచూస్తారని హెచ్చరించారు. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది: గన్నవరపు శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్ సీపీ పి.గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. శ్రీనివాస్ తనకు చెందిన గ్రామ కంఠం భూమిలో షెడ్ల నిర్మించి, సమీపంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలకు ఆశ్రయం కల్పించారన్నారు. అయినవిల్లి మండలంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని పట్టించుకోకుండా కక్ష పూరితంగా శ్రీనివాస్ కట్టడాలను భూస్థాపితం చేయడం దారుణమన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్ అయినవిల్లి మండలం నేదునూరు కౌశిక పక్కన భూమిని ఆక్రమించుకుని నివాస గృహాన్ని నిర్మిస్తున్నారని, దానిపై ఎందుకు చర్యలు లేవని ఆయన ప్రశ్నించారు. ఎంపీపీలు దొమ్మేటి వెంకటేశ్వరరావు, మార్గాని గంగాధర్, జెడ్పీటీసీ సభ్యురాలు బూడిద వరలక్ష్మి, మందపాటి కిరణ్ కుమార్, వాసంశెట్టి తాతాజీ, కొర్లపాటి కోటబాబు, గొల్లపల్లి డేవిడ్ రాజు, దొమ్మేటి దుర్గారావు, మైలా ఆనందరావు, మట్టపర్తి హరి, తోరం భాస్కరం, దొమ్మేటి వెంకట నరసింహం, చిట్టూరి రాధాభాయ్, చాట్ల రామారావు, కుసుమ వరలక్ష్మి పాల్గొన్నారు, పోలీసు స్టేషన్ ఎదుట జగ్గిరెడ్డి బైఠాయింపు కో ఆర్డినేటర్ శ్రీనివాసరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు అనుసరించిన కక్ష సాధింపు చర్యలు తక్షణమే విడనాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కె.జగన్నాధపురంలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న జగ్గిరెడ్డి పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసులతో చర్చించారు. ఏ నేరం చేశారని పోలీసులు కో ఆర్డినేటర్ను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో జగ్గిరెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్ అయినవారిని విడుదల చేస్తే గాని బయటకు వెళ్లేది లేదని భీష్మించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చంద్రబాబు ఆజ్ఞలకు తలవొగ్గి పనిచేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం నశించాలి, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, పోలీసుల జులుం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలు బయటకు వెళితే అరెస్టు అయిన వారిని విడుదల చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. -
గోదారికి రాని ధనప్రవాహం
సాక్షి, రాజమహేంద్రవరం: ‘గోదావరి మహా పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి. అందుకు అవసరమైన నిధులు, అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అతి త్వరలోనే నిధులు మంజూరవుతాయి. పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం గొప్పగా ప్రకటిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ప్రతి నెలా సమావేశం కావడం.. పుష్కర పనులపై సమీక్షించడంతోనే సరిపోతోంది. కానీ, పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన వివిధ పనుల కోసం అధికారుల ప్రతిపాదనలు పంపించి ఏడాది గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కిమ్మనడం లేదు. నేటికీ నయాపైసా విడుదలైన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టతా లేదు. వాస్తవానికి గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై నెలలో జరగనున్నాయి. అంటే, ఇక దాదాపు 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచీ ప్రారంభిస్తే తప్ప అప్పటికి అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం లేదు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పుష్కరాలు ప్రారంభానికి కొద్ది రోజుల ముందు హడావుడిగా పనులు చేపట్టి, నిధులు దిగమింగేందుకే ఇలా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పుష్కరాలకు నిధులివ్వకుండా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని.. కేంద్ర నిధుల పైనే ఆధారపడుతోందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపాదనలు పంపించినా.. నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న వాదన వినిపిస్తోంది. తొలుత రూ.1,578 కోట్లతో.. గోదావరి పుష్కరాలకు గత ఏడాది అప్పటి కలెక్టర్ ప్రశాంతి, అన్ని శాఖల జిల్లా అధికారులు విస్తృత కసరత్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఆమోదంతో పుష్కరాల నిర్వహణకు రూ.1,578 కోట్లు అవసరమని అప్పట్లో ప్రతిపాదనలు రూపొందించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే ఆ నిధులతో ఘాట్ల అభివృద్ధి, రోడ్లు, మురుగు కాలువల ఆధునీకరణ, యాత్రికులకు అవసరమైన సదుపాయాల కల్పన, క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్కు తీసుకోవాల్సిన పది రకాల పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిపాదించారు. అందుకయ్యే ఖర్చును కేటగిరీల వారీగా అంచనా వేసి, ప్రభుత్వానికి ప్రతిపాదదించారు. అయితే, ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. రెండోసారి రూ.2 వేల కోట్లకు పైగా.. పుష్కరాలకు సంబంధించి సీఎం చంద్రబాబుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పుష్కర పనుల జాబితాను సీఎంకు అధికారులు అందించారు. జిల్లావ్యాప్తంగా కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి సుమారు రూ.2,105.96 కోట్లతో రెండోసారి ఈ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులను మూడు దశలుగా విభజించి చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఈ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ నయాపైసా కూడా విడుదల చేయలేదు. అవగాహన లేమితో అవస్థలు పుష్కర పనుల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. గత పుష్కరాల్లో పని చేసిన అధికారులు, విశ్రాంత ఉద్యోగులను సంప్రదించి పనుల ప్రతిపాదనలు రూపొందించారు. వాటినే ప్రభుత్వానికి పంపారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం నగరానికి కోట్లాదిగా యాత్రికులు వస్తారు. ఈ నేపథ్యంలో రహదారుల విస్తరణ పనులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆక్రమణలు తొలగించి రోడ్లను వెడల్పు చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటి వరకూ రోడ్ల విస్తరణ చేపట్టలేదు. నగరపాలక సంస్థ పరిధిలో సాధారణ నిధులతో ఈ పనులు చేయడం లేదు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, దేవదాయ శాఖ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ తదితర శాఖలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ● ప్రభుత్వానికి ప్రతిపాదించాం గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. పుష్కర పనుల్లో భాగంగా ఇప్పటికే కొన్ని చేపడుతున్నాం. – రాహుల్ మీనా, కమిషనర్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ప్రతిపాదనల్లో కొన్ని ఇవీ.. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని 11,616 పనుల నిర్వహణకు గాను అధికారులు రూ.2,105.96 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిలో మచ్చుకు కొన్ని.. పనులు ప్రతిపాదించిన నిధులు (రూ.లక్షల్లో) రహదారులు 64,112.81 సీసీ రోడ్లు 9,163.24 బీటీ రోడ్లు 5,086.58 రోడ్లు, పరిహారం 48,382.99 మురుగు కాలువలు 19,571.94 నీటి సరఫరా 12,757.75 తాత్కాలిక విద్యుత్ సదుపాయం 7,749.00 పార్కులు, మరుగుదొడ్ల నిర్వహణ 4,194.35 తదితరాలు డివైడర్లు, ఫుట్పాత్ల నిర్వహణ 1,351.00 పార్కింగ్ ప్రదేశాలు 2,023.43 అద్దె వాహనాలకు 80.00 నూతన కట్టడాలు 6,700.00 వీఐపీ గెస్ట్హౌస్లు 500.00 ఘాట్ల నిర్వహణ 29,810.00 డిజాస్టర్ మేనేజ్మెంట్ 400.00 ఫ వచ్చే ఏడాదే పుష్కరాలు ఫ అభివృద్ధి పనులకు రూ.2,106 కోట్లతో ప్రతిపాదనలు ఫ ఏడాదైనా కిమ్మనని ప్రభుత్వం ఫ సమీక్షలకే ప్రజాప్రతినిధులు, అధికారులు పరిమితం ఫ నిధుల మంజూరుపై స్పష్టత కరువు ప్రస్తుతం అరకొర పనులే.. పుష్కరాల సందర్భంగా శాశ్వతంగా చేపట్టాల్సిన పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. యాత్రికుల సదుపాయాలు, వసతుల కల్పనపై కసరత్తు జరగాలి. ప్రధానంగా గోదావరి ఘాట్ల విస్తరణ, దగ్గరగా ఉన్నవాటి అనుసంధానం, కొవ్వూరు, నిడదవోలుల్లో ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో ఉన్న రాళ్లు తొలగించి, కొత్తవి అమర్చడం, వీఐపీ ఘాట్ వద్ద ఆధునికీకరణ, అప్పర్ రివర్ఫ్రంట్ పనులు మాత్రమే అరకొరగా జరుగుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. -
రేషన్ బియ్యం పట్టివేత
కాకినాడ రూరల్: రమణయ్యపేట బొందగుంట ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీఐ పెద్దిరాజు, సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దాడి చేశారు. ఈ దాడిలో సంచుల్లో ఉన్న పీడీఎస్ బియ్యంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు గమనించి పట్టుకున్నారు. నిందితుల నుంచి 57సంచుల్లో ఉన్న సుమారు 2,800 కిలోల బియ్యం, వ్యాన్, ఆటో, ఎలక్ట్రానిక్ తూకం కాటాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నిందితులు తుమ్మలపల్లి నాగబాబు, నందిపాటి సునీల్, గోపు నాగబాబు, గోపు రాజు, కందా నాగబాబును అరెస్టు చేసినట్టు సీఐ తెలియజేశారు. 1,200 కేజీల బియ్యం స్వాధీనం గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా దానిలో రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 18 బస్తాలలో రూ.55,800 విలువైన 1,200 కేజీల రేషన్ బియ్యంను, రూ.2 లక్షల విలువైన వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని పిఠాపురం ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దార్ కే నాగబాబు ఫిర్యాదు మేరకు పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ పాలిక సుధాకర్, బి ప్రత్తిపాడుకు చెందిన సరకు యజమాని వూట బుల్లిరాజులపై కేసు నమోదు చేసినట్లు గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
‘విజయదుర్గా వైభవం’ పుస్తకావిష్కరణ
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో మంగళవారం విజయదుర్గా వైభవం పుస్తకాన్ని పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) ఆవిష్కరించారు. పిఠాపురం గ్రామానికి చెందిన కోట శ్రీను(దత్తశ్రీను) రచించిన పుస్తకాన్ని గాడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రయయిత దత్తశ్రీను మాట్లాడుతూ పీఠంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకటకామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్యకనకదుర్గ, బుజ్జి, పీఠం పీఆర్వో వేణుగోపాల్ పాల్గొన్నారు. -
వేయి కాయలు రూ.8 వేలే
గతంలో మార్కెట్లో ధరలు బాగున్నప్పుడు వేయి కాయలకు రూ.20 నుంచి రూ.22 వేలు ఇచ్చేవారు. నేడు అదే కాయలకు రూ.8 వేలే ఇస్తున్నారు. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు అయిన కాడికి అమ్ముతున్నాం వ్యాపారస్తుడు చెప్పిన ధరకు అమ్ముతున్నాం. ఎక్కడికై నా వెళ్లి అమ్ముదామంటే అయిన కాడికి అడుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇచ్చింది తీసుకుంటున్నాం. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు కొనుగోలు చేయడం లేదు ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియటం లేదు. అందుకే కొనుగోలు చేయటం లేదు. – గొల్లకొటి వెర్రిబాబు, కొబ్బరి వ్యాపారి ఖండవల్లి -
భూగర్భ జలాలను పెంచాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రస్తుతం 20 మీటర్ల లోతులో ఉన్నాయని, వాటిని కనీసం 5 మీటర్ల పైకి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జలధార కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. గోపాలపురం, కోరుకొండ, అనపర్తి, రాజానగరం, నల్లజర్ల తదితర మండలాల్లో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉన్నందున ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జలధార కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్తో పాటు ఇతర కోర్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. మండలాల వారీగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు చొరవ తీసుకోవాలని, గ్రామం నుంచి డివిజన్ స్థాయి వరకూ సమన్వయంతో సాగితేనే భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి మండలంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల్లో చెరువులకు నీరు వచ్చే ఫీడర్ చానెల్స్, సబ్ చానెల్స్ను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని, చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలధార పనుల్లో 99 శాతం వరకూ ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం దుర్మార్గం అల్లవరం: గ్రామ పంచాయతీ గ్రేడు–3 కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఓ 91లో పేర్కొన్న రూ.28,280–89,720 గా ఉన్న వేతన శ్రేణిని రూ. 25,220–80,910 వేతన శ్రేణీగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా సచివాలయ ఉద్యోగులకు తీవ్రా అన్యాయం జరుగుతుందని ఇజ్రాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందన్నారు. రేషనలైజేషన్ పేరిట సచివాలయ ఉద్యోగులను కుదించి, మిగిలిన వారిని వేర్వేరు శాఖలకు బదలాయించడం, తాజాగా కార్యదర్శులు వేతన శ్రేణీని సవరించడం, ఉద్యోగుల పొట్టకొట్టడమేనని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగించి, రూ. 10 వేలు చేస్తామని ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది వలంటీర్లను తొలగించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయం వ్యవస్థను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందన్నారు. నేటి నుంచివైద్య ఉద్యోగుల నిరసనలు అమలాపురం టౌన్: ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైద్య ఉద్యోగులు తమ 29 సమస్యల (డిమాండ్ల) పరిష్కారాన్ని కోరుతూ జిల్లాలో బుధవారం నుంచి దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి పీవీవీ సుబ్బారావు ఈ దశల వారీ నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్కు యూనియన్ నేత సుబ్బారావు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లా వైద్య ఉద్యోగులు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు, తమ డిమాండ్లపై ఇప్పటికే వినతి పత్రం అందించారు. అమలాపురం, రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రులకు చెందిన దాదాపు 200 మంది వైద్య ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బుధ, గురువారాల్లో (8,9 తేదీల్లో) ఈ రెండు రోజులూ వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతారు. ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులూ ఓ గంట సేపు ఆయా ఆస్పత్రుల వద్ద ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు నూరు శాతం గ్రాస్ జీతం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదిలో 35 రోజుల సెలవులు, కనీస వేతనం రూ.28 వేలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. -
ఉరుములు, పిడుగులతో కుండపోత
రాజమహేంద్రవరం రూరల్/దేవరపల్లి/రాయవరం: జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. దీంతో, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, రాయవరం, కొవ్వూరు డివిజన్లోని పలు మండలాల్లో హఠాత్తుగా వర్షం కురిసింది. మండుతున్న ఎండలతో కొన్నాళ్లుగా ఆపసోపాలు పడుతున్న ప్రజలు కాస్త సేద తీరారు. రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్, హుకుంపేట జంక్షన్, రైల్వే స్టేషన్, వీఎల్ పురం తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీ ఎత్తున నీరు ప్రవహించింది. దీంతో, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, పెరవలి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకూ ఉరుములు, పిడుగులతో వాన దిమ్మరపోసింది. భీకరంగా వచ్చిన పిడుగుల శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గౌరీపట్నం, దుద్దుకూరు, ఐ.పంగిడి గ్రామాల్లో గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారి (పాతది) పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సుమారు 3 దుక్కుల వర్షం కురిసినట్టు రైతులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షానికి పలు గ్రామాల్లో వరి చేలు, అక్కడక్కడ అరటి తోటలు నేలకొరిగాయి. కళ్లాల్లో ఎండబెట్టిన మిర్చి, ధాన్యం, పసుపు, మొక్కజొన్న కండెలు తడిసి ముద్దయ్యాయి. దీంతో, రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొగాకు తోటల్లో నీరు చేరడంతో నాణ్యత, దిగుబడి దెబ్బ తింటాయని రైతులు అంటున్నారు. -
మరణంలోనూ కలిసే పయనం
కొడుకు కౌన్సెలింగ్కు బయలుదేరి.. తిరిగి రాని లోకాలకు.. ధవళేశ్వరం/కొణిజర్ల/కపిలేశ్వరపురం: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ దంపతులు కలలు కన్నారు. ఆ తపనతో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గం మధ్యలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సహోద్యోగుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఉండమట్ల వీర్రాజు (42) ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్ సమీపాన గాదాలమ్మ నగర్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య వీరశైలజ (37), కుమారుడు యశ్వంత్ ఉన్నారు. కుమారుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అతడిని హైదరాబాద్లో ఇంటర్మీడియెట్లో జాయిన్ చేయాలని తల్లిదండ్రులు భావించారు. తద్వారా మంచి భవిష్యత్తును అందించాలని తపన పడ్డారు. కళాశాలలో సీటు కౌన్సెలింగ్ కోసం, బంధువులను కలిసేందుకు సోమవారం తెల్లవారుజామున కుమారుడితో కలిసి వీర్రాజు, వీరశైలజ దంపతులు కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్లలో సాగర్ కాలువ బ్రిడ్జి పైన వద్ద వారి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోయింది. ఆ లారీ కిందకు కారు దూసుకుపోయింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జికి అడ్డంగా తిరిగింది. అదే సమయంలో వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య వీర శైలజ తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కు పోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో ఆ వాహనాలను విడదీసి వీర్రాజును, లారీ డ్రైవర్ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా వీర్రాజు మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే వీర్రాజు దంపతులు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ధవళేశ్వరం పంచాయతీ ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీర్రాజు మృతి పట్ల పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్రావు, సిబ్బంది సంతాపం తెలిపారు. వీర్రాజు గతంలో మండపేట మండలం ఏడిద పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. అంగరలో విషాద ఛాయలు వీర్రాజు దంపతుల మరణ వార్త ఆయన స్వగ్రామం అంగరలో విషాదం నింపింది. వీర్రాజు తండ్రి ఉండమట్ల వెంకటేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ సెంటర్లో చాలా కాలం పాటు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. ఆయనకు వీర్రాజు పెద్ద కుమారుడు. చదువుకునే రోజుల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తిగా వీర్రాజు అంగర గ్రామస్తులకు చిరపరిచితుడు. పదో తరగతి వరకూ అంగర ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్మీడియెట్ మండపేటలోని ప్రైవేటు కళాశాలలోను చదివారు. జూనియర్ అసిస్టెంట్గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, కోరుమిల్లి, అంగర, నిడసనమెట్ట, వెదురుమూడి, ఏడిద గ్రామాల్లో పని చేశారు. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ తరచూ అంగర వచ్చి వెళ్లేవారు. వీర్రాజు మృతి పట్ల ఆయన స్నేహితుడు, గ్రామ మాజీ సర్పంచ్ బట్టా షణ్ముఖ శ్రీనివాస్, స్నేహితులు ఎం.సత్యనారాయణ, ఎస్.అప్పారావు, ఎ.రవికిరణ్, బడుగు కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు. కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్ రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్నైట్ ఫంక్షన్కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్ కారు నడపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్, కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్, తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రూరల్ ఎస్సై వి.కిశోర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు. కొంగుముడులు వేసుకుని, ఏడడుగులు నడిచి, నాతిచరామి అంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ రెండు జంటలూ బహుశా మరువలేదేమో! కడ వరకూ కలిసే తమ పయనాన్ని సాగించాయి. మరణంలోనూ పరస్పరం వీడలేక.. కానరాని లోకాలకు వెళ్లిపోయాయి. బంధువుల ఇంట జరిగిన శుభకార్యంలో ఆనందంగా గడిపి.. కారులో తిరుగు ప్రయాణమైన ఓ జంట.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో హైదరాబాద్ బయలుదేరిన మరో జంట.. వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలూ అటు కుటుంబ సభ్యుల్లోను, ఇటు స్థానికంగానూ తీరని విషాదాన్ని నింపాయి. ఫ అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు ఫ మండపేట వద్ద దంపతుల దుర్మరణం ఫ మృతుల పిల్లలు, తల్లిదండ్రులను కాపాడిన స్థానికులు కళ్ల ముందే జలసమాధి తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీర్ణించుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్, కిరణ్మయి దంపతుల పలకరింపులు ఇంకా మరచిపోక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. దంపతుల మృతితో గ్రామస్తులు సైతం తల్లడిల్లారు. వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. -
గట్టు.. కొల్లగొట్టు
ఫ పోలవరం గట్టుపై యథేచ్ఛగా మట్టి తవ్వకాలు ఫ రేయింబవళ్లు తరలింపు ఫ రూ.లక్షల్లో దందా నల్లజర్ల: అడ్డుకునేదెవరు.. ఆపేదెవరని అనుకుంటున్నారో ఏమో! పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టిని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పొక్లెయిన్లతో మట్టిని తవ్వేసి, టిప్పర్లతో తరలించేసి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. నల్లజర్ల – ఆవపాడు – సింగరాజుపాలెం గ్రామాల మధ్య ఈ దందా బహిరంగంగానే జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కాలువ గట్లపై కాలక్షేపం కోసం పేకాడుతున్న వారిని వల పన్ని పట్టుకోవడంలో పోలీసులు చూపుతున్న పట్టుదల ఈ మట్టి అక్రమ రవాణాదారులను అడ్డుకోవడంలో చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలవరం కుడి కాలువ గట్ల వెంబడి విలువైన ఎర్రమట్టి ఉంది. దానిపై పలువురు స్థిరాస్తి వ్యాపారులు, మట్టి మాఫియా కన్ను వేశారు. డెల్టాలో ఈ మట్టికి మంచి డిమాండ్ ఉంది. భవంతుల నిర్మాణానికి, లే అవుట్ల ఎత్తు పెంచడానికి, పునాదుల్లో వేయడానికి ఈ మట్టిని వినియోగిస్తున్నారు. దీంతో, కొన్నేళ్లుగా పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. రోజుకు తక్కువలో తక్కువ 60కి పైగా టిప్పర్లతో మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. టిప్పర్ మట్టిని రూ.3 వేలకు పైగా అమ్ముకుంటున్నారు. ఈవిధంగా రోజుకు దాదాపు రూ.2 లక్షల విలువైన మట్టి దందా సాగుతోందని వైఎస్సార్ సీపీ నేత వామిశెట్టి పరమేశ్వరావు ఆరోపించారు. జాతీయ రహదారి పైనే టిప్పర్లతో మట్టి అక్రమ రవాణా సాగుతున్నా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు చూసినా మిన్నకుండి పోతున్నారని అన్నారు. అధికారులు ఇలాగే మరికొన్ని రోజులు పట్టించుకోకుండా ఊరుకుంటే పోలవరం గట్టు పూర్తిగా కనమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన కాలువ అవసరాలకు, పటిష్టతకు అవసరమైనప్పుడు మట్టి లభ్యం కాక ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి మట్టి మాఫియాను అడ్డుకోవాలని పరమేశ్వరావు కోరారు. -
అక్రమంగా చెట్ల నరికివేత
కోరుకొండ: సంపదను కొల్లగొట్టడంలో అక్రమార్కుల ‘కూటమి’ది అందె వేసిన చెయ్యి అనే విమర్శలు వస్తున్నాయి. వారు చెట్లకు సైతం డబ్బులు కాయిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో చెట్లు కనిపిస్తే చాలు.. వెంటనే వేటు వేసి, ఆ కలపను అక్రమంగా తరలించేసి, సొమ్ము చేసుకుంటున్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి మీదుగా గుమ్ములూరు, బుచ్చెంపేట వైపు పుష్కర సబ్ కెనాల్ ఉంది. దీనిపై బూరుగుపూడి వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర వేప, నిద్రగన్నేరు, కంచి, తుమ్మ తదితర విలువైన చెట్లున్నాయి. వీటిని నియోజకవర్గంలోని ఓ ముఖ్య నాయకుడి అండతో కొంతమంది అక్రమార్కులు అడ్డగోలుగా నరికేసి, అక్రమంగా తరలించుకుపోయారు. అలాగే, మత్స్య సహకార సంఘం చేపలు పెంచుతున్న చెరువు గట్లపై చెట్లను సైతం నరికేశారు. అది గమనించిన స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. చెట్లు నరికివేస్తున్న వారితో పాటు నరికివేతకు వారు ఉపయోగిస్తున్న సామగ్రిని బూరుగుపూడి పంచాయతీ అధికారులకు అప్పగించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కేసు నమోదు చేయడానికి సిద్ధం కాగా, స్థానిక కూటమి నాయకుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చాడని తెలుస్తోంది. గతంలో స్థానిక ఆవభూమిలో 361 ఎకరాల విస్తీర్ణంలో జామాయిల్ చెట్లు నరికేసిన అక్రమార్కులే, పుష్కర కాలువపై కూడా చెట్లు నరికేశారని అంటున్నారు. వీరిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
పాపికొండల వైపు పులి అడుగులు
రాజానగరం: మూడు వారాలుగా పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి వాసులను హడలెత్తిస్తున్న పెద్ద పులి ప్రస్తుతం పాపికొండల వైపు అడుగులు వేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించారు. సోమవారం పోలవరం జిల్లా కొయ్యలవీరవరం, లింగంపల్లి కొండలు, పాపికొండలు నేషనల్ పార్కు సమీపంలో ఉందని తెలుసుకుని ఆ ప్రాంతంలోని గిరిజనులను అప్రమత్తం చేశారు. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. పులి ఆదివారం రాత్రి పూడిపల్లిలో రెండు లేగ దూడలను హతమార్చిందని అధికారులు గుర్తించారు. నదీ తీరం వెంబడి పయనిస్తూ పాపికొండల వైపు వెళ్తుందన్నారు. గడచిన మూడు వారాల నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకూ దాని ప్రయాణం 550 కిలోమీటర్లు దాటిందన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొత్తపల్లి: నాగులపల్లి జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం పట్టణం మిరపకాయల వీధికి చెందిన నాగమల్లి బాలసుబ్రమణ్యం (25) కెఎస్ఈజెడ్లో ఉన్న దేవి పిసరేష్ (రొయ్యల శుద్ధి పరిశ్రమ)లో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని నాగులపల్లి గ్రామం మీదుగా మోటార్ సైకిల్ పై పిఠాపురం వైపు వెళుతుండగా ఎండపల్లి నుంచి రమణక్కపేట వైపు వెళ్తున్న టాటా ఐషర్ వ్యాన్ నాగులపల్లి సెంటర్లో ఉన్న కనకదుర్గాదేవి ఆలయం సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. యానాం: స్థానికంగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యానాం పట్టణం మెట్టకూరు రమాభాయినగర్కు చెందిన దడాల యశోధరరావు (44) బైక్పై ద్రాక్షారామ దారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన రామచంద్రపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యానాం జీజీహెచ్కు తరలించినట్లు ఎస్సై తిరువక్కనరుసు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఎస్సై రాజా కథనం ప్రకారం.. స్థానిక 26వ వార్డు అయోధ్యరామాపురానికి చెందిన పల్లా దుర్గాప్రసాద్ మినీ వ్యాన్పై డ్రైవర్గా పని చేస్తున్నాడు. రోజూ మద్యం తాగి, భార్యతో ఘర్షణ పడి వేరే గదిలో నిద్రపోతూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి భార్య ప్రసన్నతో ఘర్షణ పడి ఆ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంలు అవుతున్నా భర్త తలుపు తీయకపోవడంతో ప్రసన్న ఫోన్ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి చూడగా దుర్గాప్రసాద్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై వివరించారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషించిన కోనసీమ జిల్లా అప్పన్నపల్లి బాలబాలాజీ దేవస్థానం ఈవో రాంబాబురెడ్డిపై చర్యలు తీసుకోవాలని ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుందరపల్లి వీవీఎస్ గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా దేవదాయ శాఖ డీసీ కార్యాలయంలో అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న తలనీలాలు సమర్పించిన భక్తుని వద్ద మాట్లాడుతూ కుల వివక్షతో కూడిన పదజాలాన్ని వాడుతూ అవమానపరిచారన్నారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాన్ని తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారన్నారు. ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇలా ప్రవర్తించడం ఆక్షేపణీయమని ధ్వజమెత్తారు. కుల వివక్షకు పాల్పడిన ఈవోను తక్షణమే విధుల నుంచి తొలగించాలన్నారు. సామాజిక వర్గాన్ని కించపరిచే వీడియోను వైరల్ చేసిన సోషల్ మీడియా గ్రూపు అడ్మిన్పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేయనున్నటు చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ర్యాలి లోవరాజు, జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఎం నాగ సత్యనారాయణ, కాకినాడ సిటీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేపాడ శ్రీనివాసరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెదురుపావులూరి నాని, పాల్గొన్నారు. -
● ఇష్టారాజ్యం కాబట్టీ
అడిగేవారు లేక ఇష్టారాజ్యం అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు పుట్టుకొస్తున్నాయి. తెలంగాణలోని వ్యాపారులు సరిహద్దున ఉన్న ఎటపాక ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఎటపాక మండల కేంద్రంలో భద్రాచలం, చర్ల ప్రధాన రహదారికి పక్కనే సుమారు 10 వరకూ బూడిద ఇటుక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అనధికారంగా కొందరు విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇటుకల తయారీకి ఐటీసీ నుంచి వస్తున్న వ్యర్థాలను నల్ల, తెల్ల బూడిదతో పాటు జిప్సం, ఇసుక మిశ్రమాలను ఉపయోగిస్తున్నారు. వీటిని రహదారి పక్కనే కుప్పలుగా వేయడంతో గాలికి ఎగిరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. – ఎటపాక -
ఇలా రాజకీయ పయానాం
● తెలుగు గడ్డపై తమిళ ఎన్నికల పోరు ● సిటింగ్ ఎమ్మెల్యే అశోక్, మల్లాడి మధ్యే పోటీ ● జోరుగా ఎన్నికల ప్రచారం, బరిలో 13 మంది ● ఈ నెల 9న పోలింగ్, మే 4న కౌంటింగ్ యానాం: తెలుగు ప్రాంతమే కాని.. అక్కడంతా తమిళ పార్టీల చర్చే నడుస్తుంటుంది.. ఒకరు డీఎంకే అంటే, మరొకరు ఏఐఏడీఎంకే, నమదు రాజ్యం కాంగ్రెస్ అంటారు. అంతేకాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు, పుదుచ్చేరిలో జరిగే రాజకీయ పరిణామాలు, తమిళ ప్రాంతీయ పార్టీల చర్చ జరగడమే కాకుండా, ఆ పార్టీ నుంచి సైతం అభ్యర్థులు బరిలోకి దిగుతుంటారు. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం యానాం రీజియన్. 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 తమిళనాడు రాష్ట్ర సరిహద్దున ఉన్న పుదుచ్చేరిలోనే ఉండటంతో తమిళ పార్టీల ప్రభావం అక్కడ అధికంగా ఉంటుంది. మిగిలిన ఒక నియోజకవర్గం యానాం తెలుగు ప్రాంతమైనా జాతీయ పార్టీలతో పాటు మెజారిటీ తమిళ పార్టీలను ఇక్కడి నాయకులు తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది. మల్లాడి రాజకీయ ప్రవేశం 1996లో మల్లాడి కృష్ణారావు (స్వతంత్ర) అభ్యర్థిగా మొదటిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ విధంగా ఘన విజయం సాధించారు. 2000 సంవత్సరంలో మల్లాడి కృష్ణారావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పుదుచ్చేరి ముఖ్యమంత్రి షణ్ముగం (కాంగ్రెస్)ను యానాం నియోజకవర్గం నుంచి గెలిపించారు. 2001లో మల్లాడి కృష్ణారావు(ఇండిపెండెంట్), 2006, 2011, 2016 ఎన్నికల్లో సైతం మల్లాడి కృష్ణారావు (కాంగ్రెస్) గెలుపొందారు. అందరి దృష్టినీ ఆకర్షించి.. 2021లో యానాం నుంచి పోటీ చేసిన సీఎం అభ్యర్థి రంగసామి (నమదురాజ్యం కాంగ్రెస్)పై, స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం సాధించడం పుదుచ్చేరి వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ముఖ్యమంత్రిపై 28 ఏళ్ల యువకుడు అశోక్ విజయం సాధించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం 2021 ఎన్నికల్లో సీఎం రంగసామిపై గెలిచి రాజకీయ ఓనమాలు తెలియని 28 ఏళ్ల యువకుడిగా పుదుచ్చేరి అసెంబ్లీలో అడుగుపెట్టిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గత ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే ల్యాడ్, ఎంపీ ల్యాడ్, సీఎస్ఆర్ నిధులు సుమారు రూ.33 కోట్ల నిధులను సాధించారు. మత్స్యకారుల ఓఎన్జీసీ పరిహారం రూ.137 కోట్ల మేర వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేయించడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగారు. 1996 తర్వాత యానాం నియోజకవర్గంలో జరిగిన పలు నిర్మాణాలు, మౌలిక సౌకర్యాల కల్పన, జిప్మెర్ వంటి ఆసుపత్రి నిర్మాణం, పర్యాటక ప్రాజెక్టులు ఆయన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 33 ఏళ్ల అశోక్, 62 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుని మధ్య పోరు జరుగనుండటంతో అందరినీ ఈ ఎన్నిక ఆకర్షిస్తుంది. యానాం నియోజకవర్గ శాసనసభా స్థానానికి ఈ నెల 9న పోలింగ్ జరగనుండగా, మే 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉండగా, జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సామాజికవర్గాల ప్రభావం యానాంలో కాపులు, మత్స్యకారులు, ఎస్సీలు అతి పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. దీంతో ఆయా వర్గాలు ఎటు మొగ్గుచూపుతారో వారికే విజయావకాశాలు ఉండనున్నాయి. ఇటీవల ఓటరు జాబితా రివిజిన్ తర్వాత ఎక్కువ ఓటు బ్యాంకు ఉండే మత్స్యకారుల ఓట్లు తగ్గడంతో కాపుల ఓట్లు ఎక్కువయ్యాయి. అదే విధంగా ఎస్సీల ఓట్లు సైతం గెలుపోటములను నిర్ధేశించనున్నాయి. తొలిసారిగా ఎన్నికలు ఎప్పుడంటే.. 1955లో యానాం రెండు నియోజకవర్గాలుగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, యర్రా జగన్నాథరావులు చెరో నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1959లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, కామిశెట్టి సావిత్రీ 1964లో గెలుపొందారు. ఫ్రెంచి వారు యానాంను భారతదేశంలో విలీనం చేయడంతో యానాం ఒక నియోజకవర్గంగా మారింది. 1969లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు(స్వతంత్ర అభ్యర్థి), 1974లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, 1977లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు (జనతా), 1980లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, 1985లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు (కాంగ్రెస్), 1990లో రక్షాహరికృష్ణ (డీఎంకే), 1991లో వెలగా రాజేశ్వరరావు(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. -
