East Godavari District Latest News
-
నేతల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) శాఖ ఉద్యోగుల్లో బదిలీల భయం పట్టుకుంది. రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం సర్కిళ్ల పరిధిలో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈసారి పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని ఆ శాఖ అధికారుల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టింగ్ పొందడంపై దృష్టి పెడుతున్నారు. అందుకు తమకు అనుకూలమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎవరిని సంప్రదిస్తే పని సులువుగా అవుతుంది. ఏ నేతను ఆశ్రయించాలన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న రాజమహేంద్రవరం సర్కిల్పై కొందరు ఉద్యోగులు కన్నేశారు. ఎలాగైనా ఇక్కడ స్థానం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు తమకు పరిచయం ఉన్న టీడీపీ నేతలను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా పైరవీలు చేస్తున్నారు. ఎలాగైనా తాము ఆశించే సీటును కై వసం చేసుకునేందుకు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం. ఫెవికాల్ వీరులకు చెక్ పడేనా? రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలోని విద్యుత్ శాఖలో కొందరు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. అక్రమాదాయం ఉండటంతో బదిలీల సమయంలో ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించి తమ స్థానాలు పదిలం చేసుకుంటున్నారు. అలాంటి అధికారులకు ప్రస్తుతం చెక్ పడే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. పోలవరం సర్కిల్ పరిస్థితేంటో? నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాకు ప్రత్యేకంగా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయాన్ని కేటాయించారు. కానీ అధికారుల నియామకం మాత్రం జరగలేదు. కలెక్టర్ను నియమించిన ఉన్నతాధికారులు వచ్చే నెలలో జరిగే బదిల్లో ఎస్ఈ పోస్టు భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అందులో భాగంగా పోస్టు కోసం ఇప్పటికే పైరవీలు మొదలయ్యాయి. పోలవరం ఎస్ఈగా వెళ్లేందుకు ఏలూరు సర్కిల్లోని ఓ ఈఈ, వైజాగ్ కార్పొరేట్ కార్యాలయంలోని ఓ ఈఈ పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు. చివరికి ఎవరు విజయం సాధిస్తారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వచ్చే నెలలో బదిలీలు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఏప్రిల్ నెలలో సాధారణ బదిలీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పరిణామం ఉద్యోగుల్లో ఉత్కంఠను రేపుతోంది. ముందస్తుగా మేల్కొంటున్న అధికారులు తమకు అనువైన పోస్టింగ్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్) పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. కోనసీమ సర్కిల్ ఎస్ఈ స్థానానికి ఓ ఈఈ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన అదే శాఖలో ఈఈ టెక్నికల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీలు జరిగితే ఎలాగైనా ఎస్ఈ స్థానం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మంత్రి, ఎమ్మెల్యేలతో సైతం సిఫారసు చేయించినట్లు తెలిసింది. కాకినాడ ఎస్ఈ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన ఎస్ఈ నియామకం తప్పనిసరి. అతని స్థానం కోసం కోనసీమ సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిణి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. సదరు అధికారిణికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో కాకినాడ ఎస్ఈకి లైన్ క్లియరైనట్లు సమాచారం. జగ్గంపేట ఈఈ పోస్టు కోసం రాజమహేంద్రవరం సర్కిల్లో కన్స్ట్రక్షన్ (నిర్మాణం) విభాగంలో ఓ ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అమలాపురం ఎస్ఏఓ (సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్) పోస్టు కోసం గతంలో పనిచేసిన ఓ అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. భీమవరం సర్కిల్ ఎస్ఈ స్థానానికి మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఈఈ, ఏలూరు సర్కిల్ ఎస్ఈ పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. భీమవరం సర్కిల్ ఏఓ రెవెన్యూ పోస్టుకు విశాఖలోని కార్పొరేట్ కార్యాలయంలో ఇద్దరు, రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. విద్యుత్ శాఖలో బదిలీల ఫీవర్ వచ్చే నెలలో భారీగా మార్పులు చేపట్టాలన్న యోచన అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్న ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు రాజకీయ నేతల వద్దకు క్యూ కడుతున్న వైనం జీతం కంటే.. గీతం వచ్చే స్థానాలపై కన్ను పోలవరం సర్కిల్కు ఎస్ఈ నియామకంపై మీమాంస -
నా ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాడతా
మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సిటీ: నా ఇంటిపై దాడి చేసి, వాహనాలను తగులు పెట్టిన వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వారికి శిక్ష పడేదాకా పోరాడుతానని రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా నగేష్ను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తనపై అత్యంత కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో40 శాతం ఓట్లు ఉన్న పార్టీలో, 20 శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంలో నేను ఒక నాయకుడినన్నారు. ప్రభుత్వం అక్రమంగా నన్ను జైల్లో పెట్టిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎంతోమంది నాకు అండగా నిలిచారన్నారు. వారందరినీ కలిసి కృతజ్ఞత చెప్పేందుకు గోదావరి జిల్లాకు వచ్చానన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. ఆర్ఆర్ఆర్, ఫ్లడ్ మేనేజ్మెంట్కు సహకారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆర్ఆర్ఆర్, ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులకు సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఒక హాటల్లో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లకు అనుమతులు వచ్చేలా సహకరించాలని కోరారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలన్నారు. కాంతారావును కలెక్టర్ కలెక్టర్ కీర్తి మర్యాద పూర్వకంగా కలిశారు. 28న జాబ్మేళా కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే బుధవారం తెలిపారు. డిగ్రీ, పీజీ పాసైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 30 కంపెనీలతో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు తమ బయోడేటా, సరిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల జేకేసీ విభాగంలో సంప్రదించవచ్చన్నారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదు మానవ హక్కుల చైర్పర్సన్ శైలజ తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, పోలీస్శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. అఘాత్యానికి పాల్పడినది ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
సీతమ్మ వారికి కోవా సారె
పి.గన్నవరం: స్థానిక వైనతేయ నదీ తీరాన కొలువైన పట్టాభి రామస్వామి ఆలయంలో ఈ నెల 27న జరుగనున్న సీతారాముల కల్యాణోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు కోవా స్వీట్లతో తయారు చేయిస్తున్న కంత (సారె) భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మహోత్సవంలో రాముల వారి తరఫున సీతమ్మవారికి ఈ కంతను సమర్పిస్తారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలు, చీరలు, పూల సజ్జ వంటి ఆకృతుల్లో కోవాతో తయారు చేస్తున్న స్వీట్లు కనువిందు చేస్తున్నాయి. గత 17 ఏళ్లుగా ఈ ఆనవాతీని వారు కొనసాగిస్తున్నారు. ఈ కల్యాణానికి 20 రోజుల ముందుగా 100 రకాలకు పైగా కోవా స్వీట్లు, మరో 100 రకాల పిండి వంటలు తయారు చేయిస్తారు. స్వీట్లు, పిండి వంటల తయారీలో స్థానిక శ్రీరామ్ గార్డెన్స్కు చెందిన మహిళలు సహకరిస్తున్నారు. ఈ సారెకు 30 రకాల పండ్లను చేర్చి సీతమ్మకు కంతను సమర్పిస్తారు. సీతా రాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. -
నిరాశజనకంగా పొగాకు మార్కెట్
దేవరపల్లి: పొగాకు మార్కెట్ పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం టుబాకో బోర్డు రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు జంగారెడ్డిగూడెంలో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్ కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం కొయ్యలగూడెం వేలం కేంద్రాలో వేలం ప్రారంభించారు. గోపాలపురం వేలం కేంద్రంలో కొనుగోళ్లను రైతులు నిలుపుదల చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో కిలో గరిష్ఠ ధర రూ.265 పలకడంతో రైతులు నిరసన వ్యక్త చేశారు. దీంతో గోపాలపురం వేలం కేంద్రం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లను రైతులు నిలుపుదల చేశారు. ఓ దశలో రైతులు, బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది. బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరిరావు, చైర్మన్ యశ్వంత్ మధ్య వాదోపవాదాలు జరగ్గా, కొంతమంది రైతులు గో బ్యాక్ చైర్మన్ అంటూ నినాధాలు చేశారు. మార్కెట్ ఆశాజనకంగా లేదని, గత ఏడాది కిలో గరిష్ఠ ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ. 265తో ప్రారంభించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బోర్డు చైర్మన్, కార్యదర్శి చర్చలు జరిపి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి అంగీకరించకపోవడంతో వేలం నిలుపుదల చేశారు. కిలో గరిష్ఠ ధర రూ. 300 ఉండాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం దేవరపల్లి వేలం కేంద్రంలో వేలం ప్రారంభానికి సిద్ధం కాగా రైతులు అడ్డుకున్నారు. గరిష్ఠ ధర రూ. 300 ఇవ్వాలని, రూ.265 ధరకు కొనుగోలు చేయవద్దని రైతులు అధికారులకు వివరించారు. దీంతో అధికారులు, బోర్డు చైర్మన్ రైతులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించి మూడు రోజుల్లో గుంటూరు బోర్డు కార్యాలయంలో కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మార్కెట్పై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు కొనుగోళ్లు ఆపవద్దని రైతులకు సూచించారు. మార్కెట్లో ధర గిట్టుబాటుగా లేనందున గుంటూరులో సమావేశం జరిగే వరకు కొనుగోలు చేయవద్దని రైతులు చెప్పడంతో వేలం ప్రారంభించకుండా నిలుపుదల చేసి అధికారులు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు బోర్డు చైర్మన్ వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్, రైతు సంఘాల ప్రతినిధులతో సంప్రదించి, కొనుగోలుకు అంగీకరింపజేయడంతో ఎట్టకేలకు వేలం నిర్వహణాధికారి హేమస్మిత వేలం నిర్వహించారు. తొలిరోజు చెరుకుమిల్లి గ్రామం నుంచి 27 బేళ్లు వేలానికి రాగా, 24 బేళ్లు అమ్ముడు పోయాయి. 2,056 కిలోల పొగాకు కొనుగోలు చేసినట్టు హేమస్మిత తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.265 పలికినట్టు ఆమె తెలిపారు. రీజనల్ మేనేజరు సురేంద్ర కుమార్, రైతు సంఘాల ప్రతినిధులు కాట్రు సత్యనారాయణ, యాగంటి వెంకటేశ్వరరావు, ఆచంట గోపాలకృష్ణ, సత్తి జగదీశ్వరరెడ్డి, సుంకవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గోపాలపురంలో నిలిచిన వేలం మార్కెట్ పట్ల రైతుల నిరసన బోర్డు చైర్మన్, రైతుల మధ్య వాగ్వాదం నాలుగు వేలం కేంద్రాల్లో ప్రారంభమైన కొనుగోళ్లు -
నేటి నుంచి రాములోరి పెళ్లి వేడుకలు
రత్నగిరిపై తొమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీరామనవమి వేడుకలు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారామచంద్రస్వామివారి శ్రీరామనవమి వేడుకలు చైత్ర శుద్ధ అష్టమి, గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా దేవస్థానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రత్నగిరి రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ఈ నెల 21వ తేదీన రామాలయం వద్ద ఘనంగా పందిరి రాట ముహూర్తం చేసిన విషయం తెలిసిందే. నేడు వధూవరులను చేయడంతో వేడుకలు ప్రారంభం గురువారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు రత్నగిరి పై నిర్వహించనున్నారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా పూజలందుకుంటున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా నిర్వహించడం ఆనవాయితీ. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులను చేస్తారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. 28 తేదీన ప్రత్యేక పూజలు, 29 తేదీన పండిత సదస్యం, 30, 31 తేదీలలో సీతారాములకు ప్రత్యేక పూజలు, ఏప్రిల్ ఒకటో తేదీన సీతారాముల వారి వన విహారోత్సవం, రెండో తేదీన శ్రీ చక్రస్నానం, దండియాడింపు, మూడో తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
హత్యాయత్నం చేసినవారిని స్వేచ్ఛగా వదిలేస్తారా?
అనపర్తి: తన భర్తపై హత్యాయత్నం చేసిన నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో తమ కుటుంబం ప్రాణభయంతో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తోందని బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ తమలంపూడి దుర్గారెడ్డి భార్య లలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక వినాయక నగర్లో నివసిస్తున్న దుర్గారెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. ఈ నెల ఐదో తేదీ రాత్రి సుమారు 8:30 గంటలకు నూజివీడు నుంచి ఇంటికి వచ్చిన దుర్గారెడ్డి బయటకు వెళ్లి వస్తానని భార్యతో చెప్పి రాత్రి 10:30 అవుతున్నా తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. మరికొద్ది సేపటికి ఫోన్ చేస్తే తరవాత వస్తాను ఆగు అని మెసేజ్ పెట్టారని లలిత చెప్పారు. మళ్లీ 11:42 గంటలకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో తెలిసినవాళ్లందరికీ ఫోన్లు చేసి తలో దిక్కూ వెతికినట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిందితులలో ఒకరైన స్థానికుడు కొవ్వూరి రాజేష్రెడ్డి ఆ అర్ధరాత్రి 01:22 గంటలకు లలిత తమ్ముడు కృష్ణారెడ్డికి ఫోన్ చేసి తమ ఇంటికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా దుర్గారెడ్డి తీవ్ర రక్తగాయాలతో ఇంటి వద్ద మెట్లపై పడి ఉన్నాడని లలిత తెలిపారు. దీంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి, హుటాహుటిన అతడిని రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దుర్గారెడ్డిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని కడుపులో రక్తస్తావం ఎక్కువైందని, ప్రాణాలకు ప్రమాదమని చెప్పారన్నారు. అప్పటికే దుర్గారెడ్డి అపస్మారకస్థితిలో ఉన్నాడని తెలిపారు. రాజేష్రెడ్డి, అతని సోదరుడు, మరి కొందరు కలసి కర్రలతో తీవ్రంగా కొట్టి, కడుపులో బలంగా పొడవడంతో ఇలా జరిగిందని, వెంటనే శస్త్ర చికిత్స చేయడంతో ప్రాణాలు దక్కాయని లలిత పేర్కొన్నారు. వీపు పైన, మర్మాంగాల పైన తీవ్రంగా కొట్టడంతో సుమారు 15 రోజులు అపస్మారక స్థితిలోనే ఉన్నారని ఆమె తెలిపారు. అధికారపక్షం చేస్తున్న అవినీతి, ఆక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుండడం వల్లే ఆయనపై కక్షతో అధికార పార్టీ నాయకులు రాజేష్రెడ్డి ద్వారా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారు. నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి స్వేఛ్ఛగా వదలి వేయడం ఏమిటో అర్ధం కాలేదని ఆమె వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లలిత ఆ ప్రకటనలో కోరారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ దుర్గారెడ్డిపై దాడి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ఆవేదన తన కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టాలని బాధితుడి భార్య లలిత వేడుకోలు -
వాడపల్లి వెంకన్నకు రూ.1.82 కోట్ల ఆదాయం
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరునికి హుండీల ద్వారా 27 రోజులకు రూ.82,94,288 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఆలయ ఆవరణలో బుధవారం జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు పీవీఎస్ కామేశ్వరరావు, బి.కిరణ్ల సమక్షంలో హుండీలు లెక్కించారు. హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,47,36,474, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.35,57,814 లభించాయన్నారు. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు, 12 దేశాలకు చెందిన 51 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, రావులపాలెం కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ల సిబ్బంది పాల్గొన్నారు. భీమేశ్వరుని హుండీ ఆదాయం రూ.15.74 లక్షలు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలో కొలువై ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.15,74,920 వచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈనెల 25 వరకు 42 రోజులకు ఈ హుండీలను లెక్కించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.26,333 వచ్చిందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమాన్ని రామచంద్రపురం డివిజన్ ఆలయ తనిఖీదారు ఆర్.బాలాజీ రాంప్రసాద్ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ ఈఓ టి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ పోలీస్ సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దాడి కేసులో ముగ్గురి అరెస్టు అమలాపురం టౌన్: అమలాపురం రోహిణి ఆస్పత్రి వీధిలో గత సంక్రాంతి పండుగ రోజుల్లో ఇద్దరిపై దాడి చేసి డబ్బులు కాజేసిన కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. అప్పట్లో స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన పాలెపు గంగరాజు, దుర్గా ప్రసాద్లపై పట్టణంలోని వడ్డెర (ఉప్పర) కాలనీకి చెందిన వేముల సీత, గుంజు దేవి, వేమల దత్తాత్రేయలు దాడి చేశారన్నది అభియోగం. ఈ ఫిర్యాదుపై పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు కేసు నమోదు దర్యాప్తు చేశారు. ఈ ముగ్గురి నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, మరి కొంత మందిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఎస్సై కిషోర్బాబు తెలిపారు. రైలు నుంచి పడి వ్యక్తి మృతిరాజమహేంద్రవరం సిటీ: కొవ్వూరు రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్ల మధ్య గోదావరి ఆర్చ్ బ్రిడ్జి పై సుమారు 27 ఏళ్ల వయసున్న వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి మృతి చెందాడని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వై.నాగేశ్వరావు బుధవారం తెలిపారు. మృతుడు 5.4 అడుగులు ఎత్తు, లైట్ బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్, లైట్ గ్రీన్ కలర్ చొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్ నంబరు 0883 2442821, అధికారి సెల్ నెంబర్ 9154578496ను సంప్రదించాలన్నారు. -
‘ఆదిరెడి’్డ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల
● అట్రాసిటీ కేసు నమోదు చేసి టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ ● అప్పారావు వైఖరిపై అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన సాక్షి, రాజమహేంద్రవరం: దళితులను కించపరుస్తూ మాజీ ఎమ్మెల్సీ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ, దళితుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఆదిరెడ్డి అహంకార తీరుకు నిరసనగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. దళితులను అవమానించిన ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఆదిరెడ్డి అహంకార పూరిత వైఖరిని ఖండిస్తూ.. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతలు, దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ఆదిరెడ్డి అరాచకాలు నశించాలని, దళితులకు క్షమాపణ చెప్పాలి, ఆదిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నివాళులు అర్పించి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయి : సుధాకర్బాబు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తండ్రిగా, ప్రజా ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమని, వివక్షతో కూడుకున్నవన్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలోని దళిత నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : జడ శ్రావణ్కుమార్ ప్రముఖ న్యాయవాది, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ టీడీపీలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు దళిత వర్గాలను వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు.. ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయపరంగా ఏ స్థాయి వరకు అయినా వెళ్లి కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పారావు విషయంలో టీడీపీలోని దళిత నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అప్పారావు మాట్లాడిన విధంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడి ఉంటే.. కేసులు పెట్టి జైలుకు పంపించేవారన్నారు. దళితుని మృతదేహాన్ని ఒక వీధిలోకి రాకుండా అడ్డుకున్న ఘటన సిగ్గుచేటన్నారు. టీడీపీకీ దళితుల రక్షణ ఆలోచన లేదా : మాజీ ఎంపీ భరత్రామ్ మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దళితులపై దూషణ, దాడుల సంఘటనలో అప్పారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఆదిరెడ్డికి టీడీపీ అధిష్టానం కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ దళితుల రక్షణపై ఆ పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం, రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్సీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితులకు వివక్ష తప్పడం లేదన్నారు. ఆదిరెడ్డిపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో స్పష్టం చేయాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి పోలీసులు విలువ ఇవ్వడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఒక వివాదంలో పెద్దమనిషిగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధి దళితులను కులం పేరుతో దూషించడం, చంపేస్తానని బెదిరించడం, దాడులు చేయడం గర్హనీయమన్నారు. కేసు కట్టేంతవరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులు ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడతారా? రాష్ట్రంలో ఏ రాజ్యాంగం నడుస్తోందని ప్రశ్నించారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు కూడా దళితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీలను టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నాయకులు ప్రదర్శనగా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ఆదిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయసారధి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నాయకులు కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పులి బాటలో.. వేట!
● ట్రాకర్ సాయంతో ముందుకు వెళ్తున్న అటవీ అధికారులు, సిబ్బంది ● ఎర్రంపాలెం వైపు వెళ్లినట్టు గుర్తింపు గంగవరం: జిల్లాలో గంగవరం మండలంలో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలకు పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దొరమామిడికి వెళ్లే రహదారిలో కొండ సమీపంలో పులిని బంధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐనా పులి చిక్కలేదు. బుధవారం తెల్లవారే సరికి దొరమామిడి మార్గంలోనే దుంప తోటలో ఒక ఆవును హతమర్చి పాత కొత్తాడ, టేకులవీధి, ఎర్రంపాలెం వైపు పులి పయనించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది పులి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా అడ్డతీగల, ఫోక్స్పేట ఫారెస్టు రేంజ్ అఽధికారులు డివిజనల్ అటవీ శాఖాధికారి శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్–డీఎఫ్ఓ జేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం రాత్రి కొంత మంది అటవీశాఖ బీట్ అధికారులు, బేస్ క్యాంప్ హెల్పర్లు కొండ పైభాగానికి వెళ్లి మరీ పులిని బంధించే ప్రయత్నం చేశారు. -
ముగిసిన నక్షత్ర నవగ్రహ శివ పంచాయతన యాగం
స్వామివారిని దర్శించుకున్న నగరి మాజీ ఎమ్మెల్యే రోజా అల్లవరం: మండలం దేవగుప్తంలోని ఉమాపార్వతి సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా జరిగిన నక్షత్ర నవగ్రహ శివ పంచాయతన, సుబ్రహ్మణేశ్వర యాగం బుధవారంతో ముగిసింది. వేద పండితులు పోచినపెద్ది శ్యామ్శర్మ ఆధ్వర్యంలో బుధవారం మహా పూర్ణాహూతి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ చింతా అనురాధతో కలిసి పట్టువస్త్రాన్ని సమర్పించారు. అనంతరం యాగశాలలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ యాగశాలను సందర్శించి మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి రాము, సర్పంచ్ సాధనాల వెంకటరావు, తిక్కా ప్రసాద్, చిట్టూరి వెంకటనారాయణ, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో..సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బుధవారం మాజీ మంత్రి రోజా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అయినవిల్లిలో.. అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామివారిని మాజీ ఎమ్మెల్యే, నగరి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి రోజా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు, ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు వేదాశీర్వచనం చేసి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
గాలికుంటు.. టీకాతో సరి..
● ఎన్ఏడీపీలో భాగంగా ఏప్రిల్ 13 వరకు పంపిణీ ● జిల్లాలో 2.31 లక్షల టీకాల లక్ష్యంనివారణ చేపట్టండిలా ● పశువులు బాగా బలహీనంగా ఉంటే గ్లూకోజ్ రక్తంలోకి ఇవ్వాల్సి ఉంటుంది. ’నోటిలో పుండ్ల వలన మేత మేయవు. కనుక వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి. ● జావ, జొన్న, అన్నం, ఉప్పు, బెల్లంతో కలిపి నిత్యం తాగించడం ద్వారా అవి బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. ● వీటి మల మూత్రాలను గడ్డిలో కాల్చివేయాలి. చనిపోయిన పశువులను సున్నపు గోతిలో పూడ్చాలి. చికిత్స ● కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావకాలతో కడిగి నీమ్లెంట్, వేపనూనె పూయాలి. ● నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్ చల్లి గ్లిజరిన్ కలిపి పూయాలి. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి. రాయవరం: వ్యాధులు దాడి చేయడం ద్వారా పశువుల్లో పాల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. ఒక్కో సమయంలో అవి ప్రాణాలు కూడా కోల్పోతాయి. అటువంటి ప్రమాదకర వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా పేర్కొంటారు. పశు పోషకులు సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులను కాపాడుకోవచ్చునంటున్నారు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి.శ్రీనివాసరావు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ఏడీపీ) 8వ విడతలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెల 16న సామూహిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 13 వరకూ ఈ పంపిణీ సాగనుంది. వ్యాధి లక్షణాలు ● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నపుడు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువ. ● వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. వేడిని తట్టుకోలేవు. ● వ్యాధికి గురైన పశువుకు తీవ్రమైన జ్వరం కన్పిస్తుంది. ● పాల దిగుబడి తగ్గడం, నోరు, మూతి, కాళ్లు, పొదుగు మీద పుండ్లు, బొబ్బలు కనపడటం, కాళ్లు కుంటడం, నోటి నుంచి విపరీతంగా నురగ కారడం వంటి లక్షణాలు ఉంటాయి. ● వ్యాధి సోకిన గేదె, ఆవు పాలు తాగే దూడల్లో మరణాలు ఉంటాయి. వ్యాధి సోకిన గేదె, ఆవు పాలను దూడలు తాగకుండా చూసుకోవాలి. ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుంది ● మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది. ● వ్యాధి వల్ల మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి సామర్ధ్యం తగ్గుతుంది. ● జ్వర తీవ్రత 104–106 డిగ్రీల ఫారన్హీట్ వరకు పెరిగి పశువులు నీరసిస్తాయి. ● పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. నోటి ఎపిథీలియం (పైపొర), పళ్లు, చిగుళ్లు, నాలుక, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికి పోవడం వల్ల పశువులు నొప్పితో మేత తినవు. ● నోటి నుంచి చొంగ కారుతుంది. ● చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. ● పశువులు శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ ఎండవేడి తట్టుకోలేక నీరసిస్తాయి. వ్యాప్తి చెందుతుందిలా ● నోరు, కాలు వ్యాధికి గురైన పశువుల అంతఃస్రావాల (లాలాజలం, పుండ్ల నుంచి కారే రసి) వల్ల వ్యాధి మిగతా పశువులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ● వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఒక చోట నుంచి మరో చోటుకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ● సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధి బారిన పడతాయి. జిల్లాకు 2.31లక్షల డోసులు జిల్లాలోని పశువులకు అవసరమైన డోసుల్లో మొదటి దశలో 2.31 లక్షల డోసులు జిల్లాకు చేరుకున్నాయి. నాలుగు నెలల పైబడి ఉన్న పశువులకు మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. నాలుగు నెలలు దాటి తొలిసారి టీకాలు వేయిస్తున్న దూడలకు నెల రోజుల తర్వాత బూస్టర్ డోస్ వేస్తారు. జిల్లాలో 74 వేలు వైట్ క్యాటిల్స్, 1.86 బ్లాక్ క్యాటిల్స్ ఉన్నాయి. పశువైద్యశాఖ ద్వారా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు కూడా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేశారు. -
చంద్రబాబు పాలనలో క్రైస్తవులకు రక్షణ కరవు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో క్రైస్తవులకు రక్షణ కరవైందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కొంతమూరులోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు విజయసారథి ఆధ్వర్యంలో మంగళవారం పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా క్రైస్తవ సభ నిర్వహించారు. జాన్వెస్లీతో పాటు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, రా ష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రవణ్ కుమార్, ఉప కార్యదర్శి వై.రాజా, తూ ర్పుగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు తరలివచ్చి.. పాస్టర్ ప్రవీణ్ పగడాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ క్రైస్తవులను అణగతొక్కాలనే చూస్తోందన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి అప్పారావు ఇటీవల దళితుడైన జాన్ను చంపేస్తానని, లేపేస్తానని దుర్భాషలాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. జిల్లా అధ్యక్షుడు మారేళ్లపూడి విజయసారథి మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఈ రోజును క్రైస్తవ ఐక్యత దినంగా పాటించబోతున్నామన్నారు. ఫ వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ ఫ పాస్టర్ ప్రవీణ్ పగడాల వర్ధంతి సభ ఫ పాల్గొన్న మాజీ ఎంపీ భరత్రామ్ -
31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్నులే ప్రధాన ఆధారమని, ఈ నెల 31వ తేదీ నాటికి నూరు శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ మైలవరపు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపర్చుకోని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలలో భారీ మొత్తంలో పన్నులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి రూ.82 కోట్ల పన్ను వసూలు జరిగినట్లు తెలిపారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగిలిన పన్నుల వసూలు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ సీఈవో వీవీ లక్ష్మణ్, డీడీవోలు పి.వీణాదేవి, ఎ.స్లీవారెడ్డి, డీఎల్పీవో ఎం.నాగలత తదితరులు పాల్గొన్నారు. -
క్షయ వ్యాధిపై అవగాహన అవసరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వీడి, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ముందుగా రాబర్ట్ కోచ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. క్షయ వ్యాఽధిపై నిర్వహించిన అవగాహన పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1882లో రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికి కారణమైన జీవాణువును కనుగొనడం వైద్య రంగంలో ఒక గొప్ప మైలురాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ ఎన్.వసుంధర మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజల భాగస్వామ్యం కీలకం అనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం పొగాకు కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు బయట అమ్మకాలను నియంత్రించడానికి గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ జంగారెడ్డిగూడెంలో వేలం ప్రారంభిస్తారని, అనంతరం ఐదు వేలం కేంద్రాలను సందర్శిస్తారన్నారు. గ్రామస్థాయి విజిలెన్స్ కమిటీలకు రైతులు సహకరించాలని, పొగాకు అక్రమ అమ్మకాల సమాచారాన్ని విజిలెన్స్ కమిటీకి తెలియజేయాలన్నారు. గత ఏడాది ఐదు వేలం కేంద్రాల్లో సుమారు 4 మిలియన్ల కిలోల పొగాకు బయట అమ్మకాలు జరిగినట్టు సమాచారం ఉందన్నారు. ఈ ఏడాది కిలో సగటు ధర రూ.320 లభించవచ్చునని తెలిపారు. సమావేశంలో వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత, పొగాకు రైతు సంఘం ప్రతినిధులు కాట్రు భీమరాజు, సత్తి జగదీశ్వరరెడ్డి, యాగంటి వెంకటేశ్వరరావు, దుద్దునూడి హరిబాబు, రైతులు పాల్గొన్నారు. -
జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన
వైఎస్సార్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా చేసింది. ఇదిలా ఉండగా జగన్ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడేసి నియోజకవర్గాలతో ఒక జిల్లాను జగన్ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. -
కాసులకే కూటమి నాయకుల ప్రాధాన్యం
కడియం: కాసులు కూడబెట్టుకునేందుకే కూటమి నాయకులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గోదావరి లంకల్లో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలే దీనికి నిదర్శమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం వీరవరం రెవెన్యూ పరిధిలోని గోదావరి లంకల్లో సర్వే నెం.147లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంలో నాయకులు.. సొమ్ములను కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అధికారులను ప్రలోభపెట్టో, భయపెట్టో, వారితో నిరంకుశంగా వ్యవహరించో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. పదే పదే మీడియాలో వైఎస్సార్ సీపీ ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఉందన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో ఒక భారీ అవినీతి కార్యక్రమం ఇక్కడ జరుగుతోందన్నారు. పూలతోటలు సాగు చేసే భూములకు పక్కనే గోదావరి లంకల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్, ఇప్పుడు మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ 2022లో ఇక్కడ తవ్వకాలు జరుగుతుంటే చాలా హడావుడి చేశారని గుర్తు చేశారు.లంకల్లో మట్టి తవ్వితే ఆ గోతుల్లో జింకలు పడి చచ్చిపోతాయని, పర్యావరణానికి తీరని నష్టం ఆందోళనకు దిగారన్నారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మట్టి దోపిడీ జరుగుతుంటే వారిద్దరూ ఏమైపోయారో అర్థం కావడం లేదన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కూడా గతంలో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలను ఆయన దృష్టికి తానే స్వయంగా తీసుకువచ్చానన్నారు. కానీ ఆయన స్పందించడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధం వేణు మాట్లాడుతూ అధికారులు అనుమతులిచ్చిన భూములకు మూడు బ్యాంకుల్లో లోన్లు తెచ్చారన్నారు. ఆ రుణాలు తీర్చకపోవడంతో బ్యాంకర్లు ట్రిబ్యునల్కు వెళ్లారన్నారు. అక్కడ తీర్పు పెండింగ్లో ఉండగా సదరు భూముల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. రూ.2 వేలకు బిల్లు ఇచ్చి రూ.9 వేల నుంచి రూ.12 వేలకు మట్టి అమ్ముతున్నారన్నారు. నదీ గర్భంలో మట్టి తీయడం వాల్టా చట్టానికి వ్యతిరేకమని, అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలులో ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేదన్నారు. మట్టి తవ్వకాల కారణంగా వరదల సమయంలో పక్కనే ఉన్న తమ పొలాలు కూడా కోతకు గురవుతాయని సమీప రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అక్రమ తవ్వకాలకు కలెక్టర్, మైన్స్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాలని వేణు అన్నారు. ప్రతి దానికీ స్పందించే బుచ్చయ్య.. ఇక్కడ జరిగే తప్పులపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభు త్వం పనితీరు కారణంగా పోలవరం ప్రాజెక్టులో రూ.వెయ్యి కోట్ల ప్రజల సొమ్ము గంగపాలు చేశారని, ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న భూముల్లో అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. వైఎస్సార్ సీపీ నాయకుల పరిశీలన నేపథ్యంలో అక్రమ తవ్వకాలను నిలిపివేసి, యంత్రాలు, లారీలను అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు, మండల అధ్యక్షుడు యాదల సతీష్చంద్ర స్టాలిన్, నాయకులు ఈలి గోపాలం, తాడాల విష్ణుచక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, బోడపాటి సత్య నారాయణ, తిరుమలశెట్టి శ్రీనువాసు, కొత్తపల్లి మూర్తి, గాద రామకృష్ణ, సింగంశెట్టి శ్రీను, మార్గాని బలరాం, రత్నం కృష్ణ, తిరుకోటి నాగేశ్వరరావు, సాకా కిరణ్కుమార్, నరమామిడి బాలరాజు, ఈలి కొండబాబు, ఎంపీటీసీ ఆకుల సుధాకర్ పాల్గొన్నారు. ·˘ ÌS…MýSÌZÏ Ð]l$sìæt A{MýSÐ]l$ ™èlÐ]lÓ-M>Ìôæ దానికి నిదర్శనం ·˘ OÐðlG-ÝëÞÆŠ‡ ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$, మాజీ మంత్రి వేణు -
ప్రేమ పేరుతో మోసం
యువకుడిపై పోక్సో కేసు నమోదు ఐ.పోలవరం: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసగించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పరిధి ఎదుర్లంక గ్రామానికి చెందిన బాలిక (17)ను అదే గ్రామానికి చెందిన యువకుడు కమిడి హరినారాయణ ప్రసాద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా దాడి చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఐ.పోలవరం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పనిముట్లు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్ నల్లజర్ల: సింగరాజుపాలెంలో ఈ నెల 23న అర్ధరాత్రి కొఠారు నారాయణరావుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి పంటను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్న సమయంలో కాపలాదారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే గ్రామానికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి, ఉంగుటూరుకు చెందిన జీవరత్నం, రాంబాబుతో పాటు మరో ఆరుగురు ఆటోపై వచ్చి నారాయణరావు పొలంలో దోసపాదులు, ఆయిల్పామ్ మొక్కలు, బొప్పాయి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొలం కాపలాదారులు ఇందులో ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఫ చెరువులో ఈతకెళ్లిన ఆరుగురు స్నేహితులు ఫ ఇందులో ఇంటర్ విద్యార్థి మృతి కాకినాడ రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంది.. తిమ్మాపురం పెద్ద చెరువులో ఈ ఘటన జరిగింది. ఈత కోసం ఆరుగురు స్నేహితులు వెళ్లగా ఇందులో ఇంటర్ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. రమణయ్యపేట పంచాయతీ పరిధి కొత్తూరు బర్మాకాలనీ చెందిన రెడ్డి మురళీకృష్ణ (16) మరో ఐదుగురు కలసి మంగళవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు తిమ్మాపురం శివాలయం వద్ద ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ ఆరుగురు సరదాగా ఈత కొడుతుండగా, అంతతో ఊబిలో మురళీకృష్ణ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా స్నేహితులు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు, గ్రామస్తులు, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మాపురం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని విద్యార్థి కోసం గాలించారు. అనంతరం కాకినాడ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తాళ్లు పట్టుకుని నీటి లోపల గాలించడంతో మురళీకృష్ణ మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్మాకాలనీలో విషాదం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇటీవలే రాసి రెండో సంవత్సరంలోకి చేరుకున్న రెడ్డి మురళీకృష్ణ మృతితో కొత్తూరు బర్మాకాలనీలో విషాదం అలముకుంది. మురళీకృష్ణ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఈత కోసం తోటి స్నేహితులతో తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి మనమడు మృతి చెందినట్టు తెలుసుకున్న అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. -
మెరిసిపోయి.. మురిసిపోయి
ఫ ఆధ్యాత్మిక కాంతుల్లో నిర్మలగిరి ఫ కనువిందు చేస్తున్న పుణ్యక్షేత్రం దేవరపల్లి: ఆధ్యాత్మిక కాంతులతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం మెరిసిపోతోంది.. చూసిన భక్తుల మది మురిసిపోతోంది.. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వీక్షిస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని కలవర కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద మరియ తల్లి స్వరూపం, ప్రధాన ద్వారం ఎదురుగా ఫాతిమా టవర్ విద్యుత్ దీపకాంతులతో కొత్త శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. మరియ తల్లికి పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏసుక్రీస్తు ఆలయానికి మెట్లపై మెకాళ్లతో నడిచి వెళ్లి మొక్కులు చెల్లించురకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అవుతుంది. ఉత్సవాల చివరి రోజు బుధవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పుణ్యక్షేత్రంలో పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయ్ కుమార్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎస్.జాన్పీటర్, వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ఫాదర్లు సమిష్ఠి దివ్యబలిపూజ సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు కథోలిక్ తొలి పీఠాధిపతులు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు మోస్ట్ రెవరెండ్ జాన్ ములగాడ స్వరూపాన్ని పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, విజయ్కుమార్ ఆవిష్కరిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్పీటర్ తెలిపారు. -
భక్తి పతాక స్థాయిలో..
