పొన్నాడలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: పొన్నాడలో వేంచేసి ఉన్న బషీర్బీబీ (బంగారు పాపమ్మ) ఔలీయా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముజావర్లు సంథల్ (గంధం) తీసి అమ్మవారికి పూయడంతో ఉత్సవాలను ప్రారంభించారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు ఇప్పటికే పొన్నాడ చేరుకున్నారు. వీరంతా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని మూడు రోజులూ ఇక్కడే ఉండి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం సంథల్ (గంధం) ఉత్సవంతో ముగియనున్న ఈ ఉత్సవాల్లో గంధోత్సవం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. గంధోత్సవం కోసం స్థానిక ముజావర్లు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తపల్లి ఎౖస్సై జి.వెంకటేష్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ఖురాన్ఖాని, వాచ్, మిలాద్షరీఫ్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బషీర్బీబీ ముస్లింల దేవతైనప్పటికీ అన్ని మతాలు, కులాలకు చెందిన భక్తులు దర్శించుకోవడం వల్ల ఈ ఉత్సవాన్ని మత సామరస్యానికి చిహ్నంగా చెబుతుంటారు. బషీర్బీబీ దర్గాను స్థానిక సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తన సొంత నిధులు రూ. 10 లక్షలతో పునర్నిర్మించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉరుసు ఉత్సవాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
పొన్నాడలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం


