breaking news
East Godavari District News
-
మాటల గారడీ
2026 –2027 రాష్ట్ర బడ్జెట్లో మాటల గారడీ తప్ప ఇంకేమీ లేదు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. చాలా జిల్లాల్లో కలెక్టరేట్లు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. జిల్లా సమగ్ర అభివృద్ధికి, కలెక్టరేట్ల నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని ఇప్పుడు వరకు చెప్పగా బడ్జెట్ ప్రసంగంలో 60 శాతం మాత్రమే పూర్తయిందని చెప్పడం చంద్రబాబు అబద్ధపు మాటలకు నిదర్శనం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ప్రస్తావనలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.86 లక్షల మంది రైతులకు రూ.6,650 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం, కౌలురైతులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో 80 శాతం పంటలు పండిస్తున్నది కౌలురైతులే. 35 లక్షల మంది కౌలురైతుల్లో 10 లక్షల మందికి పైగా భూమిలేని నిరుపేదలు ఉన్నారు, వారికి పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయం. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఇది ప్రజావంచక బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది పూర్తిగా ప్రజా వంచక బడ్జెట్. సమాజంలో ఏ వర్గం ప్రజల్ని ఇది తృప్తి పరచలేకపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు – నాడు నేడు పథకంలో పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయి. కానీ ఈ బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కేవలం రూ.1,500 కోట్లు కేటాయించారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్లోని కొన్ని పథకాలకు ఇంకా నిధులే కేటాయించలేదు. ఉద్యోగులకు కూడా మొండి చెయ్యి చూపారు. ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించిన నిధులు బకాయిలకే సరిపోవు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ప్రతినెలా రూ.1,500, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇలా ప్రతి అంశంలోనూ ఎన్నికల వాగ్దానాలకు మంగళం పాడారు. – సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీ కాజులూరు: రెండేళ్లుగా కాజులూరు, కరప తదితర మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. కొత్త గైగొలుపాడు అంబేడ్కర్ కాలనీకి చెందిన పిల్లి సింహాచలం, కాకినాడ మధురానగర్కు చెందిన ద్రాక్షరాపు ఉమాశంకర్, సర్పవరం పూల మార్కెట్ ప్రాంతానికి చెందిన దార నాని గత కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్యకృష్ణల ఆధ్వర్యంలో గొల్లపాలెం, కరప పోలీస్టేషన్ల సిబ్బంది రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొల్లపాలెం శలపాక రోడ్లోని రైస్మిల్లు ప్రాంతంలో శుక్రవారం రాత్రి గొల్లపాలెం ఎస్సై మోహన్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వలపన్ని వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువజేసే కారు, ఏడు మోటారు సైకిళ్లు, ఒక ల్యాప్టాప్, 186 గ్రాముల వెండి వస్తువులు, మూడు సెల్ ఫోన్లు రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
కేశవో.. నారాయణో!
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ప్రజలను దగా చేసేలా ఉంది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళలు, యువత, సంక్షేమం ఇలా అన్ని రంగాలకు, వర్గాలకు అన్యాయం జరిగింది. కేటాయింపుల్లో కోత విధించి ప్రజలను మోసం చేశారు. ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్లో అన్నీ కోతలే విధించారు. పలు రంగాలకు సగం కంటే తక్కువ నిధులు కేటాయించారు. రైతులు, మహిళలను దారుణంగా మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా రని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. కూటమి బడ్జెట్పై మేధావులు, రైతు సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇంత దారుణమైన బడ్జెట్ తాము ఎన్నడూ చూడలేదని నిట్టూరుస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుద్యోగులకు దగా... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేకుండా వారిని నిట్టనిలువునా మరోసారి మోసం చేశారు. నిరుద్యోగ భృతికి నయా పైసా కూడా కేటాయించలేదు. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రైతులకు పంగనామాలు అన్నదాత సుఖీభవ పథకంలో ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల వేళ చెప్పారు. తాజా బడ్జెట్లో అరకొర కేటాయింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామంటూ మెలిక పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల రైతు కుటుంబాలున్నాయి. అన్నదాత సుఖీభవకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. జిల్లాలో రైతులకు అందే ఆర్థిక సాయంలో భారీగా కోత పడనుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా కింద రూ.90.55 కోట్ల చొప్పున చెల్లించింది. ఈ బడ్జెట్లో కౌలు రైతులను ఆదుకోనేలా కేటాయింపులు లేవు. పర్యాటక రంగానికి అరకొరగా.. జిల్లాలో టెంపుల్, ఎకో, కెనాల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇటీవల మంత్రి దుర్గేష్ ప్రకటించారు. గోదావరి కాలువ, రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జి, కడియం నర్సరీలను కలుపుతూ సర్క్యూట్గా అభివృద్ధి చేసే ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం ఆ మేరకు పూర్తి స్థాయిలో కేటాయింపు జరగలేదు. రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా ప్రకటించలేదు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు ఈ బడె్జ్ట్ ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు ప్రదర్శించింది. పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,500 కోట్లు కేటాయించారు. జిల్లా వాటాగా కలిగిన ప్రయోజనం అంతంత మాత్రమే. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పాఠశాలల అభివృద్ధికి ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే రూ.250 కోట్లకు పైగా కేటాయించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐబీ, రూఫెల్ నిలిపివేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన సంస్కరణల అమలును రాజకీయ దురుద్దేశంతోనే ఆపేశారనన అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు బిగ్ షాక్ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పీఆర్సీ, ఐఆర్ ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. సీపీఎస్ రద్దును ఎక్కడా ప్రస్తావించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్లు అవుతున్న ఇవ్వకపోవడపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. పుష్కరాలకు నిధులేవి? 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు మరీ తక్కువగా ఉంది. పుష్కర ఏర్పాట్లకు కేవలం రూ.60 కోట్లు కేటాయించారు. నిరాశ మిగిల్చిన చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ కేశవ్ పద్దులో అన్ని రంగాలకు, వర్గాలకు అన్యాయం కేటాయింపుల్లో భారీగా కోతలు జిల్లా వాసులకు ఒరిగింది శూన్యం మహిళలకు మొండి చేయి నిరుద్యోగులకు మరోసారి టోపీ అన్నదాత సుఖీభవకు అరకొర విదిలింపు తల్లికి ద్రోహం.... తల్లికి వందనం పేరుతో పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇస్తామన్నారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా అవసరంగా కేవలం రూ.9,668 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో జిల్లా వాటాగా భారీ తగ్గే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న చెప్పినా ఒక ఏడాది ఎగనామం పెట్టారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకంలో ఏటా రూ.243 కోట్లు అందించేవారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే పథకంలో భారీగా కోత పడే అవకాశం ఉంది. మహిళలకు మోసం మహిళా అభ్యున్నతికి పాటుపడతామని ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్ కేటాయింపుల్లో దారుణంగా మోసం చేశారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఉచిత గ్యాస్ హామీ తుస్ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది ప్రారంభంలో రెండు సిలిండర్లు వరుసగా ఇచ్చి ఎగనామం పెట్టారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దశల వారీగా అందజేస్తున్న ఉచిత సిలిండర్ల లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించారు. ఇప్పటి వరకు ఉచిత సిలిండర్లు అందించిన ఐదు విడతల్లో జిల్లావ్యాప్తంగా 15.20 లక్షల సిలిండర్లు ఇచ్చినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో 5.69 లక్షల రేషన్ కార్డులున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్కో దశలో 5.60 లక్షల సిలిండర్లు ఇవ్వవలసి ఉంది. ఇలా ఆరు సార్లు ఇవ్వవలసి ఉంది. అంటే సుమారుగా 34.14 లక్షల సిలిండర్లు లబ్ధిదారులకు చేరవలసి ఉంది. కానీ కేవలం 15.20 లక్షల మందికి మాత్రమే అందజేశారు. సున్నా వడ్డీకి గుండుసున్నా ఎన్నికల సమయంలో రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదీ 33,498 గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.37.27 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 6,680 సంఘాలకు రూ.8.42 కోట్ల వడ్డీ రాయితీ అందించింది. -
మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): శంభోశంకర ... హరహర మహాదేవా అంటూ భక్తులతో శివాలయాలు మారుమోగనున్నాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లాలోని అన్ని శివాలయాల్లో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌతమ మహర్షి తపో ఫలితంగా, పరమ శివుని జటాజూటం నుంచి జాలు వారిన గోదావరి పరీవాహక ప్రాంతం నేడు శివనామ స్మరణతో మార్మోగనుంది. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించి పరమేశ్వరుడు దర్శనానికి భక్తులు సిద్ధమవుతున్నారు. గోదావరి నది ఒడ్డున అనేక శివాలయాలు ఉన్నాయి. వాటిలో అతి ప్రాచీనమైనవి, పురాతనమైన శివాలయాలున్నాయి. రాజమహేంద్రవరంలోని కోటిలింగాలపేటలోని భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వరస్వామి, మార్కండయేశ్వర స్వామి, భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వరస్వామి, జాంపేటలోని ఉమా రామలింగశ్వర దేవాలయం, సారంగధరేశ్వరుని ఆలయం, మహాకాళేశ్వర ఆలయాల్లో భక్తుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
బాలయోగీశ్వరులను దర్శించుకుందాం రారండి
నేటి నుంచి తీర్థమహోత్సవాలు ముమ్మిడివరం: ముని మండలంగా ప్రసిద్ధి చెందిన ముమ్మిడివరంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. నాలుగు దశాబ్దాల పాటు కఠోర తపస్సు ఆచరించి ముక్తి పొందిన శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో ఆదివారం నుంచి తీర్థ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం బాలయోగీశ్వరుల దివ్య సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులు అన్నసమారాధన, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ దర్శన మండపంపై బాలయోగీశ్వరుల పరబ్రహ్మ మూర్తి విగ్రహ దర్శనం, దివ్య సమాధుల దర్శనం ఉంటుంది. కఠోర తపస్సు చేసి.. ముమ్మిడివరంలో కటికదల గంగయ్య, రామమ్మ దంపతులకు సుబ్బారావు 1930 అక్టోబర్ 23న జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పశువుల కాపరిగా జీవనం సాగిస్తూ భక్తిభావం అలవర్చుకున్నారు. స్థానిక లంకతల్లమ్మ తీర్థంలో కృష్ణుడు, నారదుడు ఫొటోలను కొని తెచ్చుకుని కొబ్బరి తోటలో చెట్టు కింద పెట్టి గంటల తరబడి జ్ఞానంలో నిమగ్నమయ్యారు. 1946 జూన్ 22న కృష్ణ నామస్మరణతో తపస్సును ప్రారంభించారు. ఎండ, వాన లెక్క చేయకుండా నిద్రాహారాలు మాని ధ్యానంలో గడిపారు. అదేవిధంగా అతని సోదరుడు కూడా తపస్సులో పాల్గొన్నారు. బాల్య దశలోనే జ్ఞాన నిరతిని కలిగిన ఈ సోదరులు బాలయోగీశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. సుమారు 40 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి ఈ ప్రాంతానికి చారిత్రాత్మక పేరు తెచ్చారు. తపో ఆశ్రమంలో నిరంతరం తపస్సు ఆచరిస్తూ ఏటా శివరాత్రి మరునాడు భక్తులకు ప్రత్యక్ష దర్శనమిచ్చేవారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చేవారు. తీర్థం అనంతరం భగవాన్ బాలయోగీశ్వరుల తపస్సుకు భంగం వాటిల్లకుండా తపో మందిరం తలుపులకు తాళాలు వేసేవారు. 1985 జూలై 19న పెద బాలయోగీ, 1991 అక్టోబర్ 28న చిన బాలయోగీశ్వరులు కై వల్య సిద్ధి పొందారు. ఽసోమవారం జరిగే తీర్థ మహోత్సవాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు బాలయోగీశ్వరుల సమాధులను దర్శించుకోనున్నారు. ఇప్పటికే తపో ఆశ్రమాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
రాయవరం: జాతీయ స్థాయిలో నిర్వహించే వాలీబాల్ జట్టుకు రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పోలిశెట్టి భార్గవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీత తెలిపారు. ఈ నెల 13న అనకాపల్లిలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలురు, బాలికల 46వ సబ్ జూనియర్ సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో బాలుర జట్టుకు ఎంపికై న భార్గవ్ ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకూ పశ్చిమ బెంగాల్లోని హుబ్లీలో జరిగే జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్లో పాల్గోనున్నట్లు ఆమె తెలిపారు. భార్గవ్ను, తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు సీహెచ్ అజ్జిబాబు, కె.శ్రీనివాసులును పలువురు అభినందించారు. దేవరపల్లి: అనకాపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్స్లో దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు బి.బాలు మహీధర్, ఎం.వెన్నెల ప్రతిభ చాటారని హెచ్ఎం ఎం.వీర్రాజు తెలిపారు. వీరు పశ్చిమ బెంగాల్లో జరుగనున్న జాతీయ స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారు. -
కాశీ ఇసుక, గంగాజలంతో సూక్ష్మ శివలింగం
కపిలేశ్వరపురం (మండపేట): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మకళా శిల్పి అండలూరి వీర వెంకట సత్యనారాయణ.. కాశీ నుంచి తెచ్చిన ఇసుక, గంగాజలంతో సూక్ష్మ శివలింగాన్ని రూపొందించారు. కందిబద్ద పరిమాణంలో తయారైన సూక్ష్మ శివలింగాన్ని పెన్సిల్పై అమర్చి శనివారం ప్రదర్శించారు. 2005లో తన తల్లిదండ్రులు త్రయంబకాచారి, వెంకటలక్ష్మి దంపతులు కాశీ నుంచి తీసుకొచ్చిన ఇసుకను భక్తితో భద్రపరిచామని సత్యనారాయణ తెలిపారు. రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో సైకత శివలింగాన్ని తయారు చేసి పూజించిన ఘట్టానికి ఆకర్షితుడినై తాను ఈ సైకత శివలింగం తయారు చేశానని చెప్పారు. సత్యనారాయణ గతంలో సూక్ష్మ రూపంలో పంచలోహాలతో శివలింగం, బియ్యపు గింజతో శివలింగం, నవరత్నాల్లో ఒకటైన పచ్చ (మరకత) శివలింగం, విద్యుత్ బల్బులోని ఫిలమెంట్తో శివలింగాన్ని తయారు చేశారు. -
గుండెపోటుతో డిప్యూటీ తహసీల్దార్ మృతి
దేవరపల్లి: గోపాలపురం మండలంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న తాతపూడి దివాకర్ (45) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో దివాకర్ సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వారు తెలిపారు. జిల్లాలోని దివాన్చెరువుకు చెందిన దివాకర్ మూడేళ్లుగా గోపాలపురం మండల సీఎస్ డీటీగా పనిచేస్తూ, తాళ్లపూడి మండల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. పని ఒత్తిడి వల్ల దివాకర్ గుండెపోటుకు గురైనట్టు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. రెండు మండలాల బాధ్యతలు అప్పగించడం వల్ల పని ఒత్తిడి ఎక్కువైనట్టు అంటున్నారు. -
వ్యసనాలకు బానిసై చోరీల బాట
ఐదుగురు నిందితుల గుర్తింపు రాయవరం: చెడు వ్యసనాలకు బానిసైన ఐదుగురు యువకులు చోరీల బాట పట్టారు. చివరికి కటకటాల పాలయ్యారు. శనివారం రాయవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ జరిగిన తీరును రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య వెల్లడించారు. రాయవరం గ్రామానికి చెందిన వంకా మణికంఠ, కఠారి రాజు, దండంగి వీరవెంకట సత్యనారాయణ (డీవీ)లు స్నేహితులు. వీరు సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. దీనికి చోరీ బాటను ఎంచుకున్నారు. మణికంఠ ఉంటున్న వీధిలోనే పులగం లక్ష్మి, భామిరెడ్డి కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. లక్ష్మి ఒంటిపై బంగారు ఆభరణాలు ఉండడం గుర్తించి చోరీ చేయాలని మణికంఠ అనుకున్నాడు. దీనికి పలు కేసుల్లో నిందితుడు రాజమహేంద్రవరం వాసి లక్కోజు విశ్వనాఽథ సంతోష్ సాయికుమార్ సాయం కోరారు. గతంలో కొమరిపాలెంలో నివాసం ఉండడంతో సంతోష్ సాయికుమార్ రాయవరంలో దొంగతనం చేస్తే ఎవరైనా గుర్తు పడతారని భావించి రాజమహేంద్రవరం నుంచి దారపు దుర్గాప్రసాద్ను సాయం అడిగాడు. వీరందరూ కలసి చోరీకి ప్రణాళిక చేశారు. ఈ నెల 10న రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న పులగం లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును దుర్గాప్రసాద్ చోరీ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో సగం తాడు లక్ష్మి వద్ద ఉండగా, సగం తాడును దుర్గాప్రసాద్ దొంగిలించాడు. అందులో బంగారు తాడు ముక్క, రూపు, ఒక సూత్రం కఠారి రాజుకు ఇచ్చాడు. రాజు అనుమానం రాకుండా ఆ బంగారు తాడును చైనుగా మలిచాడు. దొంగిలించిన తాడును దండంగి వీరవెంకట సత్యనారాయణ అనపర్తిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టగా, రూ.3.30 లక్షలు వచ్చింది. ఆ సామ్మును ఐదుగురూ సమానంగా పంచుకున్నారు. మిగిలిన రూపు, ఒక సూత్రం అమ్మి డబ్బులు పంచుకోవడానికి వచ్చిన సందర్భంలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విద్య తెలిపారు. మణికంఠ, సాయివద్ద నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, రాజు వద్ద ఉన్న రూపు, సూత్రం, ఓ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన బంగారు గొలుసును రికవరీ చేశారు. లక్ష్మి వద్ద నుంచి దొంగిలించిన 42 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మూడు రోజుల్లోనే ఛేదించి.. : తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ విద్య పర్యవేక్షణలో అనపర్తి సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.సురేష్బాబులు సిబ్బందితో కలసి కేసును దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల సహాయంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించారు. తొలుత చైన్ స్నాచింగ్కు ఒకరే పాల్పడినట్లు భావించగా, తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఐదుగురు నేరంలో భాగస్వాములు అయినట్లు తేలింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అబాకస్ పోటీల్లో సత్తా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అంతర్జాతీయ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, వారిలో వెయ్యి మంది మాత్రమే ప్రతిభ చూపారని, ఇందులో 686 (68–66 శాతం) మంది తమ పాఠశాలకు చెందిన వారు ఉండటం గర్వకారణమన్నారు. ప్రతిభ చూపిన వారందరికీ హైదరాబాద్ రవీంద్రభారతిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా బహుమతులను శనివారం అందజేశారన్నారు. విజేతలను స్మార్ట్ జీనియస్ చైర్మన్ నల్లమిల్లి రాజ్యలక్ష్మి, డైరెక్టర్ శృతిరెడ్డి, సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్స్ అభినందించారు. -
రేల రేల రేలారే!
అది‘రేలా’.. అందరి మనసు దోచేలా.. రేల రేల రేలారే అంటూ చేసే కొమ్ము కోయ నృత్యం మన్యసీమకే వన్నె తెస్తోంది.. గిరిసీమ ప్రత్యేకతను చాటుతోంది.. గిరిజనుల సంప్రదాయంలో భాగమైంది.. ఇది కామన్వెల్త్, ఐపీఎల్లోనూ ప్రదర్శించడంతో ఇక్కడి కీర్తిని ఎగురవేస్తోంది.. అలాగే గిరిజన కళాకారులకు ఆదాయ వనరుగా మారింది. ఆ సంప్రదాయ నృత్యం పుట్టుక గురించి తెలుసుకుందాం రండి.. చింతూరు: గిరిజన సంస్కృతీ సంప్రదాయంలో ఆదివాసీ కొమ్ముకోయ నృత్యం ప్రధానమైంది. ఇది గిరిజన కళాకారులకు ఆదాయ వనరుగా మారింది. అలాంటి కొమ్ముకోయ నృత్యం పేరు చెబితే చింతూరు మండలం తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులే ముందుగా గుర్తొచ్చేది. పూర్వం తమ సొంత ఇళ్లలో శుభ కార్యాలతో ప్రారంభమైన కొమ్ముకోయ నృత్యం రాను రాను రాష్ట్రంలో వివిధ పండగలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల సందర్భంగా జరిగే ఉత్సవాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. నృత్యం ప్రారంభం ఇలా.. చింతూరు మండలం తుమ్మలకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంతమంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ముత్యం మృతి అనంతరం అతని కొడుకు రమేష్ ఈ పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తుమ్మలతో పాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా చింతూరు మండలంలో ప్రస్తుతం 20 బృందాల వరకూ కొమ్ముకోయ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక్కో ట్రూపులో ఈవెంట్ను బట్టి 20 నుంచి 40 మంది వరకూ సభ్యులు ఉంటారు. సభ్యుల్లో మహిళలు, పురుషులు ఉంటారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. దీంతో పాటు కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనను దర్శకులు పెడుతున్నారు. పుష్ప–2, గేమ్ ఛేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే, శ్లోకం వంటి చిత్రాల్లో తమకు అవకాశం కల్పించినట్లు కొమ్ముకోయ నృత్య కళాకారులు తెలిపారు. ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు తెలిపారు. నృత్య ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు ఎద్దు కొమ్ములు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తమ తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో నెమలి ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషులు వాయించే డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందుగా నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ వేగం పుంజుకొంటుంది. నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు కొట్టుకోవడం ఈ నృత్యానికే ఆకర్షణగా నిలుస్తోంది. దుస్తుల అలంకరణలో సైతం వీరు వైవిధ్యాన్ని పాటిస్తారు. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. ఫ కొమ్ముకోయ నృత్యం అదిరేలే ఫ గిరిజన సంప్రదాయంలో ప్రత్యేకం ఫ కామన్వెల్త్, ఐపీఎల్లో ప్రదర్శనలు -
ఐటీడీఏ సహకారం అందించాలి
కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న మాకు ఐటీడీఏ సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా అవకాశాలు కల్పిస్తే మరిన్ని ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రదర్శనల ద్వారా కూడా ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ ట్రూపు నిర్వాహకుడు, తుమ్మల ఎంతో ఆదరణ లభిస్తోంది ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే దేశ వ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇస్తాం. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి, తుమ్మల -
20 నుంచి పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా హక్కు చట్టం 2026, 27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటా సీట్ల ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం తెలిపారు. సీఎస్ఈ.ఏపీ.గవ్.ఇన్ వెబ్సైట్, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. విద్యార్ధులు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థుల ఆన్లైన్ వివరాల నమోదు ఉంటుందన్నారు. మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల అర్హత నిర్ధారణ చేస్తామన్నారు. 5న మొదటి విడత సీట్ల కేటాయింపు, మార్చి 6 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ , ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు, ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధ్రువీకరణ ఉంటుందన్నారు. జిల్లా సమగ్ర శిక్షా సీఎంవోను 94415 64466 నంబర్లో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. వాడపల్లికి భక్తుల తాకిడి ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతి నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యా స్నానాలు ఆచరించి క్యూ లో నిలబడి గోవింద నామాలు చెబుతూ మాడవీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలకు దాతలు సమకూర్చిన ఎలక్ట్రిక్ వాహనాలపై కొత్త వంతెన నుంచి స్వామి వారి ఆలయానికి చేర్చారు. సుమారు లక్ష మంది స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ.68,34,622 ఆదాయం వచ్చినట్టు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.చక్రధరరావు తెలిపారు. రాత్రి ధర్మపథం కార్యక్రమంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన అలరించింది. ఆలయ చైర్మన్ ఎం.వెంకటరాజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాలాజీ క్షేత్రంలో భక్తజన కోలాహలం మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి క్షేత్రం మాఘమాసం శనివారం సందర్భంగా కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉభయ దేవేరులతో కొలువై ఉన్న శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,09,353 ఆదాయం వచ్చిందని ఈఓ రాంబాబురెడ్డి తెలిపారు. స్వామి వారిని 8,500 మంది దర్శించుకున్నారన్నారు. -
అలల పంచన.. అపాయం అంచున..
● ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు ● మన పంట్లు, నాటు పడవలూ సేఫేనా? ● రోజూ వందలాది మంది రాకపోకలు ● అరకొరగా లైఫ్ జాకెట్లు ● గతంలో పడవలూ, టూరిస్ట్ బోట్లు మునిగి... పోయిన అనేక ప్రాణాలు ● అయినా వంతెనల నిర్మాణాలకు మీనమేషాలు మలికిపురం: నేటి ఆధునిక కాలంలో అనేక చోట్ల షికారుకే పరిమితం అయిన బోట్ల ప్రయాణం నేటికీ కోనసీమ ప్రజల జీవన యానానికి అవసరం అంటే మీరు నమ్మగలరా? చెక్కలతో నీటిపై తేలియాడేలా చేసే నాటు పడవలు, పంట్లు... ఇవే ఇక్కడ ప్రయాణానికి దిక్కు. సముద్రం ఆటుపోట్ల కారణంగా బ్యాక్ వాటర్ అధికంగా రావడం, వరదల బీభత్సం అధికంగా ఉండే నదీ మార్గాలు ఇవి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి – పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య గల మాధవాయపాలెం రేవు, సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవు, ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులు ఇందుకు తార్కాణం. ఇటువంటి ప్రధాన అధిక ప్రజల రవాణా జరిగే ప్రమాదకర రేవులు రాష్ట్రంలో ఎక్కడా లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వాహనాల రాకపోకల కోసం జాతీయ, రారష్ట్ర రహదారులకు మాత్రమే వంతెనలు వేస్తున్నాయి తప్ప ఇక్కడ సాధారణ ప్రజల సురక్షిత రాకపోకలకు వారధి నిర్మించడం లేదు. సఖినేటిపల్లి – నర్సాపురం రేవు కొద్ది సంవత్సరాల క్రితం దేవీపట్నం వద్ద లాంచీ మునగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రేవులలో భద్రత అంశంపై అప్పట్లో హడావుడి చేసి టూరిస్ట్ బోట్లపై కూడా ఆంక్షలు విధించారు. సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ కోనసీమ రేవులలో నదీ ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. అలల తాకిడి కూడా అధికమే. పోటు సమయంలో పంటు సైతం అలలపై ఎగిరి పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రయాణికులకు భద్రత పూజ్యం. ప్రస్తుతం వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవులో రెండు పంట్లు నడుస్తున్నాయి. ఇక్కడ రేవు వేలం పాట ఏడాదికి రూ.కోటి యాభై లక్షలకు పైగా పలుకుతుంది. ఈ రేవు సముద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దగ్గరగా నదికి మలుపు ఉంటుంది. దీంతో నది ప్రవాహ వేగం, ఆటుపోట్లకు అలల తీవ్రత అధికం. మత్స్యకారుల వేట బోట్లు సైతం ఇక్కడ అధికం. దీంతో ఇక్కడ పలుమార్లు పంటు, బోట్లు ఢీకొన్నాయి. ప్రాణనష్టాలు త్రుటిలో తప్పాయి. గడచిన నాలుగేళ్లలో నాలుగు సార్లు ఇంజను మధ్యలో ఆగిపోయి పంట్లు నాలుగు కిలోమీటర్ల వరకూ జనంతో సముద్రం వైపు వెళ్లి పోయాయి. గతంలో ఇక్కడ నాటు పడవలు మునిగి పలువురు చనిపోవడంతో పంటుపై ప్రయాణాలే కొనసాగిస్తున్నారు. వందేళ్ల నుంచి ఇక్కడ వంతెన కోసం ఐదుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. కానీ, నిర్మాణం ప్రారంభం కాలేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 216 జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ఇక్కడ వంతెన నిర్మాణం కోసం కేంద్రం ద్వారా రూ.600 కోట్లు మంజూరు చేయించారు. భూసేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేసే సమయంలో టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా కోర్టులో కేసు వేశారు. దీంతో, నాలుగు రోజుల్లో జగన్ శంకుస్థాపన చేస్తారనగా వంతెన నిర్మాణం, రోడ్ల పనులకు బ్రేక్ పడింది. పలు రేవులలో పడవలు నిషేధం గోదావరిలోని పలు రేవుల్లో పడవ, లాంచీల ప్రయాణాలను 2013లో నిషేధించారు. అంతర్వేది – బియ్యపుతిప్ప మధ్య పడవ ప్రయాణాలు ఉండేవి. 2013లో అంతర్వేది వద్ద భక్తులతో కిక్కిరిసిన పడవ మునిగి ఏడుగురు చనిపోయారు. అప్పటి నుంచీ ప్రభుత్వం ఈ రేవును మూసివేసింది. నర్సాపురం నుంచి అంతర్వేదికి 12 కిలోమీటర్ల మేర భక్తుల ప్రయాణాలకు ప్రభుత్వమే లాంచీలను ఏర్పాటు చేసేది. వేలాది మంది ప్రయాణం చేసేవారు. అంతర్వేది ప్రమాదంతో ఇక్కడ లాంచీల రేవును సైతం మూసివేశారు. చంద్రబాబు పాలనలో ముందుకు సాగని పనులు, ప్రతిపాదనలు గోదావరి నది రేవులు, నది మధ్యలో లంకల ప్రజల శ్రేయస్సు కోసం ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రూ.600 కోట్లతో తలపెట్టిన సఖినేటిపల్లి – నర్సాపురం (రామేశ్వరం – రాజుల్లంక) వంతెన, జాతీయ రహదారి (బైపాస్) పనులను ముందుకు తీసుకుని రావడం లేదు. భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా, జనసేన నుంచి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ (రిటైర్డ్ ఐఏఎస్) ప్రాతినిధ్యం ఉండి కూడా ఇక్కడ పనులు సాగడం లేదు. గత సీఎం జగన్ మంజూరు చేయించిన ఈ పనులకు భూసేకరణ నిధులు రెవెన్యూకు, రైతులకు బదలాయించారు. అయినా, ముందుకు సాగడం లేదు. ముక్తేశ్వరం – కోటిపల్లి వంతెనకు అప్పటి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ద్వారా ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రభుత్వం వాటినీ పట్టించుకోవడం లేదు. ఊడిమూడి రేవు వద్ద వంతెనకు గత సీఎం జగన్ రూ.40 కోట్లు మంజూరు చేశారు. వంతెన దాదాపు పూర్తయినా మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు ఇది బ్రిటిష్ కాలం నుంచీ రాకపోకలు అధికంగా ఉండే రేవు. ఇక్కడ వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ రేవులన్నీ నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. బైక్లు, కార్లు, అవసరమైతే పశువుల రవాణా కూడా జరుగుతుంది. ట్రిప్కు 100 నుంచి 200 మందికి పైగా ప్రయాణికులు ఉంటారు. కార్లు, బైక్లు అదనం. ఒక్కొక్కసారి లారీలను కూడా పంట్లపై ఎక్కిస్తారు. పడవలపై కార్లు కూడా ఎక్కిస్తారు. కానీ పదుల సంఖ్యలో మాత్రమే లైఫ్ జాకెట్లు ఉంటాయి. ఇక్కడ పడవలు, పంట్లు ఇంజన్ల సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ గాలికి.. కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం నుంచి భారీ మత్స్యకార బోట్లు అంతర్వేది పల్లిపాలెం వద్ద నదిలో ప్రవేశించి నర్సాపురం వస్తాయి. గతంలో ఈ భారీ బోట్లు, పంట్లు ఢీకొన్న ఘటనలూ జరిగాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఘటనలు సర్దుబాటు అయిపోయాయి. ఇక రేవు పాటదారులకు వేలం పాటపై ఉన్న శ్రద్ధ నిర్వహణపై ఉండదని, తమ రక్షణ గాలికి వదిలేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మాత్రమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా రక్షణ చర్యలు తీసుకుంటారు. ఆ మరుసటి రోజు నుంచి షరా మామూలే. నిత్యం రద్దీగా ఉండే సఖినేటిపల్లి – నర్సాపురం రేవులో ప్రమాదకరంగా పంట్ల రాకపోకలు జగన్కు పేరు రాకూడదనే కేసు కుట్ర ఈ వంతెన కం రోడ్డుకు సంబంధించి కేవలం మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కోర్టులో కేసు వేశారు. తన పొలం మీదుగా రోడ్డు వేయవద్దని, తాను చాలా పేద రైతునని పేర్కొన్నారు. ఈ కేసును కింది కోర్టులు కొట్టి వేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు హియరింగ్ ఈ నెల 17న ఉందని జాతీయ రహదారుల అధికారులు చెప్పారు. ఫిర్యాదుదారుకు ఇవ్వాల్సిన పరిహారం కోర్టుకు జమ చేసినట్లు పేర్కొన్నారు. చాలా చిన్న విషయాన్ని పట్టుకుని ఏకంగా రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టును అమలు చేయకుండా ఉండడం చంద్రబాబు సర్కారు కుట్రగా భావిస్తున్నారు. మాజీ సీఎంకు జగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది. సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవు సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవులో గత వైఎస్సార్ సీపీ హయాంలో పంట్లు ఉండేవి. ప్రస్తుతం ఇక్కడ నాటు పడవలే గతి. రాత్రి వేళల్లో కూడా ఇక్కడ నాటు పడవల పైనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు ఎవరి వైపు వారే రేవులు పాడుకుంటారు. బోట్లు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారు. ఇక్కడ రద్దీ ఉన్నా పంట్లు వేయడం లేదు. దీంతో ప్రమాదకరమైనా నాటు బోట్ల పైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. నాటు పడవలపై లైఫ్ జాకెట్లు ఉండవు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
● చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి ● వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారెడ్డి డిమాండ్ రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. గురువారం బొమ్మూరు లోని పార్టీ కార్యాలయంలో జిల్లా దివ్యాంగుల సెల్ అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ అధ్యక్షతన జిల్లా దివ్యాంగుల సెల్ సంస్థాగత కమిటీ నిర్మాణ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దుర్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆందోళన నిర్వహించిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో కూటమి కార్యకర్తలకు, ఆ పార్టీలో పనిచేసే సానుభూతిపరులకు దివ్యాంగుల పెన్షన్లు తిరిగి మంజూరు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులకు, కార్యకర్తలకు పెన్షన్లు తొలగించారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దివ్యాంగులకు పెన్షన్లను ప్రతినెలా ఒకటో తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. 2016 దివ్యాంగుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున చంద్రబాబు ఇంద్రధనస్సు పేరుతో ఏడువరాలు ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర దివ్యాంగుల సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యలను గాలికొదిలేసిందన్నారు. ఉమ్మడి చిత్తూరి జిల్లా దివ్యాంగుల సెల్ అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష హోదాలేనప్పటికీ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్నారన్నారు. 2029లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చేవరకు దివ్యాంగులంతా చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పోసికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఇవ్వవలసిన పెన్షన్ను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కొంతమంది డాక్టర్లు దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిపై 2016 చట్టం 92 ఏ సెక్షన్ ప్రకారం కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కోలాటి నాగరాజు, రాజమహేంద్రవరం అర్బన్ అధ్యక్షుడు మహేష్, దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవాధ్యక్షుడు ముద్దాల అను, దివ్యాంగుల మహిళా నాయకురాలు సానబోయిన దుర్గ పాల్గొన్నారు. -
ఇక అధోతరగతి!