ఇనుగంటివారిపేటలో నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం ఫ ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఫ ఆలయాలు లేకుండానే ఏర్పాటు ఫ అక్కడ కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం ఫ ప్రత్యేకతను చాటుతున్న వైనం సీతానగరం: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏ ఆలయమూ ఉండదు. నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ధ్వజస్తంభం ఉంటోంది. ప్రధానంగా విష్ణాలయం, శివాలయం, రామాలయం వంటి పలు దేవాలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇనుగంటివారిపేటలో పలు ఆలయాలున్నా, వాటి వద్ద ధ్వజస్తంభం మాత్రం లేదు. గ్రామం నడిబొడ్డున మాత్రం ఉంటోంది. ఆలయాలు ఉన్నా.. ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ఉన్న పెరుమాళ్ల ధ్వజస్తంభానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రామాలయాలు, తూర్పున శ్రీశాంతి దుర్గమ్మ వారి ఆలయం, పడమర దిక్కున శ్రీలంకాలమ్మ వారు కొలువై ఉన్నారు. ఇవే కాకుండా గ్రామంలో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, షిర్డీసాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉన్నా, ఏ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించలేదు. పదహారేళ్ల క్రితం ముగ్గళ్ల పంచాయతీ నుంచి విడిపోయి ఇనుగంటివారిపేట పంచాయతీగా మారింది. 1933లో ప్రతిష్ఠించిన పెరుమాళ్ల ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో 2019 జూన్ 20న తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తితో కొలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆచారంగా వస్తోంది. ఎందుకు నెలకొల్పారంటే.. పూర్వ కాలంలో ముగ్గళ్ల, ఇనుగంటివారిపేట గ్రామాలు ఇనుగంటి మహారాజు పాలనలో ఉండేవి. అయితే ముగ్గళ్లలో శివాలయం ఉన్నందున, అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ఆగమాలను అనుసరించి ఏ గ్రామంలోనైనా శివాలయం, లేకుంటే ధ్వజస్తంభం ఉండాలి. ఇనుగంటివారిపేటలో శివాలయం లేనందున 1933లో గ్రామ పెద్దలు గ్రంథి పుల్లయ్య, సత్యం మావయ్యకాపు, బిక్కిన వెంకట్రావులు ఆగమాలను అనుసరించి, ఆ గ్రామ నడిబొడ్డులో ఉన్న కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఉన్న గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, సకల దేవతలు కొలువై ఉంటారని, విజయానికి సంకేతమని ఆ రోజుల్లో ప్రజలు విశ్వసించి గ్రామం మధ్వలో ఈ ధ్వజస్తంభం నెలకొల్పారు. ఎంతో విశిష్టమైంది తొంభై మూడేళ్ల్ల కిందట గ్రామం మధ్య కూడలి వద్ద పెరుమాళ్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానిని 2019 జూన్లో పునః ప్రతిష్ఠించారు. పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్దకు వచ్చి అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, విజయం చేకూరుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఎంతో విశిష్టమైంది. –ఆరాధ్యుల వెంకట నారాయణ, ఇనుగంటివారిపేట కోరిన కోర్కెలు నెరవేరతాయి పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్ద కోరిన కోర్కెలు నెరవేరతాయి. గ్రామంలో శివాలయం లేకుంటే ధ్వజస్తంభం లేని గ్రామాలు ఏమీ ఉండవు. ఆనాటి పెద్దలు ఆలోచించి శివాలయం లేని కారణంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –సత్యం రాంపండు, సర్పంచ్, ఇనుగంటివారిపేట -
సృజనమేవ జయతే
ఆలోచనకు సృజన తోడైతే.. పనికిరాని పుల్లలతోనూ అద్భుత కళాఖండాలు తయారు చేయవచ్చు.. అందరితో ఔరా అనిపించుకోవచ్చు. రాజానగరం మండలం వెలుగుబంద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బి.పవన్కుమార్ సారథ్యంలో విద్యార్థులు పనికిరాని వస్తువులతో వివిధ బొమ్మలను తీర్చిదిద్దారు. పారేసిన ఐస్క్రీం పుల్లలు, స్ట్రాలతోపాటు అగ్గి పుల్లలు, ధారం, అట్టముక్కలను ఉపయోగించి అందమైన బొమ్మలను చేసి అబ్బురపరిచారు. ‘నో కాస్ట్, నో లాస్’ విధానంలో బోధనోపకరణాలను కూడా రూపొందించవచ్చని పవన్కుమార్ అన్నారు. పాఠశాలలో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్న తరుణంలో విద్యార్థులచే ఇటువంటివి తయారు చేయించడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని అంటున్నారు. –రాజానగరం -
చంద్రబాబు ప్రభుత్వంలో కుల వివక్ష
పి.గన్నవరం: చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, కుల వివక్ష వంటి సంఘటనలు పెరిగాయని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డీబీ లోక్ అన్నారు. కుందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనే దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా, అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లోక్ మాట్లాడుతూ దీనిని ప్రత్యేకమైన సంఘటనగా గుర్తించి, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. వారికి న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. గ్రామంలో ఇరువర్గాలూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలను కాపాడాలని డీబీ లోక్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట దళిత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ములపర్తి సత్యనారాయణ, బొక్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
దగ్గురలో ముప్పు
ఫ క్షయను నిర్లక్ష్యం చేయొద్దు ఫ సకాలంలో చికిత్సతో వ్యాధి నయం ఫ డాట్స్ థెరపీతో నివారణ సాధ్యం ఫ నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం ఆలమూరు/ రాయవరం: దగ్గరలోనే ముప్పు ఉంది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లొంగదీసుకుంటోంది. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే నివారణ సాధ్యమవుతోంది. ఈ ప్రాణాంతక ట్యూబర్ క్యులోసిస్ (క్షయ) వ్యాధిని నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. క్షయ (టీబీ) వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. 2028 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్ఓ తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా టీబీ వస్తుందని 1882 మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్కాక్ కనుగొన్నాడు. అప్పటి నుంచి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా గాలిలో కలసి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రతి లక్ష మంది జనాభాలో 203 మందికి క్షయ వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 123 గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 52.86 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పటి వరకూ నమోదైన సుమారు ఐదు వేల కేసులకు సంబంధించి క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య, ఆశ సిబ్బంది రోగుల వద్దకు వెళ్లి మందులు సక్రమంగా వాడే విధంగా చైతన్యం నింపుతున్నారు. దీంతో వ్యాధి త్వరితగతిన తగ్గుముఖం పట్టి ఏటా రోగుల సంఖ్య తగ్గుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ 2,601 మంది క్షయ బాధితులను గుర్తించారు. ఇందులో 1,780 మంది పూర్తి వైద్యం పొందగా, 821 మంది ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు. 549 మందికి దాతల ద్వారా ఫుడ్ బాస్కెట్ పేరుతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సీబీ నాట్ మిషన్ ఉంది. నమోదవుతున్న కేసుల్లో చాలామందికి డాట్స్ కీమో థెరపీ ద్వారా నయం చేయడం జరుగుతుంది. మూడు రకాలు క్షయ శరీరంలోని ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది. అందులో ద్రవాల తడితో కూడిన (వెబ్ టైప్) మొదటి రకం కాగా, ఉదరకోశ కండరాలను ముద్దలా చేసే పొడిరకపు (డ్రై టైప్) రెండో రకం, శరీరంలో కంతుల మాదిరిగా సంభవించే (ఒమెంటమ్) మూడో రకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి తుమ్మినప్పుడు కాని దగ్గినప్పుడు కాని నోటి, ముక్కు నుంచి వెలువడే గాలిలోని తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా కారకాలతో ఇతరులకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డాట్ చికిత్స ద్వారా కాని నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్డీసీ విధానంలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ● వ్యాధి గుర్తింపు ముఖ్యం క్షయ వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, వైద్యుల సూచనలు పా టించి పూర్తి కాలం వైద్యం తీసు కుంటే నయం అవుతుంది. ఈ వ్యాధిని గుర్తించకుంటే ఆ రోగి ఏడాదికి 10–15 మందికి వ్యాధిని కలగజేస్తాడు. క్షయ వ్యాధికి అవసరమైన మందులు ప్రతి పీహెచ్సీలో ఉచితంగా అందజేస్తారు. డయాబెటిక్ రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. –ఎన్.వసుంధర, జిల్లా క్షయ నివారణ అధికారి, రాజమహేంద్రవరం ● నివారణకు ప్రత్యేక చర్యలు క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి సత్వరమే మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం సమకూర్చిన విలువైన మందులను అందిస్తున్నాం. క్రమం తప్పకుండా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేసేలా చూస్తుంన్నాం. అలాగే పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నాం. –ఎం.సుమలత, అడిషనల్ డీఎంహెచ్ఓ, కొత్తపేట వ్యాధి లక్షణాలివే.. క్షయ సోకిన రోగికి రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. అప్పుడే క్షయగా అనుమానించాలి. సాయంత్రం పూట జ్వరం రావడం, నిద్ర పట్టకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఉమ్మిలో రక్తం పడడం, ఆయాసం, త్వరగా అలసిపోవడం తదితర కారణాలతో రోగి నీరసించిపోతాడు. క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తొందరగా వస్తుంది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారిలో మూడో వంతు క్షయ వ్యాధితోనే మరణిస్తున్నారు. క్షయ వ్యాధి దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా, మాట్లాడిన సమయంలో వ్యాధికారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లగా బయటకు వస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చినప్పుడు క్షయ వ్యాధికి గురవుతారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ టీకాను అందించాలి. ఫ దగ్గు వచ్చినప్పుడు నోటికి వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవాలి. ఫ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నిర్ధేశించిన సమయం వరకూ మందులు వాడాలి. ఫ వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయాలి. -
పక్కకు దిగపడి
రోడ్డు దిగబడుతోంది.. ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన కలిగిస్తోంది. పెదపూడి మండలం చింతపల్లి పరిధిలో ఆర్అండ్బీ రోడ్డు బెర్ములు పెద్ద కాలువలోకి జారిపోతున్నాయి. నిత్యం చింతపల్లి గ్రామం మీదుగా అటు కాండ్రేగుల, కరప, కాకినాడ.. ఇటు రామచంద్రపురం, జి.మామిడాడ గ్రామాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –పెదపూడి ఏముందీ బురదే.. నిత్యం రద్దీగా ఉండే గోపాలపట్నం – తొండంగి ప్రధాన రహదారిలో గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలప ట్నం శివారులో భారీ గుంతలు పడ్డాయి. ఇక్కడ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్ది నెలల క్రితం అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా మళ్లీ మామూలే అయ్యింది. గ్రావెల్, బండ రాళ్లతో టిప్పర్లు వెళ్తుండడంతో కొద్ది రోజులకే ఇలా పాడవుతోంది. రెండు రోజుల క్రితం కొద్దిపాటి చినుకులకే ఇలా బురదగా మారింది. –తొండంగి -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ రూ.20 లక్షల విలువైన ఆభరణాలు మాయం ఫ సామర్లకోటలో సంఘటన సామర్లకోట: స్థానికంగా ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సామర్లకోట అంబటివారి తోటలోని తన ఇంట్లో విశ్రాంత ఉపాధ్యాయురాలు మట్టిపల్లి లక్ష్మీదేవి (82) ఉంటున్నారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి బంధువులతో కలసి హైదరాబాద్లో పెళ్లికి వెళ్లారు. బంధువులు తిరిగి సామర్లకోట వచ్చినప్పటికీ లక్ష్మీదేవికి జ్వరంగా ఉండడంతో హైదరాబాద్లో ఉండిపోయారు. రోజూ పని మనిషి సాయంత్రం వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుంది. సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించింది. వెంటనే సమీపంలోని లక్ష్మీదేవి బంధువు వజ్జులు మాస్టారుకు సమాచారం ఇచ్చింది. ఇంటి వద్దకు చేరుకున్న ఆయన దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎ.కృష్ణభగవాన్, ఎస్సై రాజా, క్రైం ఎస్సై కృష్ణారావు, సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కృష్ణభగవాన్ హైదరాబాద్లో ఉన్న లక్ష్మీదేవికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 గ్రాముల బంగారు, మూడు కిలోల వెండి, రూ.50 వేల నగదు బీరువాలో ఉంచినట్లు ఆమె వివరించారు. దొంగలు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి, ఇంటి తాళాలు బద్దలు కొట్టి బీరువాలోని వెండి, బంగారం, నగదును తస్కరించారు. సుమారు ఏడాది క్రితం తన భర్త వెంకట్రావు చనిపోవడంతో ఆయన పేరున బ్యాంకు లాకరులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఇటీవల ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రపరిచినట్లు బాధితురాలు తెలియజేసింది. పెళ్లి నిమిత్తం కొన్ని బంగారు ఆభరణాలను వెంట తీసుకువెళ్లానన్నారు. వేలిముద్ర నిపుణులు వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన కొత్తవారి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని గాండ్రింపులు
ఫ వేములోవలోనే పెద్ద పులి సంచారం ఫ అప్రమత్తంగా ఉండాలని అధికారుల ప్రచారం గంగవరం: పెద్ద పులి ఎక్కడా ఆగడం లేదు.. రోజుకోచోట ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం గంగవరం మండలంలో దాని జాడలను అధికారులు గుర్తిస్తున్నారు. మూడు రోజులుగా గంగవరం మండలం వేములోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి ఓ ఆవు దూడను హతమార్చింది. సోమవారం పెద్దపులి గంగవరం మండలం వేములోవ రిజర్వు ఫారెస్ట్లోని ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, వేములోవ అటవీ ప్రాంతంలోనే సంచరించినట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని కనుగొన్నామని, అటవీ ప్రాంతంలోనే ఉందని ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్నారు. వేములోవ – ఉయ్యాలమడుగు, గొరగుమ్మి అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందన్నారు. బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. దీనికోసం శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా బయటకు రావొద్దని ప్రచారం నిర్వహించారు. ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజర్ పి.శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. జీడిమామిడి రైతుల్లో గుబులు గంగవరం మండలంలో జీడిమామిడి సాగు చేసే రైతులు ఆ తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆర్డీ పురం, పిడతమామిడి, వడ్డిచెరువు, పెదగార్లపాడు, చినగార్లపాడు, చిన్నంపాలెం, గొరగుమ్మి, లక్కొండ, గంగవరం తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులు, మహిళలు జీడి పిక్కలు సేకరించేందుకు వెళ్లడం లేదు. దీంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఫ బాలుడి మృతి ఫ ఎనిమిది మందికి గాయాలు కాకినాడ రూరల్: పుట్టిన రోజు వేడుకలో వారంతా సరదాగా గడిపారు.. తిరిగి తమ ఇళ్లకు బయలు దేరారు.. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఓ బాలుడిని బలి తీసుకుంది. అలాగే మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ప్రతాప్నగర్ వంతెన వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాలుడు పలివెల అక్షంత్ (10) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి ఆటోలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు 9 మంది ఆటోలో కాకినాడకు వచ్చారు. కాకినాడలో రెండు గదులు అద్దెకు తీసుకుని, అక్కడ వేడుకల అనంతరం వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రతాప్నగర్ వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సామర్లకోట బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్షంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు. -
పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్ దగ్ధం
సురక్షితంగా వాహనచోదకులు పి.గన్నవరం: పోతవరం గ్రామ శివారులో ఉన్న బంకు వద్ద ఒక మోటారు సైకిల్ కాలిపోయింది. దానిపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన బాలు అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలను అమలాపురం రూరల్ మండలం బండారులంక హైస్కూల్లో ప్రైవేట్గా రాస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం జరిగిన సైన్స్ పరీక్షకు ఆ విద్యార్థిని తండ్రి గంగులూరి రాజు, తల్లి జ్యోతి మోటారు సైకిల్పై బండారులంకకు తీసుకువచ్చారు. పరీక్ష రాసిన అనంతరం మోటారు సైకిల్పై స్వగ్రామానికి తిరిగి బయల్దేరారు. పోతవరంలోని బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకుని తిరిగి మోటారు సైకిల్ స్టార్ట్ చేస్తుండగా, సీటు కింద నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో రాజు మోటారు సైకిల్ను బంకు నుంచి కాస్త ముందుకు తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంకు సిబ్బంది ఏబీసీ ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అమలాపురం నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపు చేసింది. మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. బంకు వద్ద సరైన ఫైర్ సేఫ్టీ లేదని, నాలుగు ఏబీసీ ఎక్విప్మెంట్స్లో రెండు మాత్రమే పనిచేశాయని, మంటలు ఆర్పేందుకు వాటర్ పైపు కూడా లేదని, దీంతో మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోయిందని బాధితుడు రాజు ఆరోపించాడు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలపై సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్ఎస్కు సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎంబీఎన్ మురళీకష్ణ పాల్గొన్నారు. కల్తీపాల ఘటనలో మరొకరు డిశ్చార్జి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీపాల ఘటనలో రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి.వెంకటేశ్వరరావు కోలుకుని సోమవారం డిశ్చార్జి అయ్యారు. గత నెల 16న కల్తీపాలు తాగి 21 మంది రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. అయితే వారికి అత్యవసర వైద్య చికిత్సలు అందించినా వీరిలో ఇప్పటి వరకు 17 మంది మృత్యువాత పడ్డారు. నలుగురు వైద్య చికిత్సలు పొందుతుండగా ఈ నెల 16న ఒకరు ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దీంతో కల్తీ పాల ఘటనలో కోలుకుని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య రెండుకు చేరింది. అయితే ఇంకా ఇద్దరు చిన్నారులు రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు. జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు కోనసీమ విద్యార్థులుఅమలాపురం రూరల్: ఈ నెల 24 నుంచి 28 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీ వేదికగా 28వ సబ్–జూనియర్ బాల బాలికల జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు జరుగుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాత బాబు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచి గోసంగి సందీప్, జి.శశిధర్ నాగ్, సాయి సూర్య, అప్పారి యశ్వంత్, మట్టపర్తి అవంతి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలో ఈ క్రీడా దినదినాభివృద్ధి చెందుతోందని, దానికి నిదర్శనమే ఈ ఐదుగురు జాతీయ స్థాయికి ఎంపిక అవడమని తెలిపారు. జిల్లాకు చెందిన కేత సాయి దుర్గా ప్రసాద్, రాష్ట్ర బాలుర, బాలికల జట్టు కోచ్గా యాండ్ర గౌతమ్, కోచ్లు గా రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసులను నియమించినట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాంచీలో శిక్షణలో ఉన్నారని, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం తీసుకురావాలని తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లా స్ట్రాంగ్ మెన్ వీరేంద్ర అమలాపురం రూరల్: ఉమ్మడి గోదావరి జిల్లాల స్ట్రాంగ్ మెన్ విన్నర్గా అమలాపురానికి చెందిన ఎం.వీరేంద్ర, రన్నర్గా యశ్వంత్ గెలుపొందారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈదరపల్లిలో జనహిత కార్యాలయంలో జరిగిన పోటీలు సోమవారంతో ముగిసాయి. పోటీలలో 206 మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీ పడగా అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్కు చెందిన వీరేంద్ర 690 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగ్ మెన్గా నిలిచారు. యశ్వంత్ 570 కేజీల బరుఎత్తి రన్నర్గా గెలుపొందారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 24 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు కోచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
బీసీల అభ్యున్నతికి దొమ్మేటి విశేష కృషి
వెంకటరెడ్డి జయంతి వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయినరాజమహేంద్రవరం రూరల్: బీసీ ఉపకులాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడిన మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొనియాడారు. సోమవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దొమ్మేటి చిత్రపటానికి వేణు నివాళులర్పించి మాట్లాడారు. అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని చాటి చెప్పిన వ్యక్తి వెంకటరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరం పాటుపడాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు పాఠశాల వద్దే భోజనం ఏర్పాటు చేసి విద్యను అందించిన విద్యాదాత దొమ్మేటిని స్మరించుకుంటూ, ఆయన చేసిన అనేక సేవలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యద ర్శి గిరజాల బాబు, మాజీ ఎంపీపీ రేలంగి వీర వెంకటసత్యనారాయణ, చెల్లుబోయిన నరేన్, వేముల ఏసుబాబు, కట్టా జమిందర్, డాక్టర్ చొల్లంగి సత్యగిరి, పి తాని హరికృష్ణ, చాప రాజా తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు
● చంద్రబాబు పాలనలో లక్షల ఉద్యోగాలు పీకేశారు ● 1.72 లక్షల ఖాళీలకు 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండరా? ● ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు పచ్చడికి బదులు మట్టి కొట్టిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1.72 లక్షల ఉద్యోగులను తీసేశారని అన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అదే సమయంలో లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని.. పైకి మాత్రం జాబ్ క్యాలెండర్ పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. 2024 మార్చి నాటికి రాష్ట్రంలో 11.79 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 2025 డిసెంబర్ నాటికి 10.07 లక్షలకు తగ్గారని అసెంబ్లీలో ద్రవ్య విధాన పత్రంలో పేర్కొన్నారన్నారు. హామీ అమలేదీ? 2024లో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. 22 నెలల కాలంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా పైసా కూడా కేటాయించిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని గద్దె నెక్కి.. అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారన్నారు. రాష్ట్రంలో ఏటా 75 వేల మంది వయసు, ఇతర కారణాలతో ఉద్యోగాలకు అర్హత కోల్పోతుంటే 10,060 మందికి మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శోచనీయమన్నారు. ఉద్యోగాలు కూడా వచ్చే అక్టోబర్ లోపు విడతల వారీగా భర్తీ చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని స్వయంగా డీజీపీ ప్రకటిస్తే కేవలం 2,778 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆరోగ్య శాఖలో 15 వేలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 975, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 4,130, జెన్కో 2,307, ఏపీ ట్రాన్స్కో 5,137 ఇలా అన్ని శాఖల్లోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని పచ్చ పత్రికలో కథనాలు ఇచ్చారన్నారు. ఈ లెక్కన ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు లెక్కన రూ.66 వేల కోట్లు బకాయి పడ్డారన్నారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా రెండేళ్ల కాలంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటిస్తే, శాసనమండలిలో మంత్రి 5.72 లక్షల మందికి ఇచ్చారంటూ అంకెల గారడీ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలి ఇప్పుడు 54,903 కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకొని రూ.3 వేల కోట్లు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 243 మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే భర్తీకి చర్యలు లేవన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు, పవన్, లోకేష్లను కోడిగుడ్లు, రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని రాజా అన్నారు. ఇప్పటికై నా చేసిన తప్పును గ్రహించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు, బెదిరింపులు, భౌతిక దాడులు, కత్తులు పెట్టి నడిరోడ్లపై నరకడం వంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. ఇలాంటి సంస్కృతి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సాహసించడం లేదన్నారు. సమావేశంలో పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు అడబాల చినబాబు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఉద్యోగ విప్లవం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.34 లక్షల మందికి ఒకే నోటిఫికేషన్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 58 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుందన్నారు. 78 నోటిఫికేషన్లతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. -
జీజీహెచ్లో అభద్రత నిజమే
రాష్ట్ర డీఎంఈ ఆదేశాలతో ఆసుపత్రి అధికారుల వివరణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి భద్రతలో లోపాలు నిజమే. సెక్యూరిటీ సూపర్వైజర్ అసమర్థత వల్లే చోరీలు, భద్రతా వైఫల్యం నెలకొంది. తగినంత మంది సిబ్బంది లేరు, ఉన్న వారిలోనూ సమర్థుల కొరత. వైద్యుల కూడా దాడులు జరుగుతున్నాయి. వాహనాలు, రోగుల విలువైన వస్తువుల చోరీలు నిత్యకృత్యమైపోయాయి. ఇదీ.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు రాష్ట్ర డీఎంఈ డాక్టర్ రఘునందన్ గంభీర, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిలకు సమర్పించిన లిఖితపూర్వక వివరణ. ఈ నెల 21న సాక్షి దినపత్రికలో ‘భద్రతకు సుస్తీ’ పేరుతో ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. డీఎంఈ రఘునందన్ ఈ కథనంపై స్పందించి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జీజీహెచ్ ఉన్నతాధికారులు కథనంలోని లోపాలను ధృవీకరించారు. 83 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 60 మందితో నడిపిస్తున్నారని, ఆస్పత్రి సామగ్రి కూడా చోరీకి గురవుతోందని, సెక్యూరిటీ సూపర్వైజర్ అసమర్థత భద్రతను బలహీనం చేసిందని వివరణలో నిర్థారించారు. ఎంవోయూ ప్రకారం శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ నిబంధనలు అనుసరించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో కొంత భాగం నిర్మాణంలో ఉండగా, భద్రతను పటిష్టం చేసేందుకు ఆసుపత్రి వెనుక భాగంలో కనీసం గోడ కూడా కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాంట్రాక్టు సంస్థపై డీఎంఈ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 10 రోజుల లోపు మిగిలిన 23 మంది సెక్యూరిటీ గార్డులను నియమించి, అలాగే ఇప్పటికే కొనసాగుతున్న వారిలో అసమర్థులను తక్షణమే తొలగించి వారి స్థానంలో నిబంధనల మేరకు నియామకాలు చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని పేర్కొంటూ కాంట్రాక్టు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు వివరణలో పేర్కొన్నారు. సమర్థులు, అర్హులకే నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఆసుపత్రి అధికారులు సోమవారం ఈ వివరణను డీఎంఈ, కలెక్టర్లకు సమర్పించారు. ఆర్డీవో బాధ్యతల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం నూతన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)గా ఆర్. శివరాముడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్లో జేసీ మేఘాస్వరూప్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను జేసీ అభినందించారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కా రంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు. శివ రాముడు 2007లో అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా ఏపీ పబ్లి క్ సర్వీస్ కమిషన్ ద్వారా తొలి నియామకం పొందా రు. అనంతరం పదోన్నతిపై తహసీల్దార్గా బాధ్యత లు నిర్వర్తించారు. తహసీల్దార్గా బేతంచర్ల, డోన్, ఆ దోని ప్రాంతాలతో పాటు కర్నూలు కలెక్టరేట్లో కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. అలాగే కలెక్టర్ ఏవోగా, భూ సేకరణ విభాగాల్లో కూడా పని చేసి విశేష అనుభవం సంపాదించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
అల్లరి వేళల అప్రమత్తం
రంగంపేట/రాయవరం: పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆటలాడితేనే ఆరోగ్యం. ఆలోచిస్తేనే మేధోబలం. ఇవన్నీ నియంత్రణలో ఉన్నపుడే వారికీ.. వారి తల్లిదండ్రులకు.. చదువులు చెప్పే గురువులకు గౌరవం.. మన్నన. ఎండల తీవ్రత పెరగడంతో విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల నుంచి రాగానే పుస్తకాల సంచీ అవతల పడేసి ఆదరాబాదరగా అన్నం తినేసి స్నేహితులతో ఆటలకు పరుగులెడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులు పెడితే విద్యార్థులు మళ్లీ ఆ ఎండనే పడి ఆటలాడడం ఆలోచించాల్సి విషయం. జిల్లాలో ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల భద్రతను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫేట్ మారుస్తున్న ఫీట్స్.. దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు కాలువలు, చెరువులు, వాగులు, వంకలు, బావుల్లో ఈత సరదా కోసం వెళ్లి మత్యువాత పడుతున్నట్లు యూనిసెఫ్ సర్వే సారాంశం. జిల్లాలో నీటి వనరులకు కొదవు లేకపోవడంతో ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఎక్కువ. నీటిని చూడగానే సహజంగానే పిల్లలు ఈతకు ఉపక్రమిస్తుంటారు. స్థానికులైతే కొంత పరవాలేదు కానీ.. చుట్టపుచూపుగా వచ్చిన బంధువుల పిల్లలు, స్నేహితులు అయితే ఆ కాలువో, చెరువో లేదా మరేదైనా దాని లోతెంతో తెలియక.. ఊబి ఉందా.. బంక మట్టి ఉందా తెలియక వాటిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు చిన్నారులు తోటి స్నేహితులు ఈదుతున్నారు కదా అని ఈత రాకపోయినా వారు కూడా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రమాదకర ఫీట్స్ చేసి తగలరాని చోట ఏదో తగిలి.. లేదా నిలువుగా డైవ్ చేసే వేళ నిగ్రహించుకోలేని లోతులకు దూసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్ల కొమ్మల నుంచి.. కాలువ గట్ల పైనుంచి దూకుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఒంటి పూట బడులు, రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు మరింత అప్రమత్తమై అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కాలువైనా.. వ్యవసాయ బావులైనా.. నదులైనా ఎక్కడ ఎంత లోతు ఉంది.. పిల్లలు దిగరాదని.. నీటి లోపలి మట్టి జారుడుగా ఉందా.. ఊబులు ఉండే అవకాశం ఉందా.. అట్టడుగున తూటికాడ, గుర్రపుడెక్క ఉండే అవకాశం ఉందా.. దానిలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం ఉందా తదితర వివరాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.పంచాయతీలు, నీటిపారుదల శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద మెష్లతో కంచెలు నిర్మిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. తేలికపాటి ఆహారం మంచిది... వేసవిలో పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. వేపుళ్లు, మాంసాహారం వంటివి వేసవిలో మంచిది కాదు. రాత్రిపూట త్వరగా నిద్రకు ఉపక్రమించేలా, నిద్ర లేచిన తరువాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ వేణుశ్రీలక్ష్మి, పీహెచ్సీ, రంగంపేట మండుటెండల్లోనే ఆటలు విద్యార్థులు ఎండ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల వదిలాక ఇళ్లకు వచ్చే క్రమంలో తలకు టోపీ ధరించడం, ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రవి కిరణాలతో ప్రమాదం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు భూమిపై నిటారుగా పడుతుంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం, ప్రయాణ సమయాల్లో పిల్లలను వాహనాల ముందు భాగంలో కూర్చోపెట్టకుండా వడదెబ్బ నుంచి కాపాడడం అవసరమని వారు సూచిస్తున్నారు. ఆటలలో అజాగ్రత్త వద్దు విద్యార్థులు స్మార్ట్ మొబైళ్లకు బానిసలు కాకుండా నీడ పట్టున ఆడే ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాల పఠనం, అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువర్గంతో ఎక్కువ సమయం గడపడం అత్యంత ఆవశ్యకం. తద్వారా పెద్దలతో మసలే తీరు తెలుసుకునే అవకాశం, మంచీ చెడూ తెలుస్తాయి. మధ్యాహ్న వేళ కొంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ఏప్రిల్ 24 వరకూ ఒంటిపూట బడులు మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు ఆనక ఆటలకే సమయం వెచ్చిస్తున్న చిన్నారులు వేసవి తాపం వేళ ఈతలకు దిగుతున్న వైనం సరదాల మాటున పొంచి ఉన్న ప్రమాదం కనిపెట్టుకుని లేకుంటే మూల్యం చెల్లించాల్సిందే -
మార్కెట్ పైనే ఆశలు
ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు రంగు, నాణ్యత బాగున్నాయి. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్యూరింగ్లు ముగింపు దశలో ఉన్నాయి. గ్రేడింగ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేడింగ్ చేసిన పొగాకును రైతులు బేళ్లు తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. మార్కెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఉత్పత్తి పెరుగుతుంది. మార్కెట్ లాభసాటిగా ఉంటుందని ఆశిస్తున్నాం. – కరుటూరి శ్రీనివాస్, దేవరపల్లి వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు, సంగాయగూడెం సగటు ధర రూ.330 ఇవ్వాలి పొగాకు నాట్లు ఆలస్యంగా జరిగినందున దిగుబడులు తగ్గాయి. తుపాను తర్వాత వేసిన తోటల దిగుబడి తగ్గింది. ఎకరాకు సగటున 9 నుంచి 10 క్వింటాళ్లు వస్తున్నాయి. గత ఏడాది కంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. భూముల కౌలు, బ్యారన్ల అద్దె పెరడంతో 15 నుంచి 20 శాతం పెట్టుబడి పెరిగింది. దీనికి తగ్గట్టుగా మార్కెట్ ఉండాలి. గత ఏడాది కిలో సగటు ధర రూ.311 లభించింది. ఈ ఏడాది రూ.330 వస్తే గిట్టుబాటు అవుతుంది. – సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు సంఘం ప్రతినిధి, కృష్ణంపాలెం, దేవరపల్లి వేలం కేంద్రం కొనుగోళ్లకు ఏర్పాట్లు ఐదు వేలం కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. గ్రేడింగ్ స మయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. బేళ్లకు న్యూస్ పేపరుకు బదులు బోర్డు సరఫరా చేసిన గోనె పట్టాలనే వాడాలి. రోజూ ఉదయం 8 గంటలకు కాటాలకు బేళ్లు తీసుకురావాలి. మార్కెట్లో అమ్ముడు పోతున్న పొగాకును తీసుకురావాలి. ఈ ఏడాది పొగాకు నాణ్యత బాగుంది. మార్కెట్ కూడా బా గుంటుందని ఆశిస్తున్నాం. లో గ్రేడ్ పొగాకు శాతం తక్కువగా ఉంది. బేలు 150 కిలోలకు మించి ఉండరాదు. ట్రేడర్లకు, అధికారులకు రైతులు సహకరించాలి. – జె.సుధీర్ కుమార్, టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
తొలిసారి ఫస్ట్ ర్యాంక్
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ఫిబ్రవరి 22 నుంచి మార్చి 21 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం 73.7 శాతం భక్తుల సంతృప్తితో ప్రథమ స్థానంలో నిలిచింది. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదివారం ఈ విషయం తెలిపారు. దేవస్థానాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం ప్రారంభించాక అన్నవరం ప్రథమ స్థానంలో రావడం ఇదే తొలిసారి. తాజా సర్వేలో 65.9 శాతంతో శ్రీశైలం ఏడో స్థానంలో నిలిచింది. 73.6 శాతంతో రెండో స్థానంలో నిలచిన ద్వారకా తిరుమల కన్నా అన్నవరం దేవస్థానం 0.1 శాతం మాత్రమే ఎక్కువ పొందింది. స్వామివారి దర్శనంపై 76.6 శాతం, మౌలిక వసతుల కల్పనపై 71.5 శాతం, ప్రసాదం నాణ్యతపై 79.9 శాతం, పారిశుధ్య ఏర్పాట్లపై 66.3 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివాహ బృందాలు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సాయంత్రం వరకూ విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమే ఏలేశ్వరం: ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.రాంభూపాల్ అన్నారు. యుటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పారి వెంకటస్వామి 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి స్మారకోపన్యాసం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యాన, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘అమెరికా యుద్ధోన్మాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై రాంభూపాల్ ప్రసంగించారు. 23 రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్, ఆమెరికాలు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇరాన్ ఉన్మాద స్థితికి చేరుకుంటే ప్రపంచానికే నష్టమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కరోనా ముందు ప్రభుత్వ పాఠశాలల్లో 46 లక్షల మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 31.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. తొలుత యుటీఎఫ్ మండల శాఖ భవనాన్ని వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రారంభించారు. -
జీవితాల్లో కారుచీకటి!
