విశాఖపట్నం జూకు పెద్ద పులి
రాజమహేంద్రవరం రూరల్: ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లో సంచరిస్తూ, కనిపించిన ఆవులు, దూడలను చంపేస్తూ దాదాపు వారం రోజుల పాటు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలోని ఓ పాకలో దాగిన పెద్ద పులిని పూణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందం, ఆటవీ శాఖ అధికారుల బృందం పట్టుకుంది. ఆ పులికి శాసీ్త్రయంగా మత్తు మందు ఇవ్వడంతో కొద్దిదూరం వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం దాన్ని వెంబడించి అత్యంత జాగ్రత్తగా, బంధించారు. అనంతరం పులిని ప్రత్యేక బోనులో విశాఖపట్నంలోని రెస్క్యూ కేంద్రానికి తరలించారు. పులిని కొద్ది రోజులు పరిశీలించి, దాని ప్రవర్తనను బట్టి అడవిలో విడిచిపెట్టాలా లేక, జూలో ఉంచాలా అన్నది నిర్ణయిస్తామని అటవీరేంజ్ ఆఫీసర్ ఎన్.దావీదురాజు తెలిపారు. పులిని బంధించిన పూణే రెస్క్యూ బృందాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యేకంగా అభినందించారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వైజాగ్ జూకు చెందిన వెటర్నరీ డాక్టర్లు ఫణీంద్ర, భాను, రాజమహేంద్రవరం సీసీఎఫ్, అటవీశాఖాధికారి ఎన్.దావీదురాజు బృందం కీలక పాత్ర పోషించారని జిల్లా అటవీ శాఖ అధికారి బి.ప్రభాకరరావు తెలిపారు.