● టెన్త్ పరీక్షలపై ప్రైవేట్ టీచర్ల పెత్తనం ● 30 శాతం మందిని ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు కసరత్తు ● సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం ● వివరాల సేకరణలో విద్యాశాఖ అధికారులు ● ఈ విధానంపై వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వంలో ప్రైవేటు పెత్తనానికి చంద్రబాబు ప్రభుత్వం ద్వారాలు తెరుస్తోందా? ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకు కట్టబెట్టేందుకు పావులు కదిపిందా? తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోందా? ఏయే పాఠశాలల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో గణాంకాలు సేకరించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలివ్వడం ఇందుకు బలం చేకూరుస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది విద్యావేత్తల నుంచి. ఇదేం విప్లవాత్మకం? విద్యాశాఖలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం గందరగోళ విధానాలకు తెర తీస్తోంది. విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పర్యవేక్షణ (ఇన్విజిలేటర్లు) బాధ్యతలను ప్రైవేటు ఉపాధ్యాయులకు అప్పగించే విధానానికి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్న తరుణంలో పదో తరగతి పరీక్షల విధానంలో తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూర్చేందుకేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అమలైతే పరీక్షల్లో పారదర్శకత కొరవడుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల యాజమాన్యాలు పరస్పరం సహకరించుకునే అవకాశం ఉంటుందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఎస్జీటీలకు పూర్తిగా మినహాయింపు పది పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఇప్పటి వరకు అత్యధిక శాతం సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్జీటీ) నియమించడం పరిపాటిగా వస్తోంది. మార్చిలో జరిగే పరీక్షల్లో వారిని పూర్తి స్థాయిలో దూరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను సైతం పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం చేయాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకాలకు అమలు చేస్తున్న మాన్యువల్ విధానానికి మంగళం పాడేదిశగా రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఏడీఓలు, ఇన్విజిలేటర్లను డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏఏ పాఠశాలల్లో ఎంతమంది పనిచేస్తున్నారు..? అనే విషయమై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. 30 శాతం ప్రైవేటు టీచర్ల భాగస్వామ్యం పదో తరగతి పరీక్షలకు అవసరమైన ఇన్విజిలేటర్లలో కనీసం 30 శాతం మందిని నియమించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు ఇప్పటికే ప్రకటించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి పబ్లిక్ పరీక్షల్లోనూ ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే నియమిస్తున్నారు. పరీక్షలు జరిగినన్ని రోజులు ముఖ్యంగా హైస్కూలు, సమీప ప్రాథమిక పాఠశాలల్లో కేవలం కొద్దిమంది మాత్రమే టీచర్లు ఉంటున్నారు. దీంతో పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కష్టంగా మారుతోందన్న కారణంతో ప్రైవేట్ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు విద్యాశాఖ చెబుతున్నా.. ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ నియామకాలు పది పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించేందుకు తొలిసారిగా డిజిటల్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. పాఠశాల హెచ్ఎంలు, అన్ని కేడర్ల ఉపాధ్యాయుల వివరాలు ఉపాధ్యాయులు సమాచార వ్యవస్థ టిస్లో డిజిటల్ రూపంలో లీప్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆటోమేషన్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన డీఓలు, ఏడీఓలు, ఇన్విజిలేటర్లను నియమిం చనున్నారు. వీరు పనిచేసే పాఠశాలలకు 10 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న పరీక్షా కేంద్రాల్లో నియమించేలా సాఫ్ట్వేర్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇన్విజిలేటర్ల నియామకంలో 60 సంవత్సరాలు పైబడిన వారు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షల విధుల నుంచి మినహాయించనున్నట్లు తెలిసింది. లీప్యాప్లో ఇందుకోసం ఆప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా పరీక్షల విధులకు నియమితులైనవారు తప్పనిసరిగా డ్యూటీకి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాని వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసే అవకాశముంటుంది ఇన్విజిలేటర్లుగా స్కూలు అసిస్టెంట్లు పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీతం, ఇతర సబ్జెక్టులు బోధించని వారిని మాత్రమే నియమించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, సంస్కృతం పరీక్షలకు.. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ టీచర్లను నియమించనున్నారు. గ్రూపు సబ్జెక్టులు గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు టీచర్లను నియమించనున్నారు. వీరు మొత్తంగా మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే పరీక్షల విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో ఇలా పదో తరగతి విద్యను బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జిల్లాలో 204 ఉండగా 12,977 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో సుమారు 4,500 మంది ఉపాధ్యాయులు ఉండగా.. పది పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు సుమారు 1,500 మంది అవసరం ఉంది. ఇందులో 30 శాతం ప్రైవేటు ఉపాధ్యాయులు ఉండనున్నారు. పారదర్శకతపై అనుమానాలు ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగిస్తే పరీక్షల్లో పారదర్శకత లోపిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు టీచర్లు ఆయా పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క కాపీయింగ్కు పాల్పడే విద్యార్థులను చూసీచూడనట్లు వదిలేసే పరిస్థితి తలెత్తుతుందన్న భావన కలుగుతోంది. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. . -
ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ జరగాలి
రాజమహేంద్రవరం రూరల్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ జరగాలని ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీడీ నడాఫ్ అన్నారు. మోరంపూడిలోని కల్యాణ మండపంలో బుధవారం ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఐదో సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎస్ రామచంద్రరావు, పీఎస్వీఎస్ శర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, జనరల్ సెక్రటరీ నడాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడాఫ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినట్లే పెన్షనర్లకు కూడా రివిజన్ జరగాలని డిమాండ్ చేశారు. రివిజన్ పెరగకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం కోర్టులో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రాధాకృష్ణ, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్, ఆలిండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్.చంద్రశేఖర్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.కాశీ విశ్వనాథ్, ఎస్బీఐ సేవ జనరల్ సెక్రటరీ ఎం.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్యంతో మొక్కవోని దిగుబడి
● మారిన వాతావరణంతో తెగుళ్లు ● సస్య రక్షణతో నివారించవచ్చునని సూచిస్తున్న వ్యవసాయ అధికారులు పెరవలి: మొక్కజొన్న పంటపై తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, పోలవరం, నల్లజర్ల మండలాల్లో 1500 ఎకరాల్లో రబీ పంటగా దీనిని వేశారు. చల్లటి, వెచ్చని వాతావరణం ఉండడంతో ఈ పంటను తెగుళ్లు ఆశించాయి. ముఖ్యంగా కాండం తొలిచే చారల పురుగు, గులాబీరంగు పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకుమాడు తెగులు, మసికుళ్లు తెగులు ఆశించి ఉన్నాయి. వీటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి కొవ్వూరు ఏడీఏ సీహెచ్ శ్రీనివాస్రావు వివరించారు. రసం పీల్చే పురుగులు మొక్కజొన్న పంట వేశాక 30 రోజుల వయసు కలిగిన పంటపై నల్లి, పేనుబంక ఆశిస్తాయి. తల్లి, పిల్ల పురుగులు మొక్క ఎదిగే భాగాల నుంచి, ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు లేత పసుపు రంగుకు మారి గిడసబారిపోతాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురును విడుదల చేసి శిలీంధ్రాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి. దీనితో తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది. నివారణ చర్యలు రసం పీల్చే పురుగులు ఆశించినట్లు గమనించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ గ్రాము మందు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మసికుళ్లు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు మొదట ఆకులు తరువాత కాండం మొదలు భాగం ఆకుపచ్చగా మారి తరువాత గోధుమరంగుకు మారి క్రమేపీ మొక్క ఎండిపోతుంది. కాండం లోపల బెరడు కుళ్లిపోయి నాళాలపై బొగ్గుపొడి లాంటి నల్లని శిలీంధ్ర బీజాలు (స్ల్కిరోషియా) ఏర్పడి కాండం బలహీనపడి ఎండిపోతుంది. నివారణ చర్యలు ఈ తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే కార్బండిజిమ్ గ్రాము లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చేలో కలుపును నివారించి మొక్కలకు గాలి తగిలేలా చూడాలి. కాండం తొలిచే చారల పురుగు 10 నుంచి 20 రోజుల వయసు కలిగిన పైరును ఈ పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు మొక్కజొన్న అంకురంలోకి చేరి దానిని తినడంతో మొవ్వ చనిపోయి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఆకులకు రంధ్రాలు ఏర్పరచి తినేస్తాయి. ఈ పురుగులు ఆకులు, కాండాన్ని, పూతని, కంకిని ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. గులాబీరంగు పురుగు ఈ పురుగు ఎక్కువగా రబీలో ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రాత్రి సమయాల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు పలచగా తయారవుతాయి. అక్కడ నుంచి కాండంలో గుండ్రని లేక ఎస్ ఆకారంలో ఉండే సొరంగాలను ఏర్పాటు చేసుకుని అంకురాన్ని చేరతాయి. అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. ఆకులు ఒంగిపోయి రాలిపోతాయి. పై రెండు పురుగులను నివారించడానికి ఇవి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. నివారణ చర్యలు ఈ పురుగులు ఆశించినట్లు రైతులు గుర్తించిన వెంటనే ఎకరం చేనుకి క్లోరాంట్రానిలిప్రోల్ 60 మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండీఎమైండ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 3 కిలోలు మొక్కల మొవ్వలో వేయాలి. -
వృద్ధురాలి మెడలో పుస్తెల చోరీ
రాయవరం: నడుస్తూ వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును చోరీ చేసిన ఘటన రాయవరంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పులగం లక్ష్మి భర్తతో కలిసి కిరాణా వ్యాపారం చేస్తుంటుంది. షాపు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక యువకుడు సెల్ఫోన్ చూస్తున్నట్టు నటిస్తూ ఆమె దగ్గరకు రాగానే ఆమె మెడలోని 11 కాసుల పుస్తెల తాడును గట్టిగా లాగాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఒక మంగళసూత్రం, సగం బంగారు గొలుసు దొంగ చేతికి చిక్కగా, మిగిలిన సూత్రం, సగం గొలుసు వృద్ధురాలి వద్ద ఉంది. దీంతో ఆమె మెడ వద్ద గాయమైంది. ఆమె వేసిన కేకలకు భర్త పరుగున వచ్చి ఆ యువకుడి కోసం వెదకగా అప్పటికే అతడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పి.దొరరాజు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించి వచ్చిన వ్యక్తి 18 ఏళ్ల యువకుడిగా అనుమానిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆమెను నిత్యం గమనిస్తున్న వ్యక్తే ఈ చర్యలు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గోపాలపురంలో 13న మెగా జాబ్ మేళా
సీటీఆర్ఐ: గోపాలపురంలోని శర్వాణి ఇంగ్లిషు మీడియం స్కూల్లో శుక్రవారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వికాస, మానవతా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్మేళాకు సుమారు 20 ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్ తదితర విభాగాల్లో సుమారు 1200 ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారందరూ ఆ రోజు ఉదయం 9 గంటలకు రావాలని కోరారు. కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు, వికాస జిల్లా మేనేజర్ బాబు, మానవత సంస్థ మండల అధ్యక్షుడు రాపాక ఫణి పాల్గొన్నారు. మందపల్లి మహా గణపతికి పంచలోహ కవచం కపిలేశ్వరపురం (మండపేట): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శనైశ్చరస్వామి దేవాలయంలో కొలువైన మహా గణపతికి విజయవాడకు చెందిన వాసా పల్లపురాజు పంచలోహ కవచం చేయించారు. మండపేటకు చెందిన రామకృష్ణ బ్రాస్, సిల్వర్ వర్క్స్ శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కవచం రూపుదిద్దుకుంది. దీన్ని గురువారం మందపల్లి ఆలయానికి తరలించనున్నట్టు దాతలు తెలిపారు. గుండెపోటుతో వైద్యుడి మృతి నిడదవోలు: పట్టణంలోని అమ్మ హాస్పిటల్ వైద్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీవీఎస్ తాతారావు (56) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తణుకులో విధులు ముగించుకుని నిడదవోలు ఇంటికి కారులో వస్తుండగా ఉండ్రాజవరం రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కగా ఆపగా స్థానికులు గమనించి బయటకు తీసి అంబులెన్సులో తణుకు తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు చిట్టి ప్రణతి, ప్రవళ్లిక ఉన్నారు. తాతారావు తల్లి మొగల్తూరు వైఎస్సార్ సీపీ ఎంపీపీగా చేస్తున్నారు. తండ్రి భుజంగరావు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు తదితరులు సంతాపం తెలిపారు. మహాలక్ష్మి ఆలయానికి రూ.11.5 లక్షల విరాళాలు పి.గన్నవరం: లంకల గన్నవరం గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం పలువురు గ్రామస్తులు రూ.11.5 లక్షల మేర విరాళాలు అందజేశారు. యర్రంశెట్టి అచ్యుత రామయ్య కుమారుడు రాజారావు రూ.3.01 లక్షలు, మొండెపులంక లాకు ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు రూ.2.25 లక్షలు, యర్రంశెట్టి రాజు (జొన్నలరాజు) రూ.2.06 లక్షలు, యర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రూ.1.6 లక్షలు, యర్రంశెట్టి చిన్న లోన వారి సేవా కమిటీ సభ్యులు రూ.1.01 లక్షలు, తాపీమేస్త్రి అంబటి దుర్గారావు రూ.50 వేలు, గన్నవరపు అప్పారావు కుటుంబ సభ్యులు రూ.21 వేలు, రామేశ్వరపు గోవిందరావు రూ.20 వేలు, యర్రంశెట్టి బులి వెంకయ్య కుటుంబ సభ్యులు రూ.20 వేలు, లంకే పాల్గుణ రూ.15 వేలు, ఇంకా పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. -
పుష్కర యాత్రికులకు ప్రత్యేక రూట్ మ్యాప్
రాజమహేంద్రవరం సిటీ: 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పుష్కరాల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే వాహనాలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాలు తదితర వాటిపై బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆమె క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించాలని, తిరిగి అదే మార్గంలో చేరవేసేలా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాటికి వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం కాటన్ పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. అలాగే వేమగిరి సెంటర్, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి, ఆర్టీసీ కాంప్లెక్స్, తూర్పు రైల్వే స్టేషన్ మార్గం, లాలాచెరువు, కాతేరు మీదుగా కోటిలింగాల రేవు వరకు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, స్థానికుల వాహనాలకు ప్రత్యేక అనుమతుల జారీ వంటి అంశాలపై సమీక్షించారు. ఫ ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ముఖ్యంగా అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేయాలన్నారు. పుష్కరాలు, శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాలు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని, వాహనాల రాకపోకలను దశల వారీగా మళ్లించే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. వారి వెంట ఎస్డీసీ ఇన్చార్జి ఆర్డీవో కె.భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు, రూరల్ తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, సీఐ కాశీవిశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ కీర్తి చేకూరి ఫ ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్కు క్షేత్రస్థాయి పరిశీలన ఫ మహాశివరాత్రి వసతులపై దిశానిర్దేశం ఫ పాల్గొన్న ఎస్పీ నరసింహ కిశోర్, కమిషనర్ రాహుల్ మీనా -
నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్!
కాకినాడ క్రైం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న నర్సింగ్ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (బీఈ జీఎన్ఎం బోర్డు) ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కనీస తరగతులు కూడా నిర్వహించకుండా విద్యార్థులకు పరీక్షలకు పంపే ప్రైవేటు నర్సింగ్ పాఠశాలల యాజమాన్యాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరంలో పరీక్షలు జరుగుతుండగా కాకినాడ, ఒంగోలు నుంచి రాజమహేంద్రవరానికి ఓఎస్డీగా వెళ్లిన ఇద్దరు నర్సింగ్ ట్యూటర్లు ఈ వసూళ్లు, కాపీయింగ్లలో కీలకంగా వ్యవహరిస్తూ సంబంధిత అధికారులను సైతం భాగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో... కాకినాడ కేంద్రంగా జీజీహెచ్ అధికారుల నిర్వహణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జీఎన్ఎం పరీక్షలు జరిగేవి. కాగా, పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య 8,000కు చేరే సరికి నిర్వహణ క్లిష్టంగా మారింది. దీంతో రాజమహేంద్రవరం సమీపంలోని పాఠశాలల విద్యార్థులకు అక్కడ జీజీహెచ్లోనే పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశారు. అంతకు ముందు నర్సింగ్ పరీక్షలలో కీలకంగా వ్యవహరించిన ఓ గుమాస్తా 18 ఏళ్లుగా అదే స్థానంలో పనిచేశారంటే వసూళ్లు ఏ మేరకు సాగి ఉంటాయో అంచనా వేయొచ్చు. ఈ పరిస్థితిని గమనించిన అప్పటి సూపరింటెండెంట్ అతనిని వేరే విభాగానికి సాగనంపారు. పరీక్షలు నిర్వహించే ప్రతీసారీ ఇదే తంతు నడిచేది. తాజాగా కాకినాడలో కాపీయింగ్ నియంత్రించినా, రాజమహేంద్రవరంలో వసూళ్లు సైతం యథేచ్ఛగా సాగుతున్నట్టు అక్కడ పరీక్షలు రాసి వచ్చినవారే చెప్పడం గమనార్హం. దీనిపై ఏకంగా ఇంటిలిజెన్స్ విభాగం ఆరా తీస్తోందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.500 స్కూలుకి రూ.25 వేలు రాజమహేంద్రవరంలో ప్రాక్టికల్స్ కోసం ప్రతి విద్యార్థి నుంచి సబ్జెక్టుకు రూ.500 చొప్పున వసూలు చేయగా, ప్రతి నర్సింగ్ స్కూల్ నుంచి థియరీ పరీక్షల కోసం రూ.25 వేల చొప్పున మొత్తం సుమారు రూ.40 లక్షల పైచిలుకు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో పరీక్ష హాల్లో నోట్సులు, స్లిప్పులను అనుమతిస్తున్నారనే చర్చ సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా తలుపులు మూసి పరీక్షలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాకినాడలో 33 పాఠశాలల్లోని 4,142 మంది, రాజమహేంద్రవరంలో 20 స్కూళ్లకు చెందిన సుమారు 3,500 మంది ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 7 వేలపై చిలుకు ప్రాక్టికల్స్, థియరీ రెండు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటెలిజెన్స్ విచారణ.. రాజమహేంద్రవరం నర్సింగ్ పరీక్షల్లో అవినీతి రట్టవడం ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. వారు ఆస్పత్రిలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వసూళ్లు, కాపీయింగ్ వ్యవహారంపై విద్యార్థులు సహా క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. వారు పలు విధాలుగా విచారణ చేస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో జీఎన్ఎం పరీక్షలు తలుపులు వేసి కాపీ చేయిస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఇంటిలిజెన్స్ విచారణ -
టీడీపీలో ‘ఎత్తిపోతల’ చిచ్చు
తాళ్లపూడి: వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం కమిటీ మార్పు విషయం టీడీపీలో చిచ్చు రేపింది. ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వర్గపోరుతో పరువు బజారున పడింది. దీంతో పథకం నిర్వహణపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి, ఆయనకు అనుకూలంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీలో మరో వర్గం, జనసేన నాయకులకు తోడు రైతులు కూడా మండిపడుతున్నారు. వేగేశ్వరపురంలో బుధవారం ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ అధ్యక్షుడు కై గాల రాంబాబుతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొని స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు.. సంబంధిత శాఖ అధికారులను అడ్డుపెట్టుకుని చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీలోనే ఇబ్బందులు మాజీ అధ్యక్షుడు కై గాల రాంబాబు మాట్లాడుతూ అధికార టీడీపీలో ఉన్నా తమపై వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ఎమ్మెల్యే తనను పదవి నుంచి తప్పుకోవాలని చెబితే, ఒప్పుకుని తప్పుకోవడం జరిగిందన్నారు. అయితే అధికారులు పథకం నిర్వహణ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారని, 4న తనకు నోటీసు ఇచ్చారని, తాను హాస్పిటల్కు వెళ్లి వచ్చే లోపు తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. తనను సొంత పార్టీలోనే ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బల్లిపాడు టీడీపీ నాయకులు రాత్రీ పగలూ అక్కడ కాపలా కాస్తున్నారని, ఇదేం దౌర్జన్యమని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం వద్ద సమావేశం ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తీసుకుని వారికి నచ్చిన వారిని అధ్యక్షుడిగా వేసుకోవాలన్నారు. సమావేశంలో కార్యదర్శి ఆత్కూరి రాంబాబు ఆయుకట్టు రైతులు పాల్గొన్నారు. ఫ రెండు వర్గాల మధ్య పోరు ఫ వేగేశ్వరపురంలో సమావేశం -
బడి బస్సు సీజ్
ముమ్మిడివరం: పాఠశాల బస్సులపై రవాణా శాఖాధికారులు జరిపిన దాడుల్లో నిబంధనలు పాటించని రెండు పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేసి రూ.33,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా శాఖాధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో బుధవారం వివిధ ప్రాంతాలలో రవాణా శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అలాగే నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశామన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్పై దృష్టి పెడుతున్నామని పట్టుబడిన డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎంవీఐ సురేష్కుమార్ కౌశిక్ పాల్గొన్నారు. బంగారు, వెండి ఆభరణాల చోరీ నల్లజర్ల: మండలంలోని దూబచర్లలో పూరెల్ల పవన్కు చెందిన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోని బీరువా తాళాలు పగులగొట్టి అందులోని 7 కాసుల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంటి యజమాని పవన్ తనకు కొడుకు పుట్టిన ఆనందంలో తన అత్తవారింటికి ప్రకాశరావుపాలెం వెళ్లారు. ఇంటి పరసర ప్రాంతాల వారు తనకు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పడంతో వచ్చి చూడగా చోరీ విషయం బయటపడినట్టు పవన్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాంబాబు, ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో మరొకరి అరెస్టు గంగవరం: గంజాయి స్మగ్లింగ్, సరఫరా, ప్యాకింగ్, డబ్బుల పంపిణీ కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న లాకే సహదేవ్ అలియాస్ టైగర్ సాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేష్ బుధవారం తెలిపారు. స్టేషన్ పరిధిలో నమోదు చేసిన 187 కిలోల గంజాయి తరలింపు కేసులో సాయి పరారీలో ఉన్నాడన్నారు. ఒడిశాలోని చిత్రకుండ–జనబ గ్రామంలో ఉంటున్న లాకే సహదేవ్ది చింతపల్లి మండలం గడపరాయి గ్రామమని ఆయన తెలిపారు. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి పర్యవేక్షణలో కేసు విచారించినట్టు ఎస్సై తెలిపారు. ఆధునిక పద్ధతులతో అతని కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అతడు కిర్ల్లంపూడి స్టేషన్లో 80 కిలోల గంజాయి రవాణా కేసులో, గొలుగొండలో 193 కిలోల గంజాయి రవాణా కేసుల్లో కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎన్నికలవరం
పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంసాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, కూటమి నేతల్లో అంతర్మథనం మొదలైందా?, ఒక వైపు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేసినా.. నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్నారా?, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న తరుణంలో ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న సంకేతాలతో స్థానిక సమరానికి వెనకడుగు వేస్తున్నారా?, ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గు చూపుతున్నారా?.. ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇదీ సంగతి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి 17వ తేదీతో మున్సిపాలిటీలు, ఏప్రిల్ 2వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఈ మేరకు నూతన ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాను ప్రకటించాలని పేర్కొంది. 2026 జనవరి ఒకటి అర్హత తేదీగా చేసి, ఓటర్ల జాబితాను నవీకరించాలని ఆదేశించింది. ఓటర్ల జాబితా రూపకల్పనకు శ్రీకారం స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు వెలువరించింది. 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా కొత్త ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించింది. కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల జాబితా నవీకరణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారుగా 18.46 లక్షల మంది ఓటర్లున్నారు. నూతన ఓటర్ల చేర్పులతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటే ఉంది. దీనిలో గ్రామాల విలీనం అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మిగిలిన మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు 343 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై రాజకీయ నేతల్లో మీమాంస నెలకొంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి ప్రారంభమవుతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ 90 శాతానికి పైగా సీట్లు దక్కించుకుంది. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని సైతం కై వసం చేసుకుంది. కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ చైర్మన్లు దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో సైతం సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వార్డుల రిజర్వేషన్లపై ఉత్కంఠ స్థానిక ఎన్నికల దృష్ట్యా మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఓటర్ల జాబితా తయారీలో తలమునకలవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా షెడ్యూల్ ప్రకటించినా, మళ్లీ వాయిదా వేసింది. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. జిల్లాలో ఎన్ని పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వార్డుల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ పరిణామం ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. పంచాయతీ సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ల పదవులు తాము దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. అనేక ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూటమి నేతలు అక్రమార్కుల అవతారం ఎత్తారు. మద్యం, ఇసుక ఇలా ఏ రంగమైనా సంపాదనే ధ్యేయంగా అడ్డగోలు వ్యవహారానికి నాంది పలికారు. రూ.కోట్ల అక్రమ సంపాదనను తమ జేబుల్లో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు నేతలు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు దిగడం, కేసులు బనాయించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగితే పరాజయం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ తన వంతుగా కసరత్తు చేస్తున్నా.. ప్రభుత్వ సన్నద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు, ప్రభుత్వం ఎన్నికలపై మొగ్గుచూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీలో ఉత్సాహం చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ పోరాటం విస్తృతం చేస్తోంది. రైతులు, విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ పరిణామం ప్రజల్లో సానుకూల ఫలితాలు తెచ్చింది. వైఎస్సార్ సీపీకి ప్రజా ఆదరణ పెరిగింది. దీంతో స్థానిక ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామనే ధీమా నెలకొంది. రిజర్వేషన్లపై చర్చలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాలు, పట్టణాల్లో ఆశావహుల సందడి మొదలైంది. ఏ నలుగురు కలిసినా వార్డు రిజర్వేషన్లు, పదవుల రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల ఖరారు విషయంలో ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఎన్నికలు జరుగుతాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు నిర్ణీత గడువులోగా ఎన్నికల ప్రక్రియ ముందుకు కదలకపోతే, ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో చైర్మన్లు, సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ప్రత్యేకాధికారులను నియమించేందుకు సైతం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఫ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నద్ధం ఫ మున్సిపల్, పంచాయతీ పాలకవర్గాలకు నిర్వహించేందుకు కసరత్తు ఫ మార్చి 9వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశాలు ఫ ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార యంత్రాంగం ఫ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు ఫ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో మొగ్గుచూపని సర్కారు జిల్లా స్వరూపం రెవెన్యూ డివిజన్లు : 2 జనాభా (2011 లెక్కల ప్రకారం) : 18.32 లక్షలు ఓటర్లు : 18.46 లక్షలు మండలాలు : 22 కార్పొరేషన్ : 1 మున్సిపాలిటీలు : 3 మున్సిపల్ వార్డులు : 149 పంచాయతీలు : 343 -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
‘ఆర్చి’ నిర్మాణం ప్రారంభం
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మొదటి ఘాట్రోడ్ వద్ద నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. దీంతో బాటు మెట్లకు ఇరువైపులా భక్తుల భద్రతకు పిట్టగోడ పనులు కూడా ప్రారంభించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేయనున్నారు. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పున ఆర్చి నిర్మించనున్నారు. దేవస్థానం కళాశాల మైదానం ఎదురుగా గల ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్లదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయని, ఆర్చి, పిట్టగోడ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాక ఈ మెట్లదారిని ప్రారంభిస్తామని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
ఉత్సాహంగా సెపక్ తక్రా పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సెపక్ తక్రా మెన్, ఉమెన్ అంతర్ కళాశాలల, వర్సిటీ జట్టు ఎంపికలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ బుధవారం ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు 30 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 8 మంది అబ్బాయిలను, ముగ్గురు అమ్మాయిలను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. వీరికి శిక్షణ ఇచ్చిన అనంతరం నైపుణ్యం ప్రదర్శించిన వారిని మార్చి 11 నుంచి 14వ తేదీ వరకు అస్సాం యూనివర్సిటీలో జరిగే టోర్నమెంట్లకు పంపిస్తారని వీసీ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. వెంకటేశ్వర్రావు, కార్యదర్శి డాక్టర్ కె.బాలసత్యనారాయణ, పరిశీలకుడు డాక్టర్ ఎంవీఎస్ఎస్ మూర్తి, సెలక్షన్ కమిటీ సభ్యులు కె.కనకరాజు, కె.సతీష్, అధ్యాపకులు, పీడీలు, ఎంపీఈడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
● ఫుట్పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కానీ ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కూర్చోవడానికి సీటు కోసం చూసే స్థాయి నుంచి నిలబడే స్థలం దొరికితే చాలనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫుట్పాత్పై నిలబడితే ప్రమాదమని చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం కనిపించిన ఈ చిత్రం దానికి నిదర్శనంగా నిలుస్తోంది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
అధ్యాపకులు లేకుండా చదువులెలా?
● ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆవేదన ● ఏడాది నుంచి భర్తీకాని పోస్టులు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం దేవరపల్లి: అధ్యాపకులు లేకుండా చదువు సాగెదెట్టా అని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై తొమ్మిది నెలలు కావస్తున్నా అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్నామని దేవరపల్లిలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు అధ్యాపకులు అవసరం కాగా, ఇద్దరు మాత్రమే బోధిస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం బాలుర, బాలికల జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 2022–23 విద్యాసంవత్సరంలో గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. కళాశాలలను జిల్లా పరిషత్ హైస్కూళ్లు ప్రాంగణంలోని భవనాల్లో ఏర్పాటు చేసి అడ్మిషన్లు నిర్వహించారు. హైస్కూల్లోని కొంత మంది ఉపాధ్యాయులను కళాశాలలో అధ్యాపకులుగా నియమించి తరగతులు ప్రారంభించారు. అధ్యాపకులు లేకుండానే ముగుస్తున్న విద్యాసంవత్సరం సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ కళాశాలల ఆలనా పాలనా గాలికొదిలేసింది. పైగా, ఈ కళాశాలల్లో బోధిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇది జరిగి దాదాపు ఎనిమిది నెలలవుతున్నా కళాశాలల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయలేదు. దీంతో అధ్యాపకులు లేక ఈ కళాశాలల్లోని విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. జెడ్పీ హైస్కూలు నుంచి కళాశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులకు అప్పట్లో ప్రభుత్వం ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఆ ఇంక్రిమెంటు పొందిన ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో కళాశాలలో అధ్యాపక పోస్టులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేరే ప్రాంతాల్లో హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ ఇంక్రిమెంట్ నేటికీ పొందుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఇంక్రిమెంట్ తీసుకోవలసి ఉంది. దీనిపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టి పనిచేసే ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ ఇస్తే కళాశాలలో బోఽధించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులు లేకుండానే విద్యా సంవత్సరం ముగుస్తోంది. ఇద్దరితోనే బోధన దేవరపల్లిలో ఏర్పాటు చేసిన మహిళా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఏర్పాటు చేశారు. కశాశాలలో బోటనీ, జువాలజీ, ఇంగ్లిషు తెలుగు, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అధ్యాపకులు ఉండాలి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇద్దరు ఇతర మండలానికి బదిలీపై వెళ్లారు. ఫిజిక్స్ అధ్యాపకురాలు మెడికల్ లీవ్లో ఉన్నారు. దీంతో కళాశాలలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అధ్యాపకులు లేకుండానే విద్యాసంవత్సరం పూర్తయిందని విద్యార్థులు అంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరానికై నా అధ్యాపకులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణను వివరణ కోరగా కళాశాలలో 45 మంది విద్యార్థినులు ఉండగా ఇద్దరు అధ్యాపకులే ఉన్నారన్నారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే బోధకులు ఉన్నట్టు చెప్పారు. -
● డేంజర్ ఫిష్
● మీనమిలలు పల్లిపాలెం ఫిష్ మార్కెట్కు మంగళవారం వడగర్లు రకం చేపలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఈ చేపలన్నీ కలిసి సుమారు మూడు టన్నులు ఉంటాయని మత్స్యకారులు చెప్పారు. వీటిని కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తామని, మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారన్నారు. అలాగే చాలామంది వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఎగుమతి చేసేందుకు ఐస్ బాక్సుల్లో భద్ర పరిచే పనులు చేపట్టారు. – సఖినేటిపల్లి పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేసుకుని సోమవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు ఇతర రకాల సంపదతో పాటు కొమ్ముకోణం రకం భారీ చేప చిక్కింది. దాన్ని మంగళవారం ఫిష్ మార్కెట్కు తీసుకువచ్చారు. సుమారు 40 కేజీల బరువున్న కొమ్ముకోణం చేపను ఓ వ్యక్తి రూ.8 వేలకు కొనుగోలు చేశాడు. ఈ చేప ముక్కుకు కొమ్ము ఉండడంతో దీన్ని కొమ్ముకోణం అని పిలుస్తామని, మనిషి ప్రాణం తీసే శక్తి దీనికి ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. – సఖినేటిపల్లి -
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు చనిపోయారు. అందుకోసం ఇప్పటీ నుంచి పుష్కర పనులు చేస్తున్నారు. కానీ శివరాత్రి రోజున కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా, హాని కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైనా, అధికారుల పైనా ఉంది. – గారా చంటిబాబు, రాజమహేంద్రవరం స్నానాలకు ఏర్పాట్లు చేయాలి అనేక వేల మంది భక్తుల రాకతో గోదావరి తీరం నిండిపోతుంది. కనీసం స్నానాలు ఆచరించడానికై నా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఏ ఘాట్లో కూడా ఏర్పాట్లు కానరావడం లేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు పాటించి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – వి.సత్తిబాబు రాజమహేంద్రవరం -
13, 14, 15 తేదీల్లో శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం డీఎల్ఎన్ శర్మ తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయం 9.30, సాయంత్రం 5.30, 6.15, 6.45, రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు నడుస్తాయన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే 15, 16 తేదీల్లో ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకూ ప్రతి గంటకూ కుండలేశ్వరానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. భర్త అనుమానం.. మహిళ ఆత్మహత్య రాయవరం: అనుమానంతో భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో పాకలపాటి వీర వెంకట లక్ష్మీదుర్గ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందనే అనుమానంతో భర్త మహేష్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి, సెల్ఫోన్ లాక్కున్నాడు. మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడు మహేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. బాలుడికి తీవ్ర గాయాలు అమలాపురం టౌన్: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో పాఠశాలకు వెళుతున్న బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు ఇంద్ర కాలనీకి చెందిన 11 ఏళ్ల బడుగు భరత్ ఐదో తరగతి చదువుతున్నాడు. అతడు మంగళవారం ఉదయం స్కూల్కు వెళుతూ ఇంద్ర కాలనీ వద్ద 216 జాతీయ రహదారిని దాటుతుండగా కె.గంగవరానికి చెందిన రావి రాంజీ మోటారు సైకిల్పై వస్తూ బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలై అపప్మారక స్థితిలోకి వెళ్లడంతో పేరూరు వై.జంక్షన్లోని ఆస్పత్రిలో చేర్పించారు. భరత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాంజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అన్నవరంలో సిబ్బందికి అంతర్గత బదిలీలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి రికార్డు అసిస్టెంట్, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకూ 68 మందికి అంతర్గత బదిలీలు నిర్వహిస్తూ దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రసాదం విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పి.లక్ష్మీనారాయణను నిత్య పూజలు, కల్యాణాల విభాగానికి బదిలీ చేశారు. అతడి స్థానంలో కేశఽఖండన శాలలో పనిచేస్తున్న చిక్కాల సాయిబాబాను నియమించారు. అన్నదానం స్టోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న బండారు వెంకట రమణను ప్రసాదం విభాగంలో నియమించారు. -
హోంగార్డు ఇంట్లో రూ.4.45 లక్షల సొత్తు చోరీ
అనపర్తి: బిక్కవోలులోని హోంగార్డు ఇంట్లోకి దొంగలు పడి నగలు, నగదు చోరీ చేశారు. ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడ రోడ్డులోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న ఉర్లంకుల సత్యకృష్ణ ప్రసాద్ కాకినాడలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు చొరపడ్డారు. ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలకు వచ్చారు. ఇంట్లోని ఇనుప బీరువాను పగులకొట్టి రూ.4,10 లక్షలు, 14 గ్రాముల బంగారం కలిపి సుమారు రూ.4.45 లక్షల విలువైన సొత్తును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ పరిశీలించారు. పూరీలు చేయలేకపోతున్నాం రాజోలు: తెల్లవారుజామునే తమతో పూరీలు చేయిస్తున్నారని, దీంతో నిద్ర సరిపోవడం లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ వద్ద శివకోటి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం శివకోటి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినులతో మాట్లాడారు. తమకు వడ్డిస్తున్న కూరలు రుచిగా ఉండడం లేదని, చికెన్ పీసులు తక్కువ వేస్తున్నారని తెలిపారు. కాగా.. తనిఖీల్లో భాగంగా పాడైపోయిన కూరగాయలు, చిక్కిలను ఆయన గుర్తించారు. విద్యార్థినులతో పూరీలు చేయించడంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే కూనవరం జెడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. -
పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి
కలెక్టర్ కీర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో గోదావరి నది తీర ప్రాంతాలు, హౌస్ బోటింగ్, కడియం నర్సరీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎకో స్పోర్ట్స్ నిర్వాహకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హౌస్ బోట్స్ తయారు చేసే మరింత మంది తయారీదారులను గుర్తించి, వారి ద్వారా నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి 3న చంద్రగ్రహణం సత్యదేవుని ఆలయం మూసివేతఅన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మార్చి మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఈఓ వి.త్రినాథరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6.47 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో ఆ రోజు స్వామివారి వ్రతాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్య కల్యాణం, కేశఖండన టికెట్లను ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. స్వామివారి ప్రసాదాలు కూడా ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవునికి ప్రతి రోజూ చేసే ఆయుష్య హోమం, నిత్యకల్యాణాలను ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభించి ఉదయం 9.30 గంటల్లోగా పూర్తి చేస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామివారి దర్శనాలు నిలిపివేసి, ఆలయం మూసివేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రత మండపాలు, ప్రాంగణాన్ని శుద్ధి చేస్తారు. మార్చి నాలుగో తేదీ తెల్లవారుజామున ఆలయాన్ని తెరచి, యథావిధిగా స్వామివారి దర్శనం, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈఓ కోరారు. చట్టం లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కృష్ణ కిరణ్ అమలాపురం రూరల్: ఆహార భద్రత చట్టం లక్ష్యాలు ప్రజల వరకు సమర్థంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణ కిరణ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ సరఫరా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అంగన్వాడీ పోషకాహార పథకాల అమలులో లోపాలు ఉండకూడదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వండి వడ్డించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఆహార కమిషన్ జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుందన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్ ఏఎస్ఓ శరత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు, తూనికలు కొలతల నియంత్రణాధికారి విశ్వేశ్వరరావు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో వీరేశ్వరస్వామి ఉత్సవాలు ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలలో అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని డీఆర్వో కె.మాధవి ఆదేశించారు. ఆలయ ఆవరణలో చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగిన సమావేశంలో డీఆర్వో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మెడికల్ సిబ్బంది మూడు షిఫ్ట్లలో పని చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. -
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం రూరల్: మహిళలు, బాలికలపై జరిగే నేరాలతో పాటూ మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం బొమ్మూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను, సీసీ కెమెరాలను పరిశీలించి, నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, ఎస్సైలకు సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీసింగ్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయనకు ఎస్పీ డి.నరసింహ కిశోర్ వివరించారు. ముందుగా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నూతన భవనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులను దైవాలుగా భావించాలి
సభలో ప్రసంగిస్తున్న ఉమర్ ఆలీషా, సభకు హాజరైన భక్తులుపిఠాపురం: జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ పీఠాలను, ఆలయాలను, గురువులను సందర్శించినా ముక్తి పొందలేరని పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లితండ్రులను దైవాలుగా భావించి, గౌరవించాలని సూచించారు. పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండో రోజయిన మంగళవారం పిఠాపురంలోని ఆశ్రమ ప్రాంగణంలో ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి మనిషీ రాక్షసత్వాన్ని వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలని, దీని కోసం ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని అన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చునని చెప్పారు. అరిషడ్వర్గాలను స్థాయి పరచుకుంటే అది సాధ్యమవుతుందన్నారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర, సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలను నియంత్రించవచ్చని చెప్పారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని, ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా అశాంతి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చునని ఆలీషా అన్నారు. అనంతరం పీఠం రూపొందించిన పరతత్వ కీర్తనల గ్రంథాన్ని, పీఠం తెలుగు, ఇంగ్లిష్, హిందీ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. సభలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ, కిమ్స్ మెడికల్ కాలేజ్ చైర్మన్ చైతన్యరాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకట రమణ, గిడుగు రామ్మూర్తి మనుమరాలు క్రాంతికృష్ణ తదితరులు కూడా ప్రసంగించారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫ రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలి ఫ డాక్టర్ ఉమర్ ఆలీషా -
ఆకలి కేకలపై ఖాకీ దాష్టీకం
పెరవలి: పెండ్యాల పరిధిలో బూరుగు వద్ద ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంప్లో తమకూ పని కల్పించి ఉపాధినివ్వాలని కానూరు కార్మికులు ఆందోళన చేయగా పెరవలి ఎస్ఐ వారిపై చేయిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మండలంలోని కానూరుకు చెందిన 700 మంది ఇసుక ర్యాంపునకు వెళ్లే రహదారిని దిగ్బంధించి రోడ్డుపైనే ధర్నా చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో ఇసుక ర్యాంపు కార్యకలాపాలు స్తంభించాయి. గ్రామానికి చెందిన 700మంది ఇసుక ర్యాంప్ కార్మికులు, పంచాయతీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా ముఠా కార్మిక సంఘం గౌరవ ప్రెసిడెంట్లు కాసుమల్ల రామకృష్ణ, జన్ని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు చెందిన మూడు కార్మిక సంఘాలను రిజిస్టర్ చేయించామని చెప్పారు. బూరుగు ఇసుక ర్యాంపులో పని కల్పించమని ర్యాంప్ నిర్వాహకులు, పెండ్యాల కార్మిక సంఘాలకు, పెద్దలకు తెలిపామని అన్నారు. కానీ పని కల్పించకుండా రాజకీయ అండతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, వ్యవసాయ పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంపు పెండ్యాల పరిధిలో ఉన్నా ఇసుక ర్యాంపు నుంచి వచ్చే లారీలు, ట్రాక్టర్లు మా గ్రామం మీదుగా వెళ్తున్నాయని, అయినా మా గ్రామస్తులకు పని కల్పించడం లేదని తెలిపారు. కార్మికుల డిమాండ్ న్యాయ సమ్మతంగా ఉండడంతో ఆందోళనకు మద్దతు తెలిపామని గ్రామ పంచాయతీ, సొసైటీ, ఎంపీటీసీ సభ్యులు చెప్పారు. కార్మికులపై ఎస్ఐ దూకుడు ఈ ఆందోళనతో ర్యాంపు నుంచే వచ్చే వందలాది లారీలు నిలిచిపోయాయి. పెరవలి ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చి వెంటనే రోడ్డు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా కార్మికులు ఆందోళన కొనసాగించడంతో ఆయన నిడదవోలు సీఐకి ఇక్కడి పరిస్థితిని వివరించడంతో అక్కడి నుంచి సమిశ్రగూడెం ఎస్ఐ బాలాజీని, సిబ్బందిని పంపించారు. రోడ్డుపై బైఠాయించిన వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులు ప్రయత్నించడంతో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ దశలో పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కార్మికులపై చేయి చేసుకున్నారు. దీనితో గ్రామ పెద్దలు, కార్మికులు ఆగ్రహించటంతో పోలీసులు మరింత ఆగ్రహంతో కొందరు కార్మికులను బలవంతంగా జీప్ ఎక్కించారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదని, లారీలను వెళ్లనివ్వబోమని కార్మిక సంఘ నాయకులు కరాఖండీగా చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులతో ఫోన్లో సంప్రదించిన తరువాత పోలీసులు ర్యాంప్ నిర్వాహకులతో మాట్లాడారు. పెండ్యాల, కానూరు కార్మికులకు సరి సమానంగా పనులు కల్పించాలని అధికారులు చెప్పగా ర్యాంప్ నిర్వాహకులు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయ్యింది. మాజీ సర్పంచ్లు, పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యురాలు కార్మికులు పాల్గొన్నారు. నిలిచిపోయిన వందలాది వాహనాలు తమకూ పని కల్పించాలని కానూరు కార్మికుల ఆందోళన కార్మికులపై చేయి చేసుకున్న ఎస్ఐ– ఆగ్రహించిన గ్రామస్తులు ర్యాంప్ నిర్వాహకులతో చర్చల అనంతరం సమస్యకు పరిష్కారం పెండ్యాల, కానూరు కార్మికులకు సమానంగా పని కల్పించాలని నిర్ణయం -
కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆహ్వానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ విద్యాలయాల చీఫ్ కో ఆర్డినేటర్ మాంధాత మాధవి అన్నారు. జయేంద్ర నగర్ వినాయకుని ఆలయంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఉపనయనమైన బ్రాహ్మణులకు విద్య, వేదం, వైద్యంతో పాటు ఇంగ్లిషు, స్మార్తం, ఆగమనం, సంగీతం, రామాయణం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులకు నాదస్వరం, మంత్రసాని, నర్సింగ్, యాదవులకు గోవిజ్ఞానం, కుమ్మరులకు కుంభాకార విద్య, విశ్వ బ్రాహ్మణులకు తక్ష విద్యతో పాటు ఆంగ్ల విద్యను బోధిస్తామని తెలిపారు. బ్రాహ్మణ ఆడపిల్లలకు సంప్రదాయ విద్య, మడి ఆచారం, ఇంగ్లిషు నేర్పిస్తామన్నారు. తమ విద్యా సంస్థలు తిరుపతిలో ప్రారంభమై దేశ వ్యాప్తంగా పదిచోట్ల ఉన్నాయని చెప్పారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో ఈ నెల 21 ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కాంచీపురంలోని కంచి చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పారామెడికల్, ఆయుర్వేదం, లా, నర్సింగ్ వంటి కోర్సులకు 2026 – 27 సంవత్సరానికి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వారికి వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉందన్నారు. తమ విద్యాసంస్థల్లో వార్డెన్లు, వంటవారి ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాధవి తెలిపారు. సమావేశంలో ఆకలి మురళీకృష్ణ, మాంధాత సూర్యారావు, మాంధాత స్వర్ణ పాల్గొన్నారు. స్కూల్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని రెండు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.10,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. స్కూల్ బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్పై దృష్టి సారించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇదేంటి.. ఓం నమశ్శివాయ!