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–16)పై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఆపై నిద్రమత్తు కారణంగా ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గాంధీనగర ప్రాంతానికి చెందిన సియాదుల సత్యనారాయణ (52), రామారావుపేటకు చెందిన మామిడాల నారాయణమూర్తి (57), బళ్ల చిట్టిబాబు, యండకుదిటి విజయ్, కోట్ని వెంకట్రావు, గొడుగుపాటి రాఘవులు కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఎర్రచందనం మొక్కల వ్యాపారం చేస్తుంటారు. ఆదివారం తెల్లవారు జామున తమ వ్యాపారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరికి కారులో బయలు దేరారు. ఉదయం 7 గంటల సమయంలో కారు అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తూ దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద హైవే ఫ్లైఓవర్పై డివైడర్ను ఢీకొని అటువైపు ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంతో రెండు కార్లు ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ ప్రాంతం భయానకంగా మారింది. కనిగిరి వెళుతున్న కారు అద్దాలు, డోర్లు బద్దలు కొట్టి దానిలో ఇరుక్కున్న వ్యక్తులను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. అప్పటికే ఆ కారులోని సియాదుల సత్యనారాయణ, మామిడాల నారాయణమూర్తి మృతి చెందగా, వీరితో పాటు ఉన్న బళ్ల చిట్టిబాబు, యండకుదిటి విజయ్, కోట్ని వెంకట్రావు, గొడుగుపాటి రాఘవులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా అసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారులోని ఏలూరు తంగెళ్లమూడికి చెందిన చిత్తి సలీం (44) అక్కడికక్కడే మృతి చెందాడు. సలీం రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లులో కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. రంజాన్కు ఏలూరు వెళ్లి తిరిగి రాజమహేంద్రవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు ఈ కారునే ఢీకొంది కనిగిరి వెళ్తున్న కారు ముందుగా ఏలూరుకు చెందిన పరసా కోటేశ్వరరావు కారును ఢీకొంది. కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో ద్రాక్షారామలో శివాలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోటేశ్వరరావు చాకచక్యంగా తప్పించుకున్నారు. కారు దెబ్బతినగా, కోటేశ్వరరావు, అతని భార్య తేజస్విని స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు ఇద్దరు పిల్లలు, డ్రైవర్ క్షేమంగా ఉన్నారు. వీరంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలాన్ని దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడు సలీంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతి వేగం.. ఆపై నిర్లక్ష్యం ఆ జీవితాల్లో ‘కారు’చీకటిని నింపేసింది.. గమ్యానికి వేగంగా చేరుకోవాలనే తపనతో పాటు నిద్ర మత్తులో కారును నడపడంతో ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జరిగింది.. ఈ ఘటనతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఓ కారు వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డులోకి వెళ్లి మరీ రెండు కార్లను ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అతివేగం డివైడర్ను ఢీకొన్న కారు అవతలి వైపు దూసుకెళ్లి రెండు కార్లతో ఢీ ప్రమాదం నుంచి బయటపడిన ఓ కుటుంబం -
నిర్మలగిరికి భక్తుల తాకిడి
● ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు ● సందర్శించిన ఎస్పీదేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో తొలి రోజే భక్తుల తాకిడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి, మరియ తల్లిని దర్శించుకుని, దీవెనలు పొందారు. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకూ పుణ్యక్షేత్రంలో గడిపి ప్రార్థనలు, పూజలు చేస్తారు. తొలి రోజు సహాయ గురువులు ఫాదర్ ప్రేమ్కుమార్ దివ్య బలి పూజ సమర్పించారు. పలువురు గురువులు, ఫాదర్లు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు గుండుగొలను – కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మలగిరి పుణ్యక్షేత్రం విస్తరించినందున భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ను మళ్లించినట్టు సీఐ నాయక్ తెలిపారు. దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, పంగిడి గ్రామాల్లో ట్రాఫిక్ను 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు. 215 మందితో బందోబస్తు మేరీ మాత ఉత్సవాలకు 215 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపారు. ఉత్సవాలు నాలుగు రోజులూ పుణ్యక్షేత్రానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్పారన్నారు. అదనపు ఎస్పీ ఇన్చార్జిగా ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 21 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పుణ్యక్షేత్రంలోని 30 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు డ్రోన్ కెమెరాలు, క్రైం పార్టీని కూడా ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించడానికి ఈ ఏడాది అత్యాధునికమైన 50 ఫింగర్ ప్రింట్ డివైజ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటి ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. ఫేస్ రికవరీ పరికరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
వాలీబాల్ పోటీల్లో ఐసీఎఫ్ జట్టు విజేతమలికిపురం: ఆలిండియా మహిళా వాలీబాల్ పోటీల్లో తమిళనాడు ఐసీఎఫ్ (ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ) జట్టు విజేతగా నిలిచింది. మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో అడబాల స్పోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న డే అండ్ నైట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్స్లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో తలపడిన ఐసీఎఫ్ జట్టు విజేతగా నిలిచి రూ.2 లక్షల నగదు ట్రోఫీ అందుకుంది. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రన్నర్గా నిలిచి రూ.1.50 లక్షల నగదు ట్రోఫీ స్వీకరించింది. విజేతలకు నగదు, ట్రోఫీలను నిర్వాహకులు అందించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, నిర్వాహకులు అడబాల వీరబ్రహ్మాజీరావు, అడబాల వేణుగోపాల్, అల్లూరి రవిరాజు, కె.రామచంద్రమూర్తి, గెడ్డం మహలక్ష్మీప్రసాద్, దొడ్డా బాబ్జీ, కృష్ణ, మంచాల సుధాకర్నాయుడు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో చోరీకె.గంగవరం: మండలంలోని కుందూరులో కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఆలయంలోకి చొరబడి అమ్మవారి వెండి కిరీటం, వెండి హస్తం, బంగారు మంగళసూత్రం అపహరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూకాలమ్మకు జేజేలుసామర్లకోట: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి జాతర ఉత్సవాలు ఈ నెల 17న ప్రారంభం కాగా, మే 3 వరకూ జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని తోటలో వాహనాలను పార్కింగ్ చేసి, అమ్మవారిని దర్శించుకుని తోటలోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి భోజనాలు చేశారు. ఆలయం వద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రాంబాబురెడ్డి, చైర్మన్ లొల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. అమ్మవారి దర్శనానికి రూ.10, రూ.30, రూ.100 టిక్కెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. తల్లిదండ్రుల చెంతకు బాలుడుఅనపర్తి: రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన ఇజ్జిన సిద్ధూ (11) శనివారం తప్పిపోయి పక్కనే ఉన్న బలభద్రపురం గ్రామానికి వచ్చాడు. ఆ బాలుడిని బలభద్రపురానికి చెందిన సింగిడి వెంకటలక్ష్మి గమనించి బిక్కవోలు పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి అప్పగించారు. ఎస్సై వి.రవిచంద్ర ఆ బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అతని నాన్నమ్మ ఇజ్జిన సీత, తండ్రి చంద్రశేఖర్లను పిలిపించి సిద్ధూను అప్పగించారు. -
ఆధ్యాత్మిక తరంగం
● భక్తుల కొంగుబంగారం విజయదుర్గా పీఠం ● భక్తులను బంధువులుగా పిలిచే ‘గాడ్’ రాయవరం: అక్కడ అడుగుపెట్టగానే ప్రశాంత వాతా వరణం కనిపిస్తుంది. నిత్యం దేవీ నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచే ఆ ప్రదేశానికి వెళ్లగానే బంధువుల మాదిరి పలకరింపులే కాదు.. మానసిక చింతతో వెళ్లే వారి బా ధలను తొలగించే సలహాలు సైతం అందుతాయి. అదే భక్తులకు కొంగుబంగారంగా రాయవరం మండలం వెదురుపాకలో భాసిల్లుతున్న విజయదుర్గా పీఠం. పుట్టినప్పటి నుంచే ‘గాడ్’ పీఠం వ్యవస్థాపక అధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం పుట్టినప్పటి నుంచే ‘గాడ్’గా పిలుపు అందుకున్నట్లు భక్తులు చెబుతారు. 1972 ఆగస్టు 18వ తేదీన స్వయంగా జగన్మాత వ్యాఘ్రవాహినిగా దర్శనమిచ్చి మంత్రోపదేశం చేసినట్లు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ ఈ పీఠం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 1989 లో శృంగేరి జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి ఆదేశంతో భారతీతీర్థ స్వామి చేతుల మీదుగా అష్టభుజాలతో కూడిన విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ ఈ పీఠంలో జరిగింది. ఇక్కడ నిత్యం పలు పూజలు నిర్వహిస్తారు. విజయదుర్గాదేవికి శ్రీచక్రార్చన, గణపతి, నక్షత్ర, నవగ్రహ, మృత్యుంజయ, రుద్ర, దుర్గా హోమాలు నిర్వహిస్తారు. వివిధ సమస్యలు, మానసిక అశాంతితో పీఠానికి వచ్చే వారికి ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పీఠానికి వస్తారు. భక్తులను గాడ్.. అబ్బాయి, అల్లుడు, కూతురు, కోడలు వంటి వరుసలతో పిలుస్తారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ.. భక్తుల సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందజేస్తారు. ఏటా శరన్నవరాత్ర వేడుకలు పీఠంలో ఏటా శరన్నవరాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దీనికి దూర ప్రాంతాల వారు ముందుగానే చేరుకుంటారు. ఆ పది రోజులూ భక్తులు స్వయంగా కలశాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటారు. పీఠాధిపతి ‘గాడ్’ జన్మదిన వేడుకలను ఏటా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భక్తులే ఘనంగా నిర్వహించుకుంటారు. 19వ తేదీన జరిగే గాడ్ జన్మదిన వేడుకలకు వేలాదిగా తరలివస్తారు. వీటితో పాటు పర్వదినాల్లో పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేపడతారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, పుష్పగిరి పీఠాధిపతులు అభినవ ఉద్దండ విద్యానృసింహ భారతీ స్వామి, సద్గురు శివానందమూర్తి, శ్రీ విశ్వయోగి విశ్వంజీ తదితర ప్రముఖులెందరో ఈ పీఠాన్ని సందర్శించారు. లోక కల్యాణం కోసం.. పీఠంలో లోక కల్యాణం కోసం నిత్యం పలు రకాల పూ జలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూంటారు. ప్ర త్యేక సందర్భాల్లో రాహుకేతువుల కల్యాణం, నవావరణార్చన, శ్రీనివాస కల్యాణం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వంటివి నిర్వహిస్తారు. టీటీడీ శ్రీదేవి, భూ దేవీ సమేత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి, తిరుత్తణి దేవస్థానం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పీఠానికి అందజేశాయి. -
బైక్, స్కూటీలను ఢీకొన్న కారు
● ఏడుగురికి గాయాలు ● బాలుడి పరిస్థితి విషమంకాకినాడ రూరల్: కాకినాడ – పిఠాపురం రోడ్డులో తిమ్మాపురం సాయిబాబా గుడి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఇందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. పిఠాపురం నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు తిమ్మాపురం వద్ద ఎదురుగా వెళుతున్న ఎన్ఫీల్డ్ బైక్, స్కూటీలను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు చిన్నారి హారిక రత్నం, చిన్నారి మణికంట, స్కూటీపై వెళుతున్న తిమ్మాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు సవరం అరుణకుమార్, విజేత, వారి కుమారుడు బెన్ను సుశాంత్ (14) పాటు కారులోని భార్యాభర్తలు రమణయ్యపేటకు చెందిన మాగంటి బాబూరావు, ప్రవీణ గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు తర్వాత రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ పోల్ను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కారు నడుపుతున్న బాబూరావు బ్రేక్పై కాలు వేయడానికి బదులుగా ఎక్స్లేటర్పై వేయడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న వాహనాలను ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారని, బాలుడు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై గణేష్బాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్షతగాత్రులకు ఏపీడీ సేవలు ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ప్రయాణం చేస్తున్న ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాథ్ వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అప్పటి వరకూ గాయపడిన క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్లోకి క్షతగాత్రులను స్థానికులతో కలసి ఆయన ఎక్కించారు. -
కొనుగోళ్లకు రెడీ
● 25 నుంచి వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ● 5 వేలం కేంద్రాల్లో ఏర్పాట్లు ● 12,612 మంది రైతులు ● 14,412 బ్యారన్లు ● 80 మిలియన్ల ఉత్పత్తి అంచనా దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు వేలం కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు కొనుగోళ్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1962 నుంచి.. రాజమహేంద్రవరం రీజియన్ ఐదు వేలం కేంద్రాల పరిధిలోని రైతులు ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) దాదాపు 60 సంవత్సరాలుగా వర్జీనియా పొగాకును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 1962లో దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో పొగాకు సాగుకు శ్రీకారం చుట్టారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ఆర్థికంగా నిలదొక్కుకుని, జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పండిస్తున్న పొగాకుకు దీటుగా నాణ్యమైన పొగాకు పండించడంలో మన రైతులు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. దీంతో, ఇక్కడ పండించిన పొగాకు ఎక్కువగా చైనా, రష్యా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. మన పొగాకులో 90 శాతం.. సిగరెట్ల తయారీకి వినియోగిస్తున్నారు. 29,132 హెక్టార్లలో.. ఈ ప్రాంతంలోని 12,612 మంది రైతులు, 2025–26 పంట కాలంలో 14,412 బ్యారన్లు కలిగి ఉన్నారు. వీరు మొత్తం 29,132 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 28,011 హెక్టార్లు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో 1,120 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది. తొర్రేడు ప్రాంతంలో 893 మంది రైతులు 964 బ్యారన్లు కలిగి ఉన్నారు. తాము పండించిన పొగాకును వీరు దేవరపల్లి వేలం కేంద్రానికి తెచ్చి, అమ్ముకోవలసి ఉంది. ఈ ఏడాది పొగాకు ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతుందని బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. 49.32 మిలియన్ కిలోలకు అనుమతి ప్రస్తుత పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల పరిధిలో 49.32 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ, సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో దాదాపు 80 మిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందన్నది అధికారుల ప్రాథమిక అంచనా. గత ఏడాది 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది మార్కెట్లో కిలోకు ధర గరిష్టంగా రూ.453, కనిష్టంగా రూ.250, సగటున రూ.297.50 చొప్పున లభించింది. గత ఏడాది ధరలు ఇలా.. గత ఏడాది ఈ ప్రాంతంలో బ్రైట్ గ్రేడ్ 45.13, మీడియం గ్రేడ్ 31.19, లో గ్రేడ్ 7.56 మిలియన్ కిలోల చొప్పున ఉత్పత్తి జరిగింది. బ్రైట్ గ్రేడుకు కిలోకు సగటున రూ.347.93, మీడియం గ్రేడుకు రూ.270.60, లో గ్రేడుకు రూ.132 చొప్పున ధర లభించింది. అత్యధిక ఉత్పత్తి జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో జరిగింది. దేవరపల్లి వేలం కేంద్రంలో కిలో అత్యధిక సగటు ధర రూ.311 పలికింది. జంగారెడ్డిగూడెం–1లో రూ.299, జంగారెడ్డిగూడెం–2లో రూ.300.66, కొయ్యలగూడెంలో రూ.296.60, గోపాలపురంలో రూ.296.57 చొప్పున కిలో సగటు ధర లభించింది. రూ.2,664 కోట్ల పొగాకు అమ్మకాలు 2024–25 పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల్లో 200 రోజుల పాటు వేలం నిర్వహించగా రూ.2,664 కోట్ల విలువైన 83.88 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయి. గత పంట కాలంలో 14,754 మంది రైతులు 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. 6,79,450 బేళ్లు కొనుగోలు చేశారు. అయితే లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు ట్రేడర్లు నిరాకరించారు. కిలో రూ.50 పలికినప్పటికీ కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో సుమారు 10 లక్షల కిలోల లో గ్రైడ్ పొగాకు రైతుల వద్దనే ఉండిపోయింది. -
అతివేగం.. అదే కారణం
కాకినాడ నుంచి కనిగిరి వెళుతున్న కారును అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సురక్షితంగా బయటపడిన పరసా కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి నిమిషం ముందు తన కారును ఆ కారు ఢీకొట్టగా చాకచక్యంగా అదుపు చేయడం వల్ల ప్రాణాలను కాపాడుకోగలిగామని, లేదంటే తన కుటుంబం ప్రమాద బారిన పడేదని కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో తనతో పాటు భార్య తేజస్విని, కుమారుడు, కుమార్తె, డ్రైవర్ ఉన్నట్టు ఆయన వివరించారు. దైవదర్శనానికి ద్రాక్షారామ వెళుతున్నట్టు చెప్పారు. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి తన కుటుంబాన్ని కాపాడారంటూ చెప్పారు. చాలా సేపు షాక్ నుంచి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు తేరుకోలేదు. -
తెలియక.. తికమక
● కియోస్క్ల ద్వారా సేవలకు ఇబ్బంది ● టిక్కెట్లు ఎలా పొందాలో అర్థంకాక అవస్థలు ● నెట్ స్లోగా ఉండడంతో అలస్యంగా ప్రక్రియ అన్నవరం: కొత్త విధానం తెస్తే సులువుగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ అర్థం కావాలి.. లేకుంటే అవగాహన కల్పించాలి.. అప్పుడే సత్ఫలితాలను ఇస్తోంది. అది జరగకుంటే మొదటికే మోసం వస్తుంది.. అచ్చం అలానే అన్నవరం దేవస్థానంలో కొత్తగా తెచ్చిన కియోస్క్ల పరిస్థితి ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, వారు టిక్కెట్లు సులువుగా పొందాలనే ఉద్దేశంతో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి భక్తులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. ఇక్కడి రోశయ్య మండపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ మెషీన్లను ఉగాది పర్వదినం రోజున దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు అట్టహాసంగా ప్రారంభించారు. ఏ సేవలు పొందవచ్చంటే.. ప్రతి పనిలో ఆధునీకత అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యలంలో భక్తులకు సులువుగా సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ కియోస్క్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు స్వామివారి అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ఎటువంటి ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేందుకు వీటిని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఆచరణలో మాత్రం భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవగాహన లేక.. అర్థం కాక దేవస్థానంలోని రోశయ్య మండపంలో ఒకేచోట ఎనిమిది కియోస్క్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఓ సహాయకుడు మాత్రమే ఉండి మెషీన్లు ఎలా ఉపయోగించాలో చెబుతున్నారు. ఎనిమిది మెషీన్ల వద్ద ఉన్న భక్తుల్లో కొంతమందికి మాత్రమే అది తెలుస్తోంది. మిగిలిన వారికి అర్థం కాక తిరిగి మళ్లీ చెప్పమంటే అక్కడున్న వ్యక్తి విసుక్కుంటున్నట్టు భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఎలా వినియోగించాలో తెలిపే బోర్డు ఉన్నా, దానిని చూసైనా కొందరు అర్థం చేసుకుంటారు. అదీ ఏర్పాటు చేయలేదు. ఒక్కోసారి గందరగోళం కియోస్క్ల ద్వారా టిక్కెట్ల కోసం ఫోన్పే, పేటీఎం తదితర వాటి ద్వారా నగదు చెల్లించినా, ఒక్కోసారి టిక్కెట్లు రావడం లేదు. దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. ఆందోళన చెంది అక్కడున్న వ్యక్తిని అడగాల్సి వస్తోంది. ఒక్కోసారి వెంటనే టిక్కెట్ వచ్చేలా చేస్తున్నారు. కొన్నిసార్లు చాలా సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. కనీసం రెండు మెషీన్లకు ఒకరు చొప్పున సహాయకుడు ఉంటే భక్తులు సులభంగా టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది. మెషీన్లు ఏర్పాటు చేసిన కరూర్ వైశ్యా బ్యాంక్ లేకుంటే దేవస్థానం ఈ ఏర్పాట్లు చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా అక్కడ వేగమైన వైఫే ఉండాలి. ఇంటర్ నెట్ స్లోగా ఉండడంతో భక్తులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అదే విధంగా ఈ కియోస్క్ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కల్యాణంలో కళర్ఫుల్
● కాగిత పూలతో అలంకరణకు సిద్ధం ● నవమికి సిద్ధమవుతున్న సత్యవాడ కె.గంగవరం: సీతారాముల కల్యాణంలో ఇక్కడ ప్రత్యేకత చాటుతోంది.. కళాత్మకతను చాటుతోంది.. తరతరాలుగా ఇక్కడ అలంకరణకు పెట్టింది పేరు. జిల్లా సరిహద్దులు దాటేలా తన కీర్తిని సత్యవాడ చాటుతోంది. స్వామివారి కల్యాణ మహోత్సవం అంటే ప్రతి కుటుంబం తన సొంత ఇంట్లో వివాహంలా భావిస్తుంది. మహా శివరాత్రి తదుపరి దినం నుంచి శ్రీరాముని కల్యాణం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ స్వామివారి అలంకరణకు రేయింబవళ్లు శ్రమించి తమ కళా నైపుణ్యంతో శ్రీరామచంద్రుడిని అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. సత్యవాడ గ్రామంలో నాలుగు వీధుల్లో సీతారాముల ఆలయాలు ఉంటాయి. ఆయా ఆలయాల వద్ద ప్రతి వీధి వారు కల్యాణోత్సవాలు జరపడం ఇక్కడ ఆనవాయితీ. 150 ఏళ్లుగా ఏటా ఉగాది పర్వదినం రోజున శ్రీరాముని కల్యాణానికి రాట ముహూర్తం చేస్తారు. చలువ పందిళ్లు వేసి, వంశపారపర్యంగా వస్తున్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాగితపు పూలతో అలంకరించి ఆ శ్రీరామునికి తమ కళాత్మకతను నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఏటా శ్రీరామ నవమికి స్వయంశక్తితో తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న కాగితపు పూల అలంకరణ, చలువ పందిళ్లను రూపొందించడంలో సత్యవాడ గ్రామస్తులు ప్రత్యేకత చాటుతున్నారు. వీరు తరతరాలుగా తమలోని కళా నైపుణ్యాన్ని శ్రీరామునికి నివేదిస్తూ తమలోని భక్తి భావాన్ని తెలియజేస్తున్నారు. తెల్లవారితే ఎవరి వ్యాపారాల్లో వారు తలమునకలయ్యే వీరిలో కూడా అంతర్గతంగా ఎంతో సృజనాత్మకత ఉంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సైతం కాగితపు పూల తయారీలో అందెవేసిన చేయి. తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భద్రాచలంలో మాదిరిగానే ఏటా ఇక్కడ శ్రీరామ నవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక ద్వారా తమ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే ఉద్దేశంతో రంగురంగుల కాగితాలతో పువ్వులను తయారు చేసి వాటిని నవమికి వేసిన చలువపందిళ్లలో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఆ విధంగా మొదలైన ఈ వంశపారంపర్య మహోత్సవాన్ని ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా నేటికీ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దూరప్రాంతాల్లో ఉన్న బంధువులు ఇళ్లకు చేరుకున్నా. ఈ నెల 27 నుంచి 30 వరకూ నవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వ్యవసాయ కూలీ నిజాయితీ
నిడదవోలు: కనిపించిన వస్తువును ఎవ్వరూ చూడకుండా సొంతం చేసుకుందామనుకునే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కానీ, ఆ వ్యవసాయ కూలీ తాను ఈ చోరధోరణికి అతీతమని నిరూపించుకున్నాడు. తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలివీ.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని బంధువుల ఇంట ఆదివారం జరిగిన వివాహ వేడుకకు నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన చెందిన ఎన్.నాగేశ్వరరావు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మెడలోని సుమారు రూ.2.70 లక్షల విలువైన రెండున్నర కాసుల బంగారు గొలుసు పడిపోయింది. ఆ దారి వెంట నడిచి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అరిగెల శేషారావు కంట ఆ గొలుసు పడింది. దానిని ఎవరు పోగొట్టుకున్నారో, వారికి ఎలా అందజేయాలో తెలియక ఆలోచనలో శేషరావు పడ్డారు. అంతలో తన చైన్ పడిపోయిందంటూ నాగేశ్వరరావు లబోదిబోమంటూ వీధుల్లో వెతుకుతున్నారు. విషయం తెలిసిన శేషారావు నిజాయితీతో ఆ బంగారు గొలుసును నాగేశ్వరరావుకు అప్పగించారు. శేషారావు నిజాయితీని అందరూ అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. -
కోతుల దాడిలో వృద్ధురాలి మృతి
ప్రత్తిపాడు రూరల్: కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దిపాలెం గ్రామానికి చెందిన దానబోయిన చినబుల్లి (70) స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న మామిడి తోటలో ఇల్లు నిర్మించుకుని అందులో కుమార్తెతో కలసి జీవిస్తుంది. ఇంటి వద్ద అల్లుడు, కుమార్తె లేని సమయంలో తోటలోని తనకు చెందిన పశువుల వద్దకు వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటంలో ఒక్కసారిగా కోతులు దాడిచేసి గాయపర్చాయి. ఈ దాడితో చినబుల్లి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు జరిపించి పెద్ద కుమార్తె లక్ష్మి వద్ద జీవనం సాగిస్తుంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
శ్రీనివాసా.. చిద్విలాసా
ఆత్రేయపురం: ఆ వాడపల్లి వాసుడిని చూసిన ప్రతి మది మురిసింది.. వెంకన్న క్షేత్రంలో గోవింద నామస్మరణ ప్రతిధ్వనించింది.. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులతో సంద్రంగా మారింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రావడంతో కోలాహలంగా మారింది. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మీ హోమం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలకరించారు. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజే సుమారు లక్ష మంది వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వేలాది మంది అన్నప్రసాదం స్వీకరించారు. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా కట్టెల పొయ్యిలపై అన్న ప్రసాదాన్ని తయారు చేయించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం సీఐలు శేఖర్బాబు, ఉదయభాస్కర్, ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. ఇదిలాఉంటే స్వామివారిని ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతమ్రాజు తదితరులు దర్శించుకున్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ కోనసీమ తిరుమల దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. రావులపాలెం సీఆర్సీ వ్యవస్థాపకుడు విక్టరీ వెంకట్రెడ్డి సారథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఫ వాడపల్లి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విజయవాడ, కానూరు వాస్తవ్యులు కాశి చొప్పరపు రమేష్బాబు, సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం సమర్పించారు. వీరికి స్వామివారి ఫొటోను ఆలయ సిబ్బంది వై.శ్రీనివాస్ అందించారు. ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తులు ఫ మార్మోగిన గోవింద నామస్మరణ -
ఇంతలా చెప్పి..
హెల్మెట్ తలకెక్కక అనేక ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చెప్పి చెప్పి పోలీసులు విగిసిపోతున్నారు. చివరికి తాళ్లపూడిలో వినూత్న ప్రయోగం చేశారు. ఆ గ్రామ బస్టాండ్ సెంటర్లో శనివారం ఎస్సై టి.రామకృష్ణ వాహన తనిఖీ చేశారు. హెల్మెట్ లేనివారికి కౌన్సెలింగ్ ఇచ్చి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్ కొనిపించి, దానిని ధరింపజేసి పంపించారు. ఇకపై హెల్మెట్ పెట్టుకోకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. –తాళ్లపూడి పక్కన కాలువే అడిగేవారు లేకుంటే ఇలానే ఉంటోంది. పక్కనే కాలువ ఉన్నా, నీటిపారుదల శాఖ అభ్యంతరాలు ఉన్నా ఎవరికీ పట్టవు. బొబ్బర్లంక నుంచి మధ్య డెల్టా కాలువ వెంబడి రావులపాలెం ప్రధాన రహదారి ఉంటోంది. ఇటుగా వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఇటుగా కాలువ వెంబడి ఆక్రమణలు జోరందుకున్నాయి. ఇటీవల పులిదిండి వద్ద ఆర్అండ్బీ రోడ్డుకు చేర్చి, కాలువ పక్కనే వాణిజ్య షెడ్డు వేసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. – ఆత్రేయపురం -
సముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం
అల్లవరం: ఓడలరేవు తీరంలోని గ్రోయిన్ల నిర్మాణాల వద్ద భారీ కెరటాలకు అమలాపురానికి చెందిన దొమ్మేటి లోకేష్ (17) శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. మైరెన్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ల సాయంతో అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఓడలరేవు సముద్ర తీరంలో లోకేష్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అక్కడ లోకేష్ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. మైరెన్ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఓడలరేవు బీచ్ ప్రమాదకంగా ఉందని, యువతీ యువకులు సేఫ్టీ విధానాలు పాటించకుండా సముద్రంలో స్నానాలు చేయకూడదని సూచించారు. గ్రోయిన్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తున్న టెట్రాపాడ్పై నాచు ఉందని, వీటిపై నడిస్తే సముద్రంలోకి జారిపడే అవకాశం ఉందన్నారు. బీచ్కు వెళ్లే వారంతా జాగ్రత్తలు పాటించాలన్నారు. రాత్రి వేళల్లో తీరంలో సంచరించ వద్దని సూచించారు. -
గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి
రాజానగరం: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి గడ్డి మందు తాగగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై నారాయణమ్మ శనివారం తెలిపారు. మండలంలోని శ్రీకృష్ణపట్నంకు చెందిన మండారపు వీరబాబు (38) ఫైనాన్స్లో ఆటోను కొనుగోలు చేశాడు. అయితే వాయిదాలను సకాలంలో చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్సర్ల నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఈ నెల 16న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని రాజమహేంద్రవరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఎస్సై తెలిపారు. రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం కడియం: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ వ్యక్తి (50) మృతదేహం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. నీలం రంగు లుంగీ, నీలం–గ్రీన్ గళ్ల షర్ట్ ఒంటిపై ఉన్నాయన్నారు. అతని వివరాలు తెలిస్తే 94407 79249 ఫోన్ నంబరుకు తెలపాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరంలోని ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. దీనిపై సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన డి.కృష్ణమూర్తి, డి.ఈశ్వరమ్మ, డి.మనోహర్, కొట్నాన కృష్ణమూర్తి, కె.లక్ష్మి, వేగిరెడ్డి అఖిల ఒకే కారులో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికని బయలు దేరారు. పై జంక్షన్కు వచ్చేసరికి ఈ కారును కాకినాడ వైపు రోడ్డు మలుపు తిరుగుతున్న లారీ ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న పై ఆరుగురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను రాజానగరంలోని జీఎస్ఎల్ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స అనంతరం విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం కాట్రేనికోన: పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని కథనం ప్రకారం.. కాట్రేనికోనలోని రామస్వామితోటకు చెందిన మోకా శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేట్లపాలెంలో ఓ ఇంటి బేస్మెంట్ కోసం అవసరమైన మట్టిని శ్రీకాంత్ తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. పది రోజులుగా లేఅవుట్లకు మట్టిని టిప్పర్లతో తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇంటి బేస్మెంట్కు మట్టిని తరలిస్తుండగా తన ట్రాక్టర్ను పట్టుకున్నారంటూ 100కు అతను ఫోన్ చేశాడు. అనంతరం జిల్లేళ్లవారిపేట సమీపంలో వేట్లపాలెం నుంచి మట్టితో వస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారన్నారు. కొంత సేపటికి లారీలను వదిలేశారన్నారు. తన ట్రాక్టర్ కోసం వెళ్తే కేసు కట్టేశామని పోలీసులు అంటున్నారని, దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి శ్రీకాంత్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతనికి స్థానిక వైద్యుడిచే వైద్యం చేయించగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై కాట్రేనికోన ఎస్సై అవినాష్ను వివరణ కోరగా స్థానికుల ఫిర్యాదుపై మట్టి ట్రాక్టరును పట్టుకున్నామని, పోలీసులు వేధింపులేవీ లేవన్నారు. -
అర్చక సంఘం నాయకులు, మహిళలపై దాడి
కాట్రేనికోన: కుండలేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకుల కుటుంబాల మధ్య చెలరేగిన వివాదాన్ని సర్థి చెప్పేందుకు వచ్చిన అర్చక సంఘం నాయకులు, బ్రాహ్మణ మహిళలపై ఓ వర్గం దాడి చేసింది. కుండలేశ్వరం దేవస్థానంలో కాళ్లకూరి బాపన్న, మల్లన్న, సాంబయ్య కుటుంబాలకు చెందిన అర్చకులు దశాబ్దాలుగా వంతుల వారీగా స్వామికి సేవలు అందిస్తున్నారు. ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తుల రద్దీతో పాటు ఆదాయం పెరిగింది. ఉగాదితో గత అర్చకుల వంతు పూర్తి కావడంతో కొత్తవారికి అవకాశం ఇవాల్సి ఉండటంతో, ఒప్పందం కుదరక అర్చక కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఆంఽధ్ర రాష్ట్రీయ అర్చక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామశర్మ (మురమళ్ల రాంబాబు) ఆధ్వర్యంలో అర్చక సంఘం నాయకులు పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన వర్గం ప్రస్తుత అర్చకుడిని కొనసాగించాలని, పూర్వం నుంచి అనుసరిస్తున్న ఒప్పందంతో కాళ్లకూరి మల్లేశ్వరరావుకు ఇవ్వాలని అర్చక సంఘం నాయకులతో పాటు ఓ వర్గం పట్టుబట్టింది. దీనికి అధికార పార్టీ నాయకులు ఏకీభవించకుండా అర్చక సంఘం నాయకులు, అర్చకులతో పాటు మహిళలపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఆలయం ముందు బైఠాయించారు. అనంతరం రాష్ట్రీయ అర్చక సంఘం అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఇరువర్గాలతో చర్చలు జరిపి వివాదానికి తెరదించారు. కుండలేశ్వరం ఆలయ ప్రధాన అర్చకులుగా కాళ్లకూరి మల్లేశ్వరశర్మ ఏడాది పాటు ఉండేందుకు అంగీకరించడంతో ఈఓ వెంకట సత్యదుర్గ సమక్షంలో బాధ్యతలను అప్పగించారు. -
గెలగిల
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026ఖండవల్లిలో అరటి తోట పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగడం.. మన అరటి రైతులకు నష్టాల్ని తెచ్చి పెడుతోంది. నెల రోజుల క్రితం వరకూ 10 టన్నుల లారీ అరటి గెలల ధర రూ.2.20 లక్షలు పలకగా.. ప్రస్తుతం అది సగానికి పైగా తగ్గి, రూ.లక్షకు పడిపోయింది. తోటల వైపు కన్నెత్తి కూడా చూసేవారు లేకపోవడంతో రైతులు.. ఒకవేళ గెలలు కొన్నా అమ్ముకునే దారి లేక వ్యాపారులు దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పక్వానికి వచ్చిన గెలలు తోటల్లోనే ముగ్గిపోతూండటం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. వాటిని అలాగే వదిలేయలేక కొంత మంది పక్వానికి వచ్చిన గెలలను మార్కెట్కు తరలించి, అయినకాడికి అమ్ముకుంటున్నారు. 7,500 హెక్టార్లలో.. జిల్లాలో అన్ని రకాలు కలిపి 7,500 హెక్టార్లలో అరటి సాగు జరుగుతోంది. పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి తదితర మండలాల్లో దాదాపు 8 వేల మంది రైతులు అరటి సాగు చేస్తున్నారు. అరటి తోటలను నమ్ముకుని కూలీలు, వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే కూలీలు, గెలలు కోసే కూలీలు, అరటి వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో వీరందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగుమతులకు బ్రేక్ గత ఏడాది డిసెంబర్లో 10 టన్నుల అరటి ధర రూ.1.80 లక్షలు పలకగా.. అప్పటి నుంచీ అది క్రమంగా పెరుగుతూ గత నెలలో ఏకంగా రూ.2.20 లక్షలకు చేరింది. మన జిల్లా నుంచి ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాలకు అరటి ఎగుమతులు జరిగేవి. గతంలో బెంగాల్లో అరటి సాగు పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు అక్కడ ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో సాగు జరుగుతోంది. దీనికితోడు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా అరటి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా మన అరటికి నెల రోజులుగా డిమాండ్ తగ్గింది. ఎగుమతులు క్రమంగా తగ్గిపోయాయి. గతంలో జిల్లా నుంచి ప్రతి రోజూ 80 నుంచి 100 లారీల గెలల ఎగుమతి జరిగితే నేడు అది 40 నుంచి 50 లారీలకే పరిమితమవుతోంది. ఈ పరిస్థితుల్లో మన జిల్లాలో అరటి ధరల పతనమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 వేల హెక్టార్లలో తోటల నుంచి దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ, ఇతర రాష్టాలకు ఎగుమతులు పడిపోయాయి. ఆ సరకంతా స్థానిక మార్కెట్లకు ఒక్కసారిగా వస్తూండటంతో ఇక్కడ కూడా రైతులు ఆశించిన ధర రావడం లేదు. మరోవైపు ఎగుమతులు కూడా తగినంతగా లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని స్థానిక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ధరలు పతనమయ్యాయిలా.. ప్రస్తుతం మార్కెట్లో 10 టన్నుల లారీ కర్పూర అరటి ధర గతంలో రూ.2 లక్షల వరకూ పలకగా.. ప్రస్తుతం రూ.లక్షకు పతనమైంది. గతంలో వ్యాపారులు తోటలు కొనుగోలు చేసినప్పుడు చక్కెరకేళీ గెలకు రూ.250 నుంచి రూ.300 వరకూ పెట్టారు. ప్రస్తుతం దానికి రూ.250 మాత్రమే దక్కుతోంది. అలాగే, ఎర్ర చక్కెరకేళీ గెలకు తోటల వద్ద రూ.400 నుంచి రూ.500 వరకూ పెట్టగా, మార్కెట్లో ఇప్పుడు రూ.300 మాత్రమే వస్తోంది. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో ధర లేకపోవడంతో వారు తోటలను వదిలేస్తున్నారు. అయితే, పక్వానికి వచ్చిన గెలలు కోయకపోతే అది పండిపోయి మొత్తం తోట పాడైపోతుందని, దీంతో మొదటికే మోసం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత మంది రైతులు గెలలను సైకిళ్లపై మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. మార్కెట్లో సైకిల్ లోడ్ (6 గెలలు) కర్పూరం అయితే నాణ్యతను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1,200, చక్కెరకేళీకి రూ.1,500 నుంచి రూ.2 వేలు, ఎర్ర చక్కెరకేళీకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ధర పలుకుతోంది. కుదేలైన అరటి ధరలు నెల క్రితం 10 టన్నుల లారీ ధర రూ.2.20 లక్షలు నేడు రూ.లక్ష గతంలో రోజూ 100 లారీల్లో ఇతర రాష్ట్రాలకు.. ప్రస్తుతం అందులో సగమే ఎగుమతులు రైతులు, వ్యాపారుల గగ్గోలు నష్టపోతున్నాం తోటలు అమ్మినప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెలను రూ.250కి అమ్మాను. సగం తోట కోసిన తరువాత ధరలు పతనమవడంతో వ్యాపారులు గెలలు కోయడమే మానేశారు. దీంతో నష్టాల పాలవుతున్నాం. – కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు, పెరవలి మండలం గెలలు పాడైపోతున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. నెల రోజులుగా ధరలు తగ్గడంతో వ్యాపారులు తోటల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పక్వానికి వచ్చిన గెలలు ముగ్గిపోయి, పాడైపోతున్నాయి. – సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం -
రత్నగిరి.. కిక్కిరిసి..
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో ఒక్క వ్రతాల విభాగం ద్వారానే రూ.20 లక్షలు రాగా, ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.20 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యదేవుని దర్శించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ఇంజినీర్ ˘ అన్నవరం: జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ–బెంగళూరు) ప్రొఫెసర్ గాలి మాధవీలత తన కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని శనివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రొఫెసర్ మాధవీలతను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. జేఎన్టీయూలో విద్యాభ్యాసం మాధవీలత కాకినాడ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 1992లో బీటెక్, తరువాత వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఎంటెక్ చదివారు. ఐఐటీ మద్రాస్లో సివిల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశారు. తరువాత ఐఐటీ గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తూనే బెంగళూరు ఐఐఎస్సీలో డాక్టోరియల్ రీసెర్చ్ చేశారు. అనంతరం మెకానిక్స్ ఆఫ్ సోయిల్ అండ్ గ్రౌండ్ ఎన్ఫోర్స్మెంట్లో పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీనాబ్ నదిపై వంతెన నిర్మించేందుకు అక్కడి నేల, కొండల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆ తరువాత ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకూ మాధవీలత అక్కడే ఉండి పర్యవేక్షించారు. -
పాత రాతియుగం
● ఈద్ ముబారక్ పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల అనంతరం జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ మసీదుల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పేదలకు దానధర్మాలు చేయాలని, అలా చేసే వారి పట్ల అల్లాహ్ దయ ఎన్నటికీ ఉంటుందని మత పెద్దలు చెప్పారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ దర్గాలో వేలాది మంది ముస్లింలు దువా చేసి స్వీట్లు పంచుకున్నారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) ప్రాభవం తగ్గుతూ..ఇళ్ల వద్ద మూలకు చేరిన రాతి రోళ్లు ● రాతి పనిముట్లకు తగ్గిన ఆదరణ ● శుభకార్యాలకే పరిమితమవుతున్న రోళ్లు, సన్నికల్లు, తిరగళ్లు ● ఆధునికత మేళవింపుతో అక్కడక్కడ అమ్మకాలుపిఠాపురం: ఒకప్పుడు ఏ ఇంట చూసినా రోలు, రోకలి, కల్వం, రుబ్బురోలు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లు అతివలకు వంటింటి నేస్తాలుగా ఉండేవి. వీటిని సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించేవారు. రోలు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి.. రోకలి శ్రీమన్నారాయణుడు.. తిరగలి శివుడు.. దాని పిడి పార్వతీదేవి.. ఈ పవిత్ర భావనతోనే వాటికి పొరపాటున కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడేవారు. ఒకవేళ అలా కాలు తగిలితే మహాపాపంగా భావించేవారు. ప్రతి ఇంట్లో ఆయా రాతి పనిముట్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ, కాలక్రమంలో మిక్సీలు, గ్రైండర్ల వంటి ఆధునిక గృహోపకరణాలు వచ్చిన తరువాత నాటి శ్రీపాత రాతి యుగంశ్రీ ప్రాభవం క్రమంగా తగ్గుతోంది. అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా వివాహాది శుభకార్యాల్లో.. అది కూడా పసుపు కొట్టడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతోంది. ఆ రుచే వేరు పండగలు సమీపిస్తున్నా, ఊరగాయల సీజన్ మొదలైనా.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నా.. గతంలో రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లకు బోలెడంత పని. పప్పులను రోటిలో దంచేవారు. మసాలాలు కల్వంలో నూరేవారు. రుబ్బురోటిలో చేసే రోటి పచ్చడి అంటే ఇప్పటికీ చాలా మంది శ్రీఆ రుచే వేరుశ్రీ అంటూ లొట్టలేస్తారు. అంతే కాదు.. వీటిల్లో ఎప్పటికప్పుడు తయారు చేసే పచ్చళ్లు, రకరకాల పొడులు తాజాగా ఉంటాయి. అంతా రెడీమేడ్ పాత కాలం నాటి రాతి పనిముట్లు వాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆధునిక జీవితంలో వేగం పెరిగింది. బతుకుతెరువు కోసం కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం మిక్సీలు, గ్రైండర్ల వంటి రకరకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాత రాతి పనిముట్ల స్థానాన్ని ఆక్రమించాయి. గతంలో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టడం, అరిసెల పిండి దంచడం వంటి పనులను పది మంది కలసి చేసేవారు. ఇప్పుడన్నింటికీ యంత్రాలే. పైగా, అన్నీ షాపులో రెడీమేడ్గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరకు ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్. అయితే, వీటిలో ఏ కల్తీలు జరుగుతున్నాయో.. మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయో గమనించే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఆధునిక రూపంలో.. రోళ్లు, రోకళ్లు, తిరగలి ఎంత పెద్దగా ఉన్నా గతంలో చాలా సులభంగా ఉపయోగించేవారు. తిరగలి పై భాగాన్ని సులువుగా లేపేవారు. మరీ పెద్దదైతే ఇద్దరు కలిసి లేపేవారు. రుబ్బురోలు పొత్రాన్ని సులభంగా ఎత్తేవారు. ఇప్పుడు ఎవ్వరికీ రోటిలో దంచే తీరికా లేదు.. పొత్రం ఎత్తే ఓపికా లేదు. అయితే, ఈ పనిముట్లపై ఇప్పటికీ కొంత మందికి మోజు ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని వీటి తయారీదారులు ఇప్పటి అవసరాలకు తగినట్లుగా రాతి రోళ్ల తయారీలో స్మార్ట్ టెక్నిక్స్ వాడుతున్నారు. మార్బుల్, గ్రానైట్తో పాటు సోప్ స్టోన్స్, శాండ్ స్టోన్లతో తక్కువ బరువుతో ఈ పనిముట్లు తయారు చేస్తున్నారు. రుబ్బుతున్నప్పుడు, విసురుతున్నప్పుడు పిండి సులువుగా తీసుకునేందుకు అనుకూలంగా ట్రేలు ఏర్పాటు చేస్తున్నారు. తిరగలిలో పైన పప్పులు పోసేందుకు చెక్కతో మూతలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సన్నికల్లును సన్నగా కత్తిరిస్తున్నారు. రుబ్బురోలుకు స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ పెడుతున్నారు. ఆధునిక కిచెన్లకు సంప్రదాయ పనిముట్లను జోడించేలా వీటిని తయారు చేస్తున్నారు. నాపరాతితో తయారు చేసిన స్మార్ట్ రుబ్బురోలు స్మార్ట్ రాతి పరికరాలుపెళ్లిళ్లలోనే ప్రాధాన్యం వివిధ ప్రాంతాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకల్లో రాతి రోళ్లకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. ప్రతి శుభకార్యానికీ పసుపు కొట్టడం ఆనవాయితీ. వీటితో ధాన్యం దంచడం, కొట్నాలు వంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తమ ఇళ్లల్లో చాన్నాళ్లుగా పక్కన పెట్టేసిన వీటిని శుభకార్యాల్లో మాత్రం తప్పనిసరిగా బయటకు తీస్తారు. కొందరైతే రెడీమేడ్ పనిముట్లతో శుభకార్యాలు పూర్తి చేస్తున్నారు. పెళ్లితంతులను బట్టి వీటికి ప్రాధాన్యం పెరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే తాళిబొట్టును రోకలికి, కాడికి కట్టి, పాలు పోస్తూం చేసే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. – వెలిది రమేష్శర్మ, పురోహితుడు, కొత్తపల్లి -
ఉగాది కానుక కాదు.. కంటితుడుపు చర్య
కపిలేశ్వరపురం (మండపేట): ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రకటన కంటితుడుపు చర్య మాత్రమేనని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల చంద్రబాబు పాలనలో 6,28,347 ఉద్యోగాలిచ్చామంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారని గుర్తు చేశారు. ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామంటూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలన్నీ అబద్ధాలని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఒప్పందాలు చేసుకున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకమన్నారు. రాష్ట్రంలో ఏయే కంపెనీఎల్లో ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయో నియామక ఆర్డర్లతో కూడిన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు, అరాచక పాలనతో సామాన్య ప్రజలకు ప్రభుత్వం పట్ల అసహనం కలుగుతోందన్నారు. విసిగి వేసారిన నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల్లో చేరిన వారు ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలన తీరుపై వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలనే డిమాండ్తో ప్రజలతో కలిసి పోరాడతామని ఎమ్మెల్సీ తోట స్పష్టం చేశారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైయున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,875, అన్నదాన విరాళాలు రూ.84,972, కేశఖండన ద్వారా రూ.6,760, తులాభారం ద్వారా రూ.550, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.22,095 కలిపి మొత్తం రూ.3,54,147 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. ఏడు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు. ఘనంగా పందిరి రాట ముహూర్తం అన్నవరం: ఈ నెల 26న ప్రారంభం కానున్న రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి శ్రీరామ నవమి వేడుకలకు, వచ్చే నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు శనివారం రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయం వద్ద పండితులు విఘ్నేశ్వర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి, మంత్రోచ్చారణల నడుమ ఉదయం 10.25 గంటలకు పందిరి రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమంలో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు చైర్మన్, ఈఓల కన్నా ముందుగానే పందిరి రాటను ముట్టుకునేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈఓ దంపతుల మధ్య నుంచే ఒక మహిళ చేయిపెట్టి పందిరి రాటను పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే ప్రకటించినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదంటూ సిబ్బందిపై ఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు
దేవరపల్లి: గౌరీపట్నంలోని ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు పుణ్యక్షేత్రంలో డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25వ తేదీ వరకూ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుని మరియతల్లిని ఆరాధిస్తూ దీవెనలు పొందుతున్నారు. ఈ నెల 16న పుణ్యక్షేత్రంలో ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ప్రకాష్లు మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించి నవదిన జపాలు, దివ్యబలి పూజ, జపమాల ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యక్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా కట్టుదిట్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు రానున్నందున అవసరమైన పోలీస్ బందోబస్తు, మంచినీరు, భోజన వసతి, ఉచిత వైద్య శిబిరాలు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్సవాల్లో పలువురు పీఠాధిపతులు, గురువులు పాల్గొంటున్నారు. -
స్వర్ణ శఠగోపం సమర్పణ
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి భీమవరం వాస్తవ్యులు 108 గ్రాముల సుమారు రూ.17 లక్షల విలువైన స్వర్ణ శఠగోపాన్ని సమర్పించారు. వుద్ధరాజు సత్యవతమ్మ పేరున వారి కుమారులు రాఘవరాజు, సూర్యనారాయణ రాజులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అలాగే ఆలయంలో కొత్తగా నిర్మించిన ఉచిత క్యూలైన్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ధర్మకర్తలి సభ్యుడు తమ్మన సాయిప్రసాద్ పాల్గొన్నారు. కల్యాణోత్సవాలకు శ్రీకారం వాడపల్లి వేంటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
ఆక్వాంక్షలు ఫలించక..
