breaking news
East Godavari District News
-
రోజాపై వ్యక్తిగత దూషణలు సరికాదు
నల్లజర్ల: మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, భానుప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంటి పేరు గాలి కదా అని మహిళలపై గాలి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. రోజాపై ఈవిధమైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళతామని వనిత హెచ్చరించారు. మహిళలంటే టీడీపీకి అసలు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి ఘటన మరువక ముందే రోజాపై అసహ్యకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మహిళలను అవమానించడం, కించపర్చడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తడమే రోజా చేసిన నేరమా అని ప్రశ్నించారు. మహిళలపై దాడి జరిగితే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని, ఎమ్మెల్యే భానుప్రకాష్ తాట ఎందుకు తీయలేదని నిలదీశారు. భానుప్రకాష్ను తక్షణం అరెస్ట్ చేయాలని వనిత డిమాండ్ చేశారు. గాలి భానుప్రకాష్పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు మాజీ హోం మంత్రి తానేటి వనిత -
40 మీటర్లు ఉన్నాయంటూ..
సామర్లకోట పట్టణం కిర్లంపూడి రోడ్డులోని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో కటకం నాగసత్య గంగాభవాని అద్దెకు ఉంటున్నారు. భర్త శ్రీను ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లికి వందనం కింద ఇద్దరికీ రూ.30 వేలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఆ డబ్బులు రాకపోయేసరికి సచివాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి ఆ దంపతులు కంగు తిన్నారు. కూటమి సర్కారు వచ్చాక ఒక మీటరుకు వస్తున్న బిల్లు చెల్లించడమే కష్టంగా ఉంది. అటువంటి గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రికార్డు చేశారు. దీంతో, ఆ దంపతులు సామర్లకోట సబ్ స్టేషన్కు వెళ్లి తమ పేరిట ఉన్న విద్యుత్ మీటర్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు. ఇందులో తమ తప్పేమీ లేనప్పటికీ గంగాభవాని దంపతులు 40 మీటర్లకు రూ.1,400 చెల్లించుకున్నారు. అయినప్పటికీ, మీటర్లు తొలగించడానికి ఈపీడీసీఎల్ సిబ్బంది నెల రోజులు చేశారు. అప్పటికే తల్లికి వందనం గడువు కూడా పూర్తయిపోయింది. ఆ డబ్బులు రాకపోగా, తమకు చేతి చమురు వదిలిపోయిందని గంగాభవాని దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఆమె పేరిట ఏకంగా 180 మీటర్లు ఈపీడీసీఎల్ నిర్వాకాలు పరాకాష్టకు చేరాయనడానికి ఇది మరో ఉదాహరణ. సామర్లకోట నాలుగో వార్డుకు చెందిన సీకోలు శ్రీదేవి కుటుంబం ఒక రేకుల షెడ్లో నివాసం ఉంటోంది. ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వీరికి కుమారుడు (4వ తరగతి), కుమార్తె (3వ తరగతి) ఉన్నారు. తమ బిడ్డలకు తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆ దంపతులు గంపెడాశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనిపై సచివాలయంలో సంప్రదిస్తే ఏకంగా 17,758 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు రికార్డుల్లో ఉందనే కబురు చల్లగా చెప్పారు. వాస్తవానికి ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డుకు ఏనాడూ 60 యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాలేదు. దీనిపై ఈపీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే శ్రీదేవి ఆధార్ నంబర్ 4329 0153 9009తో ఏకంగా 180 విద్యుత్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని తెలిసింది. దీంతో, ఆ దంపతులకు గుండె ఆగిపోయినంత పనైంది. కూలీ పని చేసుకునే తమకు 180 మీటర్లు ఏమిటని నిలదీస్తే ఫిర్యాదు తీసుకుని, 179 మీటర్లు తొలగించారు. కానీ, ఆమె పేరిట వచ్చిన 17,758 యూనిట్ల బిల్లును సవరించలేదు. చివరకు కరెంటోళ్ల పుణ్యమా అని ఆ కుటుంబం తల్లికి వందనానికి దూరమైంది. వీరికి కోత కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 2వ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న యల్ల గంగాభవాని, శ్రీను దంపతులు పది మందికి న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి పిల్లలు సత్యకిరణ్ వర్ధన్, హర్షవర్ధన్ ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి తల్లికి వందనం డబ్బులు రూ.30 వేలు వస్తాయని ఆ దంపతులు భావించారు. తీరా చూస్తే కిరణ్వర్ధన్కు రూ.9 వేలు, హర్షవర్ధన్కు రూ.10,900 మాత్రమే గంగాభవాని ఖాతాలో జమయ్యాయి. ఇంత తక్కువగా ఎందుకు పడ్డాయని సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది నుంచి తెలియదనే సమాధానమే వస్తోంది. అందరి మాదిరిగా రూ.13 వేల చొప్పున పడినట్లు చెబుతున్నారు. కానీ ఖాతాలకు జమయ్యింది మాత్రం తక్కువగా ఉంది. అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఆ దంపతులు తమకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. -
వారి పాపం.. తల్లులకు శాపం
● ఒక్కొక్కరి పేరిట పదులు, వందల్లో విద్యుత్ మీటర్లు ● కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి దూరమవుతున్న పేదలు ● రెవెన్యూ శాఖదీ అదే తంతు ● మండిపడుతున్న అర్హులు ● ఇదేం పాలనంటూ ఆగ్రహంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలను బాగా చదివించుకుందామని ఆశ పడిన వారికి ఆ ప్రభుత్వమే జెల్ల కొడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు అర్హులైన ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. అందులోనూ ఈమధ్య కరెంటోళ్ల బాగోతాలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఎంతటి స్థితిమంతులకై నా మహా అయితే ఆరేడు వరకూ విద్యుత్ మీటర్లు ఉంటాయి. కానీ, నిన్న కాక మొన్న సామర్లకోటకు చెందిన ఓ మహిళ పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయని వెల్లడి కావడం చూసి అందరూ నివ్వెరపోయారు. తాజాగా, అదే పట్టణంలో మరో మహిళ పేరిట ఏకంగా 180 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ కరెంటోళ్లు షాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అసలు ఒకే ఆధార్పై పదులు, వందల సంఖ్యలో మీటర్లు ఏవిధంగా ఉంటాయనే ఆలోచన కూడా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) అధికారులకు, సిబ్బందికి రాకపోవడం వింతల్లోకెల్లా వింత. ఈపీడీసీఎల్ తీరు ఇలా ఉండగా.. తామేం తక్కువ కాదని రెవెన్యూ శాఖ కూడా అక్కడక్కడ నిరూపించుకుంటోంది. సెంటు భూమి కూడా లేని నిరుపేద తల్లుల పేరిట ఏకంగా 10, 11 ఎకరాల భూములు చూపించింది. ఇటువంటి అనేక కారణాలతో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వేలాది మంది.. ఆ సంక్షేమాన్ని అందుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ ఎంతో ఘనంగా ప్రకటించుకున్న తల్లికి వందనం పథకం డబ్బులు రాక పలువురు తల్లులు గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా అవస్థలూ పడుతున్నారు. కొందరి సమస్య పరిష్కారమైనా, ఇప్పటికే గడువు ముగిసిపోవడంతో తామేమీ చేయలేమంటూ మరి కొంత మందిని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆయా సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకు తమను బలి చేయడమేమిటని, ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం అర్హుల వివరాలు ● కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో 2.80 లక్షల మంది, జూనియర్ కళాశాలల్లో 48,690 మంది విద్యార్థులున్నారు. తొలి విడతలో 1,49,403 మందిని మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులు మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలో 1.88 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.23 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 65 వేల మందికీ అర్హత ఉన్నా వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.80 లక్షల మంది అర్హులుగా తేల్చారు. మిగిలిన 30 వేల మంది విద్యార్థులూ తల్లికి వందనానికి దూరమయ్యారు. గుత్తుల రాజేశ్వరికార్పొరేట్ పాఠశాలలో సీటు వచ్చిందంటూ.. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గుత్తుల రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు దుర్గా చంద్రశేఖర్ 3, కుమార్తె శ్రీవల్లి 2 తరగతులు చదువుతున్నారు. అయినప్పటికీ వారికి తల్లికి వందనం జమ కాలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో రాజేశ్వరి కుమార్తెకు సీటు వచ్చిందన్న కారణంతో ఇద్దరు పిల్లలకూ తల్లికి వందనం రాలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది తనిఖీ చేసి, ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని బదులిస్తున్నారు. వేరే వారి భూమి లింక్ చేయడంతో... కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన పాలపు పోచమ్మ, సత్తిబాబు దంపతులకు కుమార్తె మానస (పదో తరగతి), కుమారుడు ప్రవీణ్ కుమార్ (7వ తరగతి) ఉన్నారు. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వస్తాయనుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని, ఆ డబ్బులు బిడ్డల చదువుకు ఉపయోగపడతాయని ఆశించారు. అయితే, ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉంటున్న వారికి చెందిన భూమి పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్తో లింక్ అయ్యింది. మూడెకరాలు మానస ఆధార్కు, మరో నాలుగెకరాలు పోచమ్మ ఆధార్కు లింక్ అయ్యాయి. దీనిని కారణంగా చూపించి, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదు. నిజానికి పోచమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం తప్ప అదనంగా సెంటు భూమి కూడా లేదు. కానీ, రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో ఎన్ఆర్ఐల భూమి వీరి ఆధార్తో లింక్ అయ్యింది. ఆ ఎన్ఆర్ఐలు రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వగ్రామం వచ్చి వేలిముద్ర వేసి, పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్కు లింక్ అయిన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తేనే కానీ వీరికి తల్లికి వందనం రాదని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పోచమ్మ దంపతులు అమలాపురం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. -
‘తల్లికి వందనం’లో ఎస్సీ పిల్లల పట్ల వివక్ష
కడియం: తల్లికి వందనం పథకంలో ఎస్సీ విద్యార్థులకు తక్కువ డబ్బులు వేసి, కూటమి ప్రభుత్వం వివక్ష చూపిందని వైఎస్సార్ సీపీ కడియం మండల అధ్యక్షుడు, జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్చంద్ర స్టాలిన్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 9, 10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.10,900, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు రూ.8,200 చొప్పున మాత్రమే వారి తల్లుల ఖాతాలకు జమయ్యాయని తెలిపారు. తోటి వారి కంటే తమకు తక్కువగా రావడంతో వారందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. జేగురుపాడు గ్రామంలో పదో తరగతి విద్యార్థిని తొర్లపాటి నమ్రత తల్లి ఖాతాకు రూ.8,800, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి బడుగు జగన్ తల్లి ఖాతాకు రూ.8,200 మాత్రమే ప్రభుత్వం జమ చేసిందన్నారు. మండలంలో దాదాపు 1,500 మంది దళిత విద్యార్థులున్నారని, వీరికి ఈ పథకం పూర్తి స్థాయిలో అందలేదని స్టాలిన్ తెలిపారు. వీరికి న్యాయం చేయకపోతే కడియంలో దళిత విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేయాలినల్లజర్ల: ఉపాధ్యాయలను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని, లేకుంటే ఆ పనులు బహిష్కరించాల్సి వస్తుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అన్నారు. సభ్యత్వ నమోదు నిమిత్తం శుక్రవారం నల్లజర్ల వచ్చిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యోగా దినోత్సవం, మెగా పేరెంట్స్ – టీచర్స్ డే, మొక్కల పంపిణీ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం వంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులకు అప్పగించడం ఎంత మాత్రమూ తగదన్నారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల పంపిణీ, ఒక్క రోజులో బయోమెట్రిక్ పూర్తి చేయాలని ఆదేశించడం కేవలం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమేనని దుయ్యబట్టారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బంది లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని జయకర్ చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మనోహర కుమార్, ఎన్.భవాని, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ఎఫ్ ఆలీ అహమ్మద్, బి.కిశోర్, టి.నాగేశ్వరావు పాల్గొన్నారు. అష్టదేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అష్ట దేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు నడిపామని ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. రెండు బస్సులలో సుమారు 100 మంది భక్తులు శుక్రవారం అష్ట దేవతల దర్శనానికి బయలుదేరి, రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకున్నారని తెలిపారు. ఈ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహి మాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట గ్రామాల్లో వెలసిన దేవతలను దర్శిస్తారని వివరించారు. ఎరువుల కొరత లేదు దేవరపల్లి: ఖరీఫ్ పంటలకు అవసరమైన అన్ని రకాల ఎరువులూ రైతులకు అందుబాటులో ఉంచామని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్లోని 10 మండలాల్లో 9,915 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డివిజన్లోని 9 మండలాల్లో 10,336 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డీఏపీ 1,455 మెట్రిక్ టన్నులు, ఎఫ్ఓఎం 1,199 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,027 మెట్రిక్ టన్నులు, ఎన్పీకేఎస్ 6,377 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,474 మెట్రిక్ టన్నులు, యూరియా 6,397 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 20,272 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని వివరించారు. సొసైటీలు, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. -
కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్మిల్లు
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాలను కాలరాస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మిల్లు ఎదురుగా ఉన్న కల్యాణ మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మికులకు సంఘాలు పెట్టుకోవడం, కనీస వేతనాలు తదితర అనేక హక్కులు ఉన్నాయని చెప్పారు. వాటిని పేపర్మిల్లు యాజమాన్యం తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. మిల్లు ఆదాయం అమాంతం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని కార్మికులు పలుమార్లు డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. రూ.కోట్ల లాభాలు గడిస్తున్నా.. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారన్నారు. రూ.కోట్లలో లాభాలు.. కార్మికులకు పస్తులు ఆంధ్రా పేపర్ మిల్లును 1924లో స్థాపించారని, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని మొండి వైఖరిని యాజమాన్యం ప్రదర్శించడం దారుణమని రాజా మండిపడ్డారు. యాజమాన్యానికి పదేళ్లుగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయన్నారు. మిల్లు ఆదాయం 2014లో రూ.61 కోట్లు ఉంటే.. 2024 నాటికి రూ.430 కోట్లకు పెరిగిందన్నారు. 2014లో రూ.1,314.84 కోట్లుగా ఉన్న ఆస్తులు.. 2024కు రూ.2,450.95 కోట్లకు పెరిగాయన్నారు. మిగులు నిధులు రూ.1,853.43 కోట్లు ఉన్నా.. కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని ఆవేదన చెందారు. 35 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుడికి రూ.13,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలు తీసుకుంటున్న సంస్థ వారి సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదని రాజా స్పష్టం చేశారు. పేపర్ మిల్లు ఈడీ ముఖేష్ జైన్ నెలకు రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షల జీతం తీసుకుంటున్నారన్నారు. యాజమాన్యం, అధికారులు లేనిపోని ఈగోకు పోవద్దని.. కార్మికులకు న్యాయం జరుగుతుందంటే ఎవరి బూట్లు తుడవడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ నెల 9 నుంచి కార్మికుల పక్షాన పోరాడుతున్నామని, ప్రభుత్వం వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకూ సమయం ఇచ్చామని అన్నారు. అప్పటిలోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 22వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జక్కంపూడి రాజా అల్టిమేటం జారీ చేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజాకు పోలీసుల నోటీసులు ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్తో శాంతియుత ఆందోళన చేస్తున్న జక్కంపూడి రాజాకు పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు అందించారు. పేపర్ మిల్లు సమీపంలో ఉండకూడదని, కల్యాణ మండపాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పేపర్ మిల్లుకు 500 మీటర్ల లోపు ధర్నాలు, ఆందోళనలు చేపట్టకూడదని తెలిపారు. తాను ఎటువంటి ధర్నా చేయకపోయినా నోటీసులు ఇచ్చి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని రాజా అన్నారు. ఆదాయం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు పెరగడం లేదు సమస్యల పరిష్కారానికి 21 వరకూ గడువు లేకుంటే 22 నుంచి ఆందోళన ఉధృతం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. నిల్వల్లో తేడాలను గుర్తించి, ఓ ఫారమ్ లేకపోవడం నిర్ధారించి రూ.15,62,200 విలువ గల 66.5 మెట్రిక్ టన్నుల స్టాకు తదుపరి అదేశాలు ఇచ్చే వరకు అమ్మకాలు సాగించరాదని తెలిపారు. అనంతరం దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షాంసి, విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
సెంటు భూమి కూడా లేకపోయినా..
రాయుడు గిరిజ, శివప్రసాద్ దంపతులది కరప మండలం వేళంగి. వీరికిద్దరు పిల్లలు. వారికి తల్లికి వందనం కింద ఒకేసారి రూ.30 వేలు వస్తుందని ఆ దంపతులు సంబరపడ్డారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఉండటానికి ఇల్లు తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా లేని ఈ కుటుంబానికి యండమూరులో సర్వే నంబర్ 509/2లో 1.4850, 505/1లో 9.810తో కలిపి మొత్తం 11.295 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా ఈ కుటుంబం తల్లికి వందనానికి దూరమూంది. దీనిపై యండమూరు వీఆర్ఓ, కరప తహసీల్దార్లను కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నారు. సమస్య ఇప్పటికీ పరిష్కారమవలేదు. తమ పేరున ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తల్లికి వందనమైనా ఇవ్వాలని, లేదంటే ఆ భూములైనా ఇప్పించాలని వారు అడగటంలో తప్పేముందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు ● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం ● జిల్లాలో కంద సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు పెరవలి: జిల్లాలో కంద సాగుచేస్తున్న రైతులు కొన్నేళ్లుగా లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోపాటు, దిగుబడి తగ్గడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు కంద ధర రూ.7వేలు పలకడంతో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంద ధరలు చరిత్ర సృష్టిస్తే.. నేడు ధరలు పతనం అవ్వడంతో రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగున్నా మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టులు (పుట్టు– 232 కిలోలు) దిగుబడి వస్తోంది. సరైన ధర లేక రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు నష్టం రావటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. జిల్లాలో కందసాగు విస్తీర్ణం ఇలా .. జిల్లాలో కంద పంట గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేపట్టారు. గతేడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గతేడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటం వల్ల ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచటంతో నేడు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆందోళన కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.7, వేలు వద్ద స్థిరంగా ఉంది. తవ్వకాలు చేపట్టిన మొదటిలోనే ఇలా ఉంటే, పంటంతా చేతికి అందే సమయంలో ధరలు మరింత పతనమవుతాయోనని తవ్వకాలు చేపట్టని రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభాల నుంచి నష్టాలకు.. కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.11 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.7వేలు ఉండటం, దీనికితోడు దిగుబడి తగ్గటంతో రైతులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్టులకు రూ.3.50 లక్షలు, 60 పుట్టులకు రూ.4.20 లక్షలు, 70 పుట్టులకురూ.4.90 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.5.60 లక్షలు ఒక ఎకరానికి అయ్యేది. దీంతో దిగుబడిని బట్టి ఒక ఎకరానికి రూ.35 వేలు నుంచి రూ.1.75 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. నష్టాలు ఇలా.. పెట్టుబడి ఎకరానికి రూ.5.25 లక్షలు అవుతుంటే ఎకరానికి 50 పుట్టులు, దిగుబడి బాగుంటే మార్కెట్ ధర ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.7 వేలు చొప్పున 50 పుట్టులకు రూ.3.50 లక్షలు వస్తుందని, అదే 60 పుట్టుల దిగుబడి ఉంటే రూ. 4.20 లక్షలు, 70 పుట్టుల దిగుబడి ఉంటే రూ.4.90 లక్షలు రైతులకు వస్తుంది. దీని ప్రకారం ఒక ఎకరానికి 70 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులకు రూ.35 వేలు, 60 పుట్టులు, వచ్చిన వారికి రూ.1.05 లక్షలు, 50 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులు రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నేడు నష్టాల పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తుందనుకుంటే నేడు ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం. –వేండ్ర ఏసు, కంద రైతు, ముక్కామల ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలి గత ఐదేళ్లూ కంద రైతులు లాభాలు అందుకోగా నేడు తీవ్రంగా నష్టపోయాం. గతంలో పెట్టుబడి సొమ్ము వచ్చేది. నేడు రాని పరిస్థితి. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియటం లేదు. –బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు, అన్నవరప్పాడు మార్కెట్లో వినియోగం తగ్గింది ఉభయ గోదావరి జిల్లాల్లో పండించిన కంద పంటకు చైన్నె, ముంబయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గటంతో ధరలు తగ్గాయి. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద దిగుబడి బాగుండటం ధరలు తగ్గటానికి కారణమైంది. –గడుగోయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి దిగుబడి ఉన్నా.. గతేడాదిలాగే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గతంలో ఉన్న ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. గతేడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తే ఈ ఏడాది 50 నుంచి 70 పుట్టులు వచ్చింది. పెట్టుబడి.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా ల్సి ఉంది. ఎకరం కంద వేయాలంటే 30 పుట్టుల విత్త నం వేయాలి. గతేడాది విత్తనం ధర పుట్టు రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్ష లు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ. లక్ష ఖర్చు అయింది. పెంట వేయటానికి రూ.30 వే లు, ఎరువులు, పురుగు మందులకి రూ.40వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25వేలు .. మొత్తం ఖర్చు రూ.5.25 లక్షలు అవుతుండగా.. నేడు మార్కె ట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల నుంచి కె.పెదపూడి వైపు వెళుతున్న కారును అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కె.పెదపూడికి చెందిన సత్తిరాజాకు తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అంబాజీపేట పోలీసులు పరిశీలించి ఆర్టీసీ బస్ను స్టేషన్కు తీసువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసం మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు నల్లి దాసు ఇంట్లో వస్తువులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ మీటర్లతో పాటు మంచం, పరుపు కూడా కాలిపోయినట్లు దాసు తెలిపారు. ఈదురు గాలులుకు తోడు పిడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అదృశ్యమైన కుటుంబాన్ని పట్టుకున్న పోలీసులు కిర్లంపూడి: అదృశ్యమైన కుటుంబాన్ని గాలించి పట్టుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధి బూరుగుపూడి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, బాలిక, బాలుడు గత ఏడాది నవంబర్ 9వ తేదీ అర్ధరాత్రి తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గ్రామం విడిచి వెళ్లారు. సోదరుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మహారాష్ట్రంలోని షోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై జి.సతీష్ పోలీస్ సిబ్బందితో మాటువేసి శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది డబ్ల్యూహెచ్సీ గురుశ్రీ, పీసీ శివప్రసాద్ ఉన్నారు. చాకచక్యంగా పట్టుకుని ఎస్సై సతీష్ను, సిబ్బందిని పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నూతన విద్యావిధానం 36 ఏళ్ల తరువాత రూపొందించారని, దీని ద్వారా ప్రపంచీకరణపై అవగాహన కలుగుతుందని జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న ఓక్ ట్రీ ఉత్సవాల్లో భాగంగా రోల్ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర వికసత్ భారత్ – 2047 అంశంపై శుక్రవారం వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శాంతశ్రీ మాట్లాడుతూ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందన్నారు. టర్కీ, చైనా దేశాలు ఎయిర్ఫోర్స్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్న విధంగా భారతదేశం ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జేఎన్యూ వంటి విశ్వవిద్యాలయాలు నోబుల్ అవార్డు గ్రహీతలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, విద్యావ్యవస్థలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులకు సాంకేతిక విద్యానైపుణ్యాలను నేర్పించాలన్నారు. జేఎన్టీయూకే వంటి ప్రముఖ వర్సిటీల నుంచి ఏరోస్పేస్ సర్వీస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్క్రాప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒకేషనల్ సిస్టమ్, పబ్లిక్ డిజైన్ వంటి కోర్సులను అందించి ఆధునికతకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయే యుద్ధాలను ఎదుర్కొనేలా భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు అన్వేషణలు సాగించి సన్నద్ధమవ్వాలన్నారు. హైదరాబాద్ ఇప్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్కు వెయ్యిమంది ఉన్నారని, భారతదేశం పరిశోధనపై కేవలం 0.64 శాతం మాత్రమే నిధులు వెచ్చిస్తోందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ వీసీ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, తయారీ వంటి రంగాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనించేలా చేయాలన్నారు. నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టి సోషల్ సైన్స్, టెక్నికల్ కోర్సులను కలిపి నేర్పించాలని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మోహనరావు, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పద్మరాజు పాల్గొన్నారు. -
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు ● స్కూల్ను సందర్శించిన మండల అఽధికారులు జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు శుక్రువారం వారి ఇంటి వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గురువారం ఘటన అనంతరం విద్యార్థినులకు చికిత్స చేసి జగ్గంపేట సీహెచ్సీ నుంచి, ఒక ప్రయివేట్ ఆసుపత్రి నుంచి వారి ఇళ్లకు పంపారు. స్థానిక వైద్య సిబ్బంది శుక్రువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నట్లు మండల అధికారులకు తెలిపారు. పాఠశాలలో పరిస్థితిని జగ్గంపేట మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాశాఖాధికారి ఆర్.స్వామి సమీక్షించారు. పాఠశాలలో క్లాస్ రూమ్లు, వెంటిలేషన్, తాగునీటి శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను వారు క్షుణంగా పరిశీలించారు. విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. పాఠశాలకు శుక్రవారం విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల హెచ్.ఎం మారిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. 217మంది విద్యార్థులకు కేవలం 5 తరగతి గదులు కాండ్రేగులలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలిపి నిర్వహిస్తున్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో 165మంది హైస్కూల్ విద్యార్థులు కాగా 52 మంది ప్రాథమిక పాఠశాలకు చెందినవారు. హైస్కూల్ విద్యార్థులకు 5క్లాస్లకు కేవలం మూడే తరగతి గదులు వున్నాయి. రెండు క్లాస్లు వరండాలలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు రెండు తరగతి గదులు వున్నాయి. వీరిని సర్దుబాటు చేసి విద్యను అందిస్తున్నారు. –పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించాలి–విద్యార్దులకు జాగ్రత్తలు చెప్పాలి కాండ్రేగుల పాఠశాలలో గురువారం విద్యార్థుల అస్వస్థతకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వేసవిని మించి ఎండలు కాస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపేందుకు అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసివుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై మండల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు ● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గణేష్ కాలనీకి చెందిన నులక బేతాలుడు (30) పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేసే పనిలో భాగంగా స్తంభం ఎక్కిన సమయంలో 11కెవీ వైర్ల నుంచి విద్యుత్తు రావడంతో ఒకసారిగా కింద పడిపొయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బేతాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైస్చైర్మన్ ఉబా జాన్మోజెస్, సీఐ ఎ కృష్ణ భగవాన్, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, రాష్ట్ర మాలమహానాడు నాయకుడు లింగం శివకుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పిఠాపురం రోడ్డు కాంట్రాక్టరుతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్ట పరిహరం ఇచ్చేలా ఒప్పించారు. ఆస్పత్రి వద్ద భార్య, కుమార్తె రోదన స్థానికుల హృదయాలను కలచి వేసింది. కుమార్తె నాన్న కావాలని ఏడుస్తూ ఉంటే ఆ బాలికను సముదాయించడం స్థానికులకు సాధ్యం కాలేదు. సామర్లకోట–పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్తు స్తంభాలను వెనుకకు మార్పు చేశారు. మార్పు చేసిన స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయడానికి శుక్రవారం విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయినా విద్యుత్తు వైర్లకు కరెంటు సరఫరా కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోర్టుమార్టమ్కు తరలించి కేసు నమోదు చేసి సీఐ ఎ కృష్ణభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులపై వివక్ష.. ఎంఈఓ విచారణ
నిడదవోలు: పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులపై వివక్ష చూపుతున్న ఘటనపై జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు స్పందించారు. స్కూల్లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిష్లో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫాంకు ‘ఇంగ్లిష్ డిఫాల్టర్’ అనే ట్యాగ్ తగిలించడంపై ‘విద్యార్థుల పట్ల వివక్ష’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి విద్యాశాఖాధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు ఆదేశాల మేరకు ఎంఈఓ పి.గురుమూర్తి స్కూల్లో శుక్రవారం విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులతో ట్యాగ్ తగిలించడంపై వివరణ కోరగా, విద్యార్థులు విషయాన్ని ఎంఈఓకు స్పష్టంగా చెప్పారు. అనంతరం మరికొన్ని తరగతుల విద్యార్థులను విచారించారు. ఈ మేరకు హెచ్ఎం మేరీ సమక్షంలో సంబంధిత పాఠశాలకు చెందిన సుమారు 25 మంది ఉపాధ్యాయులకు ఎంఈఓ విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులపై ఇలాంటి చర్యలు సరైనవి కావని హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని స్కూల్ కరస్పాండెంట్ పుష్ప, విద్యార్థులకు ట్యాగ్లు తగిలించిన టీచర్ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. విద్యార్థులకు భయం ఉంటుందనే ఉద్దేశంతోనే ట్యాగ్లు తగిలించానని, దీనికి యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదని సదరు టీచర్ ఎంఈఓకు వివరణ ఇచ్చారు. కరస్పాండెంట్ పుష్ప, ట్యాగ్లు తగిలించిన టీచర్ స్టేట్మెంట్లను జిల్లా విద్యాశాఖాధికారికి పంపిచినట్లు ఎంఈఓ తెలిపారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
సీతానగరం: రఘుదేవపురం రవీంద్ర కాలనీ సురవరపు మణికంఠ ఇంటిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశామని నార్త్జోన్ డీఎస్సీ వై శ్రీకాంత్ తెలిపారు. గురువారం సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుకొండ సీఐ సత్యకిషోర్, సీతానగరం ఎస్సై డి.రామ్కుమార్ సిబ్బందితో కలిసి ముగ్గళ్ళ గోదావరి మాత విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నీలంశెట్టి వెంకటవాసు (రవీంద్రకాలనీ), రాజానగరానికి చెందిన గొడ్డు భాను శివశంకర్లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మణికంఠ అక్క శివ కుమారి నిడదవోలులో ఉంటున్నారు. తల్లితో కలిసి మణికంఠ అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 12న ఇంటికి వచ్చాడు. తలుపులు తెరచి ఉండటంతో లోపలకి వెళ్లి చూడగా బీరువా లాకర్ బద్దలుకొట్టి ఉంది. అందులోని నాలుగు కాసుల బంగారు, 70 తులాల వెండి, పూజా గదిలో దాచిన రూ.1.50 లక్షల నగదు పోయిందని గుర్తించి ఫిర్యాదు చేశారు. ముద్దాయిల నుంచి మూడు గ్రాముల విలువ ఉన్న ఉంగరం, 750 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.50 లక్షల నగదు రికవరీ చేశామని తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన మోటారు సైకిల్ సీజ్ చేశామన్నారు. ముద్దాయిలను రాజమహేంద్రవరం సెవంత్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ (ఏజేఎఫ్సీఎమ్) కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని నార్త్జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. -
ప్రియురాలిని హత్య చేసి పరారీ
రాజోలు: చెడు వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చాకుతో పొడిచి హత్య చేశాడు. బుధవారం రాత్రి బి.సావరం సిద్ధార్థనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె నిరాకరించింది. దీంతో వారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రియురాలు ఓలేటి పుష్ప(22)ను ప్రియుడు రాజోలు కోళ్ల వారి వీధికి చెందిన షేక్ షమ్మా చాకుతో గుండెల్లో పొడవడంతో ఒక్కసారిగా పుష్ప ప్రాణాలు కోల్పోయింది. కూతురిని కాపాడుకునేందుకు పుష్ప తల్లి గంగ, పుష్ప అన్న వినయ్ అడ్డువెళ్లగా వారిద్దరిపై కూడా షేక్ షమ్మా చాకుతో దాడి చేసి గాయపర్చాడు. వారి కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు షమ్మా అక్కడి నుంచి పారిపోయాడు. సిద్ధార్థనగర్లో జరిగిన హత్య విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజోలు సీఐ నరేష్కుమార్, ఎస్సై రాజేష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు దాడిలో గాయపడ్డ తల్లి గంగ, అన్న వినయ్లను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం యెనుముల్లంక గ్రామానికి చెందిన ఓలేటి పుష్పకు ఐదేళ్ల క్రితం రాజోలు మేకలపాలానికి చెందిన ఓలేటి సతీష్తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మద్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన నాలుగేళ్ల కుమారుడితో పుష్ప, ఆమె తల్లి అంగాని గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్లో నివాసం ఉంటోంది. రెండేళ్లు క్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షమ్మాతో పుష్పకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తున్నారు. మద్యానికి బానిసైన షమ్మా తన అవసరాల కోసం పుష్పను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, డబ్బు కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని పుష్ప తన తల్లి గంగ, అన్న వినయ్కు మొర పెట్టుకుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పావంటూ పుష్పతో గొడవపడి ఆమెను చాకుతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పారిపోయిన షమ్మాను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. అడ్డు వచ్చిన ఆమె తల్లి, అన్నపై దాడి -
అమ్మవార్లకు 1400 కిలోల భారీగా సారెలు
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని మదుగులమ్మ, నూకాలమ్మ అమ్మవార్లకు గురువారం భక్తులు 1400 కిలోల భారీ సారెలు సమర్పించారు. బిక్కవోలు తాళ్ళవారి ఆడపడుచు మదుగులమ్మ తల్లికి స్థానిక మహిళలు ఇంటి వద్ద చేసిన పలు రకాల 800 కిలోల పిండివంటలు సమర్పించారు. అలాగే పసుపు, కుంకుమ, గాజులు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, చీరలు, పండ్లు కూడా అందజేశారు. తొలుత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి, సారె సమర్పించారు. అలాగే, నూకాలమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గాజులు, అరటి తదితర పండ్లతో పాటు 600 కిలోల స్వీట్లు సమర్పించారు. రెండు ఆలయాల వద్ద అమ్మవార్లకు సమర్పించిన సారెలను భక్తులకు పంపిణీ చేశారు. – బిక్కవోలు -
అక్రమంగా ర్యాంపు ఏర్పాటు
కొత్తపేట: ఆత్రేయపురం లంక భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి, తరలించేందుకు టీడీపీ మట్టి మాఫియా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. దానిలో భాగంగా భారీ ర్యాంపు ఏర్పాటు చేసింది. ఆత్రేయపురంలో అధికారిక ఇసుక ర్యాంపు ఉంది. కాగా చినపేట సమీపాన సొసైటీ భూములు, శ్మశాన దిబ్బలు ఉన్నాయి. వాటి పక్క నుంచి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆత్రేయపురంలో టీడీపీ నేత ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. అధికార యంత్రాంగం కూడా వారి ఆగడాలకు కొమ్ము కాస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అక్రమ వ్యవహారాల్లో భాగంగానే తాజాగా ఆ నాయకుడు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించారు. గురువారం యుద్ధప్రాతిపదికన పొక్లెయినర్తో పనులు చేపట్టి లంకభూముల్లోకి ర్యాంపును ఏర్పాటు చేస్తూ వెళ్లారు. ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలింపునకు అనువుగా, అవి దిగబడిపోకుండా కొబ్బరి ఆకులను కూడా ట్రాక్టరుపై తరలించారు. అక్రమంగా ర్యాంపు ఏర్పాటుపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు స్పందించలేదని పలువురు గ్రామస్తులు తెలిపారు. దాంతో గ్రామస్తులే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ర్యాంపు పనులు నిలిపివేసి యంత్రాలను ఎక్కడివి అక్కడే నిలిపివేశారు. రాత్రి సమయంలో మట్టి రవాణాకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిపై గ్రామస్తులు ఆందోళనకు సిద్ధం కావడంతో ఎట్టకేలకు సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి యంత్రాలను, ట్రాక్టర్లను లంక భూముల్లోంచి బయటకు తీసుకువచ్చారు. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారుల వివరణకు ఫోన్లో ప్రయత్నించగా వారు స్పందించలేదు. ఆత్రేయపురంలో భారీగా మట్టి తవ్వకాలకు ప్రయత్నాలు అడ్డుకున్న గ్రామస్తులు -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో లోకారపు చిన్న అప్పలనాయుడు (79) ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రౌతులపూడి గ్రామానికి చెందిన మృతుడు లోకారపు చిన్న అప్పలనాయుడుకు గత 20 ఏళ్లుగా ఆయాసం, కడుపునొప్పి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. రెండురోజుల క్రితం ఆయాసంగా వుందని చెప్పగా అన్న కొడుకు అయిన లోకారపు దేవుడు స్థానికంగావున్న సీహెచ్సీకి తీసుకువెళ్లి జాయిన్ చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు సిబ్బంది లేచి చూసేసరికి ఆసుపత్రి ఆవరణలోవున్న మామిడి చెట్టుకు ఆతని లుంగీ, టవల్తో ఉరి వేసుకుని చెట్టుకింద పడిపోయి మృతిచెందినట్లు గుర్తించారు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలసి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. డొక్కా సీతమ్మ ఐదో తరం వారసుడు భీముడు మృతి పి.గన్నవరం: నిరతాన్నధాత్రిగా పేరొందిన డొక్కా సీతమ్మ వారి ఐదోతరం వారసుడు, ఎల్.గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు (భీముడు) (59) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన ఎల్.గన్నవరంలో బ్రాంచి పోస్టు మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా భీముడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పార్థివదేహానికి గురువారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. న్యాయం గెలిచింది తమపై కేసు కొట్టి వేయడంతో వైఎస్సార్ సీపీ నేతల హర్షం అనపర్తి : అధికారుల విధులకు ఆటంకం కల్పించారంటూ వైఎస్సార్ సీపీ నేతలపై పెట్టిన కేసును కొట్టివేస్తూ అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మజ్జి వంశీకృష్ణ గురువారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు పట్ల వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పందిస్తూ న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే 2018లో మహేంద్రవాడ గ్రామంలో స్థానిక గుడిమెట్ల వారి గుడి వీధిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు సంకల్పించి సిమెంటు దిమ్మెను నిర్మించామని పోతంశెట్టి శ్రీను తెలిపారు. ఆ దిమ్మెను అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకు పంచాయతీ అధికారులు తొలగిస్తుంటే అడ్డుకున్న తనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కొవ్వూరి ధర్మారెడ్డి, కొవ్వూరి జగ్గారెడ్డి, పడాల ధర్మారెడ్డి, మల్లిడి గంగరాజులపై విధులకు ఆటంకం కలిగించారంటూ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందన్నారు. విచారణ అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ పై అన్యాయంగా మోపిన కేసులో స్థానిక న్యాయవాది మన్మోహన్ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా నిందితుల్లో ఒకరైన కొవ్వూరి ధర్మారెడ్డి కేసు నడుస్తుండగానే మృతిచెందారని ఆయన తెలిపారు. -
స్వల్పంగా వచ్చే వరద మంచిదే!