అపరిశుభ్రంగా ఉన్న కోటిలింగాల ఘాట్అస్తవ్యస్తంగా ఉన్న పుష్కరఘాట్సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర గోదావరి తీరాన మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. శివరాత్రి రోజున జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వేలాదిమంది రాకతో గోదావరి తీరం ఆధ్యాత్మిక తీరంగా మారుతుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పది రోజుల ముందు నుంచే భారీగా తరలి వచ్చే భక్తుల కోసం అనేక సౌకర్యాలు కల్పించాలి. కానీ నేటి వరకు ఒక్క ఘాట్లోనూ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సౌకర్యాలతో సిద్ధంగా ఉండాల్సిన స్నాన ఘాట్లు పుష్కర పనులతో అస్తవ్యస్తంగా మారాయి. వీఐపీ ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్, చింతాలమ్మ ఘాట్లలో భక్తులు స్నానమాచరిస్తారు. కాని ఈ ఘాట్లలో సైతం ఏర్పాట్లు చేయలేదని భక్తులు అవేదన చెందుతున్నారు. కొవ్వురులోని గోష్పాద క్షేత్రంలో కూడా శివరాత్రికి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ ఘాట్ సైతం పూర్తిగా అందుబాటులో లేదు. ఎక్కడి పనులు అక్కడే కేంద్ర ప్రభుత్వ నిధులతో అఖండ గోదావరి పేరుతో రూ.97 కోట్లతో గోదావరి ఘాట్లను మోడల్ ఘాట్లుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా కోటిలింగాల ఘాట్, పుష్కరఘాట్లతో పాటు అనేక ఘాట్లలో నిర్మాణాలు చేపట్టారు. కాని పుష్కర పనులు నత్తనడకన సాగుతుండటంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి. నిరుపయోగంగా పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి రానున్నారు. గౌతమీ మహర్షి తపో ఫలంగా, పరమ శివుని జటాజూటం నుంచి జాలు వారిన గోదావరి పరీవాహక ప్రాంతం శివరాత్రి రోజున శివనామ స్మరణతో మార్మోగనుంది. కాని భక్తుల మనోభావాలకు విలువివ్వని చంద్రబాబు సర్కార్ ఘాట్ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీభువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం గోదావరి తీరాన కోటిలింగాలపేటలో ఉంది. ఇది అతి ప్రాచీనమైన, పురాణ ప్రశస్తి ఉన్న ఆలయం. అటువంటి ఆలయం చెంత ఉన్న కోటిలింగాల ఘాట్లో ఏర్పాట్లు శూన్యంగా ఉన్నాయి. కోటిలింగాల ఘాట్నుంచి సుమారు వంద అడుగులు దూరం నడిచి వెళితేనే కాని నీరు అందుబాటులో లేకపోవడం విచిత్రం. కనీసం శివరాత్రి రోజునైనా గోదావరి చెంతన ఉన్న ఘాట్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం. తొలి ట్రయల్ రన్ మరీ నెమ్మది! కలెక్టర్ కీర్తి ఘాట్లను పరిశీలించి శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రైల్ రన్గా భావించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. కాని కలెక్టర్ కీర్తి ఆదేశాలను మాత్రం కింది స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ప్రసిద్ధి గాంచిన ఘాట్లు అస్తవ్యస్థంగా ఉన్న నేపథ్యంలో మంత్రి దుర్గేష్ గోదావరి తీరంలో ఏ ఘాట్లో స్నానమాచరించినా పుణ్యఫలం దక్కుతుందని పేర్కొనడం గమనార్హం. కోటిలింగాల రేవులో కలసిన ప్రొటోకాల్ దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి రోజున స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధి తన అనుచరులతో పాలక మండలిని ఘనంగా ఏర్పాటు చేశారు. వీరి కనుసన్నులలో ఈ మహోత్సవాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనికోసం ఒక ఆహ్వాన పత్రికను కూడా రూపొందించారు. ఈ ఆహ్వాన పత్రికలో కలెక్టర్, కమిషనర్ వంటి వారి పేర్లను చేర్చకపోవడం చర్చకి దారి తీస్తోంది. కనీసం వారు రాకపోవడానికి వీలు లేకపోయినా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం వారి పేర్లను ప్రచురిస్తారు. కానీ ఈ ఏడాది అది కొరవడింది. దేవాలయానికి సంబంధించి 30 మంది శాశ్వత దాతలు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా వీరి పేర్లను ప్రతి సంవత్సరం ఆహ్వాన పత్రికలో ప్రచురించడం అనవాయితీ. కాగా నేడు కూటమి నాయకులకు చెందిన వారి పేర్లతో ఆహ్వాన పత్రికను రూపొందించడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవుడి దగ్గర కూడా టీడీపీ నాయకుల ప్రచార యావ తగ్గలేదని వ్యాఖ్యానిస్తున్నారు. మహాశివరాత్రికి కానరాని ఏర్పాట్లు పుణ్యస్నానాలాచరించడానికి వీలుకాని వైనం వేలాదిగా రానున్న భక్తులు నత్తనడకన పుష్కరాల పనులు ప్రత్యామ్నాయం చూపించని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ మరచిన కోటిలింగేశ్వరస్వామి పాలక మండలి పుష్కరఘాట్లో నత్తనడకన పనులు మరో ముఖ్యమైనది పుష్కరఘాట్. ఇది స్నానాలకి అందుబాటులో లేదు. పుష్కర పనులతో ఇక్కడ నూతన ఘాట్ని నిర్మించడానికి పనులు చేపట్టారు. ఇవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీంతో ఈ ఘాట్లో స్నానాలు చేయడం ఇబ్బందికరమే కాకుండా ప్రమాదభరితంగా ఉంది. ఘాట్ల మెట్లపై ఉన్న రాయిని తొలగించడంతో భక్తులు మెట్లపై నుంచి దిగితే ప్రమాదం బారిన పడే అవకాశాలున్నాయి. అక్కడే వేసిన ఇసుక వల్ల భక్తులు జారి పోయే ప్రమాదం కూడా ఉంది. -
హడావేడి ఏమైందో!
ఉన్నతాధికారులకు నివేదించాం విశ్వసనీయ సమాచారం మేరకు కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఈ తనిఖీల్లో 911 డాక్యుమెంట్లను తక్కువ వాల్యూకు రిజిస్టర్ చేసినట్లు గుర్తించాం. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మి టేబుల్ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు తెలియజేశాం, వారి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. – ఎం.కిశోర్ కుమార్, డీఎస్పీ, ఏసీబీ, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్: అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాడులు చేస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులున్న వారిపై కూడా నిఘా పెడుతుంది. అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదు వచ్చిన వెంటనే తనిఖీలు నిర్వహించి, సమగ్రంగా విచారణ జరిపి, అక్రమార్కులను అరెస్టు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన దాడి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ఈ దాడి తర్వాత అంతా గప్చుప్గా మారింది. తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ వెళ్లిపోయారు. దాదాపు 12 రోజులు దాటినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి చక్రం తిప్పడం వల్లనే అధికారులు సైలెంట్ అయ్యిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలివీ.. కడియం సబ్ రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి విధుల్లో ఉండగా గత నెల 29వ తేదీన ఏసీబీ డీఎస్పీ కిశోర్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 911 డాక్యుమెంట్లను తక్కువ విలువకు రిజిస్టర్ చేసినట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ టేబుల్ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్, కార్యాలయం సిబ్బంది, లేఖర్ల నుంచి ఏసీబీ అధికారులు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారు వేరే నంబర్లతో తమ కార్యకలాపాలను ఎప్పటి మాదిరిగానే చేస్తున్నారని కక్షిదారులు చెబుతున్నారు. తనిఖీల అనంతరం తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అప్పట్నుంచి అంటే దాదాపు పది రోజులుగా లక్ష్మి, సిబ్బంది యథాతథంగా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. చర్యల్లేనట్టేనా.. అదనంగా డబ్బులు కలిగి ఉండడం, తక్కువ విలువకు డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడం ద్వారా సుమారు రూ.2.62 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించినట్లుగా ఏసీబీ అధికారులు తమ విచారణలో నిర్ధారించారు. అయినప్పటికీ, దీనికి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే పలువురు బాధితులు రిజిస్ట్రార్ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే సంబంధిత అధికారులు వారిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాల్లేవని తెలుస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నేరుగా విచారణ జరిపి పలు అవకతవకలను వెలికి తీశారు. ఆ తరువాత ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు తేల్చిన అవకతవకలనే వారు మరోమారు మీడియాకు వెల్లడించారు. అదనంగా డబ్బులు, సెల్ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగమంతా ఆయా శాఖల విధి నిర్వహణలో భాగంగానే జరిగిందా? లేక ఎవరి ప్రయోజనాల కోసమైనా చేశారా అనే అనుమానాలూ లేకపోలేదు.మాజీ మంత్రి దన్ను ఈ కేసు గప్చుప్గా మారడం వెనుక టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులతో ఆయనే నేరుగా మాట్లాడారని, ఈ నేపథ్యంలోనే విచారణ అనంతరం చర్యలు తీసుకోవడంలో కాలయాపన జరుగుతోందని చెబుతున్నారు. వీలైనంత కాలయాపన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా నామమాత్రపు పెనాల్టీతో సరిపెట్టేస్తారని అంటున్నారు. అలా కాకపోతే ఎవరో ఒకరిని బలి చేసి అసలు వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మరో ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల విచారణలో ఏం తేలింది? ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతోందనే ప్రశ్నలకు అటు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల నుంచి గానీ, ఇటు ఏసీబీ అధికారుల నుంచి గానీ కచ్చితమైన సమాధానం లభించడం లేదు. కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ తనిఖీలు అవకతవకలు గుర్తించినట్టు వెల్లడి దాడుల అనంతరం అంతా గప్చుప్ యథావిధిగా కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది -
డొక్కా సీతమ్మ స్ఫూర్తి కావాలి
సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పి.గన్నవరం: అన్నదాతగా పేరొందిన డొక్కా సీతమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని కనీసం నెలకోసారైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఎల్.గన్నవరం గ్రామంలోని సీతమ్మ వారి నివాసాన్ని ఆయన సందర్శించారు. సీతమ్మ వారు వినియోగించిన రోలు, కుర్చీ, మంచినీళ్ల బావి, భోషానం పెట్టె తదితర వస్తువులను పరిశీలించారు. సీతమ్మ కుటింబీకులైన సూర్యప్రభ తదితరులతో ఆయన మాట్లాడారు. ఆమె చిత్రపటానికి నమస్కరించారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. సీతమ్మ వారి నివాసాన్ని సందర్శించడంతో ఒళ్లు పులకించిందన్నారు. చిన్నప్పటి నుంచి ఆమె జీవిత చరిత్రను కథలు, కథలుగా విన్నామని అన్నారు. సీతమ్మ వారి పేరుపై వారి కుటుంబ సభ్యులు ఏమైనా చేయాలనుకుంటే తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అవకాశం వస్తే తన రచనల్లో సీతమ్మ వారికి ప్రాధాన్యం కల్పిస్తానని ఆయన అన్నారు. విజయేంద్ర ప్రసాద్ను డొక్కా బుచ్చిబాబు దుశ్శాలువాతో సత్కరించారు. తొలుత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆయనకు స్వాగతం పలికారు. స్వామి ప్రతిబింబాన్ని చూపినట్టు.. విజయేంద్ర ప్రసాద్ అంతర్వేదిలో కొత్త అద్దం తీసుకుని, దానిని నరసింహ స్వామివారిని చూపి, వెంటనే ఒక వస్త్రంతో దానిని మూసివేశారు. ఆ అద్దాన్ని ఇక్కడ సీతమ్మ వారి చిత్రపటం ముందు తెరిచారు. దీంతో నరసింహ స్వామి ప్రతిరూపం సీతమ్మ వారికి చూపినట్టు అవుతుందని ఆయన వివరించారు. ఇలా ఎందుకు చేశానంటే.. సీతమ్మ వారు ఒక రోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయల్దేరారు. దారిలో బోయీలు చెట్టుకింద ఆగారు. అయితే అక్కడ ప్రయాణికుల బృందంలోని చిన్న పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అందులో ఒకరు ఏడవకండి అమ్మా, దగ్గరలో సీతమ్మ వారి ఇల్లు ఉంది, అక్కడికి వెళితే మనకి అన్నం పెడతారని పిల్లలకు చెప్పారు. ఈ మాటలు విన్న సీతమ్మ వారు, వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ప్రయాణికులు వచ్చేలోగా వారికి వంట చేసి, అన్నం పెట్టారని విజయేంద్ర ప్రసాద్ వివరించారు. నాడు సీతమ్మ వారు నరసింహస్వామిని దర్శించుకోలేక పోయారని, అందుకే స్వామి ప్రతిబింబాన్ని సీతమ్మ వారికి అద్దంలో చూపినట్టు ఆయన చెప్పారు. -
మహిళ అదృశ్యం
అనపర్తి: ఓ మహిళ అదృశ్యంపై సోమవారం కేసు నమోదు చేసినట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బిక్కవోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన గాజుల పాపారత్నం (45)కు మతిస్థిమితం లేదు. ఆమె భర్త చనిపోవడంతో అదే గ్రామంలోని తల్లి ఇంటి వద్దే ఉంటుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవా రం ఆమె సోదరి చక్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపా రు. వివరాలు తెలిస్తే తన నంబర్ 94409 04851, అనపర్తి సీఐ సుమంత్ 94407 96538 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. -
ఆక్రందనలు ఆగోవు
ఫ సముద్ర తీరంలో ఆవుల మృత్యుఘోష ఫ బాలబందు మొక్కలను తిని చనిపోతున్న వైనం ఫ అధికారుల చర్యలు శూన్యం కాట్రేనికోన: మూగజీవాల మృత్యుఘోష ఆగడం లేదు.. విష తుల్యమైన ఆకులు తిని ఆవులు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సముద్ర తీరం వెంబడి సంచరిస్తున్న ఆ జీవుల ఆక్రందనలు ఎవరికీ వినిపించడం లేదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని సఖినేటిపల్లి, అల్లవరం, కాట్రేనికోన మండలాల పరిధి శివారు ప్రాంతాలను ఆనుకుని సముద్ర తీరం విస్తరించి ఉంది. దీని వెంబడి సంచరిస్తున్న ఆవులు మేతగా తీగ జాతికి చెందిన (బాలబందు) మొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. చిర్రయానం నుంచి నీళ్లరేవు మధ్యలో సుమారు 700 ఆవులు సముద్ర తీరంలో జీవిస్తున్నాయి. అంతర్వేది, ఓడలరేవు, నక్కారామేశ్వరం, వాసాలతిప్ప, ఎస్.యానం, చిర్రయానం, నీళ్లరేవు, కొత్తపాలెం లైట్ హౌస్, మొగ ప్రాంతం సముద్ర తీరం వెంబడి తీగ జాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆవులు మేతకు అవసరమైన గడ్డి జాతి, ఇతర మొక్కలను పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. సముద్ర తీరం వెంబడి వందలాది ఆవులు గుంపులుగా సంచరిస్తూ మేత లేక విషపూరితమైన ఈ తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. అలాగే సముద్ర తీరం వెంబడి ఆవులకు తాగేందుకు మంచి నీరు ఉండడం లేదు. గిర్రున తిరిగి.. కిందకు ఒరిగి విషపూరితమైన తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్న ఆవుల తల తిరిగిపోవడంతో గిర్రున తిరిగి తూలుతూ కిందకు పడిపోతున్నాయి. అలా రోజుల పాటు ఆహారంగా తీసుకోవడంతో వాటికి తెలియని మత్తు రావడంతో తూలుతూ తిరుగుతై చివరకు మృత్యువాత పడుతున్నాయి. ఆ ఆవులు గంజాయి, మద్యం తాగిన వారివలే పడుతూ లేస్తూ ఉంటున్నాయి. సముద్ర తీరం వెంబడి మేత లేక వదిలినప్పుడు ఆకులు తినడంతో చనిపోతున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మసమేథ్యం సమీపంలో కాల భైరవస్వామి ఆలయం అర్చకుడికి చెందిన ఐదు పాడి ఆవులు విష పూరితమైన ఈ ఆకులను ఆహారంగా తీసుకునే చనిపోయాయి. ఈ తీగను ఆహారంగా తిన్న తల్లి ఆవు పాలు తాగుతున్న పిల్లలు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల పల్లం శివారు బ్రహ్మసమేథ్యం కాలభైరవస్వామి ఆలయ సమీపంలో సముద్రం ఒడ్డున ఆవు దూడ చలికి శరీరం పూర్తిగా చల్లబడి వణికిపోవడంతో పాటు కాళ్లు బిగిసిపోవడంతో చలి మంటను వేసి ఆవు దూడకు వేడి తగిలే విధంగా స్థానికులు ఏర్పాటు చేశారు. అయితే విష పూరితమైన తీగ ఆకును ఆహారంగా తీసుకున్న తల్లి పాలతో పాటు ఆవు దూడ తీగ ఆకును తినడంతో పరుగులు పెడుతూ.. తూలుతూ.. పడి పోవుతూ.. కొన్ని రోజులకు చనిపోయింది. ఐదు ఆవులు చనిపోయాయి తీగ ఆకులు తినడంతో ఐదు ఆవులు చనిపోయాయి. ఇటీవల కాలభైరవస్వామి అభిషేకం, నైవేద్యం కోసం రూ.35 వేలు పెట్టి పాడి ఆవును కొన్నాం. మేతకు వదిలినప్పుడు తీగ జాతికి చెందిన ఆకులను తినడంతో గుండ్రంగా తిరుగుతూ కొన్ని రోజులకు మృత్యువాత పడింది. –కామేశ్వరరావు, కాలభైరవస్వామి ఆలయ అర్చకుడు, పల్లం పీక్కుతింటున్నాయి.. విషపూరితమైన తీగ ఆకులు ఆహారంగా తినడంతో తెలియని మత్తులో తూలుతూ, పడుతూ బలహీనంగా ఉన్న ఆవులను కుక్కలు, రాత్రి వేళ నక్కలు సైతం పీక్కు తింటున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి ఆవులను వదిలేస్తున్నారు. తిరిగి ఆవులు బాగుంటే పాల కోసం తెచ్చుకుంటున్నారు. పాడి రైతులు సొంత ఆవులను పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి వదిలివేయకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఆవులను గుర్తించి గోశాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే మూగజీవాలకు రక్షణ ఉంటుందని పశు ప్రేమికులు అంటున్నారు. -
ట్రాఫిక్కు సినిమాతో కష్టాలు
సామర్లకోట: రద్దీగా ఉండే సెంటర్.. ఆపై సినిమాతో కష్టాలను పట్టణ ప్రజలు సోమవారం ఎదుర్కొన్నారు. సామర్లకోట మఠం సెంటర్లో సినిమా షూటింగ్ జరగడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ముఖ్యకూడలిలో సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. జీవిత, రాజశేఖర్, వారి కుమార్తె శివానీ నటిస్తున్న చిత్ర షూటింగ్ సామర్లకోట మఠం సెంటర్లో ప్రారంభించారు. ఇక్కడ అంబేడ్కర్ విగ్రహం, కూరగాయల మార్కెట్, బడ్డీలు ఏర్పాటు చేసి షూటింగ్ జరిపారు. తొలిరోజు రాజశేఖర్ కుమార్తె శివానీ, ఆలీలు కూరగాయల మార్కెట్కు వచ్చిన సన్నివేశం చిత్రీకరించారు. సామర్లకోట – పెద్దాపురం రోడ్డు ముఖ్య కూడలి కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనికితోడు షూటింగ్ చూడడానికి వచ్చిన స్థానికులను సినిమా యూనిట్కు చెందిన బౌన్స్ర్లు దగ్గరకు రాకుండా గెంటి వేయడంతో వాదోపవాదాలు జరిగాయి. ఏదేమైనా ముఖ్య కూడలిలో సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
అంతా మా ఇష్టం..
ఫ అర్ధరాత్రి రోడ్డును తవ్వేసి తూరల ఏర్పాటు ఫ రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు పెరవలి: అధికారం చేతిలో ఉందని కొందరు రోడ్డును తవ్వేసి తూరలు ఏర్పాటు చేయడం ఆందోళనకు దారి తీసింది.. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిచ్చింది.. పెరవలి మండలం నడుపల్లి–నడుపల్లి కోట రోడ్డులో జరిగిన తంతు ఇది. నడుపల్లి నుంచి నడుపల్లి కోట వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. గ్రామమంతా సీసీ రోడ్డు, బయట తారు రోడ్డు వేసేలా ప్రతిపాదనలు తయారు చేసి అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా, నాలుగు రోజుల కిందట నడుపల్లి కోట వద్ద తూరలు ఏర్పాటు చేయాలని అధికారులను అడిగితే కుదరదని చెప్పడంతో కూటమి నేతలు ఆగ్రహించారు. ఎప్పుడూ లేనిది ఇక్కడ తూరలు ఏర్పాటు చేయడం ఏంటని, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తారా అంటూ నడుపల్లికోట రైతులు నిలదీశారు. కానీ తూరలు పెడతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూటమి నేతలు అనడంతో రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో అటువంటి పనిచేయవద్దని నేతలను హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి పొక్లెయినర్తో కూటమి నేతలు రోడ్డును అడ్డంగా తవ్వేసి తూరలు ఏర్పాటు చేశారు. సోమవారం చేల వద్దకు వచ్చిన రైతులు ఇదేం దారుణమని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీనిపై జిల్లా పరిషత్ ఏఈ అగస్టీన్ను ‘సాక్షి’ వివరణ కోరగా తూరలు పెట్టడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, వారు అనధికారకంగా పెట్టారన్నారు. రోడ్డును తవ్వేశారు కదా.. చర్యలు తీసుకుంటారా అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి వెళ్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు. ● తవ్వేసి తూరల ఏర్పాటు కూటమి నేతలు ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా రోడ్డును తవ్వేసి తూరులు ఏర్పాటు చేశారు. అధికారులను అడుగుతుంటే మాకేమీ తెలియదని చెబుతున్నారు. అర్ధరాత్రి తూరలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనివల్ల మా పంట చేలు మునిగిపోతాయి. –పరిమి సూర్యారావు, రైతు, నడుపల్లి ● కుదరదని చెప్పినా.. రోడ్డును తవ్వి తూరలు పెడతామని కూటమి నేతలు అంటుంటే రైతులంతా కలసి కుదరదని చెప్పాం. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేశాం. పోలీసులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి దౌర్జన్యంగా తూరలు పెట్టారు. ఇదేం పాలన. –పరిమి బాలాజీ, రైతు, నడుపల్లికోట -
రైతుకు అరుదైన పురస్కారం
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్రకాలనీకి చెందిన రైతు గంపా నాగరాజుకు అరుదైన పురస్కారం దక్కింది. ఈ రైతు గ్రాండ్ నైన్ అనే అరటి సాగులో మంచి ఫలితాలు సాధించడంతో ఈ అవార్డు అందుకున్నారు. పంత్నగర్ (ఉత్తరాఖండ్) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన అఖిల భారత పండ్ల సమన్వయ పథకం వార్షిక గ్రూప్ మీటింగ్లో నాగరాజుకు ఈ గౌరవం దక్కింది. ప్రాజెక్టు కోఆర్డినేటర్లు డాక్టర్ ఘోష్, ప్రకాష్ పాటిల్ తదితరులు నాగరాజును సత్కరించి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతు టిష్యూ కల్చర్ అరటి సాగులో సాంకేతిక సలహాలు ఇస్తూ, తనను ప్రోత్సహించిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన వన పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ని మండలంలోని రైతులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కాకినాడ క్రైం: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడికి చెందిన మోకా గౌతమ్ (18) స్థానిక చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాడు. అర్ధరాత్రి వరకూ సందడిగా గడిపి అందరూ వెళ్లిపోగా, ఉండూరుకు చెందిన ఏలేటి కార్తీక్ (20), యానాం సమీపంలో ఇంజరానికి చెందిన మేడిశెట్టి మణి వెంకటసాయి (25)లు గౌతమ్తోనే ఉన్నారు. నిద్రపోకుండా ఈ ముగ్గురు అర్ధరాత్రి దాటే వరకూ మేడపై మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఈ ముగ్గురు స్కూటీపై మెయిన్ రోడ్కు వెళ్లారు. ఆ సమయంలో ఉదయం డ్యూటీ నిమిత్తం కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షేక్ అహ్మద్ రాజా తన బుల్లెట్పై జగన్నాథపురం నుంచి వస్తున్నారు. మెయిన్ రోడ్లో కేఎఫ్సీ స్టోర్ వద్దకు వచ్చేసరికి ఈ రెండు వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మోకా గౌతమ్ అక్కడిక్కడే చనిపోగా, మేడిశెట్టి సాయి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నెత్తురోడుతున్న ఏలేటి కార్తీక్ను అక్కడి వారు కాకినాడ జీజీహెచ్కు, కానిస్టేబుల్ రాజాను కుటుంబ సభ్యులు అక్కడికి సమీపాన ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం తాగి, ట్రిపుల్ రైడింగ్లో అతి వేగంగా వచ్చారని కానిస్టేబుల్ రాజా కుటుంబీకులు ఆరోపిస్తుంటే, కానిస్టేబుల్ రోడ్ లైన్ను క్రాస్ చేసి రహదారి మధ్యలో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని బాధితుల కుటుంబీకులు అంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ నిజమేనని, మద్యం తాగి ఉన్నారా లేదా అనేది పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మృతులు అవివాహితులని పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బుజ్జి బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు
నిడదవోలు: స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన సోమ వారం జరిగింది. నిడదవోలులోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి బస్సు పంగిడి వెళ్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా నిడదవోలు – చాగల్లు ప్రధాన రోడ్డులో ఆటోను తప్పించే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు క్లీనర్కు స్పల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్సై జయరాజు వచ్చి విచారణ చేపట్టారు. పట్టణ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తన టెక్నికల్ సిబ్బందితో వచ్చి విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు. -
దారిలో జలదరింపు
వీఆర్పురం – చింతూరు మండలాల ప్రధాన రహదారిలో ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం నడుమ జల్లివారిగూడెం వాగు ఉంది. ఇది ప్రవహించే ప్రాంతంలో రహదారిపై గతంలో లోలెవల్ చప్టా నిర్మించారు. ఈ చప్టాకు ఎగువభాగంలో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో ఎగువ ప్రాంతంలో ఎక్కడ వర్షం పడినా ఆ నీరు చప్టాపై నుంచి ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోతున్నాయి. చప్టాకు ఎగువభాగంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే నీరు చప్టా కింద నుంచి ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఈ చప్టా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. –చింతూరు పడితే.. అటో.. ఇటో పిఠాపురం మండలం భోగాపురంలో కల్వర్టుకు ఇరువైపులా రక్షణ గోడలు (రెయిలింగ్) లేక ప్రయాణం దినదిన గండంలా మారింది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా వెళ్తుంటాయి. శిథిలావస్థకు చేరిన ఈ కల్వర్టు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం అందరిలో నెలకొంది. కొత్తగా కల్వర్టు నిర్మించాలని, అప్పటి వరకూ కనీసం రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. –పిఠాపురం రూరల్ -
వక్ఫ్భూముల ప్రైవేటీకరణ ఆపాలి
ఏఓ అలీకి వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ విభాగం వినతిసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గుంటూరుకి చెందిన 72 ఎకరాల 57 సెంట్ల అంజుమన్ ఏ ఇస్లామీయ సంస్థకు చెందిన భూములను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు యండి హమీద్ బాషా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రాలను అందించే కార్యక్రమం సోమవారం చేపట్టడంతో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ఏఓ అలీకి వినతి పత్రం అందచేశారు. హామీద్ బాషా మాట్లాడుతూ తరతరాలుగా అంజుమన్ ఏ ఇస్లామీయా సంస్ధకు చెందిన భూములు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు. నేడు చంద్రబాబు ఈ ఆస్తులను ప్రైవేట్కి అప్పజెప్పడం కోసం స్థానిక కలెక్టర్తో నోటీసులు పంపించారన్నారు. 90 రోజుల గడువుతో ఈ నోటీసులు అందించారన్నారు. ఎన్నో తరాలుగా ఈ భూములను కాపాడుకుంటూ వస్తున్నామని, కాని చంద్రబాబు ఈ భూములను కారు చౌకగా ప్రైవేటీ సంస్థలకు అప్పజెబుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసీనా, రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ, రాష్ట్ర మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ నిజామ్, వక్ఫ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్, రాష్ట్ర కార్యదర్శి అమనుల్లా బేగ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కరీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం బాషా, రాజమహేంద్రవరం రూరల్ మైనార్టీ సెల్ ఇన్చార్జి చానా, రాజమహేంద్రవరం నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అరిఫుల్లఖాన్, నిడదవోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ ఇన్చార్జి చాంద్ బాషా, రాజానగరం మైనారిటీ సెల్ ఇన్చార్జి కాలా బాషా, గోపాలపురం ఇన్చార్జి యూసఫ్ ముస్తఫా, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షకీలా బేగం, సమీరా బేగం పాల్గొన్నారు. -
యథేచ్ఛగా రాజకీయ ‘ఎత్తిపోతలు’!
