● మళ్లీ సీతానగరం మండలంలోకి..
● జనంలో భయాందోళన
రాజానగరం: సీతానగరం మండలంలోకి పులి మళ్లీ వచ్చింది.. కొండెక్కి కూర్చుంది.. ఏటిపట్టు ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులి సంచారంపై వస్తున్న సమాచారంతో తమ ప్రాణాలతో పాటు పశువులను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక జనం భయపడిపోతున్నారు. వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. పెద్ద పులి సీతానగరంలో ఉన్న చిట్టిబాబాజీ ఆశ్రమ గోశాల సమీపంలోని కొండపై ఉన్నట్టు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారి హరీష్ విజ్ఞప్తి చేశారు. రామదుర్గంలోని పురాతన రామాలయం ఉన్న కొండపైకి చేరిన పులి బుధవారం రాత్రి సీతానగరంలోని చిట్టి బాబాజీ ఆశ్రమం గోశాలకు సమీపంలో ఉన్న కొండపైకి చేరుకున్నట్టు తెలుసుకున్నారు. పులి పగలంతా విశ్రాంతి తీసుకుని, చీకటి పడిన తరువాత వేటకు వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో ప్రస్తుతం కొండపై నుంచి దిగి నేలకోట, రామవరపు ఆవ వైపు వెళ్లే అవకాశం ఉందని, లేకుంటే వచ్చిన మార్గంలోనే పెదకొండేపూడి వైపు దిగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పులి సంచారంపై ప్రజలను భయబ్రాంతులను చేసే విధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అటువంటి వాటిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


