చంద్రబాబు సర్కారుకు హైకోర్టు మొట్టికాయ
భూసేకరణ పరిహారం చెల్లింపునకు ఆదేశాలు
రాజానగరం: పేదల కోసం గత ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని హైకోర్టు ఆదేశించడంతో చంద్రబాబు సర్కారు దిగిరాక తప్పలేదు. కోర్డు ఆదేశాల మేరకు ఆయా భూములకు చెల్లించవలసిన రూ.3.14 కోట్లను వెంటనే విడుదల చేసింది. వివరాలిలావున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు’ కార్యక్రమంలో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మండలంలోని వెలుగుబందలో సర్వే నంబరు 51లో 4.70 ఎకరాలను సేకరించారు. అయితే ఆయా భూములకు పరిహారాన్ని చెల్లించే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో చెల్లింపులు జరగలేదు. ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. సేకరించిన భూములకు పరిహారాన్ని చెల్లిస్తే గత ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చెల్లింపుల ప్రక్రియను జాప్యం చేస్తూ వచ్చారనే ఆరోపణలున్నాయి. భూములిచ్చిన వారు ఆర్థికంగా తమ అవసరాలు తీర్చుకునే దారిలేక, సర్కారు తీసుకున్న భూములకు పరిహారం అందక అనేక అవస్థలు పడ్డారు. న్యాయం కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు భూములిచ్చిన రైతుల మొర విన్న కోర్టు తక్షణమే పరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న చంద్రబాబు సర్కారు చేసేదేమీ లేక పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలంటూ రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది.
ఐదు ఈగల్ టీమ్ల ఏర్పాటు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా ఐదు ఈగల్ టీం లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఈగల్ టీంలతో ముఖాముఖీ జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా సబ్ డివిజన్కి ఈగల్ టీంను ఒక ఇన్చార్జి, ముగ్గురు సిబ్బందితో ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా కొనసాగిస్తాయన్నారు. మాదక ద్రవ్యాల కేసులు ఉంటే పాస్పోర్ట్, వీసా పొందడంలో, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. యువత వీటికి దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112, 1972 నంబర్లకు తెలియజేయాలన్నారు.
చంద్రబాబు సర్కారుకు హైకోర్టు మొట్టికాయ