దూసుకొచ్చిన మృత్యువు
జగ్గంపేట/ రాయవరం: అనుకోని ప్రమాదం ఆ యువకుడిని మృత్యుకుహరంలోకి లాగేసింది.. దూసుకొచ్చిన బస్సు ఆ నిండు ప్రాణాన్ని బలిగొంది. మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. రాయవరం గ్రామ రాజేశ్వరి కాలనీకి చెందిన దొడ్డి అచ్యుత సాయిమనోహర్ (25) అగరబత్తి కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ పనిపై మోటారు సైకిల్పై తన స్నేహితుడితో కలసి సోమవారం ఉదయం జగ్గంపేట వస్తుండగా, సీతానగరం గ్రామం వద్ద ఆర్టీసీ బస్ ఢీకొంది. దీనితో అతను అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు మోటారు సైకిల్పై ఉన్న ఉలవకాయల శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్సీకి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపినట్లు ఎస్సై వివరించారు. దీనిపై మనోహర్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రాయవరంలో విషాదం రాయవరానికి చెందిన దొడ్డి అచ్యుత్ సాయి మనోహర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పనిపై వెళ్లిన చిన్న కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు దుర్గలక్ష్మి, సత్తిబాబులకు మృతి చెందాడన్న విషయం తెలియగానే వారు విలి పంచిన తీరు కలచివేసింది. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. అందరితో స్నేహంగా ఉండే మనో హర్ ఇక లేడన్న వార్తను స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. శివ అన్నయ్య బాల కుమార సుబ్రహ్మణ్యంకు ఇటీవలే వివాహం నిశ్చయం కాగా, వచ్చే నెల 3న వివాహం జరగనుండగా, ఇంతలో మనోహర్ మరణవార్త కుటుంబానికి పిడుగుపాటులా మారింది. బస్సు ఢీకొని యువకుడి మృతి -
ఏపీ కబడ్డీ జట్టు కెప్టెన్గా దుర్గారావు
ప్రకాశంనగర్: 72వ జాతీయ కబడ్డీ పోటీలకు ఆంధ్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన పిట్ట దుర్గారావు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం స్థానిక అన్నపూర్ణమ్మపేటలో శ్రీస్వామి వివేకానంద మొబైల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. క్లబ్ సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కబడ్డీ క్రీడాకారులు దుర్గారావును సత్కరించి, షీల్డ్ బహూకరించారు. సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఒక భాగం కావాలన్నారు. స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు మల్లిబాబు మాట్లాడుతూ దుర్గారావు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి, వివేకానంద స్పోర్ట్స్ క్లబ్కు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సీరా గంగాధరం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు నాగరాజు, కబడ్డీ క్రీడాకారులు వి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, కె.సత్తిబాబు, ఎస్.వీరబాబు, బి.ఏలియా, కె.వీర్రాజు, ఎస్.కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
10న ‘నన్నయ’ స్నాతకోత్సవం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ 16, 17 స్నాతకోత్సవాలను ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు వర్సిటీ కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సోమవారం తెలిపారు. 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో పీహెచ్డీ, పీజీ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేస్తామని వివరించారు. దీనికోసం ఇప్పటి వరకూ 722 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ రెండు విద్యా సంవత్సరాల్లో యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన 6,113 మంది, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 45,337 మంది విద్యార్థుల పట్టాలను ఆమోదిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి యూజీసీ చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి, జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ పి.లామా, పలువురు విద్యావేత్తలు హాజరవుతారని వీసీ తెలిపారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్లో స్వర్ణం రాయవరం: మండలంలోని నదురుబాద గ్రామానికి చెందిన విత్తనాల ముత్యాలరావు (ముత్తు) రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నాడు. ఈ నెల 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్టీ కళాశాలలో ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరిగాయి. మాస్టర్స్ కేటగిరీ విభాగంలో ఆయన ఈ ఘనత సాధించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్న ముత్తు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఏపీఓ జె.సుధారాణి, ఫీల్డ్ అసిస్టెంట్లు అభినందనలు తెలిపారు. పీజీఆర్ఎస్కు 187 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజలు 187 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్.భాస్కర్రెడ్డి, ఆర్డీఓ ఆర్.శివరాముడు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. సమస్యలు తిరిగి రాకుండా పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 25 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ఏఎస్ఓ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టు భర్తీకి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ‘జిల్లా ప్రాజెక్టు కార్యాలయం, సమగ్ర శిక్ష, రాజమహేంద్రవరం’ చిరుమానాకు పంపాలన్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు నమూనా, నియమావళికి ఎంఈఓలు, సమగ్ర శిక్ష, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో సంప్రదించవచ్చని తెలిపారు. దరఖాస్తులను ఎస్ఎస్ఆర్జేవై.ఓఆర్జీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మరింత సమాచారానికి 9866 77 9398 నంబరులో సంప్రదించాలని సుభాషిణి సూచించారు. -
రక్తమోడిన రహదారులు
● వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి ● ఏడుగురికి తీవ్ర గాయాలుఆత్రేయపురం: మండల పరిధిలోని మెర్లపాలెం లొల్ల వైపు వెళుతున్న రెండు మోటార్ బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బుల్లెట్పై ముగ్గురు, మరో బైక్పై ఇద్దరు లొల్ల వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్ ను బుల్లెట్పై వెళుతున్న వ్యక్తి మరో వాహనాన్ని తప్పించబోయి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బుల్లెట్పై ఉన్న మెర్లపాలేనికి చెందిన ఎలిపే శ్రావణ్ కుమార్ (25) కాలువలో పడి మృతి చెందాడు. కాగా బుల్లెట్పై ఉన్న మరో ఇద్దరు ఎలుపే సఫిన్, ఎలిపే హేమంత్ తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా బైక్పై గల బాలుడు సురక్షితంగా ఉండగా మరొక వ్యక్తి కొమ్మర జస్వంత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఎలిపే శ్రవణ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించినట్లు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ వ్యాన్ ఢీకొని యువకుడు.. ఎటపాక: మండల పరిధిలోని బొజ్జిగుప్ప వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఐషర్ వ్యాన్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం కూలి పనులకోసం భద్రాచలం వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కిష్టారం వద్ద ఉన్న 219 సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లను భద్రాచలం తీసుకొస్తున్న ఐషర్ వ్యాన్ బొజ్జిగుప్ప సమీపంలోని రాయిగూడెం వద్ద వారి ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న కొర్సా రామ్మూర్తి, కొర్సా రవి, కారం వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జీజీహెచ్కు తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో రామ్మూర్తి (38) మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై అప్పలరాజు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గేదెలను తప్పించబోయి ఒకరు.. రాజవొమ్మంగి: రాజవొమ్మంగి నుంచి అడ్డతీగల వైపు మోటారు బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు జడ్డంగి సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అడ్డతీగల మండలం పింజరికొండ గ్రామానికి చెందిన పులగం రామిరెడ్డి (30) ఘటన స్థలంలోనే మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన వెలుగుల లోవరాజు (30) తీవ్ర గాయాల పాలయ్యాడు. వీరు కొయ్యూరు మండలం కాకరపాడులో జరుగుతున్న జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. జడ్డంగి ఎస్సై చినబాబు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా అనంతరం రామిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోవరాజును జడ్డంగి పీహెచ్సీకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. జాతీయ రహదారిపై గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్సై చినబాబు తెలిపారు. రామిరెడ్డి మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ట్రాక్టర్ ఢీకొని మరొకరు..రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు గండేపల్లికి చెందిన అల్లాటి గోపాలం (28), అతని మిత్రుడు ముంగర శివశంకర్తో కలిసి బైకుపై చింతల నామవరం వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తూర్పుగానుగూడెం వచ్చే సరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ వారి బైకును ఢీ కొనడంతో గోపాలం అక్కడికక్కడే మృతి చెందగా, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. అవివాహితుడైన గోపాలం బ్యాంకు లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ బ్రేకులు ఫెయిలై.. క్లీనర్ తలపైకి ఎక్కి.. సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని రైస్ మిల్లు ఆవరణలో లారీ ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలం వాలు తిమ్మాపురం రోడ్డులోని పట్టాభి రైస్ మిల్లులో బీహర్కు చెందిన అశోక్కుమార్ (21), అతని మేనమామ ఇద్దరు ఏడాదిగా లారీపై పని చేస్తున్నారు. అశోక్ కుమార్ లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి రైస్ మిల్లుకు వచ్చిన లారీ కేబిన్లో మేనమామ పడుకున్నాడు. అశోక్కుమార్ లారీ వెనుక కింద పడుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో దానంతట అదే వెనుకకు రావడంతో అశోక్కుమార్ తల మీదుగా లారీ టైర్ ఎక్కి చనిపొయిన్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య కేసులో ఐదుగురి అరెస్టు
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, జి.మేడపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు ఆదివారం ఐదుగురిని అరెస్టు చేశారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం మేరకు మేడపాడు పాలబండ వీధిలో నివసిస్తున్న మదిన, బొద్దపు కుటుంబాల మధ్య కొంత కాలంగా ఇంటికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల రెండో తేదీ రాత్రి జరిగిన చిన్న సంఘటన ఆధారంగా మదీనా కుటుంబ సభ్యులపై బొద్దపు కుటుంబ సభ్యులు కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మదిన లోవలక్ష్మికి బలమైన కత్తి దెబ్బ తగలడంతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాంతో ఆమె కుమార్తె హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఆదివారం మాధవపట్నం శివారులో సర్పవరం రైల్వేస్టేషన్ దగ్గరలో ముద్దాయిలను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. వీరిలో ఎ1గా బొద్దపు ఆదిత్య వినయకుమార్, ఎ2గా బొద్దపు శ్రీనివాసరావు, ఎ3గా బొద్దపు భవానీ, ఎ4గా బొద్దపు నూకరత్నం. ఎ5గా బొద్దపు లలిత సౌమ్యలను అరెస్టు చేసి ఆదివారం కోర్టుకు పంపినట్టు తెలిపారు. 2020 నుంచి ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులపై కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయని సీఐ తెలిపారు. -
జాతీయ రెజ్లింగ్ పోటీలకు హారిక
సామర్లకోట: మండల పరిధిలోని వేట్లపాలెం కొండపల్లి గంగన్న మెమోరియల్ జిల్లా పరిషత్తు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న దాసరి హారిక జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక అయినట్టు పాఠశాల హెచ్ఎం అనురాధ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో హారిక ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించడంతో అండర్ 17 రెజ్లింగ్ అసోసియేషన్ టోర్నమెంట్ నేషనల్కు ఎంపిక అయినట్టు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని బైరంగాబాద్లో జరిగే నేషనల్ చాంపియన్ షిప్లో పాల్గొంటారన్నారు. ఈ మేరకు హారికను ఫిజికల్ డైరెక్టర్లు యార్లగడ్డ బంగార్రాజు, ఇబ్రహీం, గ్రామ పెద్దలు అభినందించారు. -
పిచ్చుకలంక ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
రాజమహేంద్రవరం రూరల్/ఆత్రేయపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద బ్యారేజీ దిగువన గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృత్యువాతపడిన తుమ్మలావకు చెందిన అబిద్, ఆర్ఫాద్ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో శనివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన వారిలో మణికంఠ సురక్షితంగా బయటపడగా జాంపేటకు చెందిన షేక్ బిలాల్, తుమ్మలావకు చెందిన వరుసకు సోదరులైన అబిద్, అర్ఫాద్లు గల్లంతైన విషయం తెలిసిందే. షేక్ బిలాల్ మృతదేహం వెంటనే లభించగా, ఆదివారం ఉదయానికి సుల్తాన్ అహ్మద్ (22), అర్ఫాద్ (18) మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్రేయపురం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్రేయపురం తహసీల్దార్ ఆర్డీ రామచంద్రమూర్తి, పోలీస్ ఏఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తుమ్మలావకు చెందిన అహ్మద్ తండ్రి చిన్నప్పుడే మృతిచెందాడు. అన్న హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కకు పెళ్లయ్యింది. ఇంటి వద్ద తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్న అహ్మద్ బీటెక్ చదువుతున్నాడు. చేతికి అందివచ్చే సమయంలో అతడు మృతి చెందడంతో తల్లి రోదిస్తున్న తీరు చూపరునుల కంటతడి పెట్టిస్తోంది. అర్ఫాద్ ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసి ఎంసెట్కు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో కుమారుడు మృత్యువాత పడడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.తుమ్మలావలో విషాదఛాయలు -
జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
రాజమహేంద్రవరం రూరల్: భారత తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, జీవితాంతం దళిత, బహుజనుల హక్కుల కోసం, సమసమాజ నిర్మాణం కోసం పాటు పడిన సమతామూర్తి జగ్జీవన్రామ్ అని కొనియాడారు. ఆయన గొప్ప పరిపాలనాదక్షుడన్నారు. సంఘ సంస్కర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడిగా, 27 సంవత్సరాలకే శాసన సభ్యుడిగా, అనంతరం 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించిన మహానాయకుడని అన్నారు. 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ పునరంకితమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, రూరల్ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు చింతపర్తి రాంబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట చర్చి గేటు వద్ద ఆ మహనీయుని విగ్రహానికి ఆమె ఆదివారం పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో అసమానతలను ఎదుర్కొంటూ ఎదిగిన జగ్జీవన్రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, బహుజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
● స్వామిని దర్శించుకున్న 40 వేల మంది ● ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లి బృందాలతో పాటు, ఆదివారం సహజంగా వచ్చే భక్తులు సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల వ్రతాలు జరిగాయి. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై ప్రతిష్టించి సేవ ప్రారంభించారు. అనంతరం పండితులు వారికి నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. సత్రం సిబ్బంది నిజాయితీ సూట్కేస్లు మరచి వెళ్లిపోయిన పెళ్లి బృందానికి ఆలయ సిబ్బంది వాటిని అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి విశాఖపట్నానికి చెందిన కోసూరి కేదార్నాథ్ కుటుంభ సభ్యుల వివాహం రత్నగిరిపై జరిగింది. స్థానిక హరిహర సదన్లో వారు రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం నవ దంపతులతో బాటు ఆ పెళ్లి బృందం సత్యదేవుని వ్రతం చేయించుకోవడానికి వెళ్లారు. అనంతరం వారు సత్రంలో గదులు ఖాళీ చేసి కౌంటర్ వద్ద తాళాలు అప్పగించారు. అనంతరం అక్కడ ఉన్న సత్యదేవుని చిత్రపటానికి నమస్కరించే క్రమంలో రెండు సూట్కేసులు అక్కడ ఉంచి మరచి వెళ్లిపోయారు. సుమారు గంట సేపైనా ఎవరూ ఆ సూట్ కేసుల కోసం రాకపోవడంతో కౌంటర్ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి పెళ్లి బృందం సభ్యులు వాటిని మరచిపోయినట్టు గుర్తించారు. వాటిని కౌంటర్లో భద్రపరిచారు. కాగా కొంత దూరం వెళ్లిన పెళ్లి బృందం వారి సూట్ కేసులను మరచిన విషయాన్ని గుర్తించి దేవస్థానానికి ఫోన్ చేశారు. దేవస్థానం అధికారులు హరిహర సదన్ వద్ద రెండు సూట్కేసులు మరచిపోయారని వాటి వివరాలు చెప్పి తీసుకువెళ్లాలని చెప్పారు. దీంతో వారు తిరిగి సత్రానికి చేరుకుని సూట్కేసుల వివరాలు చెప్పగా అధికారులు వాటిని వారికి అందచేశారు. సత్రం గుమస్తా సుంకర వేంకటేష్, ఇతర సిబ్బందిని పెళ్లి బృందం సభ్యులు అభినందించారు. -
ఎట్టకేలకు చిక్కిన మొసలి
అయినవిల్లి: మండలంలోని అయినవిల్లిలంక పంచాయతీ పరిధిలో కోటిపల్లి భాగ వద్ద ఇటుకబట్టీల కోసం తవ్విన గోతుల్లో మొసళ్లు ఉన్నాయని ఐదు నెలల క్రితం వచ్చిన వార్త సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. స్థానికులు దాని ఆచూకీ చెప్పడంతో ఆదివారం జిల్లా అటవీ అధికారి ఎంవీ ప్రసాదరావు నేతృత్వంలో అధికారుల బృందం దానిని పట్టుకుని ఆరోగ్య పరీక్షలు చేశారు. అది ఆరోగ్యంగా ఉందని ధ్రువీకరించారు. దానిని మారేడుమిల్లి అడవులలో వదలిపెడతామని ప్రసాదరావు తెలిపారు. మొసలిని పట్టుకోవడంలో అధికారులు కె.రాంబాబు, నాగ సత్యనారాయణ, డీఎన్ మూర్తి తదితరులు సహకరించారన్నారు. ఇది ఇలా ఉండగా మొసలిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దండంగి వాగు వద్ద పెద్దపులిదేవీపట్నం: రెండు నెలలకు పైగా అటవీ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి శుక్రవారం రాత్రి సీతానగరం మండలం పెద కొండేపూడి వైపు నుంచి నేలకోట రామదుర్గం మీదుగా నాగళ్లపల్లి పూడిపల్లి గ్రామాల మధ్య తిష్ట వేసింది. శనివారం రాత్రి దండంగి వద్దకు చేరుకుని రెండు పశువులను చంపి తినేసింది. ఆదివారం సాయంత్రం దండంగి వాగు వద్ద ఉన్నట్లు జీపీఎస్ ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రికి దండంగి వాగు దాటి దేవీపట్నం వైపు పయనిస్తే పెద్దపులి రక్షిత అటవీ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దండంగి పూడిపల్లి ప్రాంతంలో సమృద్ధిగా నీరు, వేటాడేందుకు విడిచిపెట్టిన పశువులు అధికంగా ఉండడంతో ఇక్కడే స్థిరపడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. అదుపు తప్పి లారీ బోల్తా రంపచోడవరం: రాజమహేంద్రవరం నుంచి బొడ్లంకకు సెంట్రింగ్ లోడుతో వెళ్లుతున్న లారీ ఆదివారం మధ్యాహ్నం అదుపు తప్పి పడిపోయింది. లారీ యాక్సిల్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈతలపాడు సమీపంలో అప్ ఎక్కుతుండగా ఒక్కసారిగా లారీ అదుపు తప్పి వెనక్కి వెళ్లి తిరగబడింది. దీంతో లారీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు, డ్రైవర్లు లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నేటి నుంచి పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కలిపి 12 జిల్లాల్లోని గ్రేడ్ 4, 5 పంచాయతీ కార్యదర్శులకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 జిల్లాల నుంచి 2,300 మందికి, 11 బ్యాచ్లలో శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి బ్యాచ్లో 225 మందికి ఆరు రోజుల పాటు భోజన, వసతితో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు. ఏపీఎస్ఐఆర్డీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
రాజమహేంద్రవరం రక్షణ.. గోదారిలోకి..!
సాక్షి, రాజమహేంద్రవరం: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో చేపడుతున్న రివర్ఫ్రంట్ పనులతో ప్రమాదం పొంచి ఉందా.. అనుభవం లేని కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం.. పరిమితిమి మించి తవ్వకాలు చేపట్టడంతో గోదావరి గట్టు ప్రమాదకరంగా మారిందా.. వరదలు వస్తే గట్టు కుంగిపోతుందా.. అదే జరిగితే నగర రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదముందా.. 1953, 1986 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశముందా.. గండి పడిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్షణ గోడ వద్ద రివర్ఫ్రంట్ పనుల పేరుతో తూట్లు పొడవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. ఏం జరుగుతోందంటే.. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరం శారదా మఠం ఎదురుగా పద్మావతి ఘాట్లో సుమారు రూ.24 కోట్ల వ్యయంతో రివర్ఫ్రంట్, ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడ ఉన్న ఘాట్ను తొలగించారు. పక్కనే ఉన్న పార్కును సైతం కలుపుతూ ఒకే రివర్ఫ్రంట్ నిర్మించాలన్నది ఉద్దేశం. ఇందులో భాగంగా ఘాట్ను పూర్తి స్థాయిలో తవ్వేశారు. అవసరమైన మేరకు కాకుండా పక్కనే ఉన్న రోడ్డు వైపు సైతం లోతుగా తవ్వేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పద్మావతి ఘాట్ వద్ద రూ.8 కోట్లతో చేపడుతున్న అప్పర్ రివర్ఫ్రంట్ పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి మరింత సమయం పట్టనుంది. ఎందుకంటే..! గోదావరి వరదల సమయంలో పుష్కర ఘాట్ నుంచి ప్రస్తుత రివర్ఫ్రంట్ పనులు చేపడుతున్న ఘాట్ వరకూ ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరి నీరు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి వడి (ప్రవాహ ఒత్తిడి) ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోదావరి చరిత్రలో ఇప్పటి వరకూ గరిష్టంగా 32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఇదే స్థాయిలో వరదలు వస్తే ఈ గట్టు పటిష్టత ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటి వరకూ గట్టుకు రక్షణగా నిలిచిన రివిట్మెంట్ను ఆధునీకరణ పేరుతో తవ్వేయడం మరింత వివాదాస్పదంగా మారింది. లోతుగా తవ్వేయడంతో అక్కడ నీరు చేరితే మట్టి అండలుగా జారిపోతుంది. ఫలితంగా గట్టు బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి వరద ఉధృతికి గట్టు కుంగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ గట్టును ఆనుకుని రహదారి, దాని పక్కనే నివాస గృహాలు ఉన్నాయి. దీంతో, గట్టు తెగితే ఆ ఇళ్లు వరద ముంపులో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. నత్తనడకన.. మరోవైపు గోదావరి రివర్ఫ్రంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత రూపుదిద్దుకున్న డిజైన్ను మార్చడంతో కాంట్రాక్టర్కు మున్సిపల్ అధికారులు బిల్లులు మంజూరును నిలిపివేసినట్లు పమాచారం. దీంతో, పనులకు కొద్ది రోజులు బ్రేక్ పడింది. డిజైన్ మార్చి తిరిగి పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలు శిథిలమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత కొరవడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్, జూలై నెలల్లో గోదావరికి వరదలు వచ్చే అవకాశాలున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఆలోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ పనులు వేగంగా చేస్తే నాణ్యత కొరవడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో గోదావరి గట్టు భద్రత, రివర్ఫ్రంట్ పనుల నాణ్యత ప్రశ్నార్థకమవుతున్నాయి. భద్రతపై ఆందోళన వాస్తవానికి గోదావరి రివర్ఫ్రంట్ పనులు ప్రారంభమైనప్పటి నుంచీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల వల్ల గోదావరి ఘాట్లు ధ్వంసమవుతున్నాయని పురోహిత వర్గాలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ పనులు కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజమహేంద్రవరం నగర రక్షణలో ఈ గట్టు కీలకంగా నిలుస్తుంది. గతంలో 1953, 1986 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో గోదావరి గట్టుకు గండ్లు పడి, నగరాన్ని వరద ముంచెత్తింది. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. అప్పట్లో గట్టు పటిష్టతకు పై భాగంలో రక్షణ గోడ నిర్మించారు. ఈ గోడను సైతం ప్రస్తుత రివర్ఫ్రంట్ పనుల్లో తొలగించారు. దీంతో, గోదావరి గట్టు భద్రతపై స్థానికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ రివర్ఫ్రంట్ పనుల పేరిట గట్టుకు తూట్లు ఫ ఆధునీకరణ పేరిట రివిట్మెంట్ తవ్వకాలు ఫ వరదలు వస్తే పొంచి ఉన్న ప్రమాదం -
ఫ ఘనంగా ఈస్టర్
సమస్త మానవాళి రక్షణ కోసం కరుణామయుడైన ఏసుక్రీస్తు సిలువపై ప్రాణత్యాగం చేసి.. మరణంపై విజయం సాధించి.. మూడో రోజున పునరుత్థానుడైన మహత్తర ఘట్టాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు జిల్లావ్యాప్తంగా ఈస్టర్ పర్వదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. పరలోకగతులైన ఆత్మీయ బంధుమిత్రుల సమాధులను వారి కుటుంబ సభ్యులు శనివారమే శుభ్రపరిచారు. పువ్వులు, రంగులతో ముస్తాబు చేశారు. తెల్లవారుజామునే కొవ్వొత్తులు వెలిగించి, ప్రార్థనలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో బైపాస్ రోడ్డులోని లూథరన్ సమాధుల తోట, క్వారీ మార్కెట్ వద్ద గల సమాధుల వద్ద గతించిన తమ పూర్వీకుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పేదలకు వస్త్రాలు, వివిధ కానుకలు దానం చేశారు. అనంతరం, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమ, కరుణ, శాంతి, సహనం, క్షమ, ఐక్యత వంటి మానవీయ విలువలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పాస్టర్లు ఉద్బోధించారు. దేవుని వాక్యాన్ని వినిపించారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
ప్రమాదంలో ప్రజారోగ్యం
● ఉమ్మడి జిల్లాలో కల్తీ పదార్థాల కలకలం ● మద్య విక్రయాలతో ఆరోగ్య సమస్యలు ● సమస్యల వలయంలో వైద్య సేవలు ● ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంకపిలేశ్వరపురం: భారత రాజ్యాంగం 49వ అఽధికరణం ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలో చంద్రబాబు తదితర కూటమి నేతలు ఎన్నికల వేళ ఉచిత వైద్య సేవలంటూ ఓట్లు అభ్యర్థించి, గెలిచాక అవన్నీ గాలికి వదిలేసి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.450 కోట్లు బకాయిలు పెట్టింది. దీంతో క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కల్తీ పాలు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పేరుతో ప్రతి జంటా ఇద్దరిని తప్పనిసరిగా కనాలని చంద్రబాబు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్యం, తీరుతెన్నులపై ప్రత్యేక కథనం ఆరోగ్య కేంద్రాలిలా... ఉమ్మడి జిల్లాలో 140 పీహెచ్సీలు, 22 సీహెచ్సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలలో సామాన్య ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. జిల్లాల విభజన అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ఆయా సంస్థల్లో వేలాది మంది వైద్యులు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. పోలవరం జిల్లాలో 12 మండలాలు ఉండగా ఒక్కో మండలానికి సుమారుగా పది చొప్పున మొత్తం 120 ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల క్లినిక్లు ఉన్నాయి. ప్రమాదంలో ప్రజారోగ్యం.. ఉమ్మడి జిల్లాలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాల విక్రయం వల్ల 21 మంది కిడ్నీలు పాడయ్యాయి. వారిలో 13 మంది చనిపోయారు. మన్యం, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వసతి గృహాల్లో ఆహారం విషతుల్యమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యాయి. గత నెల 5న తాళ్లరేవు మండలం కోరంగి అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. 3.50 లక్షల జనాభా కలిగిన పోలవరం జిల్లాలోని 189 పంచాయతీలకు కేవలం ఏడుగురు ఆప్తాల్మిక్ అధికారులు మాత్రమే ఉన్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో 18 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు కేవలం నలుగురు, 8 మంది జీడీ వర్కర్లకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మారేడుమిల్లి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులకు ఒకరు, గుర్తేడు పీహెచ్సీలో ఉన్న రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. డిప్యుటేషన్పైనే విధులు సర్దుబాటు చేస్తున్నారు. ఆహార సరఫరాలో సైతం.. మార్చి 2న కాకినాడలో ఫుడ్ సేఫ్టీ అండ్ లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ హెల్త్ విభాగం అధికారులు దాడులు చేసి హొటళ్లలో నిల్వ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. ఈ తరహా ఘటనలు అమలాపురం, రాజమహేంద్రవరం, మండపేట పట్టణాల్లో సైతం జరిగాయి. నాణ్యతా లోపంతో ఆహార పదార్థాలను అందిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ – 2006లోని సెక్షన్ 206 ప్రకారం చర్యలు ఉంటాయి. పీడిస్తున్న సామాజిక రుగ్మతలు.. మహిళల ఆరోగ్యాన్ని సామాజిక రుగ్మతలు దెబ్బతీస్తున్నాయి. బాల్య వివాహాలు, అవిద్య, కుటుంబ హింస, పోషకాహార లోపం వంటివి ఇందుకు కారణమవుతున్నయి. కూనవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిథిలో 326 మంది గర్భిణుల్లో 24 మంది బాలికలు ఉన్నట్టు తేలింది. రేఖపల్లి ఆసుపత్రిలో పరీక్షించిన గర్భిణుల్లో 17 మంది, ఎటపాక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 12 మంది బాలికలను అధికారులు గుర్తించారు. హైరిస్క్ ఉన్న గర్భిణుల్లో గణాంక వివరాల్లో 8 నుంచి 10 శాతం కలిగిన నాలుగు జిల్లాలు ఉండగా అందులో కాకినాడ ఒక జిల్లాగా ప్రకటించారు. ట్రామాకేర్ కేంద్రాలు లేక.. 2025లో కాకినాడ జిల్లాలో జరిగిన 803 రోడ్డు ప్రమాదాల్లో 330 మంది చనిపోయారు. తూర్పులో 837కి 328 మంది, కోనసీమలో 618 ప్రమాదాల్లో 225 మంది చనిపోయారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం, తునిలలో మాత్రమే ట్రామాకేర్ కేంద్రాలున్నాయి. తుని కేంద్రంలో కేవలం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మద్యం విక్రయాలతో ముప్పు.. కాకినాడలో 155, ప్రైవేటు షాపులు, 20 బార్లు, తూర్పుగోదావరిలో 154 షాపులు, 19 బార్లు, అంబేడ్కర్ కోనసీమలో 169 షాపులు, 10 బార్లకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనధికారికంగా వేల సంఖ్యలో బెల్ట్ షాపులున్నాయి. రూ.కోట్లు ఆర్జిస్తూ సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నాశనం చేస్తోంది.నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో రూ.250 కోట్లు, కాకినాడ జిల్లాలో సుమారు రూ.100 కోట్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పోలవరం జిల్లా మొత్తానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవలందుతున్నాయి. 12 మండలాల పరిధిలో 189 గ్రామాల్లోని 3,49,799 మంది రాజమహేంద్రవరం, కాకినాడ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రులకు అస్వస్థత ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పేరుకు వంద పడకలే కానీ ఉన్నవి 40 మాత్రమే. మండపేటలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాలేదు. మలికిపురంలో మండలానికి రెండో పీహెచ్సీ మంజూరైనా అందుబాటులోకి తీసుకురాలేదు. కాకినాడ జీజీహెచ్ దుస్థితిపై విసిగి వేసారిన బాధిత రోగి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. వార్డు మార్చేందుకు డబ్బులు అడుగుతున్నారంటూ తన బాధ చెప్పుకున్నారు. -
కాలినడకన శ్రమకోర్చి.. డోలీలో మోసుకొచ్చి..