ఐ.పోలవరం: గోదావరికి వరద అంటే ఎవరైనా భయపడతారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లావాసులకు నిద్రాహారాలు ఉండవు. ఉప్పెనలా వచ్చిపడే వరద లంక గ్రామాలను, పంట భూములను ముంచెత్తుతోంది. వందల మంది రైతులకు నష్టాలను మిగులుస్తోంది. వరదల వల్ల లంకవాసులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే స్వల్పంగా వచ్చే వరదకు రైతులు, లంక గ్రామాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేవారు, మత్స్యకారులు సంబర పడతారంటే అతిశయోక్తి కాదు. గోదావరికి వరద వచ్చి తగ్గుముఖం పట్టింది. అత్యధికంగా ఈ నెల 13వ తేదీన 7.29 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేశారు. తరువాత నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో 1,76,676 క్యూసెక్కులకు తగ్గింది. వరద వచ్చి తగ్గుముఖం పట్టడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మేలు చేసే ఒండ్రు మట్టి గోదావరి వరదల సమయంలో ఎగువ నుంచి వచ్చే ఎర్రనీరుతోపాటు ఒండ్రుమట్టి కొట్టుకు వస్తుంది. ఇది కాలువల ద్వారా పంట చేలు, తోటలకు చేరుతుంది. ఎగువ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే నీరు పలు రకాలుగా మంచిది. కొండల మీద పడే వర్షాల నుంచి వచ్చే నీటిలో మినరల్స్, న్యూట్రినైట్స్ ఉంటాయి. అటవీ ప్రాంతాల నుంచి వచ్చే నీటిలో కూడా వనమూలికలు, హ్యూమస్ (జంతు కళేబరాల అవశేషాల నుంచి వచ్చే కర్బనం), సూక్ష్మ పోషకాలు అధికం. పంట పొలాలు, తోటల్లో నీరు చేరిన తరువాత దానిలో ఉన్న ఒండ్రు అర అడుగు మేర భూమిపై పేరుకుపోతుంది. గోదావరి లంకల్లో అయితే అడుగు మేర ఒండ్రు మట్టి చేరుతుంది. డెల్టా కాలువల నుంచి చేలకు నేరుగా వరద వస్తుంది. గోదావరి నదీపాయల నుంచి విడిపోయే కౌశికలు, అప్పర కౌశికలు, తొగరపాయ, తుల్యభాగ వంటి డ్రెయిన్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కొబ్బరి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు, డెల్టాలో పంటలకు ఈ నీటిని పెద్ద ఎత్తున తోడడం ద్వారా రైతులు తమ చేలు, తోటలకు ప్రకృతి సిద్ధమైన సూక్ష్మ పోషకాలు, మినరల్స్, న్యూట్రినైట్స్ అందిస్తున్నారు. పులసలొచ్చేది ఇప్పుడే మాంసాహార ప్రియులకు నోరూరించే గోదావరి జలపుష్పం పులస చేప దొరికేది కూడా గోదావరికి ఎర్రనీరు వచ్చినప్పుడే. బంగ్లాదేశ్, కోల్కతా, ఒడిశా వంటి ప్రాంతాల్లో సముద్రంలో హిల్స్ (విలస) నిత్యం దొరుకుతుంది. ఇటీవల కాలంలో గోదావరి జిల్లాతోపాటు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఈ చేప దొరుకుతూనే ఉంటోంది. స్థానికంగా కూడా సముద్ర వేట సమయంలో విలసలు పెద్ద ఎత్తున దొరుకుతుంటాయి. కాని అసలైన పులస దొరికేది మాత్రం గోదావరికి ఎర్రనీరు తాకినప్పుడే. సాధారణ రోజుల్లో దొరికే విలస చేప కేజీ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు మాత్రమే ఉంటుంది. అదే గోదావరికి ఎర్రనీరు తాకిన తరువాత దొరికే పులస ఖరీదు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర ఉంటుంది. అందుకే గోదావరికి ఎర్రనీరు తగిలి పులస దొరికితే చాలని మత్స్యకారులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. నీటికి ఎదురీదుతూ ఒక్కసారి గోదావరి నీటిలోకి వచ్చిన తరువాత దీని రుచి మారిపోతుంది. ఎర్రనీటిలో వీటిని పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, టాంజానియా వంటి ప్రాంతాల్లో జీవించే ఈ చేపలు సంతానోత్పత్తి కోసం ఖండాలు దాటి ప్రయాణిస్తాయి. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అంతర్వేది గుండా గోదావరి నది నీటిలోకి చేరతాయి. గోదావరి నది చాలా వేగంగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకోవడమే కాకుండా దానికి ఎదురీదుకుంటూ రావడం పులస చేప ప్రత్యేకత. వీటి వలసలు జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటాయి. గుడ్లు పెట్టి అవి పిల్లలు అయిన తర్వాత అక్టోబర్ మాసానికి చేపలన్నీ తిరిగి సముద్రంలోకి చేరుకుంటాయి. ఇలా గుడ్లను పొదగడానికి వచ్చిన సమయంలో మత్స్యకారుల వలలో పడతాయి ఈ చేపలు. వలలో పడిన వెంటనే పులస చనిపోతుంది. గోదావరి వరద నీటిలోకి వచ్చిన తరువాత దీని రంగు మారుతుంది. దాంతో పాటు గోదావరి తీపి నీటి కారణంగానే వాటి రుచి కూడా మారి పులసగా అవతరిస్తుంది. అయితే గోదావరి అంతటా పులసలు దొరుకుతాయని అనుకోవడం భ్రమే. కేవలం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి గోదావరి కలిసే ప్రాంతంలో మాత్రమే ఇవి లభిస్తాయి. వీటికి ఇంతటి డిమాండ్ ఉండటానికి ఇది కూడా కారణం. పంట చేలు, లంక తోటలకు ఎర్ర నీరు పొలాలు, ఉద్యానాలకు మేలు -
పరిశోధనలతో సమాజానికి మేలు
కాకినాడ సిటీ: జేఎన్టీయూకే ప్రాంగణంలో ఓక్ ఉత్సవాల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్–2047 అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్షాప్ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ చైర్మన్ అనిల్ సహస్ర బుద్ధే ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. భారతదేశంలో పూర్వకాలంలో నిర్వహించిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల సంస్కృతిని కొనియాడారు. వర్గీస్ కురియన్, స్వామినాథన్, ఎఫ్సీ కొహ్లీ వంటి ప్రముఖుల పరిశోధనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని విశదీకరించారు. వికసిత్ భారత్–2047కు విద్యా వ్యవస్థ పటిష్టం కావాలని, స్టార్టప్, స్కిల్, మేకిన్, డిజిటల్, క్లీన్ ఇండియా, క్లీన్ ఆంధ్ర, డిజిటల్ లావాదేవీలు మెరుగుపడాలన్నారు. సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ కేకే అగర్వాల్, యూజీసీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ వేద్ ప్రకాష్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జానకీరామ్ మాట్లాడారు. రోల్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ టూ కొలాబొరేట్ విత్ అకడమిక్ ఇనిస్టిట్యూషన్, టు రియలైజ్ ద అబ్జక్టివ్ ఆఫ్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్–2047 అనే అంశంపై ప్యానల్ చర్చలు నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, యూనివర్శిటీ ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, ఓక్ ఉత్సవ కమిటీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం వవన్కు కార్మికుల ఆకలి బాధలు పట్టవా?
రాజమహేంద్రవరం రూరల్: శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి కార్యికులు పదిరోజులుగా సమ్మె చేస్తున్నా సంబంధితశాఖలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు కార్మికులు ఆకలిబాధలు పట్టవా అంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యనిర్వహక ఇంజినీర్ కార్యాలయం వద్ద సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉన్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల అమలు కోసం చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు మాట్లాడుతూ కార్మికులు 19 నెలలుగా జీతాలు, 26 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలని పదిరోజుల నుంచి సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తున్న కాంట్రాక్టర్, అధికారులు, పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఏం తిని బతకాలని, కుటుంబాలను ఎలా పోషించాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని కోరారు. చీపురుపల్లి మాజీ సర్పంచ్ ములగ చినబాబు సంఘీభావం తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు పీ.శ్రీను, ప్రధాన కార్యదర్శి ఇసాక్ పాల్గొన్నారు. -
సీఎస్ఈకే క్రేజ్..!
కొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ప్రస్తుతం కొత్త కోర్సులు పరిచయం అయ్యాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, ఆడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చర్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇంజినీరింగ్ విద్యార్థులుసాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్ల నమోదులో తలమునకలవుతున్నారు. ఏపీఈఏపీసెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు జరగనుంది. 22వ తేదీన సీట్ల అలాట్మెంట్ 23వ తేదీ కళాశాలలో చేరిక, వచ్చే నెల 4వ తేదీన క్లాసులు ప్రారంభం కానున్నాయి. సెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నకే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ, ఏఐ కోర్సును ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కనీసం ఈ బ్రాంచ్లను పది శాతం మంది కూడా ఎంచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఈ నెల 19వ తేదీన జరిగే వెబ్ ఆప్షన్ల మార్పుల్లో సైతం ఇదే పంథా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కాగా లభించే అవకాశం ఉంది. యథేచ్ఛగా దోపిడీ సీఎస్ఈకి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు దోపిడీకి తెర తీశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ ఇలా అన్ని ప్రైవేటు కళాశాలల్లో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే విక్రయించేశారు. ఏఐసీటీఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ఆధారంగా ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అదేమని ప్రశ్నిస్తే సీటు ఇవ్వడమే గగనం.. తిరిగి ప్రశ్నిస్తారా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలిసింది. ఏదైనా మాట్లాడితే సీటు ఇవ్వకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కళాశాలల యాజమాన్యాల నుంచి మామూళ్లు దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్వీనర్ కోటాకే పథకాల వర్తింపు కోర్సుల ఎంపికలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటున్నారు. అన్ని బ్రాంచులు ముఖ్యమైనవేనని, విద్యార్థుల అభీష్టం మేరకు కోర్సుల్లో చేరాలంటున్నారు. సీఎస్ఈ అంటున్నారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 2, ప్రైవేటు 32 ఉన్నాయి. 15,222 మంది సెట్లో అర్హత సాధించారు. 17,250 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతానికి పైగా సీఎస్ఈనే ఎంచుకునే పరిస్థితి ఉందని విద్యా నిపుణులు అంటున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండటంతో సీఎస్ఈ గ్రూప్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. కళాశాలల దోపిడీని అరికట్టాలి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో ప్రైవేటు కళాశాలలు దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా వర్శిటీ అధికారులు, ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు కళాశాలలకు సీట్ల కేటాయింపు విచ్ఛలవిడిగా పెంచడంతో ఇదే అదునుగా భావిస్తున్న కళాశాలలు.. విద్యార్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. డబ్బుల వసూలు చేస్తున్న స్థాయిలో విద్యలో నాణ్యత ఉండటం లేదు. – ఎంవీ బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంప్రదాయ బ్రాంచ్లకు భవిష్యత్తు సంప్రదాయ బ్రాంచ్లకు మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో నిపుణుల అవసరం ఉంది. దేశ నిర్మాణంలో వీరి భాగస్వామ్యం చాలా అవసరం. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ గ్రూప్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కానీ వీరిలో 12 శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన కోర్సుల్లోనూ ఉత్తమంగా రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. – డాక్టర్ కె.బాలాజీ, ప్రిన్సిపాల్, వీఎస్ఎం కళాశాల (ఇంజినీరింగ్), రామచంద్రపురం -
పై చదువులకు పగ్గాలు!
● డిగ్రీ ప్రవేశాలకు విడుదల కాని నోటిఫికేషన్ ● రెండు నెలలుగా విద్యార్థుల నిరీక్షణ ● జాప్యమైతే ఇతర కోర్సులకు తరలిపోయే అవకాశం ● ప్రవేశాలు తగ్గితే డిగ్రీ కళాశాలల ఉనికికే ముప్పు రాయవరం: డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్నత విద్యామండలి మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలైనా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులలో అయోమయం నెలకొంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ కూడా ప్రారంభించారు. అయినా డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ జాడ లేదు. అయినప్పటికీ అడ్మిషన్ల కోసం విద్యార్థులు కళాశాలలకు వెళ్లి సీట్లు, కోర్సులపై ఆరా తీస్తున్నారు. దీంతో కళాశాలల సిబ్బంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేసుకుని నోటిఫికేషన్ వచ్చాక కబురు చేస్తామని తిప్పి పంపుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ 50 కంటే తక్కువ అడ్మిషన్లు నమోదైన కళాశాలల్లో వాస్తవ పరిస్థితుల పరిశీలనకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను నియమిస్తోంది. రెండేళ్లుగా 25 శాతం కంటే తక్కువగా అడ్మిషన్లు ఉన్న కళాశాలలను క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలించి అడ్మిషన్లు తక్కువగా ఉండడానికి గల కారణాలపై ఆరా తీసి నివేదిక సమర్పించింది. ఆదికవి నన్నయ యూనివర్శిటీ పరిధిలోని 60 కళాశాలల్లో 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు నమోదైనట్లుగా గుర్తించారు. జాప్యమైతే కళాశాలలకు ఇబ్బందే 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయంలో డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని భావించినా నోటిఫికేషన్ విడుదల కాక విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఈ జాప్యంతో విద్యార్థులు ఇతర కోర్సులు వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. దానివల్ల డిగ్రీ కళాశాలలు సీట్ల భర్తీలో వెనుకబడే అవకాశముంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నోటిఫికేషన్ త్వరగా వెలవరించాలని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. గతేడాది ఇదే పరిస్థితి కోవిడ్ ప్రభావంతో ఆలస్యమైన డిగ్రీ ప్రవేశాలు అదే ఒరవడిని కొనసాగిస్తూ 2020 నుంచీ అక్టోబర్ నెలలో తరగతులు ప్రారంభించారు. కాగా గత ఏడాది ఆగస్టులోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలైలోనే తరగతులు మొదలవుతాయని ఆశ పడినా నేటి వరకు నోటిఫికేషన్ లేకపోవడం గమనార్హం. నన్నయ పరిధిలో కళాశాలలు ఇవీ.. నన్నయ వర్సిటీ పరిధిలో 171 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆరు, కాకినాడ జిల్లాలో ఐదు, కోనసీమ జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో రెండు ప్రభుత్వ యాజమాన్యంలో అటానమస్ కళాశాలలుండగా, ప్రైవేట్ యాజమాన్య పరిధిలో కాకినాడ జిల్లాలో ఒకటి, కోనసీమ జిల్లాలో ఒకటి అటానమస్ డిగ్రీ కళాశాలలున్నాయి. ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో రెండు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 39, కాకినాడ జిల్లాలో 44, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 45 అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో రెండు, ప్రైవేట్ యాజమాన్యంలో నాలుగు, కాకినాడ జిల్లాలో ప్రైవేట్ యాజమాన్యంలో ఏడు, కోనసీమ జిల్లాలో ప్రైవేట్ యాజమాన్య పరిధిలో నాలుగు మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో అక్నూ పరిధిలో 32 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆన్లైన్లో అభ్యర్థులు అడ్మిషన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డీన్ ఆదికవి నన్నయ యూనివర్శిటీ, రాజానగరం. -
ఒప్పంద అధ్యాపకుల రెన్యువల్కు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జోన్ 1, 2 పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను 2025 – 26 విద్యా సవత్సరానికి రెన్యువల్ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుల కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జోన్ 1లో 139, జోన్ 2 లో 178 పోస్టులకు రెన్యువల్ జరుగనుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేసినవారు మాత్రమే దీనికి అర్హులు. 2025 జూన్ ఒకటో తేదీకి 60 సంవత్సరాలు వయస్సు నిండినవారు దీనికి అనర్హులు. ఈ నెల 18న రెన్యువల్పై దినపత్రికల్లో ప్రకటన, 19 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పణ, 21 నుంచి 23వ తేదీ వరకు కౌన్సెలింగ్, 25వ తేదీన అధ్యాపకుల రెన్యువల్ ఉంటుంది. ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకం రాజానగరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంచడం, వారిలో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని వక్తలు అన్నారు. స్కూల్ లీడర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు మండలంలోని మల్లంపూడి సాయిమాధవి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ శిక్షణకు ఉమ్మడి జిల్లా నుంచి 174 మంది ప్రధానోపాధ్యాయులు హాజరు కాగా, తొమ్మిది మంది డీఆర్పీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి గౌరీ శంకరరావు, అనపర్తి ఎంఈఓ సత్తిరెడ్డి, శైలజ పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల వివక్ష ● ఇంగ్లిషులో మాట్లాడటం లేదని వారి యూనిఫాంకు డిఫాల్టర్ ట్యాగ్ ● నిడదవోలు ప్రైవేటు స్కూలులో ఘటన నిడదవోలు: ఇంగ్లిషులో మాట్లాడని కొందరు విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం వివక్ష చూపుతున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిషులో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫామ్కు ఓ టీచర్ రెండు రోజులుగా ‘ఇంగ్లిషు డిఫాల్టర్’ అనే పేరుతో కార్డులు తగిలించి, అవమానిస్తున్నారు. దీంతో, ఆయా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈవిధంగా వివక్షకు గురైన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు బుధవారం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్ను స్కూల్ యాజమాన్యం మందలించింది. అయినప్పటికీ ఆమె లెక్క చేయకుండా తిరిగి గురువారం కూడా విద్యార్థుల యూనిఫామ్కు ఇంగ్లిష్ డిఫాల్టర్ కార్డులు యూనిఫాంకు తగిలించి, స్కూల్ ఆవరణలో నిలబెట్టి పనిష్మెంట్ పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిడదవోలు శాఖ నాయకులు గురువారం స్కూల్ వద్ద ఆందోళన చేశారు. విద్యార్థుల పట్ల ఇలాంటి వివక్షత చూపించడం సరికాదని, పిల్లలెవరైనా మనస్తాపానికి గురై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని కరస్పాడెంట్ పుష్ప చెప్పారు. విద్యార్థుల యూనిఫామ్కు ఇంగ్లిషు డిఫాల్టర్ కార్డులు తగిలించిన టీచర్పై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
పెరుగుతున్న వర్జీనియా పొగాకు ధర
● కొనుగోలు దారుల మధ్య పోటీ ● కిలో గరిష్ట ధర రూ.390 ● ఇప్పటికి 32,01 మిలియన్ల కిలోల విక్రయం దేవరపల్లి: కొనుగోలు దారుల మధ్య పోటీ ఏర్పడడంతో 20 రోజులుగా మార్కెట్లో పొగాకు ధరలు పెరుగుతున్నాయి. జూన్ 24 వరకు కిలో ధర రూ.290 ఉండగా, అనంతరం అంచెలంచెలుగా ధర పెరుగుతూ రూ.390కి చేరుకుంది. దీంతో అధికారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు ఎందుకు పండించామా? అని రైతులు ఒక దశలో దిగాలు పడ్డారు. ఈ వారంలో రోజుకు కిలోకు రూ.10 నుంచి 20 చొప్పున పెరుగుతూ మంగళవారం మార్కెట్లో కిలో రూ.358, బుధవారం రూ.392కి లభించింది. గురువారం మార్కెట్లో రూ.400 పలుకుతుందని రైతులు ఆశించారు. అయితే కిలోకు రూ.2 తగ్గి రూ.390 పలకడంతో రైతులు ఒకింత నిరుత్సాహ పడ్డారు. 20 రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 ధర పెరిగింది. గత ఏడాది మార్కెట్లో కొనుగోళ్లు ముగిసే నాటికి కిలో గరిష్ట ధర రూ.410, సగటు ధర రూ.369 లభించింది. ఈ ఏడాది దాదాపు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 32.01 మిలియన్ల కిలోలు విక్రయాలు జరిగాయి. ముందు ముందు మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్కుమార్ ఇటీవల దేవరపల్లిలో చెప్పడంతో రైతులు మార్కెట్పై ఎంతో ఆశతో ఉన్నారు. జూన్ 25కి ముందు అమ్ముకున్న రైతులు కిలోకు రూ.80 నుంచి రూ.100 నష్టపోయారు. అక్టోబరు 15 వరకు ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు జరుగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. బుధవారం మార్కెట్కు 40 మంది కొనుగోలు దారులు వేలంలో పాల్గొనగా, గురువారం మార్కెట్కు 15 మంది హాజరయ్యారు. ధరలు ఈ విధంగా ఉంటే పెట్టుబడులు, కౌలు డబ్బు దక్కుతుందని కౌలుదారులు అంటున్నారు. రూ.756.15 కోట్ల పొగాకు విక్రయాలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో గురువారం నాటికి రూ.756.15 కోట్ల విలువ గల 31.01 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కొనుగోళ్లు ప్రారంభమై 117 రోజులు కాగా, 93 రోజులు వేలం జరిగింది. 2,50,532 బేళ్లు కొనుగోలు చేశారు. కిలో గరిష్ట ధర రూ.390, కనిష్ట ధర రూ.190, సగటు ధర రూ.177.52 పలికింది. గురువారం 7,156 బేళ్లు అమ్మకానికి రాగా 5,748 బేళ్లు అమ్ముడుపోయాయి. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో రాజమహేంద్రవరానికి అవార్డు
● రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ ● జాతీయ స్థాయిలో 19వ స్థానం ● ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్లాల్ కట్టర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం సిటీ: పరిశుభ్రమైన నగరాల్లో రాజమహేంద్రవరం రాష్ట్రంలో సెకండ్ ర్యాంక్ సాధించగా జాతీయ స్థాయిలో 19వ స్థానం సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డులలో 3–10 లక్షల్లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అవార్డులు సాధించడంతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్లాల్ కట్టర్ చేతులమీదుగా కలెక్టర్, నగర పాలక సంస్థ ఇన్చార్జ్ కమిషనర్ పి.ప్రశాంతి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పురస్కారం రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఓ కీలక మైలురాయి అని పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టూ డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్ విధానం, పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇదంతా సాధ్యపడిందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 1,12,780 గృహాలు ఉండగా రోజుకి 160 టన్నుల చెత్త బయటకు వస్తుందన్నారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నామన్నారు. దాదాపు 1,400 మందికి పైగా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 182 వాహనాల ద్వారా డోర్ టూ డోర్ చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో 54వ ర్యాంకు సాధించిన నగరం మెరుగైన స్థాయిలో నిలిచిందన్నారు. -
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ధర్నా
నిడదవోలు : విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఽనిడదవోలు పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక గణపతి జంక్షన్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లపై చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని తక్షణమే మీటర్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించాయన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నెల్లూరులో యువగళం సభలో స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. గాదె కృష్ణ, గెడ్డంకుమార్, చంద్ర, మురళి, శ్రీనివాసరావు, సుదాకర్, చంద్రశేఖర్, బాబ్జి, ఖదీర్గౌస్, నాని పాల్గొన్నారు. -
ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక కాలంలో రూపాయి నుంచి ఎంత పెద్ద మొత్తమైనా డిజిటల్ లావాదేవీలే సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయి లబ్ధిదారు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా తేడా జరిగినా తప్పు ఎక్కడ జరిగిందనేది సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు తల్లికి వందనం వంటి పథకాలు చాలా మందికి చేరలేదు. వీటిలో ఖాతా వినియోగంలో లేదంటూ సగటున ప్రతి సచివాలయానికి వంద నుంచి 150 వరకూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ–కేవైసీ లేకపోవడం వల్ల జిల్లాలో దాదాపు రూ.2 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాకు చేరలేదు. దీంతో వారంతా సచివాలయాల చూట్టు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో ఖాతాలు యాక్టివ్గా లేవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదికలో ఉంది. గత ఏడాది నవంబర్లో 2,74,488 ఖాతాలు యాక్టివ్గా లేవని సచివాలయాల వారీగా విభజించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను ప్రదర్శించారు. దీంతో పోస్టల్, బ్యాంకింగ్ రంగాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా దాదాపు లక్ష ఖాతాల వరకూ మాత్రమే యాక్టివేట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఖాతాదారులందరూ వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ప్రోత్సహించాల్సి ఉంది. ఖాతాలు లేకపోతే జాతీయ బ్యాంకుల్లోగాని, తపాలా కార్యాలయాల్లో కానీ పొదుపు ఖాతాలు తెరవాల్సి ఉంది. అనంతరం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యాప్లో ఆయా ఖాతాలను ఎన్పీసీఐ నిబందనల ప్రకారం అప్డేట్ చేస్తారు. ఖాతాలు బతికించాలి ప్రభుత్వం నుంచి మంజురయ్యే ఏ సంక్షేమ పథఽకమైన లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంక్ ఖాతా బతికి ఉండాలి. కొందరికి రెండుమూడు ఖాతాలు ఉండి వాటిలో వినియోగంలో లేకపోవడం సమస్యలకు దారి తీస్తొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని గుర్తించి అర్హులకు సంక్షేమ పథకాలు చేరవేయడానికి ప్రతి బ్యాంక్ ఖాతాను లైవ్లో ఉంచాలని భావిస్తోంది. వీలైనంత డిజిటల్ లావాదేవీలు జరిగేలా ప్రొత్సహించింది. దీంతో ప్రతిపైసాకు లెక్క ఉంటుందనే ప్రధాన ఉద్దేశం. అలా జరిగినప్పుడే 18 ఏళ్లు నిండిన లబ్ధిదారుల ఖాతాలకు నవశకం బెనిపిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో ప్రభుత్వం విడుదలచేసే సంక్షేమ నిధులు కచ్చితంగా అందుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. తపాలాశాఖ ప్రత్యేక డ్రైవ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) మ్యాపింగ్లో ఆధార్ అనుసంధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని నేపథ్యంలో పోస్టల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కేవలం రూ.200 తో గ్రామ స్థాయిలో వారి ఇంటి వద్దే ఖాతా ప్రారంభిస్తుంది. నిరర్ధక ఖాతాలు ఎన్నున్నా నిరుపయోగమే జిల్లాలో నిర్జీవంగా ఉన్న ఖాతాలు 1,76,500 అవి పునరుద్ధరిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోస్టల్ శాఖ అధిక ఖాతాలతో ఇబ్బందులు కొందరికి రెండు, మూడు ఖాతాలు ఉండి వాటిలో ఏదో ఒక ఖాతా మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వినియోగంలో లేని ఖాతా నెంబర్ ఇవ్వడంతో సమస్యగా మారింది. ప్రతి లబ్ధిదారు ఖాతాను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మూసేసుకోవాలి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. – చందాల శ్రీవెంకట ప్రసాద్, ఎల్డీఏం కాకినాడ జిల్లా ప్రతి తపాలా కార్యాలయం ద్వారా ఐపీపీబీ ఖాతాలు ప్రతి తపాలా కార్యాలయంలో ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించి ఆధార్ అనుసంధానం చేస్తున్నాం. కాకినాడ డివిజన్లో ఉన్న కాకినాడ, సామర్లకోట ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు 54 ఉప తపాలా కార్యాలయాలు, 283 శాఖలలో సేవలు సద్వినియోగం చేసుకోవాలి. – దాసరి నాగేశ్వరరెడ్డి, ఇన్చార్జి పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ -
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): రాజమహేంద్రవరంలోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాఘవకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైనన్స్ , కామర్స్లో ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీ లోపు కళాశాల ఆఫీసుకు అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 9398677385, 9866131354 నంబర్లలో సంప్రదించాలన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ బాబూ? కూటమి ప్రభుత్వానికి ఆరిఫ్ సూటి ప్రశ్న సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి అత్యంత బాధాకరమని జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరు నెలకొకసారి కొత్త పెన్షన్లు ప్రకటించేవారని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో ఎంతమందికి నూతన పింఛన్లు అందించారో చెప్పాలన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరిచే కార్యక్రమం చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని అన్నారు. వైద్య సిబ్బందికి ఆర్పీఎస్కే ట్రైనింగ్ రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రీయ బాల స్వాస్త కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కెవెంకటేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు, ఏఎన్ఎం,ఎమ్ఎల్ హెచ్పీలకు డీఈఐసీ పీడియాట్రిషన్ డాక్టర్ ఇంద్రజ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారన్నారు. ప్రతి విద్యార్థి వివరాలను హెల్త్ కార్డులో నమోదు చేసి, వారి అనారోగ్య సమస్యలకు అవసరమైన చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక లోపాలను గుర్తించి వారికి సరైన వైద్య సేవలను అందించేందుకు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం (డైస్) రాజమహేంద్రవరం నకు రిఫర్ చేస్తామని తెలిపారు. ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎరువుల దుకాణంలో తనిఖీలు శంఖవరం: మండలంలోని కత్తిపూడిలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా స్థానిక భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా రూ.2,49,200 విలువైన వరి విత్తనాలు, రూ.2,05,347 విలువైన ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. గొడౌన్లో ఉన్న స్టాకు రిజిస్టరులో స్టాకుకు వ్యత్యాసం, రికార్డులు సక్రమంగా లేకపోవటంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సంచాలకుడు షంషీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ పి.శివరామకృష్ణ, ఏఓ పి.గాంధీ, ఏఈఓ ఆర్.మౌళిప్రసాద్ పాల్గొన్నారు. -
వాడపల్లి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద వెడల్పాటి మార్గాలను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లకు అదనంగా మరికొన్ని కౌంటర్లు పెంచనున్నామన్నారు. వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తహశీల్దార్ రాజేశ్వరరావు, డీసీ చక్రధరరావు బుధవారం పరిశీలించారు. అన్న ప్రసాద భవనానికి రూ.50 వేల విరాళం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆకివీడుకు చెందిన కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. దాతలకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందించారు. దరఖాస్తుల ఆహ్వానం వాడపల్లి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం దేవస్థానం ద్వారా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ శిబిరంలో సేవ చేయడానికి నర్సింగ్ క్వాలిఫైడ్ అయిన మహిళలు / పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రోగులతో స్నేహంగా మెలగాలి
పెరవలి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించటంతో పాటు రోగుల పట్ల స్నేహంతో మెలగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి జి.వెంకటేశ్వరరావు తెలిపారు. పెరవలి, కానూరు ఆరోగ్య కేంద్రాలల్లో బుధవారం అకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగి కండీషన్ను బట్టి ఇక్కడ ఉంచాలో లేక ఏరియా ఆసుపత్రికి తరలించాలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని ప్రచారం చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు రోగులకు, ప్రజలకు తెలిసేలా వైద్య సిబ్బంది వ్యవహరించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించటంతో పాటు రోగుల దగ్గరకు వెళ్లి సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెరవలి పీహెచ్సీ వైద్యులు ఆర్ఎస్ఎస్పి ప్రసాద్, తేజశ్రీ, కానూరు పీహెచ్సీ వైద్యులు హేమరాజు, తేజశ్రీ పాల్గొన్నారు. -
నూతన సాంకేతికతతో సాగు
అనపర్తి : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకుని పంటల్లో నాణ్యమైన దిగుబడి పొందాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. బుధవారం మండలంలోని పులగుర్త గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో సార్వా వరి పంట నాట్లు పూర్తయ్యాయని పంట ఆరోగ్యంగానే ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు మాట్లాడుతూ సార్వాలో చీడపీడలు తక్కువగా ఉన్నాయన్నారు. కాండం తొలిచే పురుగు అక్కడక్కడా కనిపిస్తోందని, దాని నివారణకు నారుమడిలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తొందరపడి పురుగు మందులు వాడరాదని పురుగులు, తెగుళ్లు ఉనికి గమనించాకే సస్యరక్షణ మందులు వాడాలన్నారు. కొత్త మినీకిట్ రకాలు సాగు చేసుకుని పరీక్ష చేసుకోవాలని, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ ఎస్.జయరామలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సురేష్, వీఏఏ రాకేష్, రైతులు జాస్తి రామచంద్రరావు, గొడితి వెంకటకృష్ణ, బలుసు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈ–మ్యాగజైన్ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డైట్లో విద్యాగౌతమి మంత్లీ ఈ–మ్యాగజైన్ను ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైట్లో జరిగిన కార్యక్రమాలు, ఛాత్రోపాధ్యాయుల కథలు, కవితలు, వ్యాసాలు, అధ్యాపకుల రచనలతో ఈ–మ్యాగజైన్ను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని డైట్లకు ఆన్లైన్లో ఫ్లిప్ బుక్ రూపంలో పంపిస్తామని తెలిపారు. అడవుల సంరక్షణే ధ్యేయం రాజానగరం: అడవులు, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఏపీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియా పాండే అన్నారు. దివాన్ చెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్టు అకాడమీలో శిక్షణను పూర్తి చేసుకున్న 126వ బ్యాచ్ ఫారెస్టు బీట్ అధికారులకు బుధవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్రంలో శిక్షణ పొందాల్సిన ఉద్యోగులు 400 మంది వరకూ ఉన్నారన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సీసీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, అకాడమీ డైరెక్టర్ బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్ విడుదల రాయవరం: ఏపీ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక పాఠశాల స్థాయి కాంప్లెక్స్, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్, మార్గదర్శకాలు, అజెండా, సెషన్ వారీ అంశాలను వెల్లడించారు. ఉపాధ్యాయుల బోధనా తీరు మెరుగుదలకు, వారు బోధనలో ఎదుర్కొనే సవాళ్లు, వాటి పరిష్కారాల కోసం ఈ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో ఉమ్మడి జిల్లాలో 123 స్కూల్ కాంప్లెక్స్లు ఉండగా, ప్రస్తుతం వీటిని 87 క్లస్టర్ కాంప్లెక్స్లుగా మార్పు చేశారు. కాంప్లెక్స్ సమావేశాలను ప్రస్తుతం ఒక పూటకు కుదించారు. ఉదయం పాఠశాలను నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు మధ్యాహ్నం స్కూల్ కాంప్లెక్స్లకు హాజరై సమావేశాలను నిర్వహించాలి. వీటి ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. జూలై 19, ఆగస్టు 23, సెప్టెంబర్ 20, అక్టోబర్ 18, నవంబర్ 22, డిసెంబర్ 20, జనవరి 24, ఫిబ్రవరి 21 తేదీల్లో ఎనిమిది కాంపెక్స్ సమావేశాలు జరుగుతాయి. -
శతాధిక వృద్ధుడి మృతి
గోపాలపురం: వేళ్ల చింతలగూడెం గ్రామానికి చెందిన కొర్లపాటి వెంకట్రావు (101) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుమారుడు కొర్లపాటి శ్రీరామచంద్రరావు వేళ్ల చింతలగూడెం సర్పంచ్గా పనిచేశారు. కాగా.. వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సందర్శించి నివాళులర్పించారు. మోటారు సైకిల్ ఢీకొని.. గండేపల్లి: జాతీయ రహదారిపై మల్లేపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన శీలం రామకృష్ణ (64), అప్పారావు మోటారు సైకిల్పై తాగునీటి కోసం మల్లేపల్లి వస్తున్నారు. ఆ గ్రామంలో సంత మార్కెట్ సమీపంలోకి వచ్చేసరికి వెనక వస్తున్న మరో మోటారు సైకిల్ వీరిని డీకొంది. ఈ ప్రమాదంలో రామకృష్ణ తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మోటారు సైకిల్పై వస్తున్న వారికి గాయాలు కావడంతో చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాము కాటుకు.. అంబాజీపేట: కొబ్బరి బొండాలు విక్రయించే వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇరుసుమండకు చెందిన తోట శ్రీనివాసరావు (58) ముక్కామల గ్రామంలో కొబ్బరి బొండాలు విక్రయిస్తుంటాడు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత ఖాళీ కొబ్బరి బొండాలను దూరంగా పారబోయడానికి ఒబ్బిడి చేస్తున్నాడు. ఆ సమయంలో ఖాళీ కొబ్బరి బొండాల్లో ఉన్న రక్త పింజరి కాటు వేయడంతో మృతి చెందాడు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైతుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి నల్లజర్ల: పోతవరం గ్రామానికి చెందిన రైతు కానూరి జనార్దనరావుపై మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఆయన కాలుకు తీవ్ర గాయం కావడంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనార్దనరావుకు జంగారెడ్డిగూడేనికి చెందిన కొందరితో భూవివాదాలు ఉన్నాయి. ఆ విషయంపై మంగళవారం తాడేపల్లిగూడెం కోర్టుకు హాజరై అనంతరం పోతవరంలో తన ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో సుమారు 8 మంది తనపై దాడి చేశారని, కోర్టు కేసు ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరించారని, కర్రలతో తీవ్రంగా కొట్టారని రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నల్లజర్ల పోలీసులను వివరణ కోరగా.. ఆసుపత్రి నుంచి ఎంఎల్సీ రిపోర్టు అందాల్సి ఉందన్నారు. -
విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సెక్రటరీలు, కరస్పాండెంట్లతో మీట్ గ్రీట్ విత్ వైస్ చాన్సలర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలల్లో నైపుణ్యతా ప్రమాణాలను పెంచడానికి చేపట్టిన వినూత్న ఇన్నోయేటివ్స్ను వివరించారు. సిలబస్, రెగ్యులేషన్స్ నవీకరణ, పరిశోధనలకు పెద్దపీట వేయడం, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి విద్యా సంవత్సరం అకడమిక్ ఆడిట్ నిర్వహించాలని, స్టూడెంట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగాలన్నారు. యూనివర్సిటీలో ఓపెన్ లెర్నింగ్, ఓడీఎల్ కోర్సులు, మూక్స్ విద్యా విధానాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ ద్వారా బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్లను నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీలో జరుగుతున్న పరిశోధనలు, నూతన సదుపాయాలను వివరించారు. కార్యక్రమంలో రెక్టార్ వీవీ సుబ్బారావు, ఓఎస్డీ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, అఫిలియేషన్స్, లీగల్ మ్యాటర్స్ డైరక్టర్ ఎ.బాలాజీ, డైరెక్టర్ అకడమిక్స్ ప్రొఫెసర్ ఎంహెచ్ఎం.కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ ఉత్సాహంగా మీట్గ్రీట్ విత్ వైస్ చాన్సలర్ కార్యక్రమం -
దేశ ప్రగతికి సాంకేతికతే వెన్నెముక