తాళ్లపూడి: వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకాన్ని అధికార టీడీపీ నాయకుల రాజకీయాలకు వేదికగా మార్చేశారు. పథకం అధ్యక్షుడి విషయంలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు మరింత ముదరడంతో రైతులు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వర్గం, ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన కై గాల రాంబాబు వర్గం మధ్య నెల కొన్న విభేదాలు రోడ్డున పడ్డాయి. మధ్యలో అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. మాజీ అధ్యక్షుడు రానందునే తాళాలు పగులగొట్టాం : ప్రత్యేకాధికారి మండలంలోని వేగేశ్వరపురం ఎత్తిపోతల పథథకం నిర్వహణ కమిటీ రద్దయిందని, ఇక నుంచి అధ్యక్షుడు కై గాల రాంబాబు బదులు తమ శాఖ సిబ్బందే నిర్వహణ సాగిస్తారని పీఎస్ఐడీసీ ఈఈ దుర్గ గురవయ్య తెలిపారు. 41 జీవో ప్రకారం ఈ నెల 3న ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టానని, రికార్డుల కోసం మాజీ అధ్యక్షుడు రాంబాబుకు నోటీసు జారీ చేసినా ఆయన హాజరు కానందున తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీలావణ్య, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ, ఏపీఎస్ఐడీసీ ఏఈ సురేంద్ర, సమక్షంలో కార్యాలయ తాళాలను పగులగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు ఈఈ గురవయ్య తెలిపారు. కొత్త కమిటీ ఏర్పడే వరకు తన అధీనంలోనే నిర్వహణ సాగుతుందని తెలిపారు. ఆయనతో పాటు బల్లిపాడుకు చెందిన టీడీపీ నాయకులు కాకర్ల శ్రీను, ఉప్పులూరి రమేష్, మద్దుకూరి శంకరం పలువురు రైతులు ఉన్నారు. నాకు కనీస గౌరవం ఇవ్వలేదు 28 సంవత్సరాలకు పైగా సేవలందించిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా టీడీపీ వర్గీయులు ప్రతిపక్షం కంటే హీనంగా వ్యవహరించారని మాజీ అధ్యక్షుడు కై గాల రాంబాబు పేర్కొన్నారు. నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు 41 జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును వాపస్ తీసుకున్నానని చెప్పారు. రికార్డులను అప్పగించేందుకు సోమవారం వస్తానని చెప్పినా తాళాలు పగులు కొట్టడం ఎందుకన్నారు. రికార్డులు స్వాధీనం చేసుకోవటం చూస్తే, తాను అధికార పార్టీ మనిషినా, లేక ప్రతిపక్షంలో ఉన్నానా తెలియటం లేదని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి వైద్య సేవలకు వెళ్లి వచ్చేంత వరకు కూడా మరో వర్గం నాయకులు ఆగలేదని అన్నారు. కాగా అధికార పార్టీ నాయకుల వర్గ పోరుతో పథకం నిర్వహణ ఎలా సాగుతుందో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దూరమైన విద్య
● దూరవిద్య కేంద్రాలకు ఏయూ మంగళం ● కాకినాడ, రాజమహేంద్రవరంలోని స్టడీ సెంటర్ల మూసివేత ● విద్యార్థి నేతల ఆగ్రహం ● వీటిని కొనసాగించాలని డిమాండ్ ● లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చదువుకోవాలనే ఆశ ఉన్నా.. కుటుంబ పరిస్థితులు అనుకూలించనందువల్లనో.. ఇతర కారణాలతోనో ఉన్నత విద్య అభ్యసించలేకపోయిన వారికి.. డిగ్రీ చదువును చేరువ చేసి, పట్టాలు అందించిన ఘనత ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) దూరవిద్యా కేంద్రానిది. కేవలం చదవడం, రాయడం వస్తే చాలు.. ఎటువంటి విద్యార్హతా లేకపోయినా.. 18 సంవత్సరాలు నిండి.. వివిధ కారణాలతో కళాశాలలకు వెళ్లలేని వారికి.. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పిన వారికి.. ఉద్యోగులు, ప్రమోషన్లు పొందాలనుకునే వారు, గృహిణులు తదితర వర్గాల వారికి డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులను దూరవిద్య విధానంలో అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఏ విద్యార్హతా లేకుండా డిగ్రీ ఇవ్వకూడదని, పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారికే అడ్మిషన్లు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఆ మేరకు దూరవిద్య కేంద్రం డిగ్రీ అడ్మిషన్లు కల్పిస్తోంది. ఈ సేవలను విస్తృతం చేసేందుకు 1972లో పలు జిల్లాల్లో స్టూడెంట్ సపోర్టు సెంటర్లు (స్టడీ సెంటర్లు) ఏర్పాటు చేసింది. వీటిద్వారా అనేక మంది పట్టభద్రులవుతున్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ, విద్యార్థుల ఆదరణ పొందిన దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్లు ఇక శాశ్వతంగా మూసివేయాలని ఏయూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వివిధ జిల్లాలతో పాటు కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకూ నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లను ఇకపై పూర్తిగా మూసివేయనున్నారు. ఏటా 6 వేలకు పైగా అడ్మిషన్లు ఏయూ దూరవిద్యలో చేరికకు ఏటా జూన్ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని ఏయూ దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్ల ద్వారా వివిధ డిగ్రీ కోర్సులలో 6 వేల మంది, పీజీ కోర్సులలో 1,500 మంది ఏటా అడ్మిషన్లు పొందేవారు. వీరందరికీ అడ్మిషన్లు, వారాంతపు తరగతుల షెడ్యూల్, ఏ కళాశాలలో, ఏయే విభాగాల్లో కాంటాక్ట్ తరగతులు నిర్వహిస్తున్నారు, పరీక్ష ఫీజులు, దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రం తదితర వివరాలు అందించేందుకు ఆయా స్టడీ సెంటర్లలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండేవారు. వీరు పై పనులతో పాటు విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం వంటి సేవలు కూడా అందించేవారు. విద్యార్థులకు సమయానికి స్టడీ మెటీరియల్ అందకపోతే సీనియర్ల పుస్తకాలు తీసుకుని అందజేసేవారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అందుబాటులో ఉండేవారు. ఈ సిబ్బందిని విశాఖపట్నంలోని ఏయూ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్టడీ సెంటర్లను మూసివేయడంతో ఇకపై వీరి సేవలు అందవని, డిగ్రీ పట్టా పొందడం కష్టమేనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్లోనే అడ్మిషన్లు ఇక నుంచి డిగ్రీ లేదా పీజీ అడ్మిషన్ కావాలంటే ఏయూ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అడ్మిషన్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి ఆన్లైన్పై అవగాహన లేదు. అలాగే, ఏదైనా నెట్ సెంటర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసినా.. ఫీజు చెల్లింపు, ఇతర విషయాల్లో తప్పిదాలు జరిగితే తాము నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. అయితే, వివిధ కోర్సులనే ఆన్లైన్లో నిర్వహిస్తూండగా.. అడ్మిషన్ల వంటివి ఆన్లైన్లో జరపడం పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా ఏయూ వ్యవహరిస్తోంది. వాస్తవానికి యూజీసీ నిబంధనలు సక్రమంగా పాటించడం ద్వారా ఏయూ దూరవిద్య కేంద్రం సర్టిఫికెట్లకు మంచి గుర్తింపే ఉంది. అటువంటిది ఇకపై ఆన్లైన్ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం ద్వారా అడ్మిషన్ల వేళ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నుంచి తరగతులు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటివన్నీ ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై దూరవిద్య కేంద్రం అధికారుల పర్యవేక్షణ ఉండదని అంటున్నారు. మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఆన్లైన్ కోర్సుకు కచ్చితంగా 20 శాతం పైగా విద్యార్థి చేతిరాత ద్వారా తరగతులు, ప్రాక్టికల్ పరీక్షలు చేపట్టాలి. మిగిలిన 80 శాతం ఆన్లైన్లో ఉండవచ్చు. కానీ, ఏయూ మాత్రం 100 శాతం ఆన్లైన్లోనే కొనసాగించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఇకపై డిగ్రీ, పీజీ సబ్జెక్టులను అధ్యాపకుడు తరగతి గదిలో బోధించడం కాకుండా ఆరు నెలల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు తరహాలో మార్చేస్తారని చెబుతున్నారు. -
ఈ నిర్ణయం సరికాదు
ఎంతో చరిత్ర కలిగిన ఏయూ దూరవిద్య కేంద్రం ద్వారా జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులయ్యారు. వీరిలో ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్టడీ సెంటర్కు సంబంధించిన అన్ని సేవలనూ ఆన్లైన్లో ఉంచి, ఈ కేంద్రాలను మూసివేయాలనేది సరైన నిర్ణయం కాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉద్యమిస్తాం ఫీజు, అడ్మిషన్ల వంటివన్నీ ఏయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, స్టడీ సెంటర్లు మూసివేతతో ఆవిధంగా సమాచారం ఇచ్చేవారుండరు. హెల్ప్లైన్ నంబర్లు పని చేయవు. ఏదైనా సమస్య వస్తే విశాఖపట్నంలోని వర్సిటీకి వెళ్లాలి. ఆన్లైన్ విధానం చూస్తూంటే ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపేలా ఉంది. స్టడీ సెంటర్లను తిరిగి కొనసాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – పెంకే రవితేజ, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకుడు -
పోలీస్ పీజీఆర్ఎస్కు 19 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 19 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా పోలీసు అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ పీజీఆర్ఎస్కు కుటుంబ సమస్యలు, ఛీటింగ్, కొట్లాట, సివిల్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఆర్థిక అవగాహన పెంపొందించాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజల్లో ఆర్థిక అవగాహనను పెంపొందించాలని కలెక్టర్ కీర్తి అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 13 వరకూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐ రూపొందించిన పోస్టర్లను ఎస్పీ నరసింహ కిశోర్, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలలో జాగ్రత్తలు, పొదుపు అలవాటుతో పాటు ఆర్థిక మోసాలపై అవగాహన చాలా అవసరమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే న్యాయ పోరాటంరాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా న్యాయపరమైన చర్యలతో పాటు, ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రైవేట్ గుర్తింపు పొందిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్య సంఘం అల్టిమేటం జారీ చేసింది. సోమవారం కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్ ఆవరణలో రాష్ట్ర ప్రైవేట్ గుర్తింపు పొందిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్య సంఘం (ప్రాస్మ) రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రాస్మ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోలమూరు ప్రభాకరరావు, కె.రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకటి నుంచి పదిమంది విద్యార్థులున్న మండలపరిషత్,మున్సిపల్ పాఠశాలలు నడుస్తుండగా, ఎయిడెడ్ పాఠశాలలకు 40మంది విద్యార్థులు తప్పనిసరి అని షరతు విధించడం సరికాదన్నారు. త్రిసభ్య కమిటీ తనిఖీల పేరుతో గైర్హాజరు విద్యార్థులను పాఠశాలల నుంచి తొలగించాలనే ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు కరస్పాండెంట్ షిప్ రద్దు చేస్తామని షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
కార్యదర్శుల శతమతం
● నెలాఖరుకు 100 శాతం పన్నుల వసూళ్ల టార్గెట్ ● లేనిపక్షంలో సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులు ● ఆందోళనలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ● రాబడే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిళ్లు ● జిల్లాలో రూ.133.22 కోట్ల లక్ష్యం సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం అడ్డదారులు తొక్కిన కూటమి నేతలు అలవిగాని హామీలు ఇచ్చేశారు. తాము గద్దెనెక్కితే సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా సంపదకు బదులు అప్పులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3.11 లక్షల కోట్లు అప్పు చేసిందంటే ‘సంపద సృష్టి’ మాటల్లో డొల్లతనం బయట పడుతోంది. ఖజానా ఖాళీ అవడంతో అడ్డదారుల్లో సంపద సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్చార్జీలు పెంచడం ద్వారా రూ.కోట్లల్లో ఆదాయం గడించిన చంద్రబాబు ప్రభుత్వం.. గ్రామీణ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. చేయని పక్షంలో సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ పరిణామం పంచాయతీ కార్యదర్శుల్లో ఆందోళన నింపుతోంది. మెడపై కత్తిలా.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం రూ.133.22 కోట్లు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో ట్యాక్స్లో భాగంగా ఇంటి, నీటి పన్నులు, నాన్ ట్యాక్స్గా ఇండస్ట్రీస్, చెరువులు తదితరాల కింద మొత్తం రూ.133.22 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నెల 15వ తేదీలోపు 50 శాతం వసూళ్లు పూర్తి చేయాలని, నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. లక్ష్యాలు అధిగమించకపోతే.. మండలానికి ఒక కార్యదర్శిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో గ్రామాల్లో కార్యదర్శులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. నిత్యం అదేపనిలో తలమునకలవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.38.74 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇదేం తీరు..? ఏటా ఇంటి పన్నుల వసూళ్లకు మార్చి మాసంలో నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్ నెలాఖరుకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రక్రియకు మంగళం పాడింది. ప్రజల వద్ద వసూళ్లకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక ప్రజలపై పడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే పన్నులు వసూలు చేసేయాలంటూ కార్యదర్శుల మెడపై కత్తిపెట్టారు. ఈ పరిణామం కార్యదర్శుల్లో ఆవేదన నింపుతోంది. కార్యదర్శి ఉద్యోగం చేయడం కంటే మానుకోవడం మేలంటూ కొందరు వాపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి 50 శాతానికి మించి పన్ను వసూలు చేయలేని కార్యదర్శులను మండలానికి ఒకరిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద గోడౌన్ల యాజమాన్యాలు మార్చి నెలాఖరులో తమ పద్దులు సరి చూసుకుని పన్ను కడుతుంటారు. సమస్యలు అనేకం పన్నుల వసూళ్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అవస్థలు తెచ్చిపెడుతోంది. ఎవరైతే తమ ఇంటికి, నీటి పన్నులు చెల్లించాలనుకుంటున్నారో.. వారి మొబైల్ నుంచే చెల్లింపులు చేపట్టాల్సి ఉంది. ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్లు తక్కువగా ఉంటారు. ఆన్లైన్లో పన్నులు చెల్లించే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు పన్నులు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒక ఇంటి నంబర్తో పన్ను చెల్లింపు ప్రారంభిస్తే.. అందులో ఏదైనా చిన్న సమస్య ఎదురైనా మరో 24 గంటల వరకు సర్వర్ స్తంభిస్తోంది. దీంతో ఆ ఇంటి పన్ను తిరిగి చెల్లించాలంటే మరో రోజు వేచి చూడాల్సి వస్తోంది. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ పర్యవేక్షించాల్సిన విధులు కేటాయించారు. ఆ విధుల్లోనే ఎక్కువ సమయం సరిపోతోంది. అనంతరం పన్నుల వసూళ్లకు రావాల్సి ఉంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామం జిల్లాలో పన్నుల డిమాండ్ ఇలా... మండలం పన్ను వసూళ్లు (రూ.కోట్లలో)రాజమహేంద్రవరం రూరల్ 34.73రాజానగరం 13.02దేవరపల్లి 6.43నిడదవోలు 3.23గోకవరం 3.28 గోపాలపురం 4.09మండపేట 7.72కొవ్వూరు 4.55రంగంపేట 3.30 నల్లజర్ల 5.63చాగల్లు 3.87సీతానగరం 4.22పెరవలి 2.97తాళ్లపూడి 2.71కోరుకొండ 3.39కడియం 10ఉండ్రాజవరం 3.66కపిలేశ్వరపురం 2.45రాయవరం 3.18 బిక్కవోలు 4.90అనపర్తి 5.89ఒత్తిడి తీవ్రం పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతోంది. ఉన్నతాధికారులు కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్ కార్యదర్శులు బీపీలు, సుగర్ బారిన పడుతున్నామని వాపోతున్నారు. కొందరు కార్యదర్శులైతే సెలవులో వెళ్లిపోయేందుకు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మంచి చేస్తామని ప్రకటనలు ఇచ్చి.. ఇప్పుడేమో పని ఒత్తిడి పెంచడంతో నిరాశ నిస్ప్రహలో కొట్టుమిట్టాడుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. -
ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ
రామచంద్రపురం: సోదర వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులును మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం వెంకటాయపాలెంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ మృతిచెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణ చిత్రపటానికి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఫోన్లో ఎమ్మెల్సీ త్రిమూర్తులును పరామర్శించారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్కుమార్, సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి, సింహాద్రి రమేష్, ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, ముద్రగడ గిరిబాబు, రామచంద్రపురం వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, రామచంద్రపురం, మండపేట మున్సిపల్ చైర్మపర్సన్లు గాధంశెట్టి శ్రీదేవి, పతివాడ నూక దుర్గారాణి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, అత్తిలి సీతారామస్వామి, పెదపూడి ఎంపీపీ కేతా తులసీ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, పెదపూడి మండలానికి చెందిన 14 మంది సర్పంచ్లు రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీ, వెంకటాయపాలెం సర్పంచ్ యర్రమల్లి సతీష్కుమారి, వైఎస్సార్ సీపీ నేత పెంటపాటి శ్రీను, అంబటి తుకారాం, ముద్రగడ కాంత్రి, నియోజకవర్గంలోని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్ సీపీ నేతలు త్రిమూర్తులును పరామర్శించారు. -
వైభవంగా గంధోత్సవం
● బషీర్ బీబీ దర్శనానికి పోటెత్తిన భక్తులు ● ప్రత్యేక ప్రార్థనలు ● కిక్కిరిసిన పొన్నాడ కొత్తపల్లి: స్థానిక పొన్నాడ బంగారు పాపమ్మ (బషీర్ బీబీ ఔలియా) ఉర్స్ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ సుమారు 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ముజావర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూలపేటకు చెందిన షెక్మౌలాసాహేబ్ ఇంటి వద్ద నుంచి పెద్ద బొడ్డేపల్లికి చెందిన ఎండీ తాజుద్దీన్బాబా సమర్పించిన గంధాన్ని (సంథల్) ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఉంచి ఫకీర్ మేళాతో మూలపేట నుంచి పొన్నాడ బషీర్బీబీ ఆలయం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతికి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ప్రార్థనల అనంతరం భక్తులకు గంధాన్ని పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా మూలపేట నుంచి పొన్నాడ వరకు కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొంది. పలు మార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, తుని, కాకినాడల నుంచి వచ్చిన వాహనాలు పొన్నాడ చేరుకోవడానికి ఇబ్బంది పడ్డాయి. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో సుమరు 120 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. వాహనాలు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా పొన్నాడ, అమరవిల్లి, నాగులపల్లి వద్దె నిలిపివేశారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేశారు. -
కనకదుర్గమ్మకు చీర, సారె
అమలాపురం రూరల్: గాంధీనగర్లో కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయ 30వ వార్షికోత్సవం సందర్భంగా మాఘమాసం ఆదివారం భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేలాదిగా మహిళలు సారెను నెత్తిన మోస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించిన ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఆలయ అర్చకుడు రామేశ్వరవరపు రామప్రసాద్ అధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారె, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తిక్కిరెడ్డి ఆదినారాయణ అధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రసాదాలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు బ్రాండ్ ‘శ్యామ్’బోట్క్లబ్ (కాకినాడసిటీ): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఒక బ్రాండ్గా నిలిచిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. పోలీస్ ఉద్యోగాలకే కాకుండా ఏపీపీ ఎస్సీ గ్రూప్– 2 ఉద్యోగాల్లోను శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఆదివారం గ్రూపు–2 విజేతల విజయోత్సవ సభ నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఎంతో నిబద్ధతతో, క్రమ శిక్షణతో ఇనిస్టిట్యూట్ను తీర్చిదిద్దడంతో అనేకమందికి ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందన్నారు. సంస్థ అధినేత గుంటూరి శ్యామ్, డైరక్టర్ శైలజ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించడంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్– 2 ఫలితాల్లో 94 పోస్టులను తమ విద్యార్థులు సాధించారన్నారు. సంస్థ ప్రారంభించిన 25 ఏళ్లలో 26 వేలకు పైగా ఉద్యోగాలు సాధించామన్నారు. రెండేళ్లుగా 7210 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని వివరించారు. గ్రూప్–2 విజేతలు మాట్లాడుతూ శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఉన్నతమైన బోధనతో పాటు మోటివేషన్, భరోసా, ఆత్మస్థైర్యం కల్పించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామన్నారు. అనంతరం విజేతలతో పాటు వారి తల్లితండ్రులను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
షామియానా తొలగించారు
కోటి తులసి పూజ సందర్భంగా వేసిన షామియాను ఆదివారం ఆలయ అధికారులు తొలగించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోటి తులసి పూజకు శ్రీకారం’ వార్తలో భక్తుల ఇబ్బందిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో ‘సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను’ ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకు షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఓ ఆదేశం మేరకు షామియానాను ఆలయ సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు గల విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఫొటోలు దిగారు. -
మానవత్వం నశించి పశువుల పాకకు నిప్పు
కపిలేశ్వరపురం: వెదురుమూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ నక్కా సింహాచలానికి చెందిన పశువుల పాకకు శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పాడి ఆవు మృతి చెందగా మరో పాడి గేదె తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. పశువులతో పాటు పాకలోని దాణా, వ్యవసాయ సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై సింహాచలం అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జి.హరీష్కుమార్, అంగర పశువైద్యాధికారి వీవీ రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేనివారు ఈ అమానుషానికి పాల్పడ్డారని బాధితుడు సింహాచలం అనుమానం వ్యక్తం చేశారు. 2023 జూన్లోనూ తన పశువుల పాకకు ఇలాగే నిప్పు పెట్టారని, అప్పటి ఘటన, నేటి ఘటనల్లో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందన్నారు. గత ఘటన సమయంలో ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేవని సింహాచలం అన్నారు. ఇప్పటికై నా దుండగులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు ఫోన్లో సింహాచలాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ సాకా శ్రీనివాస్, సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ, వైఎస్సార్ సీపీ నాయకులు సూరిబాబు, నల్ల శ్రీను, అర్జునరావు, పాలింగి శ్రీనివాస్, పాలింగి కిశోర్ పరిశీలించారు. ● పాడి ఆవు మృతి, మరో గేదెకు తీవ్ర గాయాలు ● ఆవేదన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకుడు -
కోటి జన్మల ఫలం తులసి పూజ
● రత్నగిరిపై మూడో రోజుకు చేరిన పూజలు ● విశేషంగా హాజరైన భక్తజనం అన్నవరం: మాఘ మాసంలో మహా విష్ణువును తులసి దళాలతో పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. వేకువ జామున సుప్రభాత సేవతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పండితులు వార్షిక కల్యాణ వేదికపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రసాదాలు నివేదించారు. ఉదయం తొమ్మిది నుంచి 11–30 గంటల వరకు 60 మంది రుత్విక్కులు ఐదు లక్షల తులసి దళాలతో విష్ణుసహస్ర నామాలతో స్వామి వారికి అర్చన చేశారు. అనంతరం నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు రుత్విక్కులు మరో ఐదు లక్షల తులసి దళాలతో స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ప్రసాద నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు వేదాశీస్సులు అందజేసి పవళింపు సేవతో రెండో రోజు కార్యక్రమాలు ముగించారు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్సింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. -
కడియపులంకలో అగ్ని ప్రమాదం
కడియం: మండలంలోని కడియపులంక కొబ్బరితోట కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.సత్తిరాజు ఇంట్లోని వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లోపు స్థానిక ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని అగ్ని మాపక శకటాన్ని పిలిపించగా ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
12 దేశవ్యాప్త సమ్మె
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండుతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12 నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (ఏపీఎంఎస్ఆర్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకట్రావు తెలిపారు. సమ్మె పోస్టర్ను కలెక్టరేట్ వద్ద ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత కార్మిక చట్టాలే అంతంత మాత్రంగా అమలవుతున్న పరిస్థితుల్లో కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మరింతగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తమకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను కూడా కొత్త లేబర్ కోడ్ ద్వారా రద్దు చేశారని చెప్పారు. రూ.18 వేల జీతం దాటిన వారు కార్మికులే కాదని, వారికి ఎటువంటి చట్టాలూ వర్తించవని పేర్కొన్నారని తెలిపారు. మెడికల్ రిప్స్కు నిర్దిష్ట పని పద్ధతులుండాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు అరికట్టాలని కోరుతున్నామన్నారు. యూనియన్ కాకినాడ బ్రాంచి కార్యదర్శి సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మెడికల్ రిప్స్ నిరంతరం యాజమాన్యాల వేధింపులకు గురవుతూంటారని చెప్పారు. లేబర్ కోడ్ల వల్ల వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, బ్రాంచి అధ్యక్షుడు ఎంఏ స్వామి పాల్గొన్నారు. ఉత్సాహంగా సైక్లాథాన్ కాకినాడ రూరల్: ఓఎన్జీసీ ఆధ్వర్యాన సైక్లాథాన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది, సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలోని ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబల్సేన్ గుప్తా బెలూన్లు గాలిలోకి విడిచిపెట్టి, జెండా ఊపి ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీ నుంచి సర్పవరం జంక్షన్ స్పెన్సర్స్ షాపు వరకూ, అక్కడి నుంచి తిరిగి ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వరకూ సైక్లాథాన్ సాగింది. ఇందులో ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు, మహిళలు, చిన్నారులు, గోదావరి, కాకినాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రబల్సేన్ గుప్తా మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని కోరారు. ఈస్ట్రన్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ రజిత్ మల్హోత్రా, హెచ్ఆర్ సునీల్ కుమార్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు. తలుపులమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో లోవకు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 15 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,80,455, పూజా టికెట్లకు రూ.2,40,090, తలనీలాలకు రూ.10,240, వాహన పూజలకు రూ.8,850, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.52,800, విరాళాలు రూ.48,759 కలిపి మొత్తం రూ.5,41,194 ఆదాయం లభించిందని వివరించారు. -
తోట త్రిమూర్తులుకు వైఎస్ జగన్ పరామర్శ
కపిలేశ్వరపురం: సోదర వియోగంతో బాధ పడుతున్న వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోనులో పరామర్శించారు. తోట సోదరుడు సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో తోటను జగన్ ఫోనులో ఓదార్చారు. త్రిమూర్తులును ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కూడా ఫోను ద్వారా పరామర్శించారు. అలాగే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలవురు నాయకులు రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెంలోని త్రిమూర్తులు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, బీజేపీ నాయకులు యాళ్ళ దొరబాబు, రాచమంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. -
లెక్క.. పక్కాగా..
రాయవరం: వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన జనాభా లెక్కల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఈ ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా వివిధ స్థాయిల్లో అధికారులను ఇప్పటికే నియమించారు. జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) ప్రక్రియ కొన్ని నెలల పాటు జరగనుంది. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం, కొత్త పథకాల రూపకల్పన వంటి వాటి కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జనగణన నిర్వహిస్తూంటారు. ఈ ప్రక్రియకు 1872లో నాటి బ్రిటిష్ పాలకుల హయాంలో శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి దీనిని నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ ఆధ్వర్యాన భారత జనాభా గణాంకాల చట్టం–1948 ప్రకారం జనాభా లెక్కల సేకరణ జరిగేది. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. 2021లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. ఎన్పీఆర్, సీఏఏ వంటి చట్టాలపై ఆందోళనలు, కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులన్నీ సద్దుమణగడంతో జనాభా లెక్కలను పూర్తి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జనగణ ప్రక్రియ చేపట్టేందుకు వివిధ స్థాయిల్లో కార్యనిర్వాహక అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నియమించారు. అధికారుల నియామకం ఇలా.. జిల్లా స్థాయిలో ప్రిన్సిపల్, అడిషనల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు వ్యవహరిస్తారు. సబ్ డివిజనల్ సెన్సస్ అధికారిగా సబ్ కలెక్టర్/ఆర్డీవో, చార్జ్ సెన్సస్ అధికారిగా మండల తహసీల్దార్లు, అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా ఎంపీడీవోలు, అసిస్టెంట్ చార్జ్ సెన్సస్ అధికారులు/సెన్సస్ క్లర్క్ ఇన్చార్జి అధికారులుగా డిప్యూటీ తహసీల్దార్/అంతకంటే తక్కువ స్థాయి అధికారి ఉంటారు. పట్టణ స్థాయిలో.. మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీ అధికారులు కూడా చార్జి సెన్సస్ అధికారులుగా వ్యవహరిస్తారు. అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా టౌన్ ప్లానింగ్ అధికారి/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/మున్సిపల్ రెవెన్యూ అధికారి ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారు. సిటీ సెన్సస్ అధికారిగా అదనపు కమిషనర్, చార్జి సెన్సస్ అధికారిగా జోనల్/డిప్యూటీ కమిషనర్/అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాధ్యతలు చేపడతారు. టీపీవో/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/ఆర్వో/ఆర్ఐ/ఏపీడీలు అదనపు చార్జి సెన్సస్ అధికారిగా వ్యవహరిస్తారు. టీపీవో/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/ఆర్వో/ఆర్ఐ సహాయక చార్జి సెన్సస్ అధికారిగా నియమిస్తారు. ఫ జనగణనకు చురుకుగా ఏర్పాట్లు ఫ కార్యనిర్వాహక అధికారుల నియామకం ఫ ప్రిన్సిపల్, అడిషనల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్, జేసీ ఫ జిల్లా అధికారిగా డీఆర్ ఫ సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ డిజిటల్ విధానంలో.. ఈసారి జనాభా లెక్కల సేకరణను పూర్తి డిజిటల్ విధానంలో, రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల జాబితా సేకరిస్తారు. రెండో దశలో జనాభా గణన ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ కానుంది. ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత జిల్లా జనాభా 20.98 లక్షలు జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 20,98,276. ఇటీవల జిల్లాలో కొత్తగా మండపేట నియోజకవర్గం కలిసిన అనంతరం జిల్లాలో కుటుంబాల సంఖ్య 5,88,452గా ఉంది. మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 20 శాతం, ఓసీ, బీసీలు 80 శాతం ఉన్నారు. తాజా జనగణన అనంతరం జిల్లాలో కుటుంబాల సంఖ్యతో పాటు, జనాభా కూడా పెరిగే అవకాశముంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా మండలం కుటుంబాలు జనాభా తాళ్లపూడి 15,109 52,785 కొవ్వూరు 30,185 1,08,445 చాగల్లు 18,585 64,774 గోపాలపురం 17,624 62,597 నల్లజర్ల 22,942 80,388 దేవరపల్లి 21,841 77,971 నిడదవోలు 31,631 1,14,245 ఉండ్రాజవరం 20,597 76,489 పెరవలి 19,192 70,194 రాజమహేంద్రవరం రూరల్ 44,692 1,66,973 కడియం 25,160 90,499 రాజమహేంద్రవరం అర్బన్ 91,374 3,41,831 గోకవరం 19,224 69,596 రంగంపేట 16,129 57,106 బిక్కవోలు 20,902 70,277 అనపర్తి 21,002 70,859 సీతానగరం 21,046 71,665 కోరుకొండ 22,672 79,553 రాజానగరం 29,004 1,06,085 మండపేట 38,650 1,32,679 కపిలేశ్వరపురం 19,958 66,809 రాయవరం 20,233 66,456 -
పూటుగా తాగి.. తన్నులాట
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికీ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఆదివారం క్యూలో ఘర్షణ పడి, దాదాపు పావుగంట పాటు కొట్టుకున్నారు. దీంతో, ప్రసాదం కొనుగోలుకు అక్కడకు వచ్చిన ఇతర భక్తులు భయభ్రాంతులకు గురై, ఏం జరుగుతుందోననే భయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు.. ప్రతి ఆదివారం లోవ దేవస్థానానికి వెళ్తున్న భక్తుల్లో కొంత మంది మద్యం తాగి, తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ప్రసాదాల కొనుగోలుకు ఆగుతున్నారు. ఈ క్రమంలో వారిలో వారు తరచుగా ఘర్షణకు దిగుతున్నా ఆపేవారే ఉండటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో ఉండని సిబ్బంది మరోవైపు తొలి పావంచా వద్ద ప్రసాదం కౌంటర్లలోని దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయం కొరవడుతోంది. ఈ నెల 2న తొలి పావంచా వద్ద ప్రసాదాల కొనుగోలుకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే ఉద్యోగి బయటకు వెళ్లాడని, పావుగంట ఆగాలని అక్కడ ప్రసాదం టికెట్లు విక్రయించే మరో ఉద్యోగి చెప్పాడు. తాము చాలా దూరం వెళ్లాలని, ఇలా ఆలస్యం చేస్తేగని ఆ భక్తులు పక్కనే గెస్ట్ హౌస్లో ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆ కౌంటర్ వద్దకు వచ్చి, అక్కడి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దగ్గరుండి మరీ ప్రసాదాలు అమ్మించారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పోలీసులను నియమించే అవకాశం లేదు తలుపులమ్మ లోవకు వెళ్లి వచ్చిన కొంత మంది భక్తులు మద్యం తాగి వచ్చి, అన్నవరం వచ్చి ఆ మత్తులో ప్రసాదాల కౌంటర్ల వద్ద ఘర్షణ పడుతున్నారు. వారిని నియంత్రించేలా అక్కడ నియమించడానికి తగినంత మంది పోలీసులు మాకు లేరు. దేవస్థానమే అక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించాలని చాలాసార్లు చెప్పాం. అయినప్పటికీ వారు నియమించడం లేదు. ఇప్పటికై నా దేవస్థానం అదివారం నాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ప్రసాదాల కౌంటర్ వద్ద ఘర్షణ పడిన వారు మాకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. – శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం ఫ సత్యదేవుని తొలి పావంచా ప్రసాదం స్టాల్ వద్ద భక్తుల ఘర్షణ ఫ పావుగంట పాటు కొట్టుకున్న వైనం ఫ భయభ్రాంతులకు గురైన ఇతరులు అంత సెక్యూరిటీ ఉన్నా ప్రయోజనమేదీ! అన్నవరం దేవస్థానంలో వంద మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 38 మంది పోలీసు శాఖకు చెందిన హోం గార్డులు పని చేస్తున్నారు. తొలి పావంచా వద్ద ఒక్క భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు హోంగార్డులు లేదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నా ఇలాంటి ఘర్షణలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమయంలో ఆ ఒక్కరు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. -
ఫొటోషూట్కు ఎంతో అనుకూలం
చింతూరు, మారేడుమిల్లిలోని మన్యం ప్రాంతాలు ఫొటోషూట్ల కు ఎంతో అనుకూలంగా ఉన్నా యి. అటవీ ప్రాంతంలో మంచి లొకేషన్లు ఉండడంతో సినిమా, సీరియల్ దర్శకులు ఇక్కడ షూటింగ్లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో ఇప్పటివరకూ ఇక్కడ తొమ్మిది నేషనల్ లెవల్ ఫొటో వర్క్షాప్లు నిర్వహించాం.–నాగరాజు దేవర, ఖమ్మం ఫొటోఆర్ట్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు రిసార్టులకు గిరాకీ పెరిగింది సినిమా, సీరియల్స్ షూటింగులతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. పొల్లూరు సమీపంలోని వాటర్ఫాల్స్తో పాటు పుష్ప సినిమా చిత్రీకరించిన ఫోర్బై రిజర్వాయర్, దాని సమీపంలో పవర్ కెనాల్ అక్విడెక్ట్ (వంతెన) ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఈ ప్రాంతాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. –పంచాడ నాని, రిసార్టు నిర్వాహకుడు, పొల్లూరు -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో సమన్వ య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 9 నుంచి 13 వరకూ పరీక్షలు జరుగుతాయని, ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. పోలీసు బందోబస్తు, ప్రశ్నపత్రాలు, రవాణా భద్రత, 144 సెక్షన్ అమలు, నిరంతర విద్యు త్ సరఫరా, వైద్య సదుపాయాలు, పరీక్ష కేంద్రాల కు వెళ్లే మార్గాల్లో బస్సుల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై శాఖల వారీగా చర్చించారు. అలాగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశ భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ను రూపొందించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్లో 2026–27 కేంద్ర బడ్జెట్పై శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2047 నాటికి భారత్ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్ పాఠశాలల్లో 2026, 27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాలు, వెనుక బడిన వర్గాల పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మార్చి 10వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. వివరాలకు మండల విద్యాశాఖ అధికారి, జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మూడు డ్రెడ్జింగ్ బోట్లు, 642 టన్నుల ఇసుక సీజ్ రాజమహేంద్రవరం రూరల్: కాతేరు గ్రామ పరిధిలోని డిసిల్టేషన్ ఇసుక రీచ్లో జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి ఆధ్వర్యంలో గనుల శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ ఒడ్డున మూడు డ్రెడ్జింగ్ బోట్లు, వాటి సమీపంలో రెండు ఇసుక గుట్టలు ఉన్నట్లు గుర్తించారు. డ్రెడ్జింగ్ బోట్లలో ఇసుక ఆనవాళ్లు లభించడంతో, అవి గోదావరిలో నియమాలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలలో పాల్గొన్నట్లు నిర్థారించారు. ఈ నేపథ్యంలో ఆ మూడు డ్రెడ్జింగ్ బోట్లను సీజ్ చేసి, వాటిని సంబంధిత ఇరిగేషన్శాఖ అధికారులకు అప్పగించారు. సమీపంలోని 642 టన్నుల ఇసుక గుట్టలను సీజ్ చేశారు. తదుపరి చర్యలు తీసుకునే వరకు స్థానిక రెవెన్యూ అధికారుల సంరక్షణకు అప్పగించారు. కాతేరు డిసిల్టేషన్ ఇసుక రీచ్లో నియమాలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా గనులు, భూగర్భ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి, అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ‘కోటి తులసి పత్రి పూజ’ అన్నవరం: లోక కల్యాణార్థం రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ శనివారం రెండో రోజు కు చేరుకుంది. శనివారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పండితులు స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు 60 మంది రుత్విక్కులు ఆరు లక్షల తులసి దళాలతో స్వామిని అర్చించారు. 11–30 గంటలకు వేదాశీస్సులు అందచేసి స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించారు. -
పుష్కరాలకు ఘాట్ నమూనా సిద్ధం చేయాలి
సీటీఆర్ఐ: రానున్న 2027 మహా గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని ఘాట్లను ఒకే ఆకృతిలో ఉండేలా ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. ఆమె శనివారం ధవళేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వరకూ ఉన్న సరస్వతీ ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర వాటిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర పుణ్య స్నానాలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమన్నారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రైల్ రన్గా భావించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ముందుగా ఒక మోడల్ ఘాట్ను నిర్మించి, అదే డిజైన్ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు. నగరపాలకసంస్థ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ ప్రముఖుల సందర్శన సమయంలోనూ సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాలు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఘాట్ల అభివృద్ధిపై ప్రాథమిక కార్యాచరణను వివరించారు. -
వ్యాపారులు చెప్పిందే ధర
మార్కెట్లో ధర ఉన్నా దిగుబడి తగ్గటంతో మాకు పెద్దగా ఉపయోగం లేదు. వ్యాపారులు చెప్పిన ధరకే కాయలను విక్రయిస్తున్నాం. ఎక్కడికై నా తీసుకువెళ్లి అమ్ముదామంటే అక్కడ కూడా తక్కువకే అడుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని వచ్చింది తీసుకుంటున్నాం. – నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు నిల్వ చేయడం లేదు కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. పండగ సీజన్ ప్రారంభం కావడం, శుభ ముహూర్తాలు రావడం, దిగుబడి తగ్గిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సరుకు లేకపోవటంతో ఈ ధరలు ఉన్నాయి. ఇవి ఎంత కాలం ఉంటాయో తెలియదు. అందుకే కాయలను నిల్వలు వేయటం లేదు. వచ్చిన కాయ వచ్చినట్లు మార్కెట్కు తరలిస్తున్నాం. – అడబాల బ్రహ్మయ్య, కొబ్బరి వ్యాపారి, అన్నవరప్పాడు -
‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్
మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో చిత్రీకరించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ద రైజింగ్ విడుదలై సూపర్ హిట్ కావడంతో మన్యం ప్రాంతంపై ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. మారేడుమిల్లి మండలం గుడిస, చింతూరు మండలం ఫోర్ బై ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ అధిక శాతం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ సమయంలో గుడిస ప్రాంతంలోని ఒంపులు తిరిగే ఎర్రటి ఘాట్ రోడ్పై వాహనాలు వెళ్లే దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. చింతూరు మండలం ఫోర్ బై రిజర్వాయర్ వద్ద ఈ సినిమాలోని సామీ, సామీ సాంగ్తో పాటు హీరో, హీ రోయిన్ నడుమ చిత్రీకరించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు పుష్ప–2 సినిమాలోని మరికొన్ని సన్నివేశాలను మారేడుమిల్లి, తులసిపాక సమీపంలోని సోకిలేరువాగు ప్రాంతాల్లో తీశారు. ఈ ప్రాంతాల్లో నిత్యం షూటింగ్లు జరుగుతుండడంతో స్థానిక యువతకు సైతం క్యారెక్టర్ అర్టిస్టులుగా నటించే అవకాశం లభిస్తోంది. -
కొబ్బరి రైతు వెలవిల
● మార్కెట్లో పెరిగిన ధర ● తోటల్లో తగ్గిన దిగుబడి, మరోవైపు దళారుల దందా ● వెయ్యి కాయలకు రూ.21 వేలన్నా రైతుకు అందేది రూ.15 వేలే పెరవలి: సాధారణంగా పంట ఉత్పత్తుల ధర పెరిగితే దాన్ని పండించే రైతులకు లాభాలు వస్తాయి. తద్వారా ఆదాయం పెరిగి కొంత వెనుక వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరి రైతుల పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి కాయలకు గిట్టుబాటు ధర బాగుంది. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కవ్వడం, దిగుబడి తగ్గిపోవడంతో వారికి పెరిగిన మేరకు ఆదాయం రావడం లేదు. కొబ్బరి కాయ లకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉన్నా.. దళారులు, వ్యాపారస్తులు కలిసి ధరలను తగ్గించి రైతులకు అందకుండా చేస్తున్నారు. వెయ్యి కాయలకు.. ప్రస్తుతం మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయలు నాణ్యతను బట్టి రూ.19 వేల నుంచి రూ.21 వేలు పలుకుతున్నాయి. అయితే దింపు ఖర్చు, మోత, ఒలుపు, రవాణా అంటూ కొందరు రైతులను దోచుకుంటున్నారు. రైతులు కూడా వచ్చిందే మంచి ధర అని సరిపెట్టుకుంటున్నారు. గత మూడు నెలలుగా అంతంత మాత్రంగా ఉన్న కొబ్బరి ధర నేడు పండగలు సీజన్ ప్రారంభం, శుభ ముహూర్తాలు రావడం, దిగుబడి తగ్గడం తదితర కారణాలతో అమాంతం పెరిగింది. అయితే వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి కొబ్బరి దింపు, మోత, రవాణా, ఒలుపు వంటివి అన్ని తామే చూసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారు. దానికి అంగీకరించిన రైతులకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అదే రైతు దింపు తీసి ఒక్క చోట గుట్టగా పెట్టితే కాయల నాణ్యతను బట్టి రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకూ చెల్లిస్తున్నారు. సాగు విస్తీర్ణం పాత ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉండగా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇదే కాకుండా చేల గట్లు, పుంత గట్లు, చెరువు గట్లు, లంక భూముల్లో కూడా కొబ్బరి సాగవుతోంది. పెరవలి మండలం కానూరు, కానూరు అగ్రహారం, నడుపల్లి, తీపర్రు, కాకరపర్రు, ముక్కామ ల, ఖండవల్లిల్లో 400 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దళారీలు, వ్యాపారస్తులు కుమ్మక్కవ్వటంతో పెరిగిన ధరను రైతులకు ఇవ్వడం లేదు. ఎక్కడికు వెళ్లినా అదే రేటు చెప్పడంతో రైతులు కూడా చేసేది లేక అయిన కాడికి అమ్ముకుంటున్నారు. . తగ్గిన దిగుబడులు గతంలో ఒక ఎకరం కొబ్బరి తోట నుంచి సుమారు 1200 నుంచి 1400 కాయల దిగుబడి వచ్చేది. కానీ నేడు దానిలో దాదాపు సగం తగ్గిపోయి 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తోంది. గతంలో వేసవిలో కాయలు తయారైనా, అవ్వకపోయినా నీళ్లు ఆడేవని దీనితో దిగుబడి వచ్చేదని రైతులు చెబుతున్నారు. నేడు శీతల గాలులు, చలి ఎక్కువగా ఉండటంతో కాయ తయారు కావడం ఆలస్యమవుతోందన్నారు. ధర పెరగడానికి కారణాలివే.. కొబ్బరికి మార్కెట్లో ధర పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవటంతో ఇక్కడి కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో పండగలు, శుభ ముహూర్తాలు ఉండటం, దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. అందుకే మన కొబ్బరికి డిమాండ్ వచ్చిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఎగుమతులు మూడు నెలల క్రితం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. నాడు 150 లారీలకు మించి వెళ్లడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరి ధరను పెంచేది, తగ్గించేది ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన అంబాజీపేట, పాలకొల్లు మార్కెట్లే. చిరు వ్యాపారస్తులందరూ ఈ మార్కెట్లలో నిర్ణయించిన ధరలు ప్రకారమే రైతులకు చెల్లిస్తారు. తీపర్రులో కొబ్బరి కాయలను లెక్కిస్తున్న కూలీలు కలసి రావడం లేదు కొబ్బరికి మార్కెట్లో ధర ఉన్నా మాకు మాత్రం వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేలు చెల్లిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అంటున్నారు. కొబ్బరికి డిమాండ్ ఉన్నా మాకు మాత్రం కలసి రావటం లేదు. – వాకలపూడి గాంధీ, కొబ్బరి రైతు, కానూరు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
15 కిలోల గంజాయి పట్టివేత
ఎటపాక: ఆటోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎటపాక పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కన్నపరాజు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై అప్పలరాజు నెల్లిపాక జాతీయ రహదారిపై ఉన్న అటవీ శాఖ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 15 కిలోల గంజాయి ఉండటంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అడపా రాకేష్, కణితి సాయిరామ్లు తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడకు ఒడిశా రాష్ట్రం నుంచి ఆటోలో గంజాయి తరలిస్తున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పారిపోయారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. -
ఊరెళ్లారని తెలుసుకుని ఉన్నదంతా ఊడ్చేశారు!