ఉప్పలగుప్తం: ఆక్వా రైతు ఆకాంక్షలు ఫలించడం లేదు.. ఈ సాగు లాభసాటిగా ఉండడం లేదు.. వైరస్ల ముప్పేట దాడితో ఎటూ పాలుపోవడం లేదు.. సాగు వదలలేక, ముందుకు సాగలేక అగమ్యగోచరంలా వారి పరిస్థితి మారింది. దేశానికి రైతే రాజు అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు రొయ్యలు సాగుచేసే రైతు రాజులాగే జీవించేవాడు. కొంత కాలంగా ఈ సాగులో నష్టాలను చూస్తూ ఢీలా పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సాగు కత్తి మీద సాములా మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పలువురు రైతులు కొంతకాలం సాగుకు విరామం ప్రకటించి సంవత్సరానికి రెండు సాగులు చేపట్టే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితులకు అనుకూలంగా జనవరి నుంచి జూన్ వరకూ చేసే సాగు కలసి వస్తుందని రైతులు గంపెడు ఆశతో పంట చేపడుతున్నారు. అయినప్పటికీ వాతావరణంలో మార్పు కారణంగా వైరస్ విజృంభించి నష్టాలు చవిచూడడం తప్పడం లేదని ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు, అమలాపురం రూరల్ మండలాల్లో అధికారంగా, అనధికారకంగా సుమారు 30 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిశ్రమ పద్ధతిలో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు. రొయ్య సాగు కలిసి వస్తే దానిపై వచ్చే ఆదాయం పెట్టుబడిగా వచ్చి, చేపల సాగుపై వచ్చే ఆదాయం రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హేచరీల నిర్వాహకులు నాసిరకమైన తల్లి రొయ్యలను వాడటంతో రొయ్య సీడ్ నుంచి ఈహెచ్పీ అనే వ్యాధి రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రొయ్య మేత ఎక్కువగా తీసుకుని ఎదుగుదల లోపించడంతో రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏరియేటర్లు ఎక్కువ సమయం తిప్పుతూ ఆక్సిజన్ అందించాల్సి వస్తుందని, ఇలా అధికంగా ఖర్చు అవుతుందని, రొయ్యలు సమయానికి మేతలు తీసుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సమయానుకూలంగా సాగును పరిశీలించుకుని శానిటైజర్లు, మందులు వాడుతూ అధికంగా ఏరియేటర్లను తిప్పుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న సైజులో ఉండగానే.. ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులకు ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తెల్లటి దుప్పటిలా మంచు తెర కప్పి విపరీతమైన చల్లదనాన్ని ఇస్తుంటే, ఉదయం పది గంటల నుంచి భానుడు భగభగలాడుతూ ఎండలు కాస్తూ వాతావరణంలో వేడిని పుట్టిస్తున్నాడు. దీంతో చెరువుల్లోని రొయ్యలు డీవోలతో ఉక్కిరిబిక్కిరై వైరస్లతో చిన్న సైజులోనే మృత్యువాత పడుతున్నాయి. కొంత మంది రైతులు లాభాల దిశగా చేప, రొయ్య మిశ్రమ సాగు (పాలీకల్చర్) చేస్తున్నా.. రొయ్య సాగు రోజులు గడవక ముందే కొత్త కొత్త తెగుళ్లతో చిన్న కౌంట్లోనే చనిపోవడంతో రొయ్యను పట్టకుండానే వదిలివేసి నష్టాలను చూస్తున్నారు. వాతావరణంలో విభిన్న మార్పులతో ఒకపక్క ఎండ, మరోపక్క మంచు కురుస్తూ చెరువులో నీటి, మట్టి నాణ్యత లోపించడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడం డెడ్ ఆల్గే, విష వాయువులు విజృంభిస్తున్నాయి. వెనామీ రొయ్యల సాగులో వైట్ గట్, సెల్ లూజ్, రెడ్ గిల్, బ్లాక్ గిల్, హిబ్రియో వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గోపవరంలో రొయ్యల పట్టుబడిఫ రైతులకు లాభసాటి లేదు‘రొయ్య’ ఫ వైరస్ల బారిన పంట ఫ వాతావరణ మార్పులే కారణం ఫ రోజురోజుకూ విజృంభిస్తున్న వైనం తీవ్రంగా నష్టపోతున్నాం హేచరీల నిర్వాహకులు పూర్వం మంచి నాణ్యత కలిగిన తల్లి రొయ్యలను తెచ్చి దానితో నాణ్యమైన పిల్లలను అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాసిరకమైన తల్లి రొయ్యలను వాడి నాసి రకమైన రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఎంతో ఆశలతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి బ్యాచ్లో దిగే రొయ్యకు కచ్చితంగా వైట్ గట్ సోకి సమయానికి మేత తీసుకోక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. అధికారులు దృష్టి సారించి హేచరీలపై చర్యలు తీసుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. –నల్లా వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, వానపల్లిపాలెం లాభాలు లేక.. వాతావరణంలో మార్పులకు చెరువులో రొయ్య పిల్ల లు డీవోకు గురవుతున్నాయి. దీంతో ఏరియేటర్లు ఎక్కువ సమయం తిపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రొయ్యలు సకాలంలో మేత తినకపోగా ఏరియేటర్లు తిప్పడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంత కష్టపడినా సాగు లాభదాయకంగా చేతికొస్తుందనే భరోసా లేదు. నేను మూడు ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నాను. సీడ్ విషయంలో నెల రోజుల క్రితం సుదూర ప్రాంతం నుంచి తెచ్చుకుని సాగు చేస్తున్నాను. అందులో ఒక చెరువు ఇటీవల హిబ్రియో వైరస్ వ్యాపించి పట్టుబడికి అనుకూలంగా లేకుండా పోయింది. –సురేష్రాజు, ఆక్వా రైతు, కొమ్మరిగిరిపట్నం -
ఆగనిది ఈ పయనం..
ఫ పరుగులు పెట్టిస్తున్న పులి ఫ కానెంవారి మెట్టపై తిష్ట ఫ బయటకు వెళ్లవద్దని అధికారుల ప్రచారం అడ్డతీగల: పులి పయనం ఆగకుండా సాగుతోంది.. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చి చిక్కకుండా తిరుగుతోంది.. మూగజీవాలపై దాడులకు దిగుతోంది.. అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పెద్ద పులి శుక్రవారం ఉదయానికి వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి సమీపాన వీరభద్రపురం గ్రామానికి వెనుక ఉన్న కానెంవారి మెట్టపై తిష్ట వేసింది. అటవీ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా దీనిని గుర్తించారు. సాయంత్రానికి సరంపేట సమీపాన స్వామి కొండపై నూతుల్లోద్ది, పాకుల్లొద్దు ప్రాంతానికి చేరుకుని మకాం మార్చింది. ఆ కొండ ప్రాంతాల్లో రాతిపై చిన్న చిన్న బావుల రూపంలో గుంతలు ఉండి అక్కడ నీటి నిల్వలు ఉంటాయని, అందుకే ఆ ప్రాంతాన్ని అనువైన చోటుగా పులి ఎంచుకుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇళ్లను విడిచి ఎవరూ బయటకు వెళ్లవద్దని, కొండ ప్రాంతాల్లో సంచరించవద్దని, చేను మకాంలో ఉండరాదని అటవీ అధికారులు తమ సిబ్బందితో మైక్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న కొట్టంపాలెం, గౌరయ్యపేట, కోనలోవ, వీరభద్రపురం, గొండోలు, రాజంపాలెం, సరంపేట గ్రామాల సమీపాన చేను మకాంలలో ఉన్న గిరిజనులు గ్రామాల్లోకి పరుగులు తీశారు. పులి తన సహజ గుణంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుందని, మనుషుల ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు బృందాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి చెప్పారు. పులి కదలికలను సాంకేతికతను ఉపయోగించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పశువులను గ్రామంలోకి తీసుకువెళ్లి పులి సంచారం తగ్గే వరకూ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. -
అర్చకుల గృహాల కూల్చివేత
ఫ అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఫ ఆత్రేయపురంలో ఘటన ఆత్రేయపురం: స్థానిక బాలాత్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వరస్వామి (శివాలయం), రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయాల ఆవరణలో తరతరాల నుంచి ఉంటున్న తమ ఇళ్లను టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేస్తున్నారని శివాలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన ఇళ్లను దౌర్జన్యంగా నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేశారని అన్నారు. పురాతన ఆలయాలను పునర్నిర్మించడం మంచిదే అయినా? ఎటువంటి అడ్డులేకుండా ఉన్న నివాసాలను కూల్చడం సరికాదన్నారు. ఇంతకు ముందు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు వాడపల్లి జనార్దనస్వామి ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారన్నారు. దీనిపై ఆయన తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడినట్లు తెలిపారు. అలాగే ఆ పక్కనే ఉంటున్న పూర్వపు ఆలయ అర్చకుడు ఆచార్యులు కుటుంబ సభ్యుల ఇంటిని సైతం అనవసరంగా కూల్చివేశారన్నారు. గ్రామంలో తమకు బలం లేనందున దౌర్జన్యంగా నివాసాలను కూల్చివేస్తున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. కాగా శుక్రవారం తాము ఇంట్లో ఉండగా, తమ తల్లి పుల్లేటికుర్తి పల్లాలమ్మ ఎంతగా అడ్డుకున్నా వినకుండా, ఆలయానికి ఏమాత్రం అడ్డంగా లేని తమ ఇంటి గోడను కూల్చివేశారని ఆలయ అర్చకుడు భాస్కరశర్మ తెలిపారు. మొత్తం భవనం కూల్చివేస్తామని వెంటనే బయటకు వెళ్లిపోవాలని అంటున్నారని ఆయనఅన్నారు. కాగా గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు చిలువూరి రామకృష్ణరాజు, ముదునూరి బండ కృష్ణంరాజు, గొట్టుముక్కల గోపిరాజు, ముదునూరి శ్రీహరిరాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆగ్రహంతో దౌర్జన్యానికి దిగినట్లు ఆలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ తెలిపారు. తమకు ఆస్తిపాస్తులు లేవని, కేవలం ఆలయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకుల ఒత్తిడితో టీడీపీ నాయకులు ఆదివారం పెద్దలతో చర్చిస్తామని అన్నారు. అంతవరకూ కూల్చివేతను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు చెప్పారు. అర్చకుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి నచ్చజెప్పి నష్టపరిహారం అందించి భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నాయకుడు గొట్టుముక్కల గోపిరాజు తదితరులు కోరారు. దీనిపై రాష్ట్ర అర్చక సమాఖ్య నాయకుడు రాంబాబు త్వరలో ఆత్రేయపురం వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. -
సముద్రంలో యువకుడి గల్లంతు
అల్లవరం: ఓడలరేవు సముద్ర తీరం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొమరగిరిపట్నంలో ఓ ఫంక్షన్కు స్నేహితులతో పాటు అమలాపురం నారాయణపేట ప్రాంతానికి చెందిన దొమ్మేటి లోకేష్ (17) వచ్చాడు. అక్కడి నుంచి లోకేష్తో పాటు బొక్కా సతీష్, గుత్తుల మనోజ్, బొక్కా గణేష్లు శుక్రవారం మధ్యాహ్నం ఓడలరేవు బీచ్కు చేరుకున్నారు. ఓఎన్జీసీ పశ్చిమ గేటు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై లోకేష్ నడుస్తుండగా, నాచు కారణంగా జారి పడిపోయాడు. ఇంతలో సముద్రంలో స్నానం చేస్తున్న మరో యువకుడు గుర్తించి కేకలు వేసి కాపాడే ప్రయత్నం చేశారని మైరెన్ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భారీ కెరటాలకు లోకేష్ సముద్రం లోపలకు కొట్టుకుపోయాడని అన్నారు. అతను దివ్యాంగుడు కావడంతో తనను తాను కాపాడుకోలేకపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే లోకేష్ కాలికి శస్త్రచికిత్స చేయించామని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మైరెన్ పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సైలు పుల్లయ్య, రమేష్, సిబ్బంది రాజేష్, డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఏటీఎం నుంచి మంటలు
గోకవరం: ఓ ఏటీఎం నుంచి మంటలు చెలరేగగా, లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వివరాల ప్రకారం.. గోకవరం ఎంపీపీ మెయిన్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం నుంచి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఏటీఎం నుంచి దట్టమైన పొగలు రావడంతో లోపల ఎవరైనా ఉన్నారా అని తీవ్రమైన అందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయగా, లోపల ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఏటీఎం టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని కారణాలను గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. -
నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనే..
పి.గన్నవరం: కుందాలపల్లిలో ఈ నెల 16న దళితుడు కాట్రు శ్రీనివాస్ మృతదేహాన్ని గ్రామంలోని ప్రధాన రహదారి మీదుగా తీసుకు వెళ్లకుండా అడ్డుకున్న పది మందిని సోమవారం లోగా అరెస్టు చేయకపోతే, వేలాది మంది దళితులతో అమలాపురంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సంఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు శుక్రవారం పి.గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. పెళ్లి పందిరి ఉందనే కారణంతో ప్రధాన రహదారిపై నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దళితులపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎస్సై బి.శివకృష్ణతో దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు 10 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ దర్యాప్తు చేసిన అనంతరం తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఫిర్యాదు చేశాం
ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ అసలు బాగాలేదు. దీనిపై మూడు రోజుల క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. నిత్యం ఆస్పత్రిలో దొంగతనాలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సూపర్వైజర్ సైతం సరిగ్గా విధుల్లో ఉండడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వారే రక్షించుకోలేకపోతే ఇంత పెద్ద ఆసుపత్రిని ఎలా కాపాడతారు. సెక్యూరిటీ గార్డుపై, ఆసుపత్రిలో రోగి తాలూకా బంధువులు, ఇతరుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ జి.రాజశేఖర కెనడీ, సూపరింటెండెంట్, ప్రభుత్వాసుపత్రి, రాజమహేంద్రవరం -
స్కూల్ బస్సు కింద పడి ఉపాధ్యాయురాలి మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కాతేరు సెంటర్లోని కోయంబత్తూర్ కాఫీ దుకాణం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్గా పనిచేస్తున్న బొంగు గాయత్రి (40) మృతి చెందారు. వివరాల్లోకెళితే.. రఘుదేవపురానికి చెందిన గాయత్రి పదేళ్లుగా తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్గా పనిచేస్తూ, స్థానికంగా మల్లయ్యపేటలో నివాసముంటున్నారు. శుక్రవారం, గాయత్రిని స్కూల్లో దింపేందుకు ఆమె భర్త బొంగు రాజా రావు మోటారు సైకిల్పై తీసుకువెళుతున్నాడు. ఆ క్రమంలో తిరుమల కళాశాల బస్సు కాతేరు సెంటర్ వద్ద ఆగి విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. అదే సమయంలో వెనుక నుంచి మరో లారీ వస్తోంది. ఈ క్రమంలో ఆగివున్న తిరుమల బస్సును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఆ టీచర్ ఆ స్కూలు బస్సు కిందే పడి మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ రాజారావు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి తిరుపతిలో 29 నుంచి కల్యాణోత్సవాలు పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పందిరి రాట ముహూర్తం చేశారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు, చైర్మన్ మెయిలి సంధ్యా కృష్ణమూర్తి ఆధ్వర్యాన అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ ఉదయం స్వామి వారి విశేషార్చన, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠా పన, ధ్వజారోహణ, సాయంత్రం శ్రీదేవి, భూ దేవి సమేత శృంగార వల్లభస్వామి కల్యాణం జరుగుతాయని ఈఓ వివరించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం నిత్య హోమం, బలిహరణ, తీర్థ ప్రసా ద వితరణ ఉంటాయన్నారు. 30వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం, 31వ తేదీ సాయంత్రం సదస్యం, ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం చోర సంవాదం, రెండో తేదీన పూర్ణాహుతి, ధ్వజావరోహ ణ చక్రస్నానం, బుక్క పండగ, గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 3న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ చెప్పారు. 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల ధారణ సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల దీక్షాధారణ చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తరలివచ్చి నక్షత్ర మాల ధారణ చేయాలని కోరారు. అలాగే, దీక్ష విరమణ ఏప్రిల్ 30వ తేదీన నృసింహ జయంతి రోజున నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
కాస్త మారిస్తే బెటర్
వనదుర్గ అమ్మవారి ఆలయం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో.. రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో నెల రోజుల కిందట ఖడ్గమాల పూజకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో ఈ పూజలను గత నెల 20న ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాతకు చేసే ఖడ్గమాల పూజ చాలా విశిష్టమైనది. విజయవాడ దుర్గ గుడిలో ఈ పూజను చాలా విశేషమైనదిగా భావిస్తారు. అదే స్ఫూర్తితో అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అమ్మవారి ఆలయంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ పూజ గురించి చేస్తున్న ప్రచారానికి తగిన రీతిలో దేవస్థానంలో ఏర్పాట్లు లేవన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవీ విమర్శలు సాధారణంగా ప్రతి పూజలోనూ భక్తులను స్వామి, అమ్మవార్లకు ఎదురుగా కాకుండా పక్కగా కూర్చోబెడతారు. కానీ, ఇక్కడ భక్తులను ఒకరి వెనుక ఒకరిని అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. దీనివలన ముందున్న వారి పృష్ట భాగం వెనుక కూర్చున్న వారికి కనిపిస్తోంది. వారి వెనుక అమ్మవారి యంత్రానికి పూజ చేస్తూండటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇది సరైన విధానం కాదని భక్తులు అంటున్నారు. సత్యదేవుని వ్రతాలాచరించేటపుడు కూడా స్వామివారి చిత్రపటానికి ఎదురుగా కాకుండా పక్కగా భక్తులను వరుసలో కూర్చోబెడతారు. స్వామివారి నిత్య కల్యాణంలో కేవలం విఘ్నేశ్వర పూజ తప్ప మరే పూజా ఉండదు. అర్చకులు చేసే కల్యాణం తిలకించడమే. అందువలన అక్కడ భక్తులను ఎదురుగా కూర్చోబెడతారు. ఖడ్గమాల పూజలో మాత్రం యంత్రానికి సుమారు 45 నిమిషాల పాటు కుంకుమ పూజ చేయిస్తారు. ఖడ్గమాల పూజ టికెట్టు రూ.1,116. ఇంత మొత్తం తీసుకుంటున్న దేవస్థానం భక్తులు కూర్చునేందుకు కనీసం సరైన చాపలు కూడా వేయడం లేదు. చిరిగిన చాపలు వేస్తున్నారు. దీనికి బదులు దంపతులు కూర్చునేందుకు చిన్న తివాచీలు వే యొచ్చు. ఒక తివాచీ ఖరీదు సుమారు రూ.వెయ్యి ఉంటుంది. ఒకసారి కొంటే కనీసం నాలుగేళ్లు ఉపయోగపడుతుంది. కానీ, ఎందుకనో ఆ చాపలతోనే సరిపెడుతున్నారు. కానీ అమ్మవారి ఆలయంలో ఒక మూల పరుపులు గు ట్టగా ఉంటున్నాయి. ఎవరైనా దేవస్థానం సిబ్బంది కానీ, వీఐపీలు కానీ పూజకు వస్తే ఆ పరుపులను వారికి వేస్తున్నారు. సామాన్య భక్తులు రూ.1,116 టికెట్టు తీసుకున్నా సరే వారికి చాపలే గతి. పూజ చేయించుకునే భక్తులకు రెండు పళ్లాలు ఇస్తున్నారు. ఒక పళ్లెంలో యంత్రంపై కుంకుమ పూజ, ఇంకో పళ్లెంలో పూజాద్రవ్యాలు ఉంచుతున్నారు. చివరిలో పులిహోర ప్రసాదం తెస్తే దానిని నేల మీద ఉంచుతున్నారు. దీనికి బదులు భక్తులకు ఇంకో పళ్లెం ఇచ్చి, అందులో ఉంచే ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పూజలో పది మందికి మించి పాల్గొనే అవకాశం లేదు. అందువలన మరో పది పళ్లాలుసమకూరిస్తే సరిపోతుంది. ఖడ్గమాల పూజతో పాటు శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం కూడా నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవారికి పెద్దగా అలంకరణ ఏమీ చేయడం లేదు. రోజూ ఇచ్చే పూలదండల కన్నా మరో రెండు దండలు మాత్రమే ఇస్తారు. మండపంలో అయితే మామిడి తోరణాలు తప్ప పెద్దగా అలంకరణ చేయడం లేదు. పూజ ఉదయం 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు తప్ప దూర ప్రాంతాల వారు ఆ సమయానికి హాజరయ్యే అవకాశం ఉండటం లేదు. అలాగని రెండో బ్యాచ్కు అవకాశం కూడా లేదు. పూజ సమయాన్ని మార్చడమో లేదా ఉదయం 9 గంటలకు రెండో బ్యాచ్ పూజ ప్రారంభించడమో చేస్తే బాగుంటుంది. ఖడ్గమాల పూజను ఇద్దరు వ్రత పురోహితులు మాత్రమే చేస్తున్నారు. వేద పండితుడు కూడా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు వేద పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు లేదా అర్చకులు పూజ పూర్తయ్యేంత వరకూ ఉండేలా చూడాలి. అలాగే, పూజ సమయంలో ఆలయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. కనీసం సూపరింటెండెంట్ లేదా గుమస్తా అయినా ఆ సమయంలో ఉండాలి. గతంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలకు పెద్దగా భక్తులుండేవారు కాదు. కానీ, 2014 నుంచి ఆ హోమాల పూర్ణాహుతి సమయంలో అప్పటి ఈఓలు కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర తదితరులు వస్తూండటంతో వారితో పాటు సిబ్బంది కూడా వచ్చేవారు. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఆ హోమాల్లో భక్తులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖడ్గమాల పూజకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖడ్గమాల పూజ విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని, మరింత ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనిపై దేవస్థానం వైదిక కమిటీతో ఈఓ సమావేశమై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఖడ్గమాల పూజ నిర్వహణ తీరుపై విమర్శలు టికెట్టు వెయ్యి నూట పదహార్లు చింకిచాపలు, చాలీచాలని పూజా సామగ్రితో సరి ఒకరి వెనుక ఇంకొకరిని కూర్చోబెట్టి పూజలు ఇది సంప్రదాయ విరుద్ధమంటున్న భక్తులు ఉదయం 7.30 గంటలకే ప్రారంభం ఆ సమయానికి హాజరు కాలేకపోతున్న స్థానికేతరులు -
నేడు ఈద్ ఉల్ ఫితర్
● చంద్రదర్శనంతో శుక్రవారం ముగిసిన రంజాన్ మాసం ● శనివారం ఈద్ నమాజ్ చేయనున్న ముస్లింలు ● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర రంజాన్ మాసం శుక్రవారంతో ముగిసింది. చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు కఠోర రోజాలు, నమాజ్, సహెర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, ధాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపారు. ఎండ తీవ్రత పెరిగినా దీక్షలు సడలించకుండా పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు (14 గంటలకు పైగా) చుక్క మంచినీరు కూడా తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు చంద్రదర్శనంతో పండగ చేసుకోనున్నారు. ఈద్ నమాజ్కు సిద్ధం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలతో పాటు మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి నమాజ్ చేస్తారు. నెల రోజుల తాము చేసిన ప్రార్థనలు ఫలించాలని, సర్వమానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ దువా చేస్తారు. రాజమహేంద్రవరంలో పాటు జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లోనూ ఈద్ నమాజ్ జరుగుతుంది. దాన ధర్మాలకు ప్రాధాన్యం రంజాన్లో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. ధనికులతో పాటూ పేదలు సైతం పండగ చేసుకోవాలన్నదే ముఖ్య నిర్వచనం. మనిషి ఆరోగ్యం, సంపాదించిన ధనంపై అల్లా సూచించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు అని చెప్పవచ్చు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకు మించి విలువైన ధనం, ఆస్తులు కలిగిన వారు జకాత్కు అర్హులు. వాటిని వెల లెక్కకట్టి 2.5 శాతం పేదలకు పంచాలి. ఇది రంజాన్లో ఇస్తే 70 శాతం అధికంగా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. పేదలకు దానం రంజాన్ సందర్భంగా 1,750 గ్రాముల గోధుమలు, దానికి సమానమైన డబ్బును పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మతపెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని అభాగ్యులకు ఫిత్రా దానం ఇవ్వాలి. ఈ ఏడాది మత పెద్దలు రూ.150 ఫిత్రా ఇవ్వాలని ఖరారు చేశారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు కానీ తగ్గించరాదు. అప్పడే పుట్టిన బిడ్డ నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీదా ఫిత్రా దానం చేయాలి. ఈద్ శుభాకాంక్షలు రంజాన్ పండగ రోజు ముస్లింలు సామూహిక ఈద్ నమాజ్ జరుపుకొని అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పకుంటారు. ప్రార్థనా స్థలానికి అల్లా నామం స్మరిస్తూ ఒక మార్గం నుంచి వెళ్లి, వేరే మార్గంలో ఇంటికి వచ్చి సేమ్యా సేవిస్తారు. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికి సేమ్యాను పంచి, తమ ఆత్మీయతను తెలియజేస్తారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. -
మీ విశ్వసనీయత స్ఫూర్తిదాయకం
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ● వైఎస్సార్ సీపీప్రజాప్రతినిధులకు సన్మానం అనపర్తి: ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీకి విధేయులుగా ఉంటూ, ప్రజల పక్షాల పోరాడుతూ మీరు చూపిన విశ్వసనీయత అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రజాప్రతినిధులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అభినందించారు. పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఆ గ్రామ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, వెంకటరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ మాజీ ప్రతిపక్షనేత సత్తి రామారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితర ప్రజాప్రతినిధులను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా విజయం సాధించిన సర్పంచ్లు, పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తి కావస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా వారు పార్టీ, ప్రజలకు చూపిన విధేయత, విశ్వసనీయతకు, అంకిత భావానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిన సత్తి సూరారెడ్డి బ్రదర్స్ను అభినందించారు. అలాగే విశ్వసనీయతే విలువైన ఆస్తిగా భావించి, ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా పార్డీకి విధేయులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో ఒత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా, పార్టీని విడవకుండా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ కన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళీ) తదితరులు పాల్గొన్నారు. -
పోశియ్య ఇంటి పనులు పూర్తి
తాళ్లపూడి: మలకపల్లి గ్రామంలో చర్మకారుడు సనమండ్ర పోశియ్య ఇంటి పనులు పూర్తయ్యాయి. ఆ ఇంటిని శుక్రవారం జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. హౌసింగ్ పీడీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్, డీఆర్డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులందరూ కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పోశియ్య కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మలకపల్లికి వచ్చిన సమయంలో పీపీపీపీ విధానంలో పోశియ్య ఇంటిని బాగు చేయించడంతో పాటు, చెప్పుల దుకాణం పెట్టుకోవడానికి స్థలం చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేర్చక పోవడంతో పీపీ.. పీపీ.. ఢాంఢాం అనే శీర్షికతో గత నెల 26న ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. మలకపల్లిలో పోశియ్య ఇంటిని పరిశీలించి, ఉగాది నాటికి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని హమీ ఇచ్చారు. ఆ ప్రకారమే ఇంటి పనులు పూర్తి చేసి అప్పగించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏఈ దాదాసాహెబ్, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రతకు సుస్తీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాకే తలమానికంగా విరాజిల్లుతూ పేద రోగులకు ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రత దయనీయంగా మారింది. దీని వల్ల ఆస్పత్రి సిబ్బందితో పాటూ రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ వ్యక్తి మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు చెయ్యి నరికేశాడు. రూ.4 లక్షల విలువైన ఏసీ కాపర్ గొట్టాలను పట్ట పగలే దొంగలు దోచుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న స్టాఫ్ నర్సు మెడలో బంగారు గొలుసును ఓ వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. బాత్రూంలో కుళాయిలు, ఇనుప పైపులను విప్పుకుని మరీ ఎత్తుకెళ్లారు. పట్ట పగలే భవన నిర్మాణ సామగ్రిని దర్జాగా ఆటోలో తరలించేశారు. రోగుల సెల్ఫోన్లు మాయమైపోతున్నాయి. అంబులెన్సు బ్యాటరీలు కూడా దొంగిలించారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ కొరవడడమే దీనికి కారణమని తెలుస్తోంది. అనేక ఆరోపణలు ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఓ వ్యక్తిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు నియమిస్తున్నాడని సమాచారం. అర్హత, అనుభవాల ఆధారంగా జరగాల్సిన ఎంపిక ప్రక్రియ కేవలం ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా సాగుతోందని, డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం ఇస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత, అనుభవం, ఫిట్నెస్ లేనివారు సెక్యూరిటీ గార్డులుగా ఉండడంతో ఆస్పత్రిలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆటోలో వచ్చి సామగ్రిని ఎత్తుకెళుతున్న దొంగలను నూతన భవనాలు కడుతున్న సంస్థ సెక్యూరిటీ గుర్తించింది. కానీ జీజీహెచ్ సెక్యూరిటీ అస్సలు కనిపెట్టలేకపోయింది. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్ఫోన్లు పట్టపగలే మాయమైపోతున్నాయి. విధుల్లో ఉన్న ఓ నర్సు మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. సీఎంవోపై వాటర్ బాటిల్తో దాడి చేయగా సెక్యూరిటీ ఈ ఘటనను నిలువరించలేకపోయింది. ఇష్టారాజ్యం సెక్యూరిటీ గార్డులుగా నియమితులైన కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీతాలు తీసుకుని విధులకు డుమ్మా కొడుతూ సొంత పనుల్లో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది. ఈ గార్డుల్లో ఒకరు మ్యాట్రీమోనీ ప్రతినిధిగా పని చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఆసుపత్రి ఆవరణలో ఫేస్ అటెండెన్స్ వేసుకుని ఆటో డ్రైవర్గా కిరాయిలకు వెళుతున్నాడు. ఓ మహిళ హాజరు వేయించుకుని భర్త బట్టల దుకాణానికి వెళ్లి వ్యాపారం చేస్తోంది. ఓ వ్యక్తి హాజరు వేసుకుని వెళ్లిపోయి తన సొంత పాల కేంద్రం నడుపుకొంటున్నాడు. వీరి వ్యవహారంపై ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి కనుసన్నల్లోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయని, అతడు అడిగిన సొమ్ము ఇస్తే సరిపోతోందని సమాచారం. అలాగే 60 మంది సెక్యూరిటీ గార్డుల్లో 11 మందిపై పలు నేరాల్లో కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదుల వెల్లువ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రాజానగరం పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు నుంచి బయటకు పడేందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం. అలాగే గత ఏడాది సెప్టెంబర్ 25న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసులు ఉన్నాయని విశాఖపట్టణం నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదులు అందా యి. అదే నెల 9న ఓ మహిళ సెక్యూరిటీ పర్యవేక్షకుడు తన వద్ద లంచం తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ పెండింగ్ దశలోనే ఉన్నాయి. నెలలు గడిచినా ఎటువంటి విచారణ లేదు. మార్చురీలో శవానికి పోస్టుమార్టం జరుగుతుండగా ఓ సెక్యూరిటీ గార్డు.. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. కలెక్టర్ కీర్తి చేకూరి ఈ విషయంపై విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేలడంతో డబ్బులు వసూలు చేసిన సెక్యూరిటీ గార్డును తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయినా ఆ సెక్యూరిటీ గార్డును కొనసాగుతుండడం విశేషం. -
షాడో ఎమ్మెల్యే!