సాక్షిప్రతినిధి, కాకినాడ: దేశం ప్రగతి వైపు పయనించాలంటే సాంకేతిక వెన్నెముకగా ఉండాలని న్యూఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కేకే అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం బీటెక్ విద్య ఏఐతో ముడిపడి నూతన పుంతలు తొక్కుతోందన్నారు. ఏ ఐఐటీలోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు లేదన్నారు. కేవలం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కళాశాలలు మాత్రమే విద్యార్థులను ఎక్కువ చేర్చుకునేందుకు ఐటీ విభాగాన్ని ప్రారంభిస్తున్నాయన్నారు. కాకినాడలో 1946లో ఏర్పాటైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల 80వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఓక్ ఉత్సవాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. జేఎన్టీయూ కాకినాడ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అగర్వాల్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలన్నారు. ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులకు మెరుగైన పద్ధతులలో శిక్షణనివ్వాలని పిలుపు నిచ్చారు. ఓక్ వేడుకలలో భాగంగా ఏడాది పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, వర్క్షాప్లు, చర్చాగోష్టులు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి, క్యాలెండర్ను ప్రతినిధులు విడుదల చేశారు. రాజకీయ జోక్యం ఉండకూడదు గౌరవ అతిథి ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ మాట్లాడుతూ గత 50 ఏళ్లలో 47 యూనివర్సిటీను కొలమానంగా తీసుకోగా, వాటిలో మూడు విశ్వవిద్యాలయాలు మాత్రమే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో నూతన విధానాన్ని ప్రారంభించేందుకు విద్యార్థులకు అధిక సంఖ్యలో చేర్చుకోవాలన్నారు. రష్యా, చైనా దేశాల మాదిరిగా ప్రగతి సాధించాలంటే సైన్స్ బోధనలో ముందడుగు వేయాలన్నారు. విద్యలో రాజకీయవేత్తల జోక్యం ఉండకూడదన్నారు. నైపుణ్యాల కొరత ప్రొఫెసర్ డి.జానకిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం 2020ను తీసుకువచ్చారన్నారు. దేశంలో ఇంజినీరింగ్ పట్టభద్రులు నైపుణ్యాల కొరతతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దీన్ని సరిదిద్దడానికి విద్యావేత్తలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ ఎన్ఎంకే భట్టా మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు. జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ మాట్లాడుతూ ఏఐఆర్ఎఫ్లో మెరుగైన ర్యాంకు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో ‘రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 స్వర్ణాంధ్ర వికసిత్ భారత్’ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, ఓక్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ పి. ఉదయభాస్కర్, వైస్ ఛైర్మన్ ఎస్.శ్రీనివాస కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.పద్మరాజు పాల్గొన్నారు. సౌత్ ఏషియన్ వర్సిటీ ప్రెసిడెంట్ అగర్వాల్ ఓక్ ఉత్సవాలు ప్రారంభం -
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై గైట్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. అతడిని రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన పెనుమత్స హరీష్ (32)గా గుర్తించారు. రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీష్ తన ట్రాక్టరులో ఎరువుల లోడు చేసుకుని శంఖవరం వెళుతుండగా గైట్ కళాశాల వద్ద ప్రమాదానికి గురయ్యాడు. రహదారి నుంచి కళాశాల ప్రాంగణంలోకి వెళుతున్న కళాశాల బస్సును ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొనడంతో డివైడర్పై నుంచి దూసుకుపోయింది. ఈ క్రమంలో కింద పడిన హరీష్పై నుంచి ట్రాక్టరు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బావ ఇసుకపల్లి శివరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. -
అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్ మోసం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టర్ ఘరానా మోసం బయటపడింది. ఆలయంలో పారిశుధ్య పనులు చేసే సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్నట్టు నకిలీ చలానాలు జమ చేసి, ఏకంగా రూ.1.77 కోట్ల బిల్లు రాయించుకున్నాడు. అయితే మూడు నెలలుగా తమ ఖాతాల్లో పీఎఫ్ జమకాక పోవడంతో పారిశుధ్య సిబ్బంది ఆందోళన చేశారు. దీంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టును విజయవాడకు చెందిన కనకదుర్గ మేన్ పవర్ సర్వీసెస్ సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ ప్రతి నెలా సుమారు 350 మంది సిబ్బందికి రూ.59 లక్షలను వేతనాలుగా చెల్లించాలి. ఈ మొత్తంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కింద 12 శాతం సిబ్బంది, 13 శాతాన్ని దేవస్థానం తరఫున కాంట్రాక్టర్ చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా కాంట్రాక్టర్ పీఎఫ్ డబ్బులు కట్టేస్తే, అతడికి దేవస్థానం చెల్లిస్తుంది. నకిలీ రశీదులు దేవస్థానం నుంచి సిబ్బంది పీఎఫ్ వాటా సొమ్ముల కోసం కాంట్రాక్టర్ మోసానికి తెర తీశాడు. ఆ డబ్బులు చెల్లించినట్టు నకిలీ రశీదులు సృష్టించాడు. వాటిని దేవస్థానానికి జమ చేశాడు. నిబంధనల ప్రకారం.. అతడు డబ్బులు కట్టిన తర్వాతే, దేవస్థానం తిరిగి చెల్లిస్తుంది. మార్చిలో రూ.10,09 లక్షలు, ఏప్రిల్లో రూ.10.64 లక్షలు, మేలో 10.45 లక్షలు చెల్లించినట్టు నకిలీ రశీదులు జమ చేశాడు. దీంతో దేవస్థానం ఆ మొత్తాలను కలిపి ఆ మూడు నెలలూ నెలకు రూ.59 లక్షలను పారిశుధ్య సిబ్బంది జీతాలుగా చెల్లించింది. వాస్తవానికి దేవస్థానం అధికారులు, ఆడిట్ అధికారులు ఈ చెల్లింపులు కరెక్టేనా అని తనిఖీ చేయాలి. కానీ అవేమీ లేకుండా బిల్లు చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసం బయటపడిందిలా.. పారిశుధ్య సిబ్బందికి ప్రతి నెలా జీతం పడుతున్నప్పటికీ పీఎఫ్ అకౌంట్కు జమ కావడం లేదు. దీంతో పారిశుధ్య సిబ్బంది ఆందోళన చేశారు. దీనిపై కాంట్రాక్టర్ను దేవస్థానం అధికారులు వివరణ అడగడంతో అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతనిచ్చిన రశీదులను స్కాన్ చేస్తే అవి నకిలీవని తేలింది. కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి కేసు పెడతామని హెచ్చరించడంతో అతను మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జూలై 9, 14, 15 తేదీలలో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షలు చెల్లించి ఆ రశీదులను మంగళవారం జమ చేశాడు. కాగా.. కాంట్రాక్టర్ ముందుగా ఇచ్చిన రశీదులపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మూడు బిల్లులు డిసెంబర్లో కట్టినవిగా తేలింది. వాటిపై నంబర్లు, తేదీని ఫోర్జరీ చేసి దేవస్థానంలో పీఎఫ్కి చెల్లించినట్టుగా మార్చారు. అంతే కాకుండా కట్టిన మొత్తం కూడా ఒక్కోటి రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. రూ.30 లక్షల పీఎఫ్ చెల్లించినట్టు నకిలీ రశీదులు అందజేత వాటి ఆధారంగా రూ.1.77 కోట్ల బిల్లులు చెల్లించిన దేవస్థానం అధికారులు సిబ్బంది ఆందోళనతో వెలుగులోకి.. కాంట్రాక్టర్ను సంజాయిషీ కోరాం శానిటరీ టెండర్ దారుడు పీఎఫ్ చెల్లించనట్టుగా నకిలీ చలానాలు జమ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. దానిపై విచారణ చేయాలని సంబంధిత సెక్షన్ అధికారులను ఆదేశించాం. కాంట్రాక్టర్ తప్పు చేసినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఆగుతూ.. ఊగుతూ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంతో కలిపి రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ ప్రొక్యూర్ రీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈ నెల రెండో తేదీన ఈ టెండర్ ఖరారు కావాలి. అయితే వివిధ కారణాలతో ఆ టెండర్ ఖరారు బాధ్యతను దేవదాయ, ధర్మాదాయశాఖ ప్రభుత్వానికి అప్పగించినట్టు సమాచారం. అన్ని దేవస్థానాలకు కలిపి సుమారు రూ.60 కోట్లకు పైబడిన టెండర్ అవడంతో దేవదాయశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు లేదా ఆగస్టులో ఖరారు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం తరఫున శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. ఏడు ప్రముఖ దేవస్థానాలను ఒకే యూనిట్గా శానిటరీ టెండర్లు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెండర్ ప్రక్రియ తొలిసారిగా ఏప్రిల్లో టెండర్ పిలిచారు. అయితే ఆ నోటిఫికేషన్పై టెండరుదారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండరుదారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీగా జూన్ 26ను నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది పక్కకు తప్పుకున్నారు. జూన్ 30న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ జూలై మూడో తేదీన ఓపెన్ చేసి తక్కువ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో వాయిదా సాంకేతిక కారణాలతో టెండర్ ఖరారును ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ త్వరలో టెండరు దారును ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ టెండర్ పద్మావతి సంస్థకే దక్కినందున విమర్శలు రాకుండా ఉండేందుకే కాలయాపన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏడు దేవస్థానాలలో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాలపరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలలో పారిశుధ్య పనులు, వివిధ సత్రాలలో హౌస్ కీపింగ్, రహదారులు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు చేయాలి. పెరగనున్న వ్యయం! అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సేవలకు కేఎల్టీసీ సంస్థకు నెలకు రూ.49 లక్షలు ఇచ్చేవారు. కనకదుర్గ ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలతో పాటు మరో రూ.12 లక్షలను మెటీరియల్కు కలిపి రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక మెషినరీ ఉపయోగించాలనే షరతుతో బాటు ఏసీల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్టు రూ.80 లక్షలకు పైమాటే. అంటే ఏడాదికి సుమారు రూ.పది కోట్లను పారిశుధ్యం కోసమే వెచ్చిస్తారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ‘పద్మావతి’దే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2014–19 మధ్య అన్నవరంతో పాటు పలు దేవస్థానాలలో శానిటరీ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్లు కాలపరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్టు పొడిగించింది. పద్మావతి సంస్థ యజమాని భాస్కర నాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే అందుకు కారణం. ఇప్పుడు మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవాలయాల శానిటరీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం ప్రభుత్వానికే బాధ్యత అప్పగించిన వైనం ఏడాదికి రూ.60 కోట్లకు పెరగనున్న టెండర్ పద్మావతి సంస్థకే దక్కినట్టు ఊహాగానాలు గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఆ సంస్థకే కాంట్రాక్టు కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా... అన్నవరం దేవస్థానంలో శానిటరీ పనులు నిర్వహించిన హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్టు గత నవంబర్తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టు ముగియడానికి ఒక నెల ముందుగానే ఈ శానిటరీ టెండర్ ప్రకటన (గత అక్టోబర్లో) విడుదల కావాలి. టెండర్లు పిలవడం ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. అనంతరం మార్చి ఒకటిన దేవస్థానంలో శానిటరీ పనుల నిర్వహణకు ఎటువంటి టెండరు లేకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గ శానిటరీ సర్వీసెస్కు తాత్కాలికంగా అప్పగించారు. కానీ శానిటరీ మెటీరియల్ను మాత్రం దేవస్థానమే అందజేస్తోంది. జూలైతో కలిపి ఆ సంస్థ ఐదు నెలలుగా దేవస్థానంలో పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహిస్తోంది. ప్రతి నెలా సిబ్బందికి జీతాలు ఆలస్యంగా ఇస్తుండడం వివాదస్పదమవుతోంది. జూలై నెలలో కూడా 15 తేదీ దాటినా ఇంకా పారిశుద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. -
కుమార్తె కోసం తల్లిడిల్లి..
● గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్యా యత్నం ● నాలుగు నెలలుగా కూతురి ఆచూకీ లేకపోవడంతో మనస్తాపం ● రక్షించిన పట్టణపోలీసులు తాళ్లపూడి(కొవ్వూరు): తన కుమార్తె నాలుగు నెలలుగా కనిపించడం లేదన్న మనస్తాపంతో కొవ్వూరుకు చెందిన మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పట్టణ సీఐ విశ్వం తెలిపిన వివరాల మేరకు దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన చిలకలపూడి నాగమణి రోడ్ కం రైల్వే బ్రిడ్జి పైకి ఎక్కి గోదావరిలోకి దూకినట్టు తెలిపారు. ఆమెను వెంటనే సమీపంలోని మత్స్యకారులు రక్షించారు. అయితే అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. 18 ఏళ్ల ఆమె కుమార్తె 4 నెలలుగా కనిపించడం లేదని మనస్తాపానికి గురైనట్టు ఆయన తెలిపారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర అన్నిచోట్లా వెతికినప్పటికీ కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని, ఆమెను రక్షించడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు తీవ్రంగా శ్రమించారని సీఐ తెలిపారు. ఆమెను పట్టణ పోలీసులు, ఆర్డీవో రాణి సుస్మిత, తహసీల్దార్ తదితరులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
భర్త అనుమానించాడని భార్య ఆత్మహత్యాయత్నం
అమలాపురం రూరల్: భర్త అవమానించాడని మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాలూకా ఎస్ఐ వై.శేఖరబాబు తెలిపిన వివరాల మేరకు స్థానిక హైస్కూల్ సెంటర్కు చెందిన దూనబోయిన రమేష్కు రూరల్ మండలం నల్ల మిల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన శ్యామలతో వివాహం జరిగింది. వివాహమైన కొద్దికాలానికే అతడు ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి తిరిగివచ్చి తనకు తెలిసిన సెంట్రింగ్ పని చేసుకుని జీవిస్తున్నాడు. గల్ఫ్లో ఉండగానే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఈ నెల 14న నేదునూరు పెదపాలెంలో పెద్దల సమక్షంలో తగువు పెట్టారు. కాపురానికి తీసుకువెళ్లనని గ్రామపెద్దల వద్ద రమేష్ చెప్పడంతో సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్యామల ఇంట్లో ఉన్న గడ్డిమందును తాగేసింది. వెంటనే గుర్తించిన తల్లి గడ్డి మందు సీసాను పక్కకు గెంటేసింది. అయితే అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న శ్యామలను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో మంగళవారం శ్యామల ఇచ్చిన సమాచారం ఆధారంగా భర్త రమేష్ కుటుంబసభ్యులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్బాబు తెలిపారు. -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు
సామర్లకోట: పట్టణంలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ప్రత్యేక నిఘాలో భాగంగా స్థానిక కొత్త వంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఇంటి దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా నేరస్తుడిగా అంగీకరించినట్లు చెప్పారు. నిందితుడు కంచర్ల మోహనరావు నుంచి ఇప్పటివరకు నాలుగు దొంగతనాలకు సంబంధించి సుమారు 50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండిని రివకరీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు అతడిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారన్నారు. ఇంటి యజమానులు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అదే విధంగా పోలీసు శాఖ అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్సై రమేష్బాబు పాల్గొన్నారు. -
గంజాయితో ఉన్న నలుగురి అరెస్టు
4 కేజీల సరకు స్వాధీనం పిఠాపురం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి పంచుకుంటున్న ఐదుగురు యువకులను మంగళవారం అరెస్టు చేసి 4 కేజీల సరకును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన కడియపు ప్రేమ్కుమార్ మరో బాలుడు కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన గంజాయి సరఫరాదారు మడ్డు లోకేష్ నుంచి సరకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరితో పాటు పిఠాపురం మంగయ్యమ్మరావుపేటకు చెందిన దనాల మనోహర్, కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన రామివెట్టి దుర్గాప్రసాద్ గంజాయి విక్రయిస్తుంటారు. నక్కపల్లి నుంచి గంజాయి తీసుకురాగా గొల్లప్రోలు శివారు ప్రాంతంలో ఒక లే అవుట్ వద్ద ఐదురుగు కలిసి తెచ్చిన గంజాయిని పంచుకున్నారు. దానిలో కొంత తాము వాడుకుని మిగిలిన దానిని ఎక్కువ రేటుకు విక్రయించాలనుకున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్సై ఎన్ రామకృష్ణ తన సిబ్బందితో మాటు వేసి గంజాయితో మోటారు సైకిల్పై వెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురి వివరాలు తెలుసుకుని ఐదురురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి 4 కేజీల గంజాయితో పాటు ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. -
పరిపాలనపై పట్టు ఉండాలి
● ఈటీసీ ప్రిన్సిపాల్ ప్రసాదరావు ● ఉమ్మడి జిల్లా మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీల శిక్షణ సామర్లకోట: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావడం ద్వారా పరిపాలనా నైపుణ్యం ప్రదర్శించడానికి మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నట్టు విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజు మంగళవారం గ్రూప్ డిస్కషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు ద్వారా విజేతలు, మహిళా సాధికారితతో స్వపరిపాలన సాధ్యం అనే అంశంపై శిక్షణ ఉంటుందని చెప్పారు. పదవీ కాలం పూర్తి అవుతున్న తరుణంలో ఇస్తున్న శిక్షణ జీవిత కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం చేస్తున్న పదవులలో మంచి సమర్ధతను చూపించడం ద్వారా మరింత ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణతో సమర్ధతను పెంచుకోవడం ద్వారా మంచి పదవులు లభించే అవకాశం ఉంటుందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండటంతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయకత్వం ఏ ఓక్కరికో పరిమితం కాకూడదన్నారు. మహిళలు తమ సమర్ధతను పూర్తి స్థాయిలో ప్రదర్శించడం లేదనే ఆరోపణ ఉన్నాయన్నారు. దీనిలో భాగంగా మహిళ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే కేంద్ర ప్రభుత్వం భావిస్తొందని తెలిపారు. దీని కోసమే శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల ముందు ఏ విధంగా మాట్లాడాలి, ఇతరుల నుంచి విషయాలు తెలుసుకోవడం, పంచాయతీ చట్టాలు, పరిపాలనపై అవగాహన ఉండాలన్నారు. స్వయంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. సమర్ధ నాయకత్వానికి చదువుతో సంబంధం లేదన్నారు. ఈ శిక్షణలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, కోర్సు డైరెక్టర్ కె.సుశీల, ఫ్యాకల్టీలు పి.శర్మ, డి.శ్రీనివాసరావు, ఎం.చక్రపాణిరావు, కేఆర్ నిహారిక, పి.రామకృష్ణ శిక్షణ ఇచ్చారు. -
ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది
దౌత్యవేత్త డాక్టర్ బాలభాస్కర్ రాజానగరం: సాంకేతిక విఘాతం, సోషల్, పొలిటికల్, డిప్లమేటిక్ చాలెంజెస్, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రముఖ దౌత్యవేత్త డాక్టర్ బి.బాలభాస్కర్ అన్నారు. నన్నయ యూనివర్సిటీలోని ఈసీ హాలులో శ్రీభారతీయ దృక్పథంలో విఘాతం కలిగించే సాంకేతిక పరిజ్ఞానాల భౌగోళిక శాస్త్రాన్ని నావిగేట్ చేయడంశ్రీ అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. దౌత్యవేత్తగా 70 దేశాలతో సంబంధాలను కలిగివున్న బాలభాస్కర్ మాట్లాడుతూ ముఖ్యంగా టెక్నాలజీలో జరిగే తీవ్రమైన మార్పుల వల్ల సమాజంలో, పరిశ్రమలో ఆర్థిక మోడల్స్, ట్రెడ్ మోడల్స్, టారీఫ్ స్ట్రక్చర్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. వాటిని ముందుగా గ్రహించకపోతే ప్రపంచ దేశాలు పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదన్నారు. సాంకేతికంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పులపై విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు దృష్టి సారించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. కోవిడ్ వంటి విపత్కరమైన పరిస్థితులలో భారత ధాన్యాగారం విలువ ప్రపంచానికి తెలిసిందన్నారు. అన్ని రంగాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థలో ఉన్న అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా సంబంధిత సబ్జెక్టులలో అప్డేట్ కావాలన్నారు. ఎర్త్ నుండి స్పేస్ వరకు అన్ని రంగాలలో క్వాంటం టెక్నాలజీ ప్రభావం చూపిస్తోందని, దానిపై మంచి పట్టు సాధించాలన్నారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ దౌత్యవత్తగా దేశాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో డాక్టర్ బాలభాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, కోఆర్డినేటర్ డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, డాక్టర్ పి. సురేష్వర్మ, డాక్టర్ కె.రమణేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళపై దాడి
8 మందిపై కేసు నమోదు ధవళేశ్వరం: ఇంటి తగాదాకు సంబంధించి మహిళపై దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ టి.గణేష్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ కాలనీలో తిరుకోటి పావని అనే మహిళ పేరుపై బిల్డింగ్ ఉంది. ఈ ఇల్లు తనదేనంటూ కొత్తూరు పార్వతి అనే మహిళ పేర్కొనడంతో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. మంగళవారం కొందరు ఇనుప రాడ్లతో ఇంటికి వచ్చి తనపై దాడి చేయడంతో గాయపడినట్లు పావని ఫిర్యాదు చేసింది. పావని ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఐదుగురు మహిళలు, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్ తెలిపారు. మన్నించు మహాత్మా.. గాంధీజీ విగ్రహం చేయి ధ్వంసం రాజానగరం: గాంధీజీ విగ్రహాన్ని ఆకతాయిలు ధ్వంసం చేశారు. గాంధీ బొమ్మ కూడలిగా పేరొందిన ఈ ప్రాంతం నిత్యం రద్దీతో ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో మాత్రం తాగుబోతులకు ఆలవాలంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు, ఎందుకు కారకులయ్యారో గానీ మహాత్ముని కుడి చేతిని విరగొట్టారు. ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆగస్టు 15కి, అక్టోబరు 2న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు పోటీపడుతుంటారు. రెండు నెలలుగా మొండి చేతితో ఉన్న మహాత్ముని విగ్రహం వారెవరి దృష్టిలో పడకపోవడం విచిత్రం. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు గండేపల్లి: మల్లేపల్లి హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన గుండు అమ్మాజీ గ్రామంలో సచివాలయం–2 వద్ద జరిగే వారపు సంతలోకి నిత్యావసర వస్తువుల కోసం రోడ్డు దాటుతోంది. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి సుమారు మూడేళ్ల పాపతో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి మోటారుసైకిల్పై వెళ్తున్న ఆర్.దొరబాబు ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడి రోడ్డుకు మధ్యలో పడ్డ వీరిని స్థానికులు పక్కకు తీసుకువచ్చి సపర్యలు అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు అంటున్నారు. మూడేళ్ల పాపకి ఏమైందోనని పలువురు కలవరపాటుకు గురయ్యారు. ఆ చిన్నారి బయాందోళనకు గురికావడంతో గ్రామానికి చెందిన యువకుడిని మోటార్ సైకిలిస్టుకు తోడుగా వెంట పంపించారు. సంతకు వచ్చిన వాహనాలు రోడ్డుకు పక్కనే పార్కుచేయడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం వారపు సంత రోజైనా పోలీస్ సిబ్బందిని ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అన్నదాతకు అండ
● పంటల పరిరక్షణలో గుడ్ల ద్రావణం ● ప్రకృతి వ్యవసాయంలో ఎగ్ అమ్మోనియా యాసిడ్ తయారీ ● చీడపీడలకు, నాణ్యమైన ఉత్పత్తికీ ఎంతో ఉపయుక్తం పిఠాపురం: రోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండని వైద్యులు సూచిస్తుంటారు. మంచి బలవర్ధకమైన ఆహారంగా గుర్తించబడిన గుడ్డు ఇప్పుడు పంటలకు సైతం మంచి పోషకరంగా పని చేస్తోంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో అనేక ద్రావణాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం గుడ్ల ద్రావణం మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే ద్రావణంగా దీనికి గుర్తింపు రావడంతో గొల్లప్రోలు మండలం దుర్గాడ గో గాయత్రి ప్రకృతి వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో గుడ్ల ద్రావణం తయారీ చేపట్టారు. దీని తయారీ విధానాన్ని కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు. తయారీ విధానం ఇదీ.. ముందుగా గుడ్లను పగలకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్ జార్లో జాగ్రత్తగా పెట్టి అవి పూర్తిగా మునిగే వరకు నిమ్మరసంతో నింపాలి. దానికి మూతపెట్టి ఎండ తగలని చోట పెట్టుకోవాలి. దీనిని ప్రతీ రోజు గమనిస్తూ ప్లాస్టిక్ జార్ మూతను తీసి పెడుతుండాలి. లేకపోతే దానిలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ప్రభావంతో జార్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా 10 నుంచి 15 రోజులకు నిమ్మరసంలో మునిగి ఉన్న కోడిగుడ్లు కరిగిపోయి చిక్కటి ద్రవంగా మారిపోతుంది. దానిని జాగ్రత్తగా కలిపి ఆ ద్రావణంలో 250 నుంచి 500 గ్రాముల బెల్లాన్ని మెత్తని చూర్ణంగా చేసి కలుపు కోవాలి. అలా కలిపిన ద్రావణాన్ని మళ్లీ నీడగా ఉండే చోట భద్రపర్చుకోవాలి. ఇలా మరో 15 రోజుల వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం గమనిస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 20 నుంచి 30 రోజుల తరువాత తెల్లటి బాదం పాలు మాదిరిగా ఒక రకమైన ద్రావణం తయారవుతుంది. దీనినే గడ్లు ద్రావణం, ఎగ్ అమోనియా యాసిడ్ అంటారు. దీనిని మరో బాటిల్లోకి తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. దీనికి నీటి తడి ఎట్టి పరిస్థితుల్లోను తగలకుండా చూసుకోవాలి. దీనిలో అమ్మోనియా యాసిడ్స్, ప్రొటీన్లు, మైక్రో న్యూట్రియంట్స్, మేక్రో న్యూట్రియంట్స్తో పాటు పుష్కలంగా కాల్షియం ఉంటుంది. వినియోగం ఇలా.. గుడ్ల ద్రావణం తయారైన తరువాత పూత దశ దాటిన పంటకు ఒక లీటరు నీటికి 2 నుంచి 3 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పూత దశకు వచ్చాక ఒక లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక ఎకరం పొలానికి 200 లీటర్ల నీటికి ఒక లీటరు ద్రావణం కలిపి పచికారీ చేసుకోవచ్చు. దీనిని నెలకు ఒక సారి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయోజనాలు అనేకం ప్రతి పంటకు దీనిని పిచికారీ చేయడం వల్ల పూత ఆశాజనకంగా నాణ్యమైన ఆరోగ్యవంతంగా వస్తుంది. పిందె నిలబడడానికి, ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి ఇది ఎంతో దోహద పుడుతుంది. పిందె రాలిపోకుండా కాపాడుతుంది. గుడ్డు ద్రావణంలో గుడ్డు తొక్కతో సహా కరిగించడం వల్ల అధికంగా కాల్షియం ఉత్పత్తి అయ్యి మొక్కలకు మంచి కాల్షియం అందిస్తాయి. మొక్కలకు అత్యంత అవసరమైన కాల్షియం అందడం వల్ల పంటలు నాణ్యమైన దిగుబడులు ఇస్తాయి. భూమి సారవంతమై మేలు చేసే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇది మొక్కలు వత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి, తద్వారా తెగుళ్లు పురుగులు అంత త్వరగా సోకే అవకాశం లేకుండా పోతుంది . దీనివల్ల క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది. తద్వారా పంటలలో ఆకులు పచ్చగా తయారై కిరణ జన్య సంయోగ క్రియ సక్రమంగా జరిగి పిండి పదార్థాలను మొక్కలు ఎక్కువగా తయారు చేసుకుంటాయి. దీనివల్ల మొక్కలు గుబురుగా పెరగడంతో పాటు కాయల పరిమాణం పెద్దవిగా ఉండి పంట దిగుబడులు పెరుగుతాయి. అదే పప్పు ధాన్యాలలో అయితే గింజలు నాణ్యంగా తయారవుతాయి. దీనిని నుంచి వచ్చే వాసన వల్ల కొన్ని రకాల పురుగులు పంటలకు సోకవు. ఇది మంచి పెస్ట్ కంట్రోలర్గా పని చేస్తుంది. రూ.వేలు ఖర్చు పెట్టి రసాయానాలు ఉపయోగించినా రాని ఫలితం కేవలం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. – గుండ్ర శివ చక్రం, గో గాయత్రి ప్రకృతి వనరుల తయారీ శిక్షణ కేంద్రం, దర్గాడ కావాల్సిన పదార్థాలు ఇవీ 2 లీటర్ల యాసిడ్ తయారీకి.. కోడిగుడ్లు – 12 నిమ్మకాయలు (బాగా మగ్గినవి) – 2 కేజీలు బెల్లం – 250 నుంచి 500 గ్రాములు మూడు లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ మగ్ – 1 -
పంటకాలువలో పడి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని ఒంటితాడిలో పంటకాలువలో పడి తాళ్లరేవు మండలం కోరంగి శివారు బొడ్డువానిలంకకు చెందిన కౌలు రైతు నరాల నాగరాజు (38) మంగళవారం మృతిచెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు బొడ్డువానిలంకకు చెందిన నాగరాజు కాజులూరు మండలం ఒంటితాడి పంచాయతీ పరిధిలో ఒక రైతుకు చెందిన రెండు ఎకరాల భూమి సాగు చేస్తున్నాడు. మంగళవారం చేనుకు గడ్డి మందు పిచికారీ చేసేందుకు పొలానికి వచ్చాడు. పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు సాయంత్రం తిరిగి వస్తుండగా పంట కాలువలో నాగరాజు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే హుటాహుటిన గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు పొలానికి వచ్చే సమయంలోనే తీవ్ర నీరసంగా ఉన్నాడని దాంతో పొలం పనులు చేస్తూ ప్రమాదవశాత్తు పంట చేలో పడి మృతి చెంది ఉంటాడని రైతులు అభిప్రాయపడుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కాచెల్లెళ్ల అదృశ్యం
కడియం: స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు పి.వీరనాగవల్లి, పి.పద్మప్రియ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ అల్లు వేంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 10, 9 తరగతులు చదువుకున్న వీరిద్దరు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి గుడికని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి ఆచూకీ తెలిస్తే కడియం పోలీస్ స్టేషన్ 9440796587, 9347705890 నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. -
గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ
ప్రీమియం చెల్లింపులు ఇలా..● పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు ● వరికి ఎకరానికి రూ.576, అరటికి రూ.3,000 చెల్లించాలని ఉత్తర్వులు ● గతంలో రైతుల తరఫున చెల్లించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● జిల్లావ్యాప్తంగా 88 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు సాక్షి, రాజమహేంద్రవరం: తాము అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటుపడతామని హామీలు గుప్పించిన కూటమి నేతలు గద్దెనెక్కిన అనంతరం విస్మరించారు. ఇప్పటికే పంటసాగుకు అవసరమైన ‘అన్నదాత సుఖీభవ’ పెట్టుబడి సాయం చేయకపోగా.. ఉచిత పంటల బీమా ప్రీమియం భారం రైతుల నెత్తిన వేశారు. రబీ ధాన్యం విక్రయాలకు సంబంధించి డబ్బు జమ అవ్వక.. ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న రైతులకు బీమా ప్రీమియం చెల్లింపు గుదిబండగా మారుతోంది. ఇదీ సంగతి.. ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా (పీఎంఎఫ్బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో దిగుబడి ఆధారిత పీఎంఎఫ్బీవై కింద వరి, మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలను, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ కింద పత్తి పంటలను గుర్తించింది. వరికి గ్రామం యూనిట్గా.. మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలను జిల్లా యూనిట్గా ఎంపిక చేసింది. ఇందుకుగాను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశారు. కౌలు రైతులు సైతం బీమాకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. బీమా పొందాలంటే రైతువాటాగా నిర్ధారించిన ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంది. బీమా ప్రీమియంకు మంగళం ‘ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధన తెరపైకి తెచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్లో సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ పరిణామం రైతుల్లో ఆవేదన నింపుతోంది. అప్పులు చేసి సాగు చేస్తుంటే.. ప్రభుత్వం తమకు ఏ మాత్రం ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా.. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 83,068 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416, అరటి 6,000 హెక్టార్లలో సాగవుతాయి. పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ప్రీమియం చెల్లించాలి. సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకులు రైతుకు ఇచ్చే రుణం నుంచి ప్రీమియం సొమ్ము మినహాయించుకుంటాయి. రుణాలు తీసుకోని రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ.14.80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మరో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు సాయంగా రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది. గతంలో రూపాయి కూడా వసూలు చేయని వైనంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. రైతులు సాగు చేసే మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా పథకం వర్తించడంతో పంటలకు నష్టం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ రైతులు పూర్తిగా నష్టపరిహారం అందుకునే వారు. కౌలు రైతులకు సైతం పరిహారం అందించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే సొమ్ము జమ అయ్యేది. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బీమా ప్రీమియంగా రూపాయి కూడా చెల్లించని రైతులు ఇప్పుడు ప్రీమియం చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల సాగుకు ఇప్పటికే పెట్టుబడులు అందక అప్పులు చేశారు. ఇలాంటి సమయంలో బీమా భారం తమపై మోపడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని నిట్టూరుస్తున్నారు. 2024–25 రబీ సీజన్కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువరించింది. జిల్లాలో వరికి ఆగస్టు 15వ తేదీ, మినుములు జూలై 31, అరటికి జూలై 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. వరి పంట హెక్టారు రూ.95,000 విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,425 ప్రీమియం చెల్లించాలని సూచించింది. మినుములు, పెసలు హెక్టారుకు రూ.50 వేలు విలువ కట్టి 1.5 శాతం వంతున హెక్టారుకు రూ.750 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. జీడితోటలకు హెక్టారుకు రూ.75 వేలుగా నిర్ధారించి 5 శాతం వంతున అంటే రూ.3,750 ప్రీమియం చెల్లించాలని తెలిపింది. అరటికి హెక్టారుకు రూ.7,500 చెల్లించాల్సి ఉంది. రైతులపై రూ.34.50 కోట్లకు పైగా భారం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా రైతులపై సుమారు రూ.34.50 కోట్లకుపైగా బీమా ప్రీమియం భారం పడనుంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి 76,941 హెక్టార్లలో సాగవుతుంది. ప్రతి హెక్టారుకు రూ.1,425 చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాలంటే.. సుమారు రూ.10.96 కోట్లు, మినుములు రూ.19 లక్షలు, అరటి రూపంలో రూ.4.50 కోట్లు భారం పడనుంది. పంట వర్తింపజేసిన ఇన్పుట్ సబ్సిడీ (హెక్టారుకు) వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000 మొక్కజొన్న రూ.12,500 మినుములు, పెసలు, శనగలు, ప్రొద్దుతిరుగుడు, పొగాకు రూ.10,000 జొన్న రూ.8,500 -
3న జాతీయ చదరంగం పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ చదరంగం టోర్నమెంట్ను కాల్ ఫ్యూజన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి తెలిపారు. మంగళవారం టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ లోరియల్ హై గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో రూ.1,23,456 నగదు బహుమతితో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి సుమారు 400 మంది వరకు చదరంగ క్రీడాకారులు హాజరవుతారన్నారు. విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేస్తామన్నారు. స్కూల్ డైరెక్టర్ సుంకర రవికుమార్, ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ డైరెక్టర్ హైమావతి, చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాలకుమార్ పాల్గొన్నారు. -
జీజీహెచ్కు వైద్య పరికరాల అందజేత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్కు ఓఎన్జీసీ, యూనివర్సిటీ ఆఫ్ బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెమిని ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా రూ.78.77 విలువైన వైద్య పరికరాలను అందించాయి. ఈ యంత్ర పరికరాలతో పాటు న్యూరో ఓపీ షెడ్ను మంగళవారం కలెక్టర్ షణ్మోహన్, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ సంస్థల వితరణతో ట్రామాకేర్ బ్లాక్, న్యూరాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా, కార్డియాక్ విభాగాలకు చెందిన వైద్య పరికరాలు సమకూరాయన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, రంగరాయ వైద్య కళాశాల డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఓఎన్జీసీ జీఎంహెచ్ఆర్ కె.సునీల్ కుమార్, సీపీవో త్రినాథ్, ఏపిఎంఎస్ఐజీసీ ఈఈ సీహెచ్.రత్నరాజు పాల్గొన్నారు. -
వరుస పురస్కారాలపై హర్షం
కాకినాడ సిటీ: రెడ్క్రాస్ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ షణ్మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి ఎన్వీవీఆర్కె ప్రసాద్బాబు, కార్యదర్శి కె శివకుమార్ మంగళవారం కలెక్టర్కు అందజేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్క్రాస్ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్క్రాస్కు సేవలు అందించి గవర్నర్ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్జీసీ, కేఎస్పీఎల్ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్ ఫుడ్స్ అధినేత ఎల్ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్ బి సుకుమార్లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. మెట్ట జలగలతో జాగ్రత్త పిఠాపురం: మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే నివారణకు చర్యలు తీసుకోవాలని పిఠాపురం ఉద్యాన శాఖాధికారి వై.సోమరాజశేఖర్ రైతులకు సూచించారు. ఆయన మంగళవారం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పర్యటించి మెట్ట జలగలు సోకిన పంటలను పరిశీలించారు. ఇటీవల గొల్లప్రోలు మండలంలో వివిధ పంటలకు మెట్ట జలగలు సోకి తీవ్ర నష్టాలను కలిగించిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘జల గండం’ శీర్షికన వెలువడిన కథనానికి ఉద్యాన శాఖాధికారులు స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల్లో మెట్ట జలగలను గమనించామన్నారు. ఎక్కువగా మిరప, బొప్పాయి వంటి తోటల్లో కనిపించాయని, వీటిని తొలి దశలోనే నివారించక పోతే ఎక్కువ మొత్తంలో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పొలంలో తడి తగ్గించడమే కాక సాయంత్రం నీరు పెట్ట కూడదన్నారు. మిరప తోటలో కలుపు, వాడిన ఆకులు పూర్తిగా తొలగించుకోవాలన్నారు. మెట్ట జలగలకు ఆశ్రయం కలిగించే చెట్లను తొలగించాలని, రాళ్లు, చెత్త లేకుండా చూసుకుంటూ పొదల కింద వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మెటాల్డిహైడ్ బైట్ 2.5 శాతం,1 నుంచి 2 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి వేసుకోవాలన్నారు. ఐరన్ ఫాస్ఫేట్ బైట్ 2 నుంచి 4 కిలోలు ఎకరాకు సాయంత్రం వేళ పొలం చుట్టూ లేదా మిరప రద్దెల మధ్య చల్లుకోవాలన్నారు. దీనిని వర్షం వచ్చి పోయిన తర్వాత మళ్లీ వేయడం అవసరమన్నారు. పొగాకు పొడిని చేను అంతటా తడిగా ఉన్నప్పుడు చుట్టూ చల్లు కోవడం ద్వారా వీటిని నియంత్రివచ్చని తెలిపారు. వర్షం వచ్చి పోయిన తరువాత పొలం పరిశీలించడం ద్వారా వీటి ఉనికిని గమనించవచ్చన్నారు. పొలాల్లో మెట్ట జలగలు, నత్తలు కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రం ద్వారా ఉద్యాన శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారు నివారణ చర్యలు సూచిస్తారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా రాంప్రసాద్, ఆనంద్ గోకవరం/పెదపూడి: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా గోకవరానికి చెందిన సీనియర్ నాయకుడు తోలేటి రాంప్రసాద్, అనపర్తి నియోజకవర్గానికి చెందిన పందిరి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాంప్రసాద్ భార్య తోలేటి రమ్యశ్రీ గోకవరం ఎంపీటీసీ 1గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. -
యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) అంటే ముందుగా గుర్తుకువచ్చేది సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం. ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సేవలో కాకుండా నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఆసక్తి గలవారికి హెవీ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. 2020వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువత భవిష్యత్కు భరోసా కల్పించేందుకు వీటిని ప్రారంభించారు. వాహన చట్టాలపై అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆర్టీసీ హెవీ వెహికల్లో డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యాలయం ఏర్పాటు చేసి యువతీ యువకులను బ్యాచ్లుగా ఏర్పాటు చేసి డ్రైవింగ్లో శిక్షణ, వాహన చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం నామమాత్రపు ఫీజు నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసేవారికి సర్టిఫికెట్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అభ్యర్థులు భవిష్యత్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డ్రైవర్లుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో అయితే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ 19 బ్యాచ్లలో 305 మంది శిక్షణ పొందారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్ కల్పించడం, డ్రైవింగ్లో మెళకువలు నేర్పించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.21వ బ్యాచ్కు దరఖాస్తుల ఆహ్వానం హెవీ వెహికల్ డ్రైవింగ్లో అభ్యర్థులకు సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందిస్తున్నాం. రాత్రివేళ్లలో డ్రైవింగ్ నేర్పిస్తాం. సమయ పాలన ,క్రమశిక్షణ, అంకితభావంతో డ్రైవింగ్లో మెళుకువలు నేర్పుతూ రోజూ తరగతి గదిలో పాఠాలతో పాటు గ్యారేజీలో ఇంజిన్ భాగాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఘాట్రోడ్డు ఎత్తు, పల్లం వంటి ప్రాంతాలలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం 21వ బ్యాచ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. – కే.డీ.ఎం.రాజు డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నిరుద్యోగులకు అండగా ఏపీఎస్ ఆర్టీసీ ఐదేళ్ల కాలంలో 305 మందికి తర్ఫీదు సుశిక్షితులైన నిపుణులతో నిర్వహణ 21 బ్యాచ్కు దరఖాస్తుల ఆహ్వానం హెవీ లైసెన్స్కు శిక్షణ జేఎన్టీయూకేలో బీటెక్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నాను. భవిష్యత్లో కొన్ని ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగే అవకాఽశం ఉంది. శిక్షణతో పాటు లైసెన్స్, డ్రైవింగ్కు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. – ఎం.జోష్, కాకినాడ డ్రైవింగ్పై అవగాహన వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి డిఫెన్స్ వంటి వాటికి హెవీ లైసెన్స్ తప్పనిసరిగా అడుగుతున్నారు. డ్రైవింగ్తో పాటు లైసెన్స్ జారీకు ఆర్టీసీ అందిస్తున్న సేవలు వినియోగించుకున్నాను. ఇటువంటి వాటి ద్వారా నేర్చుకుంటే అవగాహన పూర్తిగా వస్తుంది. – పి.బాలురెడ్డి, పీఆర్ డిగ్రీ కళాశాల -
శాకంబరిగా మరిడమ్మ
పెద్దాపురం : మరిడమ్మ అమ్మవారు మంగళవారం శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దర్గాసెంటర్ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం సహకారంతో మరిడమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో పండితులు అలంకరించగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక బందోబస్తు కల్పించారు. అనంతరం వీధి సంబరాల్లో భాగంగా కుమ్మరవీధి సంబారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
ప్రజల్లోకి కూటమి మోసాలు
క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయ సారథి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఓ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ సమావేశం నిర్వహించారు. ఏడు నియోజకవర్గాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు మోసాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై క్రైస్తవులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్, రాజనగరం అధ్యక్షులు రెవ జొనాతన్, అనపర్తి అధ్యక్షులు రెవ దావీదు, నాయకులు రెవ.సుధాకర్, రెవ. చిట్టి బాబు, బ్రదర్ శామ్యూల్, బ్రదర్ ఐజియా, పాస్టర్ జాన్ బాబు పాల్గొన్నారు. కొబ్బరిచెట్లను మింగేస్తున్న గోదావరి మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి. అప్పనపల్లి పాటు రేవు సమీపంలో కొబ్బరి చెట్లతో పాటు సారవంతమైన భూమి నదిలో కలిసిపోయింది. పెదపట్నం, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లో సైతం పరిస్థితి నెలకొంది. -
పప్పుతిప్పలు
గిట్టుబాటు కావడంలేదు రెండు నెలలుగా మార్కెట్లో పప్పునకు డిమాండ్ తగ్గింది. ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత ధర గిట్టుబాటుగా లేదు. మూఢానికి ముందు కిలో పప్పు రూ.800 పలకడంతో వ్యాపారం బాగుంది. – సుతాపల్లి వెంకన్నబాబు, అధ్యక్షుడు, శ్రీవేంకటేశ్వర, క్యాజూ మర్చంట్స్ అసోసియేషన్, దేవరపల్లి నాణ్యత తగ్గింది వర్షాలకు తడవడంతో జీడిగింజలు నల్లబడి పప్పు నాణ్యత తగ్గింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న గింజల పప్పు నాణ్యత బాగుంది. విదేశీ గింజలు బస్తాకు 21 కిలోలు పప్పు దిగుబడి వస్తుండగా, స్వదేశీ గింజలు దిగుబడి 24 నుంచి 25 కిలోలు వస్తోంది. గింజల ధర ఒకే విధంగా ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో సుమారు 90 పరిశ్రమలు ఉండగా, దాదాపు 500 మంది వ్యాపారులు ఉన్నారు. మూతబడిన పరిశ్రమలను తెరచి కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేస్తున్నాం. – పెంజర్ల గణేష్కుమార్, జీడిపప్పు వ్యాపారి, దేవరపల్లిజీడిపప్పును ప్యాకింగ్ చేస్తున్న మహిళలు● జీడిపప్పు పరిశ్రమకు ఆషాఢం ఎఫెక్ట్ ● రెండు వారాలుగా మూతబడిన వైనం ● మార్కెట్లో తగ్గిన డిమాండ్ ● గింజల బస్తా ధర రూ.12,500 ● పప్పు ధర కిలో రూ.700 ● గిట్టుబాటు కాదంటున్న రైతులు ● మెట్ట ప్రాంతంలో 90 పరిశ్రమలు దేవరపల్లి: జీడిపప్పు పరిశ్రమపై మూఢం, ఆషాఢం ఎఫెక్ట్ పడింది. ఆషాఢ మాసానికి ముందు నెల రోజులు మూఢం రావడంతో ముహూర్తాలు లేక జీడిపప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో వినియోగం తగ్గడంతో పప్పు ధర తగ్గింది. మూఢానికి ముందు కిలో పప్పు ధర రూ.800 ఉండగా, ఆషాఢం ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.700 నుంచి రూ.720 పలుకుతోంది. గింజల ధర బస్తా(80 కిలోలు) రూ.12,000 నుంచి 12,500 ఉండడంతో వ్యాపారులకు నష్టం వస్తోంది. బస్తా గింజలకు 24 నుంచి 25 కిలోల పప్పు తయారవుతుంది. కిలో పప్పు తయారు కావడానికి గింజల ధర రూ.690, ఖర్చులు రూ.20 అవుతాయి. అంటే కిలో పప్పు తయారు కావడానికి రూ.710 ఖర్చు అవుతుండగా, ఆదాయం రూ.700 వస్తోంది. దీనిని బట్టి కిలోకు రూ.10 నుంచి రూ.20 నష్టం వస్తోంది. మెట్ట ప్రాంతంలో విస్తరణ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు డివిజన్ పరిధిలోని నిడదవోలు మండలం తాడిమళ్ల, చాగల్లు మండలం చిక్కాల, దేవరపల్లి మండలం దేవరపల్లి, నల్లజర్ల మండలం దూబచర్ల, గోపాలపురం మండలం గోపాలపురంలో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. తాడిమళ్ల, దేవరపల్లి కేంద్రంగా జీడిపప్పు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. తాడిమళ్లలో సుమారు 45 పరిశ్రమలు, దేవరపల్లిలో 15 పరిశ్రమలు, చిక్కాలలో 5 పరిశ్రమలు, దూబచర్లలో 15 పరిశ్రమలు , గోపాలపురంలో 10 పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ ఉత్పత్తి తాడిమళ్ల, దేవరపలి, దూబచర్ల నుంచి జరుగుతుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన యంత్రాలను తీసుకు వచ్చి వ్యాపారులు జీడిపప్పు తయారీ పరిశ్రమలను నెలకొల్పారు. కార్మికుల ఉపాధికి గండి మార్కెట్లో జీడిపప్పునకు డిమాండ్ లేకపోవడం, గింజల ధర పెరగడంతో జీడిపప్పు కొనేనాథుడు కరువయ్యాడని వ్యాపారులు వాపోతున్నారు. తయారు చేసిన పప్పు నిల్వలు మిల్లుల వద్ద పేరుకుపోవడంతో అమ్మకాలు లేక రెండు వారాల నుంచి దేవరపల్లిలోని పరిశ్రమలకు యజమానులు సెలవు ప్రకటించి మూసి వేశారు. మండలంలోని 15 పరిశ్రమలు మూతబడడంతో పప్పు తయారీ నిలిచిపోయింది. శ్రావణమాసంపైనే ఆశలు ఆషాఢం అనంతరం ఈ నెల 27 నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభముహూర్తాలు ఉండడంతో పప్పునకు డిమాండ్ పెరగవచ్చునని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఏటా ఆషాఢంలో పప్పు ధర తగ్గగా, శ్రావణంలో ధర పెరుగుతుంది. -
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ విచారణ
ఆ నలుగురిని వదలం : చైర్పర్సన్ రాయపాటి శైలజకాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సోమవారం విచారించారు. ఆమె కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, జీజీహెచ్లను సందర్శించి విద్యార్థులు, బోధకులతో సమావేశమయ్యారు. తొలుత రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లి, నేరుగా బాధిత విద్యార్థినులతో సమావేశమయ్యారు. సమావేశం నిర్వహించిన ఆర్ఎంసీ డైనింగ్ హాల్లోకి ఎవరినీ అనుమతించకుండా తాను మాత్రమే విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జరిగిన అకృత్యాలను తెలియజేయడానికి విద్యార్థినులు తొలుత భయపడ్డా, తానిచ్చిన భరోసాతో ఒకొక్కరుగా నోరు విప్పారన్నారు. ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్ల వైఖరి తమను ఆవేదనతో పాటు భయానికి గురిచేసిందన్నారు. వారి దాష్టికాలు విద్యార్దులను మనో వేదనకు గురి చేశాయని వెల్లడించారు. ఏదో వంకతో తాకే ప్రయత్నం చేసేవారని, అసభ్య భంగిమల్లో ఫొటోలు తీసి వన్ టైం వ్యూ ద్వారా వాట్సాప్లో పంపేవారని బాధితులు వెల్లడించారన్నారు. వెకిలి చూపులు వెర్రి చేష్టలతో నరకాన్ని చూపారని, సింగిల్గా రూంకి రావాలంటూ ఒత్తిడి చేసేవారని చెబుతూ విద్యార్దులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. సహ ఎల్టీలు, నిందితుల అనుయాయుల వల్ల తమకు హాని జరిగే అవకాశం ఉందని విద్యార్దినులు తమ భయాన్ని వెల్లడించారన్నారు. వారికి కమిషన్ తరఫున, పోలీస్ శాఖ తరఫున భరోసా ఇచ్చామన్నారు. లైంగిక వేధింపుల నిందితులు ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్లను చట్ట ప్రకారం శిక్షిస్తామని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీరు విద్యార్థినులతోపాటు జీజీహెచ్కు వచ్చే పలువురు మహిళా రోగులపైనా ఈ తరహా అకృత్యాలకే పాల్పడ్డారని తమ విచారణలో వెలుగు చూసిందని అన్నారు. ఈ కీచకులపై చట్ట ప్రకారం తీసుకోవలసిన అన్ని చర్యలపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో చర్చించామన్నారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దాష్టీకాలకు పూనుకోకుండా గుణపాఠం నేర్చేలా చర్యలుంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ దేవరాజ్ పాటిల్, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొన్నారు. -
శాంతించిన గోదావరి
కాటన్ బ్యారేజీ నుంచి 3.58 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదలకాటన్ బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలుదవళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతించింది. ధవళేశ్వరం వద్ద వరద నీటి ఉధృతి తగ్గింది. దీంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. ధవళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 10.50 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి 14,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 6,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీలోని మొత్తం 175గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.34 మీటర్లు, పేరూరులో 9.61 మీటర్లు, దుమ్ముగూడెంలో 6.96 మీటర్లు, భద్రాచలంలో 23.30 అడుగులు, కూనవరంలో 11.34 మీటర్లు, కుంటలో 4.24 మీటర్లు, పోలవరంలో 8.68 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.33 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేనేత ప్రదర్శన
● పీజీఆర్ఎస్లో 238 అర్జీల స్వీకరణ ● కలెక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ రంగ హస్తకళల అభివృద్ధి సంస్థ ‘‘ఆప్కో’’ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక వస్త్రాల స్టాల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రజలకు 30 శాతం రిబేట్పై ఆప్కో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచామన్నారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వినియోగించటం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చని, ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు ఆప్కో చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రజలు చేనేతను ప్రోత్సహిస్తూ ఆప్కో వస్త్రాల కొనుగోలును ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 238 అర్జీలను స్వీకరించామన్నారు. అర్జీదారునికి నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించాలన్నారు. ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఐటీఐలలో ప్రవేశం కోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025– 26 సంవత్సరానికి రెండవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సీహెచ్ సునీల్కుమార్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా 20వ తేదీ రాత్రి 11.55 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్లతో హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ ఎఫ్డీపీ ప్రారంభం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ – ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) సోమవారం ప్రారంభమైంది. క్వాంటం టెక్నాలజీల రంగాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. సమకాలీన విద్య, పారిశ్రామిక దృశ్యంలో క్వాంటం టెక్నాలజీల ఔచిత్యాన్ని వివరించారు. ఎఫ్డీపీ కన్వీనర్ డాక్టర్ వి. పెర్సిస్ మాట్లాడుతూ 50 మంది వరకు ఫ్యాకల్డీ సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్ డాక్టర్ జి. కీర్తి మరిట, సీఎస్ఈ హెచ్ఓడి డాక్టర్ బి.కెజియయారాణి పాల్గొన్నారు. పోలీసు పీజీఆర్ఎస్కు 36 ఫిర్యాదులు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’’(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్. బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. -
ఖరీఫ్కు నీటి కష్టం
జిల్లాలో నాట్లు పరిశీలిస్తే... వరి సాధారణ నాట్లు మండలం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) (హెక్టార్లలో) రాజమహేంద్రవరం 1,460 716కడియం 2,137 1,875రాజానగరం 4,687 1,286అనపర్తి 3,739 2,874బిక్కవోలు 6,113 2,430కోరుకొండ 5,755 230సీతానగరం 5,710 1,530రంగంపేట 2,815 240చాగల్లు 3,421 2,712దేవరపల్లి 3,657 2,310గోపాలపురం 4,216 595కొవ్వూరు 4,507 4,210నిడదవోలు 7,253 4,830తాళ్లపూడి 3,787 1,214ఉండ్రాజవరం 4,923 1,892నల్లజర్ల 4,247 2,180● రుతు పవనాల దాగుడుమూతలు ● కరుణించని వరుణుడు ● వర్షాభావ పరిస్థితులతో మెట్ట రైతులకు ఇబ్బందులు ● జిల్లాలో వరి నాట్లకు శ్రీకారం చుట్టిన రైతులు ● సకాలంలో వర్షం కురవకపోవడంతో ఆలస్యంగా సాగుతున్న ప్రక్రియ ● గతేడాది ఈ సమయానికి విస్తారంగా వర్షాలు, గోదావరికి వరదలు సాక్షి, రాజమహేంద్రవరం: రుతుపవనాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. వెరసి ఖరీఫ్ రైతుకు కన్నీటి కష్టం తప్పడం లేదు. గోదావరి చెంతనే ఉన్నా.. మెట్ట గ్రామాల్లో మాత్రం సాగునీటి కొరత వేధిస్తోంది. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నెల మొదటి వారంలో పలకరించనున్నట్లు వాతావరణ శాఖ అప్పట్లో సంకేతాలు వెలువరించింది. జూలై 10వ తేదీ నాటికి రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు ఆ శాఖ అంచనా వేసింది. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా సాగింది. ఎండలు ఉండాల్సిన సమయంలో అకాల వర్షాలు కురవగా తొలకరి సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వెరసి నాట్లు వేసిన రైతులకు నీటిపాట్లు తప్పడం లేదు. ఈ సమయానికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా.. 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఆగిన రుతుపవనాల కదలిక ఖరీఫ్ సాగుకు రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఒక్కసారిగా రుతుపవనాల కదలిక ఆగిపోయింది. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ నెల 19వ తేదీ వరకు తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజల అల్లాడిపోయారు. దీంతో సాగుకు కర్షకులు వెనకడుగు వేశారు. ప్రస్తుతం సాగుకు వర్షాల అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా.. ఇంకా సాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,848 హెక్టార్లలో నారుమళ్లకు అవకాశముండగా.. సోమవారం నాటికి వంద శాతం పూర్తయినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాట్ల ప్రక్రియ ఇంకా నడుస్తూనే ఉంది. వెదజల్లే పద్ధతి, యంత్రాలతో నాట్లు వేసే పద్ధతిలో ఇప్పటి వరకు 31,289 హెక్టార్లలో మాత్రమే పూర్తయింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు లేక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడారుతున్న నారుమళ్లు ● నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం కురవకపోవడంతో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు కాలువల్లోని నీటిని ఇంజిన్ల సాయంతో తోడి నారుమళ్లు తడిపే పరిస్థితి తలెత్తింది. గతేడాది ఇదే సమయానికి వర్షాలు పుష్కలంగా కురిశాయి. నాట్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది మాత్రం నెల రోజులు ఆలస్యంగా సాగుతోంది. ● రాజానగరం నియోజకవర్గం దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం, గాదరాడ, కోటి, శ్రీరంగపట్నం, బొమ్మిల్లంక, మునగాల గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో నారుమడి దశలోనే ఉన్నాయి. ఆకు మడులు ఎండుతున్న నేపథ్యంలో ఇంజిన్ల ద్వారా తడి ఇస్తున్నారు. బోర్ల నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో తప్ప .. మిగిలిన ప్రాంతాల్లో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోరుకొండ మండలంలో సుమారు 5,000 హెక్టార్లలో ఈ పరిస్థితి తలెత్తింది. ● గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటికోసం నిరీక్షణ తప్పడం లేదు. నీటి కోసం బోరుబావులపై ఆధారపడుతుండటం, అవి సక్రమంగా పనిచేయపోవడంతో నారుమళ్లు తడారుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో నాట్లకు ఆటంకం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసిన అనంతరం నీరు పుష్కలంగా ఉండాలి. అప్పుడే పంట దిగుబడి ఆశించిన మేర అందుతుంది. ‘తూర్పు’లో 83,918 హెక్టార్లలో సాగు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2025–ఖరీఫ్ సీజన్లో 83,918 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, మొక్కజొన్న 181, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. సన్నరకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, 2270, 2846, ఎన్ఎల్ఆర్–3238 వంటి రకాలతో పాటు ఎంటీయూ–1318 వంటి నూతన రకాలను సాగు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కరుణించని వరుణుడు జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచి వరుణడు కరుణించడం లేదు. ఈ నెల 8వ తేదీన చిరుజల్లులు కురిశాయి. నల్లజర్లలో 3.4 మిల్లీ మీటర్లు, గోకవరంలో 1.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో చినుకు జాడ లేదు. పంటసాగుకు అనువైన సమయంలో వర్షం కురవకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నాట్లు ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 76,941 హెక్టార్లలో వరి సాగు అవుతుంది. జిల్లావ్యాప్తంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. గోకవరంలో 5,195 హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 117 హెక్టార్లలో మాత్రమే నాట్ల ప్రక్రియ పూర్తయింది. పెరవలిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,319 హెక్టార్లు కాగా.. నాట్లు కేవలం 48 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. కేవలం రెండు మండలాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. -
వైవిధ్య వరితం!
ప్రయోగాత్మకంగా చేపట్టాను నేను 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలు వేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాను. ఇటీవల నీటి ఎద్దడిని అధిగమించేలా ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేసే విధానాన్ని నా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టాను. దీంతో మా పొలంలో ఒక ఎకరంలో ఈ పద్ధతిలో వరి సాగు చేశాం. దుక్కి దున్నిన పొలంలో ఎటువంటి తడి లేకుండా పొడి విత్తనాలను సాగు చేశాం. – పాటి శ్రీనివాసు, ప్రకృతి వ్యవసాయ రైతు, వెల్దుర్తి, పిఠాపురం మండలం పిఠాపురం: నీటి వినియోగంతో సాగయ్యే పంట కావడంతో వరికి వాతావరణ పరిస్థితులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారు పోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. దీంతో ఆరుతడి పంటగా వరిని సాగు చేసే పద్ధతికి ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో నారు నీరు లేకుండా, కూలీలతో పని లేకుండా రైతులు నేరుగా వరి సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలు అంటే కేవలం వాణిజ్య పంటలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కాని మెట్ట ప్రాంతంలో నీరు అంతగా అందని పొలాల్లో వాణిజ్య పంటలకు బదులుగా వరి సాగు చేసే విధానాన్ని అధికారులు ప్రారంభించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరుతడి పద్ధతిలో వరి సాగును ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం ఎలియాజరు నేతృత్వంలో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రారంభించారు. నష్టాల సాగుకు చెక్ పెట్టాలని.. వర్షాలు సరైన సమయంలో కురవక పోవడం తద్వారా కాలువల్లో సాగు నీరు ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల వరి సాగు కత్తిమీద సాముగా మారింది. దీంతో నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం నిర్ణీత సమయానికి వీలు పడడం లేదు. దీనివల్ల పంటలు ఆలస్యం అవ్వడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించినా రైతులు నష్టాల పాలవుతున్నారు. వ్యవసాయం చేయడం దండగ అనే నిరాశ రైతులను ఆవహిస్తోంది. చెరువులు, కాలువలు, నీటి వనరులపై ఆధారపడి పండించే పంటలు ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అయితే కొన్నిచోట్ల భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం లేదు. దీనికి తోడు కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలకు చెక్ పెడుతూ తక్కువ పెట్టుబడితో తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి వరి సాగుకు రైతులను అధికారులు సంసిద్ధం చేశారు. ఆరుతడితో అన్నీ లాభాలే ఆరుతడి పద్ధతిలో సాగు చేసిన వరి.. మామూలు పంట కంటే 15 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. పంట దిగుబడి 15 శాతం పెరుగుతుంది. కూలీల ఖర్చులు అవసరం లేదు. సాగు నీటి వసతి అంతంత మాత్రమే సరిపోతుంది. దీంతోపాటు నారుమడి తయారు చేయాల్సిన అవసరం, నారు వేసే ఖర్చు లేదు. నారు తీసే ఖర్చు ఉండదు. దీనివల్ల ఎకరానికి సుమారు రూ.10 వేలు మిగులుతాయి. ఈ పంట సాగుకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. కేవలం వర్షం నీరు సరిపోతుంది. వేసవిలో దుక్కి అయిన తరువాత వర్షం పడినప్పుడు నేరుగా యంత్రాలతో ఎరువులు, విత్తనాలు పొడిగా ఉన్నప్పుడే చల్లుకోవచ్చు. అదే నారుమడి తయారీకి అయితే ఎకరానికి సుమారు 30 కేజీల విత్తనం అవసరం అవుతుంది. ఆరుతడి పంటకు అయితే కేవలం 15 కేజీల విత్తనంతో ఒక ఎకరం సాగు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 15 కేజీల విత్తనాలకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆరుతడిలో వరుసల క్రమంలో దుబ్బుకు దుబ్బుకు మధ్య దూరం సమంగా ఉండడం వల్ల గాలి,వెలుతురు బాగా తగిలి పంట దిగుబడి మామూలు దాని కంటే ఎక్కువ వస్తుంది. తెగుళ్లు అంతగా సోకే ప్రమాదం కూడా ఉండదు. నారు, తడి లేని పంట! ఆరుతడి పంటగా వరి సాగు ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాత్మకంగా.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చేలా కృషి కాకినాడ జిల్లా వెల్దుర్తిలో సాగు ప్రారంభంప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి వరి సాగు ప్రారంభించాం. వీటికి దేశీయ వరి రకాలైన నవారా, మైసూర్ మల్లిక, నారాయణ కామిణి, చిట్టి ముత్యాలు మోడల్ వేయించాం. ప్రస్తుతం నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో ఈ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చాం. ముందుగా ప్రధాన పొలంలో 400 కేజీల బయోచారు కలిపిన ఘనజీవామృతం వేయించాం. విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తనానికి విత్తనానికి మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉండేలా నాటించాం. నాలుగు వరుసలు వరి విత్తనాలు నాటిన తర్వాత ఒక వరుస ఆకుకూరలు, మళ్లీ నాలుగు వరుసలు వరి విత్తనాలు మళ్లీ కాయగూరలు 4:1 నిష్పత్తిలో నాట్లు వేయించాము. ఈ సాగు పద్ధతుల్లో ప్రధానంగా నీటిని ఆదా చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో సాగు చేయవచ్చు. విభిన్న రకాల పంటలు వేయడం వలన పురుగులు, తెగుళ్ల ఉధృతిని అరికట్టవచ్చు. ప్రధాన పంట ఆదాయంతో పాటుగా అంతర పంటల వల్ల ఆదాయం పొందవచ్చు. రైతుకి పెట్టుబడి తగ్గడంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులుగా, గో ఆధారతమైన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, వృక్ష సంబంధమైన కషాయాలు ఉపయోగించి పంటలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి తీసుకురావచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతుకు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లాలో పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాం. త్వరలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసే విధంగా రైతులను సంసిద్ధం చేస్తున్నాం. – ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా మేనేజర్, కాకినాడ -
కోట శ్రీనివాసరావుతో ఏరా ఏరా అనుకునే స్నేహం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కోట శ్రీనివాసరావు మరణం పట్ల నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్మిత్రా తీవ్ర సంతాపం తెలిపారు. ‘కోట, నేను కలిసి దగ్గరగా 50 సినిమాలు చేశాం. ప్రాణం ఖరీదు, బాబాయి అబ్బాయి, అలీబాబా అరడజను దొంగలు, ఏవండీ ఆవిడ వచ్చింది, హై హై నాయక, చిన్నబ్బాయి, 420, కత్తి కాంతారావు తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఏరా ఏరా అనుకునేంత స్నేహం ఉంది. రాజమండ్రిలో నా ఆర్కెస్ట్రా 25వ వార్షికోత్సవానికి కోటశ్రీనివాసరావు హాజరై స్టేజ్పై మిమిక్రీ చేశాడు. చాలా గొప్ప కళాకారుడు, విలక్షణ నటుడు, మంచి వ్యక్తి. ఆయన చనిపోవటం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన పేర్కొన్నారు. అన్నపూర్ణ టాకీస్ను సందర్శించిన ‘కోట’ అమలాపురం రూరల్: అప్పట్లో కోట శ్రీనివాసరావు అమలాపురం మండలం సమనసలోని స్టేట్బ్యాంకుకు విచ్చేశారు. ఆయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో అమలాపురం మండలం సమనసలోని స్టేట్ బ్యాంకుకు విచ్చేశారు. అక్కడ బ్యాంకు మేనేజర్ను కలిసిన సందర్భంగా అప్పటి సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావును కలుసుకుని ఆయన నడుపుతున్న అన్నపూర్ణ టాకీస్ను సందర్శించారు. అన్నపూర్ణ టాకీస్ వద్ద కోటను సర్పంచ్ రాజారావు ఆధ్వర్యంలో సత్కరించారు. అప్పట్లో కోట శ్రీనివాసరావు ను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. 1987 లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో అన్నపూర్ణ టాకీస్లో ప్రతిఘటన సినిమా ఆడుతోంది. కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాజీ సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావు గుర్తు చేసుకుని ఆయన మృతికి సంతాపం తెలిపారు. భలే ఖైదీలు షూటింగ్లో కోటతో శ్రీరామ వరప్రసాద్ రాంకీ నిరోషా హీరో హీరోయిన్లుగా బీవీఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే ఖైదీలు సినిమా షూటింగ్ 1992లో కాకినాడలో జరిగింది. ఈ సినిమాలో కై కాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను కాకినాడలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రైవేట్ బస్సు కండక్టర్గా అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి శ్రీరామవరప్రసాద్ నటించారు. కోట శ్రీనివాసరావు, సత్యనారాయణతో కలిసి నటించిన సన్నివేశాలు ఇప్పటికీ మర్చిపోలేనని శ్రీరామ వర ప్రసాద్ తెలిపారు.నటుడు, గాయకుడు జిత్మోహన్మిత్రా -
మాణిక్యాంబా అమ్మవారికి ఆషాఢం సారె
రామచంద్రపురం రూరల్: పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 వ శక్తి పీఠంగా అలరారుతున్న ద్రాక్షారామలో మాణిక్యాంబా అమ్మవారికి భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢం సారెను అందజేశారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో శాకంబరిగా అలంకరించారు. ద్రాక్షారామకు చెందిన స్వీట్ స్టాల్ అధినేత కంచెర్ల చక్రధరరావు(చక్రి) సుమారు 150 కేజీల వివిధ రకాల స్వీట్లు అమ్మవారికి సారెగా సమర్పించారు. పలువురు మహిళా భక్తులు స్వీట్లు, పండ్లు అమ్మవారికి సారె తీసుకువచ్చారు. అమ్మవారి పుట్టిల్లు అయిన వేగాయమ్మపేట నుంచి శోభాయాత్రగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో సారెను తోడ్కొని వచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, వేగాయమ్మపేట జమీందార్ వాడ్రేవు సుందర రత్నాకరరావు, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ పాల్గొన్నారు. -
ఘనంగా కవలల సమ్మేళనం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కవల పిల్లల పెంపకం, వారి జీనవ విధాన శైలి తదితర అంశాలను తెలియజేయాలని వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 108 కవల పిల్లల జంటలను ఒకే చోట ఉంచి వారి ప్రతిభ పాటవాలను వెలికితీయడానికి కాకినాడ సూర్యకళా మందిరం ఆదివారం వేదికగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్, అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నాళం అండాళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ, జిల్లా గవర్నర్ బంగర్రాజు, వైస్ ప్రెసిడెంట్ సిద్దా వెంకటసూర్యప్రకాశరావులు హాజరై వాసవీ క్లబ్ ఆశయాలు, విశిష్టిత తెలియజేశారు. కవల పిల్లలకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు. అనంతరం ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా సుచిత్ర, చావలిసూర్యకుమారి, రాజ్యలక్ష్మి వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి గర్లపాటి శ్రీనివాసులు, బొడా సాయిసూర్యప్రకాష్, సూజాత, గ్రంధి బాబ్జి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.దక్షిణాది రాష్ట్రాల నుంచి 108 మంది హాజరు -
జైలుకు లైంగిక వేధింపుల నిందితులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీరాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్లకు ఆదివారం కాకినాడ సెకండ్ ఏజేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం కాకినాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి థర్డ్ ఏజేఎఫ్సీఎం కోర్టు ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.20 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. రామకృష్ణారావుపేటకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పీఎస్లో కేసు నమోదు కాగా, ఈ కేసులో ఆదివారం మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులు కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మీరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను పోలీసులు కాకినాడ సబ్ జైలుకు తరలించారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతిరాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ – రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్పై మృతి చెంది ఉన్నాడని రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్ఐ లోవరాజు ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ చొక్కా, బ్లాక్ ప్యాంట్ ఉన్నాయని, చెవికి పోగులు ఉన్నాయని చెప్పారు. పై వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉంటే సీఐ 9440627551,ఎస్ఐ–9491444022, నంబర్లకు తెలియజేయాలన్నారు. ఇంటికి వెళుతూ వృద్ధుడి మృతిబిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని రాజానగరం వెళ్లే బస్సు స్టాప్ వద్ద వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం బలభద్రపురం గ్రామంలోని రాజానగరం బస్స్టాప్ వద్ద గుర్తు తెలియన వృద్ధుడు మృతి చెందినట్లు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందిందన్నారు. మృతుడు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి గంపల రాముడు (79)గా గుర్తించారు. అతను అనపర్తి మండలం పులగుర్త గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నట్లు, సైకిల్పై ఇంటికి వెళుతూ బలభద్రపురం వచ్చిన తరువాత ఒక్కసారిగా పడిపోయి మృతి చెందినట్టు తెలిపారు. అతని కుమారుడు నానాజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీ తరలించినట్లు తెలిపారు. ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై లైంగిక వేధింపుల కేసుఅమలాపురం టౌన్: అమలాపురం ఇరిగేషన్ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తనను ఉద్యోగ పరంగానూ, లైంగికంగానూ వేధిస్తున్నారని అదే కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఓ మహిళ పట్టణ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి తనను డీఈఈ వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ సీతానగరం: మండలంలోని రఘుదేవపురం రవీంద్ర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగిందని ఎస్సై డి.రామ్ కుమార్ ఆదివారం తెలిపారు. సురవరపు మణికంఠ అక్క నిడదవోలులో ఉంటున్నారు. రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి రాగా తాళం బద్దలు కొట్టి ఉంది. లోపల సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన మణికంఠ పోలీసులకు సమాచారం అందించాడు. నాలుగు కాసుల బంగారు బిస్కట్, 90 తులాల వెండి, రూ.3.90 లక్షల నగదు పోయిందని గుర్తించారు. ఎస్సై ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీను సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆస్తి తగాదాలో ఒకరికి కత్తిపోట్లుకరప: గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఒకరు కత్తిపోట్లకు గురికాగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కరప గ్రామం మెరకవీధిలో బేరి రామకృష్ణ కింది పోర్షన్లోను, బేరి రాజ రాజేశ్వరి పైపోర్షన్లోను నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదం జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బేరి రామకృష్ణ వియ్యంకుడు అమజాల వీరరాఘవ బిక్కవోలు నుంచి భోజనం క్యారేజీ పట్టుకుని వచ్చారు. అదే సమయంలో రాజరాజేశ్వరి ఆస్తి తగాదా విషయంపై రామకృష్ణతో గొడవ పడుతుండగా రాఘవ కూడా ఆ గొడవలో కలగచేసుకున్నారు. రాజరాజేశ్వరి కుమారుడు చంద్రశేఖర్ అక్కడకు వచ్చి రామకృష్ణ, రాఘవలతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరిని చంపాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొచ్చి రాఘవ ఎడమ చేతిపై రెండుచోట్ల నరికాడు. చుట్టుపక్కలవారు వచ్చి రాఘవను కాపాడి, చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంఎల్సీ స్టేట్మెంట్పై కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
తగ్గుతున్న గోదావడి
ఫ నేడు మరింత తగ్గే అవకాశం ఫ కడలిలోకి 6.14 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: వరద గోదావరి తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి ఉధృతి తగ్గడంతో ఆదివారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా ఉరవడి తగ్గింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద ఉదయం అత్యధికంగా 6,56,341 మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రికి నీటి ఉధృతి తగ్గడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. రాత్రి 6,14,762 క్యూసెక్కుల నీటిని కడలిలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 10.90 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.60 అడుగులకు తగ్గింది. ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో..) కాళేశ్వరం 7.32 పేరూరు 11 దుమ్ముగూడెం 8.72 కూనవరం 14.78 కుంట 6.20 పోలవరం 10.59 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.09 అత్యవసర సహాయానికి సంప్రదించండి రాజమహేంద్రవరం సిటీ: గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, అయినప్పటికీ అత్యవసర సహాయం కావాల్సి వస్తే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112, 1070, 1800 425 0101 నంబర్లలో సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేంత వరకూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లరాదని, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్లడం వంటివి చేయరాదని ప్రఖర్ జైన్ సూచించారు. -
మడి.. తడారి..