దుర్గాడలో భారీ చోరీ పిఠాపురం: ఇంట్లో వారు ఊరెళ్లారని తెలుసుకుని గుర్తుతెలియని వ్యక్తులు, ఆ ఇంటిని కొల్లగొట్టిన సంఘటన గొల్లప్రోలు మండలం దుర్గాడలో శనివారం చోటుచేసుకుంది. భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన కొండేపూడి సూర్యనారాయణ తన భార్యతో కలసి పూణేలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి గత 24న వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంటికి తాళాలు వేసి అదే గ్రామంలో నివాసముంటున్న తన అల్లుడు వెలుగుల భాస్కరరావుకు తన ఇంటిని అప్పగించారు. అప్పటి నుంచి ఇంటిని చూస్తున్న భాస్కరరావు రోజూ బయట గేటు తాళాలు తీసి ఇంటి బయట తుడిపించడం, లైట్లు వేయించడం చేస్తున్నారు. శనివారం వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా, దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సుమారు 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును పిఠాపురం సీఐ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలోల రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నారు. రాజానగరం ఎంఎస్ఓ బాపిరాజు కథనం ప్రకారం.. వివిధ రంగుల్లో ఉన్న 311 ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసిన ఈ బియ్యాన్ని గోపాలపురం నుంచి రాజానగరానికి తరలిస్తున్నారు. దీని విలువ రూ. 8,43,510 ఉంటుందని అంచనా. ఈ మేరకు గొల్లప్రోలుకు చెందిన లారీ డ్రైవర్, ఓనర్లు అల్లు శ్రీనివాస్, చోడిశెట్టి మహేష్లపై 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యంతో కూడిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి అనపర్తి: విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుతుకులూరు గ్రామంలో జరిగిందని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండపేట మండలం వేములపల్లికి చెందిన కాపా ధర్మయ్య (53) భార్య బోదమ్మతో కలసి నాలుగేళ్లుగా కుతుకులూరులో ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ఆ బట్టీలోనే వారంతా నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ధర్మయ్య మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత అతని అరుపులు వినిపించడంతో బోదమ్మ వెంటనే అక్కడికి వెళ్లగా, లైటింగ్ అవసరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని చేతితో పట్టుకోవడం వల్ల అతనికి విద్యుత్ షాక్ పడిపోవడం గమనించింది. తక్షణమే అతనిని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక ఆలమూరు: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు కె.ధర్మాజీ ఎంపికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ధర్మాజీని సెలక్టర్లు ఈ కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 9 నుంచి 14 వరకూ ఛండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ధర్మాజీ పాల్గొనున్నాడు. నాలుగేళ్ల నుంచి వరుసగా కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. -
● ఇంకెన్నాల్.. ఈ పాట్లు
మాచవరం నుంచి చిరతపూడి వెళ్లే ప్రధాన పంట కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మందు సీసాలు, పశు కళేబరాలతో నిండిపోయింది. అయినా ప్రభుత్వం, పాలకులు చోద్యం చూస్తున్నారు. వాటిని తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ వ్యర్థాలతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. –అంబాజీపేట ● పొగబెట్టారండోయ్.. రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం నల్లని పొగ కమ్మేసింది. ఇది ఆకాశంలో మేఘంలా రావులపాలెం సెంటర్ వరకూ వ్యాపించింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జి కింద గోదావరిలో పాత ఇసుక ర్యాంపు బాట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలతో పాటు, తారు లాంటి వ్యర్థాలకు నిప్పంటించారు. దీంతో బ్రిడ్జి అంతా పొగతో నిండిపోయింది. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. –రావులపాలెం ● నిలపడేలా ఎందుకో! నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తగా కారణంగానే ఎందరో ప్రాణాలు పోతున్నాయి. అయినా ఇలా ఆటో వెనుక ఇలా నిలబడి ప్రయాణం చేయడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చింతూరు – కూనవరం రహదారిలో శనివారం ఓ ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వెనుక డోరుపై మహిళలను సైతం నిలబెట్టి తీసుకెళ్లారు. –చింతూరు -
విశాఖపట్నం జూకు పెద్ద పులి
రాజమహేంద్రవరం రూరల్: ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లో సంచరిస్తూ, కనిపించిన ఆవులు, దూడలను చంపేస్తూ దాదాపు వారం రోజుల పాటు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలోని ఓ పాకలో దాగిన పెద్ద పులిని పూణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందం, ఆటవీ శాఖ అధికారుల బృందం పట్టుకుంది. ఆ పులికి శాసీ్త్రయంగా మత్తు మందు ఇవ్వడంతో కొద్దిదూరం వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం దాన్ని వెంబడించి అత్యంత జాగ్రత్తగా, బంధించారు. అనంతరం పులిని ప్రత్యేక బోనులో విశాఖపట్నంలోని రెస్క్యూ కేంద్రానికి తరలించారు. పులిని కొద్ది రోజులు పరిశీలించి, దాని ప్రవర్తనను బట్టి అడవిలో విడిచిపెట్టాలా లేక, జూలో ఉంచాలా అన్నది నిర్ణయిస్తామని అటవీరేంజ్ ఆఫీసర్ ఎన్.దావీదురాజు తెలిపారు. పులిని బంధించిన పూణే రెస్క్యూ బృందాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యేకంగా అభినందించారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వైజాగ్ జూకు చెందిన వెటర్నరీ డాక్టర్లు ఫణీంద్ర, భాను, రాజమహేంద్రవరం సీసీఎఫ్, అటవీశాఖాధికారి ఎన్.దావీదురాజు బృందం కీలక పాత్ర పోషించారని జిల్లా అటవీ శాఖ అధికారి బి.ప్రభాకరరావు తెలిపారు. -
ఆపదలో అపర సంజీవని
● ఆరోగ్యశ్రీ రద్దుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర ● నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం ● జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయిలు ● తాజాగా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’కి సమాలోచనలు ● ఏప్రిల్ నుంచి అమలు చేసేలా సన్నాహాలు ● ప్రశ్నార్థకం కానున్న ఆరోగ్య మిత్రల భవితవ్యం సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం అందజేస్తూ, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేసి వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న ఆరోగ్యశ్రీ అద్భుత పథకానికి మంగళం పాడేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్టు అనిపిస్తోంది. ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చిన ప్రభుత్వం దానిని కూడా నిలిపివేసేందుకు యోచిస్తోంది. ఆ స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు అందాల్సిన బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందా? అంటే అంతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు, వైద్య మిత్రల ఉద్యోగాలు కొనసాగుతాయా..? లేదా..? అన్న ఆందోళన నెలకొంది. ఇదీ సంగతి ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా ఆస్పత్రి 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్యశాలల్లో (ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 60 మంది వైద్య మిత్రలు 17 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీని ఎత్తేస్తారని వినిపిస్తుండడంతో వారి ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) స్థానంలో ఏప్రిల్ నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇందుకు కేవలం రెండు నెలల సమయమే ఉండడంతో వైద్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. కొత్త పథకం అమల్లోకి వస్తే 50 శాతానికి పైగా ఉద్యోగాలు ఊడిపోతాయన్న ప్రచారం సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అందులో సంస్కరణలు తీసుకువచ్చి మరింత మెరుగైన వైద్యాన్ని, మరిన్ని వ్యాధులకు ఆ పథకాన్ని విస్తరించినది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వారిద్దరి పేర్లను ప్రజల గుండెల్లోంచి తొలగించాలన్న దుర్బుద్ధితో ఆ పథకాన్ని తొలగించి కొత్త పాలసీ తీసుకువస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జీవో 162 మాత్రమే విడుదల చేసిన సర్కారు సదరు పాలసీ మార్గదర్శకాలు, స్పష్టమైన ఆదేశాలను గుట్టుగా ఉంచినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్, ఆపై మొత్తానికి బీమా కంపెనీల ద్వారా వైద్యం అందించాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఆస్పత్రులలోని సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. అయితే తక్కువ ప్యాకేజీల వల్ల బీమా సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం. నూతన పాలసీపై అయోమయం ఆరోగ్యశ్రీని తొలగిస్తే మెరుగైన వైద్యం అందుతుందా..? లేదా..? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజీ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. క్లెయిమ్ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్నార్ధకమే. రూ.250 కోట్ల బకాయిలు తెల్ల రేషన్కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింపజేస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారుగా రూ.250 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు ఆస్పత్రుల యాజమాన్యాలకు గుదిబండగా మారాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కేసులంటేనే ఎందుకొచ్చిన అరువు సేవ అని భావిస్తున్నారు. గుండె, చర్మం, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జరిగిన వైద్యానికి ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. ఈ పరిణామం పేదలకు ఇబ్బందిగా మారింది. ఖరీదైన శస్త్ర చికిత్సలు తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. దీనిపై ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. 5 శాతమే విడుదల జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.250 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అనేక ఆందోళనల నేపథ్యంలో తలొగ్గిన ప్రభుత్వం 5 శాతం నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగిలినవి ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. 18 నెలల్లో మూడుసార్లు మందులు, సర్జికల్ పరికరాల కొనుగోళ్లు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులతో పాటు, ఆస్పత్రుల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నామని ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బకాయిల చెల్లింపు డిమాండ్తో గత ఏప్రిల్లో సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి బిల్లులు చెల్లిస్తామని హామీ పొందారు. అనంతరం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో మళ్లీ సమ్మెకు దిగారు. మరో సారి ఏకంగా వైద్యమే ఆపేశారు. పథకం నిలిపివేసేందుకు కుట్ర ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి, ఆ పథకం స్థానంలో ఆయుష్మాన్ భారత్ను తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం మక్కువ చూపుతోంది. బీమా పథకం అమలు చేసే యోచనలో ఉంది. ఇందులో వ్యాధుల సంఖ్య 1900 లోపే ఉంటుంది. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్పై ఆసక్తి చూపడం లేదు. ఇదే జరిగితే నయా పైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు (ఫైల్) వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ ప్రస్థానం 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఇందుకోసం రూ.508,49,95,571 కోట్లు వైద్యం, శస్త్ర చికిత్సల కోసం వెచ్చించగా. 2,48,805 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. వీటిలో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, అల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కు (14 ఏళ్లుపైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షలు వెచ్చించారు. -
కోటి తులసి పూజకు రూ.1.08 లక్షలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పత్రి పూజకు సప్తగిరి హేచరీస్ ఎండీ పెదబాబు శుక్రవారం రూ.1.08 లక్షల విరాళం అందజేశారు. ‘నన్నయ’లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వాటి వివరాలు తెలియజేశారు. సర్టిఫికెట్ కోర్సులివీ ఫంక్షనల్ ఇంగ్లిష్, కలినరీ స్కిల్స్, ఫారెన్ లాంగ్వేజెస్ (జపనీస్, ప్రెంచ్, జర్మన్), ఒరియంటల్ పీసీ కల్చరల్, ప్లోరల్ బై ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ఫైనాన్స్, ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్, ఇంట్రడక్షన్ టు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, బేసిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, న్యూట్రిషన్ అండ్ డిటెటిక్స్ అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి : మూడు నెలలు ఫీజు: విద్యార్థులకు రూ.వెయ్యి, వర్సిటీ సిబ్బందికి రూ.రెండు వేలు, ఇతరులకు రూ.మూడు వేలు డిప్లొమా కోర్సులు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, మోబైల్ యాప్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి : ఆరు నెలలు ఫీజు: విద్యార్థులకు రూ.2 వేలు, వర్సిటీ సిబ్బందికి రూ.3 వేలు, ఇతరులకు రూ.4 వేలు. పీజీ డిప్లొమా కోర్సులు ఫంక్షనల్ ఇంగ్లిష్, ఫైన్ ఆర్ట్స్ (మ్యూజిక్, పెయింటింగ్, థియేటర్ ఆర్ట్స్), టూరిజం అండ్ హాస్పిటాలిటీ, క్వాయర్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ (పీజీడీఎం), హాస్పిటల్ మేనేజ్మెంట్, కంప్యూటేషన్ మేథమెటిక్స్, లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, గాంధీయన్ ఐడియాలజీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొగ్రామ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు వ్యవధి : ఒక సంవత్సరం ఫీజు: విద్యార్థులకు రూ.3 వేలు, వర్సిటీ సిబ్బందికి రూ.4 వేలు, ఇతరులకు రూ.5 వేలు అక్రమ మైనింగ్లో తనిఖీలు వాహనాల సీజ్ అనపర్తి: జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాల నియంత్రణలో భాగంగా గనులు, భూగర్భశాఖ అధికారి డి.ఫణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిక్కవోలు మండలం, కాపవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 15/1ఏ లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఈ బృందం తనిఖీ చేసింది. సదరు భూమి గతంలో సీహెచ్ వెంకటేష్ పేరున లీజు మంజూరు కాగా, ప్రస్తుతం కాల పరిమితి ముగిసినట్టు గుర్తించినట్టు ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక పొక్లెయిన్, అక్రమ రవాణాకు వినియోగిస్తున్న మూడు లారీలను సీజ్ బిక్కవోలు పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీష, సర్వేయర్ శ్రీనివాస్, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
గాండ్రింపు ఆగింది..
చిక్కదు.. దొరకదు.. అన్నట్టుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. ఎట్టకేలకు పట్టుబడింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లో నక్కిన పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, అది అక్కడి నుంచి తప్పించుకుని, సాయంత్రానికి సమీపంలోని పశువుల పాకలో నక్కింది. అక్కడి నుంచి అది తప్పించుకోవడానికి వీలు లేకుండా.. ఆ పాక చుట్టూ అధికారులు వల పన్ని, చివరకు ట్రాంక్విలైజర్తో మత్తు మందు ఇచ్చి, బంధించారు. దీంతో, గత నెల 31న సీతానగరం మండలంలో మొదలైన టైగర్ టెర్రర్కు తెర పడింది. – వివరాలు 8లో.. -
పుష్కరాలను సమష్టిగా విజయవంతం చేద్దాం
● రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ● సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జూన్ 26న ప్రారంభమయ్యే పుష్కరాలను సమిష్టి కృషితో నిర్వహించి విజయవంతం చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పుష్కర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు, హెచ్వోడీలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. నవ జనార్దన పారిజాతం (వైష్ణవ క్షేత్రాలు), ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలం సమానమే అన్న విషయంపై భక్తుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే ఉన్న బడ్జెట్కు అనుగుణంగా, స్పష్టమైన లక్ష్యాలు, సమ్మతమైన విధానం ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ డి.నరసింహ కిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి, చండీహోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు అమరేశ్వర ఘనపాఠి, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్, పరిచారకులు హోమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు 30 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుని ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. -
పన్నులు వసూలైతేనే పురాభివృద్ధి
● మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు ● కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అమలాపురం టౌన్: ప్రజలు పన్నులు నూరుశాతం చెల్లించినపుడే మున్సిపాలిటీలు పురోభివృద్ధి సాధిస్తాయని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహరావు అన్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని 6 మున్సిపాలిటీల కమిషనర్లతో వారి పరిధిలో పన్నులు, పనుల స్థితిగతులపై శుక్రవారం సమీక్షించారు. అంతకు ముందు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆస్తి, తాగునీరు, ఖాళీ స్థలాల పన్నుతో పాటు ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్సులు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లలో అద్దెలను సకాలంలో చెల్లించాలని కోరారు. రెండు జిల్లాల పరిధిలోని అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లో జనవరి నెలాఖరు నాటికి అమలాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 49.83 శాతం, తాగునీటి పన్ను 46.81 శాతం, నిడదవోలు మున్సిపాలిటీలో 52.83 శాతం, 44.06 శాతం, రామచంద్రపురం మున్సిపాలిటీలో 57.16 శాతం, 10.7 శాతం, మండపేట మున్సిపాలిటీలో 59.83 శాతం, 15.64 శాతం, ముమ్మిడివరం నగర పంచాయతీలో 62.68 శాతం, 7.07 శాతం, కొవ్వూరు మున్సిపాలిటీలో 67.79 శాతం, 33.27 శాతం వసూలైనట్టు తెలిపారు. సమీక్షలో భాగంగా దోమలు, పందులు, కుక్కుల బెడద అంశాలపై చర్చించారు. దాదాపు రూ. 5 కోట్లతో ప్లాస్మా టెక్నాలజీలో పది టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మార్కెట్లోకి సుజుకి ఈ–యాక్సిస్ స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ను రాజమహేంద్రవరం కంటిపూడి సుజుకి షోరూంలో శుక్రవారం జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి ఆర్.సురేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్కుమార్లు మార్కెట్లోకి విడుదల చేశారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీతో ఈ వాహనం విడుదలైందన్నారు. దీనిద్వారా నాలుగు రెట్ల అధిక బ్యాటరీ జీవితం లభించనుందన్నారు. దేశంలోనే తొలిసారిగా 60 శాతం విలువతో బై–బ్యాక్ సౌకర్యం కల్పించడం ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. హయాబూసా, జీఎస్ఎక్స్, వి–స్ట్రోమ్ వంటి అత్యాధునిక మోడళ్లకు టెస్టింగ్ జరిగే జపాన్లో ఈ స్కూటర్ పరీక్షలు జరగడం విశేషమన్నారు. కేవలం ఒక గంట 12 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అయ్యే సామర్థ్యం ఉందని సర్వారాయుడు తెలిపారు. కీ–లెస్ సిస్టమ్తో స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ మరియు 4.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చిందన్నారు. కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి (చినబాబు), కె.వినయ్బాబు, ఎం.జగన్, కె.మన్మోహన్రామ్, ఎస్ఎం వెంకటేశ్, నగర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పొన్నాడలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: పొన్నాడలో వేంచేసి ఉన్న బషీర్బీబీ (బంగారు పాపమ్మ) ఔలీయా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముజావర్లు సంథల్ (గంధం) తీసి అమ్మవారికి పూయడంతో ఉత్సవాలను ప్రారంభించారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు ఇప్పటికే పొన్నాడ చేరుకున్నారు. వీరంతా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని మూడు రోజులూ ఇక్కడే ఉండి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం సంథల్ (గంధం) ఉత్సవంతో ముగియనున్న ఈ ఉత్సవాల్లో గంధోత్సవం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. గంధోత్సవం కోసం స్థానిక ముజావర్లు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తపల్లి ఎౖస్సై జి.వెంకటేష్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ఖురాన్ఖాని, వాచ్, మిలాద్షరీఫ్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బషీర్బీబీ ముస్లింల దేవతైనప్పటికీ అన్ని మతాలు, కులాలకు చెందిన భక్తులు దర్శించుకోవడం వల్ల ఈ ఉత్సవాన్ని మత సామరస్యానికి చిహ్నంగా చెబుతుంటారు. బషీర్బీబీ దర్గాను స్థానిక సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తన సొంత నిధులు రూ. 10 లక్షలతో పునర్నిర్మించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉరుసు ఉత్సవాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు
గోకవరం: మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా భూగర్భ, గనుల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు పొక్లెయిన్లను సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీషా, స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గాండ్రింపు ఆగింది..
ఫ కూర్మాపురంలో చిక్కిన పులి ఫ ఫలించిన ‘ఆపరేషన్ టైగర్’ ఫ విశాఖపట్నం తరలింపు రాయవరం: గాండ్రింపు ఆగింది.. ఎట్టకేలకు పెద్ద పులి చిక్కింది.. వారం రోజుల నుంచి పులి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.. చివరికి అటవీశాఖ అధికారులు, పోలీసుల కృషి ఫలించింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పులిని అధికారులు బంధించి విశాఖపట్నం జూలాజికల్ పార్క్కు తరలించారు. రాయవరం మండలం కూర్మాపురంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు పొలానికి వెళ్లిన రైతులు పులి అడుగు జాడలను గమనించారు. పొలంలో మందును స్ప్రే చేస్తుండగా గ్రామానికి చెందిన గుంటూరు వనుములు తొలుత చూశారు. ఈ విషయాన్ని ఊళ్లో వారికి చెప్పడంతో, పులి అడుగు జాడల వెంబడి వెళ్తుండగా గుణ్ణం బాబూరావు చెరువు వద్ద గాండ్రింపును రైతులు ముత్యాల శ్రీనివాస్, గుణ్ణం పనసయ్య విన్నారు. ఆ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేశారు. అనంతరం ఆ పులి ఆంజనేయస్వామి గుడి సమీపంలోని పాలచర్ల రాజు ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 11.30 గంటల ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పుణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ప్రత్యేక వాహనంలో ఉండి పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే మధ్యాహ్నం 1.50 గంటలకు ఒక్కసారిగా పులి పాలచర్ల రాజు ఇంటి గోడ దూకి అరటి తోటల నుంచి పంట పొలాల మీదుగా గ్రామంలోని కొలగాని సత్తిబాబు పశువుల పాకలోకి చేరింది. అప్పటికే పశువుల పాకలో రెండు గేదెలు, లేగదూడ ఉన్నాయి. వాటిని పులి చంపిందన్న వార్త బయట హల్చల్ చేసింది. అయితే వాటిని ఏమీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పశువుల పాక వద్దే ఉండి.. పశువుల పాక నుంచి బయటకు పులి బయటకు వస్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పశువుల పాక బయట వేచిచూశారు. పశువుల పాక వద్ద భవనాల పైకి చేరిన రెస్క్యూ టీమ్ సభ్యులు తుపాకీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు చూశారు. అప్పటికే చీకటి పడుతుండడంతో ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. చివరికి సాయంత్రం 6.32 గంటలకు పులి బయటకు వచ్చింది. వెంటనే రెండు వైపులా నుంచి రెస్క్యూ టీమ్ సభ్యులు తుపాకీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువురు ఒకేసారి తుపాకీ ద్వారా ఇంజెక్షన్ చేయగా, ఒకటి పులికి తగిలింది. పశువుల పాకకు 100 మీటర్ల దూరంలో దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద పులి రహదారిపై పడిపోయింది. అప్పటికే పులిని అధికారులు, ప్రజలు వెంబడించారు. వెంటనే పులిని బంధించి, ప్రత్యేక వాహనంపై అటవీ శాఖ అధికారులు విశాఖపట్నం జంతు ప్రదర్శన శాలకు తరలించారు. పయనం సాగిందిలా.. తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు పులి సంచరించింది. జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిం. ప్రాణనష్టం లేకున్నప్పటికీ, ఆరు పశువులు మాత్రం పులి బారిన పడ్డాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి సాగిన పెద్ద పులి ప్రయాణం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ముగిసింది. తడోబా అభయారణ్యం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఖమ్మం జిల్లా పాల్వంచకు చేరుకుంది. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, పోలవరం మీదుగా గత నెల 31న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలోకి ప్రవేశించింది. పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి జిల్లాలో కోలమూరు, దివాన్చెరువు మీదుగా రాజానగరం మండలం జి.యర్రంపాలెం నుంచి గురువారం అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో పులి జాడను అధికారులు కనుగొన్నారు. శుక్రవారం ఉదయానికి పులి రాయవరం మండలం కూర్మాపురంలోకి చేరుకోగా, ఇక్కడ అధికారుల పన్నిన వలలో చిక్కింది. భయపడిపోయాం.. మా ఇంటి పరిసరాల్లోనే పులి ఉందన్న వార్తతో చాలా భ యపడ్డాం. మొదట్లో ఆందో ళన చెందాం. అటవీశాఖ, పో లీసులు వచ్చిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది. మా ఇంటి వెనుక నుంచే పులి పారిపోవడం చూశాం. గ్రామానికి పులి వస్తుందని అసలు ఊహించలేదు. –చిలుకూరి బుజ్జి, కూర్మాపురం, రాయవరం మండలం ఆపరేషన్ విజయవంతం వారం రోజులుగా పులి సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కూర్మాపురం చేరుకుందని తెలియగానే, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పులిని పట్టుకున్నాం. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ట్రాంక్విలైజేషన్ ప్రక్రియతో ఆపరేషన్ విజయవంతం చేశాం. –బి.విద్య, ఈస్ట్జోన్ డీఎస్పీ, రాజమహేంద్రవరం డివిజన్ పశువులను వదిలేసి.. పశువుల పాకలో పులి సుమారు 4.30 గంటలు ఉంది. అప్పటికే పశువుల పాకలో రెండు గేదెలు, ఒక దూడ ఉన్నాయి. పశువుల పాకలోనే ఉన్నప్పటికీ పులి వాటిపై దాడి చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలు పులిని వెంబడించడంతో భయాందోళనకు గురైన పులి పశువులకు హాని తలపెట్టక పోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కాతేరు గ్రామంలో శ్యామలాంబ గుడి వద్ద నుంచి ‘‘ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం’’ అనే నినాదంతో సామాజిక కార్యకర్త గారపాటి వనజ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి తిరుమలకు మహిళలు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. తిరుమలరావు మాట్లాడు తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సామాజిక కార్యకర్త వనజ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం పేరిట ఎన్నో కార్యక్రమా లు చేస్తున్నారని, అందులో భాగంగానే పాదయాత్రను ప్రారంభించారన్నారు. అనంతరం వనజ మాట్లాడుతూ అన్నదానాలు, వేడుకల్లో స్టీల్ గ్లాస్లు, ప్లేట్లు, అరటి ఆకులు, విస్తరాకులు ఉపయోగించి సకల జీవరాశుల ఆరోగ్యాన్ని, భూమాత ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వాడిన ప్లాస్టిక్ను పక్కన పెట్టి పొడి చెత్తగా పారిశుధ్య కార్మికులకు అందజేసి పునరుత్పత్తి వినియోగానికి సహకరించాలన్నారు. పాదయాత్ర పొడవునా ఉన్న గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరిస్తామన్నారు. పాదయాత్రలో గారపాటి వనజ, గారపాటి విజేత, నీరుకొండ అనిత, ముళ్లపూడి శేషకుమారి, ముళ్లపూడి చిట్టి, కాట్రగడ్డ ఉమాదేవి పాల్గొంటున్నారు. ఆ మహిళలను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. వీరు కాతేరులో ఒక్కో మొక్కను నాటారు. నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, గంగిన జాహ్నవి, మద్దిపట్ల రాజు, మద్దిపట్ల చిన్ని, కాతేరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
పులిని బంధించడంలో ప్రభుత్వం విఫలం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద పులిని బంధించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం సక్రమంగా జరగడం లేదని అన్నారు. రాత్రయితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. రైతులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. చనిపోయిన పశువులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి యజమానులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పది పశువులను చంపినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప, పులిని బంధించే ప్రయత్నం కనిపించడం లేదని విమర్శించారు. సాంకేతికత పెరిగినా పులి జాడ కనిపెట్టడంలో విఫలం కావడం శోచనీయమని అన్నారు. పులిని పట్టుకునే ప్రయత్నాల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రద్ధ చూపకపోవడం దారుణమని అన్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నా కనీసం స్పందించక పోవడం సరైన విధానం కాదన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తక్షణ మే పశువులు కోల్పోయిన పాడి రైతులకు రూ.మూడు లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రానున్న 12 గంటల్లో పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాన్ని అటవీ శాఖాధికారులు ముమ్మరం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని వేణు, రాజా హెచ్చరించారు. మాజీ మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా -
13 నెలల తరువాత విధుల్లోకి..