తరగతి గదులు ప్రారంభిస్తున్న వెంకటలక్ష్మి. చిత్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరిసాక్షి, రాజమహేంద్రవరం: ఆ నియోజకవర్గంలో కొబ్బరికాయ కొట్టాలన్నా.. రిబ్బన్ కత్తిరించాలన్నా.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు పంపిణీ చేయాలన్నా.. అన్నిటా ఆమె హవానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ ఆయన భార్యే చక్కబెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆమెకే పెద్దపీట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా.. ఎమ్మెల్యే ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇదీ సంగతి రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి షాడో ఎమ్మెల్యే అవతారం ఎత్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలను కలవడం, అసెంబ్లీ తదితర వ్యవహారాలను ఎమ్మెల్యే చక్కబెడుతూంటే.. నియోజకవర్గంలో జరుగుతున్న శుభకార్యాలు, పరామర్శల వంటి వాటికి ఆయన భార్య స్వయంగా హాజరవుతున్నారు. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు. అయితే, కొద్ది నెలలుగా ఆమె మరో అడుగు ముందుకేసి అధికారిక కార్యక్రమాల్లో సైతం అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్నారనే విమర్శలు వస్తున్నాయి. రహదారుల శంకుస్థాపనల నుంచి, భవనాల ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ వరకూ అన్నీ ఆమె చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే భార్య అయినంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడమేమిటనే ప్రశ్న కూటమి నేతల నుంచే వస్తోంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎలాగని పలువురు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ● రఘుదేవపురం ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయింది. వీటి ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బలరామకృష్ణ నిర్వహించారంటే ఫర్వాలేదు. కానీ, ఆయన భార్య వెంకటలక్ష్మి ప్రారంభించారు. ● ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సైతం బాధితులకు ఆమే పంపిణీ చేశారు. నేరుగా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ చెక్కులు అందజేస్తున్నారు. దీనినిబట్టి అధికారిక కార్యక్రమాల్లో ఆమె ఏ స్థాయిలో పెత్తనం చేస్తున్నారో అర్థమవుతోందని కూటమిలోని టీడీపీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే భార్య కావడంతో అధికార యంత్రంగం సైతం ఎదురు చెప్పలేక జీ హుజూర్ అంటోంది. ఇదిలా ఉండగా పలు అధికారిక కార్యక్రమాలకు కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఇన్చార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని, ఎక్కడా లేని విధంగా ఇక్కడ షాడో ఎమ్మెల్యే పెత్తనమేమిటంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బత్తులపై కారాలు మిరియాలూ నూరుతున్నారు. ఈ విషయం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. 2029 ఎన్నికలే లక్ష్యమా? ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బహిరంగ రాజకీయాలకే పరిమితం కావడం.. ఆయన భార్య మాత్రం ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూండటం వెనుక వేరే వ్యూహం దాగుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా టికెట్టు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బలరామకృష్ణ తన భార్య వెంకటలక్ష్మిని పోటీకి దింపేందుకే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చేలా ఆయన ఇటీవల పలు సమావేశాల్లో మహిళలు రాజకీయాల్లోకి రావాలి, రాణించాలని అంటున్నారు. ప్రజా వ్యతిరేకత భయంతో..! చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తోంది. ఇంత తక్కువ వ్యవధిలోనే కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ తప్పుడు ప్రచారం చేసి బలరామకృష్ణ గద్దెనెక్కారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాకు అడ్డూ అదుపూ ఉండటం లేదనే విమర్శలున్నాయి. అధికారంలోకి వచ్చిన 16 నెలల వ్యవధిలోనే పది కొండలను కొల్లగొట్టేస్తే.. మిగిలిన మూడేళ్లల్లో నియోజకవర్గంలో కొండల పరిస్థితేమిటంటూ సొంత కూటమి నేతలే విమర్శలు గుప్పిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజానగరం మండలం కొత్త తుంగపాడు, కొండగుంటూరు, కానవరం, జి.యర్రంపాలెం; సీతానగరం మండలం నల్లగొండ తదితర గ్రామాల సమీపాన ఇప్పటికీ అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. వీటిల్లో ఒకటి రెండుచోట్ల మాత్రమే అనుమతులున్నాయి. అది కూడా రెండు నుంచి ఐదెకరాల వరకూ అనుమతి తీసుకుని, పదెకరాల విస్తీర్ణంలో మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిత్యం వందలాది లారీలతో గ్రావెల్ ఈ ప్రాంతం నుంచి రాజమహేంద్రవరం, కడియం, కాకినాడ, రావులపాలెం, మండపేట తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. వే బిల్లులు, ఇతర రసీదులూ లేకపోయినా అడ్డుకునే పరిస్థితి కూడా ఎక్కడా ఉండటం లేదు. ఈ అవినీతి, అక్రమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత నెలకొంది. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఎదురవుతుందేమోనని బలరామకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య వెంకటలక్ష్మిని జనసేన అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఆమె షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపన చేస్తూ.. రాజానగరంలో ఎమ్మెల్యే భార్య హవా ఆయన చేయాల్సిన పనులన్నీ ఆమె కనుసన్నల్లోనే.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి ఆమె! అందుకే ఈ హడావుడి అంటున్న విశ్లేషకులు -
ప్రభుత్వాసుపత్రిలో తాగుబోతు వీరంగం
సెక్యూరిటీ గార్డుపై అర్ధరాత్రి కత్తితో దాడి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ తాగుబోతు కత్తితో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమక్షంలోనే అతడు దాడి చేస్తూంటే బాధితుడు చేయి అడ్డు పెట్టాడు. దీంతో, అతడి చేయి, తలపై కత్తి వేట్లు పడ్డాయి. నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సీటీఆర్ఐకి చెందిన కడగల సూర్యప్రకాశరావు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బుధవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. దేశాబత్తుల చిన్నారావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు అక్కడకు వచ్చాడు. అతను పదేపదే రోగి వద్దకు వెళ్లి, వస్తూండటంతో అక్కడ తిరగవద్దని సెక్యురిటీ గార్డు సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆ రోగి బంధువులు ఆసుపత్రిలో ఫుల్గా మద్యం తాగారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డుకు, రోగి బంధువు చిన్నారావుకు మళ్లీ వాగ్వాదం జరిగింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేటు బయట ఉన్న చిన్నారావును పిలుచుకు రావాలని వారు సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. అతడు వెళ్లి పిలుస్తూండగానే.. ముందుగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో అతడిపై చిన్నారావు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్సలు అందించారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
విషాదం మిగిల్చిన ఉగాది
● పంచారామ క్షేత్ర కోనేరులో మునిగి యువకుడి మృతి ● నిశ్చితార్థం అయిన నాలుగు రోజులకే మృత్యువాత సామర్లకోట: నిశ్చితార్థం చేసుకున్న జంట బంధువులతో కలిసి పంచారామ క్షేత్రంలోని స్వామివారి దర్శనానికి వచ్చారు. అయితే ఆలయ కోనేరే యువకుని మృతికి కారణమైంది. పెద్దాపురం, కొత్తపేటకు చెందిన వెన్నెల ప్రశాంత్ (27)కు నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. ఆ జంట బంధువులతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆలయ కోనేరులో స్నానానికి దిగిన ప్రశాంత్ కోనేరులో మునిగిపోయాడు. వెంటనే ప్రశాంత్ స్నేహితులు, స్థానికులు, కోనేరులోకి దిగి ప్రశాంత్ను బయటకు తీసి మోటారు సైకిల్పై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ప్రశాంత్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దాంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాద ఛాయలు అలముకున్నాయి. కొతపేటలో నివాసం ఉంటున్న ప్రశాంత్ కుటుంబ సభ్యులకు వాలుతిమ్మాపురం రోడ్డులో టిడ్కో గృహం రావడంతో అక్కడ నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ సామర్లకోట ఏఐఎఫ్ఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. కోనేరులో ఈత కొట్టే సమయంలో ఆయాసం రావడం వల్ల మునిగిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఆలయ కోనేరులో గ్రిల్స్ ఏర్పాటు చేసినా వాటిని దాటి కోనేరులోకి దిగడం వల్ల తరుచూ ఇటు వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువగా వచ్చి కోనేరులో స్నానాలు చేసే అవకాశం ఉన్న కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్థానికులు కొరుతున్నారు. -
సత్యదేవునికి జయము జయము
● పరాభవ నామ సంవత్సర ఫలితం భేష్ ● ఈ ఏడాది భక్తుల సౌకర్యాలకు భారీగా వెచ్చించే అవకాశంఅన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవునికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సర్వత్రా జయం చేకూరుతుందని ప్రముఖ పంచాంగకర్త, అన్నవరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ తెలిపారు. ఆదాయ, వ్యయాలతో నిమిత్తం లేకుండా స్వామివారి ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందన్నారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి, సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో వేంచేయించారు. నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంతన ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పరాభవ నామ పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం, పూర్ణప్రసాద్ సిద్ధాంతి నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను చదివి వివరించారు. సత్యదేవునిది మఖ నక్షత్రం, సింహరాశి కావడంతో ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయన్నారు. ఈ రెండూ సమానమని అంటే ఈ ఏడాది దేవస్థానంలో అనేక సత్రాలు, నూతన నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు వ్యయం చేస్తారని అర్థమన్నారు. భక్తుల సౌకర్యాలు కల్పనకు కూడా నిధులు వెచ్చిస్తారన్నారు. సింహరాశి వారికి రాజపూజ్యం, అవమానం 7 చొప్పున సమానంగా ఉన్నాయని, అయితే, ఇవి దేవతలకు వర్తించవని చెప్పారు. వైశాఖ మాసంలో సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని వివరించారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు. దైవ ప్రార్థనలు, పూజలు, దానాల వలన ఆయా రాశుల వారికి అవి సానుకూల ఫలితాలుగా మారుతాయని ఆయన వివరించారు. పలువురికి సత్కారం పంచాంగ శ్రవణానంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేద పండితులు వెంపరాల సీతారామ అవధాని (అమలాపురం), సుందరరామ శ్రోతి(విజయవాడ)లను రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించారు. పంచాంగ ఫలితాలను వివరించిన పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కూడా సత్కరించారు. దేవస్థానం సీనియర్ వేద పండితుడు గంగాధరభట్ల గంగబాబు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, సీనియర్ అర్చకుడు బులుసు సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో గంగబాబు, ఇంద్రగంటిలను చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్చకుడు బులుసు తరఫున ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ వీటిని స్వీకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారి రథోత్సవం.. భక్తుల కోలాహలం, చిన్నారుల నృత్యాల నడుమ ఉదయం ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల సందర్భంగా సత్యదేవుని ఆలయం, అనివేటి మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. -
ఫ్లెక్సీలతో బస్టాండ్ను మూసేసిన కూటమి నాయకులు
పి.గన్నవరం: స్థానిక మూడు రోడ్ల సెంటర్లో రావులపాలెం వైపు వెళ్లే ప్రయాఫికుల కోసం గతంలో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని కూటమి నాయకులు ఫ్లెక్సీలతో మూసేశారు. లోపలకు వెళ్లి కూర్చునే అవకాశం లేకుండా ఫ్లెక్సీలు అడ్డుగా కట్టడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే నిల్చుని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విశ్రాంతి భవనంలోని బల్లలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కూటమి నేతల తీరుపై ప్రయాణికులతో పాటు స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తక్షణమే అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతున్నారు. -
గోదావరి.. కవితా ఝరి
గంగ– రుషుల నది.. యుమున– ప్రేమికుల నది.. కృష్ణ– శిల్పుల నది.. కావేరి– సంగీతకారుల నది అని చెబుతూ.. ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అడవి బాపిరాజు గోదావరిని ‘కవుల నది’గా అభివర్ణిస్తారు. వేదంలా ఘోషించే గోదావరి తీరాన.. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలన.. శతాబ్దాలుగా కవితా ఝరులు పొంగి పొరలుతూనే ఉన్నాయి. పావన గోదారి నీరు తాగి పెరిగిన ఎంతోమంది అక్షర శిల్పులు.. అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. రేపు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కొంత మంది గోదావరి కవులను చూసొద్దాం రండి..● ఉమ్మడి ‘తూర్పు’న వికసించిన కవితా సుమాలెన్నో.. ● సుప్రసిద్ధ కవులకు ఈ నేల పుట్టినిల్లు ● రేపు ప్రపంచ కవితా దినోత్సవం కపిలేశ్వరపురం: మానవ జీవితంలోని వెలుగునీడల్ని ప్రతిబింబించే కథ, కవిత్వం, నవల, నాటకం.. ఇలా ఏ ప్రక్రియ అయినా సమాజ అభ్యున్నతికి దోహదపడినవే. ప్రకృతి వర్ణనలు, భావావేశపు వెల్లువలు, దేశభక్తి, మానవ సంబంధాలు, ఎవ్వరూ పట్టించుకోని చీకటి కోణాల గురించి ఎంతో మంది కవులు తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపారు. అణువణువునా పావన గోదావరి జలాలతో పునీతమవుతున్న ఈ నేల.. అటువంటి ఎంతో మంది కవులకు జన్మనిచ్చింది. 1885 ఫిబ్రవరి 28న పిఠాపురంలో జన్మించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా, ఆధ్యాత్మిక పీఠం ఆరో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పదహారేళ్ల చిరుత ప్రాయంలోనే తత్త్వవేత్తగా, కవిగా గుర్తింపు పొందార. ఆయన కవితలు అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందాయి. ఐ.పోలవరంలో పుట్టి.. 1947 నుంచి 1974 వరకూ రాజమహేంద్రవరం వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేశారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఆయన ఒక్క అక్షరం ఎక్కువ, తక్కువ కాకుండా సమపాళ్లలో అక్షరాల పొందికతో కవిత్వాన్ని సృజియించడం ఆయన ప్రత్యేకత. పిఠాపురం ప్రాంతంలోని చంద్రపాలెంలో జన్మించిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ఆయన కలం నుంచి ‘మనసున మల్లెల మాలలు, కన్నులలో వెన్నెల డోలలూ’గేటట్లు భావ కవిత్వం అద్భుతంగా జాలువారింది. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా’, ‘గోరింట పూచింది కొమ్మా లేకుండా’, ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’ వంటి ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రాశారు. మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించిన బోయి భీమన్న ‘కుల, మత, వర్గ విభేద రహితమైన భారతజాతి ఆవిర్భవించాలన్నదే నా ధ్యేయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. 1865 ఫిబ్రవరి 11న సీతానగరంలో జన్మించిన కవిశేఖరుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు ‘సాక్షి’ పేరిట రాసిన వ్యాసాల ద్వారా నాటి సామాజిక పరిస్థితులను ఎండగట్టారు. పిఠాపురానికి చెందిన ఆవంత్స సోమసుందర్– నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ‘వజ్రాయుధం’ పేరిట వెలువరించిన కవితా సంకలనం.. ఓ సంచలనం. ఈ పుస్తకాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందంటే.. ఆయన ఎంతటి పదునైన పదాలతో ఈ కవిత్వాన్ని వెలువరించారో చెప్పనవసరం లేదు. రామచంద్రపురానికి చెందిన అదృష్ట దీపక్– ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ వంటి సినిమా పాటలతో పాటు, అనేక అభ్యుదయ కవితలను రాశారు. కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు విప్లవ కవుల ప్రభావంతో అభ్యుదయ కవిత్వానికి పెద్ద పీట వేశారు. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు వెలువరించారు. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ వంటి సమీక్షా పుస్తకాలు రాశారు. ఈ కోవలోనే ర్యాలి ప్రసాద్ వంటి అనేక మంది కవులు అనేక సమస్యలను అక్షరీకరిస్తూ తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నారు. ‘అమ్మకు స్వరనీరాజనం’ మండపేటలోని సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు చల్లా రవికుమార్ తన తల్లి లక్ష్మి మరణించిన వేళ దశదిన కర్మకాండలకు దూరంగా ఉంటూ ‘అమ్మకు స్వర నీరాజనం’ పేరిట కవితలు, పాటల కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. ‘భూమిని చీల్చుకునే పుట్టే చెట్టుకు విత్తే కదరా అమ్మ, పురిటి చావుతో యుద్ధం చేసి అమ్మ ఇచ్చును మరుజన్మ’ అంటూ రవికుమార్ స్వయంగా అమ్మపై రాసిన పాటను గాయకుడు సురేష్ నిఖిలం స్వరపరిచారు. అలాగే, యుద్ధం ప్రభావాలపై ‘పుడమి గాయం, శోకసంద్రం దీనవదనం దిగులు గగనం! యుద్ధమా! ఇది యుద్ధమా?’ అంటూ నల్లి ధర్మారావు రాసిన గేయానికి రాజమహేంద్రవరానికి చెందిన గాయకుడు సురేష్ స్వరకల్పన చేయగా విశేషంగా ఆదరణ పొందింది. సాహితీ కృషీవలులెందరో.. సాహిత్యాన్ని సృజియించడమే కాదు.. ఆ ప్రవాహం తరువాతి తరానికి కూడా అందించేలా.. ఆ స్ఫూర్తిని కొనసాగించేలా అనేక సంస్థలు నిరంతర కృషి చేస్తున్నాయి. కవి సమ్మేళనాలు, కవుల జయంతులు, వర్ధంతులు, గ్రంథ సమీక్షల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరం, కాకినాడ కేంద్రంగా సాహితీ స్రవంతి, రామచంద్రపురంలో డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి, మండపేటలో సంగమం సాంస్కృతిక వేదిక, అ.ర.సం వంటి సంస్థలు ఈ కృషిని కొనసాగిస్తున్నాయి. యుద్ధం, కరోనా, మహిళా వేధింపులు, వాణిజ్య, వ్యాపారాల ప్రభావం, మానవ వికాసం, విలాపం వంటి అనేక సామాజిక అంశాలపై కవితా గోష్టులు నిర్వహిస్తున్నాయి. కవులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన అంగర గోపాలకృష్ణాచార్యులు (కృష్ణశ్రీ) అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట సాహిత్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. సామర్లకోటకు చెందిన బసా బలరామకృష్ణ (శ్రమేరా) ‘సాహిత్య సహచరుల వేదిక’, కాకినాడకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు ‘పుస్తకం’ పేరుతోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ రూపంలోని కవితలు, సాహిత్య పుస్తకాలను పంచుకుంటున్నారు. -
రూ.95 లక్షలతో వనదుర్గ అమ్మవారి ఆలయ విస్తరణ
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని విస్తరించేందుకు రూ.95 లక్షలతో పలు నిర్మాణాలు చేపట్టాలని అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు తీర్మానించింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ట్రస్ట్బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈఓ వీ త్రినాథరావు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వనదుర్గ ఆలయ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. అమ్మవారి ఆలయంలో దిగువన ప్రతీ శుక్రవారం చండీహోమం, పౌర్ణమి, అమావాస్య తిధులలో ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ హోమాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గత నెల 20వ తేదీ నుంచి ప్రతీ శుక్రవారం ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఖడ్గమాల పూజ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మండపం విశాలంగా లేకపోవడంతో ఈ పూజలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం లేదు. దిగువన హోమ మండపంలో కూడా అదే పరిస్థితి. దీంతో ఈ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ● దేవస్థానం అధికారుల విజ్ఞప్తి మేరకు గత నెలలో దేవదాయశాఖ డిఫ్యూటీ స్థపతి శ్రీనివాస ఆచారి వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ మండపాన్ని తూర్పు వైపు 30 అడుగుల ముందుకు పెంచుకోవచ్చునని సూచించారు. ఆ నిర్మాణంతో బాటు ఇతర నిర్మాణ పనులు చేపట్టడానికి ట్రస్ట్బోర్డులో తీర్మానించారు. ● వచ్చే నెల 26వ తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా విద్యుత్ అలంకరణకు, ఇతర పనులకు రూ.30.55 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించారు. ● కల్యాణ మహోత్సవాలలో కల్యాణ వేదిక ముందు ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు చేసేందుకు రూ.రెండు లక్షలు వ్యయం ఖర్చయ్యే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. ● దేవస్థానం కేశఖండనశాలలోని భక్తుల టాయిలెట్స్, స్నానపు గదులలో రూ.40 లక్షల వ్యయంతో అధునాతన శానిటరీ వస్తువులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో రూ.30.55 లక్షలతో విద్యుత్ అలంకరణ కేశఖండన శాలలో రూ.40 లక్షలతో అధునాతన శానిటరీ ఫిట్టింగ్స్ అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు సమావేశ నిర్ణయాలు -
ఉత్సాహంగా మహిళా వాలీబాల్ పోటీలు
మలికిపురం: ఆల్ ఇండియా మహిళా వాలీబాల్ (డే అండ్ నైట్) పోటీలు మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం వరకూ జరిగిన లీగ్ పోటీలలో పలు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. చైన్నె– కర్నాటక జీఎస్టీ మధ్య జరిగిన పోటీలలో చైన్నె విన్నర్గా నిలిచింది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, సౌత్ ఈస్ట్రన్ రైల్వే మధ్య జరిగిన పోటీలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ జట్టు విజయం సాధించింది. ఇంకా మరొక పది జట్ల మధ్య లీగ్ పోటీలు జరిగాయి. అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను అడబాల వీర బ్రహ్మాజీరావు, అడబాల వేణుగోపాల్ పర్యవేక్షించారు కోడిపందేలాడుతున్న ముగ్గురి అరెస్ట్ సీతానగరం: మండలంలోని నల్గొండ శివారున కోడిపందేలాడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామని ఎస్సై డి రామ్కుమార్ గురువారం తెలిపారు. నల్గొండ శివారున కోడిపందేలాడుతుండగా సిబ్బందితో దాడి చేసి కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన ఇద్దరు, రాపాకకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5,160 నగడు, ఐదు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై రామ్కుమార్ తెలిపారు. రూ.కోటి ఇరవై లక్షల ఆస్తి దానం తాళ్లపూడి: వీలునామా ప్రకారం రూ.కోటి ఇరవై లక్షల ఆస్తిని దానం చేసి వారు తమ దాతృత్వం చాటుకున్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యాన సేవా కేంద్రానికి పడాల భాను ప్రసాద్ శ్రీమతి విజయశ్రీల ఆస్తిని గురువారం దానం చేశారు. పట్టణానికి చెందిన పడాల భాను ప్రసాద్ కొవ్వూరులో న్యాయవాదిగా పనిచేస్తూ షిరిడి సాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2018లో వారి మరణానంతరం వారి భార్య విజయశ్రీ కొవ్వూరు స్టేట్ బ్యాంకు వెనుక వీధిలో తన నివాసం ఉంటున్న ఇంటిని తన భర్త అభీష్టం మేరకు తన తదనంతరం శ్రీ షిరిడి సాయి జనసేన కేంద్రం కొవ్వూరుకు 263 గజాల స్థలము, ఇంటిని వీలునామా ద్వారా రాసి ఉన్నారు. 2025లో ఆమె మృతి చెందారు. తరువాత వారి సోదరులైన గంధం జయ, గంధం సాయి కుటుంబ సభ్యులు వారి అక్క బావల కోరిక మేరకు విల్లుకు సంబంధించిన ఆస్తిని గురువారం సేవా కేంద్రం సభ్యులకు అప్పగించారు. సేవా కేంద్ర సభ్యులు గుడివాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ భాను ప్రసాద్ వారి భార్య అభీష్టం మేరకు ఈ ఆస్తిని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
వైభవంగా వాడపల్లి వెంకన్న అధ్యయనోత్సవాలు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో 5వ రోజు గురువారం ఉదయం గౌతమి గోదావరి నది నుంచి తీర్థం బిందె తీసుకురావడంతో కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. వైష్ణవ స్వాములు సేవా కాలం స్వామి వారి ఎదుట దివ్య ప్రబంధ పారాయణం భక్తిశ్రద్ధలతో చేశారు. వాడపల్లి మాడ వీధులలో గురువారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ, గరుడ, సింహ, హంస వాహన సేవలు మేళతాళాలు, బాణసంచా కాల్పులుతో బాండ్ వాయిద్యాల నడుమ, భక్త జన రంజకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని ప్రత్యేకంగ పండ్లు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తుల వసతుల కల్పనను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్య చక్రధరరావుల పర్యవేక్షించారు. రాత్రి పల్లకి, గరుడ, సింహ, హంస వాహన సేవలు -
చిరు జల్లులు.. చల్లని గాలులు
దేవరపల్లి: ఉదయం నుంచీ ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు సాయంత్రం చల్లని గాలులతో కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. సాయంత్రం 4 గంటలకు ఆకాశంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుని, చిరు జల్లులు కురిశాయి. చల్లని గాలులు వీచాయి. దీంతో, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు రోడ్ల పైకి వచ్చి కేరింతలు కొట్టారు. అయితే, పొగాకు, మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. కళ్లాలపై ఎండబోసిన మిరప కాయలను రైతులు రాశులు వేసి, బరకాలు కప్పి ఒబ్బిడి చేశారు. పొగాకు రెలుపులు చివరి దశలో ఉండటంతో వర్షం కురిస్తే నాణ్యత దెబ్బ తింటుందని చెప్పారు. మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో పొగాకు, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతటా సుభిక్షం, సౌభాగ్యం నిండాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంతో పా టు దేశమంతటా సుభిక్షం, సౌభాగ్యం నిండాలని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆకాంక్షించారు. కలెక్టరేట్లో శ్రీ పరాభవ నామ సంవత్సర జిల్లా స్థాయి ఉగాది వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం కుటుంబంలా కలిసి ప్రజా సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గేట్లో 84వ ర్యాంక్ సామర్లకోట: పట్టణానికి చెందిన తెలగరెడ్డి సాయి ప్రసన్న కుమార్ గేట్ 2026లో ఆలిండియా 84వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి దుర్గపూర్లో బీటెక్ చదువుతున్నాడు. గతంలో కేఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రసన్న కుమార్ గేట్లో 84వ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రసన్న కుమార్ తండ్రి వీరభద్రరావు రోజు కూలీగా పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. తల్లి భూచక్రవేణు గృహిణి. తమ కుమారుడు మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఉగాది వేళ ఉసురు తీసిన లారీ డ్రైవర్
● తాళ్లూరు శివారులో హైవేపై ప్రమాదం ● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు ● మృత్యువును జయించిన మరో యువకుడు గండేపల్లి: ఒక లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఉగాది వేళ ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. ఉగాది పండగను జరుపుకునేందుకు గ్రామస్తులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఊహించని విషయం గ్రామస్తుల చెవిన పడటంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా బెనిఫిట్ షో చూసిన యువకులు వారి ఆనందాన్ని తమ స్నేహితులు, బంధువులు, గ్రామస్తులతో పంచుకునే లోపే ఘోరం జరిగిపోయింది. కన్న కొడుకును కోల్పోయిన బాధ ఒక కన్న పేగుదైతే, తీవ్ర గాయాలతో కొడుకు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వేదన మరో పేగు బందానిధి. మండలంలోని రామయ్యపాలెంకు చెందిన కాపుశెట్టి షణ్ముఖ శ్రీ చంద్రశేఖర్ (చందు) (17), బద్ది నాగసాయి మణికంఠ, సాలాపు లక్ష్మి వీర వెంకట కిషోర్లు కలిసి మోటార్ సైకిల్పై గురువారం విడుదలైన ఉస్తాద్ భగత్సింగ్ సినిమా బెనిఫిట్షోకు జగ్గంపేట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాళ్లూరు శివారు డివైడర్ వద్దకు వచ్చే సరికి ఉప్పలపాడు వెళ్లేందుకు ఆగి ఉన్న ఆటోను తప్పించే ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో వెనకే వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి మోటార్ సైకిల్ను ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయిన వీరిపై నుంచి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చందు, మణికంఠకు తీవ్రగాయాలు కాగా కిషోర్ బయటపడ్డాడు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ వాహన సిబ్బంది, గండేపల్లి పోలీసులు, స్థానికుల సహాయంతో రోడ్డు సేఫ్టీ వాహనంలో జెడ్ రాగంపేట వద్ద గల సీహెచ్సీకి క్షతగాత్రులను తరలించారు. వైద్యులు సూచనలమేరకు అక్కడి నుంచి 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చందు మృతి చెందగా, మణికంఠ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన లారీ తప్పించుకుపోవడంతో హైవేపై సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మృతుని స్నేహితుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు చందు తల్లితండ్రులు శ్రీను, దేవిలకు రెండవ కొడుకని గ్రామస్తులు తెలిపారు. తండ్రి నిర్వహిస్తున్న చిరు వ్యాపారంలో సాయం చేస్తుండేవాడని, అందరితోనూ కలివిడిగా ఉండే చందు మృతిచెందడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు చందు, మణికంఠ ఇళ్లకు చేరుకుని వారి కుటుంబాల ఓదార్చారు. ఇద్దరు చిననాటి స్నేహితులు మృతుడు చందు, చికిత్స పొందుతున్న మణికంఠ చిననాటి స్నేహితులని, వీరిద్దరూ కలిసి రాజానగరం వద్ద గల ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తిచేసి సెకండ్ ఇయర్కు వచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. స్నేహితుడు మృతిచెందిన విషయాన్ని మణికంఠకు తెలియకుండా గోప్యంగా ఉంచినట్టు తెలిపారు. -
నాటిక పోటీలు ప్రారంభం
రావులపాలెం: అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని సినీనటులు గౌతంరాజు, గుండు సుదర్శన్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని సీఆర్సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు, సిల్వర్ జూబ్లి వేడుకలు గురువారం వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 26 వసంతాలుగా సీఆర్సీ సేవలు ప్రసంశనీయం అని కొనియాడారు. సీఆర్సీ ఉగాది పురస్కారాన్ని కాకినాడకు చెందిన సప్తగిరి హేచరీస్ అధినేత సత్తి సూర్యనారాయణరెడ్డికి అందజేశారు. ఏర్పాట్లను సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, సీఆర్సీ రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కె.సూర్య, ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, సీఆర్సీ డైరెక్టర్లు సత్తి సూర్యభాస్కరరెడ్డి(చిన్నబుజ్జి) మల్లిడి విజయభాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్రెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ పలివెల త్రిమూర్తులు పర్యవేక్షించారు. ఆలోచింపజేసిన నాటికలు మొదటిరోజు రెండు నాటికలను ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ (నాటిక) జ్యోతిరాజ్ భీశెట్టి రచన, డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో ఆలోచనాత్మకంగా సాగింది. సృష్టిలో ఉత్తమమైనది మానవ జన్మ, మానవ చరిత్రలో సీ్త్ర, పురుషుల గురించే మనం మాట్లాడుకుంటాం, పురాణకాలం నుంచి నేటి వరకూ, ఆదిమానవ యుగం నుంచి ఇప్పటివరకూ సీ్త్ర,పురుషులే కాకుండా మానవజాతిలో దాదాపు 20 రకాల శరీరతత్వాలు కలిగిన మనుషులు ఉన్నారని ఎంతమందికి తెలుసు?! సీ్త్రలను, పురుషులను మాత్రమే గౌరవించే ఈ బూటకపు నాగరికతలో వాళ్ళు ఎలా మనగలుగుతున్నారు?! అలాంటి వాళ్ళకు ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉంది? అసలు ఈ ఆలోచన మనకు ఎప్పుడైనా కలిగిందా? విభిన్న శరీరతత్వ స్వభావం కలిగినవారి గురించి మన పురాణాలు, చరిత్రలు పరిచయం చేస్తూనే వచ్చాయి. సాంకేతికత గల నేటి ఆధునిక సమాజంలో అలాంటి వారికి సముచిత స్థానాన్ని కలగ చేయకపోవడం మన నాగరికతలో మనం ఒప్పుకోవడానికి సిద్దపడని డొల్లతనం కాదా?! సీ్త్ర, పురుషుడు కానివారిని అవమానించడం, గౌరవించకపోవడం, అసహ్యించుకోవడం అనేది మానవజాతి దిగజారుడు స్థితికి ఓ ప్రతీక. అవునంటారా ? కాదంటారా? అలాంటి వివక్షలను కనీసం తరచి చూసే బాధ్యత మనకి ఉందంటారా? లేదంటారా? అలాంటి ఎన్నో నిజ జీవితాల నుంచి ఆవిష్కరించిన ఒక విభిన్న శరీరతత్వపు మనిషి జీవితంలోకి తొంగి చూద్దాం వాళ్ళు మనసున్న మనుషులేనని గుర్తించి, గౌరవిద్దాం అంటూ ఆలోచనాత్మకంగా సాగిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ఆకట్టుకుంది. కాకినాడ బీవీకే క్రియేషన్స్ కన్నీటికి విలువెంత? నాటిక మూల కథ: డి కామేశ్వరి, నాటకీకరణ: డి ఉమా శంకర్, దర్శకత్వం: డి వినయ్ ఈ నాటికను సందేశాత్మకంగా ప్రదర్శించారు. డాక్టర్ సరోజినీ దేవి మానవసేవయే మాధవసేవ అని భావిస్తూ వైద్య సేవ కొనసాగిస్తున్న రోజుల నుంచి ధర్మం అధర్మంగా మారి డబ్బుకి విలువిస్తున్న డాక్టర్గా మారింది. నర్సు నందిని డాక్టర్ సరోజినీదేవి స్థితిగతులను పరిశీలిస్తుంది. సరోజినీ దేవి కారు డ్రైవర్ భార్య సితాలు తన అత్త పార్వతిని వెంటబెట్టుకుని హాస్పిటల్కి వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన మహాలక్ష్మి, గర్భవతి అయిన తన కూతురు మాధవిని హాస్పిటల్కి తీసుకొస్తుంది. సితాలు, మాధవి ఇద్దరికి పురిటి నొప్పుల ప్రసవ వేదన ఒకేసారి మొదలవుతుంది. సరోజినీ దేవి డబ్బు ఆశ వల్ల నిర్లక్ష్యం వల్ల మాధవి కూతురు చనిపోతుంది. సరోజినీ దేవి సూక్ష్మ ఆలోచనతో సితాలు బిడ్డను మాధవి దగ్గర మాధవి బిడ్డను సితాలు దగ్గర పడుకోబెడుతుంది. ఈ విషయం గమనించిన నర్సు నందిని డాక్టర్న్ని నిలదీస్తుంది సరోజినీ దేవి నర్సు నందిని నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. సితాలు ఏడుస్తూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మాధవికి పుట్టిన బిడ్డను వద్దు అని చెప్పి డాక్టర్కి ఇచ్చేసి వెళ్లిపోతుంది. నర్సు నందిని ద్వారా సితాలు, మాధవి నిజానిజాలు తెలుసుకుని డాక్టర్ సరోజినీదేవిని న్యాయస్థానానికి అప్పగిస్తారు. ఈ కథాంశం ఆసక్తిగా సాగింది. -
మతాతీతం.. మరియారాధన..
దేవరపల్లి: ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కొర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1976లో ఏలూరు క్యాథలిక్ పీఠం ఏర్పడింది. అప్పటికే ఏలూరులో బిషప్గా ఉన్న జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనంతరం ఆయన కారులో విశాఖపట్నం వెళ్తూ గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురవడంతో అక్కడ దిగి ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ఆయన మనసులో ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖకు బయలుదేరారు. గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మాణానికి సంకల్పించి 1979లో ఆలయాన్ని నిర్మించి ఫాదర్ మైకేల్ను తొలి డైరెక్టర్గా నియమించారు. 1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1995లో అక్కడ ప్రేమసేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 25న పీఠాధిపతుల రాక ఈ నెల 25న ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయకుమార్ రాయరాల, ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి ఉత్సవాలకు హాజరై సమష్టి దివ్యబలి పూజ నిర్వహిస్తారని జాన్ పీటర్ తెలిపారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు దాతలు, భక్తుల సహకారంతో నిత్యం సుమారు 2 వేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు వస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, విశ్రాంతి పందిళ్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు భక్తులు పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. భారీగా రానున్న భక్తులు ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. దీపకాంతుల నడుమ క్రీస్తు శిలువగౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం 2000లో అఖండ దేవాలయ నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో అప్పటి పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ దిరిసిన ఆరోన్ ఆలయ నిరా్మాణాన్ని పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్థనలు చేసుకునేందురు వీలుగా దేవాలయాన్ని నిర్మించారు. క్షేత్రంలో పలు కట్టడాలను కళాత్మకంగా రూపొందించారు. వంద అడుగుల క్రీస్తు మందిరం నిర్మలగిరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపరిచారు. 22 నుంచి మరియతల్లి పండగ ముస్తాబైన పుణ్యక్షేత్రం అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది వస్తారని అంచనా వివిధ ప్రాంతాల నుంచి {ç³™ólÅMýS BÈtïÜ ºçÜ$ÞË$ ˘ -
అక్రమ కట్టడాలు కూల్చివేయాలి
రాజమహేంద్రవరం సిటీ: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోత్సాహంతో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాలు అమలు చేసి కూల్చివేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి, అనంతరం ర్యాలీ నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ దేవీచౌక్ సెంటర్లోని జిల్లా పశువుల ఆస్పత్రి ఎదురుగా గౌతమి సూపర్ బజార్ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చి వేయాలన్నారు. గౌతమి సూపర్ బజార్ విషయంలో తాను రూ.ఐదు కోట్ల ముడుపులు తీసుకున్నానంటూ గత ఎన్నికల సమయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ అబద్ధపు ప్రచారం చేసి, వేల పోస్టర్లను నగరంలో వెదజల్లించి, నీచ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు తెచ్చుకుని నా నిజాయితీ, సచ్చీలత నిరూపించుకున్నాననన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగినా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నోరు విప్పక పోవడంతో ముడుపులు తీసుకున్నది ఎవరో ఇప్పుడు స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, కోర్టు ఆదేశాలు గౌరవించాలని, లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, దాసి వెంకటరావు, మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, పీతా రామకృష్ణ, బిల్డర్ చిన్నా, వాసంశెట్టి గంగాధర్, గుత్తుల హర్ష, రొక్కం త్రినాథ్, కృష్ణవేణి, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, వార్డు ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి ఫ మాజీ ఎంపీ భరత్రామ్, డాక్టర్ శ్రీనివాస్ ఫ రాజమహేంద్రవరంలో నిరసన, ర్యాలీ -
‘సువర్ణ’ బాధితులకు న్యాయం చేయాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అమలాపురం రూరల్: ఏపీ, తెలంగాణలలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా సంస్థ ఎండీ, డైరెక్టర్లకు కోర్టు జైలు శిక్ష, జరిమానాలు విధించినా బాధితులకు న్యాయం జరగలేదని బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశి వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బుద్ధ విహార్లో జరిగిన ఏజెంట్లు, బాధితుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ 2011లో స్థానికంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి 2014 వరకు సుమారు రెండు వేల మంది నుంచి రూ.12 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారన్నారు. 2015లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.అంకయ్య చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు మండలం ఈదరపల్లి పంచాయతీ పరిధిలో రెండు భవనాలు, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో 25 సెంట్ల కొబ్బరి తోట, 8 సెంట్ల ఇంటి స్థలం. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో 4 ఏకరాల భూమి, శ్రీకాకుళంలో 10 ఎకరాలు భూమి, తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ ప్రాంతంలో 140 ఎకరాల భూమి. రాజోలు మండలం శివకోడులో వారు నివసిస్తున్న రూ.50 లక్షల విలువైన భవనం, సంస్థ పేరు మీద ఉన్న ఈ ఆస్తులను 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. కేసు విచారణ సమయంలో సీజ్ చేసిన ఆస్తులను కంపెనీ ఎండీ భూసిం నాగ వెంకట వేణు, డైరెక్టర్లు బినామీ పేర్లతో విక్రయించారు. ఈ కేసులో మార్చి 16వ తేదీన సంస్థ ఎండీ భూసి నాగ వెంకట వేణుకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, డైరెక్టర్లు రాజ్యలక్ష్మికి ఐదేళ్లు, గౌతమికి మూడేళ్ల జైలు శిక్షతో భారీ జరిమానా విధించారు. రూ.వెయ్యి డిపాజిట్ చేసిన బాధితులందరికీ న్యాయం చేయాలని కోర్టు అదేశించిందని, గతంలో కలెక్టర్ సీజ్ చేసిన సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లు, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏజెంట్లు సంఘం ప్రతినిధులు చింతా రత్నం రాజు, జల్లి ప్రసన్నవాణి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
కాజులూరు: మండంలోని పల్లిపాలెం చేపల చెరువుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాజులూరి వెంకటనరసింహారెడ్డికి చెందిన చేపల చెరువులను కాజులూరు శివారు అగ్రికుల క్షత్రియుల పేటకు చెందిన రచ్చ గొల్లరాజు కౌలుకు సాగుచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చెరువుల వద్దకు వచ్చి గట్టుపై గల మంచంపై మృతి చెందాడు. మృతుడు చామనఛాయ కలిగి నీలం రంగు గళ్ల లుంగీ, క్రీమ్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఎడమ చేయి దండపై ఒకటి, పొట్టపై బొడ్డు పక్కన ఒకటి, ఎడమ మోకాలిపై ఒకటి పుట్టుమచ్చలు ఉన్నాయి. వీఆర్వో జుత్తుక రాధాకృష్ణ పిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96559 నంబరుకు ఫోన్ చేసి సమచారమివ్వాలని ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. 22న పవర్ లిఫ్టింగ్ పోటీలు అమలాపురం టౌన్: స్థానిక హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గల జనహిత భవనంలో ఐదవ ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ (మెన్ అండ్ వుమెన్) పోటీలు–2026 జరగనున్నాయని ఆ జిమ్ కోచ్, పోటీల ఆర్గనైజర్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరగనున్న ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ క్రీడాకారుల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి అల్లవరం: బెండమూర్లంక ప్రధాన రహదారిపై అల్లవరం పొలం వద్ద రోడ్డు దాటుతున్న సైకిలిస్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడి గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (60) అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు గోడి నుంచి రెల్లుగడ్డకు సైకిల్పై వెళ్తుండగా అల్లవరం పొలం వద్ద దాటుతుండగా ఏపీ 28 డీజీ 9128 నెంబరు గల కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. ఇష్టారీతిన తవ్వేస్తున్నారు పిఠాపురం: రెండు శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా ఇటీవల నిర్మించిన రోడ్డు పూర్తి కాకుండానే తవ్వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన పిఠాపురం – ఉప్పాడ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్టు పిఠాపురం ఆర్అండ్బీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నూతన పైపులైన్ నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు నిర్మించి రెండు రోజులు పూర్తికాకుండానే యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప సూరప్ప చెరువులో నిర్మించిన నాగులాపల్లి ఏరియా రక్షిత గ్రామీణ మంచినీటి పథకానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ వద్ద ఉన్న పీబీసీ నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా పైప్లైన్ నిర్మిస్తున్నారు. దీని కోసం రోడ్డు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు తవ్వేడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైప్లైన్ పూర్తయ్యాక రోడ్డు నిర్మించాల్సిందని పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి చోద్యం ప్రజాధనం అంటే అంత చులకగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. -
రత్నగిరిపై నేడు ఉగాది వేడుకలు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సన్నిధిన అనివేటి మండపంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు నూతన పంచాంగాలను స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చకులు పూజలు చేస్తారు. తొమ్మిది గంటలకు దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, పంచాంగ రచయిత తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ పంచాంగ పఠనం నిర్వహిస్తారు. అనంతరం ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదం, దేవస్థానం పంచాంగాలను భక్తులకు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. అమలాపురానికి చెందిన వేంపరాల సీతారామ అవధాని, విజయవాడకు చెందిన విశ్రాంత వేద పండితుడు సుందర రామ శ్రౌతిలను సన్మానించనున్నారు. ఉగాది పురస్కారం కింద రూ.ఐదు వేలు నగదు ఇస్తారు. ఆలయ ప్రాకారంలో ఉదయం 11 గంటలకు రథంపై, రాత్రి ఏడు గంటలకు అన్నవరం పుర వీధుల్లో వెండి గజవాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ఇక కియోస్క్ సేవలు అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేలా దేవస్థానంలో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను గురువారం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరూర్ వైశ్యా బ్యాంక్ వీటిని విరాళంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
చిన్ని చిన ఆశ!