కృష్ణాకు నీరు తీసుకెళ్లాలనే తహతహ పోలవరం కుడి కాలువ పొంగి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాలువలో నీటి ప్రవాహం ఉంది. కృష్ణాకు నీరు తీసుకు వెళ్లాలనే ప్రభుత్వం తహతహలాడుతోంది. వర్షాలకు రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం కాలువకు నీరు ఇవ్వక పోవడంతో చేలు దెబ్బ తింటున్నాయి. పోలవరం కాలువ పొంగుతుండగా, తాడిపూడి ఎండిపోయింది. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే పంటలు కోలుకుంటాయి.– సత్తి జగదీశ్వరరెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, గోపాలపురం నియోజకవర్గం ఇదీ.. తాడిపూడి.. తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి తీరాన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన జిల్లా మెట్ట ప్రాంతంలోని కొవ్వూరు, గోపాలపురంతో పాటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, నిరుపయోగంగా ఉన్న భూములను ఈ పథకం ద్వారా సాగులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించారు. సుమారు రూ.400 కోట్లతో ఈ పథకం పనులు పూర్తి చేశారు. ప్రధాన కాలువపై 4 సబ్ లిఫ్టులు ఏర్పాటు చేశారు. 2008లో పనులు పూర్తి కాగా, నాటి సీఎం వైఎస్సార్ నీటిని విడుదల చేశారు. 11 మండలాల్లో సుమారు 78 కిలోమీటర్ల పొడవున తాడిపూడి కాలువ విస్తరించి ఉంది. ప్రధాన పంపు హౌస్ వద్ద 8 మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో 6 మోటార్లను వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం కాగా, వైఎస్ తదనంతరం వచ్చిన ప్రభుత్వం కాలువ పనులు పూర్తి చేయలేదు. దీనికితోడు ప్రధాన కాలువ గట్లు బలహీనంగా ఉండటం వంటి కారణాలతో అధికారుల లెక్కల ప్రకారం 1.56 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దేవరపల్లి మండలం బందపురం వద్ద ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం 5వ సబ్ లిఫ్టు ఫ తాడిపూడి ఆయకట్టులో ఎండిపోతున్న చేలు ఫ ఈ నెల 3న హడావుడిగా నీరు విడుదల చేసిన మంత్రి ఫ ఆ వెంటనే మోటార్లు ఆఫ్ చేసిన అధికారులు ఫ దేవరపల్లి సబ్లిఫ్ట్ మరమ్మతుల పేరుతో కాలయాపన ఫ కాలువకు విడుదల కాని నీరు ఫ ఆయకట్టులో దెబ్బ తింటున్న వరి చేలు ఫ తగ్గిన భూగర్భ జలాలు ఫ రైతుల గగ్గోలు దేవరపల్లి: సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో వేసిన వరి చేలు ఎండిపోతున్నాయని, వెంటనే కాలువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల గడచినా ఇంత వరకూ కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి చెంతనే ఉన్న తమ భూములకు చుక్క నీరు ఇవ్వకపోగా, ఎక్కడో ఉన్న కృష్ణా, రాయలసీమ రైతులకు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కాలువకు నీరు విడుదల చేసినట్టే చేసి, నిలిపివేయడంతో తాడిపూడి ఆయకట్టు పొలాల్లో వరి చేలు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంత వరకూ నాట్లు కూడా పడని దుస్థితి నెలకొంది. మరోవైపు బోర్ల కింద వేసిన చేలకు సైతం పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. భూగర్భ జలాలు 10 నుంచి 15 అడుగులకు పడిపోవడంతో బోర్ల నుంచి నీరు తక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు కాస్తూండటంతో చెరువులు, బోర్ల కింద వేసిన వరి ఆకుమడులు దెబ్బ తింటున్న పరిస్థితి నెలకొంది. మంత్రి స్వయంగా నీరు విడుదల చేసినా.. కాలువలో జలకళ కానరాకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ఒకపక్క ఎండిపోతున్న చేలను, మరోవైపు నీరు లేక వెలవెలబోతున్న కాలువను చూచి ఆవేదన చెందుతున్నారు. చుక్క నీరు లేని తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ చుక్క నీరు లేక.. ఈ చిత్రం చూడండి. ఇది తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ. ఈ పథకం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఈ నెల 3న ఆర్భాటంగా సాగునీరు విడుదల చేశారు. ‘రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుంది. రైతులకు సకాలంలో సాగునీటిని అందజేస్తాం’ అంటూ అప్పట్లో మంత్రి గొప్పగా చెప్పారు కూడా. ఇది జరిగి అప్పుడే పది రోజులు గడిచింది. ఈపాటికే ఈ కాలువ నిండుగా ప్రవహించాలి. కానీ, చుక్క నీరు కూడా రావడం లేదు. మంత్రి మోటార్లు ఆన్ చేసి అలా వెళ్లగానే అధికారులు వెంటనే మోటార్లు ఆఫ్ చేసి, నీటి విడుదలను నిలిపివేశారు. కాలువ, సబ్ లిఫ్టుల నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయించని ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం. దేవరపల్లి సబ్ లిఫ్టు మరమ్మతులు పూర్తయితే తప్ప నీరు విడుదల చేసేది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ తాడిపూడి కాలువలో నీరు ప్రవహించకపోవడంతో ఆయకట్టులో చేలు ఎండిపోతున్నాయి. గోదావరి జలాలు కృష్ణార్పణం ఈ చిత్రం కూడా చూడండి. ఇది తాడిపూడి కాలువ గట్టును ఆనుకునే ఉన్న పోలవరం కుడి కాలువ. పక్కనే ఉన్న తాడిపూడి కాలువలో చుక్క నీరు లేకపోగా.. పోలవరం కుడి కాలువ మాత్రం గోదావరి జలాలతో నిండుకుండను తలపిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ కాలువ నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిన తమకు నీరు ఇవ్వకుండా.. ఎక్కడో ఉన్న కృష్ణా జిల్లాకు పది రోజులుగా నీరు తరలించుకుపోతున్నారని స్థానిక రైతులు ఆక్షేపిస్తున్నారు. తమ పంటలను ఎండబెట్టి, అక్కడి రైతులు మాత్రమే పచ్చగా ఉండాలని ప్రభుత్వం తాపత్రయపడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ నీరు ఇవ్వకపోతే పంటలు ఏవిధంగా సాగు చేయగలమని ఆవేదన చెందుతున్నారు. -
నాలుగు రోజులు ఇలాగే ఉంటే..
తాడిపూడి కాలువ కింద వరి చేలు ఎండిపోతున్నాయి. కాలువకు నీరు విడుదల చేయడంతో నాట్లు వేశాం. మూడు మోటార్ల కింద 20 ఎకరాల్లో వరి పంట వేశాను. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోయి నీరు తక్కువగా వస్తోంది. ఇక్కడి రైతులకు నీరు ఇవ్వకుండా పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు తీసుకు వెళుతున్నారు. గోదావరి చెంతనే ఉన్న పంటలకు నీటి సమస్య ఏర్పడింది. పరిస్థితి మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటే ఊడ్చిన చేలు ఎందుకూ పని చేయవు. సమస్య చెబుదామంటే అధికారులు ఫోన్ తీయడం లేదు. – కలగర భూపతిరావు, రైతు, కరుకూరు, దేవరపల్లి మండలం భూగర్భ జలాలు తగ్గాయి ఇంత వరకూ తాడిపూడి కాలువకు నీరు విడుదల చేయలేదు. ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గాయి. బోర్లు సరిగా తోడటం లేదు. బోర్ల కింద వేసిన వరి నాట్లు నీరు లేక దెబ్బ తింటున్నాయి. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే అన్ని పంటలకూ మేలు జరుగుతుంది. ఆయకట్టుకు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా నీరు తోడతాయి. ప్రధాన కాలువ పనులు పూర్తి కావలసి ఉన్నాయి. పంట కాలువలు లేవు. కాలువ గట్లు వర్షాలకు గండ్లు పడి బలహీనంగా ఉన్నాయి. కాలువను ఆధునీకరించి, గట్టు పటిష్టం చేసి, పంట బోదెలు ఏర్పాటు చేయాల్సి ఉంది. – మల్లిన వెంకటేశ్వరరావు, రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం మరమ్మతులు జరుగుతున్నాయి తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద దేవరపల్లి వద్ద ఉన్న సబ్ లిఫ్టు మరమ్మతులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పంపు హౌస్లోకి వర్షపు నీరు వెళ్లి మోటార్లు మట్టితో పూడుకుపోయాయి. ఆ మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం వద్ద మూడు మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నాం. 26వ కిలోమీటరు వరకూ నీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల్లో కాలువకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తాం. ఈ సీజన్లో 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. – రామేశ్వర నాయుడు, డీఈఈ, తాడిపూడి ఎత్తిపోతల పథకం -
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్పై దాడి హేయం
రాజమహేంద్రవరం సిటీ: కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ అయిన ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తూంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తూంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నా మా అనే అనుమానం కలుగుతోందన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఏడాదికి పైబడి వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. వేలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని, భవిష్యత్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలని భరత్రామ్ హెచ్చరించారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండబోరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉప్పాల హారికకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అండగా నిలబడతామని భరోసా కూడా ఇచ్చారని భరత్రామ్ అన్నారు. ఇకపై కఠినంగా ప్లాస్టిక్ నిషేధం రాజమహేంద్రవరం సిటీ: నగరంలో ఇకపై ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై ఉన్న నిషేధాన్ని ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 75 మైక్రాన్ల లోపు మందం ఉండే ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పలుచని ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, అలంకరణకు వాడే థర్మకోల్ తదితర వస్తువులపై నిషేధం ఉందని వివరించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారు శిక్షార్హులని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా చేటు చేస్తోందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన ప్రజలు ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకందారులు, నిల్వ చేసేవారు, పంపిణీదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడమే కాకుండా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ఇకపై క్లాత్, జ్యూట్ బ్యాగ్లే వినియోగించాలన్నారు. ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. -
పరిమితికి లోబడి పొగాకు సాగు
ఫ రైతులకు టొబాకో బోర్డు ఆర్ఎం ప్రసాద్ సూచన ఫ 2025–26 పంట కాలానికి ఉత్పత్తి ఖరారు ఫ రాష్ట్రంలో 142 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి దేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలానికి ఉత్పత్తిని ఖరారు చేసినందున రైతులు పరిమితికి లోబడే పొగాకు సాగు చేయాలని బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ సూచించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రీజియన్ పరిధిలోని ఉత్తర తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో బ్యారన్కు 35.15 క్వింటాళ్ల చొప్పున 49.70 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. 2024–25 పంట కాలంలో బ్యారన్కు 41.25 క్వింటాళ్ల చొప్పున 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2023–24 పంట కాలంలో బ్యారన్కు 25 క్వింటాళ్ల చొప్పున ఉత్పత్తికి అనుమతి ఇచ్చారని చెప్పారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలో 148 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు ప్రసాద్ తెలిపారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో బ్యారన్కు 3,512 కిలోల చొప్పున 49.70 క్వింటాళ్లు, దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలో బ్యారన్కు 3,656 కిలోల చొప్పున 48.10 మిలియన్ల కిలోలు, దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్) బ్యారన్కు 3,565 కిలోల చొప్పున 42.10 మిలియన్ల కిలోలు, ఉత్తర ప్రాంత నల్లరేగడి నేలలోల్ల (ఎన్బీఎస్) బ్యారన్కు 2,102 కిలోల చొప్పున 2.10 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను దృష్టిలో పెట్టుకుని 142 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి అనుమతించారని చెప్పారు. 2025–26 పంట కాలంలో రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యత పెంపుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది నుంచి మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు ప్రసాద్ తెలిపారు. బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు మాత్రమే పొగాకు సాగు చేయాలని స్పష్టం చేశారు. కేటాయించిన కోటా మేరకు మాత్రమే పండించాలని, అధిక విస్తీర్ణంలో పండించరాదని చెప్పారు. అనధికారికంగా బ్యారన్లు నిర్మించరాదని, రిజిస్టర్ అయిన రైతులు అనధికారికంగా బ్యారన్లు నిర్మిస్తే రిజిస్ట్రేషన్లు నిలుపు చేస్తామని హెచ్చరించారు. పొగాకుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని లాభాలు పొందాలని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తిలో మన దేశం 3, ఎగుమతుల్లో 2 స్థానాల్లో ఉందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో పొగాకు ఉత్పత్తి 3,762 మిలియన్ల కిలోల నుంచి 4,197 మిలియన్ల కిలోలకు పెరిగిందని చెప్పారు. బ్రెజిల్, జింబాబ్వే, చైనా దేశాల్లో పొగాకు ఉత్పత్తి అధికంగా జరిగినందున ప్రస్తుతం మన రైతులు పండించిన పొగాకును మంచి ధరకు అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా లో గ్రేడ్ పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయని ప్రసాద్ చెప్పారు. -
కూటమి పాలనలో దళితులకు రక్షణ కరవు
● బాధిత మహిళను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం దారుణం ● మాజీ హోం మంత్రి తానేటి వనిత అనపర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు అందున మహిళలకు రక్షణ కరవైందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. దుప్పలపూడి గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్ము బుజ్జిపై పాశవిక దాడి జరిగి, వారం రోజులు కావస్తున్నా బాధితురాలిని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనీసంగా కూడా పరామర్శించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత నల్లమిల్లి వెంకటరెడ్డి సెటిల్మెంట్ వ్యవహారంలో దాడికి గురై, అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ కొమ్ము బుజ్జిని వనిత శనివారం పరామర్శించారు. ఆమెతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కూడా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వనిత, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నాయకులు పెత్తందారీ పోకడలకు పోతున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటికి వస్తున్న తనపై.. తమ మాట వినలేదనే కక్షతో సుమారు 15 మంది దారి కాచి, వీధి లైట్లు ఆర్పివేసి, రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని బాధిత మహిళ కొమ్ము బుజ్జి చెబుతోందని అన్నారు. అయినప్పటికీ పోలీసులు ఆమె రోదనను పట్టించుకోకుండా.. సంబంధం లేని సెక్షన్లు పెట్టి, కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తూంటే తన అనుచరులను కాపాడుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఒక పతకం ప్రకారమే ప్రజల్లో భయాందోళనలు సృష్టించి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ రెడ్బుక్ పట్టుకుని తిరుగుతూంటే.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా వారి బాటలోనే అమాయక ప్రజలపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో ఆందోళన చెందుతున్న బాధిత మహిళకు, ఆమె కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని, అలాగే కేసులోని సెక్షన్లు మార్చి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అస్మదీయులకే సంపద సృష్టి
● టీడీపీ నేతల చేతుల్లోకి ఎఫ్సీలు ● కాకినాడ, రాజానగరం ఏటీఎస్లు వారికే.. ● గతంలో రవాణా శాఖ పరిధిలోనే ఎఫ్సీల జారీ ● నేడు ప్రైవేటీకరించడంపై సర్వత్రా నిరసన సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే మద్యం, ఇసుకను కట్టబెట్టడంతో కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఈ శాఖలో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల (ఎఫ్సీ) జారీ సేవలను టీడీపీ నేతలకు చెందిన ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఎఫ్సీల జారీలో రాష్ట్ర రవాణా శాఖను డమ్మీగా చేసేశారు. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఇప్పటి వరకూ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు ఎఫ్సీలు జారీ చేసేవారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ ప్రకారం చలానా కట్టించుకుని ఎఫ్సీ మంజూరు చేసేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లైట్, హెవీ మోటార్ వెహికల్స్కు ఎఫ్సీల జారీ చేసే పనిని తాజాగా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీనిపై ఎవ్వరికీ అజమాయిషీ ఉండదు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. చక్రం తిప్పిన కీలక మంత్రి! కొత్త విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) మంజూరు చేశారు. తొలి దశలో 15 ఏటీఎస్లు ప్రారంభించారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సింహభాగం సెంటర్లను కై వసం చేసుకున్నారు. అది కూడా యువగళం పాదయాత్ర చేసిన వారికే దక్కాయి. దీని వెనుక కీలక మంత్రి ఒకరు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ, రాజానగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచినట్లు తెలిసింది. రూ.కోట్లు కొల్లగొట్టేలా.. ఒక ఏటీఎస్ ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం ఏకంగా రూ.3 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.2 కోట్లు మాత్రమే ఆ ప్రైవేటు సంస్థ వెచ్చించాలి. ఎఫ్సీల జారీ ద్వారా ప్రతి జిల్లాలో రూ.కోట్లు వసూలవుతాయి. కేంద్ర ట్రాన్స్పోర్ట్ ఇండియా సలహా మేరకు ఫిట్నెస్ టెస్ట్ల ద్వారా రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్మును ఆ సంస్థ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక పైసా కూడా చెల్లించనవవసరం లేదు. అటువంటప్పుడు ఆ సంస్థకు సబ్సిడీ ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలూ కలిపి సుమారు 1.80 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 లక్షల వాహనాలు ఎఫ్సీ కోసం వస్తూంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎఫ్సీల జారీని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ప్రభుత్వ ఆదాయానికి ఆమేరకు గండి పడింది. మరోవైపు ఎఫ్సీల జారీని ప్రైవేటు సంస్థకు ఏకంగా 20 ఏళ్లకు రాసివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకే కూటమి ప్రభుత్వం ఇలా దీర్ఘకాలిక లీజులు ఇస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీమళ్లీ చలానాలు ఎఫ్సీ పొందేందుకు తొలుత సంస్థ నిర్దేశించిన మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం నిర్దేశించిన సమయంలోగా వాహనాన్ని తనిఖీ చేయించుకోవాలి. లేదంటే తిరిగి చలానా తీయాల్సి వస్తోంది. గతంలో చలానాకు వారం నుంచి 15 రోజుల వరకూ గడువుండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాహనదారులు వాపోతున్నారు. పైగా గతంలో కంటే చలానా మొత్తాన్ని భారీగా పెంచారని మండిపడుతున్నారు. గతంలో వాహనంలో చిన్నపాటి లోపాలుంటే సరిచేసుకుని వస్తే ఎఫ్సీ ఇచ్చేవారు. ప్రస్తుతం బ్రేక్ ఆయిల్ తక్కువగా ఉండటం చిన్నపాటి లోపాలున్నా అన్ఫిట్ చేసేస్తున్నారు. ఆ విషయం వారం తర్వాత మెసేజ్ ద్వారా తెలుస్తోంది. అప్పటికే చలాగా గడువు ముగిసిపోతూండటంతో మళ్లీ కట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగి రూ.వేలు వసూలు చేస్తున్నారు. దూరాభారం ఏటీఎస్లను జిల్లా కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రాజానగరం వద్ద ఏటీఎస్ పెట్టారు. నల్లజర్ల నుంచి రాజానగరం వచ్చి వెళ్లాలంటే రాను పోను 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది దూరాభారమవుతోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. దీనివలన పనులు మానుకుని రావాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు. ఎఫ్సీల జారీని ప్రైవేటీకరించడంపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యాన రవాణా కార్మికులు రాజానగరం ఏటీఎస్ వద్ద ఇటీవల నిరసన తెలిపారు. చలానాల పెంపు (రూ.లు) వాహనం పాత కొత్త బాదుడు చలానా చలానా లారీ 920 1,320 400 మినీ వ్యాన్ 920 1,320 400 ఎల్ఎంవీ 720 920 200 ఆటో 620 820 200 జిల్లాలో వాహనాలు వాహనం సంఖ్య ద్విచక్ర వాహనాలు 3,41,117 కార్లు 45,404 ఆటో 21,726 గూడ్స్ క్యారియర్లు 20,465 ట్రాక్టర్లు 7,807 ట్రాలీలు 4,896 త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 3,599 ట్రైలర్ (అగ్రికల్చర్) 2,306 స్కూల్, కాలేజీ బస్సులు 1,827 లగ్జరీ టూరిస్ట్ క్యాబ్లు 342 అంబులెన్స్లు 230 జీపులు 150 రోడ్ రోలర్లు 67పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత కేంద్రం తీసుకు వచ్చిన ఎఫ్సీల జారీ ప్రైవేటీకరణ విధానాన్ని తొలుత రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేశారు. వాహన కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు దీని అమలును నిలిపివేశాయి. పాత, కొత్త విధానాల్లో ఎఫ్సీలు చేయించుకునేలా గుజరాత్ వెసులుబాటు కల్పించింది. మిగిలిన రాష్ట్రాలు నూతన విధానం అమలు చేయడం లేదు. కానీ, మన రాష్ట్రంలో సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం అస్మదీయులకు సంపద సృష్టించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లుందనే విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ ప్రైవేటీకరణపై పోరాటం కార్మికులు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఫిట్నెస్ ప్రైవేటీకరణకు నాంది పలకడం దారుణం. దీనిని ఉపసంహరించుకునేంత వరకూ ఉధృతంగా పోరాడతాం. ఈ విషయంలో కార్మిక జేఏసీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం మంచి చేసిందో కార్మికులు గ్రహించాలి. – మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం ఉపసంహరించుకోవాలి ఫిట్నెస్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని తక్షణమే ఉపసంహరించాలి. చలానా విధానంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు సామర్థ్య పరీక్షలు అప్పగిస్తే పారదర్శకత ఏం ఉంటుంది? ఒక వాహనానికి పరీక్ష చేయాలంటే 40 నిమిషాలు పడుతోంది. కొన్ని పాఠశాలలు, కళాశాలలకు చెందిన వాహనాలు సెంటర్ వద్దకు రాకపోయినా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. – వాసంశెట్టి గంగాధరరావు, కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్, రాజమహేంద్రవరం -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
సమన్వయంతో సత్వర న్యాయం
రాజమహేంద్రవరం రూరల్: సమన్వయంతో సత్వర న్యాయం లభించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన నగరంలో శనివారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నమోదైన కేసులపై వివిధ శాఖలను సమన్వయపరిచేలా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈ అర్ధ సంవత్సర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించే న్యాయ, రెవెన్యూ, మెడికల్, మునిసిపల్, ఫోరెన్సిక్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ, ఎకై ్సజ్, జైళ్లు, రైల్వే, విద్య, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసు శాఖ నిత్యం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయా శాఖల ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాఽధికారులను ఎస్పీ నరసింహ కిషోర్ సత్కరించారు. సబ్ డివిజన్ల వారీగా పనితీరు, డ్రోన్ కెమెరాల ప్రత్యేక స్టాల్స్ ఆహూతులను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ నమోదైన కేసులపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కూలంకషంగా చర్చించారు. వచ్చే అర్ధ సంవత్సర కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. గడచిన అర్ధ సంవత్సరంలో వివిధ కేసుల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ సత్కరించారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీలకు శిక్షణ
సామర్లకోట: ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందని ప్రిన్సిపాల్ కరుటూరి నాగ వరప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకత్వ శిక్షణలో భాగంగా మార్పు ద్వారా విజేతలు పేరిట గత నెల 23 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల సిబ్బంది శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 67 మందికి స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. మహిళా ప్రతినిధులకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధులు–బాధ్యతలు, భావవ్యక్తీకరణ వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణకు హాజరై సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుందన్నారు. -
వాడపల్లి క్షేత్రం జన సంద్రం
దేవస్థానం ఆదాయం రూ.62.53 లక్షలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం జనసంద్రమైంది. అంతకంతకూ భక్తజనం పెరుగుతుండడంతో కోనసీమ తిరుమలగా ఈ క్షేత్రం ప్రఖ్యాతమవుతోంది. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. సాధారణ భక్తులతో పాటు శ్రీఏడు శనివారాలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసిపోయింది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.62,52,971 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. లోవ భక్తులకు సత్యదేవుని ప్రసాదం సిద్ధం అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిక్కిరిసిన రత్నగిరిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. రెండో శనివారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచే స్వామివారి సన్నిధికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుడు, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 8.77 పేరూరు 13.87 దుమ్ముగూడెం 11.50 కూనవరం 16.14 కుంట 7.30 పోలవరం 10.78 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94 రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి -
శిష్యుడినని నమ్మించి శఠగోపం
● గురువు ఇంటికి సమీపంలోనే అద్దెకు దిగి అదను చూసి చోరీ ● రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ ● నాలుగు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ అమలాపురం టౌన్: నేను మీ వద్దే చదువుకున్నానని.. ఆ ఉపాధ్యాయుడి ఇంటి పక్కనే మరో ఇంటిలో అద్దెకు దిగిన పూర్వ విద్యార్థి గురువు ఇంటికే కన్నం వేసి విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఘటన వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం పట్టణం రామదుర్గా వీధిలో ఓ డాబా ఇంట్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు దొంతంశెట్టి శ్రీనివాస్ నివసిస్తున్నారు. దేవగుప్త వీరబ్రహ్మం అనే 30 ఏళ్ల యువకుడు ఆయన విద్యార్థినని పరిచయం చేసుకుని ఆయన ఇంటికి సమీపంలోనే మరో ఇంటిలో అద్దెకు దిగాడు. ఈనెల మూడున ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో విశాఖపట్నం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా వీరబ్రహ్మం ఇంటిలోని తలుపు బోల్టును పగలగొట్టి రూ.50 లక్షల విలువైన 463 గ్రాముల బంగారాన్ని దోచుకుని ఉడాయించాడు. ఈ నెల ఏడో తేదీన విశాఖ నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి, సీసీ కెమేరా ఫుటేజీల సాయంతో చోరీకి పాల్పడిన వీరబ్రహ్మంను అరెస్టు చేసి అతని నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులకు ఎస్పీ అభినందనలు కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసిన రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్, సీఐ ఎం.వెంకట నారాయణ, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు, ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్, క్రైమ్ ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు, కానిస్టేబుళ్లు ఏసుకుమార్, సూరిబాబు, అనిల్ కుమార్, లోవరాజు, అర్జున్, ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్లను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇది ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు పి.గిరప్రసాద్వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల నుంచి సిబ్బంది ప్యాటర్న్ మారలేదని, దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందడం లేదని చెప్పారు. కేవలం కొద్దిమంది కాంట్రాక్టు నర్సులు మాత్రమే ఉన్నారని, పలువురు నర్సులు అవసరమని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అతి ముఖ్యమైన ధోబీ, బార్బర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పోస్టులు ఎత్తివేశారని చెప్పారు. అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఒకప్పుడు ఇరవై ముప్పై మంది మాత్రమే అవుట్ పేషెంట్లు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 300కు చేరిందని, కానీ అందుకు తగినట్టుగా సిబ్బంది పెరగలేదని చెప్పారు. -
కండక్టర్ కుటుంబానికి రూ.1.08 కోట్ల పరిహారం
రాజోలు: గత ఏడాది ఊడిమూడి శివారులో ధాన్యం ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కేఎస్ రావు కుటుంబానికి ఆర్టీసీ జోన్–2 ఈడీ విజయరత్నం రూ.1.08 కోట్లు చెక్కును శుక్రవారం అందజేశారు. కండక్టర్ భార్య కె.గంగాభవానికి ఈ చెక్కును అధికారులు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పబ్లిక్ లయబిలిటీ ఫండ్ (ఈడీపీఎల్ఈ) ద్వారా ఈ పరిహారం వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ అండగా నిలుస్తుందని ఈడీ అన్నారు. డీపీటీఓ ఎస్పీపీ రాఘవకుమార్, డిపో మేనేజర్ పి.ధనమ్మ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం
● భక్తుల సూచనలు పాటించి సమస్యలు పరిష్కరిస్తాం ● డయల్ యువర్ ఈవోలో డీసీ అండ్ ఈఓ చక్రధరరావు కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కలిగేలా భక్తుల సూచనలు పాటిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. భక్తుల సూచనలు, సలహాలు తీసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం శ్రీడయల్ యువర్ ఈవోశ్రీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 40 ఫోన్ కాల్స్లో కొందరు భక్తులు ఆలయంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలిచ్చారు. హైదరాబాద్, తాడేపల్లిగూడెం నుంచి ఫోన్ చేసిన భక్తులు పార్కింగ్ సమస్యలను, శనివారం రోజు వచ్చే భక్తులకు అరిటాకులో భోజనం పెట్టాలని కోరారు. దీనికి డీసీ స్పందిస్తూ ప్రతి శనివారం 20 వేల నుంచి 25 వేల మందికి ప్లేట్లలో అన్నప్రసాదం అందిస్తున్నామని, వకుళమాత అన్నదాన భవన నిర్మాణం పూర్తి కాగానే టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి 3,500 మందికి వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నామని, అప్పుడు అరటి ఆకులో భోజనం పెడతామని పేర్కొన్నారు. వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని కనులారా దర్శించి, సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఫ్లైఓవర్ ఏర్పాటు, క్యూలైన్లో తాగునీరు సదుపాయం, చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయం లోపల సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంపై భక్తుల సలహాను పాటిస్తామన్నారు. -
అష్టదేవతల తీర్థయాత్ర స్పెషల్
రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢమాసాన్ని పురష్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అష్టదేవతల ఆలయాలు సందర్శనకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ డిపో నుంచి 50 మంది భక్తులతో బయలుదేరిన ప్రత్యేక బస్సు అష్ట దేవతల ఆలయాల దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకుంటుందన్నారు. ఒక్క రోజులో పూర్తయ్యే ఆ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహిమాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట ఆలయాల దర్శనం అనంతరం తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. 18వ తేదీ శుక్రవారం మరికొన్ని ఆషాఢ మాసం అష్ట దేవతల బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టిక్కెట్లు అవసరమైన భక్తులు 95023 00189, 73829 12141 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓడలరేవు కేంద్రీయ విద్యాలయ భూసేకరణకు రూ.3.30 కోట్లు అల్లవరం: మండలం ఓడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 7.50 ఎకరాల భూసేకరణకు రూ.3.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు.ఎన్నో ఏళ్లుగా కోనసీమ వాసులు ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయ కల సాకారం అవుతోందని తెలిపారు. మన ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు తదితర రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికంగా ఉన్నతమైన సీబీఎస్ఈ విద్యను అందించే అవకాశం కల్పిస్తుందని హరీష్ అన్నారు. మహిళపై బ్లేడుతో దాడి కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉండగా కక్ష పెంచుకున్న మొహిద్దీన్ శుక్రవారం సాయంత్రం జగన్నాథపురం సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ఆమైపె బ్లేడుతో దాడికి పాల్పడి ముఖంపై లోతైన గాయాలు చేశాడు. రక్తమోడుతున్న బాధితురాలు కాకినాడ జీజీహెచ్లో చేరింది. కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
యాత్రికుల సేవలో రైల్వే వన్
● అందుబాటులోకి కొత్త యాప్ ● అనేక సౌకర్యాలతో రూపకల్పన ● కొత్త ఫీచర్ల చేరికతో మరిన్ని సేవలు రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రైలు బోగీలోనే ప్రయాణికులకు వసతులన్నీ వచ్చి చేరేలా రైల్వే వన్ యాప్ను రూపొందించింది. ఇప్పటి వరకూ అనేక యాప్లు ఉన్నప్పటికీ, అన్నింటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ రైల్వే వన్ యాప్లో ఐఆర్సీటీసీ సహా, భారతీయ రైల్వే అందించే దాదాపు అన్ని ప్రధాన సేవలు ఒకేచోట లభిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంల్లో లభ్యమయ్యే ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ సమాచారం, సీటు లభ్యత, ఫుడ్ ఆర్డర్ వంటి అనేక సేవలను పొందే అవకాశం ఉంది. మరిన్ని సేవలు మోర్ ఆఫరింగ్స్ విభాగంలో ప్రయాణికులు జర్నీ కోసం ముందుగానే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్థితినీ చెక్ చేసుకోవచ్చు. కోచ్ స్థానాలను తెలుసుకోవచ్చు. రైల్వే సేవలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు రైల్ మదద్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పలు సమస్యలను నివేదించవచ్చు. ప్రధాన స్టేషన్లలోని అనేక రెస్టారెంట్లలో ఫుడ్ డెలివరీ బుక్ చేసుకునేందుకు పీఎన్ఆర్ నంబరును నమోదు చేసి, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకోండిలా.. ● ముందుగా రైల్వే వన్ యాప్ను ఓపెన్ చేయాలి. ● హోమ్ పేజీలో రిజర్వ్ టికెట్ విభాగంపై క్లిక్ చేయాలి. ● ప్రయాణ వివరాలు, గమ్యస్థానం, తేదీని నమోదు చేయాలి. ● అమౌంట్ పే చేసి, బుకింగ్ను ధ్రువీకరించుకోవాలి. పీఎన్ఆర్ తెలుసుకునేదిలా.. ● హోమ్ పేజీలో మోర్ ఆఫరింగ్స్ కింద ఉన్న పీఎన్ఆర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ● పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి, బుకింగ్ వివరాలు తెలుసుకోవచ్చు. ● రైలు సమాచారం, ప్రయాణ తేదీ, సీటు స్థితి, రాబోయే స్టేషన్లు, తదుపరి స్టాప్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. రైల్ మదద్లో ఫిర్యాదు వీడియో, చిత్రం, ఆడియో ఉపయోగించి సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు. ఏ రైలులో, ఏ రైల్వే స్టేషన్లో సహాయం కావాలనే విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించాలి. సమస్యను స్పష్టంగా వివరించి, ఫిర్యాదును సమర్పించాలి. అద్భుతమైన విధానం ఇప్పటివరకు రైలు ప్రయాణం కోసం టికెట్ల రిజర్వేషన్ కోసం రైలు ఎక్కడుందో తెలుసు కోవ డం కోసం పలు యాప్లలో వెతకాల్సి ఉండేది. నూతనంగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన రైల్వే వన్ యాప్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఈ విధమైన యాప్ రావడం ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణీకులకు సౌకర్యమంతమైన, సులభతరమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. – జతిన్కుమార్ షెలత్, రాజమహేంద్రవరం యూజర్ల సౌలభ్యం కోసం.. ఈ యాప్లో యూజర్ ఇంటర్ఫేస్ సులభంగా ఉంటుంది. హోమ్ పేజీలో వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, వారి పేరు కనిపిస్తుంది. దాని కింద అన్ని సేవలను సూచించే చిహ్నాలుంటాయి. ఈ విభాగంలో ప్రయాణికులు రిజర్వుడ్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్నూ బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తాము కోరుకునే టికెట్ను ఎంచుకుని, వివరాలను నమోదు చేసి, టికెట్లను పొందవచ్చు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
దేవరపల్లి: మండలంలోని గొల్లగూడెంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు గోపాలపురం మండలం వేళ్లచింతలగూడేనికి చెందిన మందపాటి రాజేష్ (24) గోపాలపురంలోని కేబుల్ ఆపరేటర్ శ్రీధర్ రెడ్డి వద్ద పార్ట్ టైమ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం దేవరపల్లి మండలం గొల్లగూడెంలో విద్యుత్ స్తంభం ఎక్కి కేబుల్ వైరు కడుతుండగా, పై భాగంలో ఉన్న 11 కేవీ హైటెన్షన్ లైన్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజేష్ అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. మృతుడి తండ్రి చంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు. -
పవన్కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
కాకినాడ క్రైం: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని, నిందితులకు నేర చరిత్ర ఉన్న విషయాన్ని దాస్తున్నారని ఆరోపించారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్శాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు. -
మహిళలు, బాలికలపై దాడులు అరికట్టేందుకు ప్రణాళిక
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో మహిళలు, బాలికలపై జరిగే దాడులు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, శక్తి టీమ్ల ద్వారా అందుబాటులో ఉంటున్నామని ఎస్పీ డి.నరసింహకిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం వుమెన్స్ హాస్టళ్లలో ప్రతిచోటా పాయింట్ బుక్స్ పెట్టి తరచుగా శక్తి టీమ్లు సందర్శిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, బాలికల స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సరైన నడవడిక కలిగిన వార్డెన్లను ఏర్పాటు చేసేలా, యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. రాత్రి సమయాలలో అసాంఘిక శక్తులను అరికట్టేందుకు ఆరు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విద్యాసంస్థల వద్ద ఉదయం, సాయంత్రం సమయాలలో ఈవ్ టీజింగ్ జరగకుండా శక్తి టీం, డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ అండ్ పోలీస్తో సంయుక్తంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సమాచారాన్ని సులువుగా మార్పిడి చేసుకునే విధంగా సుమారు 100 వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరీవాహక ప్రాంతాలు, పాడు పడిపోయిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 42 మహిళలు, చిన్నపిల్లల మిస్సింగు కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించామని తెలిపారు. -
పెరుగుతున్న గోదావరి వరద
● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ● ఆదివారం నాటికి 8లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదలయ్యే అవకాశం ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి క్రమేపీ పెరుగుతుంది. శుక్రవారం సాయంత్రం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 3,54,341క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనది ప్రాణహిత పొంగి పొర్లుతోంది. దీంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 8లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు దాటి ప్రవహించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. గోదావరి డెల్టా కాలువకు సంబంధించి 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,800, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 11.79 మీటర్లు, పేరూరులో 15.42 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.86 మీటర్లు, భద్రాచలంలో 37.20 అడుగులు, కూనవరంలో 13.60 మీటర్లు, కుంటలో 14.72 మీటర్లు, పోలవరంలో 9.01 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి దగ్గర 13.88 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. -
ధర గెలవలేదు
ఉపాధికి విఘాతం జిల్లాలో అరటి సాగుపై రైతులు 8వేల మంది ఆధారపడితే వీటిని నమ్ముకున్న కూలీలు, వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే కూలీలు, అరటి గెలలను కోసే కూలీలు, అరటి వ్యాపారస్తులు సుమారు 30 వేల మంది ఉన్నారు. మార్కెట్టులో ధరలు తగ్గటం వలన వీరందరికి ఉపాధి లేకపోవటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. గత మేనెలలో అరటి కోతకు వెళ్లిన కూలీలకు రోజుకి రూ.500 నుంచి రూ.1,500 వచ్చేదని నేడు కూలి పనులు దొరకడం లేదని వాపోతున్నారు.● అరటి రేటు పతనంతో నష్టాలు ● మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షలు.. నేడు రూ.90 వేలు ● ముందుకురాని వ్యాపారులు ● గతంలో 100 లారీల ఎగుమతి.. నేడు 40కి పరిమితం ● జిల్లాలో 7,500 హెక్టార్లలో సాగు ● 38 వేల మందికి ఉపాధి పెరవలి: మార్కెట్టులో అరటి ధరలు భారీగా పతనం అవ్వటంతో రైతులు గగ్గోలు పెడుతుండగా, వ్యాపారస్తులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షల ధర పలుకగా ప్రస్తుతం మార్కెట్టులో 10 టన్నుల లారీ రూ.90 వేలకు పడిపోవటంతో రైతులు, వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాడు జిల్లా నుంచి రోజూ 100 లారీలు ఎగుమతులు అయితే నేడు 30 నుంచి 40 లారీలే ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో రైతులు స్వచ్ఛందంగా పక్వానికి వచ్చిన అరటి గెలలను మార్కెట్టుకు తరలించి అయినకాడికి అమ్ముకుంటున్నారు. 6 వేల హెక్టార్లలోనే దిగుబడి జిల్లాలో అన్ని రకాల అరటి 7,500 హెక్టార్లలో సాగు అవుతోంది. ముఖ్యంగా జిల్లాలో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్ళపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఈ సాగు ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 వేల హెక్టార్లలో తోటలు దిగుబడి ఇస్తున్నాయి. కానీ ఇతర రాష్టాలకు ఎగుమతులు తగ్గటంతో స్థానిక మార్కెట్లో అమ్ముకునే దుస్థితి ఏర్పడటంతో ధరలు మరింత పతనం అవుతున్నాయి. తోటలను వదిలేస్తున్న వ్యాపారస్తులు అరటి మార్కెట్టులో జూన్ నెల నుంచి ధరలు పతనం అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కర్పూర అరటి మార్కెట్టులో 10 టన్నుల లారీ రూ.90 వేలు పలకటంతో రైతులు, వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. చేల వద్దకు వ్యాపారస్తులు రాకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ధర పతనంతో అరటి తోటలను కొనుగోలు చేసే వ్యాపారస్తులే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్వానికి వచ్చిన గెలలను కోయకపోతే పండిపోయి మొత్తం పంట పాడైపోతుందని దీనితో కొనే నాథుడే లేకుండా పోతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర కేళీ గెల ఒకటి రూ.250, ఎర్ర చక్కెర కేళీ గెల ఒకటి రూ.300 పలకటంతో వాటిని కొనుగోలు చేసిన వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. ఎందుకంటే తోటలను కొనుగోలు చేసినప్పుడు చక్కెర కేళీ గెల ఒకటి రూ.250 నుంచి రూ.300 కొనుగోలు చేయగా, ఎర్ర చక్కెర కేళీ గెల ఒకటి రూ.300 నుంచి రూ.400కు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్టులో కొనుగోలు చేసిన ధర లభించకపోవటంతో వ్యాపారస్తులు తోటలను వదలివేస్తున్నారు. మార్కెట్టులో ధరలు పతనం అవ్వటంతో రైతులే మార్కెట్టుకు అరటి గెలలను సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తరలించి అమ్ముకుంటున్నారు. మార్కెట్టులో సైకిల్లోడ్ (6 గెలలు) కర్పూర అయితే నాణ్యతను బట్టి రూ.1,000 నుంచి రూ.1,400లు, చక్కెర కేళీ రూ.1,500 నుంచి రూ.2000కు, ఎర్ర చక్కెర కేళీ రూ.2,000 నుంచి రూ.2,500 ధరలు పలుకుతున్నాయి. తగ్గిన ఎగుమతులు జిల్లాలో అరటి ఎగుమతులు నెల రోజులుగా తగ్గిపోయాయి. గతంలో ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ప్రతి రోజూ 80నుంచి 100 లారీల సరకు ఎగుమతి అవ్వగా నేడు ఎగుమతులు 30 నుంచి 40 లారీలకు పడిపోయాయి. గతంలో బెంగాల్లో అరటి సాగు ఉండేది కాదు. నేడు అక్కడ ఇతర రాష్టాలకు ఎగుమతులు చేసే స్థాయికి సాగు రావటంతో ఎగుమతులు తగ్గాయి. ఒడిశాలో నెల రోజులుగా విపరీతమైన వర్షాలు కురవటంతో వినియోగం తగ్గి ఎగుమతులు మందగించాయి. తమిళనాడులో సరకు విపరీతంగా ఉండటంతో అక్కడికి ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని ప్రభావంతో అరటి ధరలు పతనం అవుతున్నాయి. కొనే నాథుడు లేక.. గత ఏడాది కరోనా సమయంలో ఎగుమతులు లేక ఇబ్బందులు పడితే, నేడు కొనుగోలు చేసేవారు కరువవడంతో నానా పాట్లూ పడుతున్నాం. తోటలు కొనే నాథుడు లేక సైకిళ్లు, మోటారు సైకిళ్లపై మార్కెట్టుకు తరలించి అయిన కాడికి అమ్ముకుంటున్నాం. – యాతం మల్లికార్జునరావు, అరటి రైతు, అన్నవరప్పాడు గెలలు కోయటమే మానేశారు తోటలు అమ్మినప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెల ధర రూ.250కి అమ్మాను. కానీ వ్యాపారస్తులు సగం తోట కోసిన తరువాత ధరలు పతనం అవ్వటంతో గెలలు కోయటమే మానేశారు. దీంతో నష్టాలు పాలవుతున్నాం. – కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు రైతులకు తప్పని నష్టాలు ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ధరలు తగ్గటంతో వ్యాపారస్తులు తోటలను అయిన కాడికి అడుగుతున్నారు. దీంతో ఈ సాగు చేస్తున్న రైతులు నష్టాల పాలవ్వక తప్పటం లేదు. – సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం -
బీఎల్ఓలు బాధ్యతగా ఉండాలి
● ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ● జిల్లా కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ ప్రశాంతి రాజమహేంద్రవరం సిటీ: ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో బూత్ లెవెల్ అధికారులకు నిర్వహించిన ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకమన్నారు. శిక్షణ ద్వారా వారి పనితీరులో మెరుగుదలకు అవకాశం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఫారం–6, 6ఏ, 7, 8 ఓటర్ల జాబితా తయారీ, మార్పులు, చేర్పులు, మరణించినవారు, వలస వెళ్లిన వారి వివరాలను పరిశీలించి తుది సమాచారం ఏ విధంగా అందించాలో సూచించారు. విధి నిర్వహణలో బీఎల్ఓలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగంలో గల అధికరణాల గురించి, ఎన్నికలకు సంబంధించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నమోదు చట్టం, తదితర చట్టాలలోని ముఖ్యమైన సెక్షన్లు గూర్చి కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. బీఎల్ఓ పత్రికను ప్రతీ ఒక్కరూ తప్పక చదవాలన్నారు. అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, మేనేజర్ అబ్దుల్ మాలిక్, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
డొక్కలెండుతున్నాయ్!