● పరిమళించిన 108 సిబ్బంది మానవత్వం ● క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన వైనం అడ్డతీగల: మన్యంలో 108 వాహన సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. పోలవరం జిల్లా వై.రామవరం మండలం పి.ఎర్రగొండ పంచాయతీలోని మారుమూల గ్రామం తడికోటలో చోళ్ల చిన్నారెడ్డి (20) ఆదివారం ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి తీవ్రగాయాలతో లేవలేని స్థితిలో ఉండడంతో గ్రామస్తులు 108కి ఫోన్ చేశారు. దీంతో గ్రామానికి బయలుదేరిన 108 సిబ్బంది రహదారి సౌకర్యం లేకపోవడంతో ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆపేసి అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు కాలినడకన దాటి వెళ్లి క్షతగాత్రుడిని డోలీ కట్టి అతికష్టమ్మీద తీసుకొచ్చి వాహనంలో ఎక్కించారు. అక్కడి నుంచి అడ్డతీగల సీహెచ్సీకి తరలించి అతడి ప్రాణాలు కాపాడారు. చిన్నారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
తాళ్లపూడి: పొలంలో గడ్డి కోయడానికి వెళ్లిన కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కొవ్వూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణ పరిధిలోని నందమూరు రోడ్డులో ఆర్ఎస్ నెంబర్ 326 వరి చేను సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడిపోయాయి. మండలం పశివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు మట్టా శ్రీను (60) గడ్డి కోయడానికి గట్టు వెంబడి తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ వాటిపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై ఎడమవైపు ఉన్న చేలో పడి మృతి చెందాడు. ఇంటి వద్ద నుంచి ఫోన్ చేయగా ఎంతకీ స్పందించకపోవడంతో అతని బావమరిది అయినాల ప్రసాద్ వరి చేలోకి వచ్చి చూడగా అతని మోటార్ సైకిల్ అక్కడ పెట్టి ఉండడం గమనించి చేలో మృతి చెంది ఉండడాన్ని గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శ్రీను ఇమ్మణి సాయికుమార్కు చెందిన పొలం కౌలుకు తీసుకుని చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. సీఐ విశ్వం సంఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. -
చోరీ కేసులో నలుగురి అరెస్ట్
రాజమహేంద్రవరం రూరల్: ఓ వ్యక్తిని మాయమాటలతో నమ్మించి, అతడిపై దాడి చేసి, బంగారం దోచుకున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ ఆ వివరాలు వెల్లడించారు. హుకుంపేట గ్రామానికి చెందిన బంటు బాబూరావు గత నెల 18న హుకుంపేట సెంటర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి సుమారు 30 ఏళ్ల పురుషుడు, మహిళ బండిపై వచ్చారు. మీ ఇల్లు అమ్మడానికి బేరం పెట్టారు కదా, దాన్ని కొనుక్కునే వ్యక్తి ఆవ రోడ్డులో ఉన్నాడని నమ్మించి, అక్కడున్న ఓ కొబ్బరితోటలోకి తీసుకువెళ్లారు. వెంటనే బాబూరావు ముఖంపై కొట్టి, మెడలోని సుమారు మూడు కాసుల బంగారం చైన్, రెండు కాసుల విలువైన రెండు ఉంగరాలను లాక్కుని పారిపోయారు. దీనిపై బాబూరావు గత నెల 19వ తేదీన బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. సౌత్జోన్ డీఎస్పీ భవ్యకిశోర్ పర్యవేక్షణలో, క్రైం డీఎస్పీ సుభాష్ సూచనల మేరకు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం బొమ్మూరు విద్యుత్ కార్యాలయం వద్ద గణపవరం మండలం పిప్పరకు చెందిన గరగ శివకృష్ణ, జవ్వాది శ్రీను, మావెల్ల సాయి లోకేష్, నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన జాలపర్తి మేరీలను అరెస్టు చేశారు. వారి నుంచి 36.59 గ్రాముల బంగారం వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కొత్తపేట, రామచంద్రపురం, పామర్రు, అయినవిల్లి, అనపర్తి, రాజమహేంద్రవరం త్రీటౌన్ పరిధిలో మరో ఏడు దోపిడీలను పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. దొంగిలించిన బంగారం ఆభరణాలను తాడేపల్లిగూడేనికి చెందిన గురజాడ ఆనంద్కుమార్కు అమ్ముతున్నట్టు గుర్తించామని ఇన్స్పెక్టర్ తెలిపారు.ఫ 36.59 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ -
‘తిరుమల’లో సదస్సుకు అనూహ్య స్పందన
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం జరిగిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుమారు 13 వేల మంది హాజరయ్యారని తెలిపారు. తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ ప్రవేశ పరీక్షలకు జరిగే విద్యా బోధన, సాధనను వివరించారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, బిట్స్పిలాని వంటి సంస్థల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు చేయాల్సిన కృషిని వివరించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశ వ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్) పరీక్షలలో 30 మంది పరీక్ష రాస్తే, కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందన్నారు. అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. మెడికల్లో దేశ వ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 25 మంది పరీక్ష రాస్తే, కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో సేవాగుణం, పెద్దల పట్ల గౌరవం అలవాటు చెయ్యాలన్నారు. 2025లో ఐఐటీ మద్రాస్లో సీటు సాధించిన యార్లగడ్డ తనూజ, నీట్లో స్టేట్ ఫస్ట్, ఆలిండియా 19వ ర్యాంకర్, ఎయిమ్స్ న్యూఢిల్లీలో సీటు సాధించిన డి.రామ్కిరీటి తండ్రి డి.అరుణ్కుమార్ పాల్గొని తిరుమల విద్యా సంస్థలో వారికున్న అనుభవాలను సదస్సుకు వివరించారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, తిరుమల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
వార్షిక పరీక్షలకు వేళాయె..
రాయవరం: ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1– 5 తరగతులకు సోమవారం నుంచి 10వ తేదీ వరకూ, 6 – 8 తరగతులకు సోమవారం నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. అలాగే 1 – 5 తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6 – 8 తరగతులకు 9.15 నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ గత నెల 16వ తేదీ నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 5.20 లక్షల మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారు. సీబీఏ విధానంలో.. క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (సీబీఏ) విధానంలో సమ్మేటివ్–2 పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో కొన్ని పరీక్షలకు అమలు చేయగా, ప్రస్తుతం అన్ని తరగతులకు అన్ని పరీక్షలను సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించనున్న సమ్మేటివ్–2 పరీక్షలను ఓఎంఆర్ విధానంలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. టైం టేబుల్ విడుదల పరీక్షల నిర్వహణకు ఎస్సీఈఆర్టీ టైమ్ టేబుల్ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్లైన్లో పొందు పరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు. 1 – 5 తరగతులకు 6న తెలుగు, 7న ఇంగ్లిషు, 8న గణితం, 9న ఎన్విరాన్మెంటల్ సైన్స్, 10న ఓఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. 6 – 8 తరగతులకు 6న తెలుగు, 7న హిందీ, 8న ఇంగ్లిషు, 9న గణితం, 10న పీఎస్, 11న బయాలజీ, 13న సోషల్ స్టడీస్, 15న కాంపోజిట్ తెలుగు, 16న ఓఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాల పంపిణీకి చర్యలు మండల విద్యాశాఖ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను చేర్చే పనిలో జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు (డీసీఈబీ) నిమగ్నమైంది. ఇప్పటికే మండల విద్యాశాఖ కార్యాలయాలకు ప్రశ్నాపత్రాలను పంపించారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు ప్రశ్నపత్రాలను సరిచూసుకుని ఎమ్మార్సీలో భద్రపర్చుకున్నారు. పరీక్షల ప్రారంభం నుంచి సంబంధిత ప్రశ్నపత్రా ల బండిళ్లను ఏరోజు కారోజు పరీక్షకు గంట ముందు ఎమ్మార్సీల నుంచి హెచ్ఎంలు వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ రేపటి నుంచి 1–8 తరగతులకు ఎస్ఏ – 2 పరీక్షలు ఫ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు పది పరీక్షల మాదిరిగానే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మాదిరిగానే ఈ వార్షిక పరీక్షలను నిర్వహించాలి. ఎటువంటి అపోహలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో పరీక్షలను నిర్వహించాల్సిన బాధ్యత హెచ్ఎంలపై ఉంది. ఎటువంటి అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నా సంబంధిత హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
దళితులపై కూటమి కక్ష
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు అన్నారు. ఆయన శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యవహరశైలితో దళితుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇటీవల నర్సీపట్నం నూకాంబిక జాతరలో నాగులాపల్లి రాందాస్ అనే డప్పు కళాకారుడిని కులం పేరుతో తిట్టి, చెయ్యి ఎత్తి కొట్టి, బెదిరించడం దారుణమన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అసెంబ్లీ స్పీకర్ వంటి రాజ్యాంగ పరమైన పదవిలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇటీవల ఆకివీడు దళిత పేటలో శ్రీరామనవమి పేరుతో 300 మంది కిరాయి రౌడీలను వెంట తీసుకు వెళ్లి, పక్కా ప్రణాళికలతో దాడులు చేయించి, అమాయక దళిత యువకులై అక్రమంగా హత్యాయత్నం కేసులను బనాయించి జైలుకు పంపించాడన్నారు. 22, 23 తేదీల్లో రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రధానోపాధ్యాయుడు, శాప్ డైరెక్టర్ పేరం రవీందనాథ్ శనివారం తెలిపారు. కేర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక సీఈఓ రాపాక సహకారం, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, గొల్లల మామిడాడ, కాకినాడ, మార్టేరు, వైజాగ్, విజయవాడ, చిత్తూరు జిల్లాల నుంచి పురుషుల జట్లు, అలాగే రామన్నపాలెం, రామచంద్రపురం, ఏలూరు, నర్సరావుపేట, వైజాగ్, నూజివీడు నుంచి మహిళల జట్లు టోర్నమెంట్లో పాల్గొంటున్నాయన్నారు. క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయం కల్పించినట్టు చెప్పారు. కల్తీపాల నియంత్రణకు చర్యలు రాజమహేంద్రవరం రూరల్: కల్తీపాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా పశుసంవర్థక అధికారి టి.శ్రీనివాసరావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కె.సుప్రియ తెలిపారు. ఈ మేరకు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 705 పాల నమూనాలను పరీక్షించగా, వాటిలో 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించామన్నారు. సంబంధిత వ్యక్తులపై ఆహార భద్రతా చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి జిల్లాలో ర్యాండమ్గా రాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ కల్తీ పాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్, ఇంటింటికి విక్రయాలు చేసే వారందరూ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని స్పష్టం చేశారు. ఇందుకోసం స్థానిక పశుసంవర్థకశాఖ, సచివాలయ సిబ్బందిని సంప్రదించాలన్నారు. -
ఉరేసుకుని కార్మికుడి ఆత్మహత్య
సామర్లకోట: ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు పెద్దాపురం శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఆ రోడ్డులో వెళుతున్న ప్రయాణికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై వి.మౌనిక తన సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. మృతుడు షిఫ్రూప్ (50) ఒడిశా నుంచి వచ్చి పెద్దాపురం రోడ్డులో వాలుతిమ్మాపురంలోని ఓ రైస్మిల్లులో కూలిగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై మౌనిక తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ దుర్మరణంజగ్గంపేట: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగ్గంపేటకు చెందిన రాయి చక్రవర్తి (35) డ్రైవర్గా జీవిస్తున్నాడు. శనివారం ఉదయం జగ్గంపేట శివారులో ఉన్న లారీ యూనియన్ ఆఫీస్కు వెళ్లి తిరిగి వెనుక నుంచి లారీ ఢీకొంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
● శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి దివ్య దర్శనం పరమ పావనమే.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి శనివారం అశేష భక్తజనం వచ్చారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఏడు శనివారాల స్వామివారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తూ, ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ.76.26 లక్షల ఆదాయం వచ్చింది. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు తదితరులు పర్యవేక్షించారు. –ఆత్రేయపురం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
రాజానగరం: కానవరంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్చార్జ్ డీఎస్పీ బి.రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కానవరం గ్రామంలో కోరాడ శివలక్ష్మి ఇరవై ఏళ్లుగా తన కుమార్తెతో కలసి ఉంటుంది. అదే గ్రామంలోని జీడిపప్పు ఫ్యాక్టరీలోకి ఆమె కూలికి వెళ్తుండగా, కుమార్తె రాజమహేంద్రవరంలోని ఓ నగల దుకాణంలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో గత నెల 25న ఉదయం ఇంటికి తాళం వేసి, ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన శివలక్ష్మి తాళం వేసిన తలుపులు తీసి ఉండటాన్ని గమనించి కంగారుగా లోనికి వెళ్లి చూస్తే బీరువా కూడా తెరిచి ఉంది. అందులోని 82.5 గ్రాముల బంగారు నగలు, 45 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రల ఆధారంగా చోరీకి పాల్పడిన ముద్దాయి జామ వీరగణేష్ని కాకినాడలో అరెస్టు చేశారు. అతడి నుంచి దొంగిలించిన నగల్లో 75.8 గ్రాముల బంగారం, 253.80 గ్రాముల వెండి వస్తువులను స్వాధీన పర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు నారాయణమ్మ, జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ మృతదేహం లభ్యం
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో నరసాపురం పెదకాలువలో గల్లంతైన గున్నం భార్గవీదుర్గ ప్రసన్న (26) మృతదేహం శనివారం లభ్యమైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గున్నం భార్గవి దుర్గాప్రసన్నతో పాటు స్నేహితుడు రావుపల్లి సమీర్చక్రవర్తి, ఆళ్ల పవన్శ్రీకర్ తేజలు శుక్రవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చారు. గుడ్ఫ్రైడే సెలవు కావడంతో శనివారం రావాలని అక్కడ సిబ్బంది చెప్పడంతో తణుకు పట్టణానికి వచ్చి భోజనం చేశారు. తహసీల్దార్ పీఎస్డీ ప్రసాద్, ఉండ్రాజవరం ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా కాలువరేవు సమీపాన గున్నం భార్గవి దుర్గాప్రసన్న మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలతో జలగాటం
ఫ సరదాగా ఈతకెళ్లిన నలుగురు స్నేహితులు ఫ ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు ఫ ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద ఘటన ఫ మృతులంతా రాజమహేంద్రవరం వాసులు సాక్షి, అమలాపురం/ ఆత్రేయపురం: ఉరకలేసే గోదావరి అప్పుడప్పుడూ యువత ఉసురు తీస్తోంది. జల క్రీడ వారిని మృత్యుఒడిలోకి లాగేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక శివారు గోదావరిలో శనివారం మధ్యాహ్నం ఒకరు మృతి చెందడం, ఇద్దరు యువకులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద స్నానాలకు దిగగా ఈ ఘటన జరిగింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామ శివారు పిచ్చుకలంకలో గోదావరి నదిలోకి రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు స్నేహితులు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్నానాలకు దిగారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గోరక్షణపేట, తుమ్మలావ ప్రాంతాలకు చెందిన మహ్మద్ అర్ఫాద్, షేక్ బిలాల్ (29), షేక్ సుల్తాన్ మహ్మద్ గల్లంతయ్యారు. ఇందులో షేక్ బిలాల్ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారు వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం. నలుగురు స్నేహితుల్లో ముసలి మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈత కోసం వెళ్లి.. ధవళేశ్వరం – బొబ్బర్లంక మధ్య ఉండే పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో ఈత కొట్టేందుకు వారంతా దిగారు. బ్యారేజీ గేట్ల దిగువన ఉన్న ఆనకట్టును దాటుకుని ఇసుక తిన్నెలు మొదలయ్యే ప్రాంతంలో వరకూ వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ నది లోతు పది నుంచి ఇరవై అడుగులు (మడుగులా) ఉంటోంది. నీటి ప్రవాహం కూడా అధికం. ఇది తెలియని యువకులు ఈత కొడుతూ కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ఆధ్వర్యంలో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. స్నానానికి వెళ్లిన యువకుడు ముసలి మణికంఠ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఏటా విషాద ఘటనలే.. ఏటా వేసవి వచ్చిందంటే గోదావరి చెంతన విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వైనతేయ, వశిష్ఠ, గౌతమీ నదీపాయల వెంబడి పలుచోట్ల లంకలు, గోదావరి ఏటిగట్టు దిగువన స్నానాలకు దిగడం పరిపాటి. ఇటువంటి చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది మే 27న ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో స్నానాలకు వెళ్లి ఎనిమిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకకు వచ్చిన 20 ఏళ్ల వయస్సు లేనివారు గోదావరిలో మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనితో పాటు పి.గన్నవరం అక్విడెక్టు, ముంగండ, రాజోలు, మలికిపురం, ఊడిమూడిలంక, గంటి పెదపూడి, కోటిపల్లి, శేరులంక, మురమళ్ల వంటి ప్రాంతాల్లో గోదావరి స్నానాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రమాదాలు జరిగినప్పుడు రెండు, మూడు రోజులు హడావుడి చేసే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు తరువాత గాలికి వదిలేస్తున్నారు. పిచ్చుకలంక వద్ద గోదావరిలో గాలింపు చర్యలను పరిశీలిస్తున్న పోలీసులు ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు పర్యాటకుల తాకిడి అధికం ధవళేశ్వరం బ్యారేజ్ నాలుగు ఆర్ముల్లో వేసవి సమయంలో పెద్ద ఎత్తున స్నానాలకు వస్తుంటారు. అధికంగా ధవళేశ్వరం, బొబ్బర్లంక ఆర్ముల వద్ద పర్యాటకుల తాకిడి ఉంటుంది. కొత్త, పాత బ్యారేజ్ మధ్య ఉండే ప్రాంతం స్నానాలకు అనువుగా ఉంటోంది. ఇది మండుటెండల నుంచి ఉపశమనం కలిగించేది కావడంతో కోనసీమ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. యువకులు, పెద్దలతో పాటు మహిళలు వస్తుంటారు. అయితే ఇక్కడ కనీస రక్షణ చర్యలు లేవు. హెచ్చరిక బోర్డులకే పరిమితం కావడంతో ఏటా ప్రమాదాలు తప్పడం లేదు. -
నిరసన జ్వాల
సాక్షి రాజమహేంద్రవరం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడును బర్తరఫ్ చేసి, టీటీడీ ప్రతిష్టతను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించిన బీఆర్ నాయుడుపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను సైతం చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జులు, ప్రజలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని బాలాజీపేట సెంటర్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిని ఖండిస్తూ.. ఆయనను వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గొందేశి శ్రీనివాసులురెడ్డి, నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నగర శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిరసన తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రతను, హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలని వైఎస్సార్ సీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటూ అసభ్య కార్యకలాపాల్లో మునిగి తేలడం దారుణమన్నారు. దేవీచౌక్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన సిగ్గు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, మార్గాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వురు బీఆర్ నాయుడును వెంటనే టీడీపీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొవ్వూరు 12వ వార్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఆలయం బయట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గొందేశి శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. మండపేట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం కలువుపువ్వు సెంటర్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం, బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిడదవోలు తిరుమల ప్రతిష్టను మంటగలిపిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని నిడదవోలు వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని యర్నగూడెం రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. గోపాలపురం టీటీడీ చైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బీఆర్ నాయుడును తక్షణం పదవి నుంచి తొలగించాలని మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. నల్లజర్లలోని రామకృష్ణ భక్త మందిరంలో మాజీ మంత్రిలో పాటు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల భక్తులు, హిందువుల మనోభావాలను కించపర్చేలా ప్రవర్తించిన బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొవ్వూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు, పార్టీ శ్రేణులురాజమహేంద్రవరం దేవీచౌక్లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, పార్టీ శ్రేణులుఫ తిరుమల పవిత్రతను కాపాడండి ఫ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి ఫ వైఎస్సార్ సీపీ శ్రేణుల డిమాండ్ ఫ వెంకన్న ఆలయాల్లో పూజలు ఫ జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఫ పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు -
అనధికార పాల విక్రయాలపై కఠిన చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అనధికారికంగా పాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కల్తీ పాల ఘటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక అధికారి టి.శ్రీనివాసరావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కె.సుప్రియలను శుక్రవారం ఆదేశించారు. జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులు, మాంసాహార పదార్థాల నాణ్యతపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసేందుకు పశు సంవర్ధక శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సంయుక్త బృందం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో లైసెన్స్ లేని పాల విక్రేతలు సుమారు 651 మంది ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అలాగే, సుమారు 650 మంది ఇంటింటికీ పాలు సరఫరా చేస్తున్నారని, మరో 725 మంది అనధికారిక పాల విక్రేతలు, షాపు యజమానులు, పాల సహకార సంఘాలు లైసెన్స్ లేకుండా పాల సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల సరఫరా కోసం లైసెన్స్ పొందాలని సూచించారు. లైసెన్స్ లేకుండా పాలు విక్రయిస్తే రూ.5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పశుసంవర్ధక సహాయకులు తమ పరిధిలోని పాల విక్రేతలను గుర్తించి, తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాసరావు ఆదేశించారు. టెన్త్ ఇంగ్లిషు ప్రశ్నపత్రంపై ఆందోళన రాయవరం: పదో తరగతి పరీక్షలు గత నెల 16న తెలుగుతో ప్రారంభమై ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. ఈ పరీక్షలకు ముందు విద్యా శాఖ అధికారులు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. దీనికి అనుగుణంగా అన్ని పరీక్షలూ అభ్యసన స్థాయికి తగినట్లుగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఇంగ్లిషు పేపరు మాత్రం పూర్తిగా స్థాయికి మించి ఉందని అంటున్నారు. బ్లూప్రింట్కు డీవియేట్ అయినట్లు ఇంగ్లిషు ఫోరమ్ సైతం ఆరోపిస్తోంది. ముఖ్యంగా 17, 18, 22, 25, 28, 31, 32 ప్రశ్నలు పూర్తిగా సబ్జెక్టుకు డీవియేట్ అయ్యాయని డీజీఈకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. దీనివలన విద్యార్థులు 15 మార్కులు నష్టపోతున్నారని చెబుతున్నారు. బాగా చదివే విద్యార్థులు కూడా ఇంగ్లిషు ప్రశ్నపత్రం కఠినంగా ఉందని అంటున్నట్లు తెలుస్తోంది. తాము కోల్పోతున్న 15 మార్కులూ అదనంగా ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వస్తోంది. ‘స్పాట్’కు హాజరు కావాలికంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 6 నుంచి స్థానిక బీవీఎం ఇంగ్లిష్ మీడియం హైస్కూలులో జరిగే పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనానికి (స్పాట్) సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) కంది వాసుదేవరావు ఆదేశించారు. బీవీఎం హైస్కూలులో మూల్యాంకనం ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. స్పాట్ వేల్యుయేషన్కు చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమితులైన ఉపాధ్యాయులకు సంబంధిత ఉత్తర్వులను లీప్ యాప్లో వారి వ్యక్తిగత లాగిన్లో ఉవ్చామని తెలిపారు. ఈ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకుని స్పాట్ విధులకు హాజరు కావాలని సూచించారు. స్పెషల్ అసిస్టెంట్లుగా నియమితులైన వారికి బీవీఎం హైస్కూల్లో శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పాట్ వేల్యుయేషన్పై శిక్షణ ఉంటుందన్నారు. వారందరూ విధిగా శిక్షణకు హాజరు కావాలన్నారు. స్పాట్ డ్యూటీలు పడిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి, వారు సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించామన్నారు. నిర్దేశించిన అనారోగ్య కారణాలు తప్ప స్పాట్ విధుల నుంచి ఎవ్వరికీ ఎటువంటి మినహాయింపులూ ఉండవని వాసుదేవరావు స్పష్టం చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ అమల కుమారి తదితరులున్నారు. ఫ ఎఫ్ఎస్ఎస్ఏఐలో నమోదు తప్పనిసరి ఫ లైసెన్స్ లేకుండా పాలు విక్రయిస్తే రూ.5 లక్షల వరకూ జరిమానా ఫ కలెక్టర్ కీర్తి చేకూరి -