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండల విద్యాశాఖ అధికారి మానుపూడి శ్రీనివాస్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆ వివరాల్లోకి వెళితే.. మండలంలో 13 నెలల క్రితం జరిగిన సమ్మేటివ్ పరీక్షల్లో పేపర్ లీకై ందన్న కారణంతో (లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉండటంతో ప్రిస్టేజ్గా తీసుకుని) పేపర్ లీకేజీకి కారణమైన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి పూర్తిగా తొలగించారు. ఇందులో ఎంఈఓ శ్రీనివాస్ను కూడా సస్పెండ్ చేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఎంఈఓను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పుటికీ ఇంతకాలం సాగదీసి ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మంచి వ్యక్తికి న్యాయం జరిగిందంటూ ఎంఈఓ శ్రీనివాస్ను కలసి అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోలిశెట్టి వీరవెంకట సత్యానారాయణ మూర్తి, సుదర్శనరెడ్డి, రేఖా రామలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు బాపూజీ, రమణమూర్తి, చైతన్యబాబు, శివగణేష్, పీఆర్టీయూ నాయకులు మొంగం అమృతరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ -
160 కిలోల గంజాయి స్వాధీనం
జగ్గంపేట: gñæ.Mö™èl*¢Æý‡$ Ð]l§ýlª ¿êÈV> VýS…gêÆ‡$$° ´ùÎ-çÜ$Ë$ ÝëÓ«-©¯]l… ^ólçÜ$-MýS$°, ¯]lË$-VýS$ǰ AÆð‡çÜ$t ^ólÔ>Æý‡$. VýS$Æý‡$ÐéÆý‡… ©°Oò³ fVýSY…õ³r çÜÇPÌŒæ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ò³§éª-ç³#Æý‡… yîlGïܵ }çßæ-ÇÆ>k ÑÌôæMýS-Æý‡Ï™ø Ð]l*sêÏ-yéÆý‡$. gñæ.Mö-™èl*¢-Æý‡$ÌZ° §ýl$Æý‡Y VýS$yìl çÜÒ$-ç³…ÌZ fVýSY…õ³r GOòÜÞ Æý‡çœ¬-¯é£ýl-Æ>Ð]l# B«§ýlÓÆý‡Å…ÌZ ´ùÎ-çÜ$ÌS ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. VýS*yŠæÞ BsZÌZ ™èlÆý‡-Í-çÜ$¢¯]l² 80 ´ëÅMðSrÏÌZ VýS…gêÆ‡$$, òÜÌŒæ¸ù¯Œl, Æý‡*.ÌS„ýS ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$-¯é²Ð]l$° yîlGïܵ ™ðlÍ-´ëÆý‡$. Òsìæ ÑË$Ð]l Æý‡*.82.48 ÌS„ýSË$ E…r$…§ýl° ^ðl´ëµÆý‡$. JyìlÔ> Æ>[Úët-°MìS ^ðl…¨¯]l çÜ$«§éMýSÆŠ‡ §éÓÆ> D VýS…gêÆ‡$$° çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏÌZ Ñ{MýS-Ƈ$$…^ól…§ýl$MýS$ ¡çÜ$MýS$ Ððlâ¶æ$™èl$…-yýlV> ç³r$t-MýS$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ðól$MýSÌS {ç³M>‹-Ù, Ðól$MýSÌS Ô>ÅÐ]l$ÌS, A¯]l²-Ð]l$Ķæ$Å hÌêÏMýS$ ^ðl…¨¯]l BÐ]l#ÌS }°ÐéçÜ$Ë$, «§ýl°-Ķæ$ÅÌS A…f-Ð]l$ÃOò³ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. ïÜI OÐðlB-ÆŠ‡MóS }°-Ðé‹Ü ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘ -
40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)లో జీఎన్ఎం నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థులకు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం వివాదాస్పదమైంది. పరీక్షకు గంట ముందే హాజరవ్వాలని విద్యార్థులకు సూచనలు అందగా, అందుకు తగ్గట్లుగానే వందలాది మంది విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి కాకినాడకు వచ్చి పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాశారు. అయితే వారికి ప్రశ్నపత్రం ఇవ్వడం 40 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఆర్ఎంసీలో ఎగ్జామినేషన్ హాల్–1, 2, డైనింగ్ హాలు, ఆడిటోరియం ఇలా నాలుగు చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,801 మంది హాజరు కానున్నారన్న స్పష్టమైన సమాచారం ఉన్నా పరీక్షలు నిర్వహిస్తున్న జీజీహెచ్ బృందం విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. కళాశాల ప్రధాన ద్వారం తెరిచింది మొదలు పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ హాల్ నుంచి ఆ హాల్కి, ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. తమ సీటు ఏదో తెలియక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కళాశాల ఆవరణలో హాల్ టికెట్ ఆధారంగా పరీక్ష గది ఎక్కడో తెలిపే సూచికలు (సైన్ బోర్డులు) ఏవీలేవు. అలా అని మార్గనిర్దేశం చేసే సహాయకులు కూడా లేరు. ఓ వైపు ఉదయం 9 గంటలు గడుస్తుండగా తీవ్ర ఒత్తిడితో ఎందరో విద్యార్థినులు అటు, ఇటు పరుగులు పెట్టడం కనిపించింది. ఇంతటి గందరగోళానికి తమదే తప్పని గుర్తించిన జీజీహెచ్ పరీక్షల నిర్వహణ బృందం విద్యార్థులందరూ తమ సీట్లలో కూర్చునే వరకు వేచి చూసి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాన్ని ఇచ్చింది. 12 గంటలకు ముగియాల్సిన పరీక్షను 12.30 వరకూ కొనసాగించారు. కూర్చునే ఏర్పాట్లు, సూచికలు సరిగ్గా లేక పరీక్షకు కొద్ది నిమిషాల ముందు తీవ్ర ఒత్తిడికి గురయ్యామని, సకాలంలో పరీక్ష జరగలేదని, నిర్ణీత వ్యవధిని వినియోగించుకోలేక పోయామని, విలువైన పది నిమిషాల సమయం కోల్పోయామని పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర డీడీ నర్సింగ్ జ్యోతిని వివరణ కోరగా, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. 327 మంది గైర్హాజరు ఇదిలా ఉంటే జీఎన్ఎం మొదటి సంవత్సర పరీక్షలో 1,801 మందికి గాను 1,474 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. జీఎన్ఎం పరీక్షల ఆరంభంలోనే వివాదం -
‘కూటమి’లో ఇసుక ర్యాంపుల వివాదం
తాళ్లపూడి: కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇసుక ర్యాంపుల విషయంలో నాయకుల మధ్య చిచ్చు రేగింది. దీంతో వేగేశ్వరపురం ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో జరిగే ఇసుక అక్రమాలపై ఇకపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని జనసేన నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు హరిబాబు విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా మండలంలో మాత్రం జనసేనను దూరంగానే ఉంచుతున్నారని, టీడీపీ వర్గీయులు జనసేన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇసుక ర్యాంపులన్నీ టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారని, తమను చేతకానివారిగా చూస్తున్నారని అన్నారు. ఇసుక ర్యాంపుల్లో జరిగే తప్పులపై అందుకే గళం విప్పామని, ఎన్డీఏలో తాము భాగస్వామ్యమా? కాదా? తెలియకుండా ఉందని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
అంబాజీపేట: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవి కథనం ప్రకారం.. మామిడికుదురుకు చెందిన గోకవరపు రాఘవ అవినాష్ 82 బస్తాల్లో 2,988 కిలోల రేషన్ బియ్యాన్ని మామిడికుదురు నుంచి ఆలమూరుకు బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. ముక్కామల వచ్చేసరికి పోలీసులు దాడి చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఆలమూరు పరిసర ప్రాంతాల్లో పనులు చేసే కూలీలకు ఎక్కువ ధరకు విక్రయిస్తారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బియ్యాన్ని ఎమ్ఎస్ఓ పూర్ణిమ సారధ్యంలో సివిల్ సప్లయిస్ గొడౌన్కు తరలించామన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదంనిడదవోలు: స్థానిక గణేష్చౌక్ సెంటర్లో గురువారం ఓ వృద్ధుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంగిడి నుంచి విజ్జేశ్వరం వెళ్తున్న క్వారీ లారీ పట్టణంలో గణేష్చౌక్ సెంటర్లో మలుపు తిరుగుతున్న సమయంలో స్కూటీపై వెళుతున్న వృద్ధుడు దుప్పాడ రామారావును ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను లారీ కింద పడ్డాడు. లారీ టైర్లు అతనిపై ఎక్కకపోవడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. అతన్ని స్థానికులు బయటకు లాగి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లారీని స్టేషన్కు తరలించారు. అయితే కేసు నమోదు చేయలేదు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధుడి పేరు కూడా పోలీసులకు తెలియకపోవడం చర్చనీయాంశమైంది. పంగిడి, దేవరపల్లి ప్రాంతాల నుంచి క్వారీ లారీలు అడ్డూఅదుపు లేకుండా వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుతున్నాయి. పోలీస్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థి ఆత్మహత్య కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విజయనగరం రోడ్డులో ఉన్న డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్ (16) తీవ్రమైన తలనొప్పిని భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్ షణ్ముఖరావు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ ఇక్కడి డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొద్ది నెలలుగా అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మరోమారు తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని తెలిపారు. ఇప్పుడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటి రోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా.. హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పంట కాలువలో మహిళ మృతదేహం రాయవరం: స్థానిక దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద పంట కాలువలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వెళ్లి రాయవరం ఎస్సై డి.సురేష్బాబు పరిశీలించారు. ఆ మహిళ వయసు 60 నుంచి 65 ఏళ్లు, ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆ మృతదేహం మహేంద్రవాడ నుంచి రాయవరం వెళ్లే పంట కాలువలో లభించింది. ఆమె ఆచూకీ ఎవరైనా గుర్తిస్తే 94409 04843 నంబరుకు తెలియజేయాలని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని మండపేట ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
పునరుద్ధరించాలి
ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు, ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ, గత రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తూండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. – కరక అప్పనాయుడు, రైతు, కేఈ చిన్నయ్యపాలెం,కోటనందూరు మండలం వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – రావుల ప్రసాద్, కూరాడ, కరప మండలం -
‘నన్నయ’లో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెల్ని ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టరుగా ఆచార్య పి.సురేష్వర్మ, సభ్యులుగా ఆచార్య వై. శ్రీనివాసరావు, ఆచార్య డి.జ్యోతిర్మయి, ఆచార్య కె.రమణేశ్వరి, ఆచార్య బి.జగన్మోహన్రెడ్డి, డాక్టర్ టి.హైమావతి, ఎస్.లింగారెడ్డి, ఎన్.నాగేంద్రరావును నియమిస్తూ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నిర్వహించిన తొలి సమావేశంలో యూనివర్సిటీలో నాణ్యత ప్రమాణాలను పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న నాక్ బి ప్లస్ గ్రేడ్ లో ఉన్నతిని పొందేందుకు అంతా కృషి చేయాలని వీసీ సూచించారు. జీఎన్ఎం పరీక్షలు ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రిలో జీఎన్ఎం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ.సత్యనారాయణ ఆ వివరాలను తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని సుమారు 20 ప్రైవేటు నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 900 మంది నర్సింగ్ (ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల) విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. మహాలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.11 లక్షల విరాళందేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో స్వయంభుగా వెలసిన గౌరీ సమేత మహాలింగేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గ్రామానికి చెందిన ఆండ్రు హరిచంద్ర ప్రసాదరావు, పూర్ణదంపతులు రూ.11,11,111 విరాళంగా అందజేశారు. విరాళాన్ని దేవస్థానం ట్రస్టు సభ్యులకు అందజేశారు. గతంలో ఈ విరాళంలో రూ.5 లక్షలు అందజేయగా, మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు అందజేసినట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. హరిచంద్ర ప్రసాదరావు దంపతులను ట్రస్ట్ సభ్యులు అభినందించారు. తత్కాల్లో 10వ తరగతి పరీక్ష ఫీజు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు తత్కాల్ స్కీం ద్వారా అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు గురువారం తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించాలన్నారు. ఆయా స్కూల్స్ హెచ్ఎంలు అపరాధ రుసుముతో ఈ నెల 12వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజు రుసుము తేదీ ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించబోమన్నారు. -
బాబు మార్కు కర్కశం
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● అభాగ్యుల అవస్థలు పట్టించుకోని సర్కారు ● కలగానే కొత్త పింఛన్ల మంజూరు ● చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు ● కొత్త పింఛన్ల ఊసెత్తని సర్కారు ● 18 నెలలుగా తప్పని నిరీక్షణ ● జిల్లావ్యాప్తంగా 40,000కు పైగా ప్రజల దరఖాస్తులు ● గత వైఎస్సార్ సీపీ హయాంలో అర్హత ఉంటే మంజూరు ● జిల్లా వ్యాప్తంగా 2,71,344 పింఛన్లు సాక్షి, రాజమహేంద్రవరం: అభాగ్యులపై చంద్రబాబు ప్రభుత్వం ‘పచ్చ’పాతం చూపుతోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించే సామాజిక భద్రత పింఛన్ల మంజూరులోనూ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. స్పౌజ్ కోటా (భర్త చనిపోతే భార్యకు) మినహా ఒక్క కొత్త పింఛను మంజూరు చేసిన దాఖలాలు లేవు. మరోవైపు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దరఖాస్తులు తీసుకోవడమే తప్ప.. ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్లి అర్జీలు ఇవ్వడం.. వెనుదిరిగి రావడం మినహా చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేలకు పైగా లబ్ధిదారులు తమకు పింఛను మంజూరు చేయాలని ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రీవెన్స్లో దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వీరికి పింఛన్ ఎప్పుడు అందుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. స్పౌజ్ కోటాలో మాత్రమే మంజూరు వితంతు పింఛను మంజూరులో కూటమి సర్కారు కొత్త తరహా నిబంధనలు అమలు చేస్తోంది. 2023వ సంవత్సరం నవంబర్ నెల తర్వాత చనిపోయిన పింఛన్ లబ్ధిదారుల భార్యలకు మాత్రమే స్పౌజ్ కోటాలో పింఛన్లు అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మందికి మాత్రమే మంజూరు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొత్తగా వితంతు పింఛను కావాలంటూ వచ్చిన దరఖాస్తులు సుమారు ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పింఛనుకు దూరమవుతున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు విధించి పట్టించుకోకుండా పోవడం ఎంత వరకూ సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని నిబంధన తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇదేం నిబంధనంటూ నిట్టూరుస్తున్నారు. ఇలాగైతే కొత్త పింఛన్లు అందుతాయా.? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా ఆ వర్గాలే టార్గెట్గా.. పింఛన్ల కోతలో ప్రధానంగా కొన్ని వర్గాలపై దృష్టి పెట్టింది. అనర్హతను గుర్తించే పనిలో డీఆర్డీఏ అధికారులు సర్వే నిర్వహించారు. ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, అభయహస్తం పింఛన్లపై దృష్టి పెట్టి తొలగించారు. దివ్యాంగ పింఛన్లపై హైడ్రామా.. దివ్యాంగులపై చంద్రబాబు సర్కారు నిర్దయగా వ్యవహరించింది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగించే ఎత్తుగడ వేసింది. కేవలం మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేయాలని చూసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైకల్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అందించారు. దీనిపై దివ్యాంగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. వైఎస్సార్ సీపీ నేతలు ఉద్యమాల్లో పాల్గొని ప్రభుత్వ చర్యలను ఖండించారు. ప్రజా వ్యతిరేకతను చూసిన ప్రభుత్వం తొలగించకుండా తాత్కాలికంగా ఆపింది. గత ప్రభుత్వ హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. మధ్య వర్తులు, దళారులతో పనిలేకుండా దరఖాస్తు చేసుకున్న వెంటనే అందేవి. ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్తవి అందజేసేవారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు మంజూరయ్యేవి. గ్రామ, వార్డు వలంటీర్లు ఇళ్ల వద్దకే వెళ్లి అందజేసేవారు. జిల్లాలో ఇలా... ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా 2,71,344 పింఛన్లు అందజేస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.118 కోట్లు చెల్లిస్తున్నారు. మండలం లబ్ధిదారులు రాజమహేంద్రవరం అర్బన్ 27,814రాజానగరం 15,301దేవరపల్లి 10,776నల్లజర్ల 11,291గోపాలపురం 8,912చాగల్లు 7,130నిడదవోలు 10,190కోరుకొండ 11,992పెరవలి 10,069రాజమహేంద్రవరం రూరల్ 19,745గోకవరం 10,280ఉండ్రాజవరం 10,180సీతానగరం 11,288మండపేట 11,60950 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందో..? తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే 50 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటుతున్నా.. ఆ హామీకి నేటికీ అతీగతి లేదు. అసలు ఇస్తారా..? లేదా..? అన్న విషయమై స్పష్టత కరవైంది. జిల్లా వ్యాప్తంగా 50 ఏళ్లు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు సుమారు 2 లక్షల మంది ఉంటారు. వీరందరూ హామీ అమలు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అడ్డగోలుగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకుగాను 50 రోజుల ప్రణాళికను అమలు చేసింది. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని నమ్మబలుకుతూనే.. ఉన్న వాటిలో అనర్హతల పేరుతో అత్యధికంగా పింఛన్లు తీసివేసేంది. జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పింఛన్లు తొలగించినట్టు సమాచారం. -
మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
● గుర్తించిన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ● కలెక్టర్ కీర్తి ● ఎస్పీ డి నరసింహ కిశోర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 15న జరిగే మహా శివరాత్రి సందర్భంగా భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులకు సూచించారు. గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మహా శివరాత్రి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్ అధ్యక్షతన సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన ప్రధాన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వాలన్నారు. అనధికార ఘాట్ల వద్ద భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. గతంలో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని మునిసిపల్, మండల అధికారులు టామ్టామ్, మైక్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లో ఇప్పటి నుంచే విస్త్రత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. ఘాట్ల నిర్వహణ బాధ్యతలను శాఖల వారీగా స్పష్టంగా కేటాయించారు. మునిసిపల్ శాఖ పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ శాఖ ఘాట్ల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ, బారికేడింగ్, చెక్పోస్టుల ఏర్పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా అన్ని ఘాట్లు, దేవాలయాలు, రహదారుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర మానిటరింగ్ చేపడతామని, గ్రామ స్థాయిలో విలేజ్ మానిటరింగ్ టీమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ జామ్లు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, నో పార్కింగ్ జోన్లు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీవో కె. భాస్కర్రెడ్డి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత , డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ విస్మరించి అవమానించారు
కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా : మున్సిపల్ చైర్పర్సన్ దుర్గారాణికపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరుకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ను విస్మరించారని, తద్వారా తనను అవమానించారంటూ మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండపేటలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తనకు జరిగిన అవమానాన్ని, స్థానిక పరిస్థితులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. పట్టణంలోని వాటర్ వర్క్స్ వద్ద నూనతంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకంలో తన పేరును కింది భాగాన వేశారని, తమ నాయకుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరును అసలు వేయలేదని చైర్పర్స్న్ ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో బిక్కిన కృష్ణార్జున చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ ప్రాధాన్యం ఉండటం వల్ల కొన్ని కారణాలు చెప్పి నిర్మాణం అంశాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం సబ్ స్టేషన్ నిర్మించటాన్ని స్వాగతిస్తున్నానని, కానీ తనతో సహా మరికొందరి ప్రజాప్రతినిధులను తక్కువ చేసేలా శిలాఫలకాన్ని రూపొందించడం సరికాదన్నారు. సబ్ స్టేషన్ స్థలం మున్సిపాలిటీ పరిధిలోనిదని, కౌన్సిల్లో తీర్మానం చేసి అప్పగించామని, రూ.18 లక్షలు సాధారణ నిధులతో స్థలాన్ని లెవెలింగ్ చేసి అప్పగించామన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తరఫున సబ్ స్టేషన్ నిర్మాణానికి సహకరించామన్న విషయాన్ని కూడా విస్మరించడం సరికాదన్నారు. టిడ్కో గృహాలు అప్పగింత కార్యక్రమంలో మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఆవిష్కరించిన శిలాఫలకాల్లో కూడా తమ కౌన్సిలర్ల పేర్లు వేయకుండా అవమానించారన్నారు. తమను అవమానించే రీతిలో శిలాఫలకం ప్రొటోకాల్కు అనుమతి ఇచ్చిన జిల్లా రెవెన్యూ అధికారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రొటోకాల్ విస్మరణ పట్ల ఎమ్మెల్యే జోగేశ్వరరావు తీరు బాధాకరమని చైర్పర్సన్ దుర్గారాణి ఎద్దేవా చేశారు. -
8న మెగా జాబ్ మేళా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాజానగరం నియోజక వర్గంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ఫిబ్రవరి 8న రాజానగరంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. రాజానగరంలో వికాస – స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 60 ఎంఎన్సీల భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు ఆదివారం ఉదయం 9 గంటలకు రాజానగరంలోని జెడ్పీ హైస్కూల్కు అవసరమైన సర్టిఫికెట్ల జెరాక్స్లతో హాజరుకావాలని వికాస పీడీ కె.లచ్చారావు కోరారు. కోటసత్తెమ్మ తల్లికి వెండి పళ్లెం సమర్పణ నిడదవోలు రూరల్: మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ తల్లికి చాగల్లు మండలం కలవలపల్లి వాస్తవ్యులు ఈదర శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు వీరభద్ర అజయ్కుమార్, దీపిక సుష్మలు బుధవారం 1,212 గ్రాముల వెండి పళ్లెం, 523 గ్రాముల వెండి పాదుకులు అందజేసినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. అమ్మవారిని దాతల కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకుడు అప్పారావు శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు సత్యదేవుని హుండీల లెక్కింపు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. తిరుమల ప్రతిష్టను పాడు చేసింది బాబు సర్కారే వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా పాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. -
● నాడు రక్ష.. నేడు శిక్ష
● కళశ యాత్రజంతువుల నుంచి మొక్కలను కాపాడేందుకు వేసిన రక్షణ కవచం నేడు శాపంగా మారింది. కిర్లంపూడి వెలుగు కార్యాలయం ఆవరణలో నీడను, స్వచ్ఛమైన గాలి ఇచ్చేందుకు మొక్కలు నాటి వాటికి రక్షణకు ఇనుప చట్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొక్కలు పెద్దవి కావడంతో నాడు రక్షణ కల్పించిన ఇనుప చట్రాలు మొక్క బెరడులోకి చొచ్చుకుపోతున్నాయి. వీటిని తొలగించకుంటే వాటి మనుగడకే ఇబ్బంది. –కిర్లంపూడి సన్నవిల్లి వద్ద పంట కాలువలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు పాతకొట్టాంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు సప్తనదీ పవిత్ర జలాల కలశాలను శిరస్సున ధరించి యాత్ర నిర్వహించారు. అనంతరం ఆ జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. తర్వాత విజయవాడకు చెందిన వేదపండితుడు ఘంటికోట సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామివారికి పూజలు, కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యడ్ల చెల్లారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. –కోటనందూరుఎటు చూసినా, ప్లాస్టిక్ వ్యర్థాలు జంతు కళేబరాలు చూసి పెంట కాలువ అనుకుంటే పొరపాటే.. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో గొరగొనమూడి, కూనవరం టైల్ ఎండ్ పంట కాలువ దుస్థితి ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుకు నీరు అందించాల్సిన కాలువ ఇలా అధ్వానంగా తయారైంది. నిండా చెత్తా చెదారం, వ్యర్థాలతో మూసుకుపోయింది. సన్నవిల్లి పంచాయతీ పరిధి దుర్గమ్మ గుడి సమీపంలో ఇలా ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. –ఉప్పలగుప్తం -
తావీదు చూపించి.. బంగారంతో ఉడాయించి
రాజవొమ్మంగి: తావీదు ఇస్తాం.. నీ సమస్యలన్నీ తీరిపోతాయని ఇద్దరు నమ్మించి బంగారం దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగి మండలం కొమరాపురంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం... కొమరాపురం గ్రామానికి చెందిన కోసూరి లోవకుమారి రాజవొమ్మంగి వెళ్లేందుకు బయలు దేరింది. ఆ గ్రామంలో ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో మోటారు సైకిల్పై ఇద్దరు వచ్చి తాము లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బండి ఆపి ‘నీ కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా నీవు ఎన్నో కష్టాల్లో ఉన్నావు, తాము ఇచ్చే తావీదు కట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని’ అని నమ్మించారు. ఆమె చేతిలో రాగి రేకు, తావీదు పెట్టి, ఆమె చెవి కమ్మలు తీసుకుని, వాటితో ఆమెకు దిష్టి తీస్తున్నట్లు నటించి అంతలోనే పరారయ్యారు. ఈ పరిణామానికి అవాక్కయిన లోవకుమారి తాను మోసపోయానని గ్రహించింది. దీనిపై జడ్డంగి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చినబాబు తెలిపారు. ఇటువంటి మోసాలు జరగకుంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 12 మందికి గాయాలు శంఖవరం: కత్తిపూడి ఫ్లైవర్ బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. అన్నవరం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపంలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళ్తున్న టిప్పర్ను అన్నవరం నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని సరుగుడు తోట నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపానికి వచ్చేసరికి మలుపులో టిప్పర్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలోని కొత్తపల్లి మండలం శ్రీరామపురానికి చెందిన పితాని కామరాజు (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు పీహెచ్సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కళాశాల బస్సు అమలాపురం రూరల్: ఓ కళాశాల బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం ఉప్పలగుప్తం మండలం నుంచి అమలాపురంలో ఓ కళాశాలకు విద్యార్థులతో బస్సు వెళ్తోంది. సమనస వైన్ షాప్ సమీపంలో ఆ బస్సు అదుపుతప్పి పంట కాలువ వైపు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. తీగలు తెగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా క్షేమంగా బయట పడ్డారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపినందుకు డ్రైవర్ లైసెన్స్ను, బస్సు పర్మిట్ను మూడు నెలలు సస్పెండ్ చేశామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు త్వరలోనే పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు సమావేశాలు నిర్వహిస్తామని డీటీఓ చెప్పారు. -
పెద్దపులిని కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు
● మేన్ ఈటర్గా మారితే బాధ్యులెవరు? ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజానగరం: ఐదు రోజులుగా పెద్దపులి సంచారంతో ప్రలు వణికిపోతుంటే అధికార పార్టీ పెద్దలు మాత్రం దానిని పట్టుకోవడంలో శ్రద్ధ పెట్టకుండా ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం మండలాలలో ప్రజలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారని, రైతులు పొలాలకు వెళ్లడం లేదని, మూగ జీవాలు బలైపోతున్నాయని, అయినా ప్రభుత్వం పెద్దపులిని పట్టుకోలేకపోతోందన్నారు. అధికార పార్టీ పెద్దలు మాత్రం ఈ పులి సంచారాన్ని వీడియోలు తీసి, ప్రచారంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలోనూ మీనమేషాలు లెక్కిస్తూ, పెద్దపులి జాడను కనిపెట్టలేని దుర్భర స్థితిలో పాలన ఉండడం విచారకరమన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో పులి సంచరించినప్పుడు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన పెద్దపులిని పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదలిపెట్టే చర్యలు తీసుకోవాలన్నారు. -
అట్టహాసంగా హాకీ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ జాతీయ స్థాయి హాకీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, హాకీ మాజీ ఇండియన్ కెప్టెన్, పద్మశ్రీ ధనరాజ్ పిళ్లై, కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్వీర్ సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతమ్ శివాజ్, శాప్ డైరెక్టర్లు రవీంద్ర, జగదీశ్వరి, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజ్, కార్యదర్శి హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి హాజరయ్యారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కాకినాడ డీఎస్ఏలో వచ్చే ఏడాది హాకీ అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, గ్యాలరీ, టాయిలెట్స్, ఫ్లడ్లైట్లు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ ఈ టోర్నీ వర్థమాన క్రీడాకారులకు స్ఫూర్తిని ఇఽస్తుందన్నారు. కాకినాడకు గతంలో ఒకసారి వచ్చానని, ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్రప్రసాద్ మాట్లాడూ కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు దేశ వ్యాప్తంగా 24 పురుష, మహిళల జట్లు వచ్చాయన్నారు. ఈ నెల 14 వరకూ టోర్నీ జరుగుతుందన్నారు. జాతీయ జెండాను శాప్ చైర్మన్ రవినాయుడు, హాకీ ఆంఽధ్రప్రదేశ్ జెండాను ధనరాజ్ పిళ్లై, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జెండాను క్లబ్ అధ్యక్షుడు బాబ్జి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు సూరిబాబు, ఇమ్మానుయేల్ రాజు, సురేష్రాజు, పరుశురాం, హరిబాబు, పీఈటీ సంఘ రాష్ట్ర మాజీ అద్యక్షుడు రవిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి సుధారాణి, డీఎస్ఏ కోచ్లు సమీర్, సురేష్, అప్పలనాయుడు పాల్గొన్నారు. తొలిరోజు నాలుగు మ్యాచ్లు డీఎస్ఏ మైదానంలో ప్రారంభమైన కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీల్లో భాగంగా తొలిరోజు నాలుగు మ్యాచ్లు జరిగాయి. మహిళల విభాగంలో ఎస్సీఓఈ భోపాల్, హర్యానా మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు, ఎన్సీఓఈ సోనిపత్, బిలాయ్ స్టీల్ప్లాంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎన్సీఓఈ జట్టు విజయం సాధించాయి. యూనియన్ బ్యాంక్, గ్వాలియర్ ఎంపీ అకాడమీ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియన్ ఆర్మీ జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు ప్రకటించారు. -
జాడలు సరే.. పులేది?
రాజమహేంద్రవరం రూరల్: ఐదు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచారం జిల్లా ప్రజలను వణికిస్తోంది. అటవీశాఖ అధికారుల అంచనాలను సైతం తారుమారు చేస్తూ ఇష్టారీతిన సంచరిస్తోంది. దీంతో అధికారులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పెద్దపులి చిక్కడం లేదు. మంగళవారం రాత్రి దివాన్చెరువు ఎస్వీపీసీ కల్యాణమండపం వద్ద ప్రత్యక్షమైన పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదుగా బీజాపురి టౌన్షిప్లోకి వెళ్లింది. బుధవారం ఉదయానికి చూస్తే రఘనాథపురంలో మామిడితోటల్లో నుంచి వెళ్లినట్లు ఉన్న ప్లగ్ మార్కులను అధికారులు గుర్తించారు. అక్కడ ఒక గేదె దూడపై దాడిచేయడంతో అది మృతి చెందింది. అక్కడ నుంచి శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపైకి వెళ్లినట్లు ప్లగ్మార్క్ల ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండపై నుంచి కిందకు దిగిందా లేదా వెనుక నుంచి జీడిమామిడి తోటల్లోకి ఏమైన వెళ్లిందా అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం రాత్రి పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు నేతృత్వంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ అధికారి దావీదురాజు, సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు మాట్లాడుతూ పెద్దపులి శాటిలైట్ సిటీలోని అక్కమ్మతల్లికొండపై ఉన్నట్లు గుర్తించామని, దానిని పట్టుకునేందుకు పూణే నుంచి ఒక బృందంతో పాటు, మొత్తం 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రజలకు పెద్దపులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారన్నారు. ఈ పులి తడోబా నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం పాల్వంచ మీదుగా ఏలూరు జిల్లా నుంచి మన జిల్లాలోకి వచ్చిందని ఆయన తెలిపారు. పులిని పట్టుకునేందుకు రాత్రి వేళల్లో ధర్మల్ కెమెరాలను వినియోగించినట్టు తెలిపారు. ఇప్పటికే బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. పులి సంచరించిన స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించి ప్రజలకు సూచనలిచ్చారని తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం, తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, ఎస్సైలు, సిబ్బంది అటవీశాఖ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అక్కమ్మతల్లి కొండవద్ద పరిశీలిస్తున్న ఫారెస్టు చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అక్కమ్మతల్లికొండ వద్ద ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన బోను ఆందోళన చెందుతున్న రాజమహేంద్రవరం ప్రజలు పాద ముద్రలు తప్ప పులిని పట్టుకోలేకపోతున్న అధికారులు తాజాగా శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపై ఉన్నట్టు గుర్తింపు పూణే నుంచి నిపుణులతో పాటు 20 బృందాల ఏర్పాటు జనావాసాల్లోకి వెళ్తే పెను ప్రమాదం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో ఐదు రోజులుగా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి ప్రస్తుతం శాటిలైట్ సిటీకి సమీపంలో ఉన్న అమ్మతల్లి కొండపై ఉందని, అదిగానీ కొండ దిగి జనావాసాలలోకి వెళ్తే పెను ప్రమాదం ఉంటుందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం అమ్మ తల్లి గుడి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ, పోలీసు సిబ్బందితో పెద్దపులి సంచారంపై ఆరా తీశారు. పులి అడుగు జాడలను పరిశీలించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అయితే పులిని పట్టుకోవడానికి ఆధునిక పరికరాలు అందుబాటులో లేవని అటవీ శాఖ అధికారులు అనడం విచారకరమన్నారు. -
చితికిన బతుకులు
● లారీ ఢీకొని ఇద్దరు మృతి ● వీధిన పడిన కుటుంబాలు తాళ్లపూడి/ దేవరపల్లి: బతుకులు చితికిపోయాయి.. ఆ కుటుంబాలు పెద్దలను కోల్పోయి వీధిన పడ్డాయి.. లారీ మృత్యువై వెంటాడి అనంత లోకాలకు దూసుకుపోయింది.. కొవ్వూరు– రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పట్టణ సీఐ విశ్వం, పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన వెలగన కోట సత్యనారాయణ (40), తాతపూడి చిన్న సుబ్బారావు (36)లు లోడింగ్ ట్రాక్టర్లపై డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆ ట్రాక్టర్లు కోరుకొండలో ఉండడంతో డ్యూటీ ఎక్కడానికి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరారు. ఈ నేపథ్యంలో వారు కొవ్వూరులోకి గామన్ బ్రిడ్జిపై నుంచి మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. ఈ సమయంలో వారి మోటారు సైకిల్ను లారీ ఢీకొంది. వారు లారీ వెనక చక్రాల కింద పడ్డారు. కోట సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, చిన సుబ్బారావును ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడంతో భయానక వాతావరణం నెలకొంది. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద హృదయవిదారక వాతావరణం నెలకొంది. దుద్దుకూరులో విషాద ఛాయలు ఈ ఘటనతో దుద్దుకూరు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అందరితో మంచిగా ఉంటూ, ఆప్యాయతగా పలకరించే కోట సత్యనారాయణ, చిన సుబ్బారావు(40) మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన కొద్దిసేపటికే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చిన సుబ్బారావుకు తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్, 4వ తరగతి చదువుతున్న కుమార్తె సంజన ఉండగా, కోల సత్యనారాయణకు 15 ఏళ్ల కుమారుడు చైతన్య, 6వ తరగతి చదువుతున్న కుమార్తె మౌనిక ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదానికి కారణమదేనా! కొద్దిరోజులుగా గామన్ బ్రిడ్జిపై మరమ్మతులు చేస్తున్నారు. ఒకవైపు దారిలోనే ఇరుపక్కల వాహనాలను పంపుతున్నారు. ఇక్కడ సరైన పర్యవేక్షణ లేక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించడానికి కూడా ఇదే కారణమని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యం భారీ వాహనాల సంచారంతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో వాహనాల వేగానికి కూడా కళ్లెం లేకపోయింది. ఇప్పటికై నా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఉత్సాహంగా పరుగు పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజియేట్ క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా బుధవారం 10 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. రాజానగరంలోని సాయిబాబా గుడి నుంచి కానవరం వెళ్లి తిరిగి వచ్చే విధంగా జరిగిన ఈ పోటీలను స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి 40 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారు. పురుషుల విభాగంలో నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకున్న కె.హేమంత్ (రాజమహేంద్రవరం) ప్రథమ స్థానం, జె.సతీష్ (గోపన్నపాలెం) ద్వితీయ, ఇ.సురేష్రెడ్డి (రాజమహేంద్రవరం) తృతీయ స్థానం దక్కించుకున్నారు. వీరితోపాటు కె.మణికంఠ, ఎం.లీలాగణేష్, సీహెచ్ మల్లికార్జునలను యూనివర్సిటీ టీమ్గా ఎంపిక చేశారు. మహర్షి దయానంద యూనివర్సిటీ (రోహ్తక్)లో ఈ నెల 15న జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. అలాగే మహిళా విభాగంలో బి.అర్చన (భీమవరం) ప్రథమ, టి.సురేఖరత్నం (రాజమహేంద్రవరం), సీహెచ్ అనితలు ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. యూనివర్సిటీలో టీమ్లో ఈ ముగ్గురితో పాటు కె.కల్యాణి, ఎ.విజయ, టి.ఉదయలక్ష్మి ఎంపికయ్యారు. కర్ణాటక మంగుళూరులోని యూనివర్సిటీలో 27న జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీల్లో దీరు పాల్గొంటారని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. -
పాదగయ పిలుస్తోంది
● మహా శివరాత్రికి ఏర్పాట్లు ● సిద్ధమవుతున్న పుష్కరిణి ● 13 నుంచి ఉత్సవాలు ఆరంభం పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులను రా రమ్మని పిలుస్తోంది.. మహా శివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది.. ఈ నెల 13న శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శివరాత్రి మహాత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం ప్రాధాన్యం కలిగి ఉంది. మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని వారం రోజుల పాటు నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు. త్రిగయా క్షేత్రాల్లో పిఠాపురంలో వేంచేసియున్న పాదగయ క్షేత్రం అత్యంత ప్రాచీన దివ్య శైవ క్షేత్రం. పుణ్యస్నానంతో పునీతం పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే పునీతం అవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ పుణ్య స్నానాలకు పుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల అందులో పాత నీరు తొలగించిన అఽధికారులు పూర్తిగా శుభ్రం చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్య స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వివరిస్తున్నారు. 13న కుక్కుటేశ్వరుని కల్యాణం పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం ఈ నెల 13న రాత్రి 8.32 గంటలకు నిర్వహించనుండగా, 14న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుపనున్నారు. 15వ తేదీ మహా శివరాత్రి ఉత్సవం, 16న మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, స్వామివారి రథోత్సవం, 18న స్వామివారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయిలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలతో పాటు గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ఉమారామలింగేశ్వరస్వామి, గొల్లప్రోలులో ప్రసిద్ధి చెందిన ఉమారామలింగేశ్వరస్వామి, చేబ్రోలులో పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి, తాటిపర్తిలో అపర్ణాసమేత నాగేశ్వరస్వామివారి ఆలయాల్లోనూ ఉత్సవాలు జరుగనున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తదితరులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం. అంతా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా పాదగయ పుష్కరిణిని సిద్ధం చేస్తున్నాం. తగిన విధంగా క్యూలైన్లు నిర్మిస్తాం. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పాదగయ ఈఓ, పిఠాపురం -
సైనిక సంక్షేమ నిధికి రూ.5.85 లక్షల విరాళం
సీటీఆర్ఐ: జిల్లా సైనిక సంక్షేమ నిధికి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థ పరిధిలోని మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ వంతు రూ.5,85,288 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కీర్తి చేకూరికి ఆ మొత్తం చెక్కును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మెప్మా మహిళలు రూ.10 చొప్పున స్వచ్ఛందంగా విరాళం అందించి దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న సైనికుల సంక్షేమానికి తమ మద్దతు తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి విశేష సహకారం అందించిన మెప్మా పీడీ టి.కనకరాజు, మెప్మా జిల్లా సమాఖ్య సభ్యులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.బాల సరస్వతి, జిల్లా సిబ్బంది పి.శ్రీదేవి, ఎంఈ ఫణి కుమార్, ఎస్హెచ్జీ మహిళలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సైబర్ మోసాల నివారణకు చర్యలు
అమలాపురం రూరల్: ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీబీఐ డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే సైబర్ మోసాలు తగ్గినట్లు తెలిపారు. దీనిలో ఓ ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై బ్యాంకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి డిపాజిట్లు విత్ డ్రాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించామని అన్నారు. అయినవిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అయినవిల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ పరిశీలించారు. ఇటీవల సంక్రాంతి సంబరాలు, ప్రభల ఉత్సవాలు, అంతర్వేది నరసన్న తీర్థ మహోత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసు బందోబస్తు నిర్వహించారన్నారు. శివరాత్రి మహోత్సవాల్లో వివాదాలకు తావులేకుండా ఇప్పటికే పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. అభ్యంతరం లేని పోస్టులు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఈ పోస్టుల కారణంగా ఏ వివాదం జరిగినా నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. -
ఆ మందులను అధికారులు సిఫారసు చేయలేదు
● దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించిన అధికారులు ● దుకాణంలో మందుల నిల్వ సీజ్ చేసి నమూనాలు ల్యాబ్కు తరలింపుదేవరపల్లి: గోపాలపురం మండలం వెదుళ్లకుంట, వాదాలకుంట గ్రామాల్లో దెబ్బతిన్న వర్జీనియా పొగాకు తోటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. తోటలకు వాడిన మందులు, పంట నష్టం గురించి రైతులతో చర్చించారు. ‘దిగుబడి ఆశలు గల్లంతు’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. కొవ్వూరు డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి కూచిపూడి ఏసుబాబు రెండు గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించారు. పొగాకు మొక్క పిలక నివారణకు రైతులు వాడిన మందుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా డివిజన్ వ్యవసాయాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వాడిన మందుల నమూనాలను తీసి ల్యాబ్కు పంపామని, ల్యాబ్ నుంచి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. మందుల్లో తేడాలు ఉన్నట్టు నివేదికలో తేలితే డీలర్, ఉత్పత్తి సంస్థపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రైతులు వాడిన బ్యాచ్కు చెందిన మందుల నిల్వను దుకాణం నుంచి సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. రైతులు వాడినట్టు చెపుతున్న మందులను వ్యవసాయ శాఖ, సీటీఆర్ఐ, ఐటీసీ శాస్త్రవేత్తలు, టుబాకో బోర్డు అధికారులు సిఫారసు చేయలేదన్నారు. రైతులే సొంత నిర్ణయంతో మందులు తెచ్చుకుని వాడారని ఆయన వివరించారు. పిలక నివారణకు వాడకూడని మందులు వాడినందున తోటలు దెబ్బతిన్నట్టు ఆయన తెలిపారు. -
వణికిస్తున్న పెద్ద పులి
ఫ బీజాపురి లేఅవుట్ పరిసరాల్లో ప్రత్యక్షంఫ అంతకు ముందు కోలమూరు, గాడాల, గామన్ బ్రిడ్జి రోడ్డు సమీపంలో సంచారం రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: పెద్ద పులి గడియకో రూటు మార్చుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిసరాలతో పాటు వాటికి సమీపంలో ఉన్న కోరుకొండ, సీతానగరం మండలాల గ్రామాల్లో ప్రజలు రకరకాల ప్రచారాలతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రాజానగరం మండలం పాలచర్ల వైపు నుంచి ఆటోనగర్ వైపునకు పులి వచ్చిందని కొందరు తెలిపారు. 2024 ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 13 రోజుల పాటు చిరుత పులి సంచారంతో గజగజలాడిన ఈ ప్రాంత వాసులు.. ఇప్పుడు పెద్ద పులి వచ్చిందనే వార్తతో భయపడిపోతున్నారు. ఆటోనగర్ నుంచి దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు గోడ దాటుకుని, గామన్ బ్రిడ్జి రోడ్డులోని జీడిమామిడి తోటల్లోకి వెళ్లిపోయిందని కొందరు వ్యక్తులు చెప్పడంతో పాటు వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం బీజాపురి లేఅవుట్ పరిసరాలకు వెళ్లిపోయిందని సమాచారం. రెండు రోజులుగా.. తొర్రేడు, వెంకటనగరం గ్రామాల్లో రెండు రోజులుగా సంచరించిన పెద్ద పులి కోలమూరు, కోరుకొండ మండలం గాడాల గ్రామాల మధ్యలో తిరిగినట్టు మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే దాని దాడిలో పశువులు చనిపోయినట్లు ఎటువంటి సమా చారమూ లేదు. కోలమూరు, గాడాల గ్రామాల వ్యవసాయ భూముల్లో పులి తిరిగినట్టు పగ్ మార్కులను జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ ఆఫీసర్ దావీదురాజు గుర్తించారు. దీంతో వారితో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయా ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పగ్మార్క్ ప్రాంతాల సమీపంలో డ్రోన్లు,బోనులు,ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలి జిల్లా అటవీశాఖ అధికారి ప్ర భాకరరావు మాట్లాడుతూ గ్రామస్తులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులను ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉంచుకోవాలని, ప్రకాశవంతమైన లైట్లు ఉంచాలని, జంతువును మళ్లించడానికి శబ్దాలు చేయాలన్నా రు. గాడాల నుంచి సుమారు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
నేటి నుంచి జాతీయ గోల్డ్కప్ హాకీ పోటీలు
ఫ ఈ నెల 14 వరకూ నిర్వహణ ఫ దేశవ్యాప్తంగా తరలిరానున్న 24 జట్లు ఫ పూర్తయిన ఏర్పాట్లు ఫ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్ర నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి కాకినాడ డీఎస్ఏ మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో నిర్వహించనున్న కోకనాడ గోల్డ్కప్ జాతీయ స్థాయి పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్ర ప్రసాద్ మంగళవారం ఈ విషయం తెలిపారు. డీఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో 13 పురుషుల జట్లు, 8 మహిళల జట్లు పాల్గొంటున్నాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. చక్కని వేదిక ద్రోణాచార్య అవార్డు గ్రహిత, భారత జట్టు మాజీ కెప్టెన్ ప్రీతిమ్ శివాజ్ మాట్లాడుతూ పూర్వ క్రీడాకారులందరూ కలుసుకోవడానికి ఈ పోటీలు చక్కని వేదిక అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు రవిచంద్రను ఆమె అభినందించారు. అడిషనల్ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలు కాకినాడ వేదికగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ హాకీ సంఘ సంయుక్త కార్యదర్శి వి.రవి రాజు, డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు బాబ్జీ, వినయ్, సూరిబాబు, హరిబాబు, పరశురాం, ఇండియన్ గోల్ కీపర్ రమ్య, సత్యగౌరి, నాగమణి, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు
రాజోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజోలుకు చెందిన టీడీపీ కార్యకర్త నార్కెడమిల్లి కనకరాజుపై వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజోలు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కనకరాజు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను నరికివేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన కనకరాజుపై చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐ నరేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింద న్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, సర్పంచ్ రేవు జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షుడు అడబాల జానకిరామ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని, నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం జాషువా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల సతీష్ ,ఎంపీటీసీ చెల్లింగి లక్ష్మీఈశ్వరి, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, కొల్లాబత్తుల శ్రీను, జిల్లెళ్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్
ఫ రైతుల మొరను ఆలకించని వైనం ఫ అక్రమ సిగరెట్లను ప్రోత్సహించేలా రూపకల్పన ఫ జీఎస్టీని తక్షణం తగ్గించాలి ఫ వర్జీనియా పొగాకు రైతుల ఆవేదన దేవరపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తమ నడ్డి విరిచిందని వర్జీనియా పొగాకు రైతులు విమర్శించారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పరోక్షంగా పొగాకు రైతులపై ప్రభావం పడుతుందన్నారు. ఎకై ్సజ్ సుంకం, జీఎస్టీ పెంచడం వల్ల విదేశీ (నాన్ టాక్స్బుల్) సిగరెట్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడి, స్వదేశీ సిగరెట్ల వినియోగం పడిపోతుందన్నారు. పెంచిన జీఎస్టీని తగ్గించాలని ఇటీవల రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. బడ్జెట్లో రైతులకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదన్నారు. పండించిన పొగాకులో 40 శాతం స్వదేశీ సిగరెట్ల తయారీకి, 60 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని, ముడిసరుకు పొగాకుపై పన్ను తగ్గించినప్పటికి రైతులకు ప్రయోజనం లేదన్నారు. జీఎస్టీ పెరగడం వల్ల పొగాకు రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం శూన్యం వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల మొరను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అక్రమ సిగరెట్ల వినియోగం తగ్గించాలంటే స్వదేశీ సిగరెట్లపై జీఎస్టీ తగ్గించాలన్నారు. ముడి సరుకుపై పన్ను తగ్గించడం వల్ల రైతులకు ప్రయోజనం లేదని తెలిపారు. వర్జీనియా పొగాకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కాట్రు సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ పెంచడం వల్ల సిగరెట్ పెట్టైపె రూ.50 నుంచి రూ.100 ధర పెరుగుతుందన్నారు. దీని ప్రభావం పొగాకు ఉత్పత్తి దారులపై తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతు సంఘం ప్రతినిధి యాగంటి సాయిబాబు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తక్షణం తగ్గించి రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జీఎస్టీ ని ఇన్వాయిస్పై వసూలు చేసేవారని, ఇప్పుడు ఎమ్మార్పీఎస్ ధరపై వసూలు చేస్తున్నా రని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకు వచ్చిన పన్ను ల విధానం వల్ల అక్రమ సిగరెట్ల వాటా భారీగా పెరుగుతుందని, ఇప్పటికే పన్ను కట్టని అక్రమ సిగరెట్ల వాటా 26 శాతం ఉన్నట్టు రైతులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల గోడును వినిపించుకుని, పెంచిన జీఎస్టీని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో రైతు సంఘాల ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్, సింహాద్రి ధర్మావతారం, కరుటూరి శ్రీనివాసరావు, ఈలపోలు చిన్ని పాల్గొన్నారు. -
ఆదమరిస్తే అంతా కాలీ
కుళ్లు తెగులు నారుమడి నుంచి ప్రారంభమై.. నాటిన తోటలోనూ ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారి ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు అధికంగా ఉంటే పువ్వును కూడా ఆశించి అది కూడా కుళ్లిపోతుంది. నివారణ చర్యలు ఈ తెగులు ఆశించిన తోట పూర్తి అయిన తరువాత మరలా ఇదే పంటను వేయకూడదు. పంట మార్పిడి తప్పని సరిగా చేయాలి. ఈ తెగులు ఆశించనట్లు గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పన కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల తెగులును కొంతవరకూ నివారించవచ్చు ఫ కాలీఫ్లవర్ పంటపై తెగుళ్ల దాడి ఫ సస్యరక్షణ చేపట్టకుంటే నష్టమే ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు ఫ జిల్లాలో 425 ఎకరాల్లో సాగు పెరవలి: వాతావరణంలో వచ్చిన మార్పులతో కాలీఫ్లవర్ పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఎండ, మంచు ప్రభావంతో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటోంది. జిల్లాలో కూరగాయలను 2,795 హెక్టార్లలో సాగు చేస్తుండగా వీటిలో కాలీఫ్లవర్ను 425 ఎకరాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో తెగుళ్ల ఆశించాయి. వీటి నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యానవన అధికారి డి.సుధీర్ కుమార్ తెలిపారు. ఈ పంటపై ప్రస్తుతం ఆకుమచ్చ, పచ్చపురుగు, బట్టవింగ్, రైసీనెస్, కొరడా తెగుళ్లుఎక్కువగా ఆశించాయి. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన తోటల ఆకులపై గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవిగా మారతాయి. ఈ తెగులు సాధారణంగా వాతవరణంలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ మందును లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాఫర్ ఆక్సీక్లోరైడ్ను లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. తెగులు అధికంగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. రైసీనెస్ ఈ తెగులు వాతావరణంలో వేడి ప్రారంభమైనప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశిస్తే పువ్వు వదులై, విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గుడ్డుపై మాగు వస్తుంది. దీని వల్ల పువ్వు అందవిహీనంగా కనిపించి మార్కెట్లో ధరపడిపోతుంది. దీని నివారణకు పువ్వులకు ఎండ ఎక్కువగా తగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు విచ్చుకున్న వెంటనే సరైన సమయంలో పువ్వులను కోసి వేయాలి. బట్టవింగ్ ఈ తెగులు ఆశించిన తోటల్లో పూలు చిన్నవిగా వస్తాయి. నత్రజని తక్కువగా అందించడం వల్ల, లేక ఆలస్యంగా నారు నాటటం వల్ల ఈ ప్రభావం కనిపిస్తుంది. దీనిని అరికట్టాలంటే 21 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి, సరైన సమయానికి తగిన మోతాదులో నత్రజని ఎరువు అందించాలి. సరైన సమయంలో నాటుకోవాలి. బ్రౌవింగ్ తెగులు ఈ తెగులు బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా క్షార నేలల్లో ఈ పంటను వేసినప్పుడు తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన పువ్వులపై గోధమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎకరాకు 8 నుంచి 10 కిలోల బోరాక్స్ వేయాలి. లీటర్ నీటిలో 3 గ్రాములు బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి. కొరడా తెగులు ఈ తెగులు వల్ల ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకు మధ్య మాత్రమే పొడవుగా పెరుగుతుంది. ఇలా కొరడా తెగులు ఆశించినట్లు గుర్తించాలి. ఈ తెగులుకు కారణం నత్రజని మోతాదు ఎక్కువైతే మాలిబ్దినం మొక్కకు అందుబాటులో ఉండదు. దీని నివారణకు నత్రజనిని సరైన మోతాదులో అందించాలి. ఎకరాకు 400 గ్రాముల సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాలీప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడిన దశలో పువ్వు చుట్టూ ఉన్న ఆకులను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి సోకకుండా దారంతో కానీ రబ్బరు బ్యాండ్ కానీ వేయాలి. 4 నుంచి 5 రోజుల తరువాత పువ్వును కోయాలి. -
జోగి రమేష్కు తానేటి వనిత పరామర్శ
దేవరపల్లి: టీడీపీ రౌడీ మూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గృహాన్ని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత పరిశీలించారు. మంగళవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను కలిసి ఆమె పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంఽధించిన వీడియో చిత్రాలను జోగి రమేష్ వనితకు చూపించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగడంలేదని, నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని టీడీపీ రౌడీ మూకలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన టీడీపీ రౌడీ మూకలపై తక్షణం చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్, కుటుంబ సభ్యులను తానేటి వనిత పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడేది లేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, వైఎస్సార్ సీపీ నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కుసులూరి వెంకట సతీష్, యర్నగూడెం సర్పంచ్ బొంతా భరత్బాబు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చంద్రబాబు సర్కారుకు హైకోర్టు మొట్టికాయ
భూసేకరణ పరిహారం చెల్లింపునకు ఆదేశాలు రాజానగరం: పేదల కోసం గత ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని హైకోర్టు ఆదేశించడంతో చంద్రబాబు సర్కారు దిగిరాక తప్పలేదు. కోర్డు ఆదేశాల మేరకు ఆయా భూములకు చెల్లించవలసిన రూ.3.14 కోట్లను వెంటనే విడుదల చేసింది. వివరాలిలావున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు’ కార్యక్రమంలో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మండలంలోని వెలుగుబందలో సర్వే నంబరు 51లో 4.70 ఎకరాలను సేకరించారు. అయితే ఆయా భూములకు పరిహారాన్ని చెల్లించే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో చెల్లింపులు జరగలేదు. ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. సేకరించిన భూములకు పరిహారాన్ని చెల్లిస్తే గత ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చెల్లింపుల ప్రక్రియను జాప్యం చేస్తూ వచ్చారనే ఆరోపణలున్నాయి. భూములిచ్చిన వారు ఆర్థికంగా తమ అవసరాలు తీర్చుకునే దారిలేక, సర్కారు తీసుకున్న భూములకు పరిహారం అందక అనేక అవస్థలు పడ్డారు. న్యాయం కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు భూములిచ్చిన రైతుల మొర విన్న కోర్టు తక్షణమే పరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న చంద్రబాబు సర్కారు చేసేదేమీ లేక పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలంటూ రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది. ఐదు ఈగల్ టీమ్ల ఏర్పాటు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా ఐదు ఈగల్ టీం లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఈగల్ టీంలతో ముఖాముఖీ జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా సబ్ డివిజన్కి ఈగల్ టీంను ఒక ఇన్చార్జి, ముగ్గురు సిబ్బందితో ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా కొనసాగిస్తాయన్నారు. మాదక ద్రవ్యాల కేసులు ఉంటే పాస్పోర్ట్, వీసా పొందడంలో, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. యువత వీటికి దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112, 1972 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
ఉపాధి.. హతవిధీ!