విద్యుత్ బిల్లుల షాక్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పీచు పరిశ్రమల యజమానులకు విద్యుత్ చార్జీల షాక్ తగులుతోంది. యూనిట్ విద్యుత్ ధర రూ.ఆరు. కానీ అదనపు లోడు వినియోగం, ఇంధన చార్జీలు, అపరాధ రుసుం పేరుతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. యూనిట్ ధర రూ.10 నుంచి రూ.12 వరకూ కావడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. నాలుగు వేల యూనిట్లు వచ్చే మధ్య తరహా పరిశ్రమకు రూ.24 వేల విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, కొంతమందికి రూ.40 వేల వరకూ వస్తోంది. ● కొండెక్కిన కొబ్బరి కాయలు ● తిరోగమనంలో డొక్క ధర ● రైతుల వద్ద టన్నుల కొద్దీ నిల్వలు ● రెండు నెలల కిందట ట్రాక్టర్ సరకు రూ.1,500 ● ఇప్పుడు రూ.500 ఎదురు ఇచ్చి ఎగుమతులు సాక్షి, అమలాపురం: కొబ్బరి ధర కొండెక్కింది.. రికార్డు స్థాయిలో పెరిగింది.. దానికి తగ్గట్టు పెరగాల్సిన పీచు ఉత్పత్తుల ధర తిరోగమనంలో కొట్టుమిట్టాడుతుంది.. ఇలా పీచు పరిశ్రమ విలవిల్లాడుతోంది.. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న కొబ్బరి డొక్క రైతులుకు శిరోభారంగా మారింది. అత్యంత విలువైన డొక్క కొంత రోడ్ల వెంబడి, తోటల్లో చెత్తగా మారిపోతుండగా, మరికొంత అగ్నికి ఆహుతవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పీచు పరిశ్రమ అత్యంత పెద్దది. కొబ్బరి సాగు జరుగుతున్న ప్రాంతాల్లో పీచు, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు భారీ ఎత్తున ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాలు ఉంది. ఇక్కడ కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో క్వాయర్ ఉత్పత్తులది అగ్రస్థానం. విలువ ఆధారిత పరిశ్రమల్లో 80 శాతం క్వాయర్ ఆక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 వరకూ చిన్న, పెద్దా పీచు ఉత్పత్తి కేంద్రాలు ఉంటే, ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 740 వరకూ పీచు, తాళ్ల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీచు ఉత్పత్తి కేంద్రంలో రోజుకు టన్ను నుంచి ఐదు టన్నుల వరకూ పీచు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి రూ.125 కోట్ల విలువైన పీచు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అంచనా. ఎగుమతుల్లో సింహభాగం అంటే 70 శాతం చైనాకు వెళ్తుండగా, మిగిలిన ఎగుమతి మలేషియా, సింగపూర్, జపాన్తోపాటు గల్ఫ్, యూరప్ దేశాలకు ఉంటుంది. అంతకంతకూ పతనం ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.22 పలుకుతోంది. కానీ విచిత్రంగా కొబ్బరి పీచు ధరలు మాత్రం పతనమయ్యాయి. ఎగుమతులూ తగ్గాయి. తడి పీచు కిలో రూ.ఆరు పలుకుతుండగా, పొడి పీచు రూ.8 వరకూ ఉంది. తడి పీచు ఎండబెట్టి బేళ్లుగా మార్చి విక్రయిస్తే కిలో రూ.12 వరకూ వస్తోంది. కానీ పెట్టుబడి వ్యయం పెరగడంతో గిట్టుబాటు కావడం లేదు. తడి పీచు సగటు ధర కిలో రూ.తొమ్మిది వరకూ ఉండగా, ఇప్పుడు రూ.ఆరుకు చేరింది. చివరకు కొబ్బరి తాళ్ల ధరలు సైతం తగ్గాయి. 24 అడుగుల 100 ముక్కల కట్ట హైదరాబాద్ మార్కెట్లో రూ.150 మాత్రమే ఉంది. గతంలో ఇది రూ.220 వరకూ పలికేది. ముంబయికి వెళుతున్న తాళ్లకు మాత్రం రూ.180 వరకూ వస్తోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం ఇటీవల కాలంలో పీచు, తాళ్లు, కొబ్బరి పొట్టు వంటి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగింది. పీచు పరిశ్రమ నష్టాలకు ఇది కొంత కారణమవుతోంది. ఒక్క కార్మికుడికి రోజు వేతనం రూ.600 వరకూ ఉంది. ఆధునిక యంత్రాలు వచ్చిన తరువాత కార్మికుల సంఖ్య తగ్గిందని, కానీ వారికి చెల్లించే జీతం పెరిగిందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఎక్కడికక్కడే పేరుకుపోయి.. రెండు నెలల కిందట టన్ను కొబ్బరి డొక్కను స్థానిక పీచు ఉత్పత్తిదారులు రూ.1,500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు కొనుగోలు నిలిచిపోవడంతో కొబ్బరి తోటల్లో డొక్క టన్నుల కొద్దీ ఉండిపోయింది. ఈ డొక్కను ఉచితంగా తీసుకు వెళ్లాలని రైతులు పరిశ్రమల యజమానులను వేడుకుంటున్నారు. అవసరమైతే ట్రాక్టర్కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఎదురిచ్చి వదిలించుకునే పనిలో పడ్డారు. ఇదే సమయంలో తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తి తగ్గడం వల్ల అక్కడ పీచు పరిశ్రమల యజమానులు రాష్ట్రంలోని చిత్తూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి డొక్క కొనుగోలు చేసి తీసుకు వెళ్తుండడం గమనార్హం. ఇక్కడ తోటల్లో పేరుకుపోయిన డొక్కను నిర్జీవ ప్రాంతాలకు తరలించడం, లేకుంటే తగలబెట్టడం చేస్తున్నారు. భారీ పరిశ్రమలు రావాలి పీచు పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే జిల్లాలో భారీ పరిశ్రమలు రావాలి. ఒక్కో పరిశ్రమ వద్ద పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు కావాలి. ప్రతి మండలంలో క్వాయర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రైమిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)లో ఇప్పుడు రూ.50 లక్షల వరకూ రాయితీతో కూడిన రుణం ఇస్తుంది. ఇది కనీసం రూ.కోటికి పెంచాలి. అప్పుడు పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. – వేగి వెంకటేశ్వరరావు, డైరెక్టర్, కోనసీమ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్ యాంత్రీకరణ అవసరం తమిళనాడు పీచు ఉత్పత్తిదారులు ఒక్కడి కొబ్బరి డొక్కను కొనుగోలు చేసి పీచు ఉత్పత్తి చేస్తున్నారు. కొనుగోలు, రవాణా ఖర్చులు భారమే అయినా వారికి లాభాలు వస్తున్నాయి. మన పీచు ఉత్పత్తిదారులకు ఆధునిక యంత్రాలు లేక లాభాలు రావడం లేదు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల వద్ద డొక్క వృథాగా పేరుకుపోతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి. – పెదమల్లు నాగబాబు, క్వాయర్ రంగ నిపుణుడు, పాశర్లపూడిలంక -
షంపద సృష్టికి పర్మిట్!
సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించేందుకు కూటమి సర్కారు అడ్డదారులు తొక్కుతోందా..? మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సన్నాహాలు ప్రారంభించిందా..? తద్వారా ప్రజలను మరింతగా తాగుడుకు బానిసలు చేసేందుకు కుట్రలు పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, ఇక షాపుల పక్కనే తాగిస్తే.. తాగుబోతుల వీరంగాన్ని భరించలేమంటూ ఆందోళన చెందుతున్నారు. ఇదీ సంగతి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ తెరపైకి తెచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడచిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేసి ప్రైవేటు పేరుతో కూటమి నేతలకు కట్టబెట్టింది. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రూ.లక్షల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిళ్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలను తాగుబోతులుగా సర్కారు మార్చేసింది. పర్మిట్ రూమ్లకు గ్రీన్ సిగ్నల్ మద్యం ద్వారా ప్రస్తుత ఆదాయం చాలదన్నట్లు మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మద్యం విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్ల విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు ఎకై ్సజ్ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎకై ్సజ్ శాఖ భావిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. జిల్లాలో రూ.62 కోట్ల ఆదాయం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపుల నిర్వహణకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుబంధంగా ఒక్కో షాపునకు ఒక్కో పర్మిట్ రూమ్ చొప్పున 125 సిట్టింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పర్మిట్ రూమ్లకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మద్యం షాపునకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే పర్మిట్ రూమ్కు రూ.7.50 లక్షలు, ఇతర ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్లకు రూ.5 లక్షల చొప్పున ఫీజును ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. సగటున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.62 కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మార్పు చేస్తున్నారు. దుకాణాల పక్కన పర్మిట్ రూమ్లకు అవకాశం కోసం మద్యం దుకాణ యజమానులు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన పాలసీతో ఇప్పటికే రూ.కోట్లలో ఆదాయం నూతన మద్యం పాలసీతో ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో ఆదాయం లభించింది. జిల్లా వ్యాప్తంగా 125 షాపులకు 4,384 దరఖాస్తులు అందాయి. ఒక్కో టెండర్కు రూ.2 లక్షలు వసూలు చేశారు. అంటే రూ.87.68 కోట్ల ఆదాయం వచ్చింది. షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఆరు విడతల్లో లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక లైసెన్సు ఫీజులో 1/6 వంతు చెల్లించారు. దీని ద్వారా రూ.14.85 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం విక్రయాల్లోనూ దూకుడే.. మద్యం షాపుల ద్వారానే కాకుండా.. మద్యం విక్రయాల్లోనూ ప్రభుత్వానికి రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. రాజమహేంద్రవరం రూరల్ ఐఎంఎల్ డిపో పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, అల్లూరిసీతారామరాజు, కోనసీమ జిల్లాల పరిధిలోని 134 మద్యం షాపులు, 27 బార్ అండ్ రెస్టారెంట్లకు మద్యం, బీర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా దాదాపుగా 1.17 లక్షల వివిధ రకాల మద్యం కేసులు, 44,300 బీర్ కేసులు సరఫరా చేస్తుంటారు. వీటి విలువ రూ.103 కోట్లు. ● చాగల్లు ఐఎంఎల్ డిపో పరిధిలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు పరిధిలో 111 షాపులు, 10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతి నెలా సుమారు 43,743 మద్యం కేసులు, 13,354 బీర్ కేసులు సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం లభిస్తోంది. తాగినోళ్లకు తాగినంత.. ఇప్పటికే మద్యం అక్రమ విక్రయ దందా బెల్టు షాపులే కేంద్రంగా నడుస్తోంది. సింహభాగం మద్యం షాపులను హస్తగతం చేసుకున్న కూటమి నేతల సిండికేట్ మద్యం దుకాణాలకు అనుగుణంగా బెల్టు షాపులు తెరిచింది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ దుకాణాలు వందల సంఖ్యలో వెలిశాయి. అనధికారిక విక్రయాల కోసం ఏకంగా వేలం పాటలు నిర్వహించి మరీ ఎవరు ఎక్కడ విక్రయించాలో సిండికేటే నిర్ధారించింది. ఒక్కో బెల్ట్ షాపునకు డిపాజిట్గా ఆ ప్రాంతం, వ్యాపారాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ వసూలు చేశారు. మద్యం దుకాణాలు లేని ప్రధాన కూడళ్లలో, మారుమూల గ్రామాల్లో బెల్ట్షాపులు, డోర్ డెలివరీ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గుడి, బడి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విక్రయించేస్తున్నారు. మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారే సరుకు ఇస్తుండటంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు తమకు ఇష్టమొచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. బహిరంగంగానే రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. శివారు ప్రాంతాలకు సైతం మద్యం దుకాణ యజమానులు సరకు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం నేరుగా పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇస్తుండటంతో అసాంఘిక కార్యక్రమాలు విస్తృతంగా జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తప్పతాగి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ధనార్జనే ధేయ్యంగా షాపుల వద్దే కూర్చోబెట్టి తాగించే ఏర్పాట్లు చేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం అనధికారిక బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా విక్రయాలు వాటిని ఇంకా పెంచేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములకు గ్రీన్ సిగ్నల్ గొడవలకు ఆజ్యం పోసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనలో సమీప ప్రజలు సంపద సృష్టించడమంటే ఇదేనా..? అని మండిపాటు -
సుగుణారెడ్డికి రెడ్క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్క్రాస్ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేస్తున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అత్యధిక స్థాయిలో ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి సీతానగరం: చినకొండేపూడిలో నివాసం ఉంటున్న పోలవరం ప్రాజెక్టు ఉద్యోగి అంకిత్ కటియార్ (34) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడని ఎస్సై డి.రామ్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టులో ఫీల్డ్ ఇంజినీర్గా ఉత్తరప్రదేశ్లోని బెహత్ జిల్లా లాల్పూర్ జమల్పురానికి చెందిన అంకిత్ కటియార్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఉత్తరప్రదేశ్లో ఉంటున్న తన భార్యతో ఫోన్లో మాట్లాడాడు. తర్వాత బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో సహ ఉద్యోగి వచ్చి చూడగా అంకిత్ మృతి చెంది ఉన్నాడు. చేతిలో చిన్న ఫ్యాన్కు విద్యుత్ రావడంతో షాక్కు గురై మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహ ఉద్యోగి గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్కుమార్ తెలిపారు. అక్కాచెల్లెళ్ల అదృశ్యం రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జక్కంపూడి కుటుంబం కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని ఆ పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్ స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ట్రోలింగ్పై గణేష్ తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్ల మీద తమపై జనసేన నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో కట్టిపెట్టాలన్నారు. లేదంటే అందుకు తగిన రీతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్పై తన సోదరుడు రాజా అభివృద్ధి విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఇదే పవన్కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి తెలియదా అని గణేష్ ప్రశ్నించారు. తన తండ్రి రామ్మోహన్రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారు గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. తన సోదరుడు రాజా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేస్తున్న ప్రచారాన్ని గణేష్ ఖండించారు. తమ కుటుంబం రాజశేఖర్రెడ్డితో కలసి ప్రయాణించిందని, ఆయన బిడ్డ జగన్ వెంటే ఉంటుందన్నారు. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. తమ పార్టీ ఓడిపోయినా తాము మాత్రం ఎక్కడికీ పారిపోలేదన్నారు. గెలిచినప్పుడు ఎలా పని చేశామో... ఓటమి తరువాత అదే విధంగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. తన తండ్రికి దక్కిన గౌరవమే తన అన్న రాజాకు దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన సోదరుడు మరో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాకనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి 1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధిస్తే ఒకే ఒక స్థానం కడియం నుంచి జక్కంపూడి రామ్మోహనరావు మాత్రమే గెలిచిన చరిత్ర తెలుసుకుని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడాలని గణేష్ హితవుపలికారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఇద్దరికీ ఒకటే భయం పట్టుకుందన్నారు. జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వచ్చేస్తే వారిని తట్టుకోలేమనే భయం వారిని వెంటాడుతోందన్నారు. జక్కంపూడి కుటుంబం చివరి వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని గణేష్ పునరుద్ఘాటించారు. తాజాగా రైజ్ అనే సంస్థ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, అక్రమాలపై నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో పంతం నానాజీ, రెండో స్థానంలో బత్తుల బలరామకృష్ణ ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఫ అనవసర ప్రేలాపనలు కట్టిపెట్టండి ఫ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రాంతీయ సమన్వయకర్త గణేష్ -
టీడీపీ తీరుపై రోడ్డెక్కిన జనసేన
● సొసైటీ పదవుల్లో అన్యాయం చేశారని ఆవేదన ● మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు నియోజకవర్గంలోని కూటమి నాయకుల మధ్య కుంపటి రాజుకుంది. ఇటీవల ప్రకటించిన సొసైటీ చైర్మన్లు, ఇతర కమిటీ సభ్యుల ఎంపికలో జనసేనకు పదవులు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నాయకులు టీడీపీపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కొవ్వూరులోని టోల్ గేట్ రోడ్కం రైల్ బ్రిడ్జ్జి వద్ద ఆందోళన చేపట్టారు. కొవ్వూరు జనసేన ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సొసైటీ అధ్యక్ష పదవుల నియామకం విషయంలో తమను సంప్రదించలేదని అన్నారు. ప్రాధాన్యం కల్పించాలని కోరగా అసలు తమను పట్టించుకోలేదని తెలిపారు. వారి మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితి లేదని, తమకు గౌరవం, గుర్తింపు ఇవ్వాలని తేల్చి చెప్పారు. కూటమి లక్ష్యాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని అన్నారు. తమను మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. తమను తక్కువగా చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.జనసేన నాయకులు సిద్దా శివరామకృష్ణ, నామన మూరయ్య, ఐతం మణికంఠ, పూలపల్లి బాలకృష్ణ, దూసనపూడి ఆంజనేయులు, సాయన సుబ్బారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి
– దళిత మహిళా బాధితురాలి భర్త కొమ్ము సత్తిబాబు అనపర్తి : తన భార్య కొమ్ము బుజ్జిపై హత్యాయత్నం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరులు దుప్పలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకటరెడ్డి(ఎన్వీ), అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత మహిళ భర్త కొమ్ము సత్తిబాబు అన్నారు. గురువారం పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయల్ వద్ద ఆయన తమ గోడు చెప్పుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెప్పకోవడానికి ఉదయం 9గంటలకు రామవరంలోని ఆయన ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే తన వద్ద ఉన్న ఫోన్ లాక్కుని దానిలో ఉన్న ఫొటో, వీడియో ఆధారాలను డిలీట్ చేసి సాయంత్రం ఏడు గంటలకు ఫోన్ తిరిగి ఇచ్చారని సత్తిబాబు ఆరోపించారు. తాను అబద్దం చెప్పడం లేదని ఎక్కడికై నా వచ్చి ప్రమాణం చేస్తానని సత్తిబాబు ఇజ్రాయిల్ వద్ద వాపోయారు. నెల రోజుల క్రితం కుక్కను తప్పించే క్రమంలో తన తోడల్లుడు వీరబాబు వృద్ధుడిని మోటార్ సైకిల్తో ఢీకొట్టాడని, ఆయన మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేయగా వీరబాబు బెయిల్ పై బయటకు వచ్చారన్నారు. పది రోజులుగా మాజీ సర్పంచ్ కుమారుడు ఎన్వీ విపరీతంగా వేధిస్తున్నాడని దీంతో ఎన్వీ ఇంటికి వెళ్ళగా రూ.2 లక్షలు ఇవ్వకపోతే వీరబాబును చంపేస్తామని బెదిరించారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన తన భార్య బుజ్జి, తోడల్లుడు వీరబాబుపై విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తిబాబు డిమాండ్ చేశారు. -
ఆలయ అభివృద్ధికి రూ.5.50 లక్షల విరాళం
ఆలమూరు: చింతలూరులో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజగోపురాల నిర్మాణం కోసం తమ వంతు సాయంగా మండపేటకు చెందిన పారిశ్రామికవేత్త వంక సాయికుమార్ బాబు గురువారం దేవదాయ శాఖకు రూ.5.50 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు అల్లంరాజు రామకృష్ణమూర్తి, వైట్ల శేషుబాబు, నీటి సంఘం చైర్మన్ వైట్ల గంగరాజు, గన్ని వెంకట్రావు పాల్గొన్నారు. -
ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
రాజోలు: చనిపోయిన ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం అడిగిన రాజోలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రాంబాబును గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన గుబ్బల కృష్ణతులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ మృతి చెందడంతో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన లబ్ధిని పొందేందుకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు కృష్ణతులసి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆర్ఐ రాంబాబు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో కృష్ణతులసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 20 వేలు ఆర్ఐ రాంబాబు తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు భాస్కరరావు, సతీష్, వాసుకృష్ణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. తన భర్త బాలకృష్ణ చనిపోయిన నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ రాంబాబు రూ. 15 వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నానని బాధితురాలు కృష్ణతులసి చెప్పారు. మళ్లీ నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ సర్టిఫికెట్స్ కోసం రూ. 20 వేలు డిమాండ్ చేస్తే విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆర్ఐ రాంబాబు నాలుగు నెలల కిందట రామచంద్రపురం నుంచి రాజోలు బదిలీపై వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఆయనపై తమకు పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ వికాస వేదిక పీటీఎం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సంపూర్ణమైన వికాసానికి పేరెంట్ టీచర్స్ మీటింగ్ చక్కటి వేదిక అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలోనున్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పీటీఎంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే చక్కటి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందన్నారు. డీఈఓ కే.వాసుదేవరావు, ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, జిల్లా అధ్యక్షుడు పక్కి నాగేంద్ర, పేరెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లితండ్రులు, సంరక్షకులు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు ● మాజీ ఎంపీ హర్షకుమార్ ● రిలే దీక్ష చేపట్టిన డీసీసీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం నిలిపివేసి, ఆదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట గురువారం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపారు. టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి, కరెంటు బిల్లులు వసూలు ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా రీచార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమన్నారు. ఈ ప్రక్రియలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ిీసీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ కుమారి, కాంగ్రెస్ రాజానగరం మండల కో ఆర్డినేటర్ వై.శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. -
గోదారి ఇబ్బందులు
రాకపోకలకు బ్రేక్ అయినవిల్లి: ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిపై ఓ ప్రయాణికుడు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడబోతుండగా తోటి ప్రయాణికుడు కాపాడాడు. దీంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉండటంతో రేవులో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. పి.గన్నవరం: వరద వచ్చేసింది.. లంక వాసులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం గతేడాది వశిష్ట నదీపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం ఉదయం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 వేల మంది నివసిస్తున్నారు. గతంలో 200 మీటర్ల పొడవున మట్టితో నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రేవులో రెండు ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు ప్రారంభించారు. అలాగే వరద ఉధృతికి ఊడిమూడిలంక వద్ద మట్టి లారీల రాకపోకల కోసం నిర్మించిన రహదారి, యర్రంశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బాటలు కూడా కొట్టుకుపోయాయి. వైవీ పాలెం వద్ద బాటలు కొట్టుకుపోవడం వల్ల పి.గన్నవరం మండలానికి సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఇక్కడకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.49.5 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఫ జి.పెదపూడిలో వరద ఉధృతి ఫ కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ఫ నాలుగు లంక గ్రామాలకు మార్గం కట్ -
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. –పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎరువుల సరఫరాకు చర్యలు గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం. –ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. ప్రైవేట్ డీలర్ల హవా ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్ఎస్కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు ఫ నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ఫ సాగు కాలం మొదలైనా కానరాని సన్నద్ధత -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: పొలాల్లోని వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర జిల్లా చోరీ ముఠాను దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి పలు ట్రాన్స్ఫార్మర్లు, 65 రాగి దిమ్మలను, 116.600 కిలోల రాగి తీగతో పాటు రెండు కార్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన కడలి సతీష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బళ్లా విజయరత్నం, భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన ఏలూరి పోసయ్య ముఠాగా ఏర్పడి రెండు కార్లు సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్లతో ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పూట ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి వాటిలోని రాగి తీగను దొంగిలించేవారు. ఇలా తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. అందులోని రాగి తీగను భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన పావురాయల కోటేశ్వరరావు, దిరుసుమర్రుకు చెందిన సవరపు భీమారావులు కొనుగోలు చేసి తీగను కరిగించి దిమ్మలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023లో 49 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాగా, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించగా, 67 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో ఆ ముఠాను బుధవారం సాయంత్రం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సహకరించిన రాజమహేంద్రవరం సీసీఎస్ సిబ్బంది, దేవరపల్లి స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, రాజమహేంద్రవరం సీసీఎస్ సీఐ శ్రీధర్, బాలశౌరీ తదితరులు పాల్గొన్నారు. -
పేపర్ మిల్లు సమస్యలపై స్పందించకుంటే ఆమరణ దీక్ష
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025● వైఎస్సార్ సీపీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ● జక్కంపూడి రాజా అల్టిమేటం సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం, ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. అప్పటిలోగా స్పందించకపోతే ఈ నెల 14వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అల్టిమేటం జారీ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రకాష్నగర్లోని కార్తికేయ అపార్ట్మెంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. కర్మాగారంలో 3,500 మంది శాశ్వత కార్మికులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 700 మంది మాత్రమే ఉన్నారన్నారు. కీలకమైన విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయించడం దారుణమన్నారు. 2017 నుంచి 2019 వరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గుర్తింపు యూనియన్ ఉండేదని, 2019 తర్వాత ఆ యూనియన్ కాల పరిమితి ముగిసిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కొత్త గుర్తింపు యూనియన్ ఎన్నిక జరగలేదన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి గుర్తింపు యూనియన్ ఎన్నిక జరగాల్సి వుందని గుర్తుచేశారు. యాజమాన్యంతో బ్రోకర్లతో కొందరు కార్మిక నాయకులు కుమ్మక్కయి దేశంలో ఎక్కడా లేనివిధంగా పరంపర అనే పథకం పెట్టి ఒక్కొక్క ఉద్యోగానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. పరంపర ఉద్యోగాల ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసారని వివరించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. సంగీతం సత్యనారాయణ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. పేపర్ మిల్ యూనియన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న ముఖేష్ జైన్, జయకృష్ణ, ప్రవీణ్ చౌదరిలను అరెస్టు చేసి రాజమహేంద్రవరం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమయ్యారు? తాము అధికారంలోకి వస్తే పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేస్తామన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికులను వాడుకున్నారని, ఎన్నికల అనంతరం కార్మికుల సంక్షేమాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్క కార్మికుడికి రూ.లక్ష వరకు బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. రోజుకు 350 టన్నుల నుంచి 600 టన్నుల ఉత్పత్తికి పేపర్ మిల్లు సామర్థ్యం పెరిగిందని, రూ.100 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు లాభాలు గడిస్తోందన్నారు. లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఈ నెల 14వ తేదీలోగా పరిష్కరించకపోతే.. నా తల్లి గాని, నేను గాని ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జగన్తోనే జక్కంపూడి కుటుంబం సినిమాలు వేరు రాజకీయాలు వేరు. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానం. మా నాన్న చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఇష్టపడి చూసేవారు. జనసేనలోకి జక్కంపూడి కుటుంబం వెళుతోందన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. తమ కుటుంబం ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉంటుందని గతంలోనే ప్రకటించానని గుర్తుచేశారు. కొంతమంది సైకో ఫాన్స్ వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ పత్రికలో కంట్రిబ్యూటర్గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ఓ పత్రికలో మెట్ల కుమార్ పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వస్థలం అమలాపురం కాగా, రాజమహేంద్రవరం రూరల్ నేతాజీ నగర్లో నివసిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెందిన కుమార్ గత నెల 23న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం బంధువులు, స్నేహితులు గాలించినా ఫలితం లేదు. ఈ ఘటనపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్ క్వార్టర్స్లోని పార్కు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు తెలిపారు. వెంటనే వారు ఆ ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. అతని జేబులో పుస్తకం లభించింది. అందులో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తనను క్షమించాలని రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
దళిత మహిళపై దాడి అమానుషం
అనపర్తి: దుప్పలపూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కొమ్ము బుజ్జిపై దాడికి పాల్పడిన టీడీపీ నేత ఎన్.వెంకటరెడ్డి, అతని అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మాదిగ న్యాయవాదుల సమాఖ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. బుధవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని వారు పరామర్శించారు. నిందితులు ఎంత పలుకుబడి కలిగిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షుడు కొండేపూడి ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6న దుప్పలపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఎన్.వెంకటరెడ్డి (ఎన్వీ) దళిత మహిళ బుజ్జిపై అమానుషంగా దాడి చేయడంతో మాదిగ సంఘాల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. తమ పరిశీలనలో ఇది కచ్చితంగా కుల వివక్షతోనే జరిగిన దాడిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేయడం బుజ్జి మరిది వీరబాబు బెయిల్ పై రావడం వ్యవహారం కోర్టులో నడుస్తుండగా దళితులను, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ వెంకటరెడ్డి తన అధికార మదంతో ఇంటి వద్ద ప్రైవేట్ పంచాయితీ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులను చేస్తున్న వెంకటరెడ్డిని మూడు రోజులు కావొస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, ధూళి జయరాజు, ఆకుమర్తి చిన్నా, మానవ హక్కుల సంఘ సభ్యురాలు ఖండవిల్లి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు గాలంకి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు ఎన్వీ రెడ్డిని అరెస్టు చేయాలి మాదిగ సంఘాల నాయకుల డిమాండ్ -
చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కల్యాణంలో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించారు. కొబ్బరి ధరలు పెరగడంతో వాటిని పక్కనబెట్టి అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘వీరేశ్వరా.. క్షమించవా’ అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో దేవస్థానం అధికారులు స్పందించి స్వామివారికి నిర్వహించే అభిషేకాల్లో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించడం మొదలు పెట్టారు. రూ.వెయ్యి పెట్టి అభిషేకం చేయించుకుంటున్న భక్తుల పేరున వినియోగించాల్సిన రెండు కొబ్బరి కాయలను వాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనికి స్పందించిన ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ కొబ్బరికాయలతో అభిషేకం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో గతంలో జరిగినట్లే కల్యాణ అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఆలయ సూపరింటెండెంట్ను ఆరా తీయగా కొబ్బరి కాయల పాటదారుడు సకాలంలో కొబ్బరికాయలు సరఫరా చేయకపోవడం వల్ల అసౌకర్యం కలిగిందని, ఇది తన దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నానని చెప్పారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
ఏటీఎం మార్చేసి.. సొమ్ము డ్రా చేసి
యానాం: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన ఓ విశ్రాంత పోలీసు అధికారినే మోసం చేసిన ఘటనలో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. యానాం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్–2 కట్టా సుబ్బరాజు కథనం ప్రకారం.. గత నెల 28న యానాం పిల్లారాయ వీధిలో ఎస్బీఐ ఎటీఎం నుంచి విశ్రాంత పోలీసు అధికారి సత్యనారాయణ రూ.10 వేలు డ్రా చేశారు. అయితే మినీ స్టేట్మెంట్ రాకపోవడంతో పక్కనే ఉన్న పిఠాపురం వద్ద నరసింగపురానికి చెందిన కాసీబు రాంబాబును మినిస్టేట్మెంట్ తీయమని అడిగి పిన్ నంబరు చెప్పారు. మినీ స్టేట్మెంట్ రావడం లేదని చెప్పి రాంబాబు తన వద్ద ఉన్న మరో కార్డును సత్యనారాయణకు ఇచ్చాడు. అనంతరం రాంబాబు బయటకు వెళ్లి ఆ ఏటీఎం కార్డు నుంచి రూ.70 వేలు తస్కరించాడు. జరిగిన మోసంపై సత్యనారాయణ యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యానాం క్రైమ్ టీమ్ సభ్యులు జాంటీ, దుర్గారావు, మల్లాడి గణేష్లు నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని రూ.వెయ్యి నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై దువ్వాడ, కాకినాడ ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయి. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి నామవరంలోని ఒక ఇంట్లో చోరీ చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ వివరాలు మీడియాకు ఆయన బుధవారం తెలిపారు. నామవరానికి చెందిన రేలంగి లోవరాజు ఈ నెల 2న ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలసి తలుపులమ్మ లోవకు వెళ్లారు. దానిని గమనించి నిందితులు రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన నలబా సత్యనారాయణ అనే సత్తిబాబు (32), బెదంపూడి రత్నరాజు అనే నాని (20), ఇనకోటి పవన్కుమార్ (20)లు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 22 కాసుల బంగారు నగలు, రూ. 1.75 లక్షలు దొంగించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తమ సిబ్బందితో దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన తరువాత నగదులో కొంత తమ విలాసాలకు వాడుకున్నారు. నిందితుల నుంచి 22 కాసుల బంగారు నగలతోపాటు రూ. 1.15 నగదును స్వాధీనపర్చుకున్నారు. -
నానాటికీ ప్రభంజనం..
