కోటి జన్మల ఫలం తులసి పూజ
● రత్నగిరిపై మూడో రోజుకు చేరిన పూజలు
● విశేషంగా హాజరైన భక్తజనం
అన్నవరం: మాఘ మాసంలో మహా విష్ణువును తులసి దళాలతో పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. వేకువ జామున సుప్రభాత సేవతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పండితులు వార్షిక కల్యాణ వేదికపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రసాదాలు నివేదించారు. ఉదయం తొమ్మిది నుంచి 11–30 గంటల వరకు 60 మంది రుత్విక్కులు ఐదు లక్షల తులసి దళాలతో విష్ణుసహస్ర నామాలతో స్వామి వారికి అర్చన చేశారు. అనంతరం నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు రుత్విక్కులు మరో ఐదు లక్షల తులసి దళాలతో స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ప్రసాద నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు వేదాశీస్సులు అందజేసి పవళింపు సేవతో రెండో రోజు కార్యక్రమాలు ముగించారు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్సింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.