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు పస్తులు తప్పడం లేదు. రోజంతా స్వేదం చిందించినా గొంతులోకి ముద్ద దిగడం లేదు. ఉపాధి హామీ కూలీలకు సుమారు పది నెలలుగా వేతనాలు స్తంభించడంతో లబోదిబోమంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలి డబ్బు ఎప్పుడు చెల్లిస్తారా..? అని నిరీక్షిస్తున్నారు. మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు సైతం విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రూ.33 కోట్ల బకాయిలు వలసలు నియంత్రించి ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యసాధనకు దూరంగా ఉంటోంది. సకాలంలో వేతనాలు మంజూరు చేయకపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 20 నుంచి 30 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.37 కోట్ల విలువైన వివిధ రకాల పనులు చేపట్టారు. కేవలం రూ.3.84 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. రూ.33.20 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో కూలీకి సగటున రూ.25 వేలకు పైగా వేతనం అందాల్సి ఉంది. ఉపాధి కూలీ డబ్బు వస్తుందని కిరాణా దుకాణాల్లో అప్పులు చేశారు. వాటిని తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే విడుదలవుతాయని చెబుతున్నారే తప్ప.. ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోజుకు సగటున రూ.274 కూలి ఉపాధి పథకంలో వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేస్తే సగటున రోజుకు రూ.274 వరకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. సాధారణంగా ఉపాధి పథకంలో ప్రతి వారం కూలి డబ్బు చెల్లించేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలకు చెల్లింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రతి వారం కూలి డబ్బు చెల్లిస్తే ఇంట్లో అవసరాలకు సరకులు కొనుగోలు చేసుకుంటారు. జూన్ మాసం నుంచి ఉపాధి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. ఒక్క రూపాయి కూడా తమ ఖాతాల్లో జమ కావడం లేదని కూలీలు వాపోతున్నారు. వెరసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. నెలల తరబడి డబ్బు ఇవ్వకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విడుదలకాని మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులు హడావుడిగా చేపట్టారు. మినీ గోకులం, మొక్కల పెంపకం తదితర పనులు చేపట్టారు. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ.కోట్లలో వెచ్చించారు. పెండింగ్ బిల్లుల్లో రూ.5 కోట్లకుపైగా మెటీరియల్ కాంపొనెంట్ కింద చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. ప్రధానంగా రహదారుల పనుల్లో ఎక్కువ శాతం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వేసేశారు. ప్రస్తుతం బిల్లులు అందక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా 1.45 లక్షల జాబ్కార్డులు మంజూరు చేశారు. అందులో 2.20 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. 1.74 లక్షల మంది పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 864 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. మహిళలకు 55.04 శాతం, ఎస్టీలకు 2.03 శాతం, ఎస్సీలకు 36.57 శాతం పనులు చూపారు. ఇప్పటి వరకు 5,271 పనులు పూర్తి చేశారు. అందులో 43.44 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం కల్పించారు. 30 లక్షల పనిదినాలు లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పనిదినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బిల్లులు సకాంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. గందరగోళంగా వీబీజీ రామ్జీ ఉపాధి పథకంలో కేంద్రం సమూల మార్పులు తీసుకువచ్చింది. మహాత్మాగాంధీ పేరును తొలగించి ‘వీబీజీ రామ్జీ’ అనే పేరు పెట్టింది. నిబంధనలను సైతం మార్పు చేసింది. పథకం అమలు, పనుల కేటాయింపుపై నేటికీ అధికారులకు మార్గదర్శకాలు అందకపోవడంతో పనుల కేటాయింపుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు కల్పించాలన్న విషయమై అధికారుల్లో మీమాంస నెలకొంది. ఇదిలా ఉంటే.. కొత్త నిబంధనల మేరకు పంచాయత్రాజ్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని పనులు కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందని వేతనాలు పది నెలలుగా తప్పని పస్తులు జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిలు స్వేదం చిందిస్తున్నా కడుపు నిండని దుస్థితి ఎప్పుడు అందుతాయో తెలియక ఆందోళన నేటికీ అందని ‘జీ–రామ్జీ’ మార్గదర్శకాలు 125 రోజుల పనుల కల్పనపై స్పష్టత కరవు జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు : 18 పంచాయతీలు : 300 మంజూరైన జాబ్కార్డులు : 1.45 లక్షలు కూలీలు : 2.20 లక్షల మంది యాక్టివ్ జాబ్కార్డులు : 1.19 లక్షలు పనులు వినియోగించుకుంటున్న కూలీలు : 1.74 లక్షల మంది -
దిగుబడి ఆశలు గల్లంతు
● ఆకులు రాలిపోతున్న వర్జీనియా పొగాకు తోటలు ● క్యూరింగ్ దశలో దెబ్బతిన్న వైనం ● తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు దేవరపల్లి: వర్జీనియా పొగాకు తోటలు ఆశాజనకంగా ఉండడంతో నాణ్యమైన దిగుబడులు వస్తాయని ఆశతో ఉన్న రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్జీనియా పొగాకు తోటల్లో ఆకులు రాలిపోయి మొక్కలు నల్లబడి ఎండిపోతున్నాయి. ఆకు ముట్టుకుంటే రాలిపోతోంది. గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట, గోపాలపురం, దేవరపల్లి మండలంలో బందపురం, చిన్నాయగూడెం, సంగాయగూడెం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రెలుపులు, క్యూరింగ్లు జరుగుతున్న తరుణంలో తోటలు ఎండిపోతున్నాయి. రైతులకు ఎకరం కౌలుకు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.20 లక్షలు అయింది. పిలక నివారణకు గోపాలపురంలోని ఓ పురుగు మందుల దుకాణం నుంచి మందు తెచ్చి వాడామని, అనంతరం తోటలు దెబ్బతిన్నట్టు కొందరు రైతులు చెబుతున్నారు. 20 సంవత్సరాలుగా ఇదే మందు వాడుతున్నామని, ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని రైతులు వివరించారు. సీటీఆర్ఐ సిఫారసు చేసిన చక్కర స్టాప్ మందులో దుకాణం నుంచి తీసుకు వచ్చిన మందు కలిపి పిచికారీ చేశారు. దుకాణం నుంచి 5 లీటర్లు, లీటర్ల టిన్నులు తీసుకు వచ్చి తోటలకు వాడగా 5 లీటర్ల డబ్బాలోని మందు వాడిన తోటలు దెబ్బతిన్నాయి. లీటరు డబ్బాల్లోని మందు వాడిన తోటలు దెబ్బతినలేదు. రెండు గ్రామాల్లో సుమారు 30 మంది రైతులు ఈ విధంగా మందులు వాడి దెబ్బతిన్నారు. దిగుబడులపై ప్రభావం ఆకులు పండిపోయి రాలిపోవడం వల్ల ఆకులు గుల్లబారి లో గ్రేడు శాతం ఎక్కువగా ఉంటుంది. మొక్కకు 22 నుంచి 24 వరకు ఉన్న ఆకులు రాలిపోయి తోటలు మోడుబారిపోతున్నాయి. దీనివల్ల ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది. సిఫారసు చేసిన మందులే వాడాలి సీటీఆర్ఐ, ఐటీసీ, పొగాకు బోర్డు అధికారులు సిఫారసు చేసిన మందులను మాత్రమే వాడాలి. పిలక నివారణకు చక్కర స్టాంప్ మందును ఈ ఏడాది సిఫారసు చేశాం. దీనిని మాత్రమే రైతులు వాడాలి. ఇతర మందులు వాడితే తోటలు దెబ్బతింటాయని ముందు నుంచి రైతులకు సూచిస్తున్నాం. పొగాకు తోటలకు కలుపు నివారణ మందు వాడరాదు. సొంత ప్రయోగాలు చేస్తే రైతులు నష్టపోతారు. – జీఎల్కే ప్రసాద్, టుబాకో బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం 10 ఎకరాల్లో మొక్కలు దెబ్బతిన్నాయి నేను 50 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నాను. 10 ఎకరాల్లో పిలక నివారణ మందు వాడగా పంట దెబ్బతింది. ఎకరాకు రూ.3 లక్షలు ఖర్చు అయింది. వ్యవసాయాఽధికారి దృష్టికి తీసుకు వెళ్లాం. గ్రామంలో 30 మంది రైతులు నష్టపోయారు. – గద్దే ఈశ్వరుడు, రైతు, వాదాలకుంట, గోపాలపురం మండలం కోలుకోలేని దెబ్బ ఈ ఏడాది పొగాకు రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. రూ.కోట్లలో నష్టం జరిగింది. 10 ఎకరాల్లో మొక్కలు ఆకులు రాలి ఎండిపోయాయి. రాలిపోయిన ఆకులు క్యూరింగ్కు పనికిరావు. వ్యవసాయాధికారులకు చెప్పినా న్యాయం జరగలేదు. – కాకర్ల సతీష్, రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం -
ఎత్తిపోతలపై తమ్ముళ్ల ఎత్తులు!
● టీడీపీ రాజకీయాలకు వేదికగా వేగేశ్వరపురం ఎత్తిపోతల పఽథకం ● రైతు సంఘం నుంచి ప్రత్యేకాధికారి పాలనలోకి.. ● రెండు వర్గాలుగా టీడీపీ నాయకుల పోటీ ● నిధుల కోసమేనా పదవులపై ఆశ? తాళ్లపూడి : రైతు సంఘం నిర్వహణలో 28 సంవత్సరాలుగా ఉన్న వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం టీడీపీ నాయకుల విభేదాల కారణంగా ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ పథకం కూటమి నాయకుల రాజకీయాలకు వేదికగా మారింది. మరోపక్క ఎత్తిపోతలకు వచ్చే నిధుల కోసమే పదవులపై ఎవరికి వారు కన్నేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బకాయిల భారం : పెద్ద రైతులు, నాయకులు నీటి తీరువా కట్టకుండా పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టినట్టు సమాచారం. రూ.1.11 కోట్ల వరకు పన్ను బకాయిలున్నాయి. బకాయి దారుల్లో ప్రస్తుతం పదవిని ఆశిస్తున్న టీడీపీ నాయకులు కూడా ఉండడం గమనార్హం. 2017లో పథకం ఆధునికీకరణకు రూ.8.32 కోట్లతో పనులు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పెట్టిన నేపథ్యంలో టీడీపీలో ఒక వర్గం వారు అధికారం తమ వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో వేగేశ్వరపురం, బల్లిపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇరిగేషన్ అధికారులకు ఒక లేఖ రాశారు. రైతుల నుంచి ఆరోపణలు వచ్చాయని ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిని తొలగించి జీవో 41ను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆ మేరకు 31వ తేదీ నుంచి ఈ పథకం ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లింది. కొన్నాళ్లు ప్రత్యేకాధికారి పాలన కొనసాగాక పార్టీలో తమ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఈ పథకం అధ్యక్షుడిగా నియామకం పొందాలని తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేటస్ కో ఎత్తివేత ఎన్నికలు నిర్వహించకుండా 2022లో తమకు నిర్వహణ అవకాశం కల్పించాలని రైతు సంఘం హైకోర్టులో కేసు వేసింది. దీంతో అధ్యక్షుడిగా ఉన్న కై గాల రాంబాబుకు అనుకూలంగా కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇటీవల రాజకీయ ఒత్తిడితో ఆయన కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడంతో కోర్టు స్టేటస్ కో ఎత్తివేసింది. అయితే ఎత్తిపోతల పథకాన్ని అధికార పార్టీ రాజకీయంలోకి లాగడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ పథకం ద్వారా వేగేశ్వరపురం, తిరుగుడుమెట్ట, పెద్దేవం, బల్లిపాడు, కుక్కునూరు, చిడిపి, మలకపల్లి, గ్రామాల్లో 3,400 ఎకరాలకు నీరు అందుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు 41 జీవో ప్రకారం నేను ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. జనవరి 31 నుంచి పథకం నిర్వహణ చూస్తున్నా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటా. రైతు సంఘం రికార్టులు అప్పగించాల్సి ఉంది. –గురవయ్య, ఏపీఎస్ఐడీసీ ఈఈ, -
220 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి 220 అర్జీలను ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తాము సమర్పించిన అర్జీల యధార్థ స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రాబేషనరీ) కృష్ణ చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 39 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 39 అర్జీలు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, ఛీటింగ్, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. -
వేషం కట్టి.. అదరగొట్టి
అనపర్తి: వేషం కట్టారు.. అదరగొట్టారు.. అందరినీ ఆకట్టుకున్నారు.. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన అనపర్తి మండలం కొప్పవరం కర్రివారి సత్తెమ్మ తల్లి సంబరాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు గత నెల 31న ప్రారంభమయ్యాయి. చివరి రోజు పెద్ద సంబరంలో గ్రామస్తులు వివిధ రకాల వేషాలు కట్టి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఘట్టంలో చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేషాలు కట్టి జోలె పట్టారు. తెల్లవారుజాము నుంచి ఈ సంబరం ఆద్యంతం సరదాగా సాగింది. ఈ వేడుకలు తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ జరిగింది. సత్తెమ్మ తల్లిని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నల్లమిల్లి విజయరెడ్డి, ఉప సర్పంచ్ మల్లిడి వీర్రాఘవరెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామసతీష్, కుతుకులూరు ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి, కొప్పవరం మాజీ సర్పంచ్ తాడి సూరారెడ్డి పాల్గొన్నారు. –ఫొటోలు: గరగ ప్రసాద్, ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ -
ఆగకొండ తవ్వేసి..
● కొండను తవ్వి మట్టి తరలింపు ● అధికార అండతో బరితెగింపు ● రేయింబవళ్లు యథేచ్ఛగా పనులు ● చోద్యం చూస్తున్న అధికారులు ఏలేశ్వరం: ఆగ‘కొండ’ తవ్వేస్తున్నారు.. అధికారం చేతిలో ఉండడంతో ఆపేవారే లేకపోయారు.. వారి అక్రమాలకు కొండలనే కరిగించేస్తున్నారు.. నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు తవ్వుకుపోతున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించేలా, ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు. ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలోని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న కొండను కొందరు అక్రమంగా కొల్లకొడుతున్నారు. ఈ గ్రామంలో కొండను ఆనుకుని ఓ రైతు పొలం ఉంది. పొలం కలుపుకొని సర్వే నంబర్ 366లో 42 ఎకరాల కొండ ఉంది. సమీపంలో ఉన్న రైతు కన్ను ఆ కొండపై పడింది. దీంతో స్థానిక అధికార పార్టీ నాయకులను సంప్రదించగా, వారి అండదండలతో ఐదు పొక్లెయినర్లు, సుమారు 50 ట్రాక్టర్లతో కొండను గుల్ల చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ పని రాత్రి పగలు అనే తేడా లేకుండా జరిగిపోతోంది. అయినా అధికారులు ఇటుగా రావడం లేదు. కొల్లగొట్టి.. కలిపేసుకుని జాతీయ రహదారిని ఆనుకుని పొలం కావడంతో ఎకరం సుమారు రూ.కోటి పలుకుతుంది. పొలం జాతీయ రహదారికి దిగువన ఉంది. దీంతో కొండ కొల్లగొట్టి చదును చేసి పొలంలో కలుపుకోవడంతో పాటు తవ్వుతున్న మట్టితో పొలాన్ని చదును చేస్తున్నారు. ఇలా ఎకరం రూ.కోటి పైనే పలికే అవకాశం ఉండడంతో పాటు మట్టితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా సదరు రైతు అధికార నాయకులకు భారీగానే రూ.లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నా.. యర్రవరం గ్రామంలో కొండపై బుద్ధుని అవశేషాలు ఉన్నాయనే ఉద్దేశంతో గతంలో దీనిని పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా రైతు పొలంతో పాటు కొండను రెవెన్యూ, పంచాయతీ, పురావస్తు శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేయించారు. తరువాత కొన్ని నెలలకు రికార్డులను మార్పు చేసి, కొండ జారి తమ పొలం ఆక్రమించుకుందని రైతు కొండను తవ్వడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు అధికారులు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాలును వివరణ కోరగా తవ్వకాలపై విచారణ జరుపుతున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే తగినచర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ తవ్వకాలు అరికట్టాలి యర్రవరంలోని అక్రమ తవ్వకాలు అరికట్టాలి. పురావస్తు శాఖకు చెందిన కొండను తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని తప్పించుకుంటున్నారు. మండలంలో అక్రమంగా మట్టి, ఇసుకను తరలించడం షరామామూలుగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. –దాడిశెట్టి వీరబాబు, జైభైమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
పాయకరావుపేట: పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం 5, 6, 7, 8, 9, 10వ తరగతులు పూర్తి చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జరిగిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయాలని, అప్పుడే వారు వృద్ధిలోకి వస్తారని అన్నారు. జేఈఈ (మెయిన్స్), జేఈఈ (ఆడ్వాన్స్డ్), నీట్లలో తరచూ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం పిల్లలు పుస్తకాల కన్నా మొబైల్తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి వివరించారు. తిరుమల విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రష్మీ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే రోల్మెడల్గా ఉండాలని, ప్రతి తల్లి తమ పిల్లలను సరైన మార్గంలో పెంచాలన్నారు. పిల్లల చదువుతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే దిశగా తమ విద్యా సంస్థ ఆలోచించి హాస్టల్ విద్యార్థులకు రోజూ ఉదయాన్నే యోగా తరగతులు, సాయంత్రం ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నామని అన్నారు. ఐఐటీ ధన్బాద్లో చదువుతున్న తిరుమల పూర్వ విద్యార్థి తండ్రి చిన్ని మాష్టార్ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలను చదివిస్తున్నారన్నారు. ఈ సదస్సులో పాయకరావుపేట కాలేజ్ ప్రిన్సిపాల్ కె.విజయ్కుమార్, స్కూల్ ఇన్చార్జ్ ఎం.సునీత తదితరులు పాల్గొన్నారు. -
కుట్ర రాజకీయాలపై ఆగ్రహం
● చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నేతల వ్యవహార శైలిపై నిరసనలు ● అంబటి అరెస్టుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద ● జక్కంపూడి గణేష్ బైఠాయింపు ● తిరుమల లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారంపై ● పోలీసులకు ఫిర్యాదు చేసిన తలారి సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. రెండు రోజులుగా వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర, కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి అరెస్టుకు నిరసన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా వైఎస్సార్ సీపీ యువనేత జక్కంపూడి గణేష్ ఆందోళన చేపట్టారు. సెంట్రల్ జైల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికై నా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని టీడీపీ, కూటమి నేతలు నిరాధార ఆరోపణ చేస్తున్నారు. ఇదే విషయంపై నియోజకవర్గ కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ దుష్ప్రచారానికి ఒడిగట్టారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని, నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ సీపీ కేంద్రం కార్యాలయం పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా తలారి వెంకట్రావు కొవ్వూరు మెయిన్ సెంటర్లో లడ్డూ వివాదంపై టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ్లెక్లీ తీయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరించడం దారుణమన్నారు. రాజకీయాలకు వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రమేష్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయంపై చిన్నచూపు
కర్నాకుల వీరాంజనేయులు గోకవరం: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగంపై చిన్నచూపు చూశారని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ బడ్జెట్ వలన కార్పొరేట్లకు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్నారు. భారీ డేటా సెంటర్లకు 2047 వరకూ రాయితీలివ్వడం వలన అదానీ, గూగుల్ వంటి సంస్థలకు ఉపయోగం తప్ప సామాన్యులకు ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. రవాణా, పారిశ్రామిక రంగాలకు మూలమైన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం చేయాలన్న రైతుల డిమాండ్లను ఎక్కడా పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ రంగంపై 45 శాతం మంది శ్రామికులు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ఏం చేస్తారో చెప్పలేదని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల నుంచే దేశానికి ఎక్కువ శాతం ఆదాయం వస్తుందని, కానీ, ఒక్క శాతం సంపద ఉన్న సంపన్నులకు అనుకూలంగానే బడ్జెట్ కేటాయింపులున్నాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగ కల్పనపై స్పష్టత లేదన్నారు. మొత్తం దేశాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేటాయింపులున్నాయి తప్ప ప్రజలకు ఆశాజనకంగా ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, విశాఖ ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్ట్ల ఊసే లేదని అన్నారు. బడ్జెట్లో రాష్ట్రాలకు, వ్యవసాయం, చిన్న పరిశ్రమల బలోపేతానికి కేటాయింపులు లేవని విమర్శించారు. స్పష్టత లేని, సామాన్యులకు ఉపయోగపడని ఈ బడ్జెట్పై ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నించాలని, పోరాడాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. -
పెద్దపులి జాడ కోసం అన్వేషణ
తొర్రేడు–వెంకటనగరం గ్రామాల మధ్యే సంచరిస్తున్న వైనం రాజమహేంద్రవరం రూరల్: తొర్రేడు గ్రామంలో పెద్దపులి రెండో రోజులుగా జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొర్రేడు శివారులోని మొక్కజొన్న తోట ప్రాంతంలో మాటు వేసిన పెద్దపులి అక్కడ నుంచి వెంకటనగరం గ్రామంలోని మొక్కజొన్న తోటల్లో నుంచి వెళ్లినట్లు కాలిముద్రలను బట్టి అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో అటవీరేంజ్ ఆఫీసర్ దావీదు రాజు, సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి తొర్రేడు, వెంకటనగరం గ్రామాలలో పులిజాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తొర్రేడు మొక్కజొన్న తోటలో ఉన్న పెద్దపులి వెంకటనగరం గ్రామం వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో అధికారులు ఆ దిశగా వెళ్లి పులి అడుగుజాడలు గుర్తించారు. అక్కడి నుంచి మొక్కజొన్న తోటలు ఉండడంతో పులి అడుగుజాడలు కనిపించలేదు. పులి వచ్చిన మార్గానే వెనక్కి వెళ్లిపోయిందా అనే కోణంలోను అధికారులు అన్వేషిస్తున్నారు. కొంతమంది సీతానగరం మండలం కూనవరం, ముగ్గళ్లలో పెద్దపులి సంచరించిందని తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. తొర్రేడు గ్రామంలో బోను, ట్రాప్ కెమెరాలను అమర్చారు. పెద్దపులి సంచారంతో తొర్రేడు, వెంకటనగరం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా అటవీశాఖ అధికారి తొర్రేడు, వెంకటనగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు తెలిపారు. రాత్రి వేళ ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెద్దపులి సమీపంలో టైగర్ రిజర్వ్స్ నుంచి వచ్చి ఉంటుందన్నారు. తల్లి నుంచి విడిపోయే సమయంలో పులులు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటాయన్నారు. దానిలో భాగంగా గత నెల 20న ఏలూరు జిల్లాలో ప్రవేశించిందన్నారు. గత నెల 30వ తేదీన గోదావరి నది దాటుకుని చినకొండేపూడి, పెదకొండేపూడి ప్రాంతాల్లో తిరిగిందని చెప్పారు. అక్కడ నుంచి తొర్రేడు గ్రామం చేరుకుని రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేయడంతో మృతిచెందాయని తెలిపారు. ఒక దూడను తిన్నటు చెప్పారు. ఆదివారం రాత్రి ఆవులను చంపలేదన్నారు. పులి సాధారణంగా రాత్రి సమయాల్లో ప్రయాణిస్తుందని, మనిషి పులికి ఆహారం కాదని, అది నాలుగు కాళ్ల జంతువులపై దృష్టి పెడుతుందన్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
ఆగిన మీటర్ రీడింగ్
● రెండు రోజులుగా నిలిపివేసిన విద్యుత్ మీటర్ రీడర్లు ● ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లినట్లు ప్రకటన ● జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ● సకాలంలో బిల్లులు తీయకపోవడంతో వినియోగదారుల ఆందోళన ● స్లాబ్ రేట్ పెరిగి బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉందన్న భావన ● ‘తూర్పు’లో 200 మందికి పైగా మీటర్ రీడర్లు సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రంగంలో సంక్షోభం నెలకొంటోంది. సాఫీగా సాగే వ్యవస్థలను సైతం గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే అనేక వ్యవస్థల నిర్వీర్యానికి ఆజ్యం పోసిన సర్కారు తాజాగా స్పాట్ బిల్లింగ్పై పడింది. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోవడంతో మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టారు. రెండు రోజులుగా విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ ఆగిపోయింది. ఈ పరిణామం విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన నింపుతోంది. బిల్లులు తీయడం ఆలస్యమైతే.. విద్యుత్ వినియోగంలో స్లాబ్ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ బిల్లులతో ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే.. మరింతగా బిల్లులు పెరిగితే ఎలాగన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 7,82,170 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలవి 10,607, ప్రైవేటు కనెక్షన్లు 7,71,563 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 108.85 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకుగాను ప్రతి నెలా సుమారు రూ.74.41 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా మీటర్ రీడర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 11వ తేదీ లోపు మీటర్ రీడింగ్ తీస్తారు. ఒక మీటర్కు రీడింగ్ తీసినందుకు గాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్ పట్టణ ప్రాంతాల్లో రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయడంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ.0.75 పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా.. విద్యుత్ మీటర్ రీడర్కు చేతికి ఒక్కో మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్ని బట్టి చూస్తే వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేల లోపే ఉంటుంది. ప్రాంతాన్ని, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు సిబ్బందికి ఉపాధి దక్కదు. విద్యుత్ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండిపడుతుంది. వినియోగదారులకు విద్యుత్ రీచార్జ్పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరగనుంది. పొట్టకూటి కోసం పోరుబాట చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో చలో విజయవాడ నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అప్పుడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థించి.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకించిన సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విమర్శించిన నోటితోనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం మంచి ప్రక్రియ అని చెబుతుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఫ స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చిన తరుణంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. ఫ కనీస వేతనాలు అమలు చేయాలి. ఫ రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలి. ఫ ఎస్క్రో ఖాతాను వెంటనే తెరవాలి. ఫ కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. జగన్ హయాంలో సానుకూలం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్న సమయంలో మీటర్ రీడర్లు ఆందోళన చెందారు. దీంతో స్పందించిన అప్పటి సీఎం వైఎస్ జగన్ మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలోనే ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసింది. పట్టించుకోని ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని, స్మార్ట్ మీటర్ల తీసుకొస్తే తాము జీవనోపాధి కోల్పోతామని, తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుతూ మంత్రులు, అధికారులను కలిసి మీటర్ రీడర్లు పరిస్థితి విన్నవించారు. ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. సోమవారం చర్చలకు రావాలని తెలపడంతో మీటర్ రీడర్ల సంఘం నేతలు విజయవాడ వెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు ఫలించిన దాఖలాలు లేవు. దీంతో రీడర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమ్మెలోకి వెళుతున్నారు. -
నయనానందం.. స్వామివార్ల తెప్పోత్సవం
సఖినేటిపల్లి: అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం సోమవారం నేత్ర పర్వంగా సాగింది. స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజు ఆలయానికి ఉత్తరం వైపునున్న చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లు విహరించారు. తొలుత సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై అర్చకులు కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. 6 గంటలకు తెప్పోత్సవం నిర్వహించారు. ద్రాక్షారామలో భీమేశ్వరస్వామికి.. రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారికి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరి నదిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీప కాంతుల నడుమ తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణమూర్తులను వేద పండితులు ఆలయం నుంచి తోడ్కొని వచ్చి సప్త గోదావరిలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకృతమైన హంస వాహనంలో ఉంచి ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణమూర్తులకు నీరాజన మంత్ర పుష్పాలు సమర్పిస్తుండగా మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారు మూడు సార్లు నదిలో జలవిహారం చేశారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కాస్త దారివ్వండి స్వామీ!