ఆలమూరు: భారతదేశం జన ప్రభంజనం అవుతుంది.. నియంత్రించకుంటే భవిష్యత్ అధోగతిగా మారుతుంది.. చిన్న కుటుంబం– చింతలు లేని కుటుంబం. ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు. ఈ నినాదాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా, 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు పైగా చేరుకుందని అంచనా. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ కరిగిపోతున్న వనరులతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆహారం, ఉపాధి, వివిధ అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు భారం అవుతోంది. అధిక జనాభాతో అడవులు సైతం అంతరించి పోతుండగా పంట భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి భవిష్యత్లో పుడమికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం 51,54,296 మంది ఉండగా, ఇందులో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి ఈ జనాభా సుమారు 55.38 లక్షలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను 2022 ఏప్రిల్ 4న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింత పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరం అవుతుంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గణనకు షెడ్యూల్ విడుదల జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2011లో జరిగిన జనగణన తరువాత పదేళ్ల తరువాత 2021లో జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కోవిడ్–19 ప్రభావం అధికంగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గణనలో భాగంగా 2026 ఏప్రిల్ ఒకటి నుంచి తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జన, కుల గణనలను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ జన, కుల, ఆస్తుల గణనలో ప్రతి ఒక్కరి నుంచి 36 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనుంది. ప్రాధాన్యం ఇస్తే మేలు ఉమ్మడి జిల్లాలో అధిక జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జనాభా పెరుగుదలతో కలిగే దుష్ఫరిణామాలను ప్రజలకు వివరించేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి ప్రోత్సాహకాలను అందజేయాలి. సమాజంలో వీలైనంత మేరకు అధిక వయసు పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం చేసుకున్న ప్రతి జంట స్వచ్ఛంద నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అధిక జనాభాతో వనరుల లభ్యత కరవు 2027 ఫిబ్రవరి 1 నుంచి జన, కులగణన రేపు ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లాల వారీగా జనాభా వివరాలు జిల్లా జనాభా పురుషులు సీ్త్రలు వైశాల్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 17,19,013 8,58,632 8,60,381 2,083 కి.మీ కోనసీమ కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020 కి.మీ తూర్పుగోదావరి 18,32,332 9,15,325 9,17,007 2,561 కి.మీ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
శృంగేరిలో పద్య రచనా శిక్షణ శిబిరం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కర్ణాటకలోని దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠంలో జగద్గురువుల ఆదేశం మేరకు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ‘సాహిత్య శారదా’ అనే శీర్షికతో పద్య రచనా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. తెలుగు పద్య రచన నేర్చుకొనే ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/TeluguPadya వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ శిబిరంలో సుప్రసిద్ధ శతావధానులైన డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, డాక్టర్ తాతా సందీప్ శర్మ, విద్వాన్ గన్నవరం లలితాదిత్య శర్మ పాల్గొని, పద్య రచనలో మెళకువలు నేర్పిస్తారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సంగీత, నృత్య పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నగరంలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో వివిధ కోర్సులకు గాను 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక సంగీతం, గాత్రం, వాద్యం, నాట్యం, మృదంగం, డోలు, శాసీ్త్రయ నృత్య విభాగాల్లో నాలుగేళ్ల డిప్లొమా, రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించనున్నామన్నారు. కర్ణాటక సంగీతం, నాట్యం తదితర విభాగాల్లో ప్రతిభా ప్రదర్శన ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. సర్టిఫికెట్ కోర్సులో చేరే విద్యార్థుల వయస్సు ఈ నెల ఒకటో తేదీ నాటికి పదేళ్లు, డిప్లొమా కోర్సులో చేరే వారికి 15 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా పేర్కొన్నారు. మరింత సమాచారానికి 0883–2421669 ఫోన్ నంబర్లో కార్యాలయ పని వేళల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని నాగలక్ష్మి సూచించారు. బూత్ లెవెల్ అధికారులకు నేటి నుంచి శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 1,581 మంది బూత్ లెవెల్ అధికారులు ఈ శిక్షణకు హాజరవుతారన్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం ఆరు బ్యాచ్లుగా వీరికి శిక్షణ ఇస్తామన్నారు. దీనికి బూత్ లెవెల్ అధికారులతో పాటు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, నమోదు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అనపర్తిలో 228, రాజానగరం 216, రాజమహేంద్రవరం రూరల్ 241, రాజమహేంద్రవరం అర్బన్ 176, కొవ్వూరు 205, నిడదవోలు 246, గోపాలపురంలో 269 మందికి శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు. కేంద్ర పథకాలు ప్రజలకు అందించాలి రాజమహేంద్రవరం సిటీ: కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వారు లబ్ధి పొందేలా చూడాలని ఎంపీ, జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ సంఘం (దిశ కమిటీ) చైర్మన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన దిశా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, ఘన వ్యర్థాల నిర్వహణ, జల్జీవన్ మిషన్, అమృత్, ఫసల్ బీమా యోజన, పింఛన్లు, గృహ నిర్మాణం, క్షయ వ్యాధి నివారణ, పీఎం సూర్య ఘర్ పథకాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ పి.ప్రశాంతితో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రతి పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, నమోదైన లబ్ధిదారుల సంఖ్య, పురోగతి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ క్రెడిట్ కొట్టేద్దామని..
కూటమి ప్రభుత్వ ప్రమేయమే లేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రసాద్ నిధుల విడుదల, పనుల ప్రారంభోత్సవం జరిగాయి. ఇందులో కూటమి ప్రభుత్వ ప్రమేయమేదీ లేదు. ప్రస్తుతం టెండర్లు మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. సత్యదేవుని భక్తుల సౌకర్యార్థం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం ప్రసాద్ నిధులు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. వాస్తవానికి రూ.92 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పట్లో ప్రతిపాదించాం. ప్రస్తుత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మిగిలిన నిధులు సాధించి, అప్పుడు ప్రచారం చేసుకోవాలి. – వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నవరం: కష్టపడింది ఎవరైనా.. దానికి మంచి ఫలితం వస్తే చాలు.. ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఆ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి పెద్దలు తెగ తాపత్రయపడుతూంటారు. ఆ విషయంలో కూటమిలోని జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంటున్నారనే విమర్శ వస్తోంది. అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం మంజూరు చేసిన ‘ప్రసాద్’ స్కీమును తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణమవుతున్నాయి. ఏం జరిగిందంటే.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిలిగ్రిమేజ్ రీజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 2016లో ఎంపికై ంది. అయితే, 2019 వరకూ ఉత్తరాది రాష్ట్రాల్లోని వారణాశి, మధుర తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధి పైనే కేంద్రం దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాకినాడ ఎంపీగా వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రసాద్ స్కీము ద్వారా ఎక్కువ నిధులు సాధించి, అన్నవరం దేవస్థానంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అప్పటి ఎంపీ వంగా గీతను నాటి సీఎం జగన్ ఆదేశించారు. అప్పటి నుంచీ ఆమె ఈ స్కీము నిధుల కోసం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ అధికారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి అన్నవరం దేవస్థానానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరారు. తొలుత అన్నవరం దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం చెప్పింది. ఆవిధంగా ప్రతిపాదించగా అందులో రూ.8 కోట్లు తగ్గించి, రూ.92 కోట్లకు పరిమితం చేసింది. చివరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) వద్దకు వచ్చేసరికి రూ.54 కోట్లకు తగ్గించింది. చివరకు కేంద్రం రూ.20.06 కోట్లు మాత్రమే మంజూరు చేయడం కొంత అసంతృప్తికి కారణమైంది. ఒక దశలో రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేస్తారనే సమాచారం రావడంతో నాటి ఎంపీ గీత.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలసి, ప్రసాద్ స్కీము నిధులు పెంచాలని కోరారు. ఆమె కృషితో కేంద్రం ఎట్టకేలకు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం, రూ.5.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.61.78 లక్షలతో టాయిలెట్ బ్లాకులు, రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రూ.కోటి వ్యయంతో 2 బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి గత ఏడాది మార్చి 7న వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో అప్పటి ఎంపీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వంగా గీత, పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నాటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. అనంతరం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రసాద్ పనుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల టూరిజం శాఖ సీఈ ఈశ్వరయ్య తదితరులు ప్రసాద్ స్కీము నిర్మాణాల స్థలాలను పరిశీలించి వెళ్లారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ నెలాఖరు నుంచి నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు. పనులు ప్రారంభమయ్యే సూచనలతో.. ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమ య్యే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టా రు. ప్రసాద్తో పాటు అనేక విషయాల్లో అన్నవరం దేవస్థానం అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మాజీ ఎంపీ వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కాకినాడ ఎంపీగా ఉన్న తాను ప్రసాద్ స్కీము కోసం మొక్కవోని పట్టుదలతో కృషి చేసి నిధులు సాధించానని గుర్తు చేశారు. అయితే, ఇదంతా ఆయన గొప్పే అన్నట్టు ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ప్రచారం చేసుకోవడం దారుణమని విమర్శించారు.ఫ ‘ప్రసాద్’ను తన ఖాతాలో వేసుకునేందుకు ఎంపీ ప్రయాస ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం కోసం కృషి ఫ అప్పటి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని పలుమార్లు కలసిన నాటి ఎంపీ గీత ఫ ఫలితంగా పచ్చజెండా ఊపిన కేంద్రం ఫ అప్పట్లోనే వర్చువల్గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఫ అయినప్పటికీ ఇదంతా తన కృషి వల్లనేనంటూ తంగెళ్ల ప్రచారం -
ఈవోలదే సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అన్ని ఆలయాలలో సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, అవి పనిచేయకపోతే ఈవోలే పూర్తి బాధ్యత వహించాలని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని దేవదాయశాఖ ఆలయాలు, సత్రాల ఈవోలతో మంగళవారం కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయాల్లో దేవుడి వెండి, బంగారం ఆభరణాలకు బీమా చేయించాలన్నారు. ఆలయాలు, సంస్థలకు సంబంధించి భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా అన్యాక్రాంతమైతే సంబంధిత ఈవోలు వెంటనే నోటిసులు ఇచ్చి, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ విళ్ల పళ్లంరాజు, దేవదాయశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ దాసరి భారతి, జిల్లా దేవదాయశాఖాదికారులు కె.నాగేశ్వరరావు, ఈవీ సుబ్బారావు పాల్గొన్నారు. -
సేద్య పద్ధతులతో కోకోలో అధిక దిగుబడి
అంబాజీపేట: కోకో సాగులో నూతన సేద్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు అన్నారు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ క్యాష్వేనట్ అండ్ కోకో డెవలప్మెంట్ ప్రోత్సాహంతో మంగళవారం కోకో సాగుపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోకో తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబించాలన్నారు. కొమ్మ కత్తిరింపు, పురుగుల నియంత్రణ పద్ధతులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేయడం వల్ల అదనపు రాబడి పొందవచ్చన్నారు. డాక్టర్ నామాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోకో కాయ తయారయ్యే సమయంలో తోటలను రైతులు పరిశీలించి ఎలుకల బెడద ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కోకో ప్రొడక్షన్, కోకో వాల్యూ అడిషన్, ప్రోసెసింగ్ విధానాలను వివరించారు. శాస్త్రవేత్తలు బి.నీరజ, ఎ.కిరీటి, వి.అనూష తదితరులు కోకోలో సూక్ష్మపోషకాల యాజమాన్య విధానాలను తెలిపారు. -
రక్కసీ కోత
ఉప్పాడ తీరంలో పంట పొలాల్లోకి చొచ్చుకు వచ్చిన సముద్రపు నీరు ప్రస్తుతం మాయాపట్నం వద్ద కడలిలో కలిసిపోయిన జియోట్యూబ్ రక్షణ గోడ● కోత బారిన ఉప్పాడ తీరం ● సముద్రంలో కలసిపోతున్న భూములు ● రక్షణ చర్యలు చేపట్టని ప్రభుత్వం ● నెరవేరని పవన్ కల్యాణ్ హామీ పిఠాపురం: ఉప్పాడ తీరంలో సముద్రం తరచూ ఉగ్రరూపం దాల్చుతుంటుంది. తుపాను రానప్పటికీ, ఉపద్రవాల హెచ్చరికలు లేనప్పటికీ సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఉప్పొంగుతుంటాయి. దీంతో తీరం వెంబడి భూమి మీటర్ల మేర కోతకు గురవుతోంది. ఉప్పాడతో పాటు దాని శివారు గ్రామాలు కడలిలో కలిసి పోతుంటాయి. ఇలా సుమారు శతాబ్ద కాలంగా కడలి కబలించేస్తున్నా శాశ్వత రక్షణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నవి గుడిసెలే కదా అని రూ.లక్షల్లో ఉన్న ప్రతిపాదనలను పట్టించుకోక పోవడం వల్ల వందల ఎకరాల పంట భూములు, పురాతన ఆలయాలు, భవంతులు కడలి గర్భంలో కలిసిపోయాయి. కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభం లాంటి బీచ్ రోడ్డు నిర్మించిన నాటి నుంచే కడలిపాలవుతూనే ఉంది. ఉప్పాడ రక్షణకు చర్యలు ఉత్తిమాటేనా? కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.వందల కోట్లతో చర్యలు తీసుకుంటున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయారు. గత ఏడాది ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో గత ఏడాది జూలై 24న కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ భరణి, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (ఎన్సీసీఆర్) జాయింట్ సెక్రటరీ రమణ మూర్తి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ నుంచి కాకినాడ పోర్టు వరకు తీర ప్రాంతం అభివృద్ధి, ఉప్పాడ తీరం కోత, ఇతర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఇవన్నీ జరిగి ఏడాది పూర్తవుతున్నా కనీసం ప్రణాళికలు కూడా తయారు కాలేదు. పెరిగిన కోత గత కొన్ని నెలలుగా ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నిత్యం కోత బారిన పడుతోంది. ఇప్పటి వరకు రక్షణగా ఉన్న జియోట్యూబ్ టెక్నాలజీ రక్షణ గోడ పూర్తిగా కడలిలో కలిసి పోగా, పక్కనే ఉన్న పంట పొలాలు సైతం సముద్రంలో మునిగిపోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు 1,360 ఎకరాల పంట భూమి కోతకు గురై కడలి గర్భంలో కలిసి పోయింది. ఈ తీర ప్రాంత రక్షణకు రూ.250 కోట్లతో ప్రణాళికలు అన్న మాట కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్సీసీఆర్ అధ్యయనం ప్రకారం కోస్తా తీరంలో ఉప్పాడ కొత్తపల్లి, సఖినేటిపల్లి మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 1956 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉప్పాడ గ్రామంలోనే సుమారు 85 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు గుర్తించారు. కోతకు కారణమేదే! గోదావరి ఇసుక కొట్టుకు రావడం వల్ల కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ ఐలాండ్ సముద్రంలో 40 చదరపు మైళ్ల విస్తీర్ణం గల లోతు లేని అగాధం (కాకినాడ బే) సృష్టించడం వల్ల దీని సమీపంలోని ఉప్పాడకు ముప్పు ఉందని నిర్ధారించారు. ఉత్తరం వైపు నుంచి తెరుచుకుని ఉండే ఈ అగాధం దక్షిణ వైపు నుంచి తీరానికి వెళ్లే అలలను అడ్డుకుంటోంది. దీంతో అలలతో పాటు వెళ్లే పదార్థాలు (లిట్టోకల్ డ్రిప్టు) తీరం చేరడం లేదు. దానివల్ల అలల తాకిడితో హోప్ ఐలాండ్లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు తీరంలో మట్టి కోతకు గురవుతుంది. గ్రామాలు కోతకు గురైన భూమి (ఎకరాల్లో) ఉప్పాడ 84.51 రమణక్కపేట 13.01 అమరవిల్లి 133.50 సుబ్బంపేట 141.30 కోనపాపపేట 233.56 మూలపేట 359.78 కొమరగిరి 362.83 మొత్తం 1360 75 ఏళ్ల క్రితమే.. 1950లోనే ఉప్పాడ తీరానికి సముద్ర కోత వల్ల ముప్పు ఉందని అఽధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ మేరకు సర్వే జరిపిన విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. 1971లో కోత తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1992లో పూణేలోని అప్పటి పీడబ్ల్యూఆర్ఎస్ డైరెక్టర్ సీవీ గోలే అధ్యక్షతన ఒక సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం సాంకేతిక పరంగా సర్వేలు జరిపి ఉప్పాడ ప్రాంతం కోత.. విశేష స్వభావం కలిగినదిగా తెలిపింది. పొంచిఉన్న ప్రమాదం కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభమైన ఉప్పాడ తీరం శాశ్వత రక్షణకు చర్యలు చేపట్టలేకపోతే, ప్రత్యామ్నాయం అయినా చూడాలి. ఉప్పాడ కోతకు అడ్డుకట్ట వేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశశించిన తీర ప్రాంత వాసులకు నిరాశ మిగిలింది. దీంతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కోత కారణంగా ఇప్పటి వరకూ సుమారు 32 వేల నివాస గృహాలు కడలిలో కలసిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి
కాకినాడ క్రై: సాధారణ గస్తీలో భాగంగా కాకినాడలో భద్రతను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సర్పవరంలోని విశాఖ డైయిరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో అతడికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. గస్తీలో భాగంగా అటుగా వెళ్లిన సీఐ సునీల్ కుమార్ ఆ వ్యక్తిని చూశారు. వెంటనే మంచినీరు తాగించి, సపర్యలు చేసి కూర్చోబెట్టారు. నీరసంతో పడిపోయానని అతడు చెప్పడంతో పోలీసులు సురక్షిత ప్రాంతానికి చేర్చి, ఓఆర్ఎస్ ద్రావణాలు కొని ఇచ్చారు. కాగా.. రోడ్డుపై పడిఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన సునీల్ కుమార్ను ఎస్పీ బిందుమాదవ్, డీఎస్పీ దేవానంద్ పాటిల్ అభినందించారు. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ వివిధ సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను అందజేసినట్లు డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పది మందిని కండక్టర్ గ్రేడ్–2 ఉద్యోగం కోసం ఎంపిక చేసి, నియామక పత్రాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వీరేశ్వరా.. క్షమించవా..
● మురమళ్ల ఆలయంలో అపచారం ● అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం ● అభిషేకానికి ఉపయోగించే కొబ్బరి కాయలు పక్కదారి ఐ.పోలవరం: మురమళ్ల భఽధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి కొబ్బరి కాయలతో అభిషేకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. అధికారుల నిరక్ష్యంతో కొబ్బరికాయలు పక్కదారి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆలయంలో ప్రతి రోజూ రాత్రి జరిగే కల్యాణాలకు సంబంధించి ఉదయం అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి సంబంధించి ఒక టిక్కెట్టుకు రెండు కొబ్బరి కాయలు కేటాయిస్తారు. పండితులు వీటితో భక్తుల గోత్రనామాలతో స్వామికి, వినాయకునికి అభిషేకాలు చేస్తారు. ప్రతి నిత్యం సుమారు 116 కల్యాణాలు ఇక్కడ జరుగుతాయి. అంటే రోజుకు 232 కొబ్బరికాయలు కొట్టాలి. కానీ ఆలయంలో 15 రోజులకు సంబంధించి కేవలం ఒక్క రోజు మాత్రమే స్వామికి అభిషేకాల కొబ్బరి కాయలు కొట్టారు. మిగిలిన రోజులు స్వామికి ఎగనామం పెట్టేశారు. అభిషేకాలకు సంబంధించిన కొబ్బరి కాయలు ఎక్కడకు వెళ్లాయో తెలియదు. కొబ్బరి కాయల పక్కదారి స్వామివారి కల్యాణానికి రుసుము రూ.1,000 తీసుకుంటారు. భక్తుల నమ్మకాన్ని కొందరు అవినీతి పరులు సొమ్ము చేసుకొంటున్నారు. స్వామివారి అభిషేకానికి ఉపయోగించాల్సిన కొబ్బరి కాయలను పక్కదారి పట్టించి, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాలను, పూజాది కార్యక్రమాలు తుంగలోకి తొక్కేస్తున్నారు. కొబ్బరి ధర హెచ్చును సాగుగా చూపుతూ కొబ్బరి నీళ్ల అభిషేకానికి స్వస్తి పలికేశారు. దీనిపై ఆగ్రహించిన కొందరు భక్తులు నేరుగా ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపొయింది. కొబ్బరి కాయల పాటదారునికి షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే అభిషేకాలకు ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలకు రుచి, శుచి కరువైయ్యిందనే భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సహాయ కమిషనర్ వి.సత్యనారాయణను వివరణ కోరగా కొబ్బరి కాయలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందని, సంబంధిత పాటదారునికి నోటీసులు అందజేసి యథావిధిగా అభిషేకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
చికిత్స పొందుతూ యువతి మృతి
అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారం శివారు పీర్మాయిపాలెం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువతి సోమవారం రాత్రి మృతి చెందింది. అంబాజీపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కొర్లపాటివారిపాలేనికి చెందిన మిండుగుదిటి పవిత్ర ధనలక్ష్మి (21) ఈ నెల 5న మోటారు సైకిల్పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మోటారు సైకిలిస్టు ఢీకొన్నాడు. ఈ ఘటనలో ధనలక్ష్మి తీవ్రంగా గాయపడింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు మిండుగుదిటి సిద్ది వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ వి.సత్యనారాయణ తెలిపారు. మరో ఘటనలో.. అంబాజీపేట: తను ఒంటరిగా జీవిస్తూ మరొకరిని ఇబ్బందులకు గురి చేయడం ఇష్టం లేక పురుగుమందు తాగిన వృద్ధుడు.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిరతపూడికి చెందిన దార్లంక సత్యనారాయణ (75) ఈ నెల 5న పురుగుల మందు తాగి వాంతులు చేసుకున్నాడన్నారు. బంధువులు వెంటనే కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడన్నారు. మృతుడి అన్న కుమారుడు దార్లంక గోపికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు తెలిపారు. పశువైద్యాధికారి శ్రీనివాసు మృతి ఆలమూరు: నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఏడీ నాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్, పినపళ్ల గ్రామీణ పశు వైద్యాధికారి ఈదల శ్రీనివాసు (61) మంగళవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుమ్మిలేరు, చింతలూరు, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, పినపళ్ల గ్రామాల్లో ఆయన పశువైద్యాధికారిగా సేవలందించారు. -
10 నుంచి పొగాకు విత్తనాల విక్రయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ –నిర్కా) (పూర్వపు సీటీఆర్ఐ)లో 2025–26 సీజన్కు ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నాణ్యమైన వర్జినీయా పొగాకు విత్తనాలు విక్రయించనున్నారు. వీటిని ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్, ఎన్బీఎస్, ఎన్ఎల్ఎస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం ప్రకటనలో కోరారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కందుకూరులోని వాణిజ్య వ్యవసాయ పరిశోధనాసంస్థ పరిశోధనా స్థానం (పూర్వపు సీటీఆర్ఐ)లో కూడా పొగాకు విత్తనాల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. జీబీఆర్ఎస్ పాస్బుక్ ఉన్న రైతులకు ప్రతి బ్యారన్కు 500 గ్రాముల చొప్పున కిలో రూ.1300కు విక్రయిస్తారన్నారు. కావాల్సిన రైతులు బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్బుక్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. క్యాష్లెస్ లావాదేవీలు అనగా యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే ), క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే అనుమతి ఉందన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనాలను రూ.2,200కు విక్రయిస్తారన్నారు. -
అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
● అట్టహాసంగా 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ ● హాజరైన ప్రముఖ ఆథ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు ప్రత్తిపాడు రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఆధ్మాత్మికత వెల్లివిరిసింది. అరుణాచల మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన 63 మంది నాయనార్ల ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకులు డాక్టర్ టి.అరుణాచల కార్తికేయ శివాచార్య వైభవంగా నిర్వహించారు. వీటితోపాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని జెట్టి శివకుమార్ దంపతులు, లక్ష్మీ హయగ్రీవుడు విగ్రహాన్ని శ్రీహరి రాజబాబు దంపతులు, సూర్యభగవానుడు విగ్రహాన్ని దంతులూరి సుభద్రరామరాజు దంపతులు, కాలబైరవుడు విగ్రహాన్ని గిరిధరరెడ్డి దంపతులు, గంగామాత విగ్రహాన్ని బలభద్రుడి సత్యనారాయణ దంపతుల ఆర్థిక సహాయంతో ప్రతిష్ఠించారు. అనంతరం కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మార్మోగింది. రాచపల్లి వెళ్లే ప్రధాన రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తి మార్గమే శరణ్యం భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తమిళనాడులో 5–10 శతాబ్దాల మధ్య కాలంలో నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లని చెప్పారు. వీరు భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు తెలిపారు. నాయనార్లలో రాజుల నుంచి మానవుల వరకు ఉన్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి నిష్కలమషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదన్నారు. సభలో సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణాజిల్లా, పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీరమణాసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో పాటు పలువురు ఆథ్యాత్మిక వేత్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్రమాధవ్, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి
తుని: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం, కుమ్మరికిమ్ముడుపల్లికి చెందిన బోనంగి నూకరాజు(50) తుని రైల్వే స్టేషన్లో రెండో నంబర్ ఫ్లాట్పారం నుంచి ఒకటో నంబరు ఫ్లాట్ఫారానికి వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి కరప: ఇంట్లో వంట చేస్తుండగా విషసర్పం కాటువేయగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన బోనంగి లోవతల్లి(31) ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక విషసర్పం కాటువేసింది. వెంటనే ఆమెను చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలు లోవతల్లి భర్త ప్రసాద్కు మధ్య గొడవలు జరిగి ఏడాది కాలంగా గురజనాపల్లిలో తల్లితో పాటు ఉంటోంది. ఆమెకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె సోదరి రాచకొండ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోసానికి చిరునామా చంద్రబాబు
రాజమహేంద్రవరం రూరల్: మోసానికి చిరునామాగా చంద్రబాబు ప్రభుత్వం నిలిచిందని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా క్రీస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రెవ.విజయసారథి అన్నారు. సోమవారం కొంతమూరులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొనని తనకు పార్టిసిఫేషన్ సర్టిఫికెట్ పంపారన్నారు. అంతకంటే దారుణం ఏమిటంటే కాటవరం సెక్రటరియేట్, సీతానగరం మండలం అనే అడ్రస్సులో నివసిస్తున్నట్లుగా ఆ సర్టిఫికెట్లో తెలియజేశారన్నారు. గిన్నిస్బుక్ రికార్డుల కోసం మృతిచెందిన వారి పేరిట సైతం యోగాలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు జారీచేయడం, వారి పనితీరుకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పేదవాడికి అందించాల్సిన ఏ ఒక్క స్కీమును అందించని సీ ఎం చంద్రబాబు, ఒక్కరోజు యోగా దినోత్సవం కోస ం రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం దారుణం అన్నారు. -
తమ్ముళ్ల కారు కూతలు!
● నడిరోడ్డుపై బయటపడ్డ వర్గ పోరు ● కారు అడ్డం వచ్చిందనే వంకతో దుర్భాషలు టాస్క్ఫోర్స్: టీడీపీ నేతల గ్రామాల పర్యటన కుమ్ములాట, తోపులాటలకు నిలయమైంది. వారి మధ్య వర్గపోరును బహిర్గతం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఎంపీ పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కుమారుడు పెందుర్తి అభిరామ్ సోమవారం కాన్వాయ్లో బయలుదేరారు. రాజానగరం మండలం పాలచర్ల, కోరుకొండ మండలం గాడాల అనంతరం మునగాలకు బయలుదేరిన కాన్వాయ్లో మొదటి నుంచి వాహనాలు ఓవర్ టేక్ చేసుకోవడం వివాదానికి కారణమయ్యింది. అటు నుంచి పలు గ్రామాలకు కాన్వాయ్ వెళ్లింది. కోరుకొండ మండలం మునగాలలోని కార్యక్రమానికి వెళ్తుండగా పెందుర్తి కారుకు మరో వర్గం కారు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెందుర్తి వర్గానికి చెందిన నాయకుడిని దుర్భాషలాడటంతో వివాదం తీవ్రతరమయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అరుపులు, కేకలతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండడంతో రుడా చైర్మన్ పదవి పెందుర్తి అభిరామ్కు వస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అది అభిరామ్కు దక్కకపోవడంతో నాటి నుంచి వివాదాలు అంతర్గతంగా ఉన్నాయి. ఆ వివాదాలు మునగాల ఘటన ద్వారా బయట పడ్డాయి. కూటమిలోని ఇతర నాయకులు జోక్యం చేసుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. పార్టీలో ఆధిపత్య పోరు ఇలా నడిరోడ్డుపై దుర్భాష లాడటం వరకూ వెళ్లింది. కూటమిలోని పార్టీ నాయకులు, స్థానికులు, రైతుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంఽశమైంది. -
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు
● స్పోర్ట్సు అథారిటీ వైస్ చైర్మన్కు ఫిర్యాదు ● ఫెన్సింగ్ క్రీడాకారుడు గౌతమ్రాజ్ సామర్లకోట: సాఫ్ట్బాల్, ఫెన్సింగ్ స్పోర్ట్సు కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రముఖ ఫెన్సింగ్ క్రీడాకారుడు ఎం గౌతమ్రాజ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్చైర్మన్కు వినతి పత్రం అందజేశానన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసే అభ్యర్థి పేరుపై మరోకరు టోర్నమెంట్లో పాల్గొంటున్నారన్నారు. దాంతో స్పోర్ట్సులో కనీస పరిజ్ఞానం లేనివారు స్పోర్ట్సు కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించని వారికి నకిలీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సాఫ్ట్బాల్ ఆటకే పరిమితం కాకుండా ఫెన్సింగ్ ఆటలోనూ ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఫెన్సింగ్ ఆటను ముసుగు ధరించి ఆడటం వలన ఎవరు ఆడుతున్నారో తెలియడం లేదన్నారు. దీనిని ఆసరాగా తీసుకొని దందా జరుగుతోందని చెప్పారు. విద్యార్ధులను క్రీడలలో ప్రాత్సహించవలసిన ఫెన్సింగ్ అసోసియేషన్ క్రీడాస్ఫూర్తిని అణగదొక్కుతోందన్నారు. దొడ్డిదారిలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని గౌతమ్రాజ్ కోరారు. -
పొగాకు.. గిట్టుబాటలో..