డివైడర్ను ఢీకొన్న కారు
ముగ్గురికి తీవ్ర గాయాలు ఆలమూరు: 216ఏ జాతీ య రహదారిలోని చొప్పె ల్ల వద్ద శుక్రవారం జరిగి న రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన సుంకర నవీన్, చందుమళ్లకు చెందిన కె.రామ్తేజ, పాలకొల్లుకు చెందిన కె.శివాజీ గణేష్కుమార్ కారులో విశాఖపట్నం బయలు దేరారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి అపసవ్య దిశలో వెళ్లేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్హెచ్, 108 అంబులెన్స్లలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నీరు’పయోగంగా నీటితొట్టెలు
దేవరపల్లి: వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పశువుల నీటితొట్టెల పథకం నీరుగారుతోంది. గత ఏడాది ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 79.82 కోట్లతో 225 నీటితొట్టెలు నిర్మించారు. ఒక్కో తొట్టెను 300 లీటర్ల సామర్థ్యంతో, రూ 33,228 వ్యయంతో నిర్మించారు. గ్రామాల శివారున నీటితొట్టెలు నిర్మించి, పంచాయతీ ద్వారా పైపులైన్ ఏర్పాటు చేసి, ఆ తొట్టెల్లో నీరు నింపేలా పశు సంవర్ధక, పంచాయతీరాజ్ శాఖలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. మొదటి ఏడాది అంతంత మాత్రంగానే వినియోగపడిన నీటితొట్టెలు వర్షాకాలం, శీతాకాలంలో మూలన పడ్డాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చెరువులు ఎండిపోతూండటంతో పశువులు దాహార్తితో అల్లాడుతున్నాయి. నిర్వహణ లేక తొట్టెల్లోనూ నీరుండటం లేదు. దీంతో తాగునీటి కోసం మూగజీవాలు కటకటలాడుతున్నాయి. మరోవైపు నిర్మాణంలో నాణ్యత లోపాలతో పలుచోట్ల నీటితొట్టెలు పగుళ్లు తీసి కారిపోతున్నాయి. పైపులైన్లు పని చేయడం లేదు. ఇప్పటికే మెట్ట ప్రాంతంలో వేసవి తాపానికి భూగర్భ జలాలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో నీటిమట్టాలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని మూగజీవాలకు తాగునీటి వసతి కల్పించాలని రైతులు కోరుతున్నారు. -
ఔషధ చెట్టుకు వేపత్తు
పిఠాపురం: ఔషధ విలువలు కలిగిన చెట్టు అది.. అనేక రోగాల నివారణకు ఉపయోగపడుతోంది.. అలాంటి వేప చెట్లకు వింత వ్యాధి సోకింది.. ఇది ఓ ప్రకృతి వైపరీత్యమేనని నిపుణులు అంటున్నారు. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా, ఆరోగ్యప్రదాయినిగా భావించి పూజిస్తారు. ప్రాచీన కాలం నుంచి వేప చెట్టు పవిత్ర వృక్షంగా పిలవబడుతోంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉంది. ప్రతి ఇంటి వద్ద వేప చెట్టును పెంచుకుంటారు. దాని గాలి తగిలినా వ్యాధులు దరిచేరవని సాంకేతికంగా కూడా నిరూపణ కావడంతో ఈ చెట్టును అందరూ పెంచుకుంటారు. గతంలో ఈ చెట్టు లేని ఇల్లు ఉండేది కాదు. వేప పుల్లతోనే పళ్లు తోముకునే వారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వేప గాలి సోకిదంటే చాలు రోగాలు మాయమవుతాయని అంటారు. అలాంటి ఆరోగ్యప్రదాయిని అయిన వేప చెట్లకే పెద్ద ఆపద వచ్చింది. ఎక్కడ చూసినా ఈ చెట్లు ఎండిపోతున్నాయి. ఇండియన్ హెర్బల్ డాక్టర్గా పేరుగాంచిన వేపను 21వ శతాబ్దపు చెట్టుగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే వేప ఎంత మేలు చేస్తుందో చెప్పనక్కరలేదు. అందరి రోగాలకు మందులు ఇచ్చే వేప చెట్టును ఇప్పుడు ఒక రోగం పట్టిపీడిస్తోంది. ఇలా కాపాడుకుందాం.. వేప చెట్లు ఎండిపోవడం ఎందుకు జరుగుతుందంటే ఫోమాప్సిస్ అజాడిరాక్టే అనే శిలీంధ్రమే కారణం. దీనినే కొమ్మ ఎండు తెగులు అని అంటారు. వేప చెట్లలో ముదురు చెట్లు ఈ తెగులు సోకితే మొత్తానికి ఎండిపోతాయి. లేత చెట్లు మాత్రం కొంత వరకూ కాపాడుకోవచ్చు. ముదురు చెట్లకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చెట్టు చనిపోకుండా ఆపవచ్చు. ఈ శిలీంధ్రం వ్యాపించడం వల్ల ఆకులు ఎండిపోవడం, కాయలు కుళ్లిపోవడం జరుగుతుంది. ఒకసారి ఈ వ్యాధి ఆశిస్తే చెట్టు మొత్తం ఎండిపోతుంది. ఈ శిలీంధ్రం అన్ని పండ్ల మొక్కలకు, చెట్లకు ఆశిస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లని వాతావరణం, పెరుగుతున్న కాలుష్యం కూడా ఈ శిలీంధ్రం వ్యాపించడానికి అనుకూలంగా మారుతున్నాయి. అంతేకాకుడు టీమస్కిటోబగ్ అనే పురుగు కూడా ఆశిస్తోంది. దీనివల్ల శిలీంధ్రం త్వరగా చెట్టు బెరడులోకి పోయి పూర్తిగా ఎండిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల ప్రాఫినోఫాస్ మందు కలిపి పిచికారీ చేయాలి. లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్, లేకుంటే మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కానీ, మూడు గ్రాముల కాపర్ హైడ్రాక్సీక్లోరైడ్లను కలుపుకుని పిచికారీ చేయడం వల్ల టీమస్కిటోబగ్ అనే పురుగును నివారించవచ్చు. చెట్టు మొత్తం పూర్తిగా తడిచేలా మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వ్యాధిని పూర్తిగా నివారించలేమని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. జీవన ఎరువుల ద్వారా నివారణ వేప చెట్టుకు శిలీంధ్రం సోకి ఎండిపోతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో జీవన ఎరువులు వాడడం ద్వారా వేప చెట్టుకు పట్టి ్డన తెగులును నివారించవ చ్చు. దేశి తాజా ఆవు పేడ, ఆవు మూత్రం, నీరు, గుల్ల సున్నం, ఇంగువలతో తయారు చేసిన ద్రావణం ఈ శిలీంధ్ర నాశనానికి బాగా పనిచేస్తుంది. జీవామృతం, గణ జీవామృతం ఉపయోగించి కూడా చెట్టును కాపాడుకోవచ్చు. పూర్తిగా చెట్టు పాడైపోయిన తర్వాత మందులు వాడినా పెద్దగా ఉపయోగం ఉండదు. –ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం, కాకినాడ ఫ వేప చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఫ ఎక్కడికక్కడే మాడిపోతున్న వైనం వ్యవసాయంలో కీలకంగా.. వ్యవసాయంలో వేప చెట్టు కీలకంగా ఉంటోంది. వేప ఆకులు, కాయలను రసాయనాల తయారీకి ఉపయోగిస్తారు. ఎన్నో రకాల చీడపీడలను నివారించడం కోసం వీటి రసాయనాలను వాడుతుంటారు. కీటక నాశినిగా చక్కని సేంద్రియ ఎరువుగా బహుళ ప్రయాజనాల గనిగా రైతులు దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలోనే కాకుండా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడే చేలకు సైతం వేప నూనెను వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తుంటారు. -
పెళ్లయిన నెల రోజులకే..వివాహిత ఆత్మహత్య
కె.గంగవరం: పెళ్లయిన నెల రోజులకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సై సోమేంద్ర కథనం ప్రకారం.. కోటిపల్లికి చెందిన ఓలేటి వీరలక్ష్మి (19)కి అదే గ్రామంలోని ఏసుబాబుకు ఫిబ్రవరి 26న వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం వారం రోజుల పాటు తన భర్తతో కాపురం చేసి, తిరిగి తల్లిదండ్రుల వద్దే ఆమె ఉంటుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన భర్త ఏసుబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం వీరలక్ష్మి తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. భర్త ఏసుబాబు, అత్తమామల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి దోమ సత్తిబాబు కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై సోమేంద్ర తెలిపారు. శుక్రవారం మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ టీం, అమలాపురం నుంచి క్లూస్ టీం వారు వచ్చి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. -
జాతీయ రహదారిపై బైక్ బోల్తా
అడ్డతీగల: మండలంలోని చేనుపాకలు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం బైక్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డతీగలకు చెందిన ముప్పనశెట్టి సురేష్ చేనుపాకలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనే 30 అడుగుల పైబడి లోతులోని పంట కాలువలో పడిపోయాడు. ఈ సంఘటనలో సురేష్ తలతో పాటు ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని అడ్డతీగల సీహెచ్సీకి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని అంటున్నారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శబరి నదిలో యువకుడి మృతి వీఆర్పురం: శబరి నదిలో స్నానానికి దిగిన ఓ యువకుడు మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళితే.. వీఆర్పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన బోర్ర శివ (19) శుక్రవారం సాయంత్రం బంధువుతో కలసి శబరి నదిలో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగా నదీ ప్రవాహానికి శివ కొట్టుకుపోయాడు. అక్కడున్న వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది శబరి బ్రిడ్జి వద్ద మత్స్యశాఖ సహకారంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటలకు శివ మృతదేహం లభ్యమైంది. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి ఉప్పలగుప్తం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ఎస్కే జానీబాషా కథనం ప్రకారం.. కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన మల్లవరపు పవన్ (28) గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళుతుండగా ఎన్.కొత్తపల్లి సమీపంలో ప్రధాన రహదారిలో ఎదురుగా వస్తున్న లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని 108లో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోటలోని ఉప్పువారి వీధికి చెందిన చల్లాబత్తుల రాజు (50) రోడ్డుపై మృతి చెంది ఉన్నాడు. మోటారు సైకిల్పై వెళుతున్న రాజును ఏదైనా వాహనం ఢీకొందా, అతనే రోడ్డుపై పడి మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలువలో మహిళ గల్లంతు నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో శుక్రవారం నరసాపురం పెద కాలువలో పడి ఓ మహిళ గల్లంతైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గున్నం భార్గవి దుర్గాప్రసన్న (26) దమ్మెన్ను కొండాలమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చింది. అక్కడే ఉన్న కాలువలో కాళ్లు కడుగుతున్న సమయంలో మెట్లు నాచుపట్టి ఉండటంతో ప్రమాదవశాత్తు జారి కాలువలో కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఉండ్రాజవరం ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘శలాక’కు ఆర్ష వాగ్వ్యాఖ్యానదీక్షిత బిరుదు
రాజమహేంద్రవరం రూరల్: మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ ‘ఆర్ష వాగ్వ్యాఖ్యానదీక్షిత’ బిరుదును అందుకున్నారు. కొంతమూరులోని దత్తాత్రేయ వేదవిద్యా గురుకులం ఆధ్వర్యాన మండపేట విజయా కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. గురుకులం వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ఈ బిరుదును శలాకకు ప్రదానం చేశారు. ఆర్ష విద్యా వ్యాప్తికి శలాక చేస్తున్న కృషి శృంగేరి పీఠాధిపతుల ప్రశంసలను సైతం అందుకుందని ఈ సందర్భంగా గుళ్లపల్లి అన్నారు. తనకు జరిగిన సత్కారానికి శలాక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో తన కృషిని కొనసాగిస్తానని చెప్పారు. కార్యక్రమంలో గుళ్లపల్లి ఆంజనేయ ఘనపాఠి, మల్టీటెక్ సంస్థ అధినేత వెంకట్రావు, నిడదవోలు మండలం కోటసత్తెమ్మ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, సినీ నటుడు జూనియర్ రేలంగి, పలువురు వేద పండితులు పాల్గొన్నారు. -
స్వామిని చూసి.. మైమరచి
ఫ సత్యదేవుని సన్నిధికి భారీగా భక్తులు ఫ ఒక్కరోజే రూ.30 లక్షల ఆదాయం అన్నవరం: ఆ సత్యదేవుని చూసిన ప్రతి మదీ పులకించింది.. తన్మయత్వంలో ఓలలాడింది.. శుక్రవారం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిలో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున వివాహాలు జరగడంతో నవ దంపతులు, వారి బంధుమిత్రులతో సందడి నెలకొంది. ఈ ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. కాగా, శని, ఆదివారాలు కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘనంగా చండీ హోమం రత్నగిరిపై వనదుర్గమ్మ వారికి చండీ హోమం నిర్వహించారు. అనంతరం గుండంలో హోమ ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి జరిపారు. తరువాత అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. వనదుర్గమ్మ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో రూ.750 టిక్కెట్తో 45 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేశారు. -
ఎన్నాళ్లీ ఆందోళనకర్రం
అడ్డతీగల మండలం డి.భీమవరం వద్ద వంకాయల కాలువపై నలభై ఏళ్ల కిందట నిర్మించిన వంతెన శిథిలమైంది. ఈ వంతెనపై రెండు చోట్ల గుంతలు పడ్డాయి. ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలే గోతుల్లో ఇలా కర్రలు నిలిపి వస్త్రాన్ని పెట్టి ఉంచారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వగ్రామం అనంతగిరికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమైనా కనీసం పట్టించుకోవడం లేదు. అడ్డతీగల మండలంలో 30, రాజవొమ్మంగి మండలంలో పది గ్రామాలకు ఇదే దారి కావడం గమనార్హం. –అడ్డతీగల ఆవునండి భలే! పాశర్లపూడికి చెందిన ఆదర్శ రైతు ఉప్పే బాలాజీ పెంచుతున్న రాజస్థాన్ రాఠీ జాతికి చెందిన ఆవు ఆకట్టుకుంటోంది. శరీరంపై అందమైన మచ్చలతో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ ఆవు రోజుకు 20 లీటర్ల పాలు ఇస్తోంది. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఆవు సంతానంగా ఈ పశువు ప్రస్తుతం బాలాజీ కుటుంబానికి ఆదరణగా మారింది.మంచి పాల దిగుబడి ఇస్తున్న ఈ అరుదైన ఆవును ఎంతో మమకారంతో పోషిస్తున్నారు. –మామిడికుదురు -
హమ్మయ్యా స్పందించారు..
లొల్ల లాకుల ఆధునీకరణకు 74.20 కోట్లు మంజూరు ఆత్రేయపురం: మధ్య డెల్టా పరిధిలోని లొల్ల లాకుల ఆధునీకరణకు ఎట్టకేలకు ప్రభుత్వం రూ.74.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లాకుల అధ్వాన పరిస్థితిపై గత నెల 10న పా‘లాకులు’ పట్టించుకోక అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో లొల్ల లాకులను వెంటనే పునర్నిర్మించాలని ప్రభుత్వంపై జిల్లా ప్రాజెక్టు కమిటీ ఒత్తిడి తెచ్చింది. లొల్ల లాకులు ఆధునీకరణకు రూ.74.20 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్య డెల్టా ప్రధాన కాలువ 13.200 కిలోమీటరు వద్ద లొల్ల, ర్యాలి వేర్, లాక్స్, ఇప్పటికే ఉన్న లాక్స్, వేర్లు, వంతెనల దిగువ భాగంలో డీఎల్ఆర్బీ పునర్నిర్మాణానికి పరిపాలన అనుమతి మంజూరు చేసింది. లొల్ల లాకుల నుంచి అమలాపురం బ్యాంకు కాలువ, అమలాపురం కాలువ, గన్నవరం కాలువల పునర్నిర్మాణం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సజావుగా సాగునీరు అందించే పనులతోపాటు అమలాపురం బొబ్బర్లంక రోడ్డులో లొల్ల లాకుల సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. -
స్పాట్ పెట్టేస్తారిక..
సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 343 గ్రామ పంచాయతీలున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం పైగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులే సర్పంచ్లు, వార్డు సభ్యులుగా విజయం సాధించారు. వీరు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించారు. వీరి పదవీ కాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం తెర తీసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఈఓ, ఏఓ, మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధికారుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎంలకు సైతం బాధ్యతలు అప్పజెప్పారు. పంచాయతీలు ఎక్కువగా ఉండటం.. అందుకు తగ్గట్టు అధికారులు లేకపోవడంతో.. కొందరు సీనియర్ అధికారులకు రెండు నుంచి మూడు, మరి కొందరికి ఐదు పంచాయతీల బాధ్యతలు సైతం అప్పగించారు. శుక్రవారం గుడ్ఫ్రైడే సెలవు కావడంతో ప్రత్యేకాధికారులు శనివారం పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు జరిగేంత వరకూ పల్లెల్లో ప్రత్యేకాధికారులే పాలనా వ్యవహారాలు చక్కబెట్టనున్నారు. ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తే.. కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ పడుతుంది. ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం తాగునీరు, పారిశుధ్యానికి, మిగిలిన 50 శాతం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రయోజన పనులకు వినియోగిస్తారు. జిల్లాకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ఇవి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మేజర్ గ్రామ పంచాయతీలు సాధారణ నిధులపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడనుంది. ఎలాంటి ఆదాయ వనరులూ లేని చిన్న పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందులూ ‘ప్రత్యేకమే..’ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఆయా పంచాయతీల్లో ప్రజలకు వివిధ సేవలు అందడంలోను, అభివృద్ధి కార్యక్రమాల్లోను జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖ విధులు నిర్వర్తించడంతో పాటు అదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలి. దీనికి తోడు ఒక్కో అధికారికి రెండు నుంచి ఐదు పంచాయతీలు అప్పగించారు. దీంతో వారిపై మరింత భారం పడనుంది. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, ఇతర సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఎక్కడో ఉంటారు. వారిని సంప్రదించాలంటే ఇబ్బందులు తప్పవు. అదే గ్రామంలో సర్పంచులుంటే.. ఆయా సమస్యలను వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లి సత్వరం పరిష్కరించే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండే అవకాశం తక్కువ కావడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు. సర్కారు వెనుకడుగు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు వెనుకడుగు వేస్తోంది. అధికార పగ్గాలు చేపట్టిన దాదాపు రెండేళ్లలో కూటమి నేతలు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. మద్యం, ఇసుక ఇలా ఏ రంగంలోనైనా దండుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమవడంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఎన్నికలకు వెళితే ఘోర ఓటమి చవిచూసే అవకాశం ఉందన్న ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పొరపాట్లకు తావు లేకుండా.. స్పాట్ వేల్యుయేషన్ విధులకు నియమితులైన వారు తప్పనిసరిగా హాజరు కావాలి. ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. మూల్యాంకన విధులకు హాజరయ్యే వారు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. – జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ రాయవరం: గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 391 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో రెగ్యులర్, ప్రైవేటుగా మొత్తం 72,797 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, సగటున 99.48 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2022 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లా కేంద్రం కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకనం జరిగేది. 2023 నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్పాట్ వేల్యుయేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. కాకినాడలో సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, కోనసీమ జిల్లాలో అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్లోని బీవీఎం హైస్కూల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. జిల్లాలకు చేరిన జవాబు పత్రాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5,43,694 జవాబు పత్రాలకు ఉమ్మడి మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇందులో కాకినాడ జిల్లాలో 1,85,811, తూర్పు గోదావరి జిల్లాలో 1,76,106, కోనసీమ జిల్లాలో 1,81,777 చొప్పున జవాబు పత్రాలున్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే జవాబు పత్రాలు ఆయా జిల్లాలకు దాదాపు చేరుకున్నాయి. ఆయా జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు క్యాంప్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు పాల్గోనున్నారు. సబ్జెక్టుల వారీగా.. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, సంస్కృతం, ఒకేషనల్ సబ్జెక్టులకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు నేరుగా ఉత్తర్వులు అందజేశారు. ఆరు సబ్జెక్టులు, ఒకేషనల్ పరీక్షలు కలిపి మొత్తం పది రోజుల పాటు మూల్యాంకనం జరుగుతుంది. ఇవీ నిబంధనలు ఫ మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సెల్ఫోన్, స్మార్ట్ఫోన్లు, వైట్నర్, ఎరేజర్ తదితర వస్తువులను తీసుకుని వెళ్లరాదు. ఫ మూల్యాంకన సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి తప్పిదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫ శిబిరానికి నిర్దేశిత సమయాల్లో హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఫ 6 నుంచి 15 వరకూ టెన్త్ స్పాట్ వేల్యుయేషన్ ఫ ఉమ్మడి జిల్లాలో 5.44 లక్షల జవాబు పత్రాలు ఫ ఇప్పటికే లీప్ యాప్లో ఉత్తర్వులు ఫ ఏఈలు, సీఈలు, స్పెషల్ అసిస్టెంట్లకు నేడు శిక్షణ స్పాట్కు జిల్లాల వారీగా నియామకాలు ఇలా..కేటగిరీ తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు 1 1 1 స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జి 1 1 1 అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు 8 7 8 ఏఏసీఓలు 8 7 8 చీఫ్ ఎగ్జామినర్లు 100 79 79 అసిస్టెంట్ ఎగ్జామినర్లు 453 476 483 స్పెషల్ అసిస్టెంట్లు 267 237 242 ఫ ముగిసిన సర్పంచుల పదవీ కాలం ఫ జిల్లాలో 343 గ్రామ పంచాయతీలు ఫ అన్నిచోట్లా ప్రత్యేకాధికారుల నియామకం ఫ నేడు విధుల్లోకి ప్రత్యేకాధికారులు -
నేత్రపర్వంగా శ్రీపుష్పయాగం
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభస్వామికి శుక్రవారం శ్రీపుష్పయాగం నేత్రపర్వంగా సాగింది. గత నెల 29న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీపుష్ప యాగం నిర్వహించారు. ఆలయ చైర్మన్ మొయిళ్ల సంధ్య కృష్ణమూర్తి దంపతులు, ఈఓ వడ్డి శ్రీనివాసరావు, ట్రస్టు బోర్డు సభ్యులు స్వామివారికి పండ్లు, వివిధ రకాల మిఠాయిలు, పుష్పాలను సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్లను ఉంచి ఆలయ పండితులు పెద్దింట నారాయణాచార్యులు, పెద్దింటి గోపాలాచార్యులు పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఉయ్యాల మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులు ఉంచారు. తర్వాత చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. -
సమర్థంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బడ్జెట్ అవుట్ రీచ్ 2026–27 కార్యక్రమం సందర్భంగా జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు రూ.3,832.08 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.2,163.30 కోట్ల కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. కలెక్టర్ కీర్తి, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టెన్షన్కు టాటా..
