ప్రభుత్వం కుట్ర
అంబటి హత్యకు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్
సూర్యనారాయణరెడ్డి
● రంగంపేటలో కాగడాల ప్రదర్శన
రంగంపేట: కాపు నేత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు హత్యకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసిందని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అంబటి అక్రమ అరెస్టుకు నిరసనగా గ్రామంలో ఆదివారం రాత్రి కాగడాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని దేవిగుడి సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గూండాలు పక్కా ప్రణాళికలతో అంబటి ఇంటిపై దాడి చేశారని, ఆ సందర్భంగా రాంబాబు దొరికితే చంపేసేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలేక పోతున్నారన్నారు. లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తేలడం, పార్టీ నాయకులు సీఎం చంద్రబాబును నిలదీస్తుండడంతో తట్టుకోలేక అంబటి రాంబాబును అంతం చేయాలనే ఈ దాడులు చేశారన్నారు.
గతంలో కూడా పేద ప్రజల పక్షాన పోరాడిన కాపు నాయకులు వంగవీటి మోహన్రంగాను ఏ రకంగా అంతమొందించారో ప్రజలందరికీ తెలుసని, తరువాత ముద్రగడ పద్మనాభాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారన్నారు. అంబటిని పరామర్శించడానికి వెళుతున్న జక్కంపూడి రాజా, గణేష్లను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారన్నారు. అంటే వైఎస్సార్ సీపీ నాయకులు బయట తిరుగుతుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. కాపు నేతలను క్రమంగా అడ్డుతొలగించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్ ఇంటిపై కూడా కూటమి గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులను లేకుండా చేయడమే రెడ్బుక్ రాజ్యాంగం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా ప్రజల మద్దతు వైఎస్సార్ సీపీకి ఉందని ప్రజల అండ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు.
ముకుందవరం–రంగంపేట గ్రామాల మధ్య హైడ్రామా
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత కాగడాల నిరసనకు అనపర్తి నుంచి రంగంపేట వస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిని ముకుందవరం గ్రామం దాటిన తరువాత రంగంపేట, అనపర్తి ఎస్సైలు శివప్రసాద్, శ్రీనునాయక్లు తమ సిబ్బందితో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే కారును పోలీసులు అడ్డగించడంతో శ్రేణులు డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని తమ భుజాలపై మోసుకుంటూ రంగంపేట వైపు కొంత దూరం తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసుల నుంచి తప్పించి మోటార్ సైకిల్పై రంగంపేట తీసువచ్చారు. అప్పటికే కాగడాలతో సిద్ధంగా ఉన్న పార్టీ నాయకులు, శ్రేణులు విజయవంతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్ధాయిలో పాల్గొన్నారు.
ప్రభుత్వం కుట్ర
ప్రభుత్వం కుట్ర


