8న మెగా జాబ్ మేళా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాజానగరం నియోజక వర్గంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ఫిబ్రవరి 8న రాజానగరంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. రాజానగరంలో వికాస – స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 60 ఎంఎన్సీల భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు ఆదివారం ఉదయం 9 గంటలకు రాజానగరంలోని జెడ్పీ హైస్కూల్కు అవసరమైన సర్టిఫికెట్ల జెరాక్స్లతో హాజరుకావాలని వికాస పీడీ కె.లచ్చారావు కోరారు.
కోటసత్తెమ్మ తల్లికి
వెండి పళ్లెం సమర్పణ
నిడదవోలు రూరల్: మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ తల్లికి చాగల్లు మండలం కలవలపల్లి వాస్తవ్యులు ఈదర శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు వీరభద్ర అజయ్కుమార్, దీపిక సుష్మలు బుధవారం 1,212 గ్రాముల వెండి పళ్లెం, 523 గ్రాముల వెండి పాదుకులు అందజేసినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. అమ్మవారిని దాతల కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకుడు అప్పారావు శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సత్యదేవుని
హుండీల లెక్కింపు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు.
తిరుమల ప్రతిష్టను పాడు చేసింది బాబు సర్కారే
వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి
అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా పాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు.
8న మెగా జాబ్ మేళా