రాయవరం: జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 17వ తేదీన ఇవి ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఈ పరీక్షల నిర్వహణను విద్యాశాఖ సమర్థవంతంగా చేపట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 391 కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 72,797 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, మొత్తం 99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ నిరంతరం తనిఖీలు నిర్వహించి, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నాయి. ఉభయులకు ఉపశమనం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటూ విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు, పరీక్షలు ముగియగానే సంతోషంగా ఇంటిబాట పట్టారు. అదే సమయంలో ఇన్నాళ్లూ తమతో చదువుకున్న విద్యార్థులు, పరీక్షా కేంద్రంలో పరిచయమైన విద్యార్థులు బాధగానే వీడ్కోలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కరపత్రాలు పంచుతూ, వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించే పనిలో పడ్డాయి. ఫలితాలపైనే దృష్టి పరీక్షలు ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపైనే కేంద్రీకరించారు. 2025 పది ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా, తూర్పుగోదావరి జిల్లా 87.99 శాతం ఉత్తీర్ణతతో 6వ స్థానంలో, కాకినాడ జిల్లా 82.44 శాతంతో 15వ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది గతేడాది ఆ ఫలితాలకు మించి ఉత్తీర్ణతా శాతాన్ని మెరుగుపర్చుకుంటాయో, లేదో చూడాలి. గతేడాది మెరుగైన ఫలితాలు గతేడాది ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణతా ఫలితాలను సాధించాయి. ఈ ఏడాది కూడా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణిస్తారనే నమ్మకాన్ని ఆయా పాఠశాలల హెచ్ఎంలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫలితాల మాటెలా ఉన్నా జిల్లాలో పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా, సమర్థ వంతంగా నిర్వహించడంపై పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ జి.నాగమణి జిల్లాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కాగా.. పది పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఈ నెల 6 నుంచి చేపట్టనున్నారు. పరీక్ష పేపర్ల వాల్యుయేషన్కు నియమించిన ఉపాధ్యాయులు విధిగా స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కావాలని ఆర్జేడీ నాగమణి తెలిపారు.ఫ ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఫ ప్రశాంతంగా జరిగిన వైనం ఫ గతేడాది ఆరో స్థానంలో నిలిచిన ‘తూర్పు’ ఫ ఈసారి మెరుగవుతుందని ఆకాంక్ష -
రథోత్సవంలో అపశ్రుతి
భద్రతా వైఫల్యానికి యువకుడి బలి పిఠాపురం: అధికారుల భద్రతా వైఫల్యం ఓ అమాయకుడిని బలి తీసుకుంది. చేబ్రోలు జరిన రాములవారి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం కిందపడి శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కా వెంకటేష్ (22) మృత్యువాత పడిన సంఘటన భక్తులను కలవరపాటుకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి చేబ్రోలులో రాములవారి రథోత్సవం నిర్వహిస్తుండగా, చూడడానికి కత్తిపూడికి చెందిన యువకుడు దుక్కా వెంకటేష్ (శ్రీను) వచ్చాడు. రథం తాడు లాగే క్రమంలో ప్రమాదవశాత్తూ రథం తగిలి కింద పడ్డాడు. అతని పొట్ట మీదుగా రథం చక్రం నొక్కింది. వెంటనే అతనిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు మృతుడి తండ్రి దుక్క శ్రీను చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. భద్రతా వైఫల్యమే కారణం దేవాలయ చరిత్రలో వందల ఏళ్ల నుంచి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో ఇప్పటి వరకూ చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రస్తుత రథోత్సవంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. రథం చక్రాల వద్ద కేవలం రథాన్ని మలుపు తిప్పే శీలలతో ఉన్న వ్యక్తులు, పోలీసులు మాత్రమే ఉండాలి. అయితే జనాన్ని అదుపు చేయడంలో ఆలయ కమిటీ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నారు. అత్యంత భారీ జన సందోహం మధ్య సాగే రథయాత్ర జరిగే చేబ్రోలు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్దీకరించకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఆలయ కమిటీపై ఫిర్యాదు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల రథోత్సవంలో తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి దుక్కా శ్రీను గొల్లప్రోలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఆలయ కమిటీపై తగిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. -
అధ్వాన ఏటిగట్టుపై అవస్థలు
రామేశ్వరం నుంచి గుడిమూల శివాలయం వరకూ ఉన్న ఏటిగట్టు మార్గం పూర్తి అధ్వానంగా ఉంది. ఈ మార్గంలో అంతర్వేది క్షేత్రానికి వాహనాలపై వెళ్లే భక్తులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు – డి.మార్టిన్, సఖినేటిపల్లి ఈ మార్గం చాలా దగ్గర సఖినేటిపల్లి బోను సెంటర్ నుంచి రామేశ్వరం మీదుగా ఏటిగట్టు వెంబడి అంతర్వేదికి ఉన్న మార్గం చాలా దగ్గర. అయితే మధ్యలో అధ్వానంగా మారిన 4 కిలోమీటర్ల రోడ్డును బాగు చేస్తే మంచింది. ఇప్పుడు చుట్టూ తిరిగి మరో 4 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. – కోన ప్రభాకర్రావు, గుడిమూల●ప్రతిపాదనలు పంపించాం సఖినేటిపల్లి బోను సెంటర్ నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పు, రెండు వరుసల రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. రామేశ్వరం సరిహద్దు నుంచి గుడిమూల శివాలయం వరకూ ఎన్ఆర్జీఎస్లో పెట్టాం. అలాగే బోను వద్ద నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పునకు కూడా అవసరమైన చోట్ల పనులకు పుష్కర గ్రాంటులో పెడుతున్నాం. నిధులు మంజూరైన పనులు మొదలు పెడతాం. –సురేష్, ఆర్అండ్బీ, జేఈ, రాజోలు -
2,818 కిలోల గంజాయి ధ్వంసం
అమలాపురం టౌన్: జిల్లాలో 77 కేసులకు సంబంధించి సీజ్ చేసిన 2,818 కిలోల గంజాయిని విశాఖపట్నం జిందాల్ పవర్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. విశాఖపట్నం జిందాల్ పవర్ ప్లాంట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనాతో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు గంజాయి ధ్వంసం చేసిన విషయాలను ఎస్పీ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈగల్ టీమ్ల ద్వారా జిల్లాలో గంజాయి ముఠాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆపతాపాలు
● సుర్రుమనిపిస్తున్న సూరీడు ● ఉమ్మడి జిల్లాలో మంటలు ● వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు అవసరం ఇలా చేస్తే మేలు ● వేసవిలో రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తరచూ తాగాలి. ● లేత రంగు కలిగిన తేలికగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రెండు పూటలా స్నానం చేయాలి. ● ఎండ తీవ్రత అఽధికంగా ఉన్నప్పుడు బయటకు వెళితే గొడుగు లేదా టోపీ ధరించాలి. లేకుంటే తలకు రుమాలు చుట్టుకోవాలి. ● ఇంట్లో కిటికీలు తెరిచి గదిలోకి గాలి వచ్చి చల్లబడే విధంగా చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ప్రచారం వేసవికాలం దృష్టా సంభవించే వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ సిబ్బందితో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. వడదెబ్బకు గురికాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏరియా, ప్రభుత్వ, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం. –ఎం.సుమలత, అదనపు జిల్లా వైద్యాధికారి, కోనసీమ ఆలమూరు: వేసవి వచ్చేసింది.. మండే ఎండలను తెచ్చేసింది.. బయటకు వెళ్తే సుర్రుమనిపిస్తోంది.. ఈ ఏడాది మార్చి తొలి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాధారణంగా మే నెల ప్రథమార్థంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. రెక్కల కష్టం మీద జీవనం సాగించే సామాన్యులపై ఎండ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు, ఇటుక పరిశ్రమ, భవన నిర్మాణ కార్మికులు, రోగ నిరోధశక్తి తగిన మోతాదులో లేని అనారోగ్య తీవ్రత ఉన్నవారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఏరియా, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఉన్న సమయంలో మానవుని శరీరంలోకి సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. వేడిగాలుల వల్ల వడదెబ్బ (హీట్ స్ట్రోక్), శరీరంలో లవణాలు కొల్పోవడం (డీహైడ్రేషన్)తో కలిగే దుష్ఫరిణామాలు వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని ప్రాథమిక అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వడదెబ్బకు కారణమవుతుంది. సత్వరం ప్రాథమిక చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతోంది. మగత నిద్ర రావడం, కలవరింతలు పలకడం, పెదవులు తడిబారి పోవడం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందే విధంగా చూడాలి. త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలే విధంగా చేయాలి. శరీరం సాధారణ స్థాయి ఉష్ణోగ్రత వరకూ వచ్చే వరకూ మెత్తటి తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిగిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ లేక ఓఆర్ఎస్ను తాగించాలి. అపస్మారక స్థితికి వెళ్లిన రోగితో నీరు తాగించరాదు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందించాలి. -
కొండెక్కిన పులి
● మళ్లీ సీతానగరం మండలంలోకి.. ● జనంలో భయాందోళన రాజానగరం: సీతానగరం మండలంలోకి పులి మళ్లీ వచ్చింది.. కొండెక్కి కూర్చుంది.. ఏటిపట్టు ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులి సంచారంపై వస్తున్న సమాచారంతో తమ ప్రాణాలతో పాటు పశువులను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక జనం భయపడిపోతున్నారు. వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. పెద్ద పులి సీతానగరంలో ఉన్న చిట్టిబాబాజీ ఆశ్రమ గోశాల సమీపంలోని కొండపై ఉన్నట్టు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారి హరీష్ విజ్ఞప్తి చేశారు. రామదుర్గంలోని పురాతన రామాలయం ఉన్న కొండపైకి చేరిన పులి బుధవారం రాత్రి సీతానగరంలోని చిట్టి బాబాజీ ఆశ్రమం గోశాలకు సమీపంలో ఉన్న కొండపైకి చేరుకున్నట్టు తెలుసుకున్నారు. పులి పగలంతా విశ్రాంతి తీసుకుని, చీకటి పడిన తరువాత వేటకు వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో ప్రస్తుతం కొండపై నుంచి దిగి నేలకోట, రామవరపు ఆవ వైపు వెళ్లే అవకాశం ఉందని, లేకుంటే వచ్చిన మార్గంలోనే పెదకొండేపూడి వైపు దిగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పులి సంచారంపై ప్రజలను భయబ్రాంతులను చేసే విధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అటువంటి వాటిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రేపు ‘తిరుమల’లో అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం తిరుమల క్యాంపస్లో తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ అండ్ నీట్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల ద్వారా ప్రసిద్ధ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ లాంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలి, తల్లిదండ్రుల తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, అలాగే వారికి ఉన్నత విలువలు ఎలా నేర్పాలో తెలియజేస్తారన్నారు. ఈ సదస్సుకు హాజరవ్వాలంటే ముందుగా తమ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏఈడీయూ.సీవోఎం నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకోని వారు అదే రోజు ఉదయం 9 గంటల లోపు క్యాంపస్లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. బాలిక అదృశ్యంపై కేసు నిడదవోలు రూరల్: పదో తరగతి పరీక్షకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. కోరుమామిడి గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి పరీక్ష రాసేందుకు గురువారం ఉదయం తాడిమళ్ల జెడ్పీ హైస్కూల్కు వెళ్లి తిరిగి రాలేదన్నారు. తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెల్లం ఊట ధ్వంసం తాళ్లరేవు: కోరంగి మడ అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై గురువారం అటవీ సిబ్బంది, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్, ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి 26 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ మడ అడవులలో ఎవరైనా చట్ట విరుద్ధంగా సారా కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రి మందలించాడని ఆత్మహత్య కొత్తపల్లి: తండ్రి మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు మాయాపట్నానికి చెందిన మెరుగు సత్తిరాజు (55) తన తండ్రి మందలించాడనే కోపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కుటుంబ సభ్యులు సత్తిరాజును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు. కోళ్ల మేత మెషీన్పై పడి వ్యక్తి మృతి నిడదవోలు రూరల్: కోళ్లఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ, కోళ్ల మేత మెషీన్పై పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ నూతంగి సత్యానందం (33) ఎలక్ట్రికల్, ప్లంబింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. కాటకోటేశ్వరం గ్రామంలో కొత్తపల్లి వెంకటేశ్వరరావుకు చెందిన కోళ్లఫారంలో గురువారం మధ్యాహ్నం వాటర్షెడ్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కోళ్ల మేత మెషీన్పై పడ్డాడు. ఈ నేపథ్యంలో సత్యానందం తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. భార్య కోట సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సత్యానందం మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కాలువలో పడి బాలుడి మృతి
మోతుగూడెం: కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి సుకుమామిడి గ్రామానికి చెందిన కుత్తిమ ఆదిలక్ష్మి తన కూతురు, కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికి పంపి కూలి పనులకు వెళ్లిపోయింది. సాయంత్రం వచ్చి చూడగా, కుమారుడు ఉత్తమ లక్ష్మణ్రెడ్డి (4) కనిపించలేదు. దీంతో గ్రామస్తుల సాయంతో వెతకగా ఆ బాలుడు గ్రామ సమీపంలోని కాలువలో నీటిలో తేలాడుతూ కనిపించాడు. ఈ సమాచారాన్ని ఎస్సై నాజీర్ హుస్సేన్కు తెలపడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతానికి ఎలక్ట్రీషియన్ మృతి ఏలేశ్వరం: విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. యర్రవరంలోని లేఅవుట్ సమీపంలో విద్యుత్ స్తంభం వద్ద గ్రామానికి చెందిన బిరుసు రాజు (40) మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను వెంటనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కట్నం వేధింపులపై ఫిర్యాదు
అనపర్తి: అదనపు కట్నం కోరుతూ తన కుమార్తెను అల్లుడు చిత్ర హింసలకు గురి చేస్తున్నాడంటూ బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన మారుబోయిన వరలక్ష్మి బుధవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్సై రవిచంద్ర తెలిపారు. పోలీసుల కథనం మేరకు వరలక్ష్మికి కుమారుడు, కుమార్తె సంతానం కాగా ఆమె భర్త, కుమారుడు ఏడాది క్రితం మరణించారు. కుమార్తె, 19 ఏళ్ల చిన్నతల్లికి ఊలపల్లి గ్రామానికి చెందిన బిర్లంకి తరుణ్కుమార్తో ప్రేమ వివాహం జరిగిందని వారిద్దరూ వరలక్ష్మి ఇంటి వద్దే బలభద్రపురంలో కాపురం ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. తరుణ్కుమార్ ఇటీవల మద్యానికి బానిసై కట్నం కోసం డిమాండ్ చేస్తూ చిన్నతల్లిపై దాడి చేయడం, దూషించడం చేస్తున్నాడు. దీనితో వరలక్ష్మి అతనిని నిలదీయగా ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని తరుణ్కుమార్ తల్లి బిర్లంకి వరలక్ష్మికి చెప్పగా, ఆమె కూడా తన కొడుకుకు మద్దతు ఇస్తూ, రూ.రెండు లక్షల కట్నం డిమాండ్ చేసింది. అలాగే గత నెల 30వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటలకు తరుణ్కుమార్ తన అత్త వరలక్ష్మితో గొడవపడి దాడి చేసి గాయపరిచాడు. వెంటనే ఆమెను చికిత్స కోసం అనపర్తిలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్టు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని రామచంద్రపురానికి చెందిన పిర్ల పోశయ్య (33) విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్టు ఎస్సై బి.వినయ్ ప్రతాప్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ కూలి అయిన పోశయ్య మంగళవారం సాయంత్రం 4 గంటలకు పశువులకు పచ్చగడ్డి కోసేందుకు పొలాల్లోకి వెళ్లాడు. కోసిన పచ్చగడ్డి మోపు తలపై పెట్టుకుని వస్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లకు తడిగా ఉన్న పచ్చగడ్డి మోపు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. రాత్రయినా అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఎక్కడికై నా వెళ్లి ఉంటాడని వెళ్లాడని ఇంటివారు భావించారు. బుధవారం ఉదయం పోశయ్య అన్నతో పాటు మరికొందరు అతడి కోసం పంట పొలాల్లో గాలించగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మృత దేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై వినయ్ ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వినయ్ప్రతాప్ తెలిపారు. మృతునికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. గుప్త నిధుల తవ్వకాలపై విచారణ గంగవరం: గుప్త నిధుల కోసం కొందరు క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు జరుపుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. ఎస్సై వెంకయ్య తెలిపిన వివరాల మేరకు, మండలం ఎండపల్లి రామవరం గ్రామంలో రెండు రోజుల క్రితం కొందరు గుప్తనిధులు కోసం తవ్వకాలు జరపుతున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం ఎండపల్లి రామవరంలో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలను సర్పంచ్ రామలక్ష్మి, గ్రామస్తులతో వెళ్లి పరిశీలించినట్టు ఎస్సై వెంకయ్య వివరించారు. అనంతరం ఎండపల్లి రామవరం చేరుకున్న సీఐ నరసింహమూర్తి గ్రామంలో పర్యటించి మాట్లాడుతూ మూఢ నమ్మకాలు నమ్మొద్దని, క్షుద్ర పూజల వదంతులు నమ్మెద్దన్నారు. బాల్య వివాహాలు, మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై యువతకు, ప్రజలకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5.2 లక్షలకు టోకరా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉద్యోగం వేయిస్తానని చెప్పి రూ.5.2 లక్షలకు టోకరా వేసిన వ్యక్తిపై రెండో పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజమహేంద్రవరానికి చెందిన బొండా రమేష్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయనకు గుంటూరుకు చెందిన దేవదాయశాఖలో పనిచేసే చింతపల్లి శ్రీనివాస్ పరిచయమయ్యాడు. తనకు రాజకీయ నాయకులు, పెద్ద స్థాయి అధికారులు తెలుసునని రమేష్ కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రమేష్ నుంచి రూ.5.2 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగంపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్పై అనుమానం వచ్చిన రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా
సాక్షి, రాజమహేంద్రవరం: రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. 2029లో దేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారని జోస్యం పలికారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా మారిందని, కాపుల స్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని అభిప్రాయపడ్డారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సీఎం చంద్రబాబు బిలియనీర్ ఎలా అయ్యారు, ప్రజల సొమ్ము దోచుకోలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉందన్నారు. అప్పులు చేసి రాజధానికి పెడుతున్నారు. అది అమరావతి కాదు.. కమ్మరావతి అని అక్కడి ప్రజలే చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎకరం రూ.99తో 100 ఎకరాలు లీజుకు ఇస్తున్నారు. దేవతలు తిరిగిన ప్రాంతం కావడంతో రాజధానికి ఎంపిక చేశామని అంటున్నారు. నేను చాలాసార్లు అక్కడ తిరిగా ఏ దేవతా కనిపించలేదే? అని అన్నారు. అమరావతి షిఫ్ట్ కావడం తథ్యం. ఎక్కడికి పోతుందో ఇప్పుడే చెప్పలేనన్నారు. 1953 నుంచి రాజధాని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతూనే ఉందన్నారు. చంద్రబాబు కలలు సఫలీకృతం కావన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేదలకు చేసింది శూన్యమని, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారన్నారు. జడ్జీల నియామకాలు, జడ్జిమెంట్లలో రాజకీయ జోక్యం తగదన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో ఒక జడ్జి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే, ప్రభుత్వ పెద్దలు అనుమతి కావాలని ఆరోపించారు. ఇరాన్–అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు మిగిలాయన్నారు. రాజమహేంద్రవరంలో గ్యాస్ లేక హోటళ్లు మూతపడ్డాయి. కృష్ణా, గోదావరి బేసిన్ గ్యాస్ స్థానికులకు అందడం లేదు. సమావేశంలో ఎస్సీ నేత జెడ్డా మోహన్ పాల్గొన్నారు. -
చల్చల్ గుర్రం.. చలాకి గుర్రం..
కుర్రకారు కేరింతలతో చేబ్రోలులో దుమ్ము రేపిన గుర్రాలు పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు రేసు గుర్రాల గిట్టల శబ్దాలతో మార్మోగింది. ఉత్కంఠ నడుమ కనురెప్ప పాటులో గమ్యం చేరుకోవడానికి గుర్రాలు దౌడు తీస్తుంటే జనం కేరింతలకు అంతు లేకుండా పోయింది. పదేళ్ల క్రితం సామర్లకోటలో జరిగిన గుర్రాల పందేల తరువాత గత ఏడాది నుంచి మళ్లీ పందేలు ప్రారంభం కావడంతో వాటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. చేబ్రోలులో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి సుమారు 25 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురానికి చెందిన విక్కీ (గుర్రం) ఈ పోటీలో ప్రధమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అదే జిల్లా రామన్నపాలేనికి చెందిన చోడమాంబిక గుర్రం విక్రమ్ రెండో స్థానాన్ని, మూడు, నాలుగు స్థానాలను విజయనగరం జిల్లా సింగపూర్ సత్యనారాయణకు చెందిన గుర్రం కై వసం చేసుకుంది. అనకాపల్లి జిల్లా దేవరపల్లికి చెందిన గుర్రం (ధర్మ), అంకంపాలేనికి చెందిన గుర్రం (మురుగన్) , అనకాపల్లి జిల్లా మల్లంపాలేనికి చెందిన గుర్రాలు వరుసగా 5, 6, 7, స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఓదూరి కిశోర్, ఓదూరి నాగేశ్వరరావు, ఓరుగంటి పెదకాపు, చల్లా చినబాబు, దుళ్ల సీతారామయ్య, గెడ్డం బుజ్జి, బుర్రా అనుబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కరప: కుమార్తెను, అల్లుడిని చూడటానికి మనవడితో కలసి మోటార్ సైకిల్పై వెళ్తున్న ఆ తండ్రిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. మరో 5 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా కారు ఢీకొని ఆయన అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలం పెనుగుదురు పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామానికి చెందిన గుత్తుల రామకృష్ణ (60) తన మనవడు విజయ్తో కలసి టీవీఎస్ మోటార్సైకిల్పై కాకినాడ రూరల్ మండలం తూరంగిలో నివసిస్తున్న తన అల్లుడు వాసంశెట్టి శ్రీనివాసరావు, కుమార్తెను చూడటానికి బయలుదేరారు. పెనుగుదురు పెట్రోల్ బంక్ సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి కాకినాడ వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో తాత, మనవళ్లు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. రామకృష్ణ పైనుంచి కారు చక్రం వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని అల్లుడు శ్రీనివాసరావు వచ్చి గాయాలతో ఉన్న విజయ్ని చికిత్సకోసం 108లో కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరప ఎస్ఐ టి.సునీత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హజ్ యాత్ర ఏర్పాట్లపై కూటమి నిర్లక్ష్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ముస్లింలకు ఎంతో పవిత్రమైన హజ్ యాత్ర ఏర్పాట్లపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబదుల్లా ఖురేషి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హజ్ యాత్రకు సంబంధించిన మొదటి విమానం ఏప్రిల్ 18న గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ యాత్రికులకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు ఆరు నెలల ముందుగానే గుంటూరులోని నంబూరు మదరసాలో యాత్రికులకు అన్ని విధాలా వసతులు కల్పించి, మక్కా యాత్రకు పంపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజు వరకు హజ్ యాత్రకు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్నారు. హజ్ కమిటీలో నిబంధనలకు విరుద్ధంగా మత గురువుల స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించడంపై జిల్లాకు చెందిన షేక్ నిజాం హైకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయం ముస్లిం సమాజానికి తెలిసిందేనన్నారు. -
పెద్దపులి.. పెదకొండేపూడి వైపు..!
● రామదుర్గం దాటుకుని మైదాన ప్రాంతానికి పయనం ● విశాఖ జూ అధికారులు వదలిన చోటుకే మళ్లీ చేరే అవకాశం దేవీపట్నం: అటవీ అధికారులకు అగ్నిపరీక్షగా మారిన పెద్దపులి పయనం రామదుర్గం కొండను దాటుకుని తూర్పుగోదావరి జిల్లా పెదకొండేపూడి వైపు మళ్లింది. గడిచిన ఆరు రోజులుగా దేవీపట్నం మండలంలో సంచరిస్తూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు చేరింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద కొండకు చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున రామదుర్గం కొండపై ఉన్నట్లు జీపీఎస్ సిగ్నల్స్ అందడంతో నేలకోట రామదుర్గం కొండకు వెళ్లే మార్గంలో ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు ఆధ్వర్యంలో రెస్క్యూటీం, వాహనంతో పులిగమనాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొండపై కోతులు, పక్షులు పులిని చూసి భయాందోళనతో అరవడంతో ఈ సంకేతాలను గమనించిన సమీపంలో ఉన్న అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సమయంలో రామదుర్గం కొండకు వెళ్లే మార్గాన్ని దాటుకుని ఎదురుగా ఉన్న మరో కొండపైకి చేరింది. ఈ ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించి అటవీ అఽధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కొండకు చేరినప్పటి నుంచి జీపీఎస్ సిగ్నల్స్ పరిశీలించగా సాయంత్రం చీకటి పడే వరకూ పులి నడుస్తూ సంచరిస్తున్నట్లే సిగ్నల్స్ అందడంతో ఏజెన్సీ ప్రాంతాన్ని దాటుకుని సీతానగరం మండలం పెదకొండేపూడి వైపు పులి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం రాత్రికి పురుషోత్తపట్నం వైపు మళ్లితే గోదావరి నదిని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. లేదా సీతానగరం వైపు మరలితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ జూ నుంచి అధికారులు వదలిన దగ్గర నుంచి పులి రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల గూండా సంచరించి తిరిగి యూ టర్న్ తీసుకుంది. అప్పటి నుండి ఇంచుమించు వెళ్లిన మార్గంలోనే గోకవరం, రంపచోడవరం ఆర్అండ్బి రహదారిని దాటుకుని దేవీపట్నం మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పులి మొట్టమొదట ప్రారంభమైన చోటుకే ఇంచుమించు చేరుకుంది. ఇదిలా ఉండగా పౌర్ణమి రోజున రామదుర్గం కొండపైకి భక్తులు రావడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రాజానగరం మండలంలో పలు గ్రామాల నుంచి బుధవారం ఉదయం భక్తులు రామదుర్గం కొండపైకి చేరుకున్నారు. ఈ సమయంలో పులి కొండపైనే ఉండడంతో అటవీ అధికారులు అప్రమత్తమై కొండపై నుంచి భక్తులు భయటకు రాకుండా గేట్లు వేసుకుని ఉండాలని సూచించారు. దిగువ నుంచి కొండపైకి భక్తులు రాకుండా నిలిపి వేసారు. పౌర్ణమి రోజు కొండపై ప్రత్యేక పూజలు చేసేందుకు సాయంత్రం సమయంలో పలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ అధికారులు వెనక్కి పంపేశారు. ఈ ప్రాంతానికి ఎవరూ రాకుండా పహారా ఏర్పాటు చేశారు. పులి రామరుర్గం కొండను వీడి మైదాన ప్రాంతానికి మరలిందని నిర్ధారించిన అనంతరం కొండపై ఉన్న భక్తులను అటవీ సిబ్బంది సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించారు. -
ఆలస్యంగానైనా చెల్లిస్తాను
సత్యసాయి ఎంటర్ ప్రైజస్ పేరుతో చేసిన సొమ్ము వసూళ్లకు సంబంధించి బాఽధితులందరికీ న్యాయం చేస్తాను అంటూ నిర్వాహకుడు మోహన్కృష్ణ బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. 2023లో కొంతమూరులో బ్రాంచ్ ఏర్పాటు చేశానని, తర్వాత రాజమహేంద్రవరంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించానన్నారు. ఏడాది కాలం నా వ్యాపారం చాలా బాగా సాగిందని, కొన్ని బ్రాంచ్ల వల్ల నేను నష్టపోయానన్నారు. అయితే తాను రూ.కోట్లు వసూలు చేయలేదని, నాకు కట్టకుండా నా వద్ద పనిచేసిన కొందరు సొమ్ము వారి వద్దే ఉంచుకున్నారని వీడియోలో తెలిపారు. తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి రాజకీయ నాయకులకు, పోలీసులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానని, బాధితులందరికీ కొద్ది కొద్దిగా సొమ్ము కొంత ఆలస్యంగానైనా చెల్లిస్తానని తెలిపారు. -
ఎవ్వరూ పట్టించుకోవడం లేదు
నేను చదువుకోలేదు. ఇంటి వద్ద ఉంటూ పనిచేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పారు. రావులపాలెం బ్రాంచ్కు వెళ్లాను. అక్కడ రూ.10 వేలు కడితే అగరబత్తీలు ఇస్తామని చెబితే, దఫదఫాలుగా రూ.10.50 లక్షలు చెల్లించాను. తొలుత బాగానే ఇచ్చారు. తర్వాత ఇవ్వడం మానేశారు. నాకు డ్వాక్రాలో వచ్చిన డబ్బులు, ఇంకా దాచుకున్న డబ్బులు కలిసి కట్టాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎవరూ పట్టించుకోవడంలేదు. – నాగమణి, బాధితురాలు. మందపల్లి రూ.1.50 కోట్లు కట్టించాను రావులపాలెం బ్రాంచ్లో నేను రూ.5 లక్షల డిపాజిట్ను కట్టాను. నా ద్వారా సుమారు రూ.1.50 కోట్ల వరకూ చాలా మంది చేత కట్టించాను. ప్రారంభంలో బాగానే ఇచ్చేవారు. తర్వాత తక్కువ అగరబత్తీలు ఇచ్చేవారు. ఇదేమిటని అడిగితే స్టాక్ లేదని చెప్పేవారు. వారు ఇచ్చిన అగరబత్తీలు ప్యాకింగ్ చేసి ఇస్తే సొమ్ములు వేసేవారు. తర్వాత మాయమయ్యారు. – సత్య, బాధితురాలు రావులపాలెం -
అంతా అసత్యమే!
సాక్షి, రాజమహేంద్రవరం/ కంబాలచెరువు: ఇంట్లోనే ఉపాధి కల్పిస్తామంటూ సత్యసాయి ఎంటర్ ప్రైజస్ సంస్థ చేసిన ప్రచారాన్ని నమ్మి చాలా మంది రూ.కోట్లలో నష్టపోయారు. అగరబత్తీలు ప్యాకింగ్ చేస్తే నెలవారీ వేతనం ఇస్తామన్న మాటలను నమ్మి దానికి సెక్యూరిటీ డిపాజిట్గా రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించారు. రెండు, మూడు నెలలు వ్యవహారం బాగానే నడిచిన తర్వాత నిర్వాహకుడు బోర్డు తిప్పేయడంతో తామ మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా నిర్వాహకుడి సాయంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్కు వచ్చారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే... అనకాపల్లికి చెందిన జి.మోహన్ కృష్ణ ఏడాది క్రితం సత్యసాయి ఎంటర్ ప్రైజస్ పేరుతో స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయాలను ప్రారంభించాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 29 బ్రాంచ్లు ప్రారంభించాడు. అగరబత్తీల ప్యాకింగ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ.. ప్రతి నెలా రూ.12 నుంచి రూ.15 వేల వరకు సంపాదించవచ్చని నమ్మబలికాడు. అందుకు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.2 లక్షల వరకు, అలాగే మేనేజర్ పోస్టులకు రూ.10 లక్షల వరకూ వసూలు చేశాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,000 మందికి పైగా ప్రజలు సత్యసాయి ఎంటర్ ప్రైజస్కు వచ్చి రూ.లక్షల్లో సొమ్ములు చెల్లించి పెద్ద మొత్తంలో అగరబత్తీలను తీసుకెళ్లి ప్యాకింగ్ చేసి తెచ్చి ఇచ్చేవారు. ఈ విధంగా నిర్వాహకులు మూడు నెలల పాటు సొమ్మును సక్రమంగానే ఇచ్చారు. తర్వాత అగరబత్తీల ప్రొడక్ట్ రాలేదంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కొద్దిరోజులకు ఏకంగా సత్యసాయి ఎంటర్ ప్రైజస్ బోర్డు తిప్పేశారు. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం! అగర్బత్తీల ప్యాకింగ్ స్కామ్ దివిలి గ్రామంలో బయటపడింది. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ తాను మోసపోయానంటూ గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఆ ఫిర్యాదు పెద్దాపురం పోలీస్ స్టేషన్కు చేరింది. ఫిర్యాదు పరిశీలించిన అక్కడి పోలీసులు రాజమహేంద్రవరంలో బ్రాంచ్ కార్యాలయం ఉందని, అక్కడి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పంపేశారు. బ్రాంచ్ సమీపంలోని త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదు. దీంతో బాధితులు రాజమహేంద్రవరంలోని బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయమై ‘స్వయం ఉపాధి పేరుతో రూ.25 కోట్లకు టోకరా’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు కేసు నమోదుపై మల్లగుల్లాలు పడుతున్నారు. త్రీటౌన్కు టీడీపీ నేతలు! అగరబత్తీల ప్యాకింగ్ కంపెనీ నిర్వాహకుడు అనకాపల్లికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కావడంతోనే అతనిపై చర్యలకు వెనకాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ నేతలు యాళ్ల ప్రదీప్, మజ్జి రాంబాబు బుధవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు రావడం అనుమానాలకు తావిస్తోంది. బాధితులు పోలీస్ స్టేషన్కు వస్తున్న విషయం సదరు టీడీపీ నేతలకు చెప్పకపోయినా, స్టేషన్లో ప్రత్యక్షం కావడం, కేసు పెట్టేందుకు వెళుతున్న బాధితులను నిలువరించి పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం, తాము న్యాయం చేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తే కంపెనీ నిర్వాహకుడిని కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. స్కామ్ వెనుక టీడీపీ నేతల హస్తం ఉందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై త్రీటౌన్ సీఐ అప్పారావును వివరణ కోరగా ‘ఫిర్యాదు తీసుకున్నాం, కేసు నమోదు చేస్తాం’ అని తెలిపారు. ఇదిలా ఉంటే డబ్బులు కట్టి మోసపోయిన బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లా ఎస్పీని సంప్రదించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సన్నద్ధం అవుతున్నారు. ఫ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ భారీ మోసం ఫ అగరబత్తీల ప్యాకింగ్ పేరుతో నట్టేట ముంచిన వైనం ఫ బాధితుల నుంచి రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు ఫ సుమారు రూ.25 కోట్లకు టోకరా ఫ కేసు నమోదుకు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు ఫ నిర్వాహకుడికి సాయంగా టీడీపీ నేతలు! -
అథ్లెటిక్స్లో మాస్టర్ మాధవి
● రత్నగిరిపై ఫార్మసీ సూపర్వైజర్గా పనిచేస్తూ క్రీడల్లోనూ రాణింపు ● రాష్ట్ర స్థాయి షాట్పుట్, డిస్క్ త్రో పోటీలో కాంస్య పతకాలు అన్నవరం: దేవస్థానం వైద్యశాలలో ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి క్రీడలలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. గత నెల 30, 31 తేదీలలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో శాప్ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో షాట్పుట్, డిస్క్ త్రోలో కాంస్య పతకాలు సాధించారు. బుధవారం స్థానిక విలేకరులకు ఆమె ఈ విషయాన్ని వివరించారు. అన్నవరం దేవస్థానం తరఫున జిల్లా నుంచి 45 ప్లస్ విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. ● జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ఎన్నో ఆటల పోటీలలో పాల్గొని ఆమె పతకాలు సాధించారు. విశాఖలోని పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో 2020లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్లో మూడు పతకాలు సాధించారు. ● అలాగే 2019లో కర్నూలులో జరిగిన 38వ మాస్టర్స్ అథ్లెటిక్స్లో షాట్పుట్, డిస్క్త్రో, జావలిన్ త్రోలలో మూడు స్వర్ణాలు కై వసం చేసుకున్నారు. ● 2018లో గుంటూరులో జరిగిన పోటీలో షాట్పుట్, జావలిన్త్రోలో స్వర్ణాలు, డిస్క్ త్రోలో రజత పతకం సాధించారు. ● 2015లో కడప జిల్లా పొద్దుటూరులో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అనంతరం ఒంగోలులో జరిగిన ఎన్జీఓ ఆటల పోటీలలో నాలుగు పతకాలు సాధించారు. ● విద్యార్థి దశలో సుమారు 30 సార్లు రాష్ట్ర, జాతీయస్థాయి ఆటల పోటీలలో పాల్గొని పతకాలు సాధించినట్టు ఆమె తెలిపారు. ఫార్మసీ విద్యార్థినిగా వాలీబాల్ జాతీయ పోటీలలో వరుసగా 1991లో బరంపురంలో, 1992లో భోపాల్లో, 1993లో బీహార్ లోని పాట్నాలో ఆడానని తెలిపారు. ● 2017 మార్చిలో మైసూర్ లో జరిగిన జాతీయస్ధాయి ఎన్జీఓ ఆటల పోటీలలో సైతం పాల్గొన్నానని తెలిపారు. ఇంత వరకూ 60కి పైగా పతకాలు సాధించానని వివరించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎంవీ త్రినాథరావు, దేవస్థానం సిబ్బంది ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధించగలుగుతున్నానని ఆమె తెలిపారు. -
వైభవంగా వాడపల్లి వెంకన్న తెప్పోత్సవం
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గౌతమి గోదావరిలో స్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాత్రి విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన హంస వాహనంపై మేళ తాళాలు, వివిధ రకాల బృందాల వాయిద్యాలు, భారీ బాణసంచా కాల్పుల నడుమ భక్తజన రంజకంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు కట్టుదిట్ట చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, వల్నరబుల్ ఏరియాల్లో ప్రతిపాదించిన చర్యలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షించారు. రహదారి ప్రమాదాలు, పోలీస్ స్టేషన్ల వారీ వివరాలు, రహదారి భద్రత అమలు, ఐరాడ్ అప్లికేషన్లో ప్రమాదాల డేటా నమోదు, హిట్ అండ్ రన్ కేసులు, బ్లాక్ స్పాట్లు తదితర అంశాలపై జిల్లా పోలీస్, రవాణా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 31 బ్లాక్ స్పాట్లు, 12 అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై బొమ్మూరు, రాజానగరం, దేవరపల్లి, కడియం, నల్లజర్ల, రంగంపేట మండలాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. లైటింగ్ లోపం, సైన్ బోర్డుల కొరత, అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఆర్అండ్బీ అధికారి ఎస్బీవీ రెడ్డి పాల్గొన్నారు. -
ఇంటర్ తర్వాత ఏంటి?