కపిలేశ్వరపురం: రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగు సంవత్సరాది ఉగాది కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటూ నిరుద్యోగ యువత కూడా ఈ పండగపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. విద్యాశాఖమంత్రి చినబాబు (లోకేష్) ఉగాదికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పడమే దీనికి కారణం. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 99 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసి తమ చిన్ని ఆశను చినబాబు తీర్చాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా, లేదా, ఒకవేళ ప్రకటించినా ఎన్ని ఉద్యోగాలకు ఇస్తారు అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలంటూ ఎన్నికల సమయంలో విపరీతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. అరకొరగా ప్రజలకు అందించి సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటోంది. వాటి లో యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి ఊసే మరిచిపోయింది. కూటమి గొప్పలు చంద్రబాబు ప్రభుత్వంలో 20 నెలలుగా యువతను దగా చేస్తూ వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి రాగానే యువతకు చక్కటి భవిష్యత్తు ఇస్తామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పారు. సూపర్ సిక్స్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న లోకేష్.. విద్యాశాఖామంత్రి అయినా కూడా 20 నెలలుగా ఆ విషయం మర్చిపోయారు. ఉద్యోగాలు వచ్చేలోపు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దానికీ అతీగతీ లేకపోగా, ఇప్పుడు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. అనేక సార్లు ఇలాంటి ప్రకటనలు చేసి వెనుతిరిగిన కూటమి నేతలపై యువతకు ఆశలు సన్నగిల్లాయి. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఎన్ని ఉద్యోగాలకు ఇస్తారోనని యువత ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులు జిల్లాలో విస్తారంగా విద్యా సంస్థలున్నాయి. ఏటా జూనియర్ కళాశాలల నుంచి సుమారుగా 3 వేల మంది, డిగ్రీ కళాశాలల నుంచి 8 వేల మంది, బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సుల్లో 2 వేల మంది ఉత్తీర్ణులవుతున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇస్తామన్న ఉద్యోగాల కోసం సుమారు జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నట్టు విద్యార్థి సంఘాల అంచనా. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని విడుదల చేయాలంటూ ఈ నెల 12న రాజానగరంలోని గోదావరి గ్లోబర్ యూనివర్సిటీ (జీజీయూ) మెయిన్ గేటు వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఫిబ్రవరి 2న అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ఆర్ఎస్యూ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసిన విషయం తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపకపోగా, మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 154 మద్యం షాపులు, 19 బార్లు ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. వాటిలో అత్యధిక షాపులు జనావాసాల్లోనూ, ఆలయాలు, విద్యాల యాలు, ప్రభుత్వ కార్యాలయాలు సమీపంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2025లో మాదక ద్రవ్యాల కేసులు 52 నమోదయ్యాయి. 2024 ఏడాది డిసెంబర్ 31న ధవళేశ్వరం హైవే సమీపంలో 21 కిలోల గంజాయిని పట్టుకోగా అందులో ధవళేశ్వరం టిడ్కో గృహాలు, మండపేట, నిడదవోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన యవత ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో మోసపోతున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగాల ఆశ చూపి ఏడాది కాలంలో రూ.75 లక్షలు కాజేసింది. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వంలో మెరుగు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల నియామకం ఉద్యమంలా సాగింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వపరం చేసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులను చేసింది. అలాగే జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లుకు గౌరవ వేతనం పేరుతో ఉపాధి కల్పించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జారీ చేసినవే. ఫ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా! ఫ ఎదురు చూస్తున్న యువత ఫ ఉగాదికి ఇస్తామని చినబాబు ప్రకటన ఫ ఏమవుతుందోనని నిరుద్యోగ ఆందోళన ఫ ఇప్పటి వరకూ ఆ హామీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంయువతను దగా చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై యువత ఆశలు పెట్టుకుంది. కానీ అధికారం చేపట్టిన 20 నెలలుగా యువతను ప్రభుత్వం దగా చేస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతాం. – సింహాద్రి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూ, రాజమహేంద్రవరం -
‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం స్థానిక హైటెక్ బస్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుంచి కలెక్టరేట్ వరకూ రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, దివ్యాంగులతో కలిసి ఆమె ప్రయాణించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ తదితరులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఉగాది పురస్కారాలకు ఎంపిక రాజమహేంద్రవరం సిటీ/రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: Æ>çÙ‰ {糿¶æ$™èlÓ… Hsê {ç³MýSsìæ…^ól EV>¨ ç³#Æý‡ÝëP-Æ>-ÌSMýS$ hÌêÏMýS$ ^ðl…¨¯]l ç³Ë$-Ð]l#Æý‡$ G…í³-MýS-Ķæ*ÅÆý‡$. Ñf-Ķæ$-Ðé-yýlÌZ VýS$Æý‡$-ÐéÆý‡… fÇVóS M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ ÒÇMìS AÐéÆý‡$zË$ {ç³§é¯]l… ^ólÝë¢Æý‡$. ÒÇÌZ Æ>f-Ð]l$-õßæ…-{§ýlÐ]l-Æ>-°MìS ^ðl…¨¯]l _{™èl-M>-Æý‡$yýl$ ™éyøk çßæÇ-MýS–çÙ~, ïܰĶæ$ÆŠ‡ M>Æý‡*t-°‹Üt Ð]l…VýSÌS ÔóæQÆŠ‡, Ýëíßæ¡-Ðól™èl¢ MýSÑ™é {ç³Ýë§Šæ, Æý‡…VýS…-õ³-rMýS$ ^ðl…¨¯]l OòÜMýS™èl ÕË$µË$ Ýùíßæ™èl, «§ýl¯]lÅ™èl (§ólѯ]l íÜçÜtÆŠ‡Þ) E¯é²Æý‡$. ˘ డెల్టాలకు నీరు విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు బుధవారం 11,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిలో గోదావరి తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 2,200, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బుధవారం సాయంత్రానికి కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.25 అడుగులు ఉంది. ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓగా ప్రణవ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓగా డాక్టర్ ప్రణవ్ను నియమిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ కెనడీ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆర్వీ సుబ్బారావును విధుల నుంచి తొలగించారు. ఆసుపత్రిలో పలు అవకతవకల కారణంగా సుబ్బారావును ఆర్ఎంఓ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్ ఉత్తర్వులతో డాక్టర్ ప్రణవ్ ఆర్ఎంఓగా విధుల్లో చేరారు. చెక్ పోస్టుల ఏర్పాటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ షణ్మోహన్ బుధవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకూ 24 గంటలూ రొటేషన్ పద్ధతిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ చెక్పోస్ట్లు పనిచేస్తాయన్నారు. రెవెన్యూ, ఎకై ్సజ్, కమర్షియల్ టాక్స్ అధికారులను మల్లవరం, నీలపల్లి, సుంకరపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు వద్ద నియమించినట్లు చెప్పారు. -
టీనేజీ గర్భధారణలు ఆందోళనకరం
ఐసీడీఎస్ ఆర్జేడీ సుజాతా రాణి కాకినాడ క్రైం: టీనేజీ గర్భ ధారణలు పెరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సుజాత రాణి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయ ఆవరణలో ఫ్యాబిన్ కన్వెన్షన్లో శాఖ తరఫున పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో టీనేజ్ గర్భ ధారణలు, బాల్య వివాహాల నిర్మూలనపై డివిజినల్ స్థాయి దిశానిర్దేశ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుజాత రాణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భధారణల వల్ల అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి సంభవిస్తోందన్నారు. సరైన లైంగిక విద్య, కుటుంబం వ్యవస్థ, సమాజం పట్ల అవగాహన లేకపోవడం బాలికల భవితను చిదిమేస్తున్నాయన్నారు. వీటి నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరకపోతే సిబ్బంది విఫలమైనట్లేనని అన్నారు. సమాజంలో కీలక వర్గాలన్నీ పని చేస్తేనే బాలికలను ఈ దురాగతాల నుంచి రక్షించగలమని సుజాత తెలిపారు. కార్యక్రమంలో పీడీ లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు, అందువల్ల కలుగుతున్న టీనేజీ గర్భధారణలు బాలికల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అవగాహన క్షేత్రస్థాయికి చేరేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులో వివాహం జరిగితే చదువు మధ్యలో నిలిచిపోవడం, ఆర్థిక వెసులుబాటు లోపించడం, జీవితంలో స్వతంత్రత కోల్పోవడం, తల్లీ బిడ్డలకు పోషకాహార లోపం, మాతా శిశు మరణాలు సంభవించడం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు, వారి ఎదుగుదలలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు వాటిల్లుతాయన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని లక్ష్మి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు గుర్తిస్తే 1098, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణమూర్తి, డీసీపీవో వెంకట్, డీఐవో డాక్టర్ సుబ్బరాజు, మెప్మా అసిస్టెంట్ పీడీ జిలానీ, డీఎస్డీవో గోపికృష్ణ, పారా లీగల్ అడ్వకేట్ హేమ పద్మజ సహా ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, మెప్మా సిబ్బంది, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ, వన్స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ వాలీబాల్ పోటీలు ప్రారంభం
మలికిపురం: ఆల్ ఇండియా మహిళా ప్రీమియర్ లీగ్ వాలీబాల్ పోటీలు బుధవారం మండలం తూర్పుపాలెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ జరగనున్న ఈ పోటీలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. 70 కిలోల గంజాయి స్వాధీనం బాలుడితో సహా ఐదుగురి అరెస్టు రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమీనాబాద్ వద్ద వాహనాల తనిఖీలో 70 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఐదుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై మైదాన ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో దేవుడు అన్నవరానికి చెందిన పాకపర్తి శ్రీదేవి, రాజవొమ్మంగికి చెందిన పొట్నూరి వీరబాబు, అద్దేపల్లి వీరబాబు, పాడిశెట్టి శివాజీ, ఒక బాలుడు ఉన్నారన్నారు. వీరి నుంచి గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గెజిటెడ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తూకం వేసి పంచనామా పూర్తి చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి సీఆర్సీ ఉగాది నాటిక పోటీలు
రావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 26వ సిల్వర్ జుబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి తెలిపారు. సీఆర్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో ఏడు నాటికలు, సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 26 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తూ నాటికలకు పూర్వ వైభవం తీసుకు రావాలని కృషి చేస్తున్నామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం బాలబాలికల నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఏడాది కాటన్ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అందిస్తారన్నారు. తెలుగు రంగస్థలానికి మణిహారంగా పేరొందిన విశాఖపట్టణానికి చెందిన నటీమణి కె.విజయలక్ష్మిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. గురువారం హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ బృందం ‘అమ్మ చెక్కిన బొమ్మ’, కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ బృందం ‘కన్నీటికి విలువెంత’ ప్రదర్శించనున్నారు. శుక్రవారం గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ బృందం ‘సహాన’, విశాఖకు చెందిన తెలుగు కళా సమితి ‘చిటికెన వేలు’, చైతన్య కళా స్రవంతి ‘అసత్యం’, మూడో రోజు 21న కాకినాడకు చెందిన ఎస్వీ రంగారావు కళా స్రవంతి బృందం ‘ఆచమనం’, విశాఖకు చెందిన భద్రం ఫౌండేషన్ బృందం ‘దొందూ దొందే’ నాటికలతో పాటు చివరి రోజు సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ‘బంగారు లేడి’ ప్రదర్శించనున్నారు. ప్రతి నాటికకు రూ.25 వేలు పారితోషికం, వివిధ విభాగాల్లో వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో సీఆర్సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్లు కె.సూర్య, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్న బుజ్జి), కొవ్వూరి నరేష్కుమార్ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు, కె.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సామర్లకోట: వేట్లపాలెం కెనాల్ రోడ్డులో పెట్రోల్ బంకు సమీపాన ఉన్న ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చిన్న పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సమీపాన పెట్రోలు బంకు ఉండటంతో ఏం జరుగుతుందోనని వేట్లపాలెం దుర్గానగర్ కాలనీకి చెందిన ప్రజలు కంటిపై నిద్రలేకుండా గడిపారు. ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదాన్ని గమనించిన కార్మికులు, స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో ఉన్న సరకు అగ్నికి ఆహుతైంది. పెట్రోలు బంకు సమీపాన ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఉండటం ఎప్పటికై నా ప్రమాదమేనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ సంఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రమాదానికి కారణాలపై ఆరా తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాందీ షాపులో బ్రాండ్ మిక్సింగ్ గుర్తింపు సామర్లకోట: పెద్దాపురం సినిమా సెంటర్లోని ఎంఎస్ సాయి వైన్స్లో బ్రాండ్ మిక్సింగ్ జరిగిన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈనెల 15వ తేదీ రాత్రి మద్యం షాపులో తనిఖీలు చేసిన విషయం విదితమే. ఈ మేరకు విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం వివరాలను ప్రకటించారు. దీనికి సంబంధించి షాపు యజమాని, షాపులో పని చేస్తున్న వ్యక్తులపై కాకినాడ, పెద్దాపురం ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. షాపులో అనుమానంగా ఉన్న వివిధ మద్యం బ్రాండ్ సీసాలను స్వాధీనం చేసుకొని రసాయన విశ్లేషణ పరీక్షకు పంపామన్నారు. 108లో మహిళ ప్రసవం చింతూరు: పురుడు నిమిత్తం ఆసుపత్రికి తీసుకువస్తున్న క్రమంలో 108 వాహనంలో ప్రసవమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మదుగూరుకు చెందిన గర్భిణి మడకం సుబ్బమ్మకు పురుటినొప్పులు రావడంతో 108లో చింతూరు ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆశావర్కర్ లక్ష్మి సాయంతో ఈఎంటీ అరుణ ఆ మహిళకు కాన్పు చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డ క్షేమంగా వున్నారని, వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు పైలట్ సురేష్ తెలిపారు. -
ఎన్హెచ్ కార్యాలయ భవనం అటాచ్మెంట్
రాజానగరం: దివాన్చెరువులోని జాతీయ రహదారుల (ఎన్హెచ్ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అటాచ్మెంట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొవ్వూరు నుంచి గుండుగొలనుకు ఉన్న మార్గంలో ఈ సంస్థకు ఉన్న మూడు ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించిన పరిహారాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ట్రస్టు ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న ఈ సమస్య పై చివరకు కోర్టు ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మనీ డిక్రీ అమలుకు ఆదేశాలిచ్చింది. దీంతో దివాన్చెరువులో ఆర్ఎస్ నం.560/3లో 2.110 ఎకరాలలో ఉన్న ఎన్హెచ్ కార్యాలయ భవనాన్ని, ప్రాంగణాన్ని అటాచ్మెంట్ (జప్తు వరకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికిగాను ప్రాథమికంగా తీసుకునే చర్య) చేస్తూ, ఎటువంటి క్రయ, విక్రయాలు సాగించడానికి వీలులేదంటూ నోటీసు బోర్డులను కూడా ఏర్పాటుచేశారు. -
ఎక్స్ట్రీమ్గా వంటకాలు
● 75 శాతం స్టీమ్ సిస్టంపైనే వంటకాలు ● 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగం ● భక్తులకు రుచికరమైన భోజనం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గ్యాస్ సెగ ఆమడ దూరంలో ఉంది. ఈ పథకం 2009లో మొదలై నేటికీ నిరాఘాటంగానే భక్తులకు భోజన వసతి కల్పిస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడిని పాటిస్తూ స్వామి దర్శనానికి తరలివస్తున్న భక్తులందరికీ కడుపునిండా రుచికరమైన వంటకాలతో సిబ్బంది వండి పెడుతున్నారు. కేవలం 25 నిమిషాల్లోనే.. కేవలం 25 నిమిషాల్లోనే 110 కేజీల బియ్యం ఉడికేటట్టుగా ఒకేసారి స్టీమ్పై పనిచేసే స్టీల్ కుక్కర్లతో ఇక్కడ అన్నం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆర్వో ప్లాంటు ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ క్షేత్రంలో అన్నదాన పథకానికి పుష్కర కాలం పైబడి జీడిపిక్కల పొయ్యితో ఏర్పాటు చేసిన స్టీమ్ సిస్టం, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత నేపథ్యంలో పూర్తిగా కలసి వచ్చింది. కేవలం 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగిస్తుండగా, మిగిలిన 75 శాతం స్టీమ్ సిస్టమ్ పైనే వంటలు వండుతున్నారు. తక్కువ సమయంలో అన్నం తయారీ ఇక్కడ స్టీమ్ సిస్టంలో జీడిపిక్కల పొయ్యికి చేరి అంతర్గతంగా ఉన్న నీటి తొట్టెలోని నీళ్లు మరగకాగి తద్వారా వచ్చే స్టీమ్ను గొట్టాలతో స్టీల్ కుక్కర్లలోకి పంపుతున్నారు. జీడిపిక్కల పొయ్యి నుంచి వచ్చే పొగను ప్రత్యేక గొట్టం ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేశారు. పిక్కల పొయ్యిపై పప్పును ఉడికించి సాంబారు సిద్ధం చేస్తున్నారు. అలాగే పిక్కల పొయ్యిలపై సలసలా కాగే నీటిలో బంగాళాదుంపలు, ఇతర కాయగూరలు ఉడికిస్తున్నారు. స్టీమ్ ద్వారా ఒక్కో కుక్కర్లో 25 నిమిషాల్లోనే వేడి వేడి అన్నం సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు గ్యాస్ పొయ్యి మీద కంటే త్వరితగతిన స్టీమ్ ద్వారా స్టీల్ కుక్కర్లలో అన్నం క్షణంలో వండి వారుస్తున్నారు. 26 కేజీల బియ్యం కట్ట 150 మందికి చొప్పున సాధారణ రోజుల్లో రెండు వేల మంది భక్తులు, వారాంతపు సెలవుల్లో నాలుగు వేలకు పైబడి భక్తులు భోజనం చేస్తున్నారు. అదే పర్వదినాల్లో పది వేల మందికి భోజనం చేస్తున్నారు. 26 కేజీలు ఉన్న ఒక బియ్యం కట్ట 150 మందికి సరిపోతుంది. ఈ క్రమంలో సాధారణ రోజుల్లో 10 నుంచి 15 కట్టలు, వారంతపు రోజుల్లో 25 కట్టలు, పర్వదినాల్లో 40 కట్టల బియ్యాన్ని వారుస్తున్నారు. కాగా స్టీమ్ సిస్టమ్ ఉండడంతో ఇతర అవసరాలకై రోజుకు రెండు సిలిండర్లు వినియోగిస్తున్నారు. నిత్యాన్నదాన పథకానికి, అర్చకులు స్వామికి నివేదన చేసే ప్రసాదాల తయారీకి ఈ రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలోచన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు మదిలో నాడు మెదిలిన ఈ ఆలోచనను స్థానిక దాతలు, భక్తులు, నాయకులు ప్రోత్సహించారు. లక్ష్మీనృసింహస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ను 2009 అక్టోబరు 28న ఏర్పాటు చేశారు. పథకం ప్రారంభించిన మొదటి నెల రోజులు జంపన రామరాజు కుమారులు జంపన సత్యనారాయణ రాజు, వెంకట రంగరాజు కలిపి భక్తులకు సొంత విరాళాలతో అన్నదానం అమలు చేశారు. పప్పు, సాంబారు, పెరుగుతో ప్రారంభమైన అన్నదాన పథకం తదనంతరం కూరలు, పచ్చళ్లు, బూరెలు, పులిహోర, పసందైన వంటకాలకు చిరునామాగా మారింది. అంతర్వేది క్షేత్రంలో స్టీమ్పై పనిచేసే స్టీల్ కుక్కర్లు పథకం వద్ద గ్యాస్ పొయ్యిలపై వంటకాల తయారీ ఇరాన్తో అమెరికా– ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా మన దేశానికి రావలసిన చమురు, ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో వాటితో పాటు దేవాలయాల్లో నిత్యాన్నదానాలపైనే ఈ ప్రభావం పడింది. కానీ అంతర్వేది దేవస్థానంలో అధికారులు, నాయకులు పదిహేనేళ్ల ముందు చూపు కారణంగా అన్నదానం ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఆలయానికి గ్యాస్ కొరత లేదు క్షేత్రంలో ప్రస్తుత తరుణంలో గ్యాస్ కొరత లేదు. రోజుకు రెండు సిలిండర్ల చొప్పున నెలకు 62 సిలిండర్లు అవసరమవుతున్నాయి. నిత్య అన్నదాన పథకానికి, స్వామివారికి నివేదించే ప్రసాదాల తయారీకి రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నాం. నిత్యాన్నదాన పథకానికి గ్యాస్తో సమానంగా స్టీమ్ సిస్టం క్షేత్రంలో కొనసాగుతోంది. భక్తులకు రుచికరమైన భోజనాన్ని వండి పెడుతున్నాం. – ఎంకేటీఎన్వీ ప్రసాద్, ఆలయ ఏసీ, అంతర్వేది దేవస్థానం -
ఫ కరుణించమ్మా..
ఫ బోనమెత్తి.. అమ్మకు జైకొట్టి రాజవొమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ తల్లికి మండలం నలుమూలల నుంచి ఊరేగింపుగా వచ్చిన మహిళలు మంగళవారం బోనాలు ఎత్తుకుని అమ్మకు జైకొట్టి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో వందలాది భక్తులు పాల్గొన్నారు. డప్పువాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకొన్న ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించాన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. – రాజవొమ్మంగి కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు సమీపంలో కొలువై ఉన్న ధారాలమ్మ అమ్మవారి బోనాల జాతర మంగళవారం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తలపై బోనాలు ధరించి, తుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ధర్మకర్త దొంగల సత్తిబాబు ఆధ్వర్యాన జరిగిన ఈ జాతర సందర్భంగా వేలాది మందికి అన్న సంతర్పణ చేశారు. – తుని రూరల్ -
బైక్లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
గోకవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గోకవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం పెద్ద రేలంగిపాడుకు చెందిన కాకూరి స్వామిరెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. దీంతో బైక్ల చోరీలకు పాల్పడ్డాడు. బైక్లను చోరీ చేసి ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్మకాలు సాగించాడు. వివిధ బైక్ చోరీ కేసులపై నమోదైన కేసు విషయంలో విచారణ నిర్వహించగా గోకవరం ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
నిడదవోలు: ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న డీవీవీఎస్ శర్మ (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామంలో భోజనానికి పాలంగిలో ఇంటికి స్కూటర్పై బయలుదేరారు. ఉండ్రాజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఎదురుగా వస్తున్న యువకుల బైక్, శర్మ స్కూటర్ ఎదురెదురుగా ఢీకొనడంతో శర్మ కిందపడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు, తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. శర్మకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెంటపాడు మండలం నుంచి ఉండ్రాజవరం మండల పరిషత్కు బదిలీపై వచ్చారు. అనతికాలంలోనే మంచి వ్యక్తిగా పేరుపొందిన శర్మ అకాల మరణం జీర్ణించుకోలేనిదని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు, మానవత ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు కటారి సిద్ధార్థరాజు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పలు పంచాయతీల కార్యదర్శులు, ఉద్యోగులు ఆయనను కడసారి చూసేందుకు ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయన భార్య, పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. బ్రెయిన్స్ట్రోక్తో సీఆర్ఎంటీ.. గంగవరం: మండల విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్ఎంటీగా పనిచేస్తున్న దుమ్ముల వరప్రసాద్ (55) బ్రెయిన్స్ట్రోక్తో మృతి చెందాడు. రెండురోజుల క్రితం వరప్రసాద్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరప్రసాద్ స్వగ్రామం గంగవరం మండలం నెల్లిపూడి. మంగళవారం ఆయన స్వగ్రామం నెల్లిపూడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వరప్రసాద్ మృతికి జిల్లా విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి–2 టి.మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణ, మండల అధ్యక్షులు బొజ్జిదొర తదితరులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. గుర్తు తెలియని వృద్ధుడు.. రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో అస్వస్థతతో ఉన్న గుర్తుతెలియని వృద్ధుడు స్థానిక ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం రైల్వే జీఆర్పీ హెచ్సీ నాగేశ్వరరావు విలేకరులకు తెలిపా రు. సోమవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. మృతుడికి సు మారు 70 ఏళ్లు ఉంటాయని, 5.2 అడుగుల ఎత్తు ఉన్నాడని మరే విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91545 78496 నంబర్కు సంప్రదించాలన్నారు. -
ఏసీబీ ఉచ్చులో రాజవొమ్మంగి ఎస్సై
రాజవొమ్మంగి: స్థానిక ఎస్సై టి.శివకుమార్ మంగళవారం ఏసీబీ ఉచ్చులో చిక్కారు. ఆయన రాజమహేంద్రవరానికి చెందిన అంబటి అఖిల్బాబు అనే వ్యక్తి దగ్గర రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ తెలిపారు. ఎస్సైను అదుపులోకి తీసుకొన్నామని వెల్లడించారు. ఇటీవల రాజవొమ్మంగి శివారు కిండ్ర జంక్షన్ వద్ద రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు వ్యక్తులు రాజవొమ్మంగికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దాట్ల వెంకటేష్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా ఒకరు పరారీలో వున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా రిమాండ్ అనంతరం ముగ్గురు నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో ఏ–1 ముద్దాయి అయిన అఖిల్బాబు తనపై రౌడీషీట్ ఓపెన్ చేయవద్దంటూ ఎస్సై శివకుమార్తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అలాగే పరారీలో వున్న ఏ–4 ముద్దాయి ఎ.ప్రసాద్ అనే వ్యక్తి తనపై కేసు లేకుండా చూడాలని కూడా ఒప్పందం జరిగిందని డీఎస్పీ కిశోర్కుమార్ విలేకరులతో అన్నారు. ఈ ఒప్పందం మేరకు నలుగురు నిందితులు కలసి ఇప్పటికే ఎస్సైకు రూ.25 వేల నగదు ఇవ్వగా, మరో 15 వేలు ఇస్తూ పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. పక్కా సమాచారంతో దాదాపు పది గంటల పాటు కాపు కాసిన ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ, సతీష్, భాస్కర్, సిబ్బంది రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ నగదు తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నారు. -
బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
● టీటీడీ ప్రతిష్టను మంటగలిపిన చైర్మన్ నాయుడు ● చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ● శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే దాడులు చేయడం అమానుషం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ● రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన రాజమహేంద్రవరం రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, స్వామివారిని కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తారని, అటువంటి ఆలయానికి బీఆర్నాయుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. బీఆర్నాయుడు టీటీడీ ప్రతిష్టను మంటగలిపారన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక మోరంపూడి జంక్షన్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్ సీపీకి చెందిన మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు. ముందుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు టీటీడీకి మచ్చ తీసుకొచ్చారన్నారు. బీఆర్నాయుడు రుణం తీర్చుకోవడానికి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారన్నారు. మహిళల పట్ల అతని ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బీఆర్నాయుడును చైర్మన్ పదవి నుంచి తప్పించాలని భక్తులు ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారన్నారు. బీఆర్నాయుడు చంద్రబాబు సొంత మనిషి కావడం వ్లనే విలేకరులు ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. నా దైవం వెంకటేశ్వరస్వామి అని చెప్పే చంద్రబాబు టీటీడీలో సమస్యలు వస్తే బీఆర్ నాయుడును ఎందుకు తప్పించటం లేదన్నారు. టీటీడీనీ ప్రక్షాళన చేసి నాయుడుపై చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా మహిళలు ధర్నా చేస్తే వారిపై దాడి చేయించి, తిరిగి వారిపై కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. బీఆర్ నాయుడుని వెంటనే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ కేసులు పరిపాటి మాజీమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. కానీ అక్కడ పప్పులు ఉడకకపోవడంతో డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివాహేతర సంబంధం విషయంపై విచారణ జరపకుండా, చర్యలు తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో న్యాయం లేదు, శాంతిభద్రతలు క్షీణించాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటమాడుతున్నారన్నారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలతో టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు వివాహేతర సంబంధం బయటపడినప్పటికీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడుపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే వారిపై దాడిచేసి, కొట్టి తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం అమానుషమన్నారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్నాయుడుపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం ప్రపంచవ్తాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. బీఆర్నాయుడును బర్త్రఫ్ చేయాలి మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ డ్రగ్స్కేసులో పట్టబడ్డ పుట్టామహేష్కుమార్యాదవ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజకీయంగా ఉపయోగించుకున్న తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడుపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీల కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు పెరిగిపోయాయన్నారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లితే మాత్రం భక్తులు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులనాయుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాల బాబు, తోట రామకృష్ణ,, రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
30వ తేదీలోగా కమిటీలను పూర్తిచేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి సూచించారు. మంగళవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వజ్ర భాస్కరరెడ్డి మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాలను రోల్మోడల్గా తీసుకుని సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలన్నారు. కమిటీల నిర్మాణానికి కార్యాచరణ, రానున్న రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు కేంద్రంగా పనిచేసేలా రూపొందించిన విధి విధానాలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సంస్థాగత కార్యాచరణను వజ్ర భాస్కరరెడ్డి వివరించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలవాలని ఇన్చార్జిలకు తెలిపారు. మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడిరాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాలబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, తోటరామకృష్ణ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
భ్రాంతిభద్రతలపై బెంబేలు
● చారిత్రక రాజమహేంద్రవరంలో శాంతిభద్రతలపై తీవ్ర చర్చ ● వరుస ఘటనలతో ప్రజల ఆందోళన ● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి ● చిరు వ్యాపారులకు ప్రజా ప్రతినిధుల పేర్లతో బెదిరింపులు ● ఓ మ్యారేజ్ కార్యాలయంలోకి ప్రవేశించి దుండుగుల దాడులు సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కట్టు తప్పుతున్నాయా? రౌడీషీటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయా? రోడ్లపైనే మద్యం తాగి దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారా? నడిరోడ్లపై కొట్లాటలు.. యథేచ్ఛగా పేకాట శిబిరాలు జరుగుతున్నాయా? బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న ఘటనలే దర్శనం. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటున్నామని పోలీసులు చెబుతున్నా.. చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇవీ తార్కాణాలు చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ● చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ రాజకీయ నేతల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.30ల బన్ను అమ్ముకోవాలన్నా.. రాజకీయ నాయకుల అనుమతులు తీసుకోవాలా..? అని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కమీషన్లు ఇవ్వని వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులపై బాగా వినిపిస్తున్నాయి. ● తాను ఓ ప్రదేశంలో నిల్చుంటే మా ఆయనను పక్కకు తోసేసి నా మెడపై బ్లేడ్తో దాడి చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ● నగరంలో కూటమికి చెందిన ఓ నేత ఆరు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల పేకాట శిబిరాలపై పోలీసులు చేసిన దాడుల్లో రూ.కోట్లు పట్టుబడినా.. కూటమి నేత కావడంతో బయటకు రాకుండా తొక్కిపెట్టి కేస్ను క్లోజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక గంజాయి, మత్తు మందుల చలామణీ పెరిగిపోయిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● ఇటీవల రాత్రి సమయంలో ఓ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలోకి చొరబడి కొందరు దుండగులు వీరంగం సృష్టించినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ... ● చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దివాన్చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆపి డివైడర్పై పడుకొని ఉన్న లారీ డ్రైవర్పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.20,000 నగదు, సెల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పుకూలిపోయాడు. 112 ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ● ఇటీవల తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులో క్రైమ్ పోలీసు అని చెప్పి సీతంపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి వద్ద 9 గ్రాముల బంగారపు ఉంగరాలు లాక్కుని వెళ్లిపోయారు. ● ఇటీవల కొవ్వూరు వెళ్లాలని వేచి చూస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏమార్చాడు. కొవ్వూరు తీసుకెళ్తానని వాహనం ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కొని పరాయయ్యాడు. ● నల్లజర్ల మండలంలోని ఘంటావారిగూడెం గ్రామశివారులో గుణ్ణం సురేష్కు సంబంధించిన రీసార్ట్(కొబ్బరితోట)లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు తెర తీశారు. బర్త్డే పార్టీ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూ ఆకారంలో టేబుల్స్ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. ఉండగా మధ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. ఇతర జిల్లాలకు చెందిన నలుగురు డ్యాన్సర్లు, 24 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు మద్యం బాటిళ్లు, రూ.10 వేల నగదు, 6 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉంగుటూరుకు చెందిన నాయకుడు తన పుట్టినరోజు వేడుకకు ఇదే తరహాలో పార్టీ ఏర్పాటు చేయగా పార్టీ మధ్యలో పోలీసులు దాడి చేశారు. అయినా పరిస్థితి మారలేదంటే పోలీసుల పహరా ఎలా ఉందో అర్థం అవుతోంది. శాంతి భద్రతలకు ప్రాధాన్యం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. జిల్లాలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించకుండా డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం. బహిరంగంగా మద్యం తాగేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నాం. కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నాం. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల సరఫరాకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. – డి.నరసింహ కిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి పోలీసులపైనే దాడులు రాజమహేంద్రవరంలో కొన్ని మాసాల క్రితం ఓ రౌడీ బ్యాచ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడింది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్, హోమ్ గార్డ్ రోడ్డుపై హల్చల్ చేస్తున్న ముగ్గురు యువకులను ఈ టైం లో తిరగకూడదని చెప్పారు. ఇంటికి వెళ్లండని హెచ్చరించారు. దీంతో.. మద్యం సేవించిన ఆ యువకులు మీరేంటిరా చెప్పేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మాతోనే పెట్టుకుంటారా..? అంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పోలీసు లాఠీని లాక్కు ని, ఎంత వారిస్తున్నా పట్టించుకోకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని చితకబాదారు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ దాడి ఘటన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో... పోలీసు శాఖ ఘటనను సీరియస్గా తీసుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో వెంటనే దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు తిరక్కుండానే అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. బహిరంగంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే.. తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. రాజమహేంద్రవరంలో బరితెగింపు రాజమహేంద్రవరం నగరంలో రాత్రివేళల్లో నడిరోడ్లపైనే గొడవలకు దిగుతున్నారు. ప్రజలకే కాదు నైట్ బీట్ నిర్వహించే పోలీసులకు కూడా రక్షణ కరవైంది. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించిన పోలీసులు పైనే దాడులకు తెగబడుతున్నారు. బరితెగిస్తున్న రౌడీ షీటర్ల చేష్టలకు పోలీసులు నివ్వెరపోతున్నారు. చివరకు పోలీసులు ఏమీ చేయలేక రౌడీ షీటర్ల చేతిలో తన్నులు తిన్న సంఘటనలు రాజమహేంద్రవరం వాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. -
నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో దివ్యాంగ శక్తి పథకంపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో బస్సులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 నుంచి 80 మంది దివ్యాంగులను గుర్తించి రెండు విడతలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక బృందంలోని దివ్యాంగులతో స్థానిక శాసనసభ్యులు సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొననున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో కూడా దివ్యాంగులతో సహపంక్తి భోజనం నిర్వహించనున్నట్లు జేసీ వై మేఘా స్వరూప్ వెల్లడించారు. సైకత శిల్పి శ్రీనివాస్కి జీవన సాఫల్య పురస్కారం రంగంపేట: స్థానిక సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ను ఉగాది జీవ న సాఫల్య పురస్కారం వరించింది. హైదరాబాద్ కు చెందిన విపంచి ఫౌండేషన్ ఉగాదిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది. సైకత శిల్ప కళ ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నందుకు శ్రీనివాస్కు అందజేయనుంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ పురస్కారం శ్రీనివాస్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ జ్యూరీ కమిటీ వెల్లడించింది. నవోదయ ప్రవేశ పరీక్షలో 33వ ర్యాంక్ కరప: నవోదయ ప్రవేశ పరీక్షలో యండమూరు విద్యార్థిని గుబ్బల అవంతిక జిల్లా స్థాయిలో 33వ ర్యాంక్ సాధించింది. యండమూరులోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆమె ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్ష రాసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆమె ఈ ర్యాంక్ సాధించిందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎ.కామేశ్వరరావు, ఎంఏ అలీమ్ తెలిపారు. అవంతికను సర్పంచ్ మారెళ్ల శివ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
మత్తు మందు జల్లి ఆభరణాలు చోరీ!
నల్లజర్ల: హైదరాబాద్ నుంచి నల్లజర్ల మండలం పోతవరానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ప్రయాణికురాలిపై అర్ధరాత్రి మత్తుమందు జల్లి ఆమె బ్యాగులో ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరగ్గా బాధితురాలు గద్దె భారతిలక్ష్మి మార్చి 2న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతవరంలో సోమవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. పోతవరానికి చెందిన గద్దె భారతీలక్ష్మి ఫిబ్రవరి 20న హైదరాబాద్లో బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు గద్దె భారతీలక్ష్మి, బంధువు కరుటూరి నాగశిరోమణి కలసి 28న రాత్రి ఏయస్బీఆర్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. డ్రైవర్ వెనుక ఉన్న స్లీపర్లో వీరద్దరూ పడుకున్నారు. రాత్రి పడుకునే ముందు భారతీలక్ష్మి ఫోన్ బ్యాగ్లో పెట్టేటప్పుడు అందులో ఉన్న బంగారు ఆభరణాలు సరిచూసుకున్నారు. బస్సు ఎక్కడా ఆగలేదు. పోతవరం వచ్చాక బంధువులకు ఫోన్ చేసేందుకు బ్యాగులో చేయిపెడితే నగల ఆచూకీ లేదు. తలదగ్గర పెట్టుకున్న బ్యాగు పెట్టుకున్నట్టే ఉంది. కానీ అందులో నగలు లేవు. దీంతో కంగారు పడి బంధువులకు ఫోన్చేసి చెప్పారు. బస్సు ప్రయాణంలో తన నగలు బంగారు నెక్లెస్, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు మొత్తం 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్టు భారతీలక్ష్మి ఫిర్యాదు చేశారు. బస్సు సిబ్బందే తమపై మత్తుమందు చల్లి ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇంతవరకు పోలీసులు విచారణ చేపట్టక పోగా కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆమె విలేకరులకు వివరించారు. దీనిపై నల్లజర్ల ఎస్ఐ ఆంజనేయబాబును వివరణ కోరగా ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అందుకే కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్తో పాటు భారతీలక్ష్మితో పాటు ప్రయాణించిన 15 మంది ప్రయాణికులను విచారించామని ఈరోజు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధవళేశ్వరం: స్థానిక ప్రధాన రహదారి శాంతారామ్ హాస్పిటల్ సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరు మండలానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ (58) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బేబీ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొవ్వూరు మండలం మద్దూరులంకకు చెందిన భార్యాభర్తలు యర్రంశెట్టి శ్రీనివాస్, బేబి గ్రామంలో త్వరలో జరగనున్న ఉత్సవాలకు కొత్తబట్టలు కొనుక్కునేందుకు సోమవారం షాపింగ్కు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని సోమవారం రాత్రి ధవళేశ్వరం శాంతారామ్ హాస్పిటల్ సమీపానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మృతుని భార్య బేబిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బేబి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఆటోపై ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దర్జాగా నీటి చౌర్యం
తాళ్లరేవు: నీటి అవసరాలు పెరిగిపోవడంతో అక్రమార్కులు భూగర్భ జలాలను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో నీటిని నిత్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థల అవసరాల కోసం భూగర్భ జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రహదారుల చెంతన బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. పలుచోట్ల అనధికారికంగా బోర్లను వేసి నీటిని యథేచ్ఛగా తోడుతున్నారు. నిత్యం లక్షలాది లీటర్ల నీటిని తోడి తరలిస్తుండడంతో భూగర్భజలాల స్థాయి పడిపోతుందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన తాళ్లరేవు, పోలేకుర్రు తదితర పంచాయతీల్లో రహదారుల చెంతన బోర్లను వేసి ఇంజిన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో పట్టి కంపెనీలకు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా మండల అధికారులుగాని, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతుల్లేకుండా ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో తరలింపు పట్టించుకోని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న మంచినీటి బోర్లు అడుగంటుతున్న భూగర్భజలాలు -
కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకూ పోరాడతాం
ప్రకాశం నగర్: మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదని, పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు ఎరజ్రెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆరవ మహాసభ నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్ స్టేడియం నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తాడితోట సెంటర్, బైపాస్ రోడ్డు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటలు పని సమయాన్ని పెంచడం దారుణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళపై భారం మోపేందుకే గ్యాస్ ధరలను అమాంతంగా పెంచారని, వంటగ్యాసుపై రూ.60, కమర్షియల్ గ్యాస్ బండపై రూ.115 పెంచడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ప్రజలు మరిచిపోరన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్ మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్రం నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కిన లోకేష్ బాబు మాట మార్చి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపాల్ కార్మిక నాయకులు తమ ఐక్యతను చాటారు. ఈ బహిరంగ సభకు యూనియన్ అధ్యక్షుడు అసుల రంగనాయకులు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఏసు రత్నం, పోరుమామిళ్ల సుబ్బారాయుడు, తులసేంద్ర, నెక్కంటి సుబ్బారావు, కిర్ల కృష్ణరావు, తాటిపాక మధు, రేఖ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. -
మరణించిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా
తాటిచెట్లపాలెం (విశాఖ): విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ.కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జేఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తూ మరణించిన ఆరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అనుబంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని, సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఎ.శ్రీనివాస్, ఎల్.అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్కు సీఐ రాంబాబు నల్లజర్ల: స్థానిక సీఐ వై.రాంబాబు వీఆర్కు వెళ్లారు. ప్రసుత్తం ఆ బాధ్యతలను దేవరపల్లి సీఐ నాగేశ్వరావునాయక్కు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నల్లజర్ల పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలు రావడం, పోవడం పరిపాటిగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారనే విషయం స్థానికులకు సైతం తెలియకుండా పోయింది. అపుడే దాదాపు ఐదారుగురు సీఐలు, పది మందికి పైగా ఎస్ఐలు మారుతూనే ఉన్నారు. కారణం ఏమిటో తెలియడం లేదని స్ధానికులు అంటున్నారు. కోడిపందాలు, పేకాటలు, జూదాలు, డ్రగ్స్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక, మట్టి మాఫియా అన్నీ ఈ మండలంలోనే ఉన్నాయి. వీటన్నింటిని చూసీచూడనట్టు ఉంటేనే ఇక్కడ ఏ అధికారి అయినా ఉద్యోగం చేయగలుగుతారు. లేకుంటే మర్నాడే వేరే చోటికి బదిలీ కావాల్సిందేనన్న విమర్శలు బహిరంగంగా వినపడుతున్నాయి. ప్రస్తుత సీఐకు కూడా ఈవిధంగానే వీఆర్ జరిగిందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. సీఐ వీఆర్కు వెళ్లిన సంగతి ఇంతవరకు గోప్యంగానే ఉంది. పాఠశాలలో శిలాఫలకం ధ్వంసం ముమ్మిడివరం: కొమానపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో సుమారు రూ.50 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ ఘటణకు కారకులైన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమవారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాయలం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న టి.గణేష్బాబును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్రిజిస్ట్రార్గా నియమించారు. కాకినాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాయలంలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసమూర్తిని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు సబ్రిజిస్ట్రార్గా నియమించారు. -
వరిలో నకిలీలలు
కోరుకొండ: వ్యవసాయ రంగంలో రైతన్నకు నానాటికీ కష్టాలు పెరుగుతున్నాయి. కూటమి పాలనలో రైతు దగాకు గురవుతూనే ఉన్నాడు. విత్తన కంపెనీల కారణంగా నష్టాలపాలు కావాల్సి వస్తుంది. మెట్ట ప్రాంతమైన గోకవరం, సీతానగరం మండలాల్లో విత్తన కంపెనీల కారణంగా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో 330 మంది రైతులు, 1,150 ఎకరాల్లో సాగుచేసిన వరి పంటకు అగ్గితెగులు సోకింది. ఖరీఫ్ సాగులో దిగుబడి తగ్గడంతో రబీసాగుపై నమ్మకం పెట్టుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. కార్పొరేట్ విత్తన కంపెనీల రూపంలో రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వ్యవసాయశాఖ కోరుకొండ సబ్–డివిజన్లో కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలున్నాయి. ఈసబ్ డివిజన్లో 10,150 మంది రైతులు రబీ సీజన్లో 21,526 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. కాగా కోరుకొండ మండలంలో 5,621 ఎకరాలు, సీతానగరం మండలంలో 11,022 ఎకరాలు, గోకవరం మండలంలో 4,883 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే అగ్గితెగులు కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెదుతున్నారు. గింజ పెరిగే దశలోని చేలల్లో, పుష్పగుచ్ఛానికి ఆహారం వెళ్లకుండా అడ్డుకుంటుందన్నారు. దీంతో తాలు, తప్ప గింజలు మాత్రమే రైతులకు దక్కుతాయని గగ్గోలు పెడుతున్నారు. ఈకారణంగా పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు ఇటీవల వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫిర్యదు చేశారు. విత్తన దుకాణాల కారణంగానే నష్టపోయినట్టు రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. శాస్త్రవేత్తలకు పంపాం గోకవరం, సీతానగరం మండలాల్లోని రైతుల ఫిర్యాదు మేరకు విత్తనాల విషయమై శాస్త్రవేత్తలకు ఫిర్యాదులను పంపాము. వారు వచ్చి పంటపొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ధారణ చేస్తారు. అలాగే సమస్యను వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్య నిర్దిష్టంగా తంటికొండ, గాదెలపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. అగ్గితెగులు కారణంగా ఆశించినంత దిగుబడి రాదు. తాలు, తప్పలు మాత్రమే వస్తాయి. – డి.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ ఏడీ, కోరుకొండ నకిలీ విత్తనాలే కారణమంటున్న రైతులు గోకవరం, సీతానగరం మండలాల్లో 1,150 ఎకరాల్లో పంట నష్టం పొలాలను పరిశీలించిన అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఫిర్యాదు -
నవదిన జపాలు ప్రారంభం
దేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో పండగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్రంలోని కొండపైన గల ఏసు క్రీస్తు ఆలయం వద్ద సోమవారం మేరీమాత పతాకాన్ని ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ప్రకాష్ సంగిలి ఆవిష్కరించి పండుగ కార్యక్రమాన్ని ప్రకటించారు. అనంతరం జపమాల ధ్యానం, గురువులతో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 25 వరకు పుణ్యక్షేత్రంలో నవదిన జపాలు, దివ్యబలిపూజ, జపమాల ధ్యానం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఏలూరు బిషప్ జయరావు పొలిమెర మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రేరణ జెండా ఆవిష్కరణ అని అన్నారు. ఏటా నిర్మలగిరి మేరీ మాత్ర ఉత్సవాలకు ముందుగా మేరీమాత పతాకావిష్కరణ జరుగుతుందని చెప్పారు. పతాకావిష్కరణ పండుగకు సూచిక కాదని చెప్పారు. ఇది ఓ ఆధ్యాత్మిక ప్రకటన అని అన్నారు. మరియతల్లి ఈ ప్రాంతంలో ఉందని ఆయన అన్నారు. ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి మాట్లాడుతూ మరియతల్లి పూజా ఆరాధనల ద్వారా ప్రజావళిని, మేత్రాసులను అత్యధికంగా దీవించాలని ప్రార్థించారు. వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి.బాల, పలువురు గురువులు, మేత్రాసన కౌన్సిల్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, నిర్మలగిరి వికారియేట్ గురువులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించిన బిషప్ జయరావు పొలిమెర సమష్టి దివ్యపూజల బలి నిర్వహించిన పీఠాధిపతులు -
పొట్టి శ్రీరాములుకు నివాళి
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): భాషా రాష్ట్రం సాధన కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నతుడు పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కీర్తి కొనియాడారుయ. కలెక్టరేట్లో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పాల్గొన్నారు. నేడు వైఎస్సార్ సీపీ నిరసన రాజమహేంద్రవరం రూరల్: మోరంపూడి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన దాడికి నిరసనగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, జి.శ్రీనివాసనాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వేణుగోపాలకృష్ణ కోరారు. ‘నన్నయ’లో విద్యార్థులకు షార్ట్ టర్మ్ శిక్షణ రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 45 గంటల వ్యవధితో కూడిన షార్ట్ టర్మ్ కోర్సును వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సోమవారం ప్రారంభించారు. హార్ట్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ లో ఈ నెల 25 వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 10 రోజులపాటు ఈసీఈ, ట్రిబుల్ ఈ విద్యార్థులకు యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్లేస్మెంట్ అధికారి ఆచార్య బి.జగన్మోహన్రెడ్డి, ఏపీఎస్ఎస్డిసీ అధికారి డాక్టర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి, హార్డ్వేర్ అండ్ నెట్ వర్కింగ్ ట్రైనింగ్ ఇన్చార్జి మహేష్ పాల్గొన్నారు. 33 పోస్టులకు 452 దరఖాస్తులుకాకినాడ క్రైం: గత ఏడాది డిసెంబర్ 15న రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్, అల్లైడ్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం పది కేటగిరీల్లోని 33 పోస్టులకు 452 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ఆన్లైన్లో పొందుపరిచామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు apego@nic. in, rmckakinada.com వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన మెరిట్ లిస్టులో తమ పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలుంటే ఈ నెల 23వ తేదీ వరకూ కళాశాల పని దినాల్లో స్వీకరిస్తామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. -
మళ్లీ ధరద్రం!