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రావి చెట్టును సంరక్షించే క్రమంలో అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకున్న చర్యలు భక్తులకు ఇబ్బందికరంగా మారాయి. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, భక్తులకు కలిగే ఇబ్బందులను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావి చెట్టు వద్ద ఆవు నేతి దీపాలు వెలిగించడం, ఆ దేవతా వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. ఇక్కడ నేతి దీపాలు విక్రయించేందుకు తాజాగా వేలం నిర్వహించగా ఏడాదికి రూ.1.45 కోట్లకు ఖరారైంది. రావిచెట్టు మొదట్లో భక్తులు దీపాలు వెలిగిస్తూండటంతో ఆ సెగకు చెట్టు చనిపోయే ప్రమాదముందని గత ఏడాది సెప్టెంబర్ 11న ‘అశ్వత్థానికి దీపపు సెగ’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ చెట్టుకు దీపాల సెగ తగలకుండా కాండానికి రేకు అమర్చారు. ఆ తరువాత వచ్చిన కార్తిక మాసంలో ఎక్కువ మంది మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తారు కాబట్టి, వాడపల్లి దేవస్థానం నుంచి 4 అడుగుల ఎత్తున రెండు అరలుగా ఉన్న ఇనుప ర్యాకులు తెచ్చి, చెట్టు చుట్టూ అమర్చారు. మరికొన్ని ర్యాకులను చెట్టు పక్కనే ఖాళీ స్థలంలో ఉంచారు. దీంతో, అప్పట్లో మహిళలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా దీపాలు వెలిగించుకున్నారు. కార్తికం తరువాత ఆ ర్యాకులను తిరిగి వాడపల్లి దేవస్థానానికి పంపించేశారు. కొత్త ర్యాకుల తయారీ ఇనుప ర్యాకుల ప్రయోగం సత్ఫలితం ఇవ్వడంతో దేవస్థానమే సొంతంగా అటువంటివి తయారు చేయించింది. వీటిని భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం నుంచి రావి చెట్టు చుట్టూ అమర్చారు. దీంతో, భక్తులు రావి చెట్టు కాండం వద్ద కాకుండా ఆ ర్యాకులపై దీపాలు వెలిగిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. రావి చెట్టుకు ఉత్తరం వైపు 20 చదరపు అడుగుల మేర ఉన్న ఖాళీ స్థలంలో మహిళలు గతంలో నీటితో కడిగి చిన్న ముగ్గు వేసి జ్యోతులు వెలిగించుకునేవారు. వారితో వచ్చిన పురుషులు అక్కడ వేచి ఉండేవారు. ఇప్పుడు ఆ ఖాళీ స్థలం నిండా సుమారు 20 ర్యాకులు పెట్టేశారు. దీని వలన వాటి మీద దీపాలు వెలిగించడం కాదు కదా.. అక్కడకు వెళ్లడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఆ ఖాళీ స్ధలానికి ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్పై కొత్తగా రెండు క్యూలు కూడా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఇరుకుగా తయారైంది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు అధికారులు రావిచెట్టు చుట్టూ పెట్టిన ర్యాకులను లాగే ఉంచి, పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వాటిలో కొన్నింటిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో అమర్చి, మధ్యలో ఖాళీ ఉంచితే అక్కడ కూడా మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ఈ విధంగా మార్పులు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
రేపటి నుంచి జాతీయ స్థాయి హాకీ పోటీలు
● కాకినాడ వేదికగా నిర్వహణ ● హాజరుకానున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ క్రీడలకు ప్రసిద్ధి.. ఇప్పటికే జాతీయ స్థాయి హాకీ పోటీలకు నగరం వేదికగా నిలిచింది. ఇప్పుడు ఇక్కడి జిల్లా క్రీడా మైదానంలోని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి హాకీ టోర్నీ జరుగనుంది. ఆ వివరాల్లోకి వెళితే... హాకీ ఇండియా సహకారంతో హాకి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారి కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీడా మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో ఈ నెల 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ సెక్రటేరియేట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ మేజర్ పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జట్లు పాల్గొంటున్నాయి. మహిళల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరుకానుండడంతో నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హాకీ ఇండియా అఫిలియేటెడ్ అంపైర్లను పోటీల నిర్వహణకు హాకీ ఇండియా పంపనుంది. వివిధ జట్లకు చెందిన క్రీడాకారుల కోసం భోజన, వసతి సదుపాయాలు ఇప్పటికే పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక అధికారులు, జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారులు, పీఈటీలు టోర్నమెంట్ నిర్వహణలో సేవలు అందించనున్నారు. పోటీల్లో మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఆయా జట్లకు అందిస్తా రు. జాతీయస్థాయి గోల్డ్కప్ హాకీ పోటీలు కాకినా డ ప్రజలకు సుమారు 10 రోజుల పాటు కనువిందు చే యనున్నాయి. పోటీల నిర్వహణకు అనువుగా క్రీ డా మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ను తీర్చిదిద్దుతున్నారు. పోటీల ఏర్పాట్లలో హాకీ సంఘ ప్రతినిధు లు రవిరాజు, సూరిబాబు సహకారం అందిస్తున్నారు. -
భక్తజన సాగరం..
● కిటకిటలాడిన అంతర్వేది ● స్వామివారికి చక్రస్నానం ● ఉత్సవాల్లో కమనీయ ఘట్టం సఖినేటిపల్లి: సాగర తీరం భక్తజనంతో ఎగసిపడింది.. ఆ నారసింహుడిని చూసిన ప్రతి మది పులకించింది.. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనారసింహుని వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్వామివారి చక్రస్నానం అట్టహాసంగా జరిగింది. ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కడి సముద్ర తీరం భక్తిభావంతో ఉప్పొంగింది. ఎటు చూసినా భక్తజనం కనిపించింది. సుదర్శన చక్రం ధరించిన నారసింహస్వామి (సుదర్శన పెరుమాళ్ స్వామి) జలకమాడిన కడలిలోనే భక్తులు స్నానమాచరించి పులకించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామిని శిరస్సుపై ఉంచుకుని సముద్ర స్నానం చేయించారు. జల్లు స్నానానికి ఏర్పాట్లు సముద్రంలో స్వామితో పాటు పుణ్యస్నానం చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం జల్లు స్నానాలను ఏర్పాట్లు చేసింది. స్వామివారి కరుణా కటాక్షాలు కలగజేసేందుకు ఆలయ ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఈ చర్యలు తీసుకున్నారు. ఒడ్డున స్వామివారిని ప్రత్యేక అరపపై ఆశీనులు చేసి, పైపు ద్వారా సముద్ర నీటిని స్వామి శిరస్సుపై నుంచి జార విడిచారు. అరప కింద ఏర్పాటు చేసిన క్యూలో భక్తులు ఆ నీటి కింద నుంచి వెళ్లి తడిసి పునీతులయ్యారు. తొలుత ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై, పల్లకిలో సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామిని ఊరేగిస్తూ మంగళవాయిద్యాలతో తీరానికి అర్చకులు తోడ్కొని వచ్చారు. తీరంలో ఒడ్డున దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులు గాలించారు. స్వామివారికి పంచామృతాలు, కొబ్బరి నీళ్లతో ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్, స్థానాచార్య రామరంగాచార్యులు, వేద పండింతుడు వెంకటశాస్త్రి, అర్చకులు అభిషేకాలు చేశారు. పేరూరు పండితులు సుదర్శన చక్రధారుడైన స్వామిని శిరస్సుపై ధరించి సముద్ర స్నానం చేయించారు. స్వామితో పాటు భక్తులు, అధికారులు, ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామిని అర్చకులు ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువెళ్లారు. దద్దోజనం, పానకాలను స్వామివారికి ఆలయ అర్చకులు నైవేద్యంగా పెట్టారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం స్వామిని గరుడ పుష్ప వాహనంపై ఊరేగిస్తూ ఆలయానికి తోడ్కొని వచ్చారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఏఎస్పీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ ఎస్.మురళీ మోహన్, ఆర్డీవోలు అఖిల, శ్రీకర్, ఎండోమెంట్స్ డీసీ డీఎల్వీ రమేష్ బాబు, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమారరామ గోపాల రాజాబహద్దూర్, జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సరికి క్యూలైన్లు మరింత రద్దీగా మారాయి. అంగరంగ వైభవం.. వసంతోత్సవంఅంతర్వేదిలో నేడు అంతర్వేది తీర్థమహోత్సవాల్లో తొమ్మిదో రోజు సోమవారం స్థానిక చెరువులో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. విద్యుద్దీపాల మధ్య, బాణసంచా కాల్పులతో ఈ ఉత్సవం జరుపనున్నారు. సాయంత్రం 5 గంటలకు పుష్పక వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిప్తారు. చెరువు వద్ద ఆదివారం తెప్పోత్సవం ఏర్పాట్లను జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈవో ప్రసాద్ పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు ఉత్సవరులకు తిరుమంజనాలు, దర్పణసేవ, ధూపసేవ, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ద్వాదశ తిరువారాధన, శ్రీపుష్పోత్సవం, చెంగోలం విన్నపం, తీర్థగోష్టి, స్వామివారి పవళింపు సేవ అర్చకులు నిర్వహించనున్నారు.రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం భీమేశ్వరాలయంలో వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ముందుగా వేగాయమ్మపేటలోని ఆస్థాన మండపం నుంచి కల్యాణ మూర్తులైన మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లను రథంపై దేవాలయానికి తీసుకుని వచ్చారు. ఆలయంలో వేద పండితులు, ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య తీర్థపు బిందె, బాలభోగం, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, నాకబలి, గ్రామోత్సవాలు నిర్వహించిన అనంతరం త్రిశూల స్నానం, చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించారు. నేడు తెప్పోత్సవం భీమేశ్వరస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, తీర్థపు బిందె, బాల భోగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం భక్తులచే విశేష అభిషేకాలు, మాణిక్యాంబా అమ్మవారికి వివిధ రకాల పుష్పార్చన, కుంకుమార్చన జరుపుతారు. మధ్యాహ్న కాలార్చన, రాజభోగ నివేదన సేవ అనంతరం రాత్రి 6.35 గంటలకు సప్త గోదావరి నదిలో శ్రీస్వామివార్లు, అమ్మవార్లకు కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. -
నిరాశల బడ్జెట్..!
‘పోలవరం’ నిర్వాసితుల ఊసేదీ..? కేంద్రం బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యి చూపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులతో అప్పులు ఇస్తారా..? విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించి బడా కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగిం చేసే మోడీ బడ్జెట్ ఇది. కోస్టల్ కారిడార్, విశాఖ స్టీల్కు సొంత గనుల కేటాయింపు, కోటిపల్లి రైల్వే లైన్కు నిధులు శూన్యం. 2025–26 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లుగా ప్రకటించి.. సవరించిన అంచనాలలో అదే రూ.49,64,842 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ రూ.53,47,315 కోట్లు అంటూ ఘనంగా ప్రకటించారు. ఇది పేద ప్రజలను కాగితాల్లో మోసగించడమే. ఉభయ రాష్ట్రాలకు అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి ఈ బడ్జెట్లో నిధులు తక్కువగా కేటాయించి తీవ్ర అన్యాయం చేశారు. జాతీయ ప్రాజెక్టుకు త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించలేదు. ఎప్పటి నుంచో రైలు వస్తుందని కలలు కంటున్న కోనసీమ వాసులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోటిపల్లి రైల్వే లైనుకు ఒక రూపాయి కూడా విదల్చలేదు. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నిరాశే వికసిత భారత్–2047 లక్ష్యంగా సాగిన కేంద్ర బడ్జెట్ భారతీయ ఖాదీ, టెక్స్ టైల్, ఫిషరీస్, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలతో పాటు క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, న్యూక్లియర్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు మార్గాన్ని వేస్తున్నామని ప్రకటించారు. ప్రతి బడ్జెట్లో లాగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల కేటాయింపులు, ప్రోత్సాహకాలు, వాటాలు ఈ బడ్జెట్లో అంతగా కనిపించలేదు. క్యాన్సర్కు సంబంధించి 17 రకాల ఔషధాలపై, 7 రకాల వ్యాధులకు సంబంధించి వాటి మందులకు పన్ను మినహాయింపులు ఊరట కలిగించే విషయం. వివిధ రకాల జంతువుల పరిరక్షణకు బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ మదుపర్లు, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వర్గాల ప్రస్తావన లేకుండా బడ్జెట్ ఉండడం కొన్ని వర్గాల్లో అసంతృప్తి కలిగించింది. – డాక్టర్. ఎంవీ కాళేశ్వరరావు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు -
నందెపు వెంకట్రావుకు ఘన నివాళి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ మాజీ అధ్యక్షుడు, ది ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ స్టేట్ కన్వీనర్ నందెపు శ్రీనివాస్ తండ్రి వెంకట్రావు ఇటీవల మృతి చెందారు. ఆదివారం స్థానికంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వెంకట్రావుకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ అశోక్ కుమార్జైన్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఆనందంగా ఉంది
కాకినాడ జిల్లాలో జాతీయ స్థాయి కోకనాడ గోల్డ్ కప్ పోటీలు జరగడం ఆనందంగా ఉంది. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావడంతో వర్ధమాన క్రీడాకారులు వారి ఆట చూసి చేర్చుకోవడానికి వీలు ఉంటుంది. భవిష్యత్తులో కాకినాడ నుంచి జాతీయ, అంతార్జతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావడానికి ఇదో చక్కని వేదిక. – నాగేంద్ర, డీఎస్ఏ హాకీ కోచ్ అన్ని ఏర్పాట్లూ చేశాం కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాకి ఇండియా, హాకీ ఆంధ్రప్రదేశ్ సహకారంతో కాకినాడ డీఎస్ఏ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. సుమారు 10 రోజుల పాటు జరిగే పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పోటీలను క్రీడాభిమానులు తిలకించవచ్చు. – రవిచంద్ర, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేసిన సందర్భంగా ఆయన నివాసం వద్ద వేణు విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య చేశారు. కానీ అంతకు ముందు మీరు చేసిందమేటని ప్రశ్నించారు . రాంబాబు సంఘటన జరిగిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మీ మంత్రులు, నాయకులు ఎటువంటి పదజాలంతో రాంబాబుని దూషించారో ప్రజలందరికీ తెలుసున్నారు. అంబటి మీద చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేశారు. మరి అదే చట్టం కూటమి నేతలకు ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారు, దాడికి ఉసిగొల్పిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారం ఉంటే అరెస్టు చేయడమేనా అని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారు. వీటి గురించి ప్రతి పక్షం మాట్లాడకుండా చేయడానికే ఈ కుట్రలు పన్నుతున్నారు. -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదులు స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. భూ సమస్యల పరిష్కార వేదికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు ల్యాప్టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పని సరిగా హాజరుకావాలని ఆదేశించారు. గోదావరి డెల్టాకు సీలేరు జలాలు మోతుగూడెం: గోదావరి డెల్టాకు లోయర్ సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు సుమారు 8 వేల క్యూసెక్కుల వరకూ నీటి అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలపడంతో, నీటి విడుదలకు ఏపీ జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి 28 రోజుల పాటు గోదావరి జిల్లాలకు రబీ అవసరాల నిమిత్తం జలాలు విడుదల చేయనున్నారు. డొంకరాయి డ్యామ్ నుంచి 3,800 క్యూసెక్కులు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కులు కలిపి మొత్తం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. సుమారు రెండు నెలలు ఐదారు యూనిట్ల అనుసంధాన పనుల వల్ల నీటి విడుదల ఆలస్యం అయ్యిందని అధికారులు తెలిపారు. డొంకరాయి డ్యామ్ నుంచి దిగువలకు నీటిని విడుదల చేయడంతో సీలేరు నది ప్రవాహ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జెన్కో అధికారులు సూచించారు. ఈ సమాచారాన్ని చింతూరు ఐటీడీఏ, రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు లోవ దేవస్థానానికి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. క్యూలో 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు, పూజా టికెట్లు, తలనీలాలు, వసతి గదుల అద్దెలు, విరాళాల ద్వారా రూ.3,93,652 ఆదాయం లభించిందని వివరించారు. ఏలేరు ఆయకట్టుకు నీటి విడుదల ఏలేశ్వరం: రబీ సాగు అవసరాల కోసం ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 83 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను నీటి నిల్వలు 17.40 టీఎంసీలు ఉన్నాయి. ఆయకట్టుతో పాటు విశాఖకు 200, పంపా జలాశయానికి 25, తిమ్మరాజు చెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. -
ప్రభుత్వం కుట్ర
అంబటి హత్యకు ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ● రంగంపేటలో కాగడాల ప్రదర్శన రంగంపేట: కాపు నేత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు హత్యకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసిందని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అంబటి అక్రమ అరెస్టుకు నిరసనగా గ్రామంలో ఆదివారం రాత్రి కాగడాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని దేవిగుడి సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గూండాలు పక్కా ప్రణాళికలతో అంబటి ఇంటిపై దాడి చేశారని, ఆ సందర్భంగా రాంబాబు దొరికితే చంపేసేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలేక పోతున్నారన్నారు. లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తేలడం, పార్టీ నాయకులు సీఎం చంద్రబాబును నిలదీస్తుండడంతో తట్టుకోలేక అంబటి రాంబాబును అంతం చేయాలనే ఈ దాడులు చేశారన్నారు. గతంలో కూడా పేద ప్రజల పక్షాన పోరాడిన కాపు నాయకులు వంగవీటి మోహన్రంగాను ఏ రకంగా అంతమొందించారో ప్రజలందరికీ తెలుసని, తరువాత ముద్రగడ పద్మనాభాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారన్నారు. అంబటిని పరామర్శించడానికి వెళుతున్న జక్కంపూడి రాజా, గణేష్లను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారన్నారు. అంటే వైఎస్సార్ సీపీ నాయకులు బయట తిరుగుతుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. కాపు నేతలను క్రమంగా అడ్డుతొలగించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్ ఇంటిపై కూడా కూటమి గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులను లేకుండా చేయడమే రెడ్బుక్ రాజ్యాంగం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా ప్రజల మద్దతు వైఎస్సార్ సీపీకి ఉందని ప్రజల అండ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు.ముకుందవరం–రంగంపేట గ్రామాల మధ్య హైడ్రామా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత కాగడాల నిరసనకు అనపర్తి నుంచి రంగంపేట వస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిని ముకుందవరం గ్రామం దాటిన తరువాత రంగంపేట, అనపర్తి ఎస్సైలు శివప్రసాద్, శ్రీనునాయక్లు తమ సిబ్బందితో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే కారును పోలీసులు అడ్డగించడంతో శ్రేణులు డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని తమ భుజాలపై మోసుకుంటూ రంగంపేట వైపు కొంత దూరం తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసుల నుంచి తప్పించి మోటార్ సైకిల్పై రంగంపేట తీసువచ్చారు. అప్పటికే కాగడాలతో సిద్ధంగా ఉన్న పార్టీ నాయకులు, శ్రేణులు విజయవంతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్ధాయిలో పాల్గొన్నారు. -
కట్టమూరులో పోలీసులపై దాడి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండల పరిధి కట్టమూరు గ్రామంలో శనివారం రాత్రి అసభ్యకర నృత్య ప్రదర్శన జరుగుతుందని సమాచారం మేరకు వెళ్లిన పోలీసులపై ఆకతాయిల మూక దాడి చేసింది.. ఆ వివరాల ప్రకారం.. కట్టమూరులోని జోడిగుళ్ల ఉత్సవాల్లో భాగంగా నాటిక ప్రదర్శన మధ్యలో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు పెద్దాపురం సీఐ విజయకుమార్ వెళ్లి ప్రదర్శన నిలుపుదల చేయాలని నిర్వాహకులకు చెప్పారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు రెచ్చిపోయి రాళ్లు విసరడంతో సీఐతో పాటు క్రైమ్ హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, రాధాకృష్ణ గాయపడ్డారు. అయితే హెచ్ కానిస్టేబుళ్లను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎస్సై వి.మౌనిక పరామర్శించారు. పోలీసులపై దాడి చేయడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.వివాహిత అదృశ్యంనిడదవోలు: ఓ వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.రవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గాలింకి విజయకుమారికి ఆమె భర్త సాయిబాబాతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 29న పుట్టింటికి వెళ్తానని విజయకుమారి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తల్లి కండెల్లి సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలురాజానగరం/ చాగల్లు: వైద్య విద్య పూర్తయ్యింది.. మరో వారం రోజుల్లో ఇంటికి వస్తానన్న కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల్లో విషాదం నిండింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23) రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెంటిస్ట్గా బీడీఎస్ పూర్తి చేసింది. ఐదేళ్ల కోర్సు పూర్తి కావడంతో ఈ నెల 7న ఇంటికి వచ్చేస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై దివాన్చెరువులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. స్థానిక జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో ఇంటర్న్షిప్ చేస్తున్న లిఖిత తనతో పాటే ఇంటర్న్షిప్ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన వట్టూరి వాత్సల్యసాయి, తునికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్ చదువుతున్న కిశోర్తో కలసి, అతని కారులో శనివారం రాత్రి స్నేహితుల పుట్టినరోజు వేడుకలకు రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని అటుగా ప్రయాణిస్తున్న వారు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయ్యింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బొమ్మూరు ఎస్సై తెలిపారు. శోకసంద్రంలో చాగల్లు లిఖిత మృతితో చాగల్లులో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్య విద్య పూర్తి చేసి దంత వైద్యురాలుగా సేవలందించాలనే తల్లిదండ్రుల కోటి ఆశలు తీరకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి చాగల్లులో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. లిఖిత మృతదేహం వద్ద తహసీల్దార్ ఎం.మెరికమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.ఆశారోహిణి, ఏఎంసీ చైర్మన్ నాదేండ్ల శ్రీరామ్, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు. -
పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల
● వివాహ సంబంధ సైట్ల ద్వారా పరిచయం ● ప్రతిపాదనలు పంపి ఆనక అడ్డంగా దోపిడీ ● ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు ● రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఒంటరి మహిళలను, భర్త లేని ఆడవారి వివరాలను తెలుగు మ్యాట్రిమొనీ, షాదీ డాట్ కామ్ల ద్వారా సేకరించి పెళ్లి నాటకమాడి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.లక్షలు దోచుకున్న ఘరానా మోసగాడు పోలీసుల చేతికి చిక్కాడు. అతని బాగోతం బయట పెట్టి, అతని నుంచి రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ వి.అప్పారావు విలేరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణకృష్ణ తెలుగు మ్యాట్రిమొనీల ద్వారా భర్తలు చనిపోయి, ఒంటరిగా ఉన్న మహిళల ప్రొఫైల్ ఎంచుకునే వాడు. తాను బంగారం వ్యాపారం చేస్తుంటానని వారిని పరిచయం చేసుకునేవాడు. వివాహ ప్రతిపాదన పంపిస్తూ ‘మీ వివరాలను తన తల్లిదండ్రులకు చూపానని, మీరు వారికి నచ్చారని, జాతకాలు చూపించానని, చిన్న దోషం ఉందని, గోదావరి స్నానాలు చేసి పూజ చేస్తే పరిహారం అవుతుంద’ని నమ్మబలికే వాడు. ‘రాజమహేంద్రవరం గోదావరిలో స్నానాలకు వస్తే, మా అమ్మానాన్నలను తీసుకువచ్చి పరిచయం చేస్తాన’ని వారికి చెప్పేవాడు. మీ దగ్గరున్న బంగారు వస్తువులను ధరించి చక్కగా చీర కట్టులో రావాలని, అప్పుడే మా అమ్మ నాన్నకు మీరు నచ్చుతారని చెప్పేవాడు. ఇలా హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, బస్టాండ్లకు రమ్మని చెప్పేవాడు. అక్కడకు వచ్చాకా వారిని కారులో పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ల వద్దకు తీసుకువెళ్లేవాడు. వారితో స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారు వస్తువులను తీసి బ్యాగులో పెట్టుకోమని చెప్పేవాడు. వారు స్నానం చేసి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునే గదిలోకి పంపిస్తూ, తాను వెళ్లి పూజ సామానులు తీసుకువస్తానని చెప్పి నమ్మించి ఆ ఆభరణాలతో పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దోచుకువెళ్లిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ నేరాలకు ఉపయోగించిన రెండు కార్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కర్ణాటక ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నాయి. నిందుతుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన సీఐ వి.అప్పారావు, ఎస్సై వై.యేసుబాబు, బి.సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్ కుమార్, కె.పవన్ కుమార్, యస్.రామకృష్ణలను ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
‘కొవ్వు’ మాటలపై ఇప్పుడే మంటారు?
కపిలేశ్వరపురం (మండపేట): ప్రపంచ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనీ, లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందంటూ గతంలో కూటమి నేతలు చేసినదంతా దుష్ప్రచారమని తేలిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. విచారణ అనంతరం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదంటూ సిట్ విచారణ నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. తమ రాజకీయ లబ్ధి కోసం చివరకు దేవుడి వ్యవహారాన్ని కూడా దుష్ప్రచారం చేసిన నేతలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చరిత్రలో నిలుస్తారని ఎమ్మెల్సీ తోట అన్నారు. మండపేటలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, మండపేట పట్టణం, రూరల్ కమిటీల కన్వీనర్లు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు పిల్లా వీరబాబులతో కలిసి ఎమ్మెల్సీ తోట విలేకరులతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలవలేదని సిట్ విచారణ నివేదిక తేటతెల్లం చేసిందని, గతంలో చేసిన దుష్ప్రచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన రోజుల్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేస్తున్నది దుష్ప్రచారమనీ, వారి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని నిబద్ధతతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిన విషయాన్ని ఎమ్మెల్సీ తోట గుర్తు చేశారు. రాజకీయాలను హుందాగా ప్రజాకోణంలో చేయాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా దేవుడి వ్యవహారంలో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. చంద్రబాబు బాటలోనే వేగుళ్ల చంద్రబాబు బాటలోనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నడుస్తున్నారన్నారు. సిట్ విచారణలో జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పగా కల్తీ జరిగిందంటూ ఎమ్మెల్యే వేగుళ్ల ప్రెస్మీట్ పెట్టి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే సిట్ విచారణ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని, చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. పైగా సిట్ విచారణపై వైఎస్సార్ సీపీ నేతలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే వేగుళ్ల అనడం విడ్డూరంగా ఉందన్నారు. తనను అలిపిరి ఘటన నుంచి రక్షించింది శ్రీవారే అని ఒక పక్కన చెబుతూ ఆ శ్రీవారినే రాజకీయాల్లోకి లాగడం ఏపాటి ధర్మమో చంద్రబాబు చెప్పాలన్నారు. పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసిన ఎవరినీ శ్రీ వేంకటేశ్వరస్వామి వదలడని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నపై చేస్తున్న ఆరోపణలు ఏమాత్రమూ సరికాదన్నారు. టీటీడీ ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంక్ ఖాతాల ఆధారంగా జరుగుతాయన్న సంగతిని కూటమి నేతలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆలీఖాన్ బాబా, మందపల్లి రవికుమార్, ఎర్రగుంట అయ్యప్ప, జొన్నపల్లి సత్తిబాబు, పోతుల రాంబాబు, పోతుల ప్రసాద్, యరమాటి వెంకన్నబాబు, దాసరి వీర వెంకట లక్ష్మి, వాసిరెడ్డి అర్జున్, కోళ్ళ శ్రీను, తీగిరెడ్డి మహేష్, మరివాడ సూరిబాబు పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం నెయ్యిలో కొవ్వు కలిసిందన్నారు కొవ్వు కలవలేదని సిట్ విచారణ నివేదిక ఇచ్చింది తమ ప్రయోజనాల కోసం దేవుణ్ణి రాజకీయం చేశారు చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై ఎమ్మెల్సీ తోట ఫైర్ 0000681473-000001-RJY ADSALES SPO 8.00x10.00 RJY ADSALES SPOT PAYMENT ACCOUNT -
గర్జించిన విద్యాలోకం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్ను రాజకీయ రాబందుల చేతిలోంచి రక్షించాలని, వెంటనే దానిని ప్రభుత్వం స్వాఽఽధీనం చేసుకోవాలని విద్యార్థులు కదం తొక్కారు. కొద్దిరోజులుగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టర్ బంగ్లా వద్ద వందల మంది విద్యార్థులు బైఠాయించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు విద్యార్థులకు, ఎస్ఎఫ్ఐ నాయకులకు గాయాలయ్యాయి. ముందుగా ఉన్నత విద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఆర్జేడీ బయటకు వచ్చినా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్కడి నుంచి విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. సమస్యలను రాసి వినతిపత్రం పట్టుకుని రమ్మని, దానిపై చర్చించి సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు సాయంత్రం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. మాజీ ఎంపీ భరత్ మద్దతు కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మద్దతు తెలియజేస్తూ విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకూ వారికి మద్దతుగా ఉంటామని, దీనిపై కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ జీవో నంబర్ 42 ప్రకారం కందుకూరి విద్యాసంస్థలు ఐదింటిలో నాలుగు ప్రభుత్వ పరం అయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ప్రతీ విద్యాసంస్థకి జీవోలు వచ్చాయని, అందులో భాగమైన కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల జీవో నెం 28 ప్రకారం స్థర, చర ఆస్తులతో 2022 నుంచి ప్రభుత్వ కళాశాలగా నడుస్తోందన్నారు. హితకారిణి సమాజం చైర్మన్, పాలకమండలి, ఎండోమెంట్ ఈఓ కలిసి కళాశాల ప్రిన్సిపాల్ లేని సమయంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ని దౌర్జన్యంగా లాగేసుకున్నారన్నారు. ఆ సమయంలో ఆర్జేడీ ఉన్నా దానిని ఆపలేదన్నారు. దానిని అడ్డుకున్న విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు బనాయించారన్నారు. కళాశాల మొత్తం క్యాంపస్ ప్రభుత్వానిదేనని, దీనిలో ఇతర డిపార్ట్మెంట్, హితకారిణి సమాజం ఎందుకు జోక్యం చేసుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మీ వుమెన్స్ కళాశాల హాస్టల్ తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి భారీ ఎత్తున ఆందోళన, ధర్నా చేసిన విద్యార్థులు పోలీసుల తోపులాటలో విద్యార్థులకు, ఎస్ఎఫ్ఐ నాయకులకు గాయాలు -
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
కాజులూరు: ద్వారపూడి–యానం రహదారిలో కాజులూరు మండలం కోలంక వద్ద ఆటో ఢీకొని దుగ్గుదుర్రు శివారు పొలమూరుపాడుకు చెందిన వినకోటి కొండబాబు (36) మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండబాబు తన మోటారుబైక్పై పాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కోలంక అటుకుల మిల్లు వద్దకు వచ్చేసరికి ద్రాక్షారామ నుంచి యానం వెళుతున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొండబాబు తలకు బలమైన గాయం కావడంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్సుకి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కొండబాబు మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్సై ఎం.మోహన్కుమార్ పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోలంకలో ఆటో డీ కొని మృతి చెందిన వినకోటి కొండబాబు -
పులి సంచరిస్తోంది.. అప్రమత్తం!
● చినకొండేపూడి–పెదకొండేపూడి మధ్య పాదముద్రల గుర్తింపు ● అవి పులివేనని ధ్రువీకరించిన రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజు సీతానగరం: మండలంలోని చినకొండేపూడి – పెదకొండేపూడి పంట పొలాల్లో పులి పాద ముద్రలను స్థానికుకులు గుర్తించి శనివారం అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వాటిని పులి పాద ముద్రలేనని ధ్రువీకరించారు. స్థానిక గెడ్డం రామకృష్ణ పంట పొలంలో గుర్తించిన ఆ పాద ముద్రలపై స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు జిల్లాలో ఇటీవల తిరుగుతున్న పులి ఇక్కడికి వచ్చి ఉండవచ్చని భావించిన రాజమహేంద్రవరం అటవీశాఖ రేంజ్ అధికారి ఎన్.దావీద్ రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా రేంజ్ అధికారి కొండలరావు తమ సిబ్బందితో క్షేత్రస్థాయికి వెళ్లి పాద ముద్రలను పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ ఎ.శ్రీనివాస్, ఎస్సై డి.రామ్ కుమార్ అక్కడికి చేరుకుని అటవీశాఖాధికారులో చర్చించారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి దావీదురాజు విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలవరం దగ్గరలో ఇటుక కోటలో శుక్రవారం రాత్రి పులి రెండు దూడలపై దాడి చేసి హతమార్చిందని, అక్కడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం వైపు వచ్చిందని, కాలువ వద్ద రాళ్లు ఉండటంతో పాద ముద్రలు పడలేదన్నారు. గోదావరి దాటి చినకొండేపూడి వైపు వచ్చిందన్నారు. ఆ పులి పాదముద్రలు, ఇక్కడ పాదముద్రలు ప్లగ్ మార్క్ ఒకటేనని గుర్తించామన్నారు. పులి పెదకొండేపూడి మీదుగా పురుషోత్తపట్నం అడవి వైపు వెళ్తున్నట్టుగా పాద ముద్రలు ఉన్నాయని తెలిపారు. పంట పొలాల్లోను, పెదకొండేపూడి గోశాల వద్ద, అనుమానిత ప్రాంతాల్లో సెన్సార్ ట్రాప్ కెమెరాలు అమర్చామని తెలిపారు. రైతులు ఎక్కడైనా పులి పాదముద్రలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు తమ పొలాలకు ఉదయం 8 గంటల తరువాతే వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తరువాత పంట పొలాల్లో ఉండవద్దని హెచ్చరించారు. పశువులను సాధ్యమైనంత వరకు గ్రామాల్లో కట్టుకోవాలని, లైట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళ బయటకు వెళ్లాల్సి ఉంటే గుంపులుగా వెళ్లాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి చినకొండేపూడి, పెదకొండేపూడి, చీపురుపల్లి, అచ్చియ్యపాలెం, నాగంపల్లి, పురుషోత్తపట్నం, మండలంలోని గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై రామ్ కుమార్ హెచ్చరించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
కల్యాణ వీణ.. మోగేటి వేళ..
● మాఘం నుంచి మోగనున్న మంగళ వాయిద్యాలు ● జూన్ వరకు మంచి ముహూర్తాలు ● వివాహ, అనుంబంధ రంగాల వ్యాపారాలకు అనువైన కాలం తాళ్లపూడి: మాఘమాసం ఎప్పడొస్తుందో.. మౌన రాగాలెన్ని నాళ్లో.. అని కూనిరాగాలు తీసే కన్నెపిల్లలకు కలిసొచ్చే కాలం వచ్చేసింది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని కల్యాణ శుభలేఖలు అచ్చు వేయించే మంచి ముహూర్తాలు ముంచుకొచ్చేస్తున్నాయి. సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. కాలానికి అనుగుణంగా ట్రెండ్ అందుకోకపోతే ఏదో మనం వెనకపడ్డామా అన్న ఫీలింగ్ వధూ వరులిద్దరిలోనూ ఉంటుంది. అన్ని రంగాల్లోను ఆధునిక సాంకేతికతలో మార్పులు వచ్చినట్టే వివాహ వేడుకలలోకీ దూసుకొచ్చేశాయి. ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్లు, డ్రోన్ ఫొటోగ్రఫీ, ఏసీ ఫంక్షన్ హాళ్లు, విద్యుత్ సెట్టింగ్లు, భారీ డెకరేషన్లు, రిసెప్షన్లు అన్నింటా పెద్ద మార్పులే చోటుచేసుకున్నాయి. ఇలాంటివి ఎన్నున్నా మామిడి తోరణాలు, తాటాకు పందిళ్లది మాత్రం ప్రత్యేక ఆకర్షణ. మాఘం ఆగమించడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జూన్ వరకు మంచి మూర్తాలు ఉండగా, జూలై 22 తరువాత నుంచి నవంబర్ 20 వరకు మళ్లీ ఖాళీ. దీంతో నియోజకవర్గంలో పెళ్లి సందళ్లు మొదలయ్యాయి. నియోజకవర్గంలో 19 వరకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. కొవ్వూరులో 7, తాళ్లపూడిలో 8, చాగల్లులో 4 వరకు కల్యాణ మండపాలున్నాయి. జోరుగా వ్యాపారాలు ఈ సీజన్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. దుస్తులు, బంగారం, ఇతర వస్తువుల కొనుగోళ్లు భారీగా సాగుతాయి. ఏసీ ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ పార్టీలు, పురోహితులు, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, టెంట్, లైటింగ్, డేకరేషన్, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఇలా అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. ఒక్కో పెళ్లి, ఫంక్షన్కు రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు కానుంది. ఏసీ కల్యాణ మండపాలపై ఆసక్తి ఇటీవల వివాహాది శుభకార్యాలకు ఏసీ కల్యాణ మండపాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, వేదికల సెట్టింగులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ఈ మండపాలు ఉన్నాయి. పెళ్లికి వారం రోజుల ముందు నుంచే వివిధ రకాల స్వాగత తోరణాలు, కల్యాణ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ కళ్యాణ మంపడం అయితే ఖర్చులన్నిటితో కలిపి రూ.80 వేల నుంచి సుమారు రూ. రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పచ్చి పూల మండపాలకు గిరాకీ నిశ్చయ తాంబూలాల నుంచి చిన్నచిన్న ఫంక్షన్లకు సైతం పచ్చిపూల మండపాలు ఏర్పాటు చేయడం తప్పనిసరైంది. ఒక్క వివాహానికి లైటింగ్, క్లాత్ సెట్టింగ్కు రూ.25 వేలు నుంచి రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. పచ్చిపూల మండపానికి అయితే రూ.25 వేల నుంచి రూ. 1.7 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అలాగే ఫ్లెక్సీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, పత్రికా ప్రకటనలకు, మ్యుజికల్ నైట్, స్కిట్లు, ఈవెంట్లకు అదనపు వ్యయం తప్పదు. ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్లు పెళ్లినాటి జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలం చేసుకోవడానికి ఫొటోలు తీయించుకోవడం అనవాతీ. పందిరి రాట మొదలు, అత్తవారింటికి వెళ్లే వరకు ఆ మధుర క్షణాలకు కొదవుండదు. అందుకు డిజిటల్ ఫొటో అల్బమ్ దగ్గర నుంచి వీడియోల వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకు డ్రోన్ టెక్నాలజీ, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, టీజర్లు, ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్లు, మెహందీ వంటివి నిర్వహిస్తున్నారు. క్యాటరింగ్ కల్చర్ బంధుజనాలు పది కాలాలు చెప్పుకొనేలా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు క్యాటరింగ్కు అప్పగిస్తూ భారీ మెనూతో భోజనాలు పెడుతున్నారు. అంతే కాకుండా అతిథులకు స్వాగత సత్కారాలు చేయడానికి కుందనపు బొమ్మల్లాంటి యువతులను సింహ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. 23 మంచి ముహూర్తాలు ఈ మాఘమాసం మొదలు జూలై 11 వరకు పెద్ద ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు కూడా ఊపందుకున్నాయి. ఐదు నెలల పాటు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో మాఘ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో, మార్చిలో 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్లో 15, 20, 21, 25, 26 తేదీల్లో, మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీల్లో, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో, జూలైలో 1, 6, 7, 11 తేదీల వరకు ఉన్న ముహూర్తాలలో పెళ్లిళ్లు జరగనున్నాయి.