● అందుబాటులో ఉన్నత కోర్సులు ● ఇంజినీరింగ్తో పాటు ఒకేషనల్ ● 113 కోర్సులను సూచించిన సీబీఎస్ఈ రాయవరం: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. విద్యార్థులంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1.16 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 56,574 మంది ఇంటర్ సెకండియర్ ఫలితాలు వచ్చిన వెంటనే వారికి నచ్చిన ఉన్నత కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు. అయితే అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇంటర్ తరువాత ఇంజినీరింగ్తో పాటుగా 113 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 113 కోర్సుల జాబితాను విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఇతర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు ఒక్క ఇంజినీరింగ్, మెడిసిన్ కాకుండా ఫిషరీస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ ఫారెస్ట్రీ, హార్టి కల్చర్, చార్టెర్డ్ అకౌంటెంట్ లాంటి అనేక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 900 యూనివర్శిటీల్లో ఇంజినీరింగ్తో పాటు ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ తరువాత అందుబాటులో ఉన్న ఒకేషనల్, ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుల వివరాలు.. ఇంజినీరింగ్ కోర్సులు ఏరో నాటికల్, ఏరో స్పేస్, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఆటోమొబైల్, బయో మెడికల్, బయో టెక్నాలజీ, సిరామిక్స్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మైరెన్ ఇంజినీరింగ్, మెకానికల్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్, నావల్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, పాలీమర్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, బయోటెక్నాలజీ. ఒకేషనల్ మెడిసిన్కు సంబంధించినవి ఇతర రకాలివీ.. Ððl$r-ÌS-Èj, Ððl${sê-ÌSi, Æø»Z-sìæMŠSÞ, OòܺƊ‡ òÜMýS*Å-Çsîæ, GÆŠ‡¢ OòܯŒSÞ/ gê{VýSïœ, G°-ÓÆ>-¯ŒSÐðl$…rÌŒæ OòܯðlÞ‹Ü, íœçÙÈ‹Ü, àÇt-MýS-ÌS-aÆŠæ, çœ#yŠæ sñæM>²-ÌS-i, ¸ëÆð‡ïÜt, KíÙ-Ķæ$-¯ø-{VýSïœ, Ýëtsìæ-íÜtMýSÌŒæ OòܯŒSÞ, ÐðlrÆý‡²È OòܯðlÞ‹Ü, OÐðlÌŒæz OÌñ拜 ºÄ¶æ*ÌS-i, kÐéÌS-i, B…{™ø´ëÌS-i, BÇP-Ķæ*-ÌSi, BÆŠ‡¢ ÇÝùtÆó‡-çÙ¯Œl, MýS*ÅÆó‡-çÙ-¯Œl, Gyýl$Å-MóSçÙ-¯]lÌŒæ/ ÐöMóS-çÙ-¯]lÌŒæ çÜ*PÌŒæ Mú°Þ-ÌSÆŠæ, Ð]l*¯]l$Å-Ððl$…sŒæÞ çßæÅÐðl$…sŒæÞ A…yŠæ çÜPÌSµÆŠ‡ çÜPÌSµ ÇÝùt-Æó‡çÙ-¯Œl, Ð]lÊÅíÜĶæ*-ÌS-i, ÝùçÙÌŒæ Ð]lÆŠ‡P, òܵçÙÌŒæ Gyýl$ÅMóSrÆŠæ, ïܵ^Œl Ìê…VóSÓgŒæ A…yŠæ í߿Ķæ$Ç…VŠæ, Ìê, AyýlÓ-Æý‡-Osñæ-h…VŠæ, fÆý‡²-Í-f…, Ð]l*‹Ü MýSÐ]lÊŰ-MóS-çÙ¯Œl, ç³¼ÏMŠS ÇÌôæ-çÙ-¯ŒSÞ, BÆŠ‡t OyðlÆð‡-MýSÛ-¯Œl, MöÇ-Äñæ*-{VýSïœ, OyðlÆð‡MýSÛ-¯Œl, íœÌŒæÃ/-{yéÐ]l* {´÷yýlMýSÛ¯Œl, Oòœ¯ŒS BÆŠætÞ, çœÆ>¹Ç-Ã…VŠæ BÆŠætÞ, KMýSÌŒæ B…yŠæ C¯]l$-[çÜ$t-Ððl$…-rÌŒæ Ķæ*°-Ðól$çÙ¯Œl, íܰ-Ð]l*-sZ-{VýSïœ, MýSÐ]lÊÅ-°-MóSçÙ¯ŒS yìlOgñæ-¯Œl, yìlOgñ毌l, {V>íœMŠS yìlOgñæ°…VŠæ, ¸÷sZ-{VýSïœ, »êÅ…MŠS Ðól$¯ólgŒæÐðl$…sŒæ, ¼h¯ðl‹Ü AyìlÃ-°-[-õÜtçÙ¯Œl, ¼h-¯ðl‹Ü Ðól$¯ólgŒæ-Ððl$…sŒæ, M>‹ÜtÞ A…yŠæ Ð]lÆŠ‡PÞ AMú…sŒæÞ, ^éÆý‡tÆŠæ, ^éÆý‡tÆŠ‡z AMú…-sñæ±Þ, ^éÆý‡tÆŠ‡z Oòœ¯é-°Û-Ķæ$ÌŒæ A¯é-Í-íÜ‹Ü, DÐðl…sŒæ Ðól$¯ólgŒæ-Ððl$…sŒæ, àíܵrÌŒæ Ðól$¯ól-gŒæ-Ððl$…sŒæ, çßZrÌŒæ Ðól$¯ól-gŒæÐðl$…sŒæ, çßæ$ÅÐ]l$¯ŒS ÇÝùÆŠ‡Þ Ðól$¯ól-gŒæ-Ððl$…sŒæ, C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, ÌêhíÜtMŠSÞ A…yŠæ çÜOò³Ï O^ðl¯ŒS Ðól$¯ólgŒæÐðl$…sŒæ, Ðól$¯ól-gŒæ-Ððl$…sŒæ, »êÅ_ÌSÆŠ‡ B‹œ BÆŠætÞ, yìlç³ÏÐ]l* C¯ŒS GÍ-Ððl$…-rÈ Gyýl$ÅMóS-çÙ-¯Œl, »êÅ_-ÌSÆŠ‡ B‹œ Gyýl$Å-MóS-çÙ¯Œl, M>Æöµ-Æó‡sŒæ C…sñæÍ-gñ毌SÞ yìlsñæ-MìStÐŒæ, çœ#yŠæ OòܯŒSÞ A…yŠæ ¯]l*Å{sìæ-çÙ-¯Œl, ´ëǯŒS Ìê…VóSÓgñæ‹Ü, çßZÐŒl$ OòܯŒæÞ C…sîæ-Ç-Ķæ$ÆŠ‡ yìlOgñæ-°…VŠæ, OÌñæ{ºÈ OòܯðlÞ‹Ü, íœhMýSÌŒæ Gyýl$Å-MóS-çÙ-¯Œl, ÝùµÆŠætÞ Ðól$¯ólgŒæ Ððl$…sŒæ, r*Çf… A…yŠæ {sêÐðlÌŒæ. -
వైభవంగా పండిత సదస్యం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు వైభవంగా పండిత సదస్యం నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులు మహదాశీర్వచనం చేశారు. ఉదయం స్వామివారి మేలుకొలుపు, తీర్థం బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలి హరణం, ద్రవిడ వేద పారాయణ, సాగాయి. మధ్యాహ్నం విష్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం నిర్వహించారు. రాత్రి ప్రధాన హోమాలు, బలి హరణము, నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు వేద పండితులను సత్కరించారు. ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యుడు శిష్టా సూర్య కుటుంబరావు, గ్రామ సర్పంచ్ పోచిరాజు బాబురావు, సూర్యకుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వెటరన్ క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ క్రీడా మైదానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అమలాపురానికి చెందిన వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా ప్రతిభ చాటింది. 35, 45 వయస్సు విభాగాల్లో ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి. హై జంప్లో మెహబూబ్ షకీలా బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. పట్టణానికి చెందిన బూరగాయల శివరామకృష్ణ కూడా డిస్కస్ త్రో క్రీడలో తలపడ్డారు. జిల్లాకు చెందిన దాట్ల ఎన్ఎస్ రామరాజు 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెంలో వెండి పతకాలను, జావెలిన్ త్రోలో ఎం.సాయిబాబు కాంస్య పతకాన్ని, 100 మీటర్ల పరుగు పందెంలో ఐ.సురేష్కుమార్ కాంస్య పతాకాన్ని సాధించారు. -
సాంకేతికత సాయంతో కేసుల దర్యాప్తు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, తద్వారా నేర నిర్ధారణ రేటు పెంచవచ్చని ఎస్పీ డి.నరసింహకిశోర్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, ఎన్బీడబ్ల్యూఎస్, ఎన్డీపీఎస్ కేసులలో దర్యాప్తు, రికవరీలపై సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, జిల్లాలో మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తీవ్రమైన కేసులలో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రాపర్టీ క్రైమ్ కేసుల్లో రికవరీ పెంచాలని, జిల్లావ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెనన్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు అందరూ విలేజ్ విజిట్స్, పల్లె నిద్ర తప్పక చేయాలన్నారు. తద్వారా రాబోయే పుష్కరాల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను అరికట్టవచ్చన్నారు. రాత్రి పూట అన్ని స్టేషన్లలో గస్తీలు ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్డీ డివైస్ ద్వారా చెక్ చేయాలన్నారు. గత నెలలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ నరసింహకిశోర్ సూచన -
సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ధాన్యం కొనుగోళ్లు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో రబీ 2025–26 సీజన్కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అవకతవకలకు పాల్పడిన, రైతులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు, మిల్లర్లను ప్రస్తుత సేకరణ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. గన్నీ బ్యాగుల నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కోతలు జరిపిన ధాన్యాన్ని తక్షణమే సేకరించి రవాణా చేయడానికి వాహనాలను సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే ఒకే రోజు 30 వేల మెట్రిక్ టన్నుల వరి తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో 2,557 వాహనాలు రిజిస్టర్ కాగా, 2,190 వాహనాలు వినియోగంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద సుమారు 1,100 ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 8309487151 నంబర్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో 256 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, డి.ఆర్.డి.ఏ ద్వారా కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, జిల్లా మేనేజర్ (సి.ఎస్) బి.గణేష్ కుమార్, ఆర్డీవోలు కె.ఆనందరావు, ఆర్.శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.కలెక్టర్ కీర్తి ఆదేశం -
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాణాలకు రక్షణ లేదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాణాలకు రక్షణ లేదని వైఎస్సార్ సీపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ అబ్బీస్ జనవరి 28వ తేదీన రాజమహేంద్రవరం రవి హాస్పిటల్లో మత్తుమందు వికటించడం వల్ల చనిపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కలెక్టర్, ఎస్పీలకు గ్రీవెన్స్లో విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ కీర్తికి, రాజమహేంద్రవరం డీఎస్పీకి మంగళవారం మరోసారి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, 40 రోజులు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. మృతుడు జనసేన కార్యకర్త అయినా ఆ పార్టీ ఈ విషయంపై స్పందించకపోవడం విచారకరం అన్నారు. వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. కల్తీ పాల ఘటనలో చనిపోయిన వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప నిజాయితీగా విచారణ చేపట్టలేదన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి -
ఆదాయానికి పాతర
కాకినాడ లీగల్: ప్రభుత్వ సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ట్రెజరీ (ఖజానా) కార్యాలయంలోనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల ఉదాసీనత వల్ల లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తి తుప్పు పట్టిపోతోంది. కొత్త భవనంలోకి మారడానికి ఉత్సాహం చూపిన అధికారులు.. పాత సామగ్రిని మాత్రం గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా పార్కింగ్లోనే.. స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తోంది. ఈ భవనంలో జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరీ వంటి ఇతర విభాగాలు కొలువుదీరాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభమైన సమయంలో కోట్లాది రూపాయలతో సరికొత్త టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పాత కార్యాలయం నుంచి తీసుకొచ్చిన టేబుళ్లు, కుర్చీలు, ఇనుప బీరువాలు, కంప్యూటర్ భాగాలు వీటన్నింటినీ భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో ఒక మూలన పడేశారు. నిబంధనలు ఇవే.. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వాడని పాత సామగ్రి జాబితాను ఎప్పటికప్పుడు తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది వేలం వేయాల్సి ఉంటుంది. ఆ వేలం ద్వారా వచ్చే నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నాలుగేళ్లనా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పలు ఆరోపణలు ఏటా పాత ఫర్నిచర్ లెక్కలు చూడకపోవడంతో విలువైన వస్తువులను కొందరు సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడాలంటే ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పాత కార్యాలయం నుంచి ఇక్కడకు ఎన్ని వస్తువులు తరలించారు. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి అనే విషయాలపై సమగ్రంగా తనిఖీ జరగాలి. పనికిరాని వస్తువులను వెంటనే వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసిన అధికారులపై విచారణ జరిపించాలి. ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి లెక్క కూడా పక్కాగా ఉండాలి. కానీ ఇక్కడ కళ్ల ముందే విలువైన ఫర్నిచర్ పాడవుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. పాత సామగ్రిపై అధికారుల నిర్లక్ష్యం నిబంధనల మేరకు వేలం వేయని వైనం కాకినాడ జిల్లా ట్రెజరీలో తుప్పుపడుతున్న బీరువాలు, కుర్చీలు ప్రభుత్వ ఆదాయానికి గండి -
ఉత్తమ నాటికగా ‘ఇంద్రప్రస్థం’
అమలాపురం టౌన్: అమలాపురం రస వాహిని సాంస్కృతిక వేదిక నిర్వహణలో కేఎన్ మూర్తి నాటక పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం షాదీఖానా భవన ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రథమ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ మూడు రోజుల్లో ప్రదర్శించిన నాటికల్లో సోమవారం రాత్రి ప్రదర్శితమైన ‘ఇంద్రప్రస్థం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి రూ.30 వేల నగదు బహుమతిని గెలుచుకుంది. ప్రేమించుకున్న జంట ఒక వైపు, వారి తల్లిదండ్రులు మరోవైపు, వారి వాదనలు, చివరకు ఉభయుల అంగీకారంతో పెళ్లి జరగడంతో నాటిక ముగుస్తుంది. పోటీల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్లు హాజరయ్యారు. రసవాహని సంస్థ అధ్యక్షుడు, కేఎన్ మూర్తి నాటక పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి మహ్మద్ షెహన్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కొండాబత్తుల వేణుగోపాలరావు, కేఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి డాక్టర్ గోదశి గంగరాజు, అమలాపురం పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, పరిషత్ కో ఆర్డినేటర్ ఎంవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ప్రతినిధులు కొండాబత్తుల నరసింహమూర్తి, కొండాబత్తుల శ్రీరాములును రస వాహిని రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. అలాగే డాక్టర్ కె.సాంబశివరావు, మల్లాది శివన్నారాయణ, నాయుడు గోపి, దేవిశెట్టి రామకోటేశ్వరరావు, నటకుమారిలను దివంగత నల్లా సత్యనారాయణ రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ ప్రతినిధి నల్లా శ్రీధర్, రమణ పాల్గొన్నారు. -
అమ్మచెక్కిన బొమ్మకు ప్రథమ బహుమతి
ఏలేశ్వరం: మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మోమోరియల్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిసాయి. కళాపరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు అసక్తికరంగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ అమ్మచెక్కిన బొమ్మ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. గోవాడ వెంకట్ దర్శకత్వం వహించగా జ్యోతిరాజ్ భీశెట్టి రచన అందించారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు కరణం మహేష్ మోమోరియల్ తరమెల్లిపోతున్నదో ఎంపిక కాగా నగదు పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమనటుడుగా సురభినిఖిలేష్ (అమ్మచెక్కినబొమ్మ), ఉత్తమ నటిగా జీఎన్డి కుశమసాయి (ఇంద్రప్రస్థం), ఉత్తమ దర్శకుడుగా ఎన్.రవీంద్రరెడ్డి(ఇంద్రప్రస్థం) ఎంపికయ్యారు. కళాపరిషత్ అఽధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. -
వైభవంగా దివ్య కల్యాణ మహోత్సవాలు
ఆత్రేయపురం: ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం సదస్యం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, నిత్య ఉపాసన, వేద పారాయణ, సాయంత్రం సదస్యం జరిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రాత్రి రాజమహేంద్రవరం సత్య శ్రావణి బృందం ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతుల వెంకట రమణ మూర్తి తదితరులు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు, బృందం సభ్యులు సదస్యంలో పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి అనపర్తి: మండలంలోని మహేంద్రవాడ గ్రామ శివారులో పేకాడుతున్న వారిని పట్టుకున్నామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. మార్చి 29న సాయంత్రం 6 గంటలకు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి దాడి నిర్వహించామన్నారు. ఈ దాడిలో పొలమూరు గ్రామానికి చెందిన అల్లక ఉమామహేశ్వరరావు, గుత్తుల హరి దుర్గ, ద్వారంపూడి ప్రభాకర రెడ్డి, ద్వారంపూడి ఈశ్వరరెడ్డి, దాసరి వీరవెంకట సత్యనారాయణచౌదరి, కొవ్వూరి కాశీవిశ్వనాథరెడ్డి, బిక్కిన శ్రీనుబాబు, అమరపు దుర్గప్రసాద్ పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.18,130, రెండు సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
కాకినాడ క్రైం: ఏసీబీ వలకు ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ చిక్కాడు. కాకినాడ మున్సిపాలిటీ కొత్తపేట మార్కెట్ సర్కిల్ 10లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వంగల రాజేంద్ర ప్రసాద్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ పరిధిలో ఓ దుస్తుల దుకాణానికి ట్రేడ్ లైసెన్సు మంజూరు చేసేందుకు సూరంపూడి అరవింద్ను రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. మంగళవారం సాయంత్రం 5.43 గంటలకు తన కార్యాలయంలో లంచం తీసుకుంటూండగా రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొత్తు రూ.15 వేలే కాక, మరో రూ.18,640 లెక్కలో లేని మొత్తాన్ని అతడి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. లంచం కోసం రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న వేధింపులను తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారు సూరంపూడి అరవింద్ తెలిపారు. హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు సామర్లకోట: హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గోపు సతీష్ రాజాపై 2016 మే 15వ తేదీ రాత్రి పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని రాజుగారి కాంప్లెక్స్ వద్ద గల శ్రీరామా ఎంటర్ప్రైజెస్ షూమార్టు సమీపంలో ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వై.సతీష్ కేసు నమోదు చేయగా సీఐ కె.శ్రీధర్ కుమార్ దర్యాప్తు చేసి 2016 మే 28న కొప్పిరెడ్డి అచ్చిరాజు (ఏ1), అతడి కుమారులు రాంబాబు (ఏ2), రాజేష్ (ఏ3)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. తదుపరి సీఐ వీరయ్య గౌడ్ చార్జిషీట్ ఫైల్ చేశారు. వాదోపవాదాలు పూర్తయిన తర్వాత ఏడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి జి.చంద్రమౌళీశ్వరి ఈ కేసులో తీర్పును వెలువరించారు. ముగ్గురు నిందితులకు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసిన అప్పటి సీఐలు కె. శ్రీధర్ కుమార్, వీరయ్య గౌడ్, అప్పటి డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రస్తుత ఇన్చార్జి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఇటీవల బదిలీ అయిన సీఐ పి.విజయ్ శంకర్, ఎస్సై మౌనిక, కోర్టు లైన్ ఆఫీసర్, ఏఎస్సై బీవీ నారాయణలను ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. పీపీలుగా గన్నం వినయతేజ, ఎం.జయరావు వాదించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.2 లక్షల విరాళం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మైక్రో బయాలాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం.భారతి తన తల్లి లోలాక్షి జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.రెండు లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్కు అందజేశారు. ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే ఆదాయంతో ఏటా మైక్రోబయాలాజీలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వారిని బంగారు పతకంతో సత్కరించాలని కోరారు. ఆ పని కోసమే తన తల్లి పేరుతో ఈ మొత్తాన్ని వినియోగించాలని భారతి విజ్ఞప్తి చేశారు. తన తల్లి వైద్య విద్యను ఎంతో ప్రోత్సహించేవారని, అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీ, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. లారీ డ్రైవర్ మృతి గండేపల్లి: ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ మృతి చెందాడు. గండేపల్లి పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు బొగ్గు లోడుతో వెళుతున్న ఓ లారీ తెల్లవారుజాము 3 గంటల సమయంలో మండలంలోని మురారి శివారుకు వచ్చే సరికి సడన్గా స్లో అయ్యింది. దీంతో లారీని వెనుక వస్తున్న గ్రావెల్ లోడు లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రావెల్ లోడు లారీ డ్రైవర్ మేడవలిమి యోగయ్య అలియాస్ దావీదు (50) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. మృతుడు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలేనికి చెందిన వాడని, కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. అతడి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసినవారు 94407 96624, 94407 96584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
బంగారు ఆభరణాల చోరీ
అనపర్తి: లక్ష్మీనరసాపురం గ్రామంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను సోమవారం అర్ధరాత్రి దొంగలు దోచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురకాసుల గోపి వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక కనకదుర్గమ్మ గుడి పక్కనే రెండు అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. పగలంతా కుటుంబ సభ్యులందరూ ఆ భవనంలోనే ఉంటారు. రాత్రి పడుకోవడానికి దాని వెనుక ఉన్న పాత బిల్డింగ్లోకి వెళతారు. గోపి తల్లిదండ్రులు కూడా కొత్త భవనం పైఅంతస్తులో ఉంటున్నారు. ప్రతి రోజూ మాదిరిగానే సోమవారం అర్ధరాత్రి పడుకోవడానికి పాత భవనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం కొత్త ఇంటికి వచ్చేసరికీ తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని 4 కాసుల బంగారు నల్లపూసలు, రెండు కాసుల జిగిని, 4 కాసుల చైను ఉంగరాలు, ఒక కాసు విలువైన చెవి రింగులు, మ్యాటీలు కలిపి.. మొత్తం 11 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
● బరువైన చదువు
చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీరువాలు మోస్తున్న విద్యార్థులు విద్యార్థులకు చదువు చెప్పి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారి చేత పనులు చేయిస్తున్న సంఘటన చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆలస్యంగా మంగళవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. సుమారు వారం రోజుల క్రితం పాఠశాలకు నూతన ఫర్నిచర్ వచ్చింది. బరువైన బీరువాలు, ఇతర సామగ్రి ఉన్న ఆ బరువైన ఫర్నిచర్ను విద్యార్థులతో ఆపసోపాలు పడుతూ మోశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంఈఓలు ఉన్నా పాఠశాలల పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలున్నాయి. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి బాధ్యలుపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – చాగల్లు -
ఎక్కడికో ఈ పయనం..
● అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి ● చిక్కకుండా సంచారం దేవీపట్నం: రెండు నెలలుగా అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి గమ్యం ఎటువైపో అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో తిష్ట వేసి, కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో సంచరిస్తూ వెనుకకు, ముందుకు పయనిస్తుందే తప్ప స్పష్టమైన మార్గం వైపు వెళ్లడం లేదు. శనివారం సాయంత్రం జోడుమామిళ్ల వద్ద గోకవరం దండంగి ఆర్అండ్బీ రహదారిని దాటి, పరగసానిపాడు, పూడిపల్లి వద్ద కొండపైకి చేరింది. సోమవారం ఉదయం బోడిగూడెం, డి.రావిలంక గ్రామాల వరకూ సంచరించి, రాత్రికి పరగసానిపాడుకు చేరింది. మంగళవారం నాగళ్లపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా సంచరిస్తే నాగళ్లపల్లి, గొందూరు గ్రామాల వద్ద తూర్పు వైపుగా కొండ దాటితే దేవారం పంచాయతీలోని చిన్నారిగండి మరలే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటేందుకు ప్రయత్నిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువన గల అంగుళూరు, పురుషొత్తపట్నం వైపునకు వెళ్లి, గోదావరిని దాటవచ్చు. ఒకవేళ అదే జరిగితే పులి పయనం ప్రారంభమైన మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యంలోకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రలను దాటుకుని వచ్చిన దారిలోనే వెళ్లే అవకాశం ఉంది. కాగా.. పులి సంచారంపై రంపచోడవరం సబ్ డీఎఫ్ఓ అనూష, వైల్డ్లైఫ్ రేంజి అధికారి కొండలరావు, సిబ్బంది రేయింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులి సంచరించే ప్రాంతాల్లోని తమ పశువులు దాని బారిన పడతాయోమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: ప్రసిద్ధి గాంచిన ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్య ఉపాసన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, వేద పారాయణ అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం కరప కళాకారుల బృందంచే సుందరకాండ, తోలు బొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి పర్యవేక్షించారు. హైదరాబాద్కు చెందిన వెంకట మహాదేవ కుమార్ దంపతులు రూ.5,116, కాకినాడ వాస్తవ్యులు గంగరాజు దంపతులు రూ.5,116 విరాళం సమర్పించారు. దాతలకు స్వామివారి ఫొటోలను సిబ్బంది అందజేశారు. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి -
పాత్ర రోజులొచ్చాయ్..