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026దేవరపల్లి: కోకో గింజల ధర పతనమైంది. మొన్నటి వరకు కిలో గింజలు రూ.350 నుంచి రూ.400 ధర పలుకగా, ప్రస్తుతం రూ.170 నుంచి రూ.270 పలుకుతోంది. దీంతో రైతులు కోలుకోలేక విలవిలలాడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి. కంపెనీలు సిండికేట్ కావడం, గిట్టుబాధ ధర ఇవ్వకపోవడం, అన్నింటి కంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోకో రైతులు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 2023–24 పంట కాలంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కోకో పంట రైతుల ఇంట కాసులు కురిపించింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండడం, కిలో గింజల ధర రూ.1,050 పలకడంతో కోకో పండించిన రైతుల పంట పండింది. ఆ ఏడాది ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్లు దిగుబడి రావడంతో సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం వచ్చింది. కొంతమంది రైతులు రూ.కోటికి పైగా ఆదాయం పొందారు. దీంతో కౌలు దారులు తోటల కోసం ఎగబడ్డారు. ఉన్న కొద్దిపాటి తోటలతో పాటు మరికొన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని 2024–25 సంవత్సరంలో రైతులు సాగు చేశారు. అయితే దిగుబడులు తగ్గడంతో పాటు, మార్కెట్లో ధర తగ్గింది. ఓ దశలో గింజలు కొనే నాథుడు లేకుండా పోయాడు. కొనుగోలు సంస్థలు సిండికేట్గా మారి కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడ గింజలు అక్కడే ఉండిపోయాయి. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయడంతో కొనుగోళ్లు నిర్వహించారు. కంపెనీలు కిలో గింజలు రూ.450కు కొనుగోలు చేయగా, ప్రభుత్వం మరో రూ.50 ఇచ్చి రైతులకు కిలో రూ.500 చొప్పున చెల్లించింది. దిగుబడులు తగ్గడం, ధర పతనం కావడంతో ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేలు రైతులు నష్టపోయారు. ఎకరం కౌలు రూ.1.25 లక్షలు కాగా, పెట్టుబడి మరో రూ. 60 వేలు అయింది. దీంతో గత ఏడాది రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. సాగు వివరాలు జిల్లాలో సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు ఉత్పత్తి లక్ష్యం 531 మెట్రిక్ టన్నులు సాగు రైతులు 1,565 మంది రైతు సంఘాల డిమాండ్లు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధర ఇవ్వాలి పండించిన పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేయాలి రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలి వెంకట్రామన్నగూడెంలో కోకో పరిశోధనా కేంద్రం నెలకొల్పాలి కంపెనీల సిండికేట్ విధానాన్ని అరికట్టాలి MóS…{§ýl, Æ>çÙ‰ {糿¶æ$™éÓË$ OÆð‡™èl$-ÌS¯]l$ ˘ ఆదుకోవాలి పతనమైన కోకో గింజల రేటు కోలుకోలేని స్థితిలో రైతు కిలో రూ.270 ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి సాగు వ్యయం రూ.2 లక్షలు ఆదాయం రూ.54 వేలే నష్టం రూ.1.46 లక్షలు 13,500 ఎకరాల్లో సాగు గొల్లుమంటున్న రైతులురైతుల్లో చైతన్యం రావాలి కోకో రైతుల్లో చైతన్యం రావాలి. మంచుకు పూతలు మాడిపోయాయి. కొత్త పూతలు లేవు. ఎకరాకు రెండు క్వింటాళ్లు దిగుబడి రావడం కష్టం. కౌలు రైతులు గొల్లుమంటున్నారు. నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఎకరాకు కౌలు రూ.1.25 లక్షలు, పెట్టుబడి రూ.80 వేలు అయింది. ఆదాయం రూ.54 నుంచి రూ.60 వేలు వస్తోంది. ఎకరాకు సుమారు 1.50 లక్షలు నష్టం వస్తుంది. కోకో రైతుల మొరను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రైతుల్లో చైతన్యం వస్తేనే గాని సమస్యకు పరిష్కారం దొరకదు. – ఉప్పల కాశీ, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కోకో రైతు సంఘం, కోరుమామిడి, నిడదవోలు మండలం కొనే నాథుడు లేడు కోకో గింజలు కొనే నాథుడు లేడు. ఎక్కడ గింజలు అక్కడే ఉన్నాయి. కంపెనీలు రావడంలేదు. ఒకే కంపెనీ ప్రతినిధులు వచ్చి నచ్చిన గింజలు అక్కడక్కడా కొంటున్నారు. చిన్న రైతులను పట్టించుకోవడం లేదు. గింజలు బాగుంటే కిలో రూ.300కు కొంటున్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదు. కిలో రూ.600 ధర ఇస్తే రైతుకు పెట్టుబడులు వస్తాయి. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలి. – కొయ్యలమూడి వేణు, కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం కోలుకోవడం కష్టం ఈ ఏడాది కోకో రైతులు కోలుకోవడం కష్టం. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మార్కెట్ ఉంటుంది. వేసవిలో పండిన గింజలకు డిమాండ్ ఉంటుంది. రెండేళ్లుగా కోకో గింజలు అమ్ముకోవడానికి రైతులు నానావస్థలు పడుతున్నారు. రైతుల మొర చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించడం లేదు. – గడా రాంబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం పూతలకు దోమపోటు కోకో పూతలకు దోమపోటు తగిలింది. తోటలకు తెల్లదోమ వ్యాపించడం, మంచు ఎక్కువగా కురవడంతో పూతలు దెబ్బతిన్నాయి. పూతలు మాడిపోవడంతో కాపులు తగ్గాయి. జిల్లాలోని రైతులు కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది కౌలు దారులున్నారు. మార్కెట్ బాగుంటే ప్రధాన పంట కంటే కోకోకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 2023–24లో మార్కెట్ బాగుండి నాలుగు డబ్బులు మిగిలాయి. 2022–23 పంట కాలంలో కిలో గింజలు రూ.250 నుంచి రూ.275 ధర ఉండగా, 2023–24 సీజన్లో ఊహించని విధంగా మార్కెట్లో ధర పలికింది. 2024–25 పంట కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ప్రస్తుత పంట కాలంలో ధరతో పాటు దిగుబడులు లేక విలవిలలాడుతున్నారు. ఎకరాకు 2 క్వింటాళ్లు రావడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు దెబ్బకు పూతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు పండించిన కోకో గింజలను క్యాడ్బరీ సంస్థ ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. -
పీజీఆర్ఎస్లో 241 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 241 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఆర్ఓ సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 40 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 40 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ను ఎస్పీ డి.నరసింహాకిశోర్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. ఎస్పీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. -
పదినిసలు మొదలు
● ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం ● 24,166 మంది విద్యార్థుల హాజరు ● 258 మంది గైర్హాజరు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచే సందడి వాతావారణం, విద్యార్థులు, వారిని తీసుకువచ్చిన తల్లిదండ్రుల హడావుడి కనిపించింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్ టిక్కెట్ల నంబర్ ఆధారంగా బోర్డుపై రూమ్ నంబర్లు వెతుక్కోవడం, పరుగు పరుగున కేంద్రాల వద్దకు రావడం వంటి దృశ్యాలు కనిపించాయి. తొలి రోజు తెలుగు పరీక్షను 24,424 మంది రాయాల్సి ఉండగా 24,166 మందే హాజరయ్యారు. 258 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 138 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. కలెక్టర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా స్థాయి పరిశీలనాధికారులు 7 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి 4 కేంద్రాలు, పరీక్షల విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్లు, మంగళగిరి ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సంయుక్తంగా జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 69 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. మొత్తం 88 పాఠశాలలను అధికారులు తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, ఫర్నిచర్ వంటి ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరిసరప్రాంతాల్లో జిరాక్స్ దుకాణాలను మూయించివేశారు. 26 పరీక్షా కేంద్రాల్లో ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సీ, ఏపీఓఎస్ఎస్ పరీక్షలు జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 2,392 మంది విద్యార్థులు హాజరుకావాల్సివుండగా 1,833 మంది రాశారు. 559 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉర్దూ పరీక్ష ఇద్దరు విద్యార్థులు రాయాల్సివుండగా ఇద్దరూ హాజరయ్యారు. ఒరియా పరీక్ష ఒకరు రాయాల్సి వుండగా ఆ విద్యార్థి రాలేదు. -
చక్కటీ సంరక్షకా..
● వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ తప్పనిసరి ● క్రమం తప్పకుండా వేయిస్తే మేలు ● నేడు జాతీయ టీకా దినోత్సవంకపిలేశ్వరపురం/ నల్లజర్ల: వ్యాధుల నుంచి జీవితాంతం రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి.. గర్భిణుల నుంచి అప్పుడే పుట్టిన చిన్నారులకూ ఆయా టీకాలు, వ్యాక్సిన్లు వేస్తే వ్యాధులు దరిచేరవు. 11 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు చిన్నారులను కాపాడతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మాతా, శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు వివిధ రకాల టీకాలను అందిస్తోంది. గర్భిణులు, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు నిర్ధేశించిన టీకాలు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే లక్ష్యంతో 90 రోజుల పాటు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను చేపట్టింది. సోమవారం జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. వ్యాక్సిన్ ఇలా.. ● గర్భిణిగా నిర్ధారణ అయిన 3 నెలల తర్వాత టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి. నెల రోజుల వ్యవధిలో మరోసారి టీటీ ఇంజెక్షన్ చేయాలి. వీటితో పాటు ఐరన్, పోలిక్, కాల్షియం ట్యాబ్లెట్లు అందించాలి. ● చిన్నారులకు 9 నెలల నుంచి 12 నెలల వ్యవధిలో తట్టువ్యాధి రాకుండా మీజిల్స్, కంటి, చర్మ వ్యాధులు రాకుండా విటమిన్–ఏ చుక్కలు వేయించాలి. ● 16 నెలల నుంచి 24 నెలల వయసులో బూస్టర్ డోస్ టీపీటీ, మీజిల్స్, విటమిన్–ఏ ఓపీ వేయించాల్సి ఉంటుంది. ● ఐదేళ్లు పూర్తయిన తర్వాత డీపీటీ డోసు వేయించాలి. ● 10– 16 ఏళ్లు పూర్తయితే టెటనస్ టెక్సాయిడ్ (టీటీ) చేయించాలి. గర్భిణులకు ఎఫ్సీఎం ఇంజెక్షన్ ఏటా ఒక్కో జిల్లాలో సుమారు 20 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత నివారణ కోసం ఇంతకు ముందు ఐరన్, సుక్రోజ్ టీకాలు వేసేవారు. వాటి స్థానంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్రిక్ కార్బాక్సీ మల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నారు. దీనిని రెండు సార్లు వేస్తే గర్భిణులు రక్తహీనత నుంచి బయట పడతారు.మచ్చుకు కొన్ని టీకాలు బీసీజీ: క్షయ వ్యాధి నివారణకు పుట్టిన 24 గంటల్లోపు 0.05 ఎంఎల్, నెల దాటిన పిల్లలకు 0.1 ఎంఎల్ మోతాదులో బీసీజీ టీకా వేస్తారు. హెపటైటిస్–బి: పచ్చ కామెర్ల వ్యాధి నివారణ కోసం పుట్టిన 24 గంటల్లోపు 0.5 ఎంఎల్ మోతాదులో వ్యాక్సిన్ ఇస్తారు. ఓపీవీ: పోలియో వ్యాధి నివారణకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ను పుట్టిన సమయంలోనూ, 6, 10, 14 వారాలు, ఏడాదిన్నరకు చుక్కల రూపంలో నోటి ద్వారా వేస్తారు. రోటా వైరస్: పిల్లల్లో నీళ్ల విరేచనాల నివారణకు రోటా వైరస్ వ్యాక్సిన్ను 6, 10, 14 వారాల్లో ఐదేసి చుక్కల చొప్పున నోటి ద్వారా వేస్తారు. బాలికలకు హెచ్పీవీ టీకా క్యాన్సర్ బాధితుల్లో 60 శాతం మంది మహిళలు ఉంటున్నారు. గర్భాశయ క్యాన్సర్లను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 14–15 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకాను ఉచితంగా వేస్తుంది. 2011 మార్చి 1 నుంచి 2012 ఫిబ్రవరి 28 లోపు పుట్టిన బాలికలు అర్హులు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రంలో, మార్చి 10న ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగనుంది. సీహెచ్సీ, పీహెచ్సీ, ఏరియా ఆసుపత్రి, అదనపు జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో బుధ, శనివారాల్లో వ్యాక్సిన్ల కార్యక్రమాల్లో కూడా హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 13,964 బాలికలకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10,989, కాకినాడ జిల్లాలో 15,413, మంది బాలికలకు టీకాలను వేయాలన్నది లక్ష్యం. కాకినాడ జిల్లాకు 7,922, కోనసీమకు 4,912, తూర్పుగోదావరి జిల్లాకు 7,688 డోసులు అందుబాటులో ఉన్నాయి. బాలికలు ఏదైనా తిన్న తర్వాతే టీకా వేయించుకోవాలి. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి, ఫోన్కు వచ్చిన ఓటీపీ ద్వారా నిర్ధారణ చేసుకుని టీకా వేసి ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న సర్టిఫికెట్ ఇస్తారు. టీకా వేశాక కొద్దిపాటి జ్వరం రావొచ్చు. -
క్రమం తప్పకుండా వేయించాలి
పుట్టినప్పటి నుంచి నిర్దేశించిన సమయాల్లో చిన్నారులకు టీకాలను వేయడం ద్వారా వారిని ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోగలం. ఎప్పుడెప్పుడు ఏ ఏ టీకాలు వేయాలన్న దానిపై ఆరోగ్య కార్యకర్తలు ముందుగానే చెబుతారు. వాటిపై పిల్లల సంరక్షకులు అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా టీకాలను వేయిస్తుండాలి. – డాక్టర్ బీవీవీ సత్యనారాయణ, కోనసీమ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అవగాహన కల్పిస్తున్నాం చిన్నారులకు నిర్దేశించిన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. వీటివల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు టీకాలపై వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – టి.గంగాధరరావు, పీహెచ్సీ వైద్యుడు, నల్లజర్ల● -
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్
● అన్నయ్య మృతి, చెల్లెలితో పాటు పిల్లలకు తీవ్ర గాయాలు ● మొండెపులంక వద్ద ఘటనపి.గన్నవరం: మోటారు సైకిల్ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో అన్నయ్య మృతి చెందగా, చెల్లెలితో పాటు ఆమె ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలు కాగా, కుమార్తె సురక్షితంగా బయటబడింది. ఆ ఐదుగురూ మోటారు సైకిల్పై పి.గన్నవరం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. పి.గన్నవరం శివారు చింతపల్లి వారిపేటకు చెందిన చింతపల్లి శ్రీలక్ష్మి ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె సోదరుడు నగరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బళ్ల సురేంద్ర కుమార్ (45) ఈ నెల 13న చెల్లెలు ఇంటికి వచ్చాడు. శ్రీలక్ష్మిని, ఆమె కుమారులు అభినయ్ (10), అవినాష్ (6), కుమార్తె లహరిలను నగరం గ్రామంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. సోమవారం పిల్లలను పాఠశాలకు పంపాలన్న ఉద్దేశంతో చెల్లెలు శ్రీలక్ష్మి తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో సురేంద్ర కుమార్ ఆదివారం సాయంత్రం చెల్లెలిని, పిల్లలను నగరం నుంచి మోటారు సైకిల్పై పి.గన్నవరం తీసుకు వస్తున్నాడు. మొండెపులంక శివారు జొన్నల్లంక ప్రాథమిక పాఠశాల సమీపంలో చాకలిపాలెం వైపు వెళ్తున్న ట్రాక్టర్ వీరి మోటారు సైకిల్ను ఎదురుగా వచ్చి ఢీకొంది. సురేంద్ర కుమార్కు ట్రాక్టర్ తగిలి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీలక్ష్మి, అభినయ్, అవినాష్ల కుడికాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లహరి స్వల్ప గాయాలతో బయటపడింది. వీరి వెనుక మోటారు సైకిల్పై వస్తున్న మరో నలుగురు వ్యక్తులు కూడా ప్రమాదానికి గురయ్యారు. అయితే వారిలో నాలుగేళ్ల పాప తుప్పల్లో పడిపోవడంతో ఆమెకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని క్షత గాత్రులను అంబులెన్స్లో స్థానిక సీహెచ్సీ తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం తల్లీ, ఇద్దరు కుమారులను వేర్వేరు అంబులెన్స్ల్లో అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బంధువుల రోదన రోడ్డు ప్రమాదంలో నగరం గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ మృతితో పి.గన్నవరం సీహెచ్సీ వద్ద అతని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడి భార్య వరలక్ష్మి ఐదు నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. అతనికి కుమారుడు భానుప్రకాష్, కుమార్తె శిరీష ఉన్నారు. ఆస్పత్రి వద్ద కుమారుడు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతుడి భార్య వరలక్ష్మి భర్తను కడసారి చూసేందుకు అవకాశం ఉంటుందో లేదోనని బంధువులు వాపోతున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన చెల్లెలు శ్రీలక్ష్మికి అన్న మరణించాడన్న విషయం తెలియదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న శ్రీలక్ష్మి అన్నయ్యకు ఎలా ఉందని అడిగిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. -
ఐక్యత చాటేందుకు క్రీడలు దోహదం
కాకినాడ క్రైం: ఐక్యత చాటేందుకు క్రీడలు దోహదపడతాయని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విశ్రాంత వీసీ, రాష్ట్ర విశ్రాంత డీఎంఈ డాక్టర్ కోరుకొండ బాబ్జీ అన్నారు. ఆదివారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల మైదానంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ క్రికెట్ మెన్స్ పీజీల టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకకు డాక్టర్ బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోరాహోరీగా తలపడిన తుది పోరులో తిరుపతికి చెందిన శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ బృందం విజేతగా నిలువగా, కాకినాడ రంగరాయ టీమ్ రన్నర్ స్థానం దక్కించుకుంది. కర్నూలు వైద్య కళాశాల, అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలు మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం ముగింపు వేడుకల్లో డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య దూరాల్ని చెరపి, ఐక్యత పెంచేందుకే యూనివర్సిటీ క్రీడలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 20కి పైగా కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు రంగరాయ ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన టోర్నమెంట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎంసీ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు సహా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తి, ఆర్ఎంసీ మెడికో వలంటీర్లు ఎం.మోహన్ అప్పారావు, ఎస్కే మౌలాలి, యశ్వంత్, వినయ్, వసుధ, సాయి శ్వేత, శ్వేత, హర్షిణి తదితరులను డాక్టర్ విష్ణువర్థన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీఎస్ ముఖర్జీ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశి తదితరులు పాల్గొన్నారు. -
అభ్యుదయ కవిత్వం అవసరం
అంబాజీపేట: కవులు సామాజిక చైతన్యం, అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. ఆదివారం అంబాజీపేట పెద్ద వీధిలోని ఏవీఆర్, యర్రాప్రగడ సూర్య ప్రకాశరావు కల్యాణ మండపంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 165వ శతాధిక కవి సమ్మేళనం జరిగింది. చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ నేటి సమాజంలోని కవులు అక్షర శిల్ప నైపుణ్యంతో కవితాత్మకంగా వాస్తవ రూప వైవిధ్యం చూపించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సామాజిక అభివృద్ధికి సహాయపడే సాహిత్యమంతా అభ్యుదయ సాహిత్యం అవుతుందన్నారు. అంబాజీపేట గురజాడ సేవా సమితి అధ్యక్షుడు అరిగెల బలరామమూర్తి మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక జాతీయ స్థాయిలో 165వ కవి సమ్మేళనం నిర్వహించి, తెలుగు సాహిత్య చరిత్రలో కొత్త చైతన్యంతో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలుగు సాహిత్యానికి వెలుగు నింపుతున్నారన్నారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథి మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితల సాధన చేయాలన్నారు. ఏపీ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ రత్నకొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ ప్రతాప్ చేస్తున్న సేవలను కొనియాడారు. జిల్లా కన్వీనర్ బీవీవీ సత్యనారాయణ, వెంకట్ పొలమూరితో పాటు సుమారు 150 మంది కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. అనంతరం కిమ్స్ వైద్య కళాశాల వైస్ చైర్మన్ మోహన్రాజు, వీఆర్వో రాధామనోహర్లను ప్రతాప్, కొండ నరసింహారావు, కావూరి శ్రీనివాసశర్మ ఘనంగా సన్మానించారు. జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాల్గొన్న సుమారు 150 మంది కవులు ఉగాది కవి సమ్మేళనంలో తమ కవితల ద్వారా అక్షర విందును అందించారు. కళావేదిక అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, పేరి కామేశ్వరరావు, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. -
నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
కొత్తపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరం (బొమ్మూరు) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం నెలకొల్పేందుకు ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఆధ్వర్యంలో నిర్ణయించారు. 8 అడుగుల కాంస్య విగ్రహం తయారు చేయాలని కొత్తపేటకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్కుమార్ వుడయార్ను కోరారు. ఆ మేరకు ఆయన తన శిల్పశాలలో విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పటికే విగ్రహాన్ని బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణానికి తరలించి, ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై నెలకొల్పి ఆవిష్కరణకు సిద్ధం చేసినట్టు శిల్పి రాజ్కుమార్ ఆదివారం కొత్తపేటలో విలేకరులకు తెలిపారు. పొట్టి శ్రీరాములు నడయాడిన నెల్లూరుతో పాటు ఒంగోలు తదితర జిల్లాల్లో నెలకొల్పిన సుమారు 25 పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాలను తాను రూపొందించానని తెలిపారు. తాజాగా ఈ కాంస్య విగ్రహం తయారు చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని వుడయార్ చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
అమ్మవారికి రజత హస్తం సమర్పణ
ఆలమూరు: చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీనూకాంబిక అమ్మవారికి ఆదివారం మూడు కిలోల వెండితో తయారు చేసిన రూ.9.5 లక్షల విలువైన త్రిశూలం హస్తాన్ని ఆదివారం భక్తులు సమర్పించారు. ఎన్నారైల సహకారంతో చింతలూరు మహిళా భక్త బృందం ఈ కానుకను ఈఓ ఉండవల్లి వీర్రాజు, చైర్మన్ వీరి అప్పారావుకు అందజేశారు. గన్ని నారాయణరావు, సూర్యలక్ష్మి, గన్ని చిన్నబ్బు, సూర్యభాను, ద్విభాష్యం పద్మావతి, విజయశాంతి, పార్వతి, గుత్తుల విశ్వేశ్వరరావు, నామాల రాంపండు తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా అధ్యయనోత్సవాలు ప్రారంభంఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వైష్ణవ స్వాములు, వేద పండితుల బృంద సభ్యులు ఈ క్రతువులను వైభవంగా నిర్వహించారు. ఉదయం గౌతమీ గోదావరి నుంచి ఆలయ అర్చకులు తీర్థ బిందెను మేళ తాళాలతో ఆలయానికి తీసుకువచ్చారు. స్వామివారికి ఆగమ శాస్త్రానుసారం తొలి హారతి, సుప్రభాత సేవ, మహాలక్ష్మి హోమం జరిపారు. అనంతరం నిత్య సేవాకాలం దివ్య ప్రబంధ పారాయణ చేశారు. నాలుగు వేదాలను, ద్రవిడ వేదాన్ని పారాయణ చేశారు. రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఎంపీ మహేష్కుమార్పై చర్యలు తీసుకోవాలిఅల్లవరం: హైదరా బాద్ శివారులో రేవ్ పార్టీలో పాల్గొని ఈగల్ టీమ్కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్తో పాటు పది మంది దొరికిపోయారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తాగుతూ దొరకడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన మహేష్కుమార్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుందనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ ఉద్యోగిపై లైంగిక వేధింపులు చేశాడని ఫిర్యాదు చేస్తే కనీసం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. డ్రగ్స్, నకిలీ మద్యంతో రోజుకో అత్యాచారం, హత్యలు జరుగుతూ రాష్ట్రం విలవిల్లాడుతుందని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. -
కవర్ ఫుల్గా..!
కట్టెల పొయ్యిలు మళ్లొచ్చాయి. గ్యాస్ కొరత పుణ్యమాని ఆ పొయ్యిలతో వంటలు చేసే పరిస్థితి ఎదురైంది. ఇంటా బయటా అదే దుస్థితి. గతంలో అన్నదానాలకు గ్యాస్ పొయ్యిలే వాడేవారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఇలా కట్టెల పొయ్యిలు వాడుతూ అవస్థలు పడ్డారు. హోటళ్లలో గ్యాస్ కొరత కారణంగా మూసి వేస్తున్నట్లు బోర్డులు పెట్టారు. మరోపక్క కర్రీ పాయింట్లలో రూ.10 ఉండే కూర అమాంతంగా పెంచేసి రూ.25కు విక్రయిస్తున్నారు. – పిఠాపురం ఏకే మల్లవరంలో అన్నదానానికి కట్టెల పొయ్యిలపై వంటలుమామిడి పండ్లను ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. అచ్చం అలానే కొత్తపల్లిలో ఓ ప్రకృతి వ్యవసాయ రైతు ఉల్లి సురేష్ తన పొలంలో ఉన్న కొబ్బరి మామిడి చెట్టు కాయలకు ఇలా కవర్లు కట్టి ఓ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. చీడపీడలు ఆశించకుండా, మచ్చలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. – పిఠాపురం -
ఆల్ ది బెస్ట్...
విద్యార్థులకు సూచనలివీ.. ● విద్యార్థులు విధిగా తమ వెంట హాల్ టికెట్ తీసుకు వెళ్లాలి. ● పరీక్షకు సంబంధించి పుస్తకాలు, పేపర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లరాదు. ● 24 పేజీల సమాధానాల బుక్లెట్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ● ప్రశ్న పద పరిమితిని పాటించాలి. జవాబుల నాణ్యతను బట్టి మార్కులిస్తారు. ● సైన్స్ పరీక్షలో ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి విడివిడిగా ఓఎంఆర్ షీట్లున్న రెండు 12 పేజీల బుక్లెట్లు ఒకేసారి అందిస్తారు. ఫిజికల్ సైన్స్ బుక్లెట్లో ఫిజికల్ సైన్స్ సమాధానాలు, నేచురల్ సైన్స్ బుక్లెట్లో ఆ సబ్జెక్టు సమాధానాలు మాత్రమే రాయాలి. ● ఎటువంటి అవకతవకలకు పాల్పడినా తదుపరి పరీక్షలకు అనుమతించరు. ముందు రాసిన పరీక్షల ఫలితాలు వెల్లడించరు. ● అభ్యర్థి పేరు, రోల్ నంబరు లేదా అభ్యర్థి ఇతర వివరాలను 24 పేజీల బుక్లెట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లో ఏ పేజీలోను రాయకూడదు. రాయవరం: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 391 కేంద్రాల్లో 72,797 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 36,661 మంది బాలురు, 36,136 మంది బాలికలు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 28,921, తూర్పు గోదావరి జిల్లాలో 24,566, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 19,310 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అన్ని చర్యలూ చేపట్టింది. శనివారం మధ్యాహ్నం అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశాలు నిర్వహించి, సూచనలు, సలహాలు అందజేశారు. సీఎస్, డీఓలు ఏం చేయాలంటే.. ఫ చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ) ముందుగా పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, పరిశుభ్రత పరిశీలించాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఫామ్లూ సిద్ధం చేసుకోవాలి. ట్రంక్ పెట్టెలు, క్లాత్ బ్యాగ్స్ వంటి కంటింజెన్స్ సామగ్రి సిద్ధం చేసుకోవాలి. ఫ సిబ్బంది నుంచి వారి కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేషన్స్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సిబ్బందికి గుర్తింపు కార్డులివ్వాలి. ఫ బాలికలను తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. ఫ పరీక్ష జరుగుతున్న రోజుల్లో రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలి. నిర్దేశిత సమయం కంటే ముందు సీఎస్, డీఓలిద్దరి సంతకాలతో పరీక్ష పత్రాల కట్టల సీల్ తెరవాలి. ఫ లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్లకు తరగతి గదులు కేటాయించాలి. ఇన్విజిలేటర్ల విధులివీ.. ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. పరీక్ష పేపర్ల కోడ్లు, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి. పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి. 8.45 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలోకి అనుమతించాలి. 9.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు. ప్రతి విద్యార్థినీ సోదా చేసి, ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకోవాలి. విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్టికెట్ అందిస్తారు. విద్యార్థి హాల్ టికెట్ను అటెండెన్స్ షీట్లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి. అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి. అన్ని పరీక్షలూ బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి. ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలను విద్యార్థులకు వివరించాలి. ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్ పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు. ఓఎంఆర్ షీట్ ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దష్టికి తీసుకుని వెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి. ఓఎంఆర్ షీట్పై ఉన్న బార్ కోడ్పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. 9.25 గంటల్లోగా ఇన్విజిలేటర్ అన్ని పనులూ ముగించుకుని 9.30 గంటలకు కచ్చితంగా ప్రశ్న పత్రాలివ్వాలి. ప్రశ్న పత్రాలు తీసుకున్న వెంటనే సరిపడినన్ని ఉన్నాయా? ఆ రోజుకు సంబంధించిన సబ్జెక్టు/పేపర్కోడ్/మీడియం సరి చూసుకోవాలి. పేపరు ఏ మాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఫ గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్ను ఎర్ర సిరా పెన్తో క్యాన్సిల్ చేయాలి. ఫ సమాధాన పత్రాలు, ఆన్సర్ బుక్లెట్ అన్నీ సరి చూసుకున్నాకే విద్యార్థులను బయటకు పంపించాలి. ఒత్తిడి తేవద్దు రాత్రి పూట ఎక్కువ సమయం చదవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు/సంరక్షకులు ఒత్తిడి చేయరాదు. ఆందోళనను నివారించడానికి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు లేదా ముందుగానే చేరుకుంటే మంచిది. అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కే లు తదితర స్టేషనరీని విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తప్పకుండా తీసుకు వెళ్లేలా చూసుకోవాలి. పరీక్ష కేంద్రంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడరాదని, దుష్ప్రవర్తనలకు పాల్పడరాదని పిల్లలను హెచ్చరిస్తే మంచిది. ఫ నేటి నుంచి టెన్త్ పరీక్షలు ఫ ఉమ్మడి జిల్లాలో హాజరు కానున్న 72,797 మంది ఫ ఏర్పాట్లు పూర్తి -
గ్యాస్ట్రబుల్!
కపిలేశ్వరపురం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ కొరత వార్తలు జనానికి గుబులు పుట్టిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. వీటి పంపిణీని 40 శాతం వరకూ తగ్గించేసింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్కు కొరత రానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వంట గ్యాస్కు ఎటువంటి కొరతా లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలు ఎవరికి వారే ముందు జాగ్రత్తగా ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్ల కోసం బారులు తీరుతున్నారు. బుకింగ్లు రెట్టింపు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు ప్రతి రోజూ గ్యాస్ సిలిండర్లు సాధారణ స్థాయిలోనే సరఫరా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు 11 వేల నుంచి 11,500 వరకూ గ్యాస్ రీఫిల్ బుకింగ్లు నమోదవుతూంటాయి. అటువంటిది ప్రస్తుతం రోజుకు 19,896 నుంచి 22,250 వరకూ నమోదవుతున్నాయి. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే గ్యాస్ బుకింగ్లు దాదాపు రెట్టింపయ్యాయన్నమాట. దీనినిబట్టి జనంలో ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గ్యాస్ బుకింగ్ క్షణాల్లో జరిగేది. అటువంటి ఇప్పుడు సర్వర్లు బిజీబిజీగా మారిపోవడంతో గంటలు గంటలు పడుతోంది. దీనికితోడు గతంలో బుక్ చేసుకున్న ఒక్క రోజులోనే సిలిండర్లను వినియోగదారులకు అందించేవారు. ప్రస్తుతం ముందు బుక్ చేసుకున్న వారికి ముందు అనే విధానంలో గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల బుకింగ్ చేసిన 2 నుంచి 4 రోజులకు కానీ సిలిండర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు అంటున్నారు. వివిధ రంగాలపై ప్రభావం వంట గ్యాస్ ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. ప్రధానంగా ఇది ఆహార వ్యాపారంపై ఇప్పటికే పడుతోంది. పలు హోటళ్లలో అత్యధికంగా గ్యాస్ వినియోగమయ్యే కొన్ని రకాల ఆహార పదార్థాల తయారీని ఇప్పటికే నిలిపివేశారు. భారీ పెట్టుబడులతో రెస్టారెంట్లు ఏర్పాటు చేసిన వారి నుంచి వీధి వ్యాపారుల వరకూ ఎవరికి వారు తమ వ్యాపారం ఏవిధంగా ఉంటుందోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కుటుంబాలు రోజువారీ ఆదాయం పైనే ఆధారపడి జీవిస్తూంటాయి. వీరు రోజువారీ ఆదాయంలో కొంత చిట్టీలు కడతారు. వంట గ్యాస్ కొరతతో వ్యాపారం మూత పడితే ఆర్థికంగా తలకిందులవుతామనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో, ఎవరికి వారే సిలిండర్లను ముందు జాగ్రత్తగా నిల్వ ఉంచుకుంటున్నారు. గ్యాస్ కొరతతో హోటల్ పరిశ్రమ దెబ్బ తింటే.. దానికి అనుబంధంగా పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాలపై ప్రభావం పడుతుంది. అలాగే, కేటరింగ్, అన్నదానాలు చేసేవారు, ఆశ్రమాలు, హాస్టళ్లు నిర్వహించే వారు ఇక్కట్లు ఎదుర్కొంటారు. జిల్లాలో పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్దా హోటళ్లు, కేఫ్లు కలిపి 1.20 లక్షలు ఉన్నాయి. వీటిపై సుమారు 3 లక్షల మంది శ్రామికులు ఆధారపడి జీవిస్తున్నారు. భరోసా కల్పించాలి గ్యాస్ వినియోగం ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. సిలిండర్ల కోసం పడిగాపులు పడే పరిస్థితులు తలెత్తితే ప్రజలు వారి వృత్తి, ఉద్యోగాలను కాదని తిరిగే అవకాశం ఉండదు. దానిని సాకుగా తీసుకుని బ్లాక్లో విక్రయాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనిని సామాన్యులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సేవా సంస్థల వారు తట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలి. – పి.తులసి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి, రాజమహేంద్రవరం ఫ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఫ గ్యాస్ కొరత వార్తలతో జనంలో అలజడి ఫ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో గుబులు ఫ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు ఫ బ్లాక్లో మొదలైన విక్రయాలు! ఫ వివిధ రంగాలపై ప్రభావం హెల్ప్లైన్ నంబర్లు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సమస్యలు తలెత్తితే 80746 61259 నంబరులో సంప్రదించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి తెలిపారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ప్రత్యామ్నాయ నంబర్లివీ.. కంపెనీ హాయ్ మెస్సేజ్ మిస్డ్ కాల్ నంబరు (వాట్సాప్ నంబరు) ఇండేన్ గ్యాస్ 758 888 8824 845 495 5555 భారత్ గ్యాస్ 180 022 4344 771 095 5555 హెచ్పీ గ్యాస్ 9222 201 122 949 360 2222 సోషల్ మీడియా ప్రచారంతో.. యుద్ధ పరిస్థితులు, చమురు, గ్యాస్ నిల్వలపై మీడియాలో వస్తున్న సమాచారాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటున్నారు. కొంత మంది గ్యాస్, చమురుకు కొరత వచ్చే పరిస్థితులు వచ్చేశాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి చూసిన వారు ఆందోళనకు గురై, వంట గ్యాస్ ముందస్తు నిల్వకు ప్రయత్నిస్తున్నారు. అవసరం లేకుండా గ్యాస్ బుక్ చేయడం వలన కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పైగా దీనివలన బ్లాక్లో విక్రయాలకు కూడా అవకాశాలు ఏర్పడతాయని అంటున్నారు. ఇప్పటికే మండపేట రూరల్లో సిలిండర్లను గ్యాస్ బుక్ చేసుకున్న వారికి కాకుండా వేరొకరికి బ్లాక్లో రూ.2 వేల నుంచి రూ.3,500కు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కట్టెల ధరలకు రెక్కలు గ్యాస్ కొరత భయంతో కట్టెలకు డిమాండ్ పెరుగుతోంది. 25 కిలోల కట్టెల ధర గతంలో రూ.120 ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ.200కు పెరిగింది. గతంలో టన్ను కట్టెల ధర రూ.4,800 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.8 వేలు పలుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు. వంటకు పుల్లలు సిద్ధం uజిల్లాలో మండలాలు 22 జనాభా 18.32 లక్షలు వంటగ్యాస్ సరఫరా ఏజెన్సీలు 52వంటగ్యాస్ కనెక్షన్లు 8.67 లక్షలు సంక్షామం తప్పదా! వంట గ్యాస్ కొరత తీవ్రమైతే సంక్షేమంపై కూడా ప్రభావం పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు వంటివి ప్రభావితమవుతాయి. జిల్లాలో 33 సాంఘిక సంక్షేమ, 21 బీసీ సంక్షేమ, 10 గిరిజన సంక్షేమ హాస్టళ్లున్నాయి. ఈ 64 సంక్షేమ హాస్టళ్లలో సుమారు 5,790 మంది విద్యార్థులుంటున్నారు. గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తితే హాస్టళ్లలో ఉంటు న్న విద్యార్థులతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సైతం ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏజెన్సీల వారీగా శనివారం సిలిండర్ల బుకింగ్లు, డెలివరీల వివరాలు ఏజెన్సీ బుకింగ్ డెలివరీ అందుబాటులో 72 గంటలుగా ఉన్న సిలిండర్లు పెండింగ్ ఇండేన్ 3,355 2,100 7,232 1,544 హెచ్పీ 15,278 10,134 8,077 18,306 బీపీసీ 1,236 727 1,138 2,394 మొత్తం 19,869 12,961 16,447 22,244 పాలకుల పుణ్యమా అని ఇప్పటికే నిత్యావసరాల ధరలు ధనాధన్మంటూండటంతో సామాన్యులు ఇప్పటికే పెనం మీద పేలాల్లా వేగిపోతున్నారు. పొయ్యి మీదకే కాదు.. ఇప్పుడు పొయ్యి కింద మంటకు కూడా తంటా వచ్చింది. ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధం పుణ్యమా అని నానాటికీ పెరుగుతున్న వంట గ్యాస్ సమస్య ప్రజల్లో సెగలు పుట్టిస్తోంది. గ్యాస్కు ఎటువంటి కొరతా లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. సిలిండర్ ఖాళీ అయితే మళ్లీ దొరుకుతుందో దొరకదోనని జనం ఆందోళన చెందుతున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
దేవరపల్లి: అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారిద్దరూ అట్నుంచి అటే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈత సరదాయే వారి ప్రాణాలను బలి తీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి జలాశయంలో జరిగిన ఈ సంఘటన దేవరపల్లి మండలం యాదవోలులో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన 11 మంది యువకులు ఓ వ్యాన్లో ఆదివారం ఉదయం గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు. అమ్మవారి దర్శనానంతరం కొండ ప్రాంతంలో సరదాగా గడిపారు. అక్కడ వంటలు వండుకుని, విందు భోజనాల అనంతరం, మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గుబ్బల మంగమ్మ తల్లి జలాశయం వద్ద ఆగారు. వీరిలో వరుసకు అన్నదమ్ములైన తుమ్మల నాగరాజు (32), తుమ్మల రమణ (34) సరదాగా ఈత కొట్టడానికి జలాశయంలో దిగారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఒక్కసారిగా గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న తోటి గ్రామస్తులు ప్రమాదాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని రాత్రి వేళ నాలుగు గంటలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, పలువురు గ్రామస్తులు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరారు. అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడు నాగరాజుకు వివాహం కావాల్సి ఉంది. మరో మృతుడు రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు వ్యవసాయ పనులు చేస్తూండగా, రమణ తాపీ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఫ గుబ్బల మంగమ్మ జలాశయంలో ఇద్దరి మృతి ఫ యాదవోలులో విషాదం -
ఆనందాల ఊయల్లో..
● కల్యాణంలో కొత్త ట్రెండ్ ● హల్దీ ఫంక్షన్లకు పెరిగిన క్రే జ్ ● ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చిన ఆచారం ● ఖర్చుకు వెనకాడని కుటుంబాలు రాయవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను నేటి తరం ఆనందాల ఊ‘యలో’్ల విహరిస్తూ గుర్తుండిపోయేలా జరుపుకోంటోంది. వివాహ తంతులో పద్ధతులు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కొత్తగా హల్దీ ఫంక్షన్ వచ్చి చేరింది. దీన్నే పసుపు వేడుక, మంగళస్నానం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మాన్యుల నుంచి సామాన్యుల వరకూ ఈ ట్రెండ్ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరిగా మారింది. కొత్త పుంతలు పెళ్లికి ఒక్కరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక సెట్టింగ్లు హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్గా మారింది. డ్రెస్ కోడ్ హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్లో ఫొటో, వీడియో షూట్ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు. చెప్పలేని ఆనందం ఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. – కె.సాయికుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కాకినాడ ఉత్సాహాన్నిస్తాయి కొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. – కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం ప్రత్యేక ఆకర్షణ పెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. – కె.సతీష్, ఎన్కేఎస్ ఈవెంట్ మేనేజర్,రాజమహేంద్రవరం -
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
● రేపటి నుంచి ప్రారంభం ● జిల్లాలో 138 కేంద్రాలు ● డీఈవో వాసుదేవరావుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని డీఈవో కె.వాసుదేవరావు అన్నారు. ఎస్కేవీటీ హైస్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 138 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,568 మంది బాలురు, 11,998 మంది బాలికలు మొత్తం 24.566 మంది రాయనున్నారని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. తనిఖీల కోసం ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 18 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. ప్రశ్నపత్రాలను జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామని, ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ల నుంచి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్ల ద్వారా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపే ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
అక్కడ ఆయన. ఇక్కడ ఈయన..
