● సుర్రుమనిపిస్తున్న సూరీడు
● ఉమ్మడి జిల్లాలో మంటలు
● వడదెబ్బ తగలకుండా
జాగ్రత్తలు అవసరం
ఇలా చేస్తే మేలు
● వేసవిలో రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తరచూ తాగాలి.
● లేత రంగు కలిగిన తేలికగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
● పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రెండు పూటలా స్నానం చేయాలి.
● ఎండ తీవ్రత అఽధికంగా ఉన్నప్పుడు బయటకు వెళితే గొడుగు లేదా టోపీ ధరించాలి. లేకుంటే తలకు రుమాలు చుట్టుకోవాలి.
● ఇంట్లో కిటికీలు తెరిచి గదిలోకి గాలి వచ్చి చల్లబడే విధంగా చర్యలు తీసుకోవాలి.
వడదెబ్బ తగలకుండా
ప్రచారం
వేసవికాలం దృష్టా సంభవించే వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ సిబ్బందితో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. వడదెబ్బకు గురికాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏరియా, ప్రభుత్వ, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం.
–ఎం.సుమలత, అదనపు జిల్లా వైద్యాధికారి, కోనసీమ
ఆలమూరు: వేసవి వచ్చేసింది.. మండే ఎండలను తెచ్చేసింది.. బయటకు వెళ్తే సుర్రుమనిపిస్తోంది.. ఈ ఏడాది మార్చి తొలి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాధారణంగా మే నెల ప్రథమార్థంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. రెక్కల కష్టం మీద జీవనం సాగించే సామాన్యులపై ఎండ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు, ఇటుక పరిశ్రమ, భవన నిర్మాణ కార్మికులు, రోగ నిరోధశక్తి తగిన మోతాదులో లేని అనారోగ్య తీవ్రత ఉన్నవారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఏరియా, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఉన్న సమయంలో మానవుని శరీరంలోకి సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. వేడిగాలుల వల్ల వడదెబ్బ (హీట్ స్ట్రోక్), శరీరంలో లవణాలు కొల్పోవడం (డీహైడ్రేషన్)తో కలిగే దుష్ఫరిణామాలు వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని ప్రాథమిక అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వడదెబ్బకు కారణమవుతుంది. సత్వరం ప్రాథమిక చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు
వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతోంది. మగత నిద్ర రావడం, కలవరింతలు పలకడం, పెదవులు తడిబారి పోవడం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందే విధంగా చూడాలి. త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలే విధంగా చేయాలి. శరీరం సాధారణ స్థాయి ఉష్ణోగ్రత వరకూ వచ్చే వరకూ మెత్తటి తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిగిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ లేక ఓఆర్ఎస్ను తాగించాలి. అపస్మారక స్థితికి వెళ్లిన రోగితో నీరు తాగించరాదు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందించాలి.