కుమ్మరి చక్రంపై మట్టితో కూజా తయారు చేస్తున్న కార్మికుడు పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.. ఆధునికతతో వస్తున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తది వద్దు.. పాతదే ముద్దు అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఎలాంటి హాని లేని మట్టి పాత్రలపై మోజు పెరుగుతోంది. దీంతో వీటికి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులదే అగ్రభాగం అయ్యింది. ఆధునిక పద్ధతులతో పాటు అంతే వేగంగా వ్యాధుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వంట సాయంత్రానికే పాడవుతోంది. అదే మట్టి పాత్రలో వండితే వండినవి వండినట్లే ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాల సౌలభ్యం. అందుకే మట్టి పాత్రలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. సాధారణంగా మట్టి పాత్రల ప్రాధాన్యం తగ్గిపోయాక కుమ్మర్లు కుల వృత్తిని వీడి ఇతర వృత్తులకు చేరువయ్యారు. అక్కడక్కడా కొందరు మట్టి పాత్రలు తయారు చేసినా, కేవలం కొందరు మాత్రమే అదీ వేసవిలో మంచినీటికి, శుభకార్యాల్లో సంప్రదాయాలకు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇలా వీటి తయారీ తగ్గిపోయింది. కానీ ప్రకృతి వైద్యం ఆయుర్వేదం వంటి ఆరోగ్య సూచనలు పెరగడంతో ఎక్కువ మంది ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వీటి తయారీ ఊపందుకుంది. మళ్లీ కుమ్మర్లకు చేతినిండా పని వచ్చింది. జిల్లాలో 500 కుటుంబాలు ప్రస్తుతం మట్టి పాత్రల తయారీ చేస్తుండగా, క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఆ‘పాత్ర’మధురాలు పూర్వం పాలు తాగినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, పెరుగు తోడెట్టినా అన్నీ మట్టి పాత్రలోనే జరిగేవి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా మట్టి పాత్రలో వేసిన ప్రతీది ఒక అద్భుతంగా మారేది. మట్టి పాత్రలు కేవలం వంట పాత్రలు లేదా నిల్వ పాత్రలు మాత్రమే కాదు. అవి మన సంస్కృతీ సంప్రదాయం, గ్రామీణ జీవన విధానానికి ప్రతిబింబం. భారతీయ సంస్కృతిలో మట్టి పాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం నుంచి మట్టి కుండల్లో నీరు నిల్వ చేయడం, ఆ పాత్రల్లో వంట చేయడం అనేది సాధారణం. పండగలు, ఉత్సవాలు, వివాహాలు, పూజలలో కూడా మట్టి పాత్రలు ముఖ్య పాత్ర పోషించేవి. దీపావళి సందర్భంగా వెలిగించే ప్రమిదలు, గ్రామీణ దేవాలయాలలో ఉపయోగించే మట్టి పాత్రలు ఇవన్నీ మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు. వీటి తయారీ అనేది ఒక సాధారణ పనికాదు. ఇది అనుభవం, నైపుణ్యం, సహనం కలిసిన కళ. సరైన మట్టిని సేకరించాక శుభ్రపరిచి, నీటితో కలిపి మృదువుగా చేయడం, కుమ్మరి చక్రంపై చేతులతో ఆకారమివ్వడం, సూర్యరశ్మిలో ఆరబెట్టడం, అగ్నిలో కాల్చి దృఢంగా మార్చడం, కొన్నిసార్లు రంగులు వేసి అలంకరించడం ఇలా ఈ ప్రతి దశలో శ్రద్ధ అవసరం. ఒక చిన్న పొరపాటు మొత్తం పాత్ర రూపాన్ని మార్చేస్తుంది. కొన్ని గ్రామాల్లో వీటి తయారీకి ప్రత్యేకంగా ఒక వీధి ఉంటుంది. ఆ వీధిని స్థానికంగా కుమ్మర వీధి అని పిలుస్తారు. ఈ వృత్తినే నమ్ముకుని అక్కడ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కుండ బిర్యానీకి మంచి గిరాకీ ప్రస్తుతం ‘సస్టైనబుల్ లివింగ్’ అనే భావన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ నేపథ్యంలో మట్టి పాత్రల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. నగరాల్లో కూడా ఇప్పుడు మట్టి పాత్రలను ఉపయోగించే అలవాటు తిరిగి వస్తోంది. రెస్టారెంట్లు, ఆర్గానిక్ స్టోర్లు, హోమ్ డెకర్ రంగంలో కూడా మట్టి వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు కుండ బిర్యానీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బిర్యానీ ప్రేమికుల అభిరుచికి తగినట్టుగా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు సైతం తమ వద్ద కుండ బిర్యానీ లభిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. కుండలు, కూజాలు, వాటర్ బాటిళ్లు వంట పాత్రలు ఇలా అనేక రకాల మట్టి పాత్రల తయారీ ఊపందుకుంది. ఆదరణ పెరుగుతోంది మా తాతల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. రాను రాను వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో తప్ప మట్టి పాత్రలను వినియోగించడం మానేశారు. ఈ పాత్రలను వినియోగించడం మన ఆ రోగ్యానికి, పర్యావరణానికి చాలా మంచిదని తెలుసుకున్న తరువాత వీటికి ఆదరణ పెరిగింది. ము ఖ్యంగా బిర్యానీ వంటి వంటకాలకు వీటిని వినియోగించడం వల్ల మాకు చేతి నిండా పని దొరుకుతోంది. –ఎస్.అప్పారావు, మట్టి పాత్రల తయారీ కార్మికుడు, పిఠాపురం ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు మట్టి పాత్రలు వినియోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఇటు ప్రకృతికి మేలు జరుగుతుంది. మట్టి బిందెల్లో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఆహారం మెల్లగా వండబడటం, రసాయనాలు లేని సహజ వంట విధానం వల్ల పోషక విలువలు నిలుస్తాయి. పూర్తిగా సహజ పదార్థం మట్టితో తయారు చేయడం కారణంగా పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని వీడడంతో కాలుష్యం తగ్గుతుంది. ఫ మట్టి పాత్రలకు పెరుగుతున్న ఆదరణ ఫ కుమ్మర్లకు చేతినిండా పని ఫ గడిలో పడిన బతుకు చక్రం -
11 మంది కార్మికులకు అస్వస్థత
రౌతులపూడి: మండలంలోని ఉప్పంపాలెం సమీపంలో ఓ స్టోన్ క్రషర్లో పనిచేస్తున్న 11 మంది బీహార్ కార్మికులు సోమవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్సీలో చేరారు. ఇందులో నలుగురు వాంతులు, విరోచనాలు, మరో ఏడుగురు ఒళ్లు, కడుపు నొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారు. వీరికి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సీహెచ్సీ వైద్యాధికారి ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆరుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయగా, మిగిలిన ఐదుగురిని పూర్తిగా కోలుకునే వరకూ వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం స్టోన్ క్రషర్ సమీపంలో రోగులు తీసుకున్న ఆహార దినుసులను, చుట్టుపక్కల పరిశుభ్రత గురించి పరిశీలన చేసినట్లు ఆయన వివరించారు. డాక్టర్లు రాజాజీ, సరోజ, సౌమ్మశ్రీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆదుకోండి.. ప్రాణం నిలపండి కుమారుడి కోసం తల్లిదండ్రుల మొర బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమారుడి వైద్యానికి సాయం చేసి ఆదుకోవాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన కోసూరి బాలాజీ కుమారుడు మోజెస్రాజు (4) ఎస్ఎంఎస్ టైప్ టూ వ్యాధి తో బాధపడుతున్నాడు. స్థానికంగా ఓ చెప్పులు దుకాణంలో బాలాజీ పనిచేస్తున్నాడు. అతని జీతం రూ.18 వేలు, ప్రస్తుతం మోజెస్రాజుకు ప్రతి నెలా వైద్యానికి రూ. 50 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో తమ కుమారుడిని ఆదుకోవాలని కోసూరి బాలాజీ సోమవారం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతిపత్రం అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుడిని ఇప్పటికే చాలా ఆసుపత్రులు తిప్పానని తెలిపారు. ఈ వ్యాధి నయం కావడానికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్లు చే యాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని బాలా జీ అన్నారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తన కుమారుడిని ఆదుకోవాలని ఆయన కోరారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 92905 96660 నంబరులో సంప్రదించాలన్నారు. -
రికార్డులు లేని నగదు స్వాధీనం
యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి, యానాం సరిహద్దుల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక హనుమాన్ దాబా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఓ కారులో రూ.2.50 లక్షలను కనుగొన్నట్లు ఎన్నికల సిబ్బంది తెలిపారు. ఆ నగదుకు సంబంధించి అకౌంట్ల వివరాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసి యానాం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేసినట్లు సిబ్బంది తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
శంఖవరం: కత్తిపూడి– రౌతులపూడి రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక జెడ్పీ హైస్కూల్ శివారులో కత్తిపూడి సీతారామా కళాశాల బస్సు విద్యార్థులతో శృంగవరం వెళ్తుండగా, రౌతులపూడి నుంచి వస్తున్న గ్రావెల్ లారీ బలంగా ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ మాసంపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినులు టి.సంధ్య అనురాధ, డి.వరలక్ష్మి, శృంగవరం గ్రామానికి చెందిన స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వై.అభిరామ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఈ రోడ్డులో అధిక బరువుతో గ్రావెల్ లారీలు తిరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆలోచింపజేసిన నాటికలు
ఏలేశ్వరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పెద్దనాపల్లి గ్రామంలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వెలగలేరు థియేటర్స్ వారి ఉరి నాటిక ఆలోచింపజేసింది. నేటి సమాజంలో మనిషికి ఇగో ఉంటే చివరికి ఎంతో నష్టపోతాడో సవివరంగా ప్రదర్శించారు. దీనికి రచన, దర్శకత్వం పోలుదాసు శ్రీనివాసరావు అందించారు. రెండో ప్రదర్శనగా కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటిక ఆకట్టుకుంది. ఒక మహిళ డాక్టర్ తన స్వార్థంతో చేసిన పనిని తోటి మహిళలు తిరగబడి బుద్ధి చెప్పిన కథాంశంతో నాటిక ఆసక్తికరంగా సాగింది. దీనికి మూలకథ డి.కామేశ్వరి, నాటకీకరణ డి.ఉమాశంకర్ అందించగా, దర్శకత్వం డి.వినయ్ నిర్వహించారు. నాటిక ప్రదర్శనలు తిలకించేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
ఎమ్మెల్యే అశోక్పై దాడికి యత్నం
త్రుటిలో తప్పించుకున్న వైనం యానాం: స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై కొంతమంది దాడికి యత్నించడంతో త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన సావిత్రినగర్కు ఓ పుట్టినరోజు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారు వద్దకు వెళుతుండగా, ఒక్కసారిగా సుమారు 50 మంది రాళ్లు పట్టుకుని దాడికి యత్నించారని, దాని నుంచి త్రుటిలో తప్పించుకున్నానని ఎమ్మెల్యే అశోక్ విలేకరులకు తెలిపారు. తాను ముందస్తు అనుమతితో సావిత్రినగర్కు వెళ్లానని, అక్కడ ఉన్న ఎన్నికల అధికారి గొంతియ్యకు సైతం తెలిపానని, అయితే తనను గొంతియ్య ఏకపక్షంగా నువ్వు అంటూ సంబోధించడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఇంటింటికీ ప్రచారానికి రాలేదని తెలిపానన్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ఒక్కసారి తన వైపునకు రాళ్లతో వచ్చారని, మరోవైపు తన అనుయాయులు ఆపినప్పటికీ ముందుకు రావడంతో తాను కారులో తిరిగి యానాంకు వచ్చేశానన్నారు. తనపై ఎన్ని దౌర్జన్యాలకు దిగినా తనదే విజయమని ఆయన అన్నారు. ఘటనపై పుదుచ్చేరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. -
చదరంగం పోటీల్లో ప్రతిభ
అమలాపురం రూరల్: అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా అండర్–9 చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ బి.శాన్వి ప్రథమ స్థానం, ఓపెన్ కేటగిరీ నుంచి మోక్స్ సైనీ తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారని కోచ్ వి.శ్రీనుబాబు సోమవారం తెలిపారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరంలో జరిగే అండర్ –9 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనున్నారు. ఎనిమిదేళ్ల శాన్వి మొదటి స్థానం సాధించి జిల్లా చాంపియన్గా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. చదువుతో పాటు చదరంగంలో రాణిస్తున్న విద్యార్థినులను స్కూల్ చైర్మన్ నాయుడు, డైరెక్టర్ పిన్సిపాల్ నంద్యాల మనువిహార్ అభినందించారు. -
149 అర్జీల స్వీకరణ
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 149 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 144 ఆన్లైన్ ద్వారా, 5 ఆఫ్లైన్ ద్వారా అందాయి. రెవెన్యూ విభాగానికి 56 అర్జీలు అందాయి. పోలీస్ పీజీఆర్ఎస్కు.. కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ను ఎస్పీ డి.నరసింహకిశోర్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. వారి నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. చెరువులో స్నానానికి దిగి మృత్యువాత రాజానగరం: స్నానం చేసేందుకని చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెందాడు. మండలంలోని కానవరంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాజానగరం ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలావున్నాయి. కానవరానికి చెందిన వాసంశెట్టి నాగరాజు (45) రోజువారీ మాదిరిగానే ఉదయాన్నే స్నానం చేసేందుకు గ్రామంలోని చెరువులోకి దిగాడు. అయితే కొంతసేపటికి ప్రమాదవశాత్తూ మునిగిపోయి, మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో చెరువును బాగు చేస్తున్న కూలీలు ఉన్నప్పటికీ స్నానం చేస్తున్నాడనుకొని పట్టించుకోలేదు. అయితే చెరువులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి యంత్రం సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఎస్సై తెలిపారు. అప్పన్నపల్లి బాలాజీ హుండీ ఆదాయం రూ.56.08 లక్షలుమామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి హుండీల ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారం పర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నరసన్న హుండీల రాబడి రూ.37,08,338 సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది. -
రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామా
● రానున్న రోజుల్లో ప్రజలే చెక్ పెడతారు ● రాజధాని, పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలు ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో డ్రామా ఆడుతున్నారని, ఆయన చర్యలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి చట్ట బద్దత తెస్తూ తీర్మానం చేసినట్టు కూటమి నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. తర్వాత ఎవరొచ్చినా రాజధానిని మార్చలేని విధంగా చట్టం చేసినట్టు గొప్పలు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇప్పటి వరకూ అమరావతి రాజధాని కాదని అంటారా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హంగామా చేస్తున్న చంద్రబాబు ఆ చట్టమేదో నవ్యాంధ్రకు తొలిసారి సీఎం అయ్యినప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. అమరావతి పేరుతో చేస్తున్న జపమంతా చంద్రబాబు, కూటమి నేతలు రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కులన్నారు. రాజధానిని అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు మాటలు మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేశానని చెబుతున్న తీర్మానాలు కేవలం విపక్షాన్ని విమర్శించడానికి తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలేమీ లేవన్నారు. అమరావతి, పోలవరంలను చంద్రబాబు ఏటీఎంలుగా మార్చుకున్నారని గతంలో ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న పేరుతో తన అనుచరులకు టెండర్లు ఇచ్చుకుంట్నునారన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను కల్పిస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.15 వందలు ఇస్తామని, చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25వేలు ఇస్తామంటూ చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తారన్న భయంతో విపక్ష నేతలను విమర్శిస్తూ కూటమి నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ను సీఎం కుర్చీ నుంచి దించేసి ఘోరంగా క్షోభ పెట్టారని, అలాంటి చంద్రబాబు సామాన్య ప్రజలకు మేలు చేస్తారన్నది అభూత కల్పన అని ఎమ్మెల్సీ తోట అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లా వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగ్రుంట అయ్యప్ప, మాజీ కౌన్సిలర్లు మందపల్లి రవికుమార్, మెండు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పలివెల మధు, మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ వల్లీ సాహెబ్, నాయకులు మేడిశెట్టి దుర్గారావు, వరదా చక్రవర్తి, సాధనాల శివ భగవాన్, వై రామకృష్ణ, యారమటి వెంకన్నబాబు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పండగ
● ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ అధికారులు ● గౌతమి బిల్డింగ్ విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలి ● పీజీఆర్ఎస్లో మాజీ ఎంపీ భరత్రామ్ వినతిపత్రం రాజమహేంద్రవరం సిటీ: నగరంలో అక్రమ భవన నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పండగ చేసుకుంటున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముడుపుల మత్తులో తేలుతున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదుట గౌతమి బిల్డింగ్ జి ప్లస్ ఫోర్లో నిబంధనలను అతిక్రమించి నిర్మించారని అన్నారు. ఈ బిల్డింగ్ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కార్పొరేషన్ అధికారులు విచారణ జరిపి నిర్మాణం అక్రమమని నిర్ధారణ చేస్తే చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ఆదేశించినట్టు భరత్రామ్ తెలిపారు. ఆ ఆదేశాలను అమలు పరచాలని ఆయన సోమవారం కార్పొరేషన్ సిటీ ప్లానర్ జీవీవీఎస్ మూర్తిని కోరారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం 22 శాతం పార్కింగ్ ఉండాలని సెట్ బ్యాక్లు ఉండాలని, ఓపెన్ స్థలం ఉండాలని అయితే ఇవన్నీ ఎక్కడ కనిపించవన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడికి లొంగి బిల్డింగ్ యజమానిపై చర్యలు మానేసి బీపీఎస్ అమల్లో ఉందని వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ బిల్డింగ్ వ్యవహారం తాము హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. రూ.లక్షల్లో ముడుపులు నగరంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే సిటీ ఎమ్మెల్యేకు పండగేనని, వెంటనే ఆయన అనుచరులు రాబందుల్లాగా వాలిపోయి రూ.లక్షల్లో ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం సైజును బట్టి రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముడుపుల మత్తులో పడి ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని భరత్రామ్ ధ్వజమెత్తారు. నగరంలో వందలాది అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వీటి వైపు కనీసం కన్నెత్తి చూసిన ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ లేరన్నారు. ఎమ్మెల్యేకు సవాల్ ఎన్నికల ముందు ఇదే బిల్డింగ్ వ్యవహారంలో తాను రూ.ఐదు కోట్లు లంచం తీసుకున్నానని నగరమంతా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసి, విష ప్రచారం చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్యాయంగా ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఎన్నికల ముందు తనపై చేసిన లంచం ఆరోపణలు ఈవీఎం ఎమ్మెల్యే నిరూపించాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, నిరూపించినట్లైతే అదే బిల్డింగ్ వద్ద తాను క్షమాపణ చెప్తానని భరత్రామ్ సవాల్ చేశారు. మున్సిపల్ కమిషనర్కు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు అతిక్రమించిన అక్రమ బిల్డింగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితుల్ని కించపర్చిన వ్యవహారంలో పోలీస్ కేసు నమోదు చేసినా బాధితులకు ప్రాథమిక హక్కుగా ఇవ్వవలసిన రసీదును ఒక సీఐ నిరాకరించడాన్ని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. క్రెడిట్ చోరీ చేయడంలో దేశంలో చంద్రబాబును మించినవారు లేరని, రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చిన పోర్టులు, పరిశ్రమలు గత జగనన్న ప్రభుత్వంలో వచ్చినవేనన్నారు. ఈయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్సార్ సీపీ జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ మున్సిప్ల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఉన్నారు. -
పన్ను కట్టకపోతే.. పరువు తీత!
● పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త పంథా ● పన్ను చెల్లించని ప్రజల ఇంటి ముందు జప్తు నోటీసుల ఏర్పాటు ● జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెలసిన బోర్డులు ● తమ పరువేం కావాలంటూ ప్రజల ఆందోళన ● వసూలు చేయని అధికారులపై చర్యలకూ వెనకాడని వైనం ● జిల్లాలో పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.120 కోట్లు ● ఇప్పటికి రూ.79.99 కోట్లు వసూలు సాక్షి, రాజమహేంద్రవరం: పంచాయతీల్లో పన్నుల వసూలుకు చంద్రబాబు సర్కారు కొత్త పంథా అనుసరిస్తోంది. పన్నుల చెల్లింపుల్లో ఆలస్యమైన, చెల్లించని వారి పరువు తీసేందుకు నిర్ణయం తీసుకుంది. పన్ను కట్టని ఇంటి వద్ద ఇంటి యజమాని పేరుతో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తోంది. జప్తు నోటీసు ఇంటికి అంటిస్తోంది. అందులో ఇంటి యజమాని పేరు, ఎంత చెల్లించాలో స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. పన్ను చెల్లించకపోతే నోటీసు ఇచ్చి వసూలు చేయాలే తప్ప.. ఇంటి వద్దకు వచ్చి పరువు తీయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి చర్యలు ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని ఆవేదన చెందుతున్నారు. అడ్డదారుల్లో సంపద సృష్టించేందుకు ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్చార్జీలు పెంచడం ద్వారా రూ.కోట్లల్లో ఆదాయం గడించిన చంద్రబాబు ప్రభుత్వం.. గ్రామాల్లో పన్నుల వసూళ్లతో మరింత ఆదాయం గడించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎవరినీ వదలడం లేదు. పన్నులు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. చేయని పక్షంలో సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తోంది. జిల్లాలో రూ.120.17 కోట్ల వసూళ్ల లక్ష్యం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పన్నుల వసూళ్లలో భాగంగా మొత్తం రూ.120.17 కోట్లు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో ట్యాక్స్లో భాగంగా ఇంటి, నీటి పన్నులు, నాన్ట్యాక్స్గా ఇండస్ట్రీస్, చెరువులు తదితరాల కింద రూ.120.17 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించింది. మార్చి నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. లక్ష్యాలు అధిగమించకపోతే.. మండలానికి ఒక కార్యదర్శిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు. దీంతో గ్రామాల్లో కార్యదర్శులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. నిత్యం అదేపనిలో తలమునకలయ్యారు. అయినా లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటి వరకు రూ.79.99 కోట్లు వసూలు చేయగా.. రూ.40.17 కోట్లు పెండింగ్లో ఉంది. 66 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించారు. మిగిలినది ఒక రోజులో ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నోటీసులు అందకపోవడంతో.. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో పన్నుల డిమాండ్లకు సంబంధించి కంప్యూటరైజేషన్ చేశారు. ట్యాక్స్ చెల్లించే వారికి ఫిజికల్ కాపీ ఇవ్వకుండా వారి ఫోన్ నంబర్లకు కట్టాల్సిన మొత్తానికి సంబంధించి డిమాండ్ నోటీస్ పంపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోని వారు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు ఆండ్రాయిడ్ కాకుండా కీప్యాడ్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తారు. వారికి ఈ విషయం తెలియకపోవడం.. ఫిజికల్గా నోటీసు అందకపోవడంతో పన్నుల వసూళ్లలో ఆలస్యం చోటు చేసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఇంటి పన్నులు, జనవరి 1 నుంచి కుళాయిలు, చేపల చెరువుల పన్నుల వసూళ్లు ప్రారంభించారు. దీంతో పాటు స్వర్ణ పంచాయతీలుగా ప్రభుత్వం రూపకల్పన చేయడంతో డిసెంబర్ 1 నుంచి స్వర్ణ పంచాయతీల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. ఫోన్ల ద్వారా మెసేజ్ వెళ్లిన వారికి బకాయి ఎంత ఉందో తెలియకపోవడం, ప్రజలు నగదు ఇవ్వటంతో కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు వాటిని తీసుకెళ్లి డిపాజిట్ చేసి ఆన్లైన్లో కట్టడం తలకుమించిన భారంగా పరిణమించింది. పన్ను కట్టని వారికి ఘోరంగా అవమానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరువుకు ప్రాణం ఇస్తారు. ఏ ఒక్కరు చిన్న మాట అన్నా.. పడరు. అలాంటి పల్లెల్లో పన్నులు చెల్లించలేదన్న సాకుతో వారి పరువు తీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పన్నులు కట్టని వారిని వివిధ రూపాల్లో అవమానాలకు గురి చేస్తోంది. పన్ను కట్టని ఇంటికి కూళాయి కనెక్షన్ నిలిపివేస్తున్నారు. వారికి నీరు అందకుండా చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. ఇంట్లో వస్తువులు జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ‘ఈ కుటుంబ యజమాని పన్నులు చెల్లించలేదు.’ అంటూ ఆ ఇంటి ముందు యజమాని పేరు, ఆయన చెల్లించని పన్ను వివరాలు తెలిసేలా పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల పేరుతో కార్యదర్శులను ప్రతి ఇంటికీ పంపించి వసూళ్ల పర్వం వేగవంతం చేయాలని ఒత్తిడి చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా పంచాయతీ కార్యదర్శులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. దీంతో ప్రజలు మరింత అవమానాలకు గురవుతున్నారు. తాము పన్ను కట్టలేదని ఊరంతా తెలిసేలా చేస్తున్నారని.. ప్రభుత్వం చేసే తప్పిదాలకు తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏటా జరుగుతోందిలా..! ఏటా ఇంటి పన్నుల వసూళ్లకు మార్చి మాసంలో నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్ నెలాఖరుకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రక్రియకు మంగళం పాడారు. ప్రజల వద్ద వసూళ్లకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక ప్రజలపై పడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే పన్నులు వసూలు చేసేయాలంటూ కార్యదర్శుల మెడపై కత్తిపెట్టారు. ఈ పరిణామం కార్యదర్శుల్లో ఆవేదన నింపుతోంది. ప్రతి సంవత్సరం ఇంటిపన్ను వసూళ్లకు మార్చి నెలలో నోటీసులు జారీ చేసి ఆ నెలాఖరుకు గానీ, ఏప్రిల్ చివరకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం పద్ధతులన్నీ మారడంతో కార్యదర్శి ఉద్యోగం చేయడం కంటే మానుకోవడం మేలంటూ కొందరు కార్యదర్శులు వాపోతున్నారు. కార్యదర్శులు సతమతం పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతోంది. ఉన్నతాధికారులు కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్ కార్యదర్శులు బీపీలు, సుగర్ బారిన పడుతున్నామని వాపోతున్నారు. తమ పంచాయతీల్లో పన్నులు వసూలు చేసినా.. పక్క మండలాల్లో పంచాయతీలకు బాకీల వసూళ్ల నిమిత్తం పంపించడంతో పగలు, రాత్రి అష్టకష్టాలు పడి వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఇలా... మండలం పన్ను వసూళ్ల వసూలైన శాతం లక్ష్యం పన్నులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) రాజానగరం 1,335.25 690.46 51.7 రాజమహేంద్రవరం రూరల్ 3,462.73 1,866.12 53.9 కడియం 1,053.88 650.06 61.7 రంగంపేట 332.87 213.41 64.1 దేవరపల్లి 590.22 384.22 65.1 గోకవరం 319.08 230.39 72.2 కొవ్వూరు 446.01 330.18 74.0 సీతానగరం 417.90 296 71.0 కోరుకొండ 354.29 249.42 70.4 గోపాలపురం 403.54 291.72 72.3 నల్లజర్ల 562.55 458.07 81.4 తాళ్లపూడి 273.90 216.09 78.9 ఉండ్రాజవరం 410.97 359.02 87.44 బిక్కవోలు 489.43 417.64 85.3 పెరవలి 277.52 230.15 82.9 చాగల్లు 387.90 316.45 81.6 అనపర్తి 606.50 545.23 89.9 నిడదవోలు 293.04 254.21 86.7 -
పూడిపల్లిలోనే పెద్దపులి సంచారం
దేవీపట్నం: నాలుగు రోజుల కిందట ఈనుకొండకు చేరిన పెద్దపులి గురువారం రాత్రి కొత్త వీధిలో నాలుగు పశువులపై దాడిచేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పులిని బంధించేందుకు అటవీ అఽధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శనివారం పోతవరం సమీపంలోని జోడుమామిళ్లు సమీపంలో పులి సంచరించింది. సాయంత్రం సమయంలో గోకవరం, దండంగి ఆర్అండ్బీ రహదారిని దాటుకుని డి.రావిలంక, పరగసానిపాడు, పూడిపల్లి గ్రామాల్లో తిరిగింది. కొత్తవీధిలో నాలుగు పశువులను చంపిన తర్వాత ఇప్పటివరకూ ఏ జంతువుకు హాని కలిగించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి ఆహారం కోసం పులి వేటాడేందుకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుందనే ఆలోచనతో అటవీ అధికారులు పూడిపల్లి పరిసర ప్రాంతాలలో ట్రాప్ను సిద్ధం చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో అధిక సంఖ్యలో గేదెలు ఉన్నాయి. ఆదివారం రాత్రికి పూడిపల్లి వద్ద సీతపల్లి వాగును దాటి దేవీపట్నం వైపునకు మరలుతుందా, లేక గోదావరి దాటి పశ్చిమగోదావరి వైపు వెళుతుందా అని అటవీ అఽధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ దేవీపట్నం వైపు మరలితే పులిని విడిచిపెట్టిన కొండమొదలు ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటి పశ్చిమగోదావరి వైపు మరలితే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను దాటుకుని పులి పయనాన్ని ప్రారంభించిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అభయ అరణ్యానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నూకాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులుసామర్లకోట: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి జాతర ఉత్సవాలు కొత్త అమావాస్య సందర్భంగా ప్రారంభించారు. మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆది, గురువారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇందులో భాగంగా రెండో ఆదివారం కావడంతో తెల్లవారు జామునే ఆలయానికి అనేక మంది వచ్చారు. ఆలయ సమీపంలో ఉన్న తోటలో వాహనాలను పార్కింగ్ చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ తోటలోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రాంబాబురెడ్డి, చైర్మన్ లొల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ‘ఈనాడు’ అనుచిత కార్టూన్పై చర్యలకు ఫిర్యాదుకపిలేశ్వరపురం (మండపేట): ఈనాడు దినపత్రికలో ఈ నెల 28న ఇదీ సంగతి శీర్షికన ప్రచురితమైన కార్టూన్ అనుచితంగా ఉందని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరువు, ప్రతిష్టలను దెబ్బతీసేదిగా ఉందంటూ మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్టూన్ గీసిన వారిపై, ప్రచురణకర్తపై, ఎడిటర్పై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ తన ఫిర్యాదులో కోరారు. పోలీసులను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు మందపల్లి రవికుమార్, పొలమాల సత్తిబాబు, జొన్నపల్లి సత్తిబాబు, జెల్లా కాదర్నాథ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలుఏలేశ్వరం: మంచివాళ్లు చేసే తప్పులే మహా విపత్తులకు కారణమవుతాయని, అందరూ మంచివారే కానీ నాటిక కళ్లకు కట్టినట్టు చూపించింది. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం యడ్లపాడు మానవతా వారి అందరూ మంచివారే కానీ నాటికకు రచన, దర్శకత్వం జరుగుల రామారావు అందించారు. రెండో నాటికగా మాతృత్వం ఆకట్టుకుంది. గుంటూరు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికకు మూలకథ సుఖమంచి కోటేశ్వరరావు అందించగా, పాగర్తి నాగేశ్వరరావు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. -
బీమా కోసం చోరీ జరిగినట్టు కథ చెప్పి..
● పోలీసులను తప్పుదోవ పట్టించిన మహిళ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సుభాష్ కోరుకొండ: బంగారు ఆభరణాలపై రూ.లక్షల బీమాను పొందవచ్చనే దురుద్దేశంతో చోరీ జరిగినట్టు నమ్మించిన ఓ మహిళ పన్నాగాన్ని ఛేదించినట్లు క్రైం డీఎస్పీ సుభాష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కోరుకోండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం.. కోరుకొండ మండలం కాపవరం శివారులోని నార్త్ జోన్ డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో ముండ్రు పద్మ నివాసం ఉంటోంది. ఈ నెల 27న 200 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ సంస్థలో కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉంటున్న తన పిల్లల నుంచి వచ్చిన నగదు బ్యాంకుల్లో నాలుగు ఖాతాల్లో జమవుతున్నాయి. ఆ నగదును తీసుకుని బంగారు ఆభరణాలను కొనుగోలు చేసింది. అయితే అవి చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే, దాని ఆధారంగా బీమా పొందవచ్చనే పథకం రచించింది. ఈ మేరకు తన ఇంట్లో చోరీ జరిగినట్టు 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా ఇంటి వద్ద సీసీ కెమెరాలు కనిపించకుండా చేసింది. మెయిన్ గేటుకు, లోపల తాళాలు వేసి అర్ధరాత్రి తీసేసింది. ఇంట్లోని వస్తువులను చిందర వందరగా పడేసింది. తనను తాళ్లతో కట్టేసుకుంది. మొబైల్ ఫోన్ను స్విచాఫ్ చేసి దాచేసింది. నలుగురు చోరులు ఇదంతా చేసినట్టు ఆమె పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్లు దర్యాప్తు చేయగా, చాకచక్యంగా నిజాన్ని నిగ్గు తేల్చినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు, గోకవరం ఎస్సై పవన్కుమార్, పోలీసులు రామన్నదొర, నాయుడు, సత్తిరెడ్డి, గోవిందు, యేసు, వీరబాబులకు రివార్డులను అందజేశారు. -
పొట్టకూటి కోసం వచ్చి..