దేవరపల్లి: రెండు వారాలుగా పొగాకు మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. నానాటికీ ధర పెరుగుతూండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెల 24వ తేదీ వరకూ మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర లభించక దిగాలు పడిన రైతులు ప్రస్తుత ధర చూసి కొంత వరకూ ఊపిరి పీల్చుకున్నారు. కిలో గరిష్ట ధర రోజురోజుకూ పెరుగుతూండటంతో పాటు లో గ్రేడు తప్ప మిగిలిన గ్రేడుల పొగాకు అమ్ముడుపోతోంది. లో గ్రేడు పొగాకులో కూడా నాణ్యమైన సరకును కొనుగోలు చేస్తున్నారు. బ్రైట్, మీడియం గ్రేడు పొగాకు ఎక్కువగా అమ్ముడు పోతోంది. ఈ రెండు గ్రేడుల పొగాకుకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో కొనుగోలుదారులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని అధికారులు అంటున్నారు. గత నెల 24వ తేదీ వరకూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.290 పలకగా, అనంతరం అంచెలంచెలుగా పెరుగుతూ సోమవారం ఏకంగా రూ.336కు చేరింది. రెండు వారాల వ్యవధిలో కిలో గరిష్ట ధర రూ.46 పెరిగింది. కిలో కనిష్ట ధర రూ.220, సగటు ధర రూ.275.45 చొప్పున లభించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ అంతర్జాతీయ మార్కెట్లో మన పొగాకుకు డిమాండ్ ఏర్పడింది. ట్రేడర్లు మొన్నటి వరకూ వేలం కేంద్రాల్లో మొక్కుబడిగా పొగాకు కొనుగోలు చేసేవారు. అటువంటిది విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు ఖరారు కావడంతో మార్కెట్లో కొనుగోలుదారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ధర పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజూ కిలో గరిష్ట ధర రూ.15 నుంచి రూ.20 వరకూ పెరుగుతోంది. పెరుగుతున్న బేళ్లు ధర పెరగడంతో వేలం కేంద్రాలకు తీసుకు వస్తున్న బేళ్ల సంఖ్య కూడా పెరిగింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్లోని ఐదు వేలం కేంద్రాలకు ప్రతి రోజూ 5 వేలకు పైగా బేళ్లు వస్తున్నాయి. సోమవారం దేవరపల్లి వేలం కేంద్రానికి 796, జంగారెడ్డిగూడెం–1కు 1,410, జంగారెడ్డిగూడెం–2కు 1,311, కొయ్యలగూడేనికి 1,146, గోపాలపురం వేలం కేంద్రానికి 829 చొప్పున బేళ్లు అమ్మకానికి వచ్చాయి. మొత్తం 5,492 బేళ్లు అమ్మకానికి రాగా, ట్రేడర్లు 4,118 బేళ్లు కొనుగోలు చేశారు. ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.734.90 కోట్ల విలువైన 26.68 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. రైతులకు అనుకూలంగా మార్కెట్ పొగాకు మార్కెట్ రైతులకు అనుకూలంగా కొనసాగుతోంది. దీనిని అందిపుచ్చుకుని రైతులు పంటను అమ్ముకోవాలి. నికోటిన్ శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన గ్రేడు పొగాకు మార్కెట్కు రావడంతో ట్రేడర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ఉన్నంత వరకూ రైతులు త్వరితగతిన పంటను అమ్ముకోవాలి. అన్ని రకాల గ్రేడులూ అమ్ముడుపోతున్నాయి. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోలు) దేవరపల్లి 4.31 జంగారెడ్డిగూడెం–1 6.28 జంగారెడ్డిగూడెం–2 5.83 కొయ్యలగూడెం 5.17 గోపాలపురం 5.07 పరుగులు పెడుతున్న మార్కెట్ కొనుగోలుకు పోటీ పడుతున్న ట్రేడర్లు రూ.336 పలికిన కిలో గరిష్ట ధర సగటు ధర రూ.275.47కు చేరిక -
ఎరువుల కొరత లేదు
జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి ఎరువుల కొరతా లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ అన్ని రకాలూ కలిపి జిల్లా వ్యాప్తంగా 35,869 టన్నుల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615, పొటాష్ 2,918, సూపర్ 6,324, కాంప్లెక్స్ ఎరువులు 8,716 టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 83 వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ 27,950 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారని తెలిపారు. రైతులు అవసరం మేరకే ఎరువులు కొనుగోలు చేయాలని మాధవరావు సూచించారు. నేడు ‘దిశ’ సమావేశం రాజమహేంద్రవరం సిటీ: జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ పి.ప్రశాంతి సోమవారం ఈ విషయం తెలిపారు. శాఖల వారీగా అమలు చేస్తున్న పథకాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 35 అర్జీలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 35 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఏఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 216 అర్జీలు రాజమహేంద్రవరం సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 216 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్జీల పరిష్కారంలో లోపాలకు తావు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల స్పందన నిరంతరం తీసుకుంటున్నారన్నారు. అధికారులు సరిగ్గా మాట్లాడుతున్నారా, బెదిరించారా, లంచాలు అడుగుతున్నారా, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారా అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ సీతారామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. లండన్ సీఎంఏ సమావేశానికి ఆహ్వానం అమలాపురం టౌన్: ప్రపంచంలో 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 18న లండన్లో జరగనున్న సర్వసభ్య సమావేశానికి భారతదేశం నుంచి అమలాపురానికి చెందిన సీఎంఏ సభ్యుడు డాక్టర్ పీఎస్ శర్మ హాజరవుతున్నారు. ఈ మేరకు సీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. స్థానిక ప్రెస్క్లబ్ భవనంలో డాక్టర్ శర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ విషయం వివరించారు. సీఎంఏ అనుబంధ స్టాప్ టీబీ ఇనిషియేటివ్ సబ్ కమిటీ సభ్యుడిగా తాను నియమితులైన సంగతిని కూడా డాక్టర్ శర్మ తెలిపారు. -
రత్నగిరిపై కొనసాగుతున్న భక్తుల అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి వస్తున్న భక్తుల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతున్నట్లు గత నెలలో ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. అయితే, మే నెలలో దాదాపు 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 25 శాతానికి పరిమితమైంది. మే 26 నుంచి జూన్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది. అన్నవరం దేవస్థానానికి వచ్చేసరికి సత్యదేవుని దర్శనం విషయంలో మే నెలలో 68 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా జూన్ నెలలో అది 73 శాతానికి పెరిగింది. మౌలిక వసతుల కల్పనలో మే నెలలో 61 శాతం మంది, జూన్లో 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై మే నెలలో 78 శాతం మంది సంతృప్తి చెందగా జూన్లో అది 77 శాతంగా నమోదైంది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి మే నెలలో 64 శాతం, జూన్లో 70 శాతం మంది సంతృప్తి చెందారు. -
సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం
మహానేత వైఎస్సార్ ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచారు. 2004కు ముందు నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే వృద్ధాప్య పింఛను ఇచ్చేవారు. దీనిని వైఎస్సార్ ఒకేసారి రూ.200కు పెంచారు. దివ్యాంగ పింఛనును రూ.500కు పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తన పాలనా కాలంలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచకుండా ఆయన చర్యలు తీసుకున్నారు.నేల విడిచి సాము చేస్తూ.. హైటెక్ మాయాలోకంలో ముంచేస్తూ.. అదే అంతిమ లక్ష్యమనే భ్రమలు కల్పిస్తూ.. 70 శాతం ప్రజలు జీవిస్తున్న పల్లెలను విస్మరించేలా.. ప్రశ్నించిన వారిని అణచివేసేలా దుర్మార్గమైన పరిపాలన సాగిన రోజులవి. ఎటు చూసినా కరవు. ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం ఉండేది కాదు. విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు గ్రామీణులకు అందని దుస్థితి. అంతటా ‘ప్రైవేటు’ తంత్రమే.. సంక్షేమ విస్మరణే. ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా సొమ్ము ఇచ్చుకోవాల్సిందే..అటువంటి దుర్భర పరిస్థితుల్లో.. అణగారిన జనం కోసం నేనున్నానంటూ ఆ మహనీయుడు భరోసా ఇచ్చారు. నిరుపేదల గుండెసడిగా.. కష్టజీవులకు కొండంత అండగా నిలిచారు.. పాతాళానికి పయనిస్తున్న రాజకీయ విలువలకు.. ప్రజలకు దూరమవుతున్న ప్రభుత్వ పాలనకు పగ్గాలు వేశారు. జనం బాటలోకి మళ్లించారు. పరిపాలనకు మానవత్వాన్ని జోడించారు. పండుటాకులకు పెద్ద కొడుకుగా.. రైతుజనబాంధవుడిగా.. అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో ఆరోగ్యప్రదాతగా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో విద్యా ప్రదాతగా నిలిచారు. ‘అన్నా.. కష్టమొచ్చింది’ అంటూ ఎవరైనా వస్తే కరిగిపోతూ.. వారికి భరోసాగా నిలిచారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ పెద్ద పీట వేశారు. ఆ జనబాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర ఎప్పటికీ చెరగనిది. తన పరిపాలనా కాలం 2004–09 మధ్య ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. విద్య, వైద్యం, పరిశ్రమలతో పాటు దేశానికి వెన్నుదన్నుగా నిలిచే వ్యవసాయ రంగాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు అవిశ్రాంత కృషి చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మండు వేసవిని సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. నాడు స్వయంగా గుర్తించిన సమస్యలకు అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపారు. ఆ మహానేత నేడు భౌతికంగా లేకపోయినా.. ఆయన సేవలను జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.అభివృద్ధి జాడలివిగో..● విజయవాడ – విశాఖపట్నం మధ్య దూరాన్ని తగ్గించేందుకు.. ఈ నగరాల మధ్య రాకపోకలు మరింత వేగవంతమయ్యేందుకు.. వైఎస్సార్ హయాంలో 2006లో రూ.800 కోట్లతో గోదావరి నదిపై నాలుగు వరుసల్లో గామన్ బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 14 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్డు, 4.5 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో విశాఖ – విజయవాడ మధ్య దూరం సుమారు 40 కిలోమీటర్లు తగ్గింది.● అత్యధిక అనుంబంధ కళాశాలలతో రాష్ట్రంలోనే అతి పెద్దదిగా ఎదిగిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో శంకుస్థాపన చేశారు. నాడు ఆయన శ్రీకారం చుట్టిన ఈ విశ్వవిద్యాలయం నేడు వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది.● రాజమహేంద్రవరం నగరంలోని మురుగు నీటిని నేరుగా కాకుండా శుద్ధి చేసి గోదావరిలోకి వదిలేందుకు హుకుంపేట పంచాయతీ పరిధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టారు.● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నేషనల్ అకడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) భవనం నిర్మాణాన్ని సుమారు రూ.22 కోట్లతో వైఎస్ హయాంలోనే చేపట్టారు. ప్రస్తుతం ఆ భవనమే జిల్లా కలెక్టరేట్గా సైతం సేవలందిస్తూండటం విశేషం.● నిడదవోలు పట్టణానికి 2005లో వచ్చిన నాటి సీఎం వైఎస్సార్ సుమారు రూ.కోటితో రోడ్లు, డ్రై న్ల నిర్మాణం చేపట్టారు. మరో రూ.కోటితో సెంట్రల్ విద్యుత్ లైటింగ్, విద్యానగర్లో రూ.10 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. బాలాజీ నగర్లో రూ.1.64 కోట్లతో నిర్మించిన 500 కిలోలీటర్ల మంచినీటి రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 28వ వార్డు శివారున 832 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించారు. రూ.70 లక్షలతో నూతన మునిసిపల్ కార్యాలయం నిర్మించారు.రైతు బాంధవుడిగా..వ్యవసాయం దండగ అని పేర్కొంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా చితికిపోయారు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సానుకూల విధానాల ద్వారా వ్యవసాయాన్ని తిరిగి పండగ చేశారు. అన్నదాతలకు మేలు చేసేలా ఎన్నో పనులు, పథకాలు చేపట్టారు. పావలా వడ్డీ రుణాలు, రుణమాఫీతో వెన్నుదన్నుగా నిలిచారు. కాడి వదిలిన కర్షకుడు మళ్లీ కాడి పట్టేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.● బ్రాహ్మణగూడెంలో రూ.2.73 కోట్లు పైగా వెచ్చించి 1,200 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తద్వారా 600 ఎకరాల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపారు.● తాళ్లపూడి మండలంలో 4,950 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.8.59 కోట్లతో పైడిమెట్ల ఎత్తిపోతల పథకం నిర్మించారు.● రూ.3.60 కోట్లు పైగా వ్యయంతో చాగల్లులో ఎత్తిపోతల పథకం నిర్మించారు.● 16 మండలాల్లో 2,06,600 ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లతో చేపట్టారు.● కొవ్వాడ కాలువ వరద ముంపు నివారణకు రూ.56 కోట్లతో అవుట్ఫాల్ స్లూయిజ్ నిర్మించారు. దీనివలన కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని 15 వేల ఎకరాలకు వరద ముంపు సమస్య తీరింది.● పోలవరం ప్రాజెక్టులో ఎక్కువ పనులను వైఎస్సార్ హయాంలోనే పూర్తి చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులూ తీసుకువచ్చారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలు తవ్వించారు.● మెట్ట రైతులకు మేలు చేయాలనే తలంపుతో గోదావరి నదిపై తాడిపూడి సమీపాన చింతపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు కృషి చేశారు.● రూ.15.26 కోట్లతో కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి మండలాల్లోని 4,950 ఎకరాలకు సాగునీరు అందించే ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.● కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని రూ.1.75 కోట్లతో పునరుద్ధరించారు.● వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుంది. దీని ద్వారా మెట్ట ప్రాంత రైతులకు ఎంతో మేలు జరిగింది. నీరు పుష్కలంగా లభించడంతో రైతులు ఇబ్బడిముబ్బడిగా పంటలు పండించారు. దీంతో వ్యవసాయ దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. దేశవిదేశాల్లో ఎంతో పేరొందిన కడియం నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా అందించారు.నీటి విలువ తెలిసిన నేత వైఎస్సార్దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాం స్వర్ణయుగం. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. రైతుబాంధవుడిగా ఖ్యాతి గడించారు. సర్ ఆర్థర్ కాటన్ అనంతరం నీటి విలువ తెలిసిన నేతగా వైఎస్సార్ ఖ్యాతి గడించారు. ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసిన నేత ఆయన. మెట్ట రైతులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించిన మహనీయుడు. ఆరోగ్యశ్రీతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అంతటి మహానేత జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యాన భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. కొవ్వూరులో భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తాం.– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడురోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిపై పాదయాత్రడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దేశ, రాష్ట్ర రాజకీయాలను పెను మలుపు తిప్పింది. నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పాదయాత్ర రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఆ సమయంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో వైఎస్సార్ కొంతమూరు వద్ద అస్వస్థతకు గురయ్యారు. అక్కడే అరగంట పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్ర కొనసాగించారు. అనంతరం మధురపూడిలోని విమానాశ్రయం ఎదురుగా ఉన్న తోటలో ఆరు రోజుల పాటు వైద్య సేవలు పొందారు. ఆ సందర్భంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు ఆయనను కలుసుకున్నారు. -
తైక్వాండో క్రీడాకారులకు అభినందన
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తాడిపత్రిలో ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఆదివారం కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ స్కూల్లో జరిగింది. దీనికి డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమానికి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి, కోచ్ బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో 11వ సారి ఓవరాల్ చాంపియన్ షిప్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు సాధించారన్నారు. హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 12 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. తైక్వాండో కోచ్ అర్జునరావు మాట్లాడుతూ స్టేట్ మీట్లో 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు తూర్పు క్రీడాకారులు కై వసం చేసుకున్నారని తెలిపారు. జీజీహెచ్ వైద్యులు ప్రవీణ, అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, తులసి, రత్నం, అఖిల, కేవీ సత్యనారాయణ, తేజ, అరుణ, ప్రసన్న పాల్గొన్నారు. కామనగరువులో అగ్ని ప్రమాదంఅమలాపురం రూరల్: కామనగరువు గ్రామ పరిధి జంగంపాలెంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. తొలిత వాసంశెట్టి మంగతాయారు ఇంటి నుంచి రేగిన నిప్పు రవ్వల కారణంగా దొంగ నాగలక్ష్మి, కుంచే వెంకటేశ్వరరావు, కుంచే శాంతమ్మ కుటుంబాలకు చెందిన తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారి ఎం.రాజా అధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో వివిధ ధ్రువీకరణ పత్రాలు, వడ్రంగికి సంబంధించిన ఫర్నీచర్, నగదు, 30 కొబ్బరి చెట్లు, వివిధ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ దంపతులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా బియ్యం, పంచదార అందజేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతితుని: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రేగుపాలెం – నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) పట్టలు దాటుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తెలుపు చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని తుని మార్చురీలో భద్రపరిచారు. వివరాలకు 94906 19020 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఎస్సై తెలిపారు. -
భజే విఘ్ననాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం, ఆదివారం సందర్భంగా రద్దీగా మారింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 119 మంది, స్వామి పంచామృతాభిషేకాల్లో ఇద్దరు దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి హోమంలో 37 జంటలు, స్వామివారికి 17 మంది భక్తులు ఉండాళ్ల పూజ, ఏడుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, పది మంది చిన్నారులకు తులాభారం నిర్వహించారు. 29 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,689 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఆలయానికి రూ.4,49,089 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. -
వెజిట్రబుల్స్
ఆలమూరు: ఏం కొంటాం.. ఏం తింటాం.. అనేట్టుంది కూరగాయల పరిస్థితి. వీటి ధర అంతకంతకూ పెరుగుతోంది. ఉల్లిని కొంటేనే కన్నీరు వస్తోంది. పచ్చిమిర్చికి ఘాటు ఎక్కువైంది. వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడంతో కూరగాయల ధర రోజురోజుకూ పెరిగిపోతుంది.ఽ బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకూ సరైన ధర లేక ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నా దిగుబడి లేక దిగాలు చెందుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గత నెలతో పోలిస్తే ఈ వారంలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. గోదావరిలో వరద ఉధృతి పెరిగినా, వర్షాలు కురిసినా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిలకడగా ఉన్న నాణ్యమైన ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో రూ.40కు చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల దిగుబడి క్రమేపీ తగ్గిపోయినందువల్లే ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పంట తుది దశకు చేరుకోవడంతో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని చాగల్నాడు, మెట్ట, లంక పరివాహక ప్రాంతాల్లో సుమారు 38 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల నుంచి కూరగాయల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఉద్యాన రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో టమోటా, కొత్తిమీర, వంకాయ, దొండకాయ ధరలు కిలో రూ.పదికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే కూరగాయల సాగు ప్రస్తుతం తుది దశకు చేరుకోవడంతో దిగుబడులు తగ్గిపోతుండటంతో డిమాండ్ పెరిగి, ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని మడికి, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర హోల్సేల్ మార్కెట్లకు గత వారం రోజుల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వరద పెరిగినా.. వర్షం పడినా.. గోదావరికి ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో వరదల వచ్చే అవకాశం ఉంది. దీంతో లంకల్లో సాగు చేసే పంట పూర్తిగా తగ్గిపోతుంది. అదే క్రమంలో వర్షాలతో మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లోని పంట దిగుబడి అరకొరగా ఉండే అవకాశం ఉంది. దీంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమైతే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. లంక పరివాహక ప్రాంత రైతులు మళ్లీ వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్ నెల తరువాత గాని కూరగాయల సాగు చేపట్టే అవకాశం లేదు. దిగుబడి కోసం మరో మూడు నెలల వేచి ఉండాలి. దీంతో పెరుగుతున్న కూరగాయల ధరలు రాబోయే సంక్రాంతి వరకూ ఆకాశానికి ఎగబాకి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకూ కిలో రూ.10 నుంచి రూ.20 వరకూ పలికిన పలు కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.50కి దాటాయి. అలాగే చిక్కుళ్లు, ఆకాకర, అల్లం ధరలు కిలో రూ.100కు పైగా వరకూ విక్రయిస్తున్నారు. కొత్తిమీర సాగు పూర్తి కావడంతో బెంగళూరు నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కిలో రూ.150 పలుకుతుంది. దీంతో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర ఆకుకూరలకు డిమాండ్ పెరగడంతో, వాటి ధరలు పెరుగుతున్నాయి.కూరగాయలు గతం ప్రస్తుతం కిలో రూ. ధర ఉల్లి 25 50 పచ్చిమిర్చి 20 70 అల్లం 70 120 బంగాళదుంప 20 35 వంకాయలు 20 60 బెండకాయలు 20 50 బీట్రూట్ 30 50 క్యాబేజీ 20 50 చిక్కుడు 80 120 అరటికాయ 05 10 కాలీఫ్లవర్ 25 50 దొండకాయలు 25 40 టమోటా 25 60 బీరకాయ 30 60 గోరుచిక్కుళ్లు 25 40 ఆనబకాయ 10 20 కాకరకాయ 25 60 కంద దుంప 40 60 పెండలం దుంప 35 50 బీన్స్ 60 80 కొత్తిమీర 70 150 క్యాప్సికం 40 60 ఆకాకర 70 120ఒక్కసారిగా పెరగడంతో... కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. ఇప్పటి వరకూ బహిరంగ మార్కెట్లో స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరుగుపోతుండడంతో ఆ ప్రభావం రిటైల్ వ్యాపారంపై పడింది. పెరుగుతున్న ధరలతో కూరగాయల వ్యాపారం లాభసాటిగా ఉండటం లేదు. – చిన్నం రాజు, రిటైల్ కూరగాయల వ్యాపారి, ఆలమూరు సరకు కొరత ఏర్పడింది లంక, మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఒకేసారి తగ్గిపోవడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా సరకు కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్కు సరఫరాలో భారీ వ్యత్యాసం ఉండడంతో కూరగాయల ధరల పెరుగుదలకు కారణమైంది. – చెల్లుబోయిన సింహాచలం, హోల్సేల్ కూరగాయల వ్యాపారి, మడికి కొనుగోలు చేయలేకపోతున్నాం.. పెరిగిన ధరలతో కూరగాయలను కొనుగోలు చేయలేకపోతున్నాం. వర్షాలతో కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అలాగే రైతు బజార్లలో కూడా అన్ని కూరగాయలు అందుబాటులో ఉండటం లేదు. – కె.నాగమణి, గృహిణి, పెదపళ్ల వంటింట్లో ధరల మంట పంట దిగుబడి తగ్గడమే కారణం వినియోగదారులపై పెను భారం -
లాలిస్తూ.. బుజ్జగిస్తూ..
పెంచిన బంధం పెనవేసుకుంది.. పెంపుడు జంతువులంటే ఎనలేని ప్రేమ కనిపించింది.. లాలిస్తూ, బుజ్జగిస్తూ వాటికి యజమానులు టీకాలు వేయించారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఆదివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ తమ పెంపుడు శునకాలు, పిల్లులు, కోళ్లకు యజమానులు దగ్గరుండి మరీ టీకాలు వేయించారు. అలాగే ఇక్కడకు పాములను సైతం తీసుకురావడం గమనార్హం. శునకాలను అల్లారు ముద్దుగా చూసుకున్నారు. అవి సైతం యజమానులపై ఎంతో ప్రేమ చూపుతూ.. విధేయతతో మెలిగాయి. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్)/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
మధ్యాహ్న భోజనంలో బల్లి
గండేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో పర్యవేక్షణ పక్కదారి పడుతోంది. రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేయడంలో అలసత్వం ఆవరిస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో వండిన కూరలో బల్లి అవశేషాలు ఉండడం, అది విద్యార్థుల కంచాల్లో వేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తల్లిదండ్రులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన మల్లేపల్లి జెడ్పీ స్కూల్లో జరిగింది. ఇక్కడ సుబ్బయమ్మపేట, ఉప్పలపాడు, మల్లేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది చదువుతున్నారు. గత నెల 23న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండిన కూరలో బల్లి పడిన విషయాన్ని గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయులు, నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో ఆ కూరను ఉపయోగించకుండా మరో కూరను వండి వడ్డించినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే అప్పటికే విద్యార్థులకు అన్నం, కూర వడ్డించిన కంచాల్లో బల్లి అవశేషాలు కనిపించడంతో తినకుండా నిలుపుదల చేసినప్పటికీ కొందరు రెండు, మూడు ముద్దలు తిన్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఉడకని అన్నం, పప్పు, నీళ్లను తలపించే విధంగా సాంబారును వడ్డిస్తున్నారని, తమకు పెట్టాల్సిన కోడిగుడ్లను పెట్టడం లేదని వాపోతున్నారు. భోజనంలో నాణ్యత లేక ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. బల్లి పడిన కూరను తింటే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై స్కూల్ హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లగా బల్లి పడిన వెంటనే తీయించేశామని చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన గోప్యంగా ఉంచిన నిర్వాహకులు -
పిచ్చికుక్కల స్వైరవిహారం
కాట్రేనికోన/ అమలాపురం టౌన్: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనిపించిన వారిపై దాడికి దిగాయి. ఈ ఘటనలు అమలాపురం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. ఆదివారం పల్లం గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయడంతో సుమారు 18 మంది గాయపడ్డారు. అక్కడ చేపల మార్కెట్ జరుగుతున్న సమయంలో మహిళలతో పాటు అధిక సంఖ్యలో వ్యాపారులు ఉండటంతో బెంబేలెత్తిపోయారు. బాధితులకు కాట్రేనికోన పీహెచ్సీ వైద్యురాలు నీలిమ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే అమలాపురం కంసానికాలనీలో అదే ప్రాంతానికి చెందిన కుంచే శాన్విశ్రీ (9)పై వీధి కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలికతో పాటు మరో వ్యక్తిని ఆ కుక్క కరిచింది. ఈ బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. శాన్విశ్రీ కాళ్లు, నడుం, చేతులపై కుక్క కరవడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 19 మందికి గాయాలు అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయాడని ఆందోళన
ఐ.పోలవరం: వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డను కోల్పోయామని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెదమడి గ్రామానికి చెందిన గర్భిణి ధరణికి పురిటి నొప్పులు రావడంతో శనివారం టి.కొత్తపల్లి సీహెచ్సీలో చేర్చించారు. ఆదివారం ఉదయం ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేయగా, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం బిడ్డకు అనారోగ్యంగా ఉందని బంధువులు గుర్తించడంతో బిడ్డ పరిస్థితిపై వైద్యులను నిలదీశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ బిడ్డకు మెరుగైన వైద్యం చేయించాలని సూచించగా, అమలాపురం కిమ్స్కు తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మార్గ మధ్యంలో శిశువు మృతి చెందడంతో స్థానిక వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయినట్లు, తమకు న్యాయం చేయాలని జనం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళకారులతో చర్చలు జరిపారు. దీనిపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి కాకినాడ రూరల్: కాకినాడ జీజీహెచ్లో గుర్తుతెలియని వృద్ధుడు (75) మృతి చెందాడు. గత నెల 30న మధ్యాహ్నం కాకినాడ ఆర్టీఓ ఆఫీసు రోడ్డులో కోటయ్య కన్వెన్షన్ వద్ద మాటలేకుండా పడిపోయి ఉండడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జీజీహెచ్కు తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీలో భద్రపరిచారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడిని గుర్తిస్తే సర్పవరం పోలీసు స్టేషన్ నంబర్ 0884 2379284, సెల్ నంబర్ 94407 96554కు సమాచారం ఇవ్వాలని సీఐ పెద్దిరాజు కోరారు. -
మడిలో.. సందడి
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు వివరాలు (హెక్టార్లలో) సాధారణ సాగు విస్తీర్ణం 76,941నారుమడుల లక్ష్యం 3,847ఇప్పటి వరకూ వేసిన నారుమడులు 2,122ఇంకా వేయాల్సిన విస్తీర్ణం 1,725నాట్లు వేసిన విస్తీర్ణం 1,339 ● జోరందుకుంటున్న ఖరీఫ్ సాగు ● నారుమడులు, నాట్లలో రైతులు బిజీ దేవరపల్లి: చాలా మంది రైతులకు ప్రభుత్వం రబీ ధాన్యం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. అన్నదాతా సుఖీభవ పథకం కింద ఇస్తామన్న పెట్టుబడి సాయం అందించలేదు. ఈవిధంగా పుట్టెడు కష్టాల్లో మునిగి తేలుతున్నా.. పుడమిని పిండి పసిడి గింజలు పండించడం తప్ప మరో పని తెలియని అన్నదాతలు.. అప్పోసొప్పో చేసి మరీ ‘సాగు’దారిలోనే ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కాలువలకూ నీరు విడుదలైంది. దీంతో, జిల్లావ్యాప్తంగా రైతన్నలు మడిలో హడావుడి పడుతున్నారు. ఫలితంగా ఖరీఫ్ సాగు పనులు క్రమంగా జోరందుకుంటున్నాయి. పుష్కలంగా నీరు లభిస్తున్న మడుల్లోను, చెరువుల కింద ఆకుమడులు వేస్తున్నారు. దమ్ములు చేస్తున్న రైతులు భూసారం పెంచేందుకు ఇప్పటికే వేసిన జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను భూమిలో కలియదున్నుతున్నారు. బోర్ల కింద ముందస్తుగా ఆకుమడులు వేసిన కొంత మంది ఇరవై రోజులుగా వరి నాట్లు కూడా ప్రారంభించారు. వర్షాలకు చెరువుల్లో నీరు చేరడంతో చెరువుల కింద భూముల్లోని రైతులు దంప ఆకుమడులు, నారు సిద్ధంగా వారు నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ 356 హెక్టార్లలో నేరుగా పంట వేయగా, 966 హెక్టార్లలో దమ్ము చేసి నాట్లు వేశారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 43 వేల మంది రైతులతో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మరికొంత మంది రైతులు వంగ, బెండ, టమాటా, మిర్చి, సొర, దోస వంటి కూరగాయ పంటల సాగుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి అవసరమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారు 3,200 హెక్లార్లలో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. బెంగాలీ కూలీల సందడి ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో పలు ప్రాంతాల్లోని పొలాల్లో బెంగాలీ కూలీలు సందడి చేస్తున్నారు. వారు ఒక క్రమ పద్ధతిలో నాట్లు వేయడం వలన దుబ్బు బాగుంటుందని, పంట బాగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయని రైతులు అంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సుమారు 2 వేల మంది బెంగాలీ కూలీలు వచ్చినట్లు చెబుతున్నారు. వీరితో ఎకరం పొలంలో నాట్లు వేయడానికి రూ.3,500 వరకూ ఖర్చవుతుందని రైతులు తెలిపారు. ప్రారంభమైన వరి నాట్లు జిల్లాలో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. తొలుత బోర్ల కింద ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువలు, చెరువుల కింద ఆకుమడులు వేసి, నాట్లకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నాట్లు ఈ నెలాఖరుకు ఊపందుకోనున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఆగస్టు నెలాఖరుకు దాదాపు పూర్తవుతాయి. ఖరీఫ్లో 3,847 హెక్టార్లలో వరి ఆకుమడులు అవసరం కాగా, ఇప్పటి వరకూ 2,122 హెక్టార్లలో వేశారు. మిగిలినవి చెరువుల కింద వేయాల్సి ఉంది. వేసిన ఆకుమడులు ఆరోగ్యకరంగా ఉన్నాయి. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం సేంద్రియ ఉత్పత్తుల పట్ల ఆసక్తి సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీంతో, ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడంతో పాటు పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. వరితో పాటు కొబ్బరి, ఆయిల్పామ్, పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహిస్తున్నాం. – బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయం విభాగం, రాజమహేంద్రవరం -
మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి
పెద్దాపురం: ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ చ్చిన భక్తులు అమ్మవా రి దర్శనానికి భారీగా బారులు తీరారు. సుమారు 50 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. లోవకు పోటెత్తిన భక్తులు ● భక్త జనసంద్రమైన దేవస్థానం ● తలుపులమ్మ తల్లిని దర్శించిన 33 వేల మంది ● తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష తులసి పూజతుని: ఆషాఢ మాసం ఆదివారం, తొలి ఏకాదశి పర్వదినం కావడంతో లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 33 వేల మంది తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి మూలవిరాట్కు పండితులు లక్ష తులసి పూజ నిర్వహించారు. పంచలోహ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ పూజను భక్తులు తిలకించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,12,930, పూజా టికెట్లకు రూ.3,07,630, కేశఖండన టికెట్లకు రూ.22,440, వాహన పూజ టికెట్లకు రూ.6,560, కాటేజీలకు రూ.86,722, విరాళాలు రూ.1,19,911 కలిపి దేవస్థానానికి మొత్తం రూ.8,50,543 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి డ్రోన్తో ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 13న తలుపులమ్మ అమ్మవారికి 3 టన్నుల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. -
● పుడమితల్లికి పచ్చబొట్లు
తనను ఒకరు పొగడాలనే ఆశతో మేఘం వర్షించదు.. వర్షించడం తన ధర్మం కాబట్టి నెరవేరుస్తుంది. తన పైకి రాళ్లు విసిరిన వారికి, కత్తి దూసిన వారికి సైతం చెట్టు నీడనిస్తుంది. అన్నదాత తీరు కూడా అంతే. ‘పొలంబాట’లో కష్టాల కంటకాలు గుచ్చుకున్నా.. నష్టాల సుడిగుండాల్లో నిండా మునిగిపోతున్నా.. ఎదురీదుతూ.. సమస్త ప్రజానీకానికీ తిండిగింజలు పండిస్తూనే ఉంటాడు. కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తూండటంతో రైతన్నలు సేద్య యజ్ఞానికి ఉపక్రమించారు. మడులను సిద్ధం చేస్తున్నారు. నారు, నాట్లతో పుడమి తల్లికి ‘ఆకుపచ్చ’ బొట్లు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకున్నా.. ఆదుకోకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా.. ఈ మహాయజ్ఞం ఆగదంటూ ముందుకు సాగుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల చిత్రాలివి. – పెరవలి -
కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ నుంచి 2,18,257 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గాను 172 గేట్లను పైకి లేపి మిగులు జలాలు విడిచిపెడుతున్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 12,450 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,200, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 5,800 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులుగా నమోదైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటి ఉధృతి పెరిగిందని, సోమవారం నాటికి తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 12 వరకూ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా రేబిస్ వ్యాధి నివారణకు ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించే ముందస్తు వ్యాక్సినేషన్ డ్రైవ్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జంతువుల నుంచి, ప్రధానంగా కుక్కల నుంచి వ్యాపించే ప్రాణాంతక వ్యాధి రేబిస్ అని అన్నారు. ఇది నరాల వ్యవస్థను దెబ్బ తీసి మరణానికి దారి తీయవచ్చన్నారు. దీనిని యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నివారించవచ్చన్నారు. అందుకే, జంతువులతో క్రమం తప్పకుండా మసలే వ్యక్తు లు, పశు వైద్యులు, పారిశుధ్య కార్మికులు ముందస్తుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్సీ, పీహెచ్సీ, యూపీహెచ్సీలలో ఈ నెల 12వ తేదీ వరకూ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ సుధీర్బాబు పాల్గొన్నారు. ఇంద్ర బస్సు ప్రయాణంలో రాయితీరాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సూపర్ లగ్జరీ ధరకే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కె.మాధవ్ ఆదివారం తెలిపారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు ఇంద్ర ఏసీ బస్సు టికెట్టు రూ.1,060 ఉండగా రాయితీపై రూ.920కే అందిస్తున్నామని తెలిపారు. -
కలల తీరం చేరాలిలా..
ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు కాకినాడ 6,343 కోనసీమ 2,868 తూర్పు గోదావరి 6,011 మొత్తం 15,222 బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంచుకున్న లక్ష్యం గొప్పదే కావచ్చు.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిపై కూడా అవగాహన ఉండాలి. ఆ ప్రయాణంలో సానుకూల అంశాలు.. అవరోధాల వంటి వాటిని ముందే తెలుసుకుంటే.. అడుగు ముందుకు ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి.. ఏపీ ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించి.. ఇంజినీరింగ్ చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలనుకునే విద్యార్థులకు.. ఆ మార్గంలో తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్ షెడ్యూల్ను జూలై 1న ప్రారంభించగా ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి కళాశాలల్లో చేరాలి. దీంతో, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు హడావుడి మొదలైంది. ఇప్పటికే ఏ కోర్సు చదవాలి, ఏ కళాశాలలో చేరాలి తదితర అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్లో తాము ఎంచుకున్న కళాశాలకు ఆప్షన్ ఇవ్వడంపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విద్యానిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులోకి కొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తవి కూడా అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రొబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇలా.. ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు cets.apsche.ap.gov.in&25 వెబ్సైట్లో అడ్మిషన్పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ప్రవేశించాలి. అక్కడ అడిగిన సమాచారం పూర్తిగా నింపి. సబ్మిట్ కొట్టాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ, టీసీతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, రేషన్ కార్డులను అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి గత ప్రభుత్వం 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి. స్వయంగా చూసుకోవడం మేలు వెబ్ కౌన్సెలింగ్ సందర్భంగా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆన్లైన్ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటివి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరికి వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. ఎవరైనా స్నేహితుల ద్వారానో మరొకరితోనో ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేయిస్తే అనేక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బంది విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల ఆప్షన్, కోర్సు వారే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ దశ చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందాలి. వెబ్ కౌన్సెలింగ్ విద్యార్థి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనే పూర్తి బాధ్యుడు అవుతాడు. – ఎన్.రామకృష్ణయ్య, సీఎస్ఈ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకోవాలి విద్యార్థులు కళాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్ అనే భావన నుంచి బయట పడి, ఏ కోర్సుకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుకోవాలి. అందుకు తగిన బ్రాంచ్ ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరి కాదు. ఇటీవల సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సీఎస్ఈ కోర్సు ఒక్కటే ప్రాధాన్యము కాదనేది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ఆన్లైన్ కౌన్సెలింగ్కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. – డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, మెకానికల్ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల నేటి నుంచి ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ కాకినాడలో 2 హెల్ప్ లైన్ కేంద్రాలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యావేత్తలు -
ఆశ్చర్య‘పోక’ తప్పదు
కోనసీమలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతో పాటు మండపేట మండలం ద్వారపూడి ప్రాంతంలో సుమారు 386 ఎకరాల్లో పోక (వక్క) సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా, తోటల చుట్టూ గట్ల మీద ఈ పంట సాగవుతోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాకు పోక ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళను మించి ఇక్కడ వక్క సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎర్ర చెక్కల (పూజా సుపారీ) తయారీ ఇక్కడి ప్రత్యేకత. ‘కోకో’ల్లలుగా గింజల దిగుబడి ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో పండే కోకో గింజలు మాత్రమే నాణ్యమైనవని నిన్న మొన్నటి వరకూ పేరుండేది. కోనసీమలో పండే కోకో గింజలు ఇప్పుడు ఆ పేరును తుడిచిపెట్టేశాయి. జిల్లాలోని 3,800 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగవుతోంది. ఏటా సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి ఏటా రూ.54.20 కోట్ల విలువైన కోకో గింజల దిగుబడి వస్తోందని అంచనా. -
అభినందన సీమ
ఉద్యాన పంటలు భేష్ ● అరుదైన ఎర్ర చక్కెరకేళీ సాగులో అగ్రస్థానం ● ‘పాన్’కు పెట్టింది పేరు సీమ తమలపాకు ● కేరళను మించిన ‘వక్క’ ● ఘనా దేశానికి దీటుగా కోకో నాణ్యత ● గూడపల్లి మామిడికి యమ క్రేజ్సాక్షి, అమలాపురం: ఉద్యాన పంటల సాగులో కోనసీమ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే పంటలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఇక్కడి ఉత్పత్తుల కొనుగోలుకు ఉత్తరాది వ్యాపారులు ఎంతో ఆసక్తి చూపుతారు. సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, రుచిలోనూ చవులూరించడమే దీనికి కారణం. ఆను‘పాను’ తెలుసు కోనసీమ నుంచి వెళ్తున్న తమలపాకును ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆనుపానులు తెలుసుకుని ఇక్కడి రైతులు పండించే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు చెబుతారు. జిల్లాలోని పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి మండలాల్లో సుమారు 240 ఎకరాల్లో ఈ పంట పండుతోందని అంచనా. ఇప్పుడు పశ్చిమ గోదావరి నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ వరకు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. -
● గోదారి.. ఎర్రబారి..
గోదావరి పరవళ్లుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు పోలవరం నుంచి విడుదలవుతున్న నీటితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగింది. బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం 1,89,129 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గానూ 157 గేట్లను 0.40 మీటర్ల మేర పైకి లేపి మిగులు జలాలను వదులున్నారు. ధవళేశ్వరం ఆర్మ్లో 66, ర్యాలీ ఆర్మ్లో 42, మద్దూరు ఆర్మ్లో 20, విజ్జేశ్వరం ఆర్మ్లో 29 గేట్లను పైకి లేపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.80 అడుగులుగా నమోదైంది.రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఎర్రబారిన గోదావరినిన్నటి వరకూ నీలి రంగు జలాలతో కనువిందు చేసిన గోదావరి.. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఎర్రబారింది. గోదావరికి ఏటా జూన్లో వరద రావడం.. నీరు అరుణవర్ణం దాల్చడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది వరద నీరు రావడం ఆలస్యమైంది. వరద నీటితో కొత్తందాలను సంతరించుకున్న గోదావరిని చూసేందుకు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్కు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
కందిపప్పు.. ఉడకట్లే..
సాక్షి, రాజమహేంద్రవరం: రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందా.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు క్రమంగా తగ్గిస్తూ వస్తోందా.. అందుకే అధికారం చేపట్టినప్పటి నుంచీ చౌక దుకాణాలకు సక్రమంగా సరఫరా చేయడం లేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రేషన్ కార్డుదారుల నుంచి. లబ్ధిదారులకు నిరాశే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు నిత్యావసరాలైన కందిపప్పు, బియ్యం, చక్కెర, పామాయిల్ను సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలం నుంచి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ రేషన్ సరకులు అందించే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లను (ఎండీయూ) తొలగించింది. పది నెలలుగా అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. దీంతో, ప్రతి నెలా కార్డుదారులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నెల కూడా కందిపప్పు రాలేదని రేషన్ డీలర్లు చెబుతూండటంతో చేసేది లేక ఇచ్చిన సరకులే తీసుకుని వారు వెనుతిరుగుతున్నారు. ఈ నెలలో ఒక్క కేజీ కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 వరకూ పలికింది. ఈ ధర కొన్ని మాసాల పాటు కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సబ్సిడీ ధరకు కందిపప్పు సరఫరా చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులేత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీకే మంగళం పాడేసింది. అప్పుడు మొదలైన అరకొర సరఫరా నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.130 ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై ఇవ్వలేని ప్రభుత్వం.. కనీసం ధర దిగివచ్చినప్పుడైనా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం లేదు. రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై కిలో కందిపప్పు రూ.67కే అందించాలి. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో హోల్సేల్లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టుగా సర్కారు మిన్నకుండిపోతోంది. పేదలపై భారం జిల్లావ్యాప్తంగా 5 (మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఒక్క ఎంఎల్ఎస్ పాయింటులోనూ కందిపప్పు కిలో కూడా నిల్వ లేకపోవడం గమనార్హం. రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో కందిపప్పు నిల్వలు నిండుకోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది. జిల్లాలో ఇలా.. రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీ లోపు డీడీలు తీసి, తమ పరిధిలోని కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరకులు దిగుమతి చేసుకుంటారు. కొన్ని నెలలుగా డీలర్లు డీడీలు తీస్తున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. జిల్లాకు 564.9 టన్నుల కందిపప్పు అవసరం కాగా, వంద, 150 టన్నులు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో, కార్డుదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు అందడం లేదు. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని డీలర్లకు అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో వారు పూర్తి స్థాయిలో డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు అడుగుతూంటే.. తమకే రాలేదని డీలర్లు బదులిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూంటే రేషన్ షాపుల నుంచి కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పది నెలలుగా సక్రమంగా జరగని సరఫరా ఈ నెల పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం కార్డుదారులకు అవస్థలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక గగ్గోలుజిల్లాలో రేషన్ షాపులు కార్డుల వివరాలు మండలం రేషన్ రేషన్ షాపులు కార్డులు అనపర్తి 39 22,488 బిక్కవోలు 40 22,480 చాగల్లు 36 21,072 దేవరపల్లి 34 25,416 గోకవరం 36 22,644 గోపాలపురం 43 21,128 కడియం 45 29,138 కోరుకొండ 43 26,991 కొవ్వూరు 55 33,320 నల్లజర్ల 42 27,554 నిడదవోలు 51 34,483 పెరవలి 43 23,233 రాజమహేంద్రవరం రూరల్ 59 50,511 రాజమహేంద్రవరం అర్బన్ 105 83,403 రాజానగరం 48 36,324 రంగంపేట 30 19,778 సీతానగరం 44 24,085 తాళ్లపూడి 34 16,811 ఉండ్రాజవరం 44 24,135 జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డులు 5,64,000 కార్డుల్లోని సభ్యులు 15,77,393 వీరికి అవసరమైన కందిపప్పు 564.9 టన్నులు అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేసినది 25 టన్నులు