● జనసేనలో వర్గవిభేదాలు ● రాజమహేంద్రవరంలో బయటపడిన వైనం ● వేర్వేరుగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో జనసేన నాయకుల మధ్య వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఒక వైపు కార్యక్రమం నిర్వహించగా, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ మరోవైపు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. దీనికి తోడు పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతలు సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ కార్యక్రమానికి హాజరుకావడం దీనికి అగ్గి రాజేసినట్లయింది. అత్తి సత్యనారాయణ నగరంలో హడావుడి చేశారు. అన్ని వార్డుల్లో తిరిగి భారీ ర్యాలీ చేపట్టారు. సిటీ అధ్యక్షుడు మాత్రం తన పరిధిలో కార్యక్రమం నిర్వహించారు. సఖ్యత లేదా! రాజమహేంద్రవరం సిటీ జనసేనలో ఇద్దరు నేతల మధ్య ఇప్పటికే సఖ్యత ఉండటం లేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, సిటీ ఇన్చార్జి వై.శ్రీనివాస్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. స్వపక్ష పార్టీ అయినా ఏ ఒక్క సందర్భంలోనూ ఇద్దరు నేతలూ కలిసిన సందర్భాలు లేవు. ఇటీవల అత్తి సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అత్తికి శుభాకాంక్షలు తెలిపేందుకు పక్క నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు హాజరైనా సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ మాత్రం గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రాజమహేంద్రవరంలోని తన నివాసంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ కార్యాలయంలో అత్తి సత్యనారాయణ ఒకేరోజు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో బత్తుల ఏర్పాటు చేసిన సమావేశానికి వై.శ్రీనివాస్ హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. మేయర్ పదవి కోసమేనా? సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని కూటమి సర్దుబాటులో భాగంగా అత్తి సత్యనారాయణ వదుకోవాల్సి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా రాజమహేంద్రవరం మేయర్ పీఠం అత్తినే వరిస్తుందన్న ప్రచారం విస్తృతంగా నడిచింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సైతం సత్యనారాయణకే మద్దతు ఇచ్చారు. అయితే అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వెంటనే రాజకీయం మారిపోయింది. ఆదిరెడ్డి వాసు వై.శ్రీనును ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. అందులో భాగంగానే అత్తికి దూరమయ్యారన్న చర్చ నగరంలో జోరుగా సాగుతోంది. -
లోక్ అదాలత్లో కేసుల సత్వర పరిష్కారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏఎస్ఆర్ రంపచోడవరం జిల్లాలోని 47 బెంచ్ల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కోర్టులో న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల్లో లబ్ధిదారులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగ దారుల కోర్టు కేసులను రాజీ ద్వారా పరిష్కారం చేసి బాఽధితులకు అవార్డులు జారీ చేశామన్నారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ వర్గీయుల తీరుపై సర్పంచ్ నిరసన
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను పంచాయతీలో తాను లేకుండా పంచాయతీ సాధారణ సమావేశాన్ని నిర్వహించడాన్ని నిరసిస్తూ సర్పంచ్ గురజర్ల వీర వెంకట సత్యనారాయణ శనివారం నిరసన దీక్ష చేపట్టారు. తనకు సమాచారం ఇవ్వకుండా, టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం పాలకవర్గం సమావేశం నిర్వహించడాన్ని ఆయన ఖండించారు. కార్యదర్శి ఎలగన రమేష్, మండల అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో దీక్షకు కూర్చున్నట్లు చెప్పారు. అయితే రెండు గంటల పాటు టెంట్లో కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆయన.. సహచరుల సూచనల మేరకు దీక్షను విరమించారు. ఈ అంశంపై సోమవారం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రథమ చికిత్సపై పీఎంపీలకు శిక్షణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శనివారం గ్రామీణ వైద్యులకు (పీఎంపీ) ప్రథమ చికిత్సపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కామిరెడ్డి వెంకట రమణ, జిల్లా కోశాధికారి డాక్టర్ జి.మహాలక్ష్మి మాట్లాడుతూ ఎవరికై నా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణుల వైద్యం అందేవరకూ తాత్కాలికంగా చికిత్స అందించేందుకు ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ అవసరమవుతుందన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బళ్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, ఎస్కే రహమాన్ షరీఫ్, ఆర్.సూర్యనారాయణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ సత్యనారాయణ (చంటి), డీఎఫ్ఒ గోపీకృష్ణ, పద్మ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.75 లక్షల భారీ పరిహారంగొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడికి న్యాయస్థానం ద్వారా భారీ ఊరట లభించింది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు తండ్రి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై బీమా పరిహారం కోరుతూ బాధితుడు పిఠాపురం కోర్టులో దావా వేశారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ కేసుపై రాజీ కుదిరింది. జడ్జి ఎం.శ్రీహరి సమక్షంలో బాధితుడు సుబ్బారావుకు రూ.75 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు. -
వారాహి మాతకు బంగారు హారం
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాతకు అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ డైరెక్టర్ శేష సతీష్, ఆశాకిరణ్ దంపతులు సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు హారాన్ని శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, వారాహి మాత దయతో తమ కుటుంబానికి మేలు జరిందని, కృతజ్ఞతగా ఈ హారం సమర్పించామని చెప్పారు. తన బంధువు, ఆలయ కమిటీ ప్రతినిధి సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (చంటిబాబు) దంపతుల ద్వారా అమ్మవారి విశిష్టతను తెలుసుకున్నానన్నారు. దాత దంపతులకు ప్రధానార్చకులు నారాయణ నంబూద్రి, శుక్లా, రాంబాబు తదితరులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్తి భగవాన్రెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), మండ రాజారెడ్డి, ప్రత్యూష మురళి, యువరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు
● వంట గ్యాస్పై నిరంతర పర్యవేక్షణ ● కంట్రోల్ రూమ్ ఏర్పాటు ● జిల్లా పౌర సరఫరాల అధికారి పార్వతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గృహ అవసరాలు, అత్యవసర సేవలకు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో పాటు ఎల్పీజీ పంపిణీదారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లాలోని 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సరఫరా అవుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లు సాధారణంగా పనిచేస్తుండగా, ఎల్పీజీ సిలిండర్ల నిల్వ కూడా తగినంతగా ఉందన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల రీఫిల్ బుకింగ్లు తాత్కాలికంగా పెరిగాయనీ, అయినప్పటికీ డెలివరీలు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో సాగుతున్నాయన్నారు. దీని వల్ల కొన్ని చోట్ల తాత్కాలిక జాప్యం ఏర్పడినా , సరఫరాలో ఎటువంటి ఇబ్బందీ లేదని తెలిపారు. పారిశ్రామిక, బల్క్ ఎల్పీజీ సరఫరాను మాత్రమే పరిమితం చేయగా, గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తూ పంపిణీదారులకు సూచనలిస్తున్నారు. కాబట్టి వినియోగదారులకు ఆందోళన అవసరం లేదన్నారు. హెల్ప్లైన్ ఏర్పాటు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎల్పీజీ సంబంధిత ఫిర్యాదుల కోసం 8074661259 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 225.46 మెట్రిక్ టన్నులు గ్యాస్ (15,742 సిలిండర్లు) అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుకింగ్ ప్రత్యామ్నాయ పద్ధతులు వినియోగదారులు ఒకేసారి ఎక్కువగా బుకింగ్లు చేయడం వల్ల కొన్ని చోట్ల కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు వస్తున్నందున కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్ కోసం వాట్సప్ 1800 22 4344కు హయ్ అని పంపాలి మిస్డ్కాల్: 7710955555 ఐవీఆర్ఎస్: 7715012345 / 7718012345 ఇండేన్ గ్యాస్ కోసం వాట్సప్ 7588888824కు హాయ్ అని పంపాలి మిస్డ్కాల్ : 8454955555 ఐవీఆర్ఎస్ 7718955555 హెచ్పీ గ్యాస్ కోసం వాట్సప్ 9222201122కు ‘ఏజీ’ అని పంపాలి మిస్డ్కాల్: 9493602222 ఐవీఆర్ఎస్ 8888823456 / 9666023456 అలాగే సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. -
జీజీహెచ్ దుస్థితిపై గవర్నర్కు ఫిర్యాదు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో వైద్య సేవల దుస్థితిపై ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీకి చేరుకుంది. కాకినాడ రేచర్లపేటకు చెందిన పొలుమూరి మధుబాబు (52) లిఖితపూర్వకంగా ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. ఆయన గుండె సమస్యతో బాధ పడుతున్నారు. గతంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు నాలుగు స్టెంట్లు వేశారు. ఈ స్థితిలో మధుబాబు ఆయాసం, దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులకు గురై, గడచిన ఐదు నెలల్లో ఆరుసార్లు కాకినాడ జీజీహెచ్కు వచ్చారు. అక్కడ వార్డులో ఒక్కో మంచానికి ఇద్దరు ముగ్గురు రోగుల్ని ఉంచడం గమనించానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అత్యవసర విభాగం నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు రూ.200 డిమాండ్ చేశారని, తన వద్ద డబ్బులు లేవని చెప్తే వార్డు షిఫ్టు పెట్టినప్పటికీ అత్యవసర విభాగంలోనే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత్యంతరం లేక ఆయాసంతో నడచి వస్తుంటే అలా వెళ్లకూడదంటూ నర్సులు గదమాయించారని ఆరోపించారు. చివరకు ఎంఎన్ఓకు రూ.200 ఇవ్వక తప్పలేదని, ఆ తర్వాతే తనను స్ట్రెచర్లో వార్డుకు తరలించాడని వివరించాడు. అప్పటికే ఇద్దరు రోగులున్న పడకపై మూడో వ్యక్తిగా తనను వేశారని, ఒకే మంచంపై ముగ్గురేమిటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇలాగే ఉంటుందని, నచ్చకపోతే వెళ్లిపోమంటూ దురుసుగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలానే ఎందరో రోగులు జీజీహెచ్లో మగ్గిపోతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత ఫొటోలను మధుబాబు జత చేశారు. ఆయన గత నెల 7న గవర్నర్కు ఈ ఫిర్యాదు పంపగా, సంబంధిత విభాగాల పరిశీలన అనంతరం శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీకి చేరింది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. -
కర్షకుడిపై కక్ష!
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026ఈ రైతు పేరు నీతిపూడి శేఖర్ బాబు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామస్తుడు. రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.30 వేల చొప్పున రెండెకరాలకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే మోంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయారు. ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితి. రబీలోనైనా గట్టెక్కుదామంటే.. పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నదాత సుఖీభవ సాయం అందుతుందని ఆశించినా.. పెట్టుబడికి అవకాశం లేక తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కౌలు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆయన వాపోతున్నారు.సాక్షి, రాజమహేంద్రవరం: పథకం ఏదైనా కోతలు, ఆంక్షలు, నిబంధనలే అజెండాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ కొంత మందికే ఇచ్చి మమ అనిపించింది. తల్లికి వందనంలో నిబంధనలు పెట్టి నిధులు అందకుండా తల్లులకు ద్రోహం చేసింది. తాజాగా కర్షకులకు సైతం అందే పంథా అవలంబిస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదలలో తీరని అన్యాయం చేసింది. పథకంలో భారీ స్థాయిలో కోతలు విధించింది. ఇప్పటికే ఈ ఏడాది సొమ్ము ఎగరగొట్టిన కూటమి సర్కారు.. వైఎస్సార్ సీపీ ఆందోళనలతో ఎట్టకేలకు పథకం అమలు చేస్తోంది. అందులోనూ కోతలు విధించి చేతులు దులుపుకొనేందుకు కుట్ర చేస్తోంది. ఇదీ సంగతి సూపర్ సిక్స్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వైఎస్సార్ సీపీ, ప్రజల పోరాటాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల చొప్పున ఏడాదికి మొత్తం రూ.20 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ (మూడవ విడత), పీఎం కిసాన్ (2025–26) కార్యక్రమం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.6 వేలు జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటించారు. ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అర్హులైన ప్రతి రైతు కుటుంబం బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కేంద్ర నిధులతో కలిపి ఇస్తోంది. పైకి మాత్రం తానే పూర్తి నిధులు ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. జిల్లాలో 1,14,991 రైతుల ఖాతాల్లో రూ.65.08 కోట్లు జమ చేశారు. కౌలు రైతులపై కనికరమేదీ? చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ‘అన్నదాత సుఖీభవ’ నిధులు కౌలు రైతులకు అందిన దాఖలాలు లేవు. కౌలు రైతులకు సీసీఆర్సీల జారీలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. భూ యజమాని సమ్మతితోనే వారికి ఆ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాన్ని చేరుకోలేకపోయారు. కార్డులు అందిన రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధులు అందిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రూ.6 వేల సాయం ప్రకారం కౌలు రైతులకు సుమారు రూ.66 కోట్లు నష్టపోవాల్సి వస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో క్రమం తప్పకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 అందజేశారు. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. 18,511 మంది రైతులకు మొండిచేయి వైఎస్సార్ సీపీ ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఏడాది తర్వాత పథకం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం 18,511 మందిని ఈ పథకానికి దూరం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి ‘రైతు భరోసా’ నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,14,991కి కుదించేశారు. వీరు తమకు అందాల్సిన రూ.14.35 కోట్లు నష్టపోయారు. తొలి ఏడాది రూ.160 కోట్లు హుష్కాకి కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీన అధికారం చేపట్టింది. ఆ వెంటనే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రగల్భాలు పలికింది. తొలి ఏడాది ఇవ్వాల్సిన సొమ్ములు ఎగొట్టింది. జిల్లాలోని రైతులకు కేవలం కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.6 వేలు మాత్రమే అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలను వేయలేదు. ఫలితంగా ఆ ఏడాదికి రైతులు సుమారు రూ.160.98 కోట్లు నష్టపోయారు. ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారుల్లో భారీగా కోత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా 1.33 లక్షల మందికి లబ్ధి ప్రస్తుతం 1.14 లక్షలకు కుదింపు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న సర్కారు ప్రస్తుతం ‘పీఎం కిసాన్’తో కలిపి రూ.6 వేలు ఇస్తున్న వైనం తొలి ఏడాది సొమ్ముల ఎగవేత దగాయే రివాజుగా కూటమి ప్రభుత్వం పాలన -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోరుకొండ: స్థానిక బూరుగుపూడి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఇన్సీసుపేటకు చెందిన బొర్రా ప్రభాకరరావు (59) గోకవరం నుంచి మోటారు సైకిల్పై బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్ ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభాకరరావు రోజూ గోకవరం, కోరుకొండ మండలాల్లో దుస్తులు అమ్ముతుంటాడు. ఇతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రోజూలానే గురువారం దుస్తులు విక్రయించి తిరిగి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై వివరించారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా ఆ చిన్నారి తల్లిదండ్రులు అనుపమ, నాగేంద్రలు తమ పాప వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించిందని ఆరోపిస్తున్నారు. చిన్నారి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఈ నెల 5న మండలానికి దగ్గరలోని ఏలేశ్వరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించామన్నారు. అక్కడి నుంచి ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత కాకినాడ జీజీహెచ్కు తీసుకు వెళ్లామన్నారు. చిన్నారికి తల్లీ బిడ్డ వార్డులో వెంటిలేటర్పై చికిత్స అందించారని, ఆ తరువాత పాప బాగానే ఉన్నప్పటికీ రక్తం ఎక్కించారని వాపోయారు. మూడు నెలల చంటి బిడ్డకు రక్తం ఎక్కించడం వల్లనే చనిపోయిందని తల్లి అనుపమ కన్నీరు పెట్టుకొంది. మరోవైపు పాపకు శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులు చికిత్స చేశారని, దీనితో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తమ మొదటి కాన్పు బిడ్డ తమకు కాకుండా తనువు చాలించిందని తల్లిదండ్రులు దుఃఖించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంటి ఆదివాసీలకు సకాలంలో, సరైన వైద్యం లభించడం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి కష్టం మరో తల్లికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్ర వాలీబాల్ టీం కెప్టెన్గా లక్ష్మి రంగంపేట: ఢిల్లీ రాష్ట్రంలోని పీఠంపూర్లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి కెప్టెన్గా రంగంపేట మండలం జి.దొంతమూరు హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఇ.లక్ష్మి ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం కేవీ రమణారావు చెప్పారు. గురువారం ఆయన ఆ హైస్కూల్లో మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక టోర్నమెంట్లలో పాల్గొన్న లక్ష్మి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావడం అభినందనీయమని అన్నారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ అధికారులకు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను గ్రామ సర్పంచ్ గోలి రమణ, ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎస్వీఎస్ నారాయణ, మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భర్త వేధింపులపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు కాకినాడ రూరల్: భర్త వేధింపులపై ఓ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణయ్యపేట బాపన్నదొర కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత, ఎకై ్సజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోలవరపు దేవి ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన శ్రీపతి మణికంఠపై సర్పవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసకుమార్ కథనం ప్రకారం.. గతంలో వివాహమైన దేవి తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత 2021లో మణికంఠను ద్రాక్షారామ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భర్త తన మేనకోడలిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయగా, అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2024 మార్చి 5న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. కోర్టులో వాదోపవాదాల అనంతరం ఈ ఏడాది జనవరిలో కేసు కొట్టివేశారు. ఈ నేపథ్యంలో మేనకోడలిని మణికంఠ రెండో వివాహం చేసుకున్నాడని, అతని కుటుంబ సభ్యులు తనను దూషించి, కొట్టి బెదిరింపులకు గురిచేసినట్టు దేవి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింపు పిఠాపురం: స్థానిక కత్తులగూడెంలో నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన బాలికకు (14) గుంటూరుకు చెందిన వ్యక్తితో అన్నవరంలో ఈ నెల 14న వివాహం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న ఐసీడీఎస్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను స్థానిక పోలీసుల సహాయంతో కాకినాడలోని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. -
చిందేసి.. చికాకు పుట్టించి
కాట్రేనికోన: ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో కొందరి చిందులు హద్దులు దాటాయి.. భక్తులకు రోత పుట్టించాయి. కాట్రేనికోన మండలం కొత్తపాలెం, మొల్లేటిమొగ గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో పోలీసుల సాక్షిగా బుధవారం రాత్రి మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాలతో యువతను రెచ్చగొట్టారు. ఈ రెండు గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మాంసాహారాన్ని వదిలి ప్రజలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. అయితే ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో టెంట్లు వేసి మద్యం విక్రయాలు చేపట్టారు. గ్రామంలో జాతర సందర్భంగా స్టేజ్ మీద అమ్మాయిలు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. అయితే రికార్డింగ్ డ్యాన్స్లను అడ్డుకోవాల్సిన పోలీసులు మాత్రం స్టేజ్కు ఎదురుగా ప్రేక్షకుల్లా కూర్చుని వీక్షించడం శోచనీయం. మద్యం అమ్మకాలు లైసెన్సు షాపుల మాదిరిగా చేసినా పోలీసులు, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పట్టించుకోలేదు. ఇటీవల శివరాత్రి సందర్భంగా మగసానితిప్ప, చొల్లంగి తీర్థంలో, తీర ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు, చెయ్యేరు ప్రభల తీర్థంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించినా ఎవరూ పట్టించుకోలేదు. దీనివెనుక కొందరు నాయకులు ఉండి నడిపిస్తున్నట్లు సమాచారం. జాతరలో అశ్లీల నృత్యాలు -
తారుక్కుపోయేలా..
ఆత్రేయపురం: కోనసీమ జిల్లాలో బొబ్బర్లంక – రావులపాలెం ఆర్అండ్బీ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా దర్శనమిస్తుంది. సింగిల్ రోడ్డు కావడం, గోతులు పడడం, వాహనాల రద్దీ పెరగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెలిచేరు నుంచి బొబ్బర్లంక వరకూ సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రయాణం ఉయ్యాల జంపాలను తలపిస్తోంది. తారు లేక, కంకర రాళ్లు తేలి ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోడ్డు నిర్మించి దశాబ్దాలు కావొస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు ఇటు రావులపాలెం జాతీయ రహదారిని, అటువైపు కాటన్ బ్యారేజీ అవతల నూతన జాతీయ రహదారులను కలుపుతోంది. అంతేకాకుండా ఆర్అండ్బీ శాఖలో రాష్ట్ర రహదారిగా గుర్తింపు పొందినా, అభివృద్ధికి దూరంగా ఉంది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి లక్షల మంది భక్తులు వేలాది వాహనాల్లో ఇటుగా వస్తుంటారు. అలాగే కాలినడకన చాలామంది వాడపల్లి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆ భక్తులకు రోడ్డుపై గోతులు, గొప్పులు, రాళ్లు గుచ్చుకుని రక్తపు గాయాల పాలవుతున్నారు. అయినా రహదారిని గతంలో బిట్లు బిట్లుగా వేయటంతో అతుకులుగా కనిపిస్తోంది. కాగా ఇటీవల చేసిన ప్యాచ్ వర్క్స్తో మరీ అధ్వానంగా ఉంది. గత సంవత్సరం జనవరిలో అతుకులు పూడ్చారు. తిరిగి ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఈ మరమ్మతులకు రూ.లక్షలు వృథా అవుతున్నాయి. కానీ రోడ్డు మాత్రం బాగుపడడం లేదు. పూర్తిస్థాయిలో రోడ్డును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దారిలోనే రైతుల పయనం ఈ ప్రాంతంలో అరటి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు అరటి గెలలను సైకిళ్లపై పెట్టుకుని ఇటు రాజమహేంద్రవరం, అటు రావులపాలెంకు వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో సైకిళ్లు మరమ్మతులకు గురవడంతోపాటు లోడు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నామని రైతులు అంటున్నారు. మండలంలోని మరో జాతీయ రహదారి రాజవరం– పొదలాడ రోడ్డు 13 కిలోమీటర్ల మేర గుంతలతో దర్శనమిస్తుంది. చాలా గ్రామాల ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోడ్డుకు పక్కనే మధ్య డెల్టా కాలువ ఉన్నా, మలుపులు, ప్రమాదభరిత ప్రాంతాల్లో ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.ఎక్కడికక్కడే అతుకులు, గతుకులు.. తారు లేచి రాళ్లు తేలిన దారిలో ప్రయాణానికి అవస్థలు.. ఏళ్లకాలంగా చోద్యం చూస్తున్న పాలకులు.. వెలసి ఎంతో ప్రాధాన్యం ఉన్న బొబ్బర్లంక – రావులపాలెం రహదారిలో ప్రజలకు తప్పని పాట్లు.. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి అయినా ఎవరూ పట్టించుకోక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఫ అధ్వానంగా బొబ్బర్లంక– రావులపాలెం రోడ్డు ఫ అతుకుల బొంతలా మారిన వైనం ఫ పట్టించుకోని కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చుతాం వెలిచేరు నుంచి బొబ్బర్లలంక వరకూ రోడ్డు అధ్వానంగా ఉన్నమాట వాస్తవమే. ఈ రోడ్డును చివరిసారిగా 2011–12లో నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు రూ. 70 లక్షల నిధులు మంజూరయ్యాయి. – జి.రాజేంద్రప్రసాద్, రోడ్లు భవనాల శాఖ డీఈ, కొత్తపేట తరచూ ప్రమాదాలు బొబ్బర్లంక రోడ్డుపై ప్రయాణించాలంటే జనం భయపడిపోతున్నారు. తరచూ వాహన ప్రమాదాలు జరుగుతుండడమే అందుకు కారణం. ఎంతో ప్రాధాన్యం ఉన్న రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. ఈ రాష్ట్ర రహదారిని వెంటనే నాలుగు లైన్ల రహదారిగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. – కనుమూరి శ్రీనురాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు ఏళ్ల తరబడి ఇలానే.. బొబ్బర్లంక రోడ్డు ఏళ్ల తరబడి అధ్వానంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. అధికారులు కనీసం మరమ్మతులు కూడా సక్రమంగా చేయించడం లేదు. సుమారు 13 ఏళ్ల నుంచి ఈ రోడ్డు నిర్వహణను మరిచిపోయారు. కూటమి సర్కార్ మాటలు తప్ప చేతలు కానరావడం లేదు. వెంటనే ఈ రహదారి నిర్మించాలి. – సఖినేటివాకుల రాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు, రావులపాలెం -
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి– 16పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గాంధీనగరానికి చెందిన వ్యవసాయ శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఆచంట జగన్నాథరావు (81) దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగరం నుంచి స్కూటీపై జగన్నాథరావు దేవరపల్లి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా కృష్ణంపాలెం వద్ద హైవేలో తాడిపూడి కాలువ వంతెనపై వెనుక నుంచి అతివేగంగా టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో జగన్నాథరావు తీవ్రంగా గాయపడి అక్కడక్కడే మృతి చెందారు. జగన్నాథరావు సోదరుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు అమెరికాలో డాక్టర్గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. మూడో కుమారుడు ఒంగోలులో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ వ్యవసాయ అధికారి, వ్యవసాయ రంగంలో ఆదర్శ రైతుగా జగన్నాథరావు అవార్డులు అందుకున్నారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. జగన్నాథరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
బాలుడి అపహరణకు యత్నం
ఓ మహిళ కేకలకు పారిపోయిన దుండగులుపి.గన్నవరం: స్థానిక శివాలయం రోడ్డులో గురువారం సాయంత్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న రెండో తరగతి విద్యార్థిని మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపహరించేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఓ మహిళ కేకలు వేయడంతో ఆ బాలుడిని వదిలి కిడ్నాపర్లు పారిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక పితానివారిపాలేనికి చెందిన దొమ్మేటి రిత్విక్ మణికంఠ శివాలయం ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తన తండ్రి నాగరాజు రిత్విక్ను పాఠశాల వద్ద దించాడు. సాయంత్రం 3.30 గంటలకు పాఠశాల విడిచిపెట్టిన అనంతరం రిత్విక్ ఒంటరిగా నడుచుకుంటూ పితానివారిపాలెంలోని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఆ బాలుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు ఏడవడంతో.. సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న మహిళ గమనించి కేకలు వేసింది. దీంతో బాలుడిని వదిలి ఆ ఇద్దరు బైక్పై పరారయ్యారు. అనంతరం ఆ మహిళ ఇతర విద్యార్థుల సాయంతో రిత్విక్ను మరొక మార్గంలో ఇంటికి పంపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
చీడపీడలు ముంచెట్టు
పెరవలి: అంతా బాగుంటే ఆయిల్పామ్ సాగు సిరులు కురిపిస్తోంది.. సస్యరక్షణ చర్యలే ఈ పంటకు శ్రీరామరక్ష అవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వరి తరువాత అధిక మొత్తంలో పామాయిల్ సాగే జరుగుతోంది. జిల్లాలో మొత్తం 19,266 హెక్టార్లలో సాగవుతుండగా, 15 వేల హెక్టార్ల నుంచి పంట ఉత్పత్తి అవుతూ ఏడాదికి 76 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుబడి వస్తోంది. ఏటా ఈ పంటలపై వివిధ తెగుళ్లు, పురుగుల ప్రభావం అధికంగా ఉంటోంది. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి డి.సుధీర్కుమార్ వివరించారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన తెలిపారు. ఆ వివరాలు ఇలా.. కొమ్ము పురుగు కొమ్ము పురుగు ఆయిల్పామ్ మొక్కలను ఆశిస్తే, మొక్కల ఆకులు వీ ఆకారంలో కత్తిరించబడినట్లు ఉంటాయి. ఈ పురుగులు భూమిలో ఏర్పడిన పగుళ్లలో ఉంటాయి. అంతేకాకుండా చెట్టు మొదలు ఉండే పీచులో కూడా ఇవి చేరి పంటకు హాని చేస్తాయి. ఇవి మొవ్వలోకి కూడా ప్రవేశించి మెత్తని పదార్థాన్ని తినేస్తాయి. దీని నివారణకు మొక్కల చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వీటిపై కార్బరిల్ మందును 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వలో పురుగులు ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని తీగతో తీసివేసి అది చేసిన రంధ్రానికి 25 గ్రాముల కార్బరిల్ మందును పది గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి. సంచి పురుగు ఈ పురుగులు శంఖు ఆకారంలో ఉండి ఆకు అడుగు భాగాన చేరతాయి. ఆకులకు రంధ్రాలు చేసి తినేస్తాయి. దీని నివారణకు ఈ పురుగులు సోకిన ఆకులను కత్తిరించి తగులబెట్టాలి. మిగిలిన ఆకుల మీద కార్బరిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం ఆయిల్పామ్ మొక్కలకు సంవత్సరానికి రెండు మోతాదుల్లో ఎరువులు అందించాలి. మొదటి మోతాదు జూన్, జూలై నెలల్లో, రెండో మోతాదు డిసెంబర్, జనవరి నెలల్లోనే మొక్కలకు వేయాలి. మూడేళ్ల వయసు దాటిన ఒక్కో మొక్కకు 2 కిలోల 600 గ్రాముల యూరియా, సింగిల్ పాస్ఫేట్ 3 కిలోల 750 గ్రాములు, పొటాష్ 2 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు ఏడాదిలో రెండుసార్లు వేయాలి. ఫ ఆయిల్పామ్ సాగులో సస్యరక్షణ అవసరం ఫ యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు మొవ్వుకుళ్లు తెగులు ఈ తెగులు ఉధృతి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటుంది. మొక్క పసుపు రంగులోకి మారి మొవ్వు ఆకులను లాగితే తేలికగా వస్తాయి. మొవ్వ లాగిన మొక్క నుంచి తీవ్ర దుర్గంధం వస్తుంది. దీని నివారణకు ఈ తెగులు సోకిన భాగాన్ని శుభ్రం చేసి లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మందు కలిపి తెగులు సోకిన ప్రాంతమంతా పూయాలి. గానోడెర్మా కుళ్లు.. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కింద వరుసలో ఎండిపోతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొవ్వలోకి చేరి కాండం మొదలు వద్ద కణజాలాన్ని ఆశించడంతో అక్కడ కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు తెగులు సోకి చనిపోయిన చెట్లను వెంటనే చేను నుంచి తొలగించాలి. తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే ఆ చెట్టు వేరును తీసి ట్రై డీమార్ఫ్ మందును వంద మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి ఆ వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా చెట్టుమొదలులో వేయాలి. కాండం తడి తెగులు ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వ అకస్మాత్తుగా ఎండిపోతుంది. మిగిలిన ఆకులు త్వరితగతిన వడలిపోతాయి. మొవ్వ ఆకు వడలిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభిస్తే చెట్లు కోలుకుంటాయి. ఈ తెగు లు సోకిన చెట్టు మొవ్వను లాగి అందులో కుళ్లిన పదార్థాన్ని తీసి శుభ్రం చేసిన తరువాత కార్బండిజమ్, మోనోక్రోటోపాస్లను కుళ్లిన చోట పై పూతగా వేసి ఆ తరువాత తారును పూసి ఉంచాలి. గెలకుళ్లు.. ఈ తెగులు సోకిన గెలలు కుళ్లిపోవడంతో తెల్లని శిలీంధ్రాలతో కనిపిస్తాయి. ఆ గెలలను వెంటనే నరికివేసి ఆ ప్రాంతంలో కుళ్లిన పదార్థాలను తీసి 0.1 శాతం కార్బండిజమ్ మందుతో శుద్ధిచేయాలి. ఇలా చేయడం వల్ల మిగిలిన గెలలకు ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది. -
చంద్రబాబు నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే కల్తీ ప్రచారం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబునాయుడు తన సొంత నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసి భక్తులను, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డిపైకి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి దయ వల్ల ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. గతంలో కిలో నెయ్యి రూ.308కి సరఫరా చేస్తే ఇప్పుడు అదే క్వాలిటీ నెయ్యికి రూ.716 చెల్లిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలకల్తీ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదన్నారు. ప్రస్తుతం పాలతో పాటు అన్ని వస్తువులలోను చంద్రబాబు ప్రభుత్వంలో కల్తీ జరుగుతోందన్నారు. తప్పుచేసిన వారిని తప్పించేవారు ఉండడంతో కల్తీని అరికట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీలను త్వరితగతిన పూర్తిచేయండి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ ఉదయం జిల్లా స్థాయి, మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులందరూ హాజరుకావాలని తెలిపారు. గ్రామాలలోను, డివిజన్లలోను పార్టీ కేడర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్, కడియం మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పులూరి వీరవెంకటసత్యనారాయణ, యాదల సతీష్చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. ఎల్పీజీ గ్యాస్కు కొరత లేదు – జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్, నమోదైన బుకింగ్లు, గ్యాస్ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా కొంతమంది వినియోగదారులు అధికంగా గ్యాస్ బుకింగ్లు చేస్తున్నారని తెలిపారు. అయితే జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 212 మెట్రిక్ టన్నుల గ్యాస్ స్టాక్, 14,829 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో రోజువారీ సగటు వినియోగం సుమారు 11 వేల సిలిండర్లుగా ఉండగా, రీ ఫిల్లింగ్ యూనిట్ల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందన్నారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను నమ్మవద్దని, జిల్లా అధికారిక మార్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలను కోరారు. గ్యాస్ బుకింగ్ లేదా సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తిన పక్షంలో 8074661259 హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వి. పార్వతి పాల్గొన్నారు. రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అమలాపురం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణం పొందిన వారు ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లిస్తే 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న వడ్డీని మాఫీ చేస్తామని కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 66 మంది వినియోగించుకుని రూ.24.55 లక్షల వడ్డీ మాఫీ పొందారన్నారు. -
పోరుబాట.. విలువలకు పీట
సాక్షి, రాజమహేంద్రవరం: విలువలతో కూడిన రాజకీయాలు అంతమైన తరుణంలో విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెప్పింది వైఎస్సార్ సీపీ. ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సవాళ్లను సోపానాలుగా మలచుకుని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ, పార్లమెంటరీ ఇన్చార్జిలు పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువను చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారన్నారు. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అంటూ ప్రజల్లో నమ్మకం, విశ్వాసం గడించిన పార్టీగా చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు, పార్లమెంటరీ ఇన్చార్జిలు, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు, సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలను గుర్తుచేసుకున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గొందేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆదేశాల మేరకు మార్గాని ఎస్టేట్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పార్టీ సీఈసీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ సమన్వయ కర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు పాల్గొన్నారు. కొవ్వూరు వైఎస్సార్ సీపీ కొవ్వూరు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. తలారి, పార్టీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేక్ కేట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలను వివరించారు. అంతేగాక తాళ్లపూడి మండలం పెద్దేవం, అన్నదేవరపేట గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటాయి. నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి జి శ్రీనివాస్నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గోపాలపురం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనపర్తి: వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం అనపర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవీచౌక్ సెంటర్లోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజానగరం ప్రజల భావోద్వేగాలు, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోరుకొండలో నిర్వహించిన వేడుకల్లో రాజా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని, కొన్ని కాలగర్భం లో కలిసిపోయాయన్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తూనే ఉందన్నారు. మండపేట వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణం, మండపేట రూరల్ మండలంలోని 12 గ్రామాలు, కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామాలు, రాయవరం మండలంలోని 12 గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని సామాన్యుల అవసరాలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించారన్నారు. 16 ఏళ్లుగా ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతర పోరాటం జిల్లాలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు -
ల్యాబోదిబో..
● ల్యాబ్ టెక్నీషియన్ల దురవస్థ ● ఆదుకోని ప్రభుత్వం ● ఉద్యోగాలు అంతంత మాత్రం ● యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు ● నేడు ల్యాబ్ టెక్నీషియన్స్ డే కాకినాడ క్రైం: ప్రభుత్వ సాయం లేదు.. యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు.. స్వయం ఉపాధి పొందుదామన్నా దక్కని ప్రోత్సాహం.. కార్పొరేట్ ల్యాబ్లలో అంతంత మాత్రం జీతాలకే ఊడిగం చేయాల్సి రావడం.. పర్యవేక్షణ లోపం.. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు (ఎల్టీ) రోడ్డున పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని నిర్ధారించి, వైద్య సేవల్ని నిర్దేశించడంలో వారీ పాత్ర కీలకం. కానీ, ఎల్టీలుగా పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక.. అప్పోసొప్పో చేసి సొంతంగా ల్యాబ్లు పెట్టుకున్న వారు తగినంత సంపాదన లేక తమ భవిత అగమ్యగోచరమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ప్రత్యే కథనం.. ఉద్యోగాలు లేక విలవిల జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 400 మంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేస్తున్నారు. వీరు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నా వ్యాపారాలు లేవంటూ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎండమావిగానే మిగులుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేవే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పోస్టులు. అవి కూడా ఏనాటికో ఒక నోటిఫికేషన్. ఓవైపు చదివిన చదువుకు విలువ లేక, పట్టాలు పొందినా ఉద్యోగాలు రాక, సొంత వ్యాపారాలకు అవకాశం లేక, ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేక ఎల్టీల పరిస్థితి కడు దయనీయంగా ఉంటోంది. కుటుంబాలతో సహా రోడ్డున పడే దుస్థితిని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక చాలా మంది బతుకు తెరువు కోసం జొమేటో, బ్లింకిట్, స్విగ్గీ, ర్యాపిడో వంటి వాటిల్లో డెలివరీ బాయ్స్గా, కెప్టెన్లు పని చేస్తూ బతుకు నెట్టుకొస్తున్నారు. సవాల్గా స్వయం ఉపాధి పోనీ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఎవరైనా ల్యాబ్ ఏర్పాటు చేసినా తీవ్ర నష్టాలు తప్పడం లేదు. గతంలో ఓ ల్యాబ్ ద్వారా కనీసం నలుగురు జీవనోపాధి పొంతే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం అద్దె డబ్బులైనా రాని పరిస్థితి. మిషనరీ, రియేజంట్ల ధరలు కూడా ఎక్కువగా ఉండటం వ్యాపారానికి సవాల్గా మారింది. తాజా జీఎస్టీ సవరణలో తగ్గుదల కనిపించినా అది కంటితుడుపు చర్యగానే మిగిలింది. గతంలో ఏదో ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్ను నెలకొల్పి బతికేవాడు. ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో వైద్యులే సొంతంగా ల్యాబ్లు పెట్టుకోవడం వీరి ఉపాధిని దెబ్బ తీస్తోంది. ఆన్లైన్ సేవల పేరుతో.. వివిధ ఆన్లైన్ యాప్లు కూడా ఎల్టీల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. వీటికి స్థానికంగా ల్యాబ్లేవీ ఉండవు. పార్టనర్ ల్యాబ్స్ పేరిట అనుసంధానమవుతున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అది ఎంతవరకూ నిజమో పర్యవేక్షించేవారెవ్వరూ ఉండరు. వీరు పరీక్షలు చేసే యంత్రాలు, రియేజంట్ల నాణ్యత ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వచ్చి నమూనాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకుంటారు. తరువాతి రోజు వాట్సాప్కు రిపోర్టు పంపిస్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందో, ఎక్కడ పరీక్షించారో ఎవ్వరికీ తెలియవు. అనుమతి లేని ల్యాబ్లు 150 జిల్లాలో అనుమతి లేని ల్యాబ్లు 150 ఉన్నాయి. వీటిని అధికారులు కనీసంగా కూడా పరిశీలిస్తున్న దాఖలాల్లేవు. సాధారణంగా అనుమతులున్న ల్యాబ్ల నుంచి ప్రమాదకర వ్యర్థాలను వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన సేకరిస్తారు. కానీ, అనుమతి పొందకుండా చాటుగా నడుపుతున్న ల్యాబ్లలో మిగిలిన రక్తం, వినియోగించిన సూదులు, ఇతర వస్తువులను ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. వీటిని కాలువలు, చెత్తకుప్పల్లో పడేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.సమస్యలు పరిష్కరించాలి ఎల్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేటి తరుణంలో మా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవాలి. అనుమతులు లేని ల్యాబ్లను వదిలేస్తున్నారు. వీటివలన అనుమతులున్న ల్యాబ్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉపాధి వృద్ధికి మార్గనిర్దేశాలూ లేవు. కులమతాలకు అతీతంగా ఎల్టీలకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేసి, వ్యాపార వృద్ధికి తోడ్పడాలి. కనీసం కాంట్రాక్టు పోస్టులైనా ఆటంకం లేకుండా తీయాలి. ఆన్లైన్ ల్యాబ్ల కార్యకలాపాలను కూలంకషంగా పర్యవేక్షించాలి. – వెంకట్ ఎన్నపు, ల్యాబ్ టెక్నీషియన్, కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబొరేటరీస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
నేడు వైఎస్సార్ సీపీఆవిర్భావ దినోత్సవం
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీకి చెందిన ముఖ్యనేతలు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు సంక్షేమాభివృద్ధికి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజలను వంచించిందన్నారు. -
అవయవ దానంపై అవగాహన ర్యాలీ
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ ఎస్.భవ్య కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ మీదుగా దేవీచౌక్ వరకూ ప్రదర్శన కొనసాగింది. డీఎస్పీ మాట్లాడుతూ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది పీఎంపీ అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల అధ్యక్షుడు అబ్దుల్ రహ్మాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 31 రూర్బన్ పంచాయతీలు రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో పదివేల మందికి పైగా జనాభా, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా జిల్లాలోని 31 పంచాయతీలకు గుర్తింపు లభించింది. అలాగే గ్రేడ్ – 1 పంచాయతీలుగా 167, గ్రేడ్ – 2గా 75, గ్రేడ్–3గా 69 పంచాయతీలు ఆమోదం పొందాయి. రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ధవళేశ్వరం, రాజవోలు, బొమ్మూరు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్సిటి, కోలమూరు, కాతేరు, కడియం, వేమగిరి, కడియపులంక, రాజానగరం, దివాన్చెరువు, పాలచర్ల, చెల్లూరు, కేశవరం, ఏడిద, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, బలభద్రపురం, చాగల్లు, దేవరపల్లి, గోకవరం, గోపాలపురం, నల్లజర్ల, పోతవరం, ఖండవల్లి, పాలంగి, ఉండ్రాజవరం, వేలివెన్ను రూర్బన్ పంచాయతీలుగా మారాయి. ఏప్రిల్ 25న పాలిసెట్ రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ను ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్లైన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల మురళి అన్నారు. ఆ కళాశాల ఆవరణలో బుధవారం పాలిసెట్ పోస్టర్లను లెక్చరర్లతో కలిసి ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లోని 14 కేంద్రాల్లో సుమారు 8 వేల మంది విద్యార్థుల వరకూ పరీక్ష రాయనున్నారన్నారు. ఈ ఏడాది నుంచి నిడదవోలు, తుని ప్రాంతాల్లో కూడా కొత్తగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు తమ కళాశాలలో ఏప్రిల్ 2 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. రెండో రోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలు రాజమహేంద్రవరం సిటీ: అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలు కొనసాగించారు. డీఎస్పీ కిశోర్ కుమార్, ఇన్స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్, మరో 20 మంది సిబ్బందితో ఉదయం నుంచి రాత్రి వరకూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని అన్ని శాఖలను తమ అధీనంలోకి తీసుకున్నారు. సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సర్వేయర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు, సిబ్బందికి చెందిన మొబైల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న 20 డాక్యుమెంట్లను గుర్తించినట్టు సమాచారం.