● తిరిగి వెళ్తుండగా ప్రమాదం ● కూలీలతో వ్యాన్ అర్ధరాత్రి బోల్తా ● ఉదయం వెలుగులోకి.. ● మహిళ మృతి, 11 మందికి గాయాలు చింతూరు: వారంతా నిరుపేదలే.. పొట్టకూటి కోసం బతుకు జీవుడా అంటూ వచ్చారు.. కొద్దిపాటి సొమ్ము సంపాదించుకుని సొంతూరుకు ఆనందంగా బయలుదేరారు.. చివరికి అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు.. భద్రాచలం, చట్టి జాతీయ రహదారి–326పై చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం నడుమ శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కట్టేకళ్యాణ్కు చెందిన కొంతమంది కూలీలు మిరప కాయలు కోసేందుకు రెండు నెలల క్రితం ఎటపాక మండలం మురుమూరు వచ్చారు. కూలి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఛత్తీస్గఢ్ నుంచి వారు బొలెరో వ్యాన్ను కిరాయికి రప్పించుకున్నారు. శనివారం రాత్రి 13 మంది కూలీలతో కట్టేకళ్యాణ్కు బయలుదేరిన వ్యాన్ అర్ధరాత్రి దాటాక చింతూరు మండలం బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ ఉన్న ఓ కల్వర్టు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి బోల్తాపడింది. వాహనం అర్ధరాత్రి బోల్తా పడినా చీకటి కావడంతో వాహనాన్ని ఉదయం వరకూ ఎవరూ గమనించలేదు. ఆదివారం ఉదయం లోయలో ఉన్న వాహనాన్ని, క్షతగాత్రులను గుర్తించిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుని ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మడకం పైకే (35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ వివరించారు. కూలి పనులకు వచ్చి.. సొంత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో వ్యవసాయ పనులు ముగిశాక పొట్టకూటి కోసం పొరుగునే ఉన్న ఆంధ్రా, తెలంగాణకు ప్రతి ఏటా కూలికి రావడం వారికి పరిపాటి. ఇక్కడకు వచ్చిన వారు మిర్చి తోటలు, జామాయిల్ కటింగ్ పనులు చేస్తుంటారు. నెల, రెండు నెలల పాటు కూలి పనులు చేసిన అనంతరం సొమ్ములు తీసుకుని వారి రాష్ట్రానికి తిరిగి వెళుతుంటారు. ఈ క్రమంలోనే పనులు ముగించుకుని తిరిగి వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందింది. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఉదయం వరకూ ఆ గాయాలతో వారు నరకయాతన అనుభవించారు. పరిమితికి మించి ప్రయాణమే కారణమా? బొలెరో వ్యాన్లో సాధారణంగా ఏడుగురు లేదంటే తొమ్మిది మంది ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈ వ్యాన్లో పరిమితికి మించి డ్రైవర్తో సహా 13 మంది ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోజువారీ కూలీలను పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ఈ మ్యాజిక్కులు ఎన్నాళ్లో’ శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెండు బైక్లు ఢీకొని.. చింతూరు మండలం పోతనపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. రంపచోడవరానికి చెందిన కానెం సాయితేజ, అతని భార్య గంగోత్రితో పాటు కూనవరానికి చెందిన పండు, దుర్గాప్రసాద్కు గాయాలయ్యాయి. వీరికి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేశారు. -
ఇది మంచి పరిణామం
పీఎండీఎస్ సాగు మంచి ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పీఎండీఎస్ సాగు ఈ ఏడాది అనూహ్య ఫలితాలను ఇచ్చింది. అయితే రైతులు పీఎండీఎస్ పంటను భూమిలో కలియదున్నకుండా ముందుగా పశుగ్రాసం తీసుకుని మిగిలిన వ్యర్థాలను కలియ దున్నుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ సాగుతో జిల్లాలో పశుగ్రాసం ఒక్కసారిగా పెరిగింది. ఇది పాడి పరిశ్రమకు మంచిది. – ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం, కాకినాడ● -
చక్రాల బండికి రీటైర్మెంట్
అండాదండ లేక..ౖసైసె జోడెడ్ల బండి .. సోకై న దొరలా బండి.. అంటూ సాగే ఆ చక్రాల బండి దాదాపు మూలకు చేరింది. పూర్వం జోడెడ్ల బండి ఒక ప్రధాన రవాణా సాధనంలా, భూమి దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చడంలో కీలకంగా ఉండేది. సాంకేతికత పెరగడంలో ట్రాక్టర్లు వచ్చి జోడెడ్ల బండి జోరు తగ్గింది. అక్కడక్కడా ఎడ్ల బళ్లు ఉన్నా, దాని రూపురేఖలు మారిపోయాయి. ఆ గంటల చప్పుడు మూగబోయింది. కేవలం ఎడ్ల పందేలకు మాత్రమే చక్రాల బళ్లు ఉపయోగిస్తున్నారు. మిగిలినవి చక్రాలకు బదులుగా టైర్ల బండ్లు వాడుతున్నారు. ప్రస్తుతం ధాన్యం తరలించడానికి అక్కడక్కడా ఎడ్ల బళ్లు కనిపిస్తున్నా, అన్నీ టైరు బళ్లే. జోడెడ్ల బండి అంటే ఇలా ఉండేదని ఇప్పటి వారికి బొమ్మలు చూపించే పరిస్థితి వచ్చింది. – పిఠాపురం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ఆదివారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడియం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని బుర్రిలంకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టించుకునే వారే కరవయ్యారు. కనీసం ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేసి, దండ వేసేవారు లేకపోవడంపై ఆయన అభిమానులు నొచ్చుకున్నారు. ఆయన పెట్టిన పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారైనా కనీసం ఈ విగ్రహానికి దండేద్దామన్న ఆలోచన లేకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. – కడియం టీడీపీ ఆవిర్భావం రోజున కూడా బుర్రిలంకలో పూలదండకు నోచుకోని ఎన్టీఆర్ విగ్రహం -
క్రికెట్ బెట్టింగ్లపై ఉక్కుపాదం
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరిక అమలాపురం టౌన్: క్రికెట్ బెట్టింగ్లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హితవు పలికారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన క్రమంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపామని, పట్టుబడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం క్రికెట్ బెట్టింగ్లపై అమలాపురంలో ఎస్పీ మీనా ఓ ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించినా, ప్రోత్సహించినా, ఆ బెట్టింగ్ల్లో పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ల యాప్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో మీ పిల్లలు ఏఏ యాప్స్ వాడుతున్నారనే వాటిపై దృష్టి పెట్టాలన్నారు. క్రికెట్ను వినోదంగానే స్వీకరించాలని, దానిని జూదంగా మార్చి మీ బంగారు భవష్యత్ను, తల్లిదండ్రుల కలలను చిన్నాభిన్నం చేసుకోవద్దని యువకులకు హితవు పలికారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలిసే ఆ సమాచారాన్ని 100 లేదా 112కు కాల్ చేసి తెలపాలన్నారు. అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
అవనికి అవసారం
● పీఎండీఎస్ సాగుతో ప్రయోజనాలు ● ఎకరాకు 20 టన్నుల పశుగ్రాసం ● టన్నుకు రూ.3 వేల వరకూ ఆదాయం●పిఠాపురం: రబీ సాగు చివరి దశకు చేరుకుంది.. వేసవిలో రైతులు అపరాల సాగు చేయడం లేకుంటే, భూములను ఖాళీగా వదిలేయడం చేస్తుంటారు. భూములు ఖాళీగా ఉంటే భూసారం తగ్గడంతో పాటు క్రిమికీటకాలు భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, తరువాత పంటలకు హాని కలిగిస్తాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. భూమికి ఆరోగ్యం.. పోషక విలువల ఆహార పంటలు, ప్రజలకు ఆరోగ్యం తదితర బహుళ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) సాగుకు చేపట్టింది. అంటే జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంప జాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇస్తోంది. వేసవిలో రైతులకు అదనపు ఆదాయంతో పాటు పశువులకు మేత అందించే నవ ధాన్యాల సాగుకు చేపట్టాలని అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ శాఖ గత ఏడాది ఎకరానికి 10 కిలోల చొప్పున విత్తనాలను రైతులకు అందించింది. ఇలా రైతులు సాగు చేసిన 400 ఎకరాల్లో పీఎండీఎస్ విత్తనాలతో సారవంతంగా మొక్కలు రావడంతో రైతుకు అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కూడా నవ ధాన్యాల సాగుకు ప్రకృతి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. గత ఏడాది కాకినాడ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పీఎండీఎస్ సాగు చేశారు. మొత్తం 56 వేల మంది రైతులు ఈ విత్తనాలను వేశారు. ఇందుకు గాను ప్రకృతి వ్యవసాయ శాఖ 400 టన్నుల విత్తనాలను రైతులకు పంపిణీ చేసింది. దీనిద్వారా సుమారు 60 వేల టన్నుల పశుగ్రాసం వచ్చింది. రైతులు సుమారు రూ. 6 కోట్ల ఆదాయం పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 86,959 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 60,349 మంది రైతులకు 450 టన్నుల పీఎండీస్ విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ధేశించారు. భూమికి ఎంతో మేలు పీఎండీఎస్ సాగు చేసిన పంట పొలాల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పొలాల్లో భూసారం పెరగడంతో పాటు రైతుకు మంచి అదనపు లాభాలను తెచ్చిపెట్టింది. భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కలుపు నివారణ జరుగుతుంది. పురుగులు, తెగుళ్ల నివారణ, రైతు మిత్రులు వానపాముల వృద్ధి జరిగి మిత్ర పురుగుల శాతం అధికమవుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి ఖర్చు అదుపులో ఉంటుంది. భూమి కోతకు గురి కాకుండా కాపాడుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. భూతాపం తగ్గి విపత్తులను తట్టుకునే శక్తి వస్తుంది. నేలలో సేంద్రియ కర్బనం రెండు శాతం వరకూ పెరిగి సూక్ష్మజీవుల వైవిధ్యం పెరిగి అనేక పోషకాలు పైరుకు అందుతాయి. బలవర్ధక పశుగ్రాసం పీఎండీఎస్ పంట ఏపుగా పెరగడంతో ఎకరానికి సుమారు 20 టన్నుల వరకూ నాణ్యమైన పోషక విలువలున్న పశుగ్రాసం లభ్యమవుతోంది. దీంతో ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. వివిధ మిల్క్ డెయిరీలకు చెందిన యజమానులు పీఎండీఎస్ పశుగ్రాసం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజూ 200 టన్నులకు పైగా పశుగ్రాసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకపక్క భూమి సారవంతం అవ్వడంతో పాటు మరోపక్క రైతుకు ఆదాయం వస్తుండడంతో పీఎండీఎస్ సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇలా చేస్తే కళకళలాడుతూ.. వేసవిలో ఈ విత్తనాలను ఖాళీగా ఉండే భూముల్లో వేయడం ద్వారా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బీడు భూములు సారవంతం అవుతున్నాయి. పశువుకు గ్రాసం అందుతుంది. నేల రంగు మారి సారవంతం కావడం, వేరు వ్యవస్థ పటిష్టంగా పెరిగి, వాతావరణ ఆటుపోట్లను తట్టుకొని నిలబడడం జరుగుతుంది. జీవవైవిధ్యం పెరుగుతుంది. పంట ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు పెరుగుతాయి. 365 రోజులు భూమి కప్పబడి ఉండి సకాల వర్షాలకు దోహదపడుతుంది. ఈ గ్రాసం తిన్న పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది. పాలలో వెన్న శాతం అధికమవుతోంది. ఇలా నవధాన్యాల సాగుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. -
ఆరోగ్యశ్రీ.. గుండె గుభిల్లు!
బి● జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయి ● ఆగనున్న ఎన్టీఆర్ ‘వైద్యసేవ’ ● 1 నుంచి నిలిపివేతకు ‘ఆషా’ నిర్ణయం ● చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం ● నూతన యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపై ప్రభుత్వం సమాలోచనలు సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వైద్యం పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ లోగా బకాయిలు చెల్లించని పక్షంలో సేవలు కొనసాగించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామం జిల్లా ప్రజల్లో ఆందోళన నింపుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ స్తంభిస్తే ఖరీదైన వైద్యం, శస్త్ర చికిత్సలు ఎక్కడ చేయించుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక చంద్రబాబు ప్రభుత్వ కుట్ర దాగుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఎత్తేసి.. యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని.. అందులో భాగంగానే బిల్లులు చెల్లించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా పొందే పరిస్థితి ఇకపై ఉండదని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతున్నాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40 ఉండగా.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా హాస్పిట్ 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్య శాలలు(ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో సుమారు 60 మంది వైద్య మిత్రలు విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు ఎత్తివేయాలా అనే ఆలోచిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు కొన్ని నెలల నుంచి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పథకం ప్రకారం ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఆపేసి.. వేధించడం ప్రారంభించారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్టైం సెటిల్మెంట్ పేరుతో వంచన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపుల్లో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిరసనగా ఇప్పటికే ఆస్పత్రుల యాజమాన్యాలు తమకు బిల్లులు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాయిు. రెండు, మూడు సార్లు వైద్య సేవలను సైతం నిలిపివేశారు. సమ్మె సైతం నిర్వహించాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అప్పట్లో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం వన్టైం సెటిల్మెంట్తో మొత్తం బిల్లు చెల్లించేస్తామని గతేడాది డిసెంబర్లో సెటిల్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇది జరిగి మూడు నెలలవుతున్నా నేటికీ అతీగతి లేదు. ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు లేరు. చేసేది లేక ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని నిలిపివేసేందుకు ఆషా నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయి తెల్ల రేషన్కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింప చేస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తూ వస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.250 కోట్ల మేర బకాయి పెట్టింది. గుండె సంబంధిత, చర్మం, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు తదితర ఆపరేషన్లు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. ఈ పరిణామం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఖరీదైన శస్త్ర చికిత్స తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అనేక ఆందోళనల నేపథ్యంలో తలొగ్గిన ప్రభుత్వం ఇటీవల 5 శాతం నిధులు మాత్రమే విడుదల చేసి వారిని జోకొట్టింది. మిగిలినవి ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. సేవల ఎత్తివేతకు కుట్ర ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఆ పథకం స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు తెలిసింది. పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు, స్పష్టమైన ఆదేశాలు మాత్రం గుట్టుగా ఉంచిందన్న ఆరోపణలున్నాయి. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్, ఆపై మొత్తానికి బీమా కంపెనీల ద్వారా వైద్యం అందించాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఆస్పత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. తక్కువ ప్యాకేజీల కారణంగా బీమా కంపెనీలు ముందుకు రావడం లేదని సమాచారం. బీమా పథకంలో వ్యాధుల సంఖ్య 1900 లోపే ఉంటాయి. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్పై ఆసక్తి చూపడం లేదు. ఇదే జరిగితే నయాపైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. కొత్త పథకంపై స్పష్టత కరువు పేదలకు ఆరోగ్య ఆసరా కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకాన్ని తొలగిస్తే మెరుగైన వైద్యం అందుతుందా..? లేదా..? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. కొత్త పాలసీతో పేదలకు మేలు జరుగుతుందా..? లేదంటే పేరు మార్చి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. బీమా క్లెయిమ్ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన ప్రస్థానం 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నాలుగున్నరేళ్లలో పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. రూ.508,49,95,571 కోట్లు వైద్యం, శస్త్ర చికిత్సలకు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేశారు. దిక్కుతెలియని పరిస్థితుల్లో ఆపేస్తున్నాం ఎన్టీఆర్ వైద్యసేవలో నెట్వర్క్ ఆస్పత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిసెంబర్ నాటికి వన్టైం సెటిల్మెంట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తమకు చెల్లించాల్సిన బిల్లుల్లో సైతం కోత విధిస్తున్నారు. మళ్లీ కొత్తగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మొదలు పెడతామంటున్నారు. ఇదే ప్యాకేజీతో వైద్యం అందించడం సాధ్యం కాదని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతోంది. ప్రజలకు వైద్యం అందించాలని ఉన్నా.. బిల్లులు అందకపోవడంతో దిక్కుతెలియని పరిస్థితుల్లో వైద్యం ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం. – డాక్టర్ విజయ్కుమార్, ఆషా ఏపీ చైర్మన్ గత ప్రభుత్వంలో జిల్లాలో వైద్యం ఇలా..సంవత్సరం వైద్యం/ ఖర్చులు శస్త్రచికిత్సలు (రూ.కోట్లల్లో) 2019–2020 25,750 62.71 2020–2021 29,602 62.15 2021–2022 47,039 89.48 2022–2023 1,46,414 294.15 -
వాడవాడలో వేంకటేశు నామమే..
● వాడపల్లి క్షేత్రంలో వైభవంగా శ్రీవారి కల్యాణం ● గోవింద ఘోషతో మార్మోగిన పుర వీధులు ● కోలాహలంగా రథోత్సవం భక్తుల కోలాహలం నడుమ సాగుతున్న రథోత్సవంకొత్తపేట/ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని కల్యాణం, రథోత్సవం ఆదివారం వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల గోవింద ఘోషతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచీ ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చక బృందం వివిధ పూజా, హోమం, కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించగా వేలాది భక్త జన సందోహం నడుమ మాడ వీధుల్లో స్వామివారు ముందుకు సాగిపోయారు. కల్యాణం.. కనుల వైకుంఠం వాడపల్లిలోని విశాలమైన ప్రదేశంలో పంచ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసన భరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మంటపంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహలను పుష్పాలంకృతమైన పల్లకిలో ఉంచి వేద మంత్రాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ కల్యాణ మూర్తులను ఆశీనులను చేశారు. కల్యాణ తిలకంతో స్వామివారు, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతూ ఉభయ దేవేరులు భక్తజనానికి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చక బృందం వేద మంత్రాల నడుమ సాయంత్రం 6.15 గంటలకు కల్యాణాన్ని వైభవంగా ప్రారంభించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి డీసీ అండ్ ఈఓ సూర్యచక్రధరరావు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితర ప్రముఖులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ బందోబస్తు నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, వాయిద్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
● 1న కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష ● యూటీఎఫ్ నాయకుల పిలుపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): 12వ పీఆర్సీని అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏప్రిల్ ఒకటో తేదీన కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ నాయకులు ఈవీఎస్ఆర్ ప్రసాద్, ఎ.షరీఫ్ తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డుల మంజూరు తదితర సమస్యలపై వారు డిమాండ్ చేశారు. వీటి సాధనకు చేపడుతున్న నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్టూనిస్ట్ శేఖర్కు ఉత్తమ పురస్కారం రాజమహేంద్రవరం సిటీ: నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ వి.శేఖర్ను హైదరాబాద్కు చెందిన తపస్వీ మనోహరం సాహిత్య సేవా సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారంతో సత్కరించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య కళాభవన్లో ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా శేఖర్కు పురస్కారంతో పాటు, నగదు, ప్రశంసాపత్రం జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు నిమ్మగడ్డ కార్తిక్, ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పి.చంద్రశేఖర్ అజాద్, సాధనాల వెంకటస్వామి నాయుడు విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకులు చంద్ర ప్రతాప్ కంతటి తదితరులు పాల్గొన్నారు. ‘చిరు సంచుల’తో అధిక దిగుబడి● హెక్టారుకు 7 టన్నుల ధాన్యం దిగుబడి ● నూతన వరి వంగడం ఎంటీయూ 1426 దేవరపల్లి: మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన నూతన వరి వంగడం చిరుసంచులు రకం ఎంటీయూ 1426 అధిక దిగుబడులు ఇస్తోందని మండల వ్యవసాయాధికారి కె.కమల్ రాజ్ తెలిపారు. ఈ వంగడాన్ని ద్వాళ్వాలో రైతుల కమతాలలో ప్రయోగం నిమిత్తం ఈ ఏడాది పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ రకం దళ్వాలో 120 నుంచి 125 రోజుల్లో పక్వానికి వస్తుందని, హెక్టారుకు 6.5 నుంచి 7 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అగ్గితెగులు, ఎండాకు తెగులు, దోమపోటు, ఉల్లికోడును తట్టుకుంటుందని ఆయన తెలిపారు. గత రబీలో మిగిలిన రబీ రకాలతో పోలిస్తే 8 నుంచి 10 శాతం దిగుబడిలో వృద్ధిని గమనించామని, తినడానికి బాగుందని ఆయన తెలిపారు. రైతులు పండించిన విత్తనాలను తోటి రైతులకు పంపిణీ చేయవచ్చునని ఆయన తెలిపారు. ఘనంగా వేద సదస్యం అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, రామాలయ అర్చకుడు కోట వంశీ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. శృంగార వల్లభుని కల్యాణం
సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన ఇక్కడ స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై రాత్రి 10 గంటలకు అర్చకులు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, సుముహూర్తం, మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్పర్సన్ మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి, ఈఓ వడ్డీ శ్రీనివాసరావుల ఆధ్వర్యాన కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. -
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,800 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. చైత్ర శుద్ధ ఏకాదశి, ఆదివారం సెలవు కలసి రావడంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వందలాది వాహనాల్లో తరలి వచ్చారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,800 మంది ఆచరించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. -
మరో శిలా ఫలకం ధ్వంసం
● ఓవర్హెడ్ ట్యాంకు ప్రారంభోత్సవ ఫలకం ● నిర్మాణాన్ని పడగొట్టిన దుండగులు ● ఇమ్మిడివరప్పాడులో ఘటన అమలాపురం రూరల్: మండలం ఇమ్మిడివరప్పాడులో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మరో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. అదే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఈసారి ధ్వంసం చేశారు. ఇక్కడ వరసగా శిలా ఫలకాల ధ్వంసం జరుగుతున్న తీరు చూస్తుంటే గ్రామంలో రాజకీయ క్షక్షలతో కావాలనే ఇలా చేస్తునట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లతో ఉన్న శిలాఫలకం ధ్వంసం చేయడంతో సదరు ప్రజా ప్రతినిధులంటే ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. ఈ శిలాఫలకం ధ్వంసంపై పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో రెండు శిలా ఫలాకాలు ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
రాజు నిజాయతీ అభినందనీయం
● ల్యాప్టాప్ మరచి దిగిపోయిన ప్రయాణికురాలికి అందజేత ● ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచుతుందన్న డీఎం జేమ్స్ కుమార్ రాజోలు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ల్యాప్ట్యాప్ మరచి దిగిపోయిన ప్రయాణికురాలికి తిరిగి అందజేసిన కండక్టర్ రాజుకు స్థానిక డీఎం జేమ్స్ కుమార్ శనివారం అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళి తే, అమలాపురం నుంచి కరవాకకు బస్సులో ప్రయా ణిస్తున్న జె.శ్రావణి బస్సు దిగుతూ ల్యాప్ట్యాప్ మరచిపోయారు. దీనిని గమనించిన కండక్టర్ ఎన్.జి.రాజు దానిని భద్రపరిచి, డిపో మేనేజరు జి.జేమ్స్ కుమార్, సూపర్వైజర్ సమక్షంలో ఆమెకు అప్పగించారు. కండక్టర్ నిజాయతీ, బాధ్యతాయుత సేవలను డీఎం కు మార్ అభినందించారు. ఈ ఘటన ప్రజల్లో సంస్థ పట్ల నమ్మకాన్ని పెంచడమే గాకుండా, ఏపీఎస్ ఆర్టీసీ సి బ్బంది సేవాతత్వాన్ని ప్రతిబింబింప చేస్తోందన్నారు. -
తీవ్ర నష్టాలు
ఏడాది కాలంగా కోళ్ల ఫారాలతో తీవ్ర నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర తగ్గటంతో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది. గుడ్డు ధర రూ.4.05 ఉండటంతో ఏమి చెయ్యాలో తెలియడం లేదు. మేత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. – భూపతిరాజు నర్సింహరాజు, ఖండవల్లి ఆర్థిక ఇబ్బందులు దాదాపు 15 ఏళ్లగా కోళ్లఫాం నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నలిగిపోయాం. రెండు నెలలు బాగానే ఉన్నా, మళ్లీ గుడ్డు ధర పతనమైంది. ఇలాగే ఉంటే కోళ్ల పరిశ్రమ మూతపడుతుంది. – మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరంఖండవల్లిలో ఖాళీగా ఉన్న కోళ్లషెడ్లు -
చిన్నారి శస్త్రచికిత్సకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’
కాజులూరు: ఆర్యావటం గ్రామానికి చెందిన చిన్నారి పాదాలకు హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. చిన్నారి పాదాలు వెనుకకు మెలి తిరిగి నడవలేని స్థితిలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసేందుకు కాకినాడ శ్రీకై రా ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్ వైద్యులు సిద్ధమవుతున్నారు. కరప మండలం ఉప్పలంకకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి కర్రి దుర్గాభవానికి పుట్టుకతోనే పాదాలు వెనుకకు మెలి తిరిగి ఉండటంతో నడచేందుకు వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రధాన కార్యదర్శి అనసూరి శ్రావణి హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త, సంస్థ చైర్మన్ జి.విఠల్రెడ్డిని సంప్రదించగా రూ.లక్ష అందజేశారు. అలాగే సంస్థ సభ్యులు మరో రూ.40 వేలు సమకూర్చారు. చిన్నారి కుటుంబ పరిస్థితి, హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని గమనించిన కాకినాడ శ్రీకై రా ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్ వైద్యుడు వెంకట భార్గవ్ రూ.2.5 లక్షలకే ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. సంస్థ సభ్యులు సమకూర్చిన రూ.1.4 లక్షలకు తోడు మరో రూ.1.1 లక్షలు, ఖర్చుల నిమిత్తం మరో రూ.15 వేలను కాకినాడ ప్రియా హోటల్ మేనేజ్మెంట్ కళాశాల అధినేత తాడి నరేంద్రకుమార్ శనివారం అందజేశారు. దీంతో బాలికకు ఆదివారం ఆపరేషన్ చేయనున్నట్టు వైద్యుడు వెంకట భార్గవ్ తెలిపారు. -
జోడుమామిళ్ల సమీపంలో పెద్దపులి!
దేవీపట్నం: ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామంలో గురువారం రాత్రి నాలుగు పశువులను చంపిన పెద్దపులి శుక్రవారం రాత్రి కొత్తవీధి ఎగువన గల మీటరాయి చెరువు వద్ద ఉన్న కొండకు చేరింది. గోకవరం దండంగి ఆర్అండ్బి రహదారిలో పోతవరం, జోడుమామిళ్లు మధ్య పులి సంచరిస్తోంది. శనివారం రాత్రికి పులి పయనం ఎటువైపు వెళుతుందోనన్న ఆసక్తి నెలకొంది. జోడు మామిళ్లు వద్ద ఆర్అండ్బి రహదారి దాటితే పురుషొత్తపట్నం వైపు మరలే అవకాశం ఉంది. ప్రస్తుతం పులి ఉన్న ప్రదేశం నుంచి గుంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాల మీదుగా సీతపల్లి వాగు దాటితే పులిని విడిచిపెట్టిన పాపికొండల అభయారణ్యంలోని కొండమొదలు ప్రాంతానికి చేరే అవకాశం ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా పులి పయనిస్తున్న మార్గాన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతానికి చేరుకునే అవకాశాలున్నాయి. తిరుపతి, పుణే నుంచి వచ్చిన బృందాలతో పాటు, హనుమ సభ్యులు స్థానిక అటవీ సిబ్బంది సహకారంతో పులి గమనాన్ని జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా ఉన్న గ్రామాలైన లక్ష్మీపురం, గుంపెనపల్లి, నూనెపల్లి గ్రామాలకు చెందిన పశువులను జనవరి నెలలోనే విడిచిపెట్టడంతో ఆయా పశువులు అడవులలో సంచరిస్తున్నాయి. వీటికి తోడు దండంగి పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యి వరకూ గేదెలు ఉండడంతో ఆయా పశువుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. -
విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
సీతానగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె శనివారం పురుషోత్తపట్నంలో ని ఎంపీయూపీ స్కూల్, తాబే లు మెట్ట – ఏనుగు కొండ ప్రాంతం, సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించా రు. ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా విధానాలు, పేరెంట్స్ కమిటీ సమావేశాల నిర్వహణ, విద్యార్థుల ప్రతిభ తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. పురుషోత్తపట్నం సమీపంలో పురాతన రామాలయం ఉన్న రామదుర్గం, తాబేలు మెట్ట – ఏనుగు కొండ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీపీ విధానంలో చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ప్రాంతంలో రిసార్టులు, రెస్టారెంట్ల స్థాపనకు అనువైన 7.5 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. అవసరమైన మార్గదర్శకాలను టూరిజం వెబ్సైట్లో విడుదల చేశామని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన వాసంశెట్టి గోపాలం, కుమారి దంపతుల కుమారుల ఆర్థిక సాయంతో 13 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ స్వామి వారికి పూలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం, నూతన ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. -
నిరంతరాయంగా ఎల్పీజీ సరఫరా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో గృహ అవసరాలు, అత్యవసర సేవలకు అవసరమైన ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని జేసీ మేఘ స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12 వేల నుంచి 12,500 వరకూ గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతోందన్నా రు. గ్యాస్ పంపిణీ దారుల వద్ద సుమారు 14,362 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సాధారణంగా రోజుకు 11 వేల నుంచి 11,500 వరకూ బుకింగ్లు ఉండేవని, అవి ప్రస్తుతం 8 వేల నుంచి 9 వేలకు తగ్గాయని పేర్కొన్నారు. ఇటీవల బుకింగ్లు సుమారు 90 శాతం పెరగడంతో ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందస్తు విధానంలో కొనసాగుతుండటంతో సరఫరాలో కొంత జాప్యం కనిపించిందన్నారు. సిలిండర్లను వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేస్తున్నందున గోడౌన్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ నంబర్ 80746 61259కు వచ్చిన 220 ఫిర్యాదులను పరిష్కరించామని, గత కొన్ని రోజులుగా 47 కేసులు నమోదు చేసి 119 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాస్ హోర్డింగ్, నల్ల బజారు, అధిక ధరలకు అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 208 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు.


