దూకుతూ.. దౌడు తీస్తూ..
● ఉత్కంఠ భరితంగా
రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
● సీనియర్, జూనియర్ విజేతగా గుమ్మిలేరు
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో యార్లగడ్డ వెంకట సుబ్బారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. భీమేశ్వర రైతు కమిటీ ఆధ్వర్యాన సీనియర్, జూనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సీనియర్ విభాగంలో 7 జతలు, జూనియర్ విభాగంలో 38 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. స్వల్ప వ్యవధిలోనే విజేతలను నిర్ణయించడంతో ప్రేక్షకులు, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరిగిన ఈ పోటీలను చుర్రుమంటున్న ఎండలో సైతం జనం ఆసక్తిగా వీక్షించారు.
● సీనియర్ విభాగంలో నిర్ణీత దూరాన్ని కోరా తేజ చౌదరి (కోనసీమ జిల్లా గుమ్మిలేరు) ఎడ్లు 5 నిమిషాల 39 సెకెండ్ల 69 పాయింట్లలో అధిగమించి ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. అదే గ్రామానికి చెందిన కోరా సత్యవేణి ఎడ్లు 5 నిమిషాల 42 సెకెండ్ల 16 పాయింట్లతో ద్వితీయ, సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ ఎడ్లు 5 నిమిషాల 46 సెకెండ్ల 22 పాయింట్లతో తృతీయ స్థానాల్లో నిలిచాయి. సీనియర్ విభాగంలో మొదట దౌడు తీయడానికి సిద్ధమైన మలిరెడ్డి అన్నపూర్ణ ఎడ్లు జనం కేకలతో బెదిరిపోయి పొలంలోకి పరుగు తీశాయి. అయినప్పటికీ తిరిగి రోడ్డు మీదకు వచ్చి, నిర్ణీత దూరాన్ని 6 నిమిషాల 27 సెకండ్లలో అధిగమించాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.15 వేల నగదుతో పాటు మెమెంటోలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అందజేశారు.
● జూనియర్ విభాగంలో కోరా సత్యవతి (గుమ్మిలేరు) ఎడ్లు ప్రథమ, బవిరిశెట్టి మణి (వన్నెపూడి) ద్వితీయ, పండూరు శ్రీను (సామర్లకోట) తృతీయ, మలిరెడ్డి అన్నపూర్ణ (మేడపాడు) నాలుగు, వేగుళ్ల కృష్ణమాధవి (మండపేట) ఎడ్లు ఐదో స్థానాలను గెలుచుకున్నాయి. ప్రథమ విజేతకు రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, నాలుగో స్థానానికి రూ.8 వేలు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేల నగదుతో పాటు మెమెంటోలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ తుమ్మల బాబు అందజేశారు. అలాగే, దేశవాళీ ఎడ్ల అందాల పోటీల్లో కూడా మూడు బహుమతులు అందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చేకూరి రామకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్, కంటే ఫణికుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, నిర్వాహకులు కంటే జగదీష్ మోహన్రావు, వల్లూరి దొరబాబు, బిక్కిన రంగనాయకులు, వుండవిల్లి వీర వెంకట రామరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోలి వెంకట అప్పారావు చౌదరి, యార్లగడ్డ చిన్ని, కౌన్సిలర్ బలుసు వాసు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, నిమ్మకాయల రంగనాగ్ తదితరులు పాల్గొన్నారు.
దూకుతూ.. దౌడు తీస్తూ..
దూకుతూ.. దౌడు తీస్తూ..
దూకుతూ.. దౌడు తీస్తూ..